మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. హిందువులు ఏ కార్యక్రమం ప్రారంభించినప్పుడు, విఘ్నాలు లేకుండా, ఆటంకాల లేకుండా జరగాలని వినాయకుడిని పూజిస్తారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ వినాయక చవితి వ్రత కథ గురించి తెలుసుకుందాం…
Vinayaka Pooja Lo Chadavalsina Vrata Katha
వినాయకోత్పత్తి
కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నములో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది. అది చూడ ముచ్చటైన బాలుడుగా కనిపిం చింది. దానికి ప్రాణం పోయాలనిపించి, తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమను ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్యసుందరుని వాకిట్లో వుంచి, ఎవరినీ లోనికి రానివ్వ రాదని చెప్పి లోపలకు వెళ్ళింది.
శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో వున్న బాలుడు పరమశివుడ్ని అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదనము చేసి, లోపలికి వెళ్లాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించినది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై, శివపార్వతుల ముద్దుల పట్టియైనాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు.
విఘ్నేశాధిపత్యం
ఒకనాడు దేవతలు, మునులు, మానవులు, పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యము తనకు ఇమ్మని డు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నారు. అందుకు శివుడు తన కుమారుల నుద్దేశించి “మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర న నదులన్నింటిలో స్నానములు చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. అంత కుమారస్వామి చురుకుగా, సులువుగా సాగివెళ్ళాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడైన తాను ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని, తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడు కున్నాడు. వినాయకుని బుద్ధిసూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫల దాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నియూ నారాయణుని అధీనములు. అనగా నారాయణ మంత్రం అధీనంలో వుంటాయి. వినాయకుడు ఈ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావమున ప్రతితీర్థ స్నానమందును కుమారస్వామికన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా మూడు కోట్ల యాభైలక్షల నదులలో వినాయకుడి ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు. తండ్రి సమీపమున ఉన్న గజాననుని చూచి నమస్కరించి “తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి, ఈ ఆధిపత్యం అన్నగారికే ఇమ్మ”ని ప్రార్థించాడు.
చంద్రుని పరహాసం
అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితినాడు గజాననుకి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు, అపూపములు మున్నగు పిండివంటలు, టెంకా యలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలగునవి సమర్పంచి పూజించగా, విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించి, కొన్ని వాహనమునకిచ్చి, కొన్నిచేత ధరించి మందగమనమున సూర్యాస్తమయ వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమికానిన చేతులు భూమికానక ఇబ్బంది పడుచుండగా శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి వికటముగా నవ్వాడు. అంత రాజదృష్టి సోకిన రాలుగూడ నుగ్గవుతాయి అనే సామెత నిజ విఘ్నదేవుని గర్భంబు పగిలి, అందున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతిచెందాడు. అంత పార్వతి శోకించుచూ చంద్ర ప్రదే “పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి చూసిన వారు పాపాత్ములై నీలాపనిందల పొందురుగాక” అని శపించింది.
ఋషిపత్నులకు నీలాపనిందలు
ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞంచేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులకు మోహించి, శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్యయైన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపముదక్క మిగిలిన ఋషి పత్నుల రూపము ధరించి పతికి ప్రియము చేసేందుకు ప్రయత్నించింది. అగ్ని దేవునితో నున్నవారు తమ భార్యలేయని శంకించి, ఋషులు తమ భార్యలను విడనాడారు. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికి ఈ నీలాపనింద కలిగింది.
దేవతలు, మునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరు నికి తెలుపగా, అతడు సర్వజ్ఞుండగుటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధాన పరిచాడు. అంత బ్రహ్మ కైలాసమునకు వచ్చాడు. మహేశ్వరుల సేవించి మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించాడు. పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు. అంత దేవాదులు “ఓ పార్వతీ! నీ శాపమువల్ల ముల్లోకాలకు కీడువాటిల్లింది కాబట్టి శాపాన్ని ఉపసంహించుకోవా”లని ప్రార్థించారు. తనయుడు మరల బతకడంతో పార్వతి చాలా సంతోషించింది. కుమారుని చేరదీసి ముద్దాడింది “ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుని చూడరాదు”అని శాపాన్ని సడలించింది. అంత బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితినాడు మాత్రము చంద్రుని చూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి. ఇలా కొంతకాలం గడచెను.
శమంతకోపాఖ్యానం
ద్వాపరయుగమున నారదుడు ద్వారకావాసియగు శ్రీకృష్ణుని దర్శించి, స్తుతిం చాడు. మాటల సందర్భంగా స్వామీ ! సాయంకాలమయింది. నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుని చూడరాదు. ఒక సెలవు అని పూర్వవృత్తాంతమంతయూ శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు. అంతట కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుడ్ని ఎవరూ చూడరాదని పట్టణంలో చాటించాడు. క్షీరప్రియుడగు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక గోష్టమునకు పోయి పాలుపిదుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబమును చూశాడు. “ఆహా! ఇక నాకెట్టి అపనింద రానున్నదో”అని అనుకున్నాడు.
కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యవరముచే శమంతకమణిని సంపా దించి ద్వారకాపట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు మర్యాదచేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగాడు. రోజుకు ఎనిమిది బారువుల బంగారమిచ్చు దానిని ఏఆప్తునకైన నెవ్వరు ఇవ్వరనిన సత్రాజిత్తు తిరస్కరించాడు. అంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణిని కంఠమున ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భ్రమించి అతడిని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆటవస్తువుగ ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతివిని, కృష్ణుడు, మణి ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నం అపహరించాడని పట్టణమున చాటించాడు. అది కృష్ణుడు విని చవితినాడు పాలల్లో చంద్రబింబమును చూచిన దోషఫలమని అను కున్నాడు. దానినిబాపుకొనుటకై బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెదుకగా ఒకచోట ప్రసేనుని కళేబరము, సింహం కాలిజాడలు, పిదప ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారిన పోవుచుండగా ఒక పర్వత గుహ ద్వారంబును చూచి పరివారమును అక్కడ విడిచి కృష్ణుడు గుహలోపలికి వెళ్ళాడు. అచట బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు. దానిని తీసుకొని వెనక్కు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది.
అంత జాంబవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుని పైబడి అరచుచు, గోళ్ళతో గుచ్చుతూ, కోరలతో కొరుకుతూ ఘోరముగ యుద్ధము చేసెను. కృష్ణుడు వానిని బడద్రోసి వృక్షములు, రాళ్ళతోను, తుదకు ముష్టిఘాతములతోను రాత్రింబవళ్ళు తెలియక ఇరవై ఎనిమిది రోజులు యుద్ధము చేసెను. క్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది. తననే ఓడిస్తున్నవ్యక్తి రావణహంతకుడగు శ్రీరాముడే అని తెలుసు కున్నాడు. అంజలి ఘటించి దేవాదిదేవా! ఆర్తజనపోషా! భక్తరక్షా నిన్ను శ్రీరామ చంద్రునిగా తెలిసికొంటిని. ఆ కాలమున నాయందలి వాత్సల్యముచే వరం కోరు కొమ్మనగా, నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వయుద్ధం జేయవలెనని కోరుకున్నాను. భవిష్యత్తులో నీకోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చితిరి. అదిమొదలు మీనామ స్మరణచేయుచూ అనేకయుగములు గడిపాను, ఇపుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చారు. నాకు ఇకజీవితేచ్చలేదు. నాఅపరాధములు క్షమించి కాపాడుము. నీకన్న వేరు దిక్కులేదు” అంటూ భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయూ తన హస్తములచే నిమిరి భయం పోగొట్టి ఇలాఅన్నాడు. శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. అపనింద బాపుకొనుటకు ఇటువచ్చాను. కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణి సహితముగ తనకుమార్తెనగు జాంబవతిని కానుకగా ఇచ్చాడు. అంత తన ఆలస్య మునకు పరితపించు బంధుమిత్ర సైన్యంబులకు ఆనందం కలిగించి కన్యారత్నంతోను, మణితోను శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు.
సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు. శమంతకమణి సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు “అయ్యో! లేనిపోని నిందమోపి దోషము నకు పాల్పడితి”నని విచారించి మణిసహితముగ తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి, తప్పు క్షమింపుమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణివలదని తిరిగిఇచ్చాడు. శ్రీకృష్ణుడు శుభముహూర్త మున జాంబవతీ సత్యభామలను పరిణయమాడాడు. అంత దేవాదులు, మునులు స్తుతించి “మీరు సమర్థులు గనుక నీలాప నింద బాపుకొంటిరి మాకేమిగతి” యని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై “భాద్రపద శుద్ధ చతుర్ధిని ప్రమాదవశంబున చంద్ర దర్శనమయ్యెనేని ఆనాడు గణపతిని యధావిధి పూజించి ఈ శమంతకమణి కథను విని శిరంబున దాల్చువారు నీలాపనిందలు పొందకుందురుగాక” అని చెప్పాడు. అంత దేవాదులు సంతోషించి, తమ ఇళ్ళకువెళ్ళి ప్రతిసంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు, మహర్షులు, మానవులు తమతమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్టసిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో వున్నారు.
సర్వేజనాః సుఖినోభవంతు.
మరిన్ని వ్రతాలు: