మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రిసప్తతితమః సర్గలో, పరశు రాముడు నిష్క్రమణ సమయంలో వివాహ బృందం అయోధ్యకు చేరుకుంటుంది. వివాహానికి ముందు వచ్చిన భరతుని మామ అయిన యుధాజిత్ ఇప్పుడు భరతుడు మరియు శత్రుఘ్నులను తన రాజ్యానికి తీసుకువెళతాడు. అప్పటి నుండి రామ, లక్ష్మణులు తమ తండ్రి కోరిక మేరకు వారి వారి సంక్షేమ కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నారు. రాముడు మరియు సీత వారి ఆనందకరమైన వైవాహిక జీవితంలోకి ప్రవేశిస్తారు.
అయోధ్యాప్రవేశః
గతే రామే ప్రశాంతాత్మా రామో దాశరథిర్ధనుః |
వరుణాయాప్రమేయాయ దదౌ హస్తే ససాయకమ్ ||
1
అభివాద్య తతో రామో వసిష్ఠప్రముఖానృషీన్ |
పితరం విహ్వలం దృష్ట్వా ప్రోవాచ రఘునందనః ||
2
జామదగ్న్యో గతో రామః ప్రయాతు చతురంగిణీ |
అయోధ్యాభిముఖీ సేనా త్వయా నాథేన పాలితా ||
3
రామస్య వచనం శ్రుత్వా రాజా దశరథః సుతమ్ |
బాహుభ్యాం సంపరిష్వజ్య మూర్ధ్ని చాఘ్రాయ రాఘవమ్ ||
4
గతో రామ ఇతి శ్రుత్వా హృష్టః ప్రముదితో నృపః |
పునర్జాతం తదా మేనే పుత్రమాత్మానమేవ చ ||
5
చోదయామాస తాం సేనాం జగామాశు తతః పురీమ్ |
పతాకాధ్వజినీం రమ్యాం జయోద్ఘుష్టనినాదితామ్ ||
6 [తూర్య]
సిక్తరాజపథాం రమ్యాం ప్రకీర్ణకుసుమోత్కరామ్ |
రాజప్రవేశసుముఖైః పౌరైర్మంగళవాదిభిః ||
7
సంపూర్ణాం ప్రావిశద్రాజా జనౌఘైః సమలంకృతామ్ |
పౌరైః ప్రత్యుద్గతో దూరం ద్విజైశ్చ పురవాసిభిః ||
8
పుత్రైరనుగతః శ్రీమాన్ శ్రీమద్భిశ్చ మహాయశాః |
ప్రవివేశ గృహం రాజా హిమవత్సదృశం ప్రియమ్ ||
9
ననంద సజనో రాజా గృహే కామైః సుపూజితః |
కౌసల్యా చ సుమిత్రా చ కైకేయీ చ సుమధ్యమా ||
10
వధూప్రతిగ్రహే యుక్తా యాశ్చాన్యా రాజయోషితః |
తతః సీతాం మహాభాగామూర్మిలాం చ యశస్వినీమ్ ||
11
కుశధ్వజసుతే చోభే జగృహుర్నృపపత్నయః |
మంగలాలేపనైశ్చైవ శోభితాః క్షౌమవాససః ||
12
దేవతాయతనాన్యాశు సర్వాస్తాః ప్రత్యపూజయన్ |
అభివాద్యాభివాద్యాంశ్చ సర్వా రాజసుతాస్తదా ||
13
రేమిరే ముదితాః సర్వా భర్తృభిః సహితా రహః |
కృతదారాః కృతాస్త్రాశ్చ సధనాః ససుహృజ్జనాః ||
14
శుశ్రూషమాణాః పితరం వర్తయంతి నరర్షభాః |
కస్యచిత్త్వథ కాలస్య రాజా దశరథః సుతమ్ ||
15
భరతం కేకయీపుత్రమబ్రవీద్రఘునందనః |
అయం కేకయరాజస్య పుత్రో వసతి పుత్రక ||
16
త్వాం నేతుమాగతో వీర యుధాజిన్మాతులస్తవ |
శ్రుత్వా దశరథస్యైతద్భరతః కైకయీసుతః ||
17
గమనాయాభిచక్రామ శత్రుఘ్నసహితస్తదా |
ఆపృచ్ఛ్య పితరం శూరో రామం చాక్లిష్టకారిణమ్ ||
18
మాతౄశ్చాపి నరశ్రేష్ఠః శత్రుఘ్నసహితో యయౌ |
గతే చ భరతే రామో లక్ష్మణశ్చ మహాబలః ||
19
పితరం దేవసంకాశం పూజయామాసతుస్తదా |
పితురాజ్ఞాం పురస్కృత్య పౌరకార్యాణి సర్వశః ||
20
చకార రామో ధర్మాత్మా ప్రియాణి చ హితాని చ |
మాతృభ్యో మాతృకార్యాణి రామః పరమయంత్రితః ||
21 [కృత్వా]
గురూణాం గురుకార్యాణి కాలే కాలేఽన్వవైక్షత | [చకార హ]
ఏవం దశరథః ప్రీతో బ్రాహ్మణా నైగమాస్తదా ||
22
రామస్య శీలవృత్తేన సర్వే విషయవాసినః |
తేషామతియశా లోకే రామః సత్యపరాక్రమః ||
23
స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః |
రామస్తు సీతయా సార్ధం విజహార బహూనృతూన్ ||
24
ప్రియా తు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి |
మనస్వీ తద్గతమనా నిత్యం హృది సమర్పితః ||
25
గుణాద్రూపగుణాచ్చాపి ప్రీతిర్భూయోఽభ్యవర్ధత |
తస్యాశ్చ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే ||
26
అంతర్జాతమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా |
తస్య భూయో విశేషేణ మైథిలీ జనకాత్మజా |
దేవతాభిః సమా రూపే సీతా శ్రీరివ రూపిణీ ||
27
తయా స రాజర్షిసుతోఽభిరామయా
సమేయివానుత్తమరాజకన్యయా |
అతీవ రామః శుశుభేఽతికామయా
విభుః శ్రియా విష్ణురివామరేశ్వరః ||
28
Balakanda Sarga 77 In Telugu Pdf With Meaning
పరశురాముడు మహేంద్రగిరికి వెళ్లిన తరువాత రాముడు తన వద్ద ఉన్న విష్ణుధనుస్సును, బాణమును, వరుణ దేవునికి ఇచ్చాడు. తరువాత రాముడు వసిష్ఠుడు మొదలగు ఋషులకు బ్రాహ్మణులకు నమస్కరించాడు. తండ్రి దశరథుని చూచి ఇలాఅన్నాడు.
“తండ్రీ! పరశురాముడు వెళ్లిపోయాడు. ఇంక మనము అయోధ్యకు ప్రయాణము సాగిద్దాము. మన పరివారమునకు సేనలకు అనుజ్ఞ ఇవ్వండి.” అని అన్నాడు.
అప్పటి దాకా ఆశ్చర్యంతో చూస్తున్న దశరథుడు ఒక్కసారి తెలివిలోకి వచ్చాడు. రాముని గట్టిగా కౌగలించుకున్నాడు. శిరస్సును ముద్దుపెట్టుకున్నాడు. అటు ఇటు చూచి పరశురాముడు వెళ్లి పోయాడు అని నిర్ధారించుకున్నాడు. ఆనందంతో పొంగిపోయాడు. రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు మరలా జన్మమెత్తినట్టు భావించాడు. దశరథుని మనస్సు కుదుట పడింది. తన సైన్యమునకు అయోధ్యకు ప్రయాణము సాగించమని ఆజ్ఞాపించాడు. అందరూ అయోధ్యకు చేరుకున్నారు.
వీరి రాక ముందు తెలిసిన అయోధ్యాపుర వాసులు వారికి ఘనస్వాగతం పలికారు. నగరమంతా మామిడి తోరణములతోనూ, అరటి స్తంభములతోనూ, రకరకాల పూలతోనూ అలంకరించారు. మంగళ వాద్యములతో రామునికి ఎదురేగి స్వాగతం పలికారు. అందరూ రాజనగరు ప్రవేశించారు.
కౌసల్య, సుమిత్ర, కైకేయీ ఎదురుగా వచ్చి కొత్త కోడళ్లను ఆహ్వానించి లోపలకు తీసుకొని వెళ్లారు. సీతకు, ఊర్మిళకు,మాండవికి, శ్రుతకీర్తికి కొత్త పట్టుబట్టలు అలంకరింపజేసారు. నూతన వధూవరులు గృహప్రవేశ కార్యక్రమును నిర్వర్తించారు. గృహదేవతలను పూజించారు. జనకుని పుత్రికలు అత్తగార్లకు, పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నారు. బ్రాహ్మణులకు గోదానములు, సువర్ణదానములను చేసి వారిని తృప్తిపరిచారు. ఆ రాత్రికి వారి వారి భర్తలతో సాంసారిక సుఖములను అనుభవించారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తండ్రి దశరథునికి సేవచేసు కుంటూ ఉన్నారు.
కొన్ని రోజులు గడిచిన తరువాత దశరథుడు భరతుని చూచి ఇలా అన్నాడు.
“నాయనా భరతా! నీ మేనమామ యుధాజిత్తు నిన్ను తన వెంట తీసుకొని వెళ్లుటకు కేకయ రాజ్యము నుండి వచ్చాడు. ఆ విషయము నాకు మిథిలలోనే చెప్పాడు. శుభకార్యములు జరుగు చుండుట వలన వీలు కాలేదు. నీవు నీ తాత గారింటికి వెళ్లి ఆయనను సంతోష పెట్టు.” అని అన్నాడు.
భరతుడు తండ్రి మాట ప్రకారము చేసాడు. తండ్రికి తల్లులకు, పెద్దలకు పురోహితులకు నమస్కరించి వారి ఆశీర్వాదము వారి అనుమతి తీసుకున్నాడు. శత్రుఘ్నుడు వెంట రాగా తన తాతగారి ఇంటికి ప్రయాణమయ్యాడు.
భరత శత్రుఘ్నులు వెళ్లిన తరువాత రామ లక్ష్మణులు తండ్రిగారికి సేవజేసుకుంటూ ఉన్నారు. తండ్రి అనుమతితో రాముడు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పనులను చేసాడు. పూర్తిగా నియమములను పాటిస్తూ తండ్రికి రాజ్యపాలనలో సాయం చేస్తున్నాడు. ఎవరి మనస్సూ నొప్పించకుండా అందరికీ అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు.
రాముని ప్రవర్తనకు, గుణగణములకు అయోధ్య ప్రజలు ఎంతో సంతోషించారు. రాముని వంటి ప్రభువు తమకు కావాలని కోరు కున్నారు.
రాముడు రాజ్యకార్యములలో పడి భార్యను నిర్లక్ష్యము చేయలేదు. సీతను ఎంతో ప్రేమానురాగాలతో చూసుకొనేవాడు. ఎల్లప్పుడూ ఆమెను తన హృదయ పీఠము నందు నిలుపుకొనే వాడు.
సీత కూడా రాముని ఎడల ఎంతో ప్రేమతో ప్రవర్తించేది. రాముని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. రాముడు సీత మధ్య ఉన్న ప్రేమ దినదినాభివృద్ధి చెందుతూ ఉండేది. ఒకరి హృదయము తెలిసి మరొకరు నడుచుకొనేవారు. వారి అన్యోన్యాను రాగములతో కూడిన దాంపత్యము చూచి కౌసల్య ఎంతో మురిసి పోయేది. ఆ ప్రకారంగా రాముడు సీత సాక్షాత్తు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిలాగా ప్రకాశిస్తున్నారు.
శ్రీమద్రామాయణము
బాలకాండము డెబ్బది ఏడవ సర్గ సంపూర్ణము.
బాలకాండము సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
వాల్మీకి రామాయణే అయోధ్యకాండ >>