Ratha Sapthami In Telugu – రథ సప్తమి

Rathasapthami

రథ సప్తమి

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు రథ సప్తమి విశిష్టత, రథ సప్తమి పండుగ ఎందుకు జరుపుకుంటారు, మరియు రథ సప్తమి గురించి తెలుసుకుందాం.

రథ సప్తమి విశిష్టత

సమస్త సృష్టికి శ్రీసూర్యనారాయణుడు పంచకల్యాణి అశ్యములు పూనిన రథముపై సంచరిస్తూ, తన ప్రభాత కిరణాల వెలుగుతో మేలుకొలుపు పొందుతాడు. భాస్కరుడు, ఆదిత్యుడు, కశ్వపుడు, భానుడు, ఆదిత్యుడు, రవి అనే పర్యాయనామాలతో ఆకంతిమూర్తిని ప్రస్తుతిస్తారు.
జన్మకుండలిలో రవి మహర్ధశ రవి అంతర్దశ అను కాలము లుంటుందని ఈ దశల, ప్రభావం మానవుల జీవితం మీద అమితమైన ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్య శాస్త్రము ఉద్ఘాటిస్తున్నది. దీనివలన సూర్యభగవానుడు వెలుగుల దేవుడేకాక మానవులజీవితంలో ఉచ్ఛ నీచ స్థితులను నిర్దేశించే విధాత అని తేట తెల్లమవుతున్నది.

“తేజ స్కామో విభావసుమ్” అంటే తేజస్సును పొందగోరువారు సూర్యుని ఆరాధించాలని భాగవతమందు చెప్పబడినది.

“ఆరోగ్యం భాస్కరదాచ్చేత్” నిత్యం ప్రాతఃకాలమునందు సూర్యుని దర్శించి నమస్కారప్రణామాలు చేయుట వలన ఆరోగ్యం చేకూరును (మత్స్యపురాణం) “దినేశం సుఖార్ధం” సకల సుఖములను ఆదిత్యుని ఆరాధన అందించును (స్కాంధపురాణం).

సూర్యభగవానుని ఆరాధించటం వలన శుభఫలితాలను పొందవచ్చునని పురాణములు, వేదములు కొన్ని వృత్తాంతముల వలన తేటతెల్లమవుతున్నది.

“ఉదయం బ్రహ్మ స్వరూపో మధ్యాహ్నేతు మహేశ్వరః
సాయంకాలే సదా విష్ణుఃత్రిమూర్తి శ్చ దివాకరః”

ఈశ్లోకమునందు సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మవలెను, సాయంత్రం విష్ణువు వలెను, మధ్యాన్నం మహేశ్వరుడు వలెను త్రిమూర్తుల అంశతో ప్రకాశిస్తాడని చెప్పబడింది. కనుకనే శ్రీసూర్యనారాయణుని ఆరాధన వలన త్రిమూర్తులను ఆరాధించి పొందు ఫలములను పొందవచ్చునని శాస్త్రఉవాచ.

రథ సప్తమి ఎందుకు జరుపుకుంటారు?

“మాఘ మాసే సితేపక్ష సప్తమ న్యాద్ర దన్యతు
తత్ర స్కానంచ దానంచ తత్పర్యం చాక్షయం భవేత్”

మాఘమాసం ప్రిబ్రవరి, శుక్లపక్షంలో వచ్చే రథ సప్తమినాడు సూర్య భగవానుడు భూమికి దగ్గరగా రావటం జరుగుతుంది. ఈ సమయంలో సూర్యభగవానుడి శక్తి భూమిమీద పుష్కలంగా ప్రసరిస్తూ ఉంటుంది.

“సూర్య గ్రహణ తుల్యాతు శుక్లా మాఘస్వసప్తమే.

ఈ సప్తమ శుభదినంగా సూర్యగ్రహణంగా పరిగణిస్తూ ఆ రోజు దీక్షలు, వ్రతాలు, నోములు చేబడతారు ఇది విశేష ఫలం ఇస్తుందని నమ్మకం ఈ సప్తమినే “ రథ సప్తమీ” అంటారు.

అయపు వేళసప్తమి తిధిఉండి సాయంత్రంకల్లా “అష్టమి” వస్తే అద్భుతమైన అపురూపమైన రహస్యమైన మంత్రములను జపం చేయుట మంత్ర తంత్ర యంత్ర పివ్వల ఉపాసనను చేయుట వలన విశేషమైనటువంటి ఫలితాలను పొందవచ్చునని పూర్వీకులునుండి బలమైన నమ్మకం కలదు.

రథ సప్తమి నాడు సూర్యభగవానుడు నక్షత్రరధము నెక్కి ఆకాశమంతా తిరుగుతాడు, అందుకే రధసప్తమినాడు ఆకాశములో నక్షత్రములు రధాకారములో కనిపిస్తాయని ఇతిహాసంలో ఉన్నది. రధసప్తమినాడు తలమీద జిల్లేడు, రేగు ఆకులను ఉంచుకుని తలనిండాస్నానం చేస్తారు ఇలా స్నానంచేయుట వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చుని ధర్మశాస్త్రం ప్రవచిస్తోంది. తలస్నానం చేయునపుడు సూర్యుని యొక్క పన్నెండు నామములను స్మరిస్తూ తల, మెడ, కాళ్ళు, చేతులు, భుజాలు, కళ్ళు, హృదయం. నాభి, పాదాలపై ఆకులను ఉంచుకుని స్నానం చేస్తారు ఇలా చెయ్యడం వల్ల ఈ అంగములపై సూర్యుని శుభదృష్టి ప్రసరించి రోగములు నాశనమవుతాయని నమ్మకం.

“సప్త సప్త మహా సప్త సప్త ద్వీపా వసుంధర
సప్తార వర్ణమాదాయ సప్తమీ రథ సప్తమి”

ఈ శ్లోకం స్నాన మాచరించునప్పుడు పరించాలి.

సమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
వరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే॥

యద్యజ్ఞన్మ కృతం పాపం మయా జన్మసు సప్తమ
తన్మేరోగం చ శోకంచ మాకరీ హంతు సప్తమీ ॥

ఏతజ్ఞన్మ కృతం పాపం యజ్ఞన్మాంతారార్జితం
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞతేచయే పునః ॥

ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ ॥

ఆర్ధ్యం – “ఓననా సర్వలోకాం సప్తమీ సప్త సప్తిగా
సప్త వ్యాహృతికే దేవీ నమస్తే సూర్యమండలే”

సప్తమాదేవతని సూర్యమండలాన్ని నమస్కరించి జిల్లేడు, రేగు, చందనం, అక్షింతలు కలిపిన నీటిని లేక క్షీరమును రాగి పాత్రతో ఆర్ఘ్యమివ్వడం శుభం.

రథ సప్తమి యొక్క పూజావిధానం:

ఎర్ర చందనంతో పద్మాన్నిగీసి ఎర్రని పువ్వులతో ఆదిత్యుని పన్నెండు నామాలతో పూజించాలి.

నామాలు

  • మిత్రాయ నమః
  • రవేనమః
  • సూర్యా నమః
  • భానవే నమః
  • ఖగాయ నమః
  • పూషాయ నమః
  • హిరణ్యగర్భాయ నమః
  • మరీచయే నమః
  • ఆదిత్యాయ నమః
  • సనిత్రేయనమః
  • ఆర్కాయ నమః
  • భాస్కరాయ నమః

సూర్యదర్శనం జిల్లేడు అకుకు రంధ్రం చేసి దాని మధ్య నుండి చేసుకొనుట శుభం సూర్యగాయత్రిని 108 సార్లు జపించి, సూర్యుని శాంతి రత్నములను పూజించుట సాంప్రదాయం.

పూజనివేదన
ఆవు పేడతో చేసిన శ్రేష్ఠమైన పిడకలమీద క్షీరాన్నమును వండి చిక్కుడు ఆకులు మీదనుంచి నైవేద్యం పెట్టవలెను సృష్టికి వెలుగును, శక్తిని ప్రసాదించు అదిత్యుని ఆరాధించుట వలన శుభము శ్రేష్టము కనుక ఈవిధమైన పూజా విధానములను రథ సప్తమినాడు ఆచరించుట వలన సూర్యభగవానుని అనుగ్రహమును పొందవచ్చును.

మరిన్ని పండుగలు:

Akshaya Tritiya Adhyatma Darshan In Telugu – అక్షయ తృతీయ అధ్యాత్మ దర్శనము

Akshaya Tritiya Adhyatma Darshan

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో, తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవడం అటుంచి చేసిన అప్పులు, తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు అక్షయ తృతీయ అధ్యాత్మ దర్శనము గురించి తెలుసుకుందాం.

Akshaya Tritiya Adhyatma Darshan Telugu

అక్షయ తృతీయ అధ్యాత్మ దర్శనము (వైశాఖ శుక్ల తృతీయాతిథి)

వైశాఖమాస శుక్లపక్ష తృతీయాతిథిని అక్షయ తృతీయ అనియు, ఆఖాతృతీయ అనియు, ఆఖాతీజ అనియు అందురు.

అక్షయ మనగా ఎన్నిటికి నశించనిది అని, సత్యమైనది. యేది సర్వదా సత్యమైనదో అదియే పరమాత్మ ఈశ్వరుడు, అక్షయ అఖండ సర్వవ్యాపకుడు. ఈ అక్షయ తృతీయాతిథి ఈశ్వరతిథి. ఈ అక్షయతిథి పరశురాముని జన్మదినమైన కారణమున “పరశురామతిథి” అనియు అందురు. పరశురాముడు మహాత్ములైన చిరంజీవుల లెక్కలోనికి వచ్చి వాడుగాన ఈ తిథిని చిరంజీవి తిథి అనియు అందురు. నాలుగు యుగములలో (సత్య, త్రేతా, ద్వాపర, కలియుగ) త్రేతాయుగ ప్రారంభము ఈ తిథి నుండే ప్రారంభమైనది. అందువలన ఈ తిథిని యుగాది తిథి యందురు.

బదరీనారాయణ దర్శన తిథి నాలుగు థామములలో నొకటైన బదరీనారాయణ దర్శనతిథియు నిదియే. భక్తులు ఈ దినమిచట త్యాగ దాన దక్షిణ, జప, తప హోమ హవన గంగాస్నానాది కార్యములు చేయుదురు. భగవానుని ప్రసాదమును భక్తులు భక్తితో గ్రహించెదరు.

అక్షయ తృతీయనాడు భక్తజనులు భగవానుని చరణ దర్శనమునకు బృందావనము వచ్చెదరు. ఇది “సత్యమేవజయతే” అను సందేశమిచ్చును. ఈ తిథియందు వివాహాది శుభకార్యములు చేయుదురు. అక్షయ గ్రంథమైన గీత అమర నిధివంటిది. దీనిని చదివినను వినినను, జీవితము సఫలమగును. అక్షయత్త్వము ప్రాప్తించును.

మరిన్ని పండుగలు:

Tholi Ekadashi In Telugu – తొలి ఏకాదశి విశిష్టత

Tholi Ekadashi

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు తొలి ఏకాదశి విశిష్టత, తొలి ఏకాదశి  పండుగ ఎందుకు జరుపుకుంటారు, మరియు తొలి ఏకాదశి గురించి తెలుసుకుందాం.

పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.

తొలి ఏకాదశి విశిష్టత

సూర్యుడు కర్కాటక సంక్రమణం చేసిన తరువాత వచ్చే మొదటి ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. మన పండగలన్నీ దీంతోనే మొదలవుతాయి. లోకంలో మోక్షగాములైన వారు ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అంటే నాలుగు నెలలపాటు పుణ్య తిధులుగా భావించి ‘దేవశయని’ అనే వ్రతాన్ని చేస్తారు. సన్యాసులు, యతీశ్వరులు మొదలైన వారు కూడా ఈ కాలంలో ప్రయాణం చేయకుండా ఒక చోట స్థిరంగా ఉంటారు. దీన్నే ‘చాతుర్మాస్యము’ అంటారు.

ఒక రోజున ధర్మరాజుకు ఒక చిన్న అనుమానం వచ్చింది. మోక్షగాములు దేవశయని వ్రతాన్ని ఎందుకు చెయ్యాలి? ఇదే సమయంలో చాతుర్మాస్యము చెయ్యటానికి గల కారణాలేవి? తన అనుమానాన్ని తీర్చే వారెవరున్నారు? అని ఆలోచించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు తప్ప ఇంకెవరి వల్లా కాదని నిశ్చయించుకున్న వాడై, భగవానుడి దగ్గరకు వెళ్ళి ‘ఓ పరంధామా! పరాత్పరా! దేవశయని వ్రతాన్ని, చాతుర్మాస దీక్షను గురించి నాకు వివరించ వలసినది’ అని ప్రార్థించాడు. ధర్మజుని ప్రార్ధన ఆలకించిన భగవానుడు ఈ రకంగా చెప్పటం ప్రారంభించాడు.

‘ధర్మనందనా! ఆషాఢ శుద్ధ ఏకాదశి నే దేవశయనీ ఏకాదశి’ అని అంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో మోక్షం పొందాలనుకునే వారంతా ఈ రోజున దేవశయని వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజే చాతుర్మాస్యము కూడా ప్రారంభమవుతుంది.

సూర్యుడు కర్కాటకరాసి లోనికి వచ్చిన తరువాత ఆషాఢ శుద్ధ ఏకాదశిన శ్రీ మహావిష్ణువును పవళింప చెయ్యాలి. సూర్యుడు తులారాసిలో ప్రవేశించిన తరువాత అనగా కార్తీక మాసంలో తిరిగి ఆయనను మేల్కొల్పాలి. ఈ నాలుగు నెలల కాలము శ్రీహరి నిద్రావస్థ లో ఉంటాడు. ఇది వర్షా కాలము. అందుచేత యతీశ్వరులు, సన్యాసులు దేశాటన చెయ్యటానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి వారు ఏదో ఒక చోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక బోధలు చేస్తుండాలి. ఇదే చాతుర్మాస్యము.

రాజా! ఏకాదశినాడు శ్రీ మహావిష్ణువు ప్రతిమకు పంచామృతా లతో చక్కగా స్నానంచేయించి, సుగంధ లేపనము కావించి, ధూప దీప నైవేద్యాలు సమర్పించి, ‘దేవదేవా! వర్షాకాలము నాలుగు నెలలు దాట నువ్వు తిరిగి, మేల్కొనే వరకు పరిశుద్ధమైన నియమాలతో నేను కాలం గడుపుతాను. ఏ అడ్డంకులూ లేకుండా ఈ వ్రతము పూర్తి అయ్యేటట్లు గా అనుగ్రహించ వలసినది’ అని ప్రార్థించి రెండు వైపులా తలగడతో, తెల్లని వస్త్రముతో శయ్యను ఏర్పాటుచేసి, ఆమహానుభావుని శయనింప చెయ్యాలి. ఆయన నిద్రిస్తే ఈ జగత్తు కూడా నిద్రిస్తుంది. ఆయన మేల్కొన్నప్పుడే ఈ జగత్తు మేల్కొంటుంది.

పాండవాగ్రజా! ఈ వ్రతాన్ని ఆషాడ శుద్ధ ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, అష్టమి లేదా కర్కాటక సంక్రమణం జరిగిన రోజున ప్రారంభించి నాలుగు నెలల తరువాత కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశిన పూర్తిచెయ్యాలి. ఈ వ్రతం ఆరంభించటానికి మంచి చెడులతో పని లేదు. జనన మరణాల వలన కలిగే శౌచా శౌచములు చూడవలసిన పనిలేదు. స్త్రీ పురుష భేదము అంతకన్నా లేదు. ఈ వ్రత మాచరించిన వాడు మరణించిన తరువాత మిక్కిలి కాంతితో ప్రకాశిస్తూ, సూర్య తేజముగల విమాన మెక్కి విష్ణు లోకం చేరతాడు.

Tholi Ekadashi visishstata

చాతుర్మాస్య వ్రతం అనేక రకాలుగా ఆచరిస్తారు.

  1. ప్రతి రోజూ దేవాలయానికి వెళ్ళి అక్కడ అంతా శుభ్రం చేసి, నీళ్ళు చల్లి ఆవుపేడతో అలికి రంగవల్లులు తీర్చి దిద్దిన వాడు ఏడు జన్మల వరకు శ్రేష్ఠమైన బ్రాహ్మణ కులంలో పుట్టి సత్య ధర్మ పరాయణుడవుతాడు.
  2. ఈ నాలుగు నెలలూ శ్రీమహావిష్ణువును పంచామృతాలతో స్నానం చేయించినవాడు మరణానంతరము విష్ణులోకానికి వెళ్ళి సారూప్య ముక్తి పొందుతాడు. అంటే లక్ష్మీదేవి, శ్రీవత్సము, సృష్టి స్థితి లయ సామర్థ్యము తప్ప రూపు రేఖలు, భక్తుల కోరికలు తీర్చటములో శ్రీహరి రూపంలోనే ఉంటాడు.
  3. ఈ సమయంలో ఉత్తముడైన బ్రాహ్మణునికి భూదానం గాని, సువర్ణ దానం గాని చేసిన వాడు ఈ లోకంలో ఇంద్ర భోగాలనుభవించి, మరణానంతరము విష్ణులోకం చేరతాడు.
  4. చాతుర్మాస్యంలో ప్రతిరోజూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ, భగవంతు డికి నైవేద్యం సమర్పించేటప్పుడు బంగారు తామర పువ్వును సమర్పించిన వాడు ఈ లోకంలో అనంతమైన భోగాలనుభవించి, చివరకు స్వర్గం చేరతాడు.
  5. ఈ సమయంలో ప్రతిరోజూ హరిని తులసి దళాలతో అర్చించి, బంగారు తులసి దళము దానం చేసినవాడు విష్ణులోకం పొందుతాడు.
  6. వ్రత సమయంలో భగవంతునికి ధూప దీపాలు సమర్పించి, వ్రతాంతమున దీపపు కుందులు దానం చేసినవాడు గొప్ప శ్రీమంతుడవు తాడు. సకల సౌభాగ్యాలు పొందుతాడు.
  7. ఈ కాలంలో ప్రతి రోజూ రావి చెట్టుకు గాని, శ్రీమహావిష్ణువుకు గాని ప్రదక్షిణలు చేసినవాడు వైకుంఠం చేరతాడు.
  8. వ్రత సమయంలో ప్రతి రోజూ సాయంత్రం దేవుని సన్నిధిన దీపారాధన చేసి, వ్రత సమాప్తిన వస్త్రము, బంగారము, దీపపుకుంది. దానం చేసినవాడు ఈ లోకంలో మహా తేజస్వి అవుతాడు. మరణా నంతరము వైకుంఠంచేరతాడు.
  9. శ్రీమహావిష్ణువు పాదోదకాన్ని పానంచేసినవాడు విష్ణులోకం పొందుతాడు. అతడికి పునర్జన్మ ఉండదు.
  10. ఈ సమయంలో ప్రతిరోజూ మూడు వేళలా దేవాలయంలో 108 గాయత్రీ జపం చేసిన వాడికి పాపాలు అంటవు.
  11. చాతుర్మాస్యంలో ప్రతిరోజూ పురాణ శ్రవణంచేసి, వ్రతసమాప్తి యందు పుస్తకము, వస్త్రము, బంగారము దానంచేసినవాడు సకల భోగాలు అనుభవిస్తాడు.
  12. చాతుర్మాస్యంలో శివనామం కాని, కేశవ నామంకాని జపంచేసి, వ్రత సమాప్తిన బంగారపు శివ ప్రతిమగాని, విష్ణు ప్రతిమగాని దానంచేసిన వాడికి మహాపుణ్యము లభిస్తుంది.
  13. స్నాన సంధ్యాది నిత్యకృత్యాలు పూర్తిచేసి సూర్యమండల మధ్య వర్తి అయిన శ్రీమన్నారాయణునికి అర్ఘ్యమిచ్చి, వ్రత సమాప్తి నందు ఎరుపు రంగు వస్త్రము, బంగారము, గోవును దానం చేసినవాడు పరిపూర్ణ … ఆరోగ్యవంతుడవుతాడు. చిరాయువౌతాడు.
  14. ప్రతిరోజూ గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ, నువ్వులతో హోమంచేసి, వ్రత సమాప్తి యందు తిలపాత్ర దానంచేసిన వాడు సర్వపాపములనుండి విముక్తుడవుతాడు.
  15. ప్రతిరోజూ అన్నహోమము చేసి, వ్రతాంతమందు నేతితో నిండిన కుండను, మంచి వస్త్రమును దానంచేసినవాడు మంచి ఆరోగ్యము, శరీరచ్ఛాయ, పుత్రపౌత్రాది సంపద కలిగి బ్రహ్మదేవునితో సమానుడౌతాడు.
  16. ప్రతిరోజూ అశ్వత్థ వృక్షాన్ని పూజించి, ఆఖరు రోజున వస్త్రము, బంగారము దానంచేసిన వాడు మంచి ఆరోగ్యవంతుడవుతాడు.
  17. ప్రతిరోజూ తులసిని పూజించి, తులసి దళాలను ధరించినవాడు సర్వపాపములనుండి విముక్తుడై విష్ణులోకము పొందుతాడు.
  18. ప్రతి. దినము గరికెను పూజించి శిరస్సున ధరించి, వ్రతాంతమున బంగారు గరికె దానంచేసిన వాడు సర్వపాపములనుండి విముక్తుడవు తాడు, స్వర్గాన్ని పొందుతాడు.
  19. చాతుర్మాస్యములో శివకేశవులలో ఎవరిని ధ్యానించినా పుణ్య ఫలము వస్తుంది.
  20. ప్రతి దినము విష్ణు పాదోదకము పారాయణచేసిన వాడు సర్వ పాపములనుండి విముక్తుడవుతాడు. అతని ఆయువు, సంపద వృద్ధి పొందుతాయి. వ్రత సమాప్తిన గోదానము చెయ్యాలి. లేకపోతే వస్త్రదానం చెయ్యవచ్చు.
  21. వేదవిదులైన బ్రాహ్మణులను పూజించాలి. వ్రతసమాప్తిన బ్రాహ్మణ సమారాధన, అన్నదానము చేసినవాడు ఆయుర్దాయము, ధనము పొందుతాడు.
  22. కపిల గోవును అర్చించి, ప్రదక్షిణలు చేసినా, దానమిచ్చినా గోవు శరీరం మీద ఎన్ని రోమములున్నాయో అన్ని సంవత్సరాలు స్వర్గ సుఖాలు అనుభవిస్తాడు.
  23. ప్రతి దినము గణపతిని, సూర్యుని అర్చించినవాడు ఆయురా రోగ్య ఐశ్వర్యములు పొందుతాడు. గణపతి అనుగ్రహముతో అతడి అభీష్ట ములు సిద్ధిస్తాయి. అన్నిచోట్లా విజయం సిద్ధిస్తుంది.
  24. చాతుర్మాస్యములో వర్ష ఋతువు, శరదృతువు రెండు ఉంటాయి. ఈ రోజులలో శివ ప్రీతికి రజత దానం చెయ్యాలి. అంత శక్తి లేకపోతే రాగిని కూడా దానం చేయవచ్చు. ఇలా చేసిన వారికి అందమైన సంతానం కలుగుతుంది. ఈ ఫలితం కావలసిన వారు తేనె తో నిండిన వెండి పాత్రను, లేదా బెల్లంతో నిండిన రాగి పాత్రను దానం చెయ్యాలి.
  25. వ్రత సమాప్తి యందు శయ్యా దానము చేసిన వారు శాశ్వత మైన సుఖం పొందుతారు.
  26. వర్షా కాలములో ప్రతి రోజూ గోపీ చందనము దానం చేసిన వాడికి భుక్తి, ముక్తి రెండు లభిస్తాయి.
  27. ప్రత సమాప్తిన గోపీచందనము, నూతన వస్త్రములు దానం చేసిన వారికి సకలైశ్వర్యములు లభిస్తాయి, చివరకు సాయుజ్యం కలుగుతుంది.
  28. ప్రతి రోజు పంచదార లేదా బెల్లము దానంచేస్తే భుక్తి, ముక్తి కలుగుతుంది.

చాతుర్మాస్య వ్రతం పూర్తి అయిన తరువాత ఉద్యాపనకు ఎనిమిది లేక నాలుగు పలములు బరువుగల ఎనిమిది, నాలుగు లేదా ఒక రాగి పాత్ర నిండా చక్కెర పోసి, పాత్రపైన వస్త్రము, దక్షిణ ఉంచి నవ ధాన్యాలతో, లేదా పిండి వంటలతో ప్రతి పాత్రను దానంచెయ్యాలి. దానం చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకాలు చదవాలి.

తామ్రపాత్రం సవస్త్రం చ శర్కరా హేమ సంయుతం
సూర్యప్రీతికరం యస్మాద్రోగఘ్నం పాపనాశనం.

పుష్టిదం కీర్తిదం నుౄణాం నిత్యం సంతాన కారకం
సర్వకామప్రదం స్వర్గ్య మాయు ర్వర్ధన ముత్తమం

తస్మా దస్యప్రదానేన కీర్తి రస్తు సదా మమ
ఏవ వ్రతం యః కుర్యా త్తస్య పుణ్యఫలం

చక్కెరతో కూడిన రాగిపాత్ర సూర్యుడికి ప్రీతికరమైనది. సమస్త రోగాలను నశింప చేస్తుంది. పాపాలను పోగొడుతుంది. పుష్టిని, కీర్తిని ఇస్తుంది. దీని దానము వలన సంతానము కలుగుతుంది. సర్వాభీష్టములు నెరవేరతాయి. స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. అటువంటి పాత్రను నేను దానం చేస్తున్నాను, నాకు ఎల్లప్పుడూ కీర్తి కలుగు గాక.

ధర్మనందనా! ఇప్పుడు వ్రత ఉద్యాపన ఫలితము చెబుతాను వినవలసినది.

చాతుర్మాస్య వ్రతం చేసిన వాడికి సంగీత ప్రావీణ్యం కలుగు తుంది. లోకంలోని స్త్రీలందరూ అతన్ని ప్రేమిస్తారు. అతడికి రాజ్యం కావాలంటే రాజ్యము,సంతానము కావాలంటే సంతానము లభిస్తుంది. ధనం కావాలంటే ధనం లభిస్తుంది. చివర కతడు మోక్షము పొందుతాడు. చాతుర్మాస్యములో ప్రతిరోజు కూరగాని, కందమూలాలుగాని, ఫలములుగాని దానంచేసి వ్రత సమాప్తిన వస్త్ర దానం చేసిన వాడు రాజయోగి అవుతాడు.

మంత్రం :
సర్వదేవప్రియం యస్మా చ్ఛాకం తృప్తికరం నృణాం
దదామి తే న దేవాద్యాః సదా కుర్వంతు మంగళం

శాకము దేవతలకు ప్రీతిని మానవులకు తృప్తిని కలిగిస్తుంది. ఓ బ్రాహ్మణ శ్రేష్టా! అట్టి శాకము నీకిస్తున్నాను. కాబట్టి దేవతలు నాకు శుభమును చేకూర్తురుగాక అంటూ శాక దానంచెయ్యాలి. ప్రతిరోజూ త్రికటుకములు అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు బ్రాహ్మణునికి దానం చెయ్యాలి. అలాచేస్తే సూర్య భగవానుడు ప్రీతి చెందుతాడు. అన్ని రోగాలు నశిస్తాయి.

ఈ రకంగా ప్రతిరోజూ త్రికటుకాలు దానంచేసి వ్రత సమాప్తిని బంగారంతో చేసిన త్రికటుకలు, వస్త్రము దక్షిణలతో దానంచేసి ఉద్యా పన చేసిన వాడు నూరు సంవత్సరాలు మంచి ఆరోగ్యంతో జీవిస్తాడు, చివరకు స్వర్గం చేరతాడు.

చాతుర్మాస్యంలో నిరంతరము మంచి ముత్యములు దానం చేసిన వాడికి అన్న వస్త్రాలకు లోటురాదు. ప్రతి దినము అన్నం దానం చేసిన వాడు అష్టశ్వర్య సంపన్నుడు, కీర్తిమంతుడు అవుతాడు. ప్రతి దినము తాను తాంబూలము సేవించకుండా, ఇతరులకు తాంబూల దానం చేసి, వ్రత సమాప్తి నందు ఎరుపు రంగు వస్త్రములు దానం చేసినవాడు మహా లావణ్యవంతుడవుతాడు. అతడికి ఏరోగాలు రావు. మంచి మేధావి అవుతాడు. గాత్ర మాధుర్యముగల వాడవుతాడు. మరణానంతరము గంధర్వు డవుతాడు. తాంబూలము లక్ష్మీ ప్రదమై నది. అందులోని ఆకు, వక్క, సున్నము త్రిమూర్తుల స్వరూపము. అందుచేతనే తాంబూల దానం చేసిన వారికి త్రిమూర్తులు సకల సంపద లను ఇస్తారు.

ఈ సమయంలో ప్రతి రోజూ పసుపు దానం చేసి, ప్రతసమాప్తిని క్రొత్త వెండి పాత్రలో పసుపుపోసి దానం చేసినట్లైతే ఆస్త్రీ లేక పురుషుడు సర్వసుఖాలు అనుభవిస్తారు. వారికి సౌభాగ్యము, అస్టెశ్వర్యాలు కలుగు తాయి. ఈ రకంగా పసుపు దానం చేసిన వారు మంచి రూప లావణ్యాలతో దేవ లోకంలో సుఖిస్తారు.

ఈ కాలంలో ఉమా మహేశ్వర స్వరూపంగా భావించి, విప్ర దంపతులను పూజించి, వారికి శక్త్యాను సారము సువర్ణ దానంచేసి, వ్రత సమాప్తి యందు ఉమా మహేశ్వరుల బంగారు ప్రతిమను చేయించి దానిని పూజించి దానం చెయ్యాలి. తరువాత రుచికరమైన పిండి వంట లతో భోజనం పెట్టాలి. అలా చేసిన వాడి సంపత్తి సురక్షితంగా ఉంటుంది. మంచి కీర్తి కలుగుతుంది. ఈ లోకంలో సమస్త భోగాలు అనుభవించి అంత మందు కైలాసం చేరతాడు. ప్రతి రోజూ ఫల దానం చేసి వ్రత సమాప్తిన వెండి ఫలమును దాన మిచ్చిన వాడి కోరికలు అన్నీ తీరతాయి. అతడు స్వర్గాన్ని చేరతాడు. బంగారు పుష్పములు దానం చేసినవాడు ఈ లోకంలో శ్రేష్ఠమైన సౌభాగ్యము పొంది, చివరకు గంధర్వ లోకం చేరతాడు.

వ్రత సమయంలో ప్రతిరోజూ దధ్యాన్నము దానం చెయ్యాలి. – అంత శక్తి లేకపోతే అష్టమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, ఆది వారము, శుక్రవారములందు దధ్యాన్నము దానం చెయ్యాలి. ప్రత సమాప్తిన గోదానం గాని, భూదానంగాని, వస్త్ర దానం గాని చేసినట్లైతే అతడికి . అక్షయమైన అన్నం దొరుకుతుంది. పుత్ర పౌత్రాది వృద్ధి కలుగుతుంది. అంతమందు కైలాసం చేరతాడు.

చాతుర్మాస దీక్షను కేవలము కూరలు, దుంపలు, ఫలములతో గడిపి ఆఖరున గోదానం మిచ్చినట్లైతే అతడు వైకుంఠం చేరతాడు. కేవలము పాలు త్రాగి ఈ వ్రతమాచరించి, ప్రత సమాప్తిన గోదానం చేసి నట్లైతే అతడు బ్రహ్మలోకం పొందుతాడు.

చాతుర్మాస్యములో ప్రతిరోజూ అరటి ఆకులలో భోజనం చేసి చివరన వస్త్రములు, కంచుపాత్ర దానంచేసినట్లైతే అతడు గొప్ప సుఖములు పొందుతాడు. ప్రతి రోజూ మోదుగ ఆకులలో భోజనం చేసినవాడి పాపాలు సర్వము హరించివేయబడతాయి. ఈ వ్రతమాచరించిన వాడికి బ్రహ్మ హత్యా పాతకము, సురాపానము, శిశు హత్య, భ్రూణ హత్య, స్త్రీ హత్య, అసత్యము, పొందరాని స్త్రీలను పొందటము వంటి వాటి వలన కలిగే పాపాలు కూడా హరించుకు పోతాయి.

వ్రత సమాప్తి యందు సారవంతమైన భూమిని దానంచేసిన వాడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొంది చివరకు వైకుంఠం చేరతాడు. ఎప్పుడూ ఏదీ అడగని విప్రునకు, సువర్ణము, చందనముతో వృషభ దానం చేసినవాడు జ్ఞానము, మోక్షము పొందుతాడు. ఈ సమయంలో ప్రతి రోజూ పగలు ఉపవాసముండి రాత్రికి భుజించాలి. వ్రత సమాప్తిన బ్రాహ్మణ సమారాధన చెయ్యాలి. అలా చేసినవాడు కైలాసం చేరి మహా సుఖాలనుభవిస్తాడు.

చాతుర్మాస్యములో ఏకభుక్తం చేసి, వాసుదేవుని పూజించినవాడు స్వర్గలోకం చేరతాడు. ప్రతి రోజూ భూమి పైనే శయనించి, వ్రతాంతమున శయ్యాదానం చేసినవాడు శివలోకంలో గొప్ప సుఖాలనుభవిస్తాడు. ఈ కాలంలో పాయసము, తేనె, ఉప్పు, నేయి, ఫలములను విసర్జించి, కార్తీక పూర్ణిమిన వీటిని దానమిచ్చిన వాడు రుద్రలోకం పొందుతాడు.

ఈ నాలుగు నెలలు తలస్నానం చెయ్యకుండా, గోళ్ళు కత్తిరించ కుండా శ్రీ మహావిష్ణువును పూజించినవాడు విష్ణులోకం పొందుతాడు. ఈ కాలంలో కూరలను పూర్తిగా వదలివేసి వ్రతాంతమునందు వెండి పాత్రతో పాటుగా పది రకాల కూరలు, వస్త్రములు దానంచేసిన వాడికి కైలాసం ప్రాప్తిస్తుంది.

ఈ కాలంలో గోధుమలను తినకుండా ఉండి ప్రతాంతమున బంగారు గోధుమలను దానం చేసినట్లైతే అశ్వమేధయాగం చేసిన ఫలం దక్కుతుంది. బంగారు గోధుమలు దానం చేసేటప్పుడు ఈ క్రింది మంత్రం చదవాలి.

Tholi Ekadashi Pooja Vidanam

మంత్రం
గోధూమాః సర్వజంతూనాం బలపుష్టి వివర్దనాః
ముఖ్యాశ్చ హవ్యకవ్యేషు తస్మాన్మే దదతు శ్రియం.

గోధుమలు సర్వజీవులకు బలాన్ని పుష్టిని ఇస్తాయి. దేవ పితృ కార్యములకు ఇవి ముఖ్యమైనవి. కాబట్టి నాకు సంపదల నిచ్చుగాక.

ఈ సమయంలో తనకు ఇష్టమైన కూరలు, పండ్లు తినకుండా వదలివేసి, వ్రత సమాప్తి యందు వెండితో చేసిన పండ్లు లేదా కూరలను దానం చేసినట్లైతే ఆయురారోగ్య ఐశ్వర్యములు, పుత్ర పౌత్రాది సంతతి కలుగుతుంది. అంతమందు స్వర్గం లభిస్తుంది.
శ్రావణ మాసంలో శాకములు, భాద్రపదంలో పెరుగు, ఆశ్వియుజ మాసంలో పాలు, కార్తీక మాసంలో పప్పులు వదలి వెయ్యాలి. అంతేకాదు, అనేక బీజములున్న ఫలములు అంటే గుమ్మడి, జామ, సీతాఫలము, నారింజ, బత్తాయి, వంకాయలు వంటి వాటిని తినరాదు.

ఉసిరి, రేగు, ఆనప, చింతకాయలను ఈ నాలుగు నెలలు తినరాదు. నులక మంచం మీద గాని పట్టె మంచం మీదగాని పడుకో రాదు. ఋతుకాలము తరువాత భార్యను కలవ రాదు. బచ్చలి, మునగ, వంగ, మారేడు పండ్లు తినేవాడికి శ్రీహరి దూరమవుతాడు. ఈ సమయంలో ఏరకమైన వ్రతాలు చెయ్యకపోయినా, ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం స్నానంచేసి శ్రీహరిని పూజించినట్లైతే అతడు వైకుంఠము పొందుతాడు.

చాతుర్మాస్యంలో తేనె విడిచిన వాడు రాజవుతాడు. బెల్లమును విడిచిన వాడు దీర్ఘాయుష్షు పొందుతాడు. దేవాలయంలో సంగీతాన్ని వినిపించిన వాడు గంధర్వ లోకం పొందుతాడు. సువాసన వెదజల్లే నూనెలు విడిచిన వాడికి – శత్రువులు నశిస్తారు. ఇప్ప నూనె త్యజించిన వాడు – మంచి సౌభాగ్యము పొందుతాడు. కారము, పులుపు, చేదు, వగరు, తీపి – వీటిని విసర్జించిన వాడి శరీరము అందముగా ఉంటుంది. పూలు మొదలైన భోగాలను వదలినట్లైతే విద్యాధర గణమందు చేరతాడు. యోగియైనవాడు బ్రహ్మలోకం చేరతాడు.

తాంబూలము వదలివేసిన వాడికి రోగాలు నశిస్తాయి. పక్వా హారము విడచినవాడు – ఇంద్రలోకం పొందుతాడు. రోజు విడిచి రోజు ఉపవాసం చేస్తే – బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. చాతుర్మాస్యంలో ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరీ మంత్ర జపం చేసిన వాడికి పుణ్యలోకాలు కలుగుతాయి. ఆలయంలో లక్ష ప్రదక్షిణాలు చేసినవాడు హంస వాహన మెక్కి వైకుంఠం చేరతాడు. ఈ నాలుగు నెలలూ బయట భోజనం చెయ్యని వాడు – దేవతా స్వరూపు డవుతాడు.

ఈ సమయంలో ప్రాజాపత్య వ్రత మాచరించినవాడు మనో వాక్కాయ కర్మలచే చేసిన పాపాలనుండి విముక్తు డవుతాడు. చాతుర్మాస్యములో చాంద్రాయణ వ్రత మాచరించినవాడు దివ్య దేహము ధరించి శివలోకము చేరతాడు. ఈ సమయంలో పూర్తిగా ఉపమాసమున్న వాడికి సాయుజ్యం లభిస్తుంది. అతడికి పునర్జన్మ ఉండదు. మధూకర భిక్షాన్నము తిని గడిపినవాడు–వేద పారంగతుడవుతాడు.

శ్రీమన్నారాయణుడు నిద్రకుపక్రమించే రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించి నాలుగు నెలల పాటు నిర్విఘ్నంగా వ్రత మాచరించిన వాడు ఈ లోకంలో సకల సుఖాలు అనుభవించి, అంతమందు సాయుజ్యం పొందుతాడు’. అంటూ తొలి ఏకాదశి, దేవశయని వ్రత విధానము, దాని ఫలి తాలను వివరించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు.

మరిన్ని పూజా విధానాలు:

Pandugalu – పండుగలు

Pandugalu

పండుగలు మన జీవితాల్లో విశేషంగా అవసరమైన సమయాలు. దేవుళ్ళు వారు సాధించిన విజయాలని, మరియు సంతోషాలని వ్యాపింపచేయడని చేయడానికి, మరికొన్ని కారణాలగా, పండుగలు మనకు ఉన్నాయి. అవి ఆనందించటం మానవ జీవితంలో అత్యంత ప్రముఖం. అవి బంధువులు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలసి చేసుకొనే పండుగలు, మన చరిత్రలో ముందుకు చెందిన సందర్భాలు. పండుగలు సాంస్కృతిక వార్షికోత్సవాలు మరియు ధార్మిక అంశాల వెనుక విశ్వాసంగా ఉంటాయి. అవి సమృద్ధంగా ఆనందించడం మరియు జీవితంలో సంతోషం ఉంచుకోవడానికి అందిన సందర్భాలు. పండుగలు సమయంలో వాటిని అందుకున్న వ్యక్తులకు సంతోషం, ఉత్సాహం, మరియు ప్రీతిని కలిగిస్తాయి. అలాగే, పండుగలు భాగస్వామ్యంగా ఉంటాయి, మనకి ఆనందం మరియు సంతోషం అందిస్తాయి. మొదలగు పండుగల విషయముల గురించి ఈ క్రింద ఇచ్చిన లింకులు ద్వారా తెలుసుకుందాం…

Pandugalu – పండుగలు