మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ అష్టమ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణుడు అగస్త్య మహర్షిని కలుసుకుని ఆయన ఆశీర్వాదం పొందుతారు. అగస్త్యుడు రాముడికి దివ్య ఆయుధాలను అందజేస్తాడు, వాటితో రాక్షసులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. రాముడు, లక్ష్మణుడు ఆ ఆయుధాలను స్వీకరించి, ధైర్యంగా దండకారణ్యంలో రాక్షసులను ఎదుర్కొంటారు.
సీతా రామ లక్ష్మణులు మరునాడు ఉదయం నిద్రలేచారు. సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించారు. రాముడు సుతీక్షుని వద్దకు వెళ్లాడు.
“మహాత్మా! రాత్రి మీ ఆతిధ్యము స్వీకరించాము. మాకు చాలా సంతోషము అయింది. మీరు అనుమతి ఇస్తే మేము ముగ్గురమూ, మాతో వచ్చిన మునులు కలిసి, ఈ అరణ్యములో ఉన్న ముని ఆశ్రమములను చూచి వస్తాము. ఆ మునుల ఆశీర్వాదములు తీసుకుంటాము.” అని అన్నాడు రాముడు..
“రామా! నీకు శుభమగు గాక! నీ ఇష్టము ప్రకారము ఈ వనములో ఉన్న ముని ఆశ్రమములను అన్నిటినీ దర్శించు. ఈ వనములో ఫలములు, పుష్పములు సమృద్ధిగా ఉన్నాయి. నిర్మలమైన నీరు కలలా జలాశయములు ఎన్నో ఉన్నాయి. కొండలమీది నుండి నేల మీదికి దుముకుచున్న జలపాతములు కూడా చాలాఉన్నాయి. జింకలు, నెమళ్లు తదితర వన్యప్రాణులు మీకు కనువిందు చేస్తాయి. ఈ అడవిలో ఉన్న అందాలన్నీ తనివిదీరా చూడండి. మరలా మన ఆశ్రమమునకు చేరుకోండి.” అని అన్నాడు.
“మహర్షీ! అలాగే చేస్తాను.” అని ఆ మహర్షికి నమస్కరించి, లక్ష్మణుడు, సీత, మునులతో వనములోకి వెళ్లడానికి ప్రయాణము అయ్యాడు. సీత రామునికి లక్ష్మణునికి ధనుర్బాణములు, ఖడ్గములు తెచ్చి ఇచ్చింది. వాటిని రామలక్ష్మణులు ధరించారు. ఆయుధధారులైన రామ లక్ష్మణులు, సీతతో కలిసి ఆ అరణ్యములో ప్రయాణం చేస్తున్నారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” పంచదశః సర్గలో, రాముడు గోదావరి నదికి సమీపంలోని పంచవటిలో పర్ణ శాల, గడ్డి కుటీర నిర్మాణ పనిని అప్పగిస్తాడు . లక్ష్మణుడు తన నైపుణ్యంతో హాయిగా ఉండే ఒక కుటీరాన్ని నిర్మించాడు మరియు గృహప్రవేశ కార్యక్రమం తర్వాత వారు దానిలోకి ప్రవేశిస్తారు. రాముడు లక్ష్మణుడిని అతని నిర్మాణ పనిని మెచ్చుకుంటాడు మరియు కృతజ్ఞతాపూర్వకంగా అతను లక్ష్మణుడిని ఆలింగనం చేసుకుంటాడు మరియు రాముడి పట్ల లక్ష్మణునికి ఉన్న శ్రద్ధ గురించి తన హృదయాన్ని వ్యక్తం చేస్తాడు.
రాముడు, లక్ష్మణుడు, సీత, జటాయువు అందరూ కలిసి పంచవటి ని చేరుకున్నారు.
రాముడు లక్ష్మణుని చూచి “లక్ష్మణా! ఇక్కడ పూలు చక్కగా పుప్పించి ఉన్నాయి. ఫలవృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. నేల చదునుగా ఉంది. పక్కనే సెల ఏళ్లు ఉన్నాయి. అగస్త్యుడు చెప్పిన పంచవటి ఇదే కావచ్చును. ఇక్కడ మనము పర్ణశాల నిర్మించు కొనుటకు అనవైన ప్రదేశము చూడుము. లక్ష్మణా! జలాశయము పక్కన, దగ్గరగా ఫలవృక్షములు ఉన్న చోట, దర్భలు, సమిధలు దొరకుచోట, తగిన ప్రదేశమును నిర్ణయింపుము. ” అని పలికాడు.
“రామా! అట్లు కాదు. స్థల నిర్ణయములో నీ కన్నా సమర్థుడు లేడు. నీవు సీత కలిసి ఆలోచించి స్థల నిర్ణయము చెయ్యండి. అక్కడ నేను సుందరమైన ఆశ్రమమును నిర్మించెదను.” అని అన్నాడు.
రాముడు, సీత చుట్టపక్కల ప్రదేశములు తిరిగి గోదావరీ నదీ తీరంలో ఉన్న సమతల ప్రదేశమును ఎన్నుకొన్నారు.
“లక్ష్మణా! ఈ ప్రదేశములో పర్ణశాలను నిర్మింపుము. ఈ ప్రదేశము మనకు అనుకూలముగా ఉంది. పక్కనే గోదావరీ నది ప్రవహించుచున్నది. మనకు జలమునకు కొదవ లేదు. ఈ సమతల ప్రదేశములో ఫల వృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. చుట్టూ పర్వతములు పెట్టని కోటలాగా ప్రకాశిస్తున్నాయి. ఆ పర్వతముల మీద మామిడి, అశోక, చంపక, చందన, శమీ, కింశుక వృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. అదీ కాకుండా ఇక్కడ ఉన్న వటవృక్షముల మీద అనేక పక్షిజాతులునివసిస్తున్నాయి. జటాయువు కూడా ఈ చెట్ల మీద నివసించడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పర్ణశాల నిర్మించుటకు ఇదే అనువైన చోటు.” అని అన్నాడు రాముడు.
రాముని మాటను శిరస్సున దాల్చాడు లక్షణుడు. రాముడు కోరినట్టు అక్కడ ఒక సుందరమైన పర్ణశాలను నిర్మించాడు. మట్టితో గోడలు కట్టాడు. మధ్యలో స్తంభాలు పాతాడు. పొడుగాటి వెదుళ్లతో నిలువుగా అడ్డంగా కట్టాడు. దానిమీద తాళ ఆకులు, దాని మీద రెల్లు గడ్డి కప్పాడు. పర్ణశాల ముందు ఉన్న స్థలమును చదునుచేసాడు. చుట్టు కంచె కట్టాడు. ఆ ప్రకారంగా ఒక సుందరమైన పర్ణశాలను లక్ష్మణుడు నిర్మించాడు.
తరువాత లక్ష్మణుడు గోదావరికి వెళ్లి స్నానము చేసి అక్కడ పుష్పించిన తామర పువ్వులు కోసుకొని వచ్చాడు. లక్ష్మణుడు నిర్మించిన పర్ణశాలను చూచి సీతారాములు ముగ్ధులయ్యారు. రాముడు లక్ష్మణుని కౌగలించుకొని “లక్ష్మణా! నా కోరిక మేరకు మనకు ఒక అనువైన పర్ణశాలను నిర్మించినందుకు నీకు నేనేమి ఇవ్వగలను నా గాఢపరిష్వంగము తప్ప” అంటూ లక్ష్మణుని ప్రేమతో కౌగలించుకున్నాడు రాముడు. రాముని ప్రేమకు లక్ష్మణుడు పొంగిపోయాడు. ఆ ఆశ్రమములో రాముడు, సీత, లక్ష్మణుడు సుఖంగా నివసించసాగారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ సప్తమ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణుడు దండకారణ్యంలోకి ప్రవేశిస్తారు. అక్కడ వారి సాహసాలు, రాక్షసులతో జరిగిన ఘర్షణలు, వనవాసంలో ఎదురైన కష్టాలు వివరించబడతాయి. మహర్షి అగస్త్యుని ఆశీర్వాదం అందుకుంటారు.
రాముడు, సీతతోనూ, లక్ష్మణుని తోనూ, ఇంకా కొందరు మునులతోనూ సుతీక్ష మహర్షి ఆశ్రమమునకు వెళ్లాడు. సుతీక్ష మహర్షి ఆశ్రమము ఒక మహారణ్యములో చదునైన ప్రదేశములో ఉంది. ఆ అడవిలో ఫలవృక్షములు పుష్కలంగా ఉన్నాయి.
రాముడు ఆ ఆశ్రమములో ప్రవేశించాడు. తపస్సులో ఉన్న సుతీక్ష మహర్షిని చూచాడు. భక్తితో నమస్కరించాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు.
“ఓ మహర్షీ! నా పేరు రాముడు అయోధ్యాధి పతి దశరథుని కుమారుడను. తండ్రి ఆజ్ఞ మేరకు, నా భార్య, సోదరునితో కలిసి అరణ్యవాసము చేస్తున్నాను. శరభంగ మహర్షి ఆదేశము మేరకు తమ దగ్గరకు వచ్చాను. కళ్లు తెరిచి నాతో మాట్లాడండి.” అని ప్రార్థించాడు.
సుతీక్ష మహర్షి కళ్లు తెరిచాడు. రాముని చూచాడు. పరమానందంతో రాముని కౌగలించుకున్నాడు.
“రామా! నీకు స్వాగతము. నీరాకచే మా ఆశ్రమమునకు ఒక నాధుడు దొరికినట్టయింది. రామా! నీ గురించి విన్నాను. నీవు అరణ్యములలో సంచరిస్తున్నావని తెలిసి నీ రాక కొరకు ఎదురు చూస్తున్నాను. దేవేంద్రుడు వచ్చి నన్ను స్వర్గలోకమునకు ఆహ్వానించాడు. నేను స్వర్గమునకు వెళ్లవలెనని నిశ్చయించుకున్నాను. కాబట్టి నేను ఆర్జించిన తపోఫలమును నీకు ధారపోస్తాను. నీవు స్వీకరించు.” అని అన్నాడు.
అప్పుడు రాముడు ఆ మహర్షితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! నీ గురించి శరభంగ మహర్షి వలన విని ఉన్నాను. తమరు నాకు ఉండటానికి తగిన ప్రదేశమును నిర్ణయిస్తారని శరభంగ మహర్షి చెప్పాడు.” అని అన్నాడు.
“రామా! ఈ అడవిలో ఈ ప్రాంతము నివాసయోగ్యమైనది. ఇక్కడ ఫలవృక్షములు, పూదోటలు విస్తారముగా ఉన్నాయి. పర్ణశాల నిర్మించుకోడానికి అనువైన చదునైన ప్రదేశము ఉంది. కాబట్టి నీవు పర్ణశాల నిర్మించుకొని ఇక్కడే ఉండవచ్చును. కాని ఈ ప్రదేశమునకు పెద్ద పెద్ద జంతువులు గుంపులు గుంపులుగా వస్తాయి. కాని అవి ఎవరికీ హాని చెయ్యవు. కాసేపు అటూ ఇటూ తిరిగి వెళ్లిపోతాయి. అది తప్ప ఇక్క ఏ విధమైన భయము లేదు. ప్రశాంతంగా ఉంటుంది.” అని అన్నాడు సుతీక్ష మహర్షి.
అప్పుడు రాముడు ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! నాకు మృగముల వలన భయము లేదు. నేను వనవాసిని కాను కదా. క్షత్రియుడను. ఈ ధనుర్బాణములతో మనకు హాని కలిగించు మృగములను చంపగలను. కాని నేను మృగములను చంపడం సహజంగా దయాళువులైన మీకు కష్టం కలిగించవచ్చును. కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ కాలము ఉండలేను అనిపిస్తూ ఉంది.” అని అన్నాడు రాముడు.
తరువాత రాముడు, లక్ష్మణుడు సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించారు. సుతీక్ష మహర్షి రామలక్ష్మణులకు, సీతకు, వారితో వచ్చిన మునులకు ఫలములను ఇచ్చి సత్కరించాడు. ఆ రాత్రికి వారు సుతీక్షుని ఆశ్రమములోనే ఉన్నారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ త్ర్యశీతితమః సర్గ, “భరతవనప్రస్థానమ్”, రామాయణంలో ఒక ప్రాధాన్యభరితమైన భాగం. ఈ సర్గలో భరతుడు తన సైన్యంతో, మంత్రులతో, మరియు ప్రజలతో కలిసి రాముడిని తిరిగి తీసుకురావాలన్న పట్టుదలను చూపిస్తాడు. భరతుడు తన అన్న రాముడిని తిరిగి తెచ్చేందుకు చేసిన ఈ యాత్ర, అతని విధేయతను, ధర్మపరాయణతను, మరియు కుటుంబ ప్రేమను హృదయానికి హత్తుకునేలా చిత్రిస్తుంది.
మరునాడు ఉదయము భరతుడు నిద్ర లేచాడు. ప్రాతఃకాల సంధ్యావందనాదికార్యకమములు నిర్వర్తించాడు. తన రథముఎక్కి బయలుదేరాడు. భరతుని వెంట పురోహితులు, మంత్రులు తమ తమ వాహనములలో బయలుదేరారు.
భరతుని వెనక 9,000 ఏనుగులు, 60,000 రథములు, వాటిలో ధనుస్సులు ధరించిన సైనికులు, ఒక లక్ష మంది ఆశ్విక సైన్యము రక్షణగా బయలుదేరింది. కౌసల్య, కైకేయీ, సుమిత్ర తమ తమ రథములలో భరతుని వెంట రాముని వద్దకు బయలుదేరారు. రాజకుటుంబము వారికి సన్నిహితంగా ఉన్నవారు, వర్తకులుకూడా రాముని వద్దకు బయలుదేరారు. వీరు కాకుండా వివిధ చేతి వృత్తులవారు ఎప్పుడు ఎవరి అవసరము వస్తుందో అని భరతుని వెంట బయలుదేరారు. వారి వెనక వేదములు వల్లిస్తూ బ్రాహ్మణులు ఎడ్లబండ్ల మీద భరతుని అనుసరించారు.
వారందరూ శృంగిభేర పురము దగ్గర ప్రవహించుచున్న గంగానదిని సమీపించారు. భరతుడు అక్కడ ఆగాడు. అమాత్యులను పురోహితులను సైన్యాధ్యక్షులను చూచి ఇలా అన్నాడు.
“ఈ రాత్రికి మనము ఈ గంగానదీ తీరములో విడిది. చేద్దాము. రేపు ఉదయము మన ప్రయాణము కొనసాగిస్తాము. నేను నా తండ్రికి గంగానదిలో జలతరణములు విడుస్తాను. మీరందరూ సేనలతో విశ్రాంతి తీసుకోండి” అని అన్నాడు.
భరతుని ఆదేశము మేరకు అందరూ ఆ రాత్రికి గంగానదీ తీరమున విడిదిచేసారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” చతుర్దశః సర్గలో, రాముడు మరియు మిగిలిన ఇద్దరు పంచవటికి వెళుతుండగా జటాయు అనే శక్తివంతమైన డేగతో పరిచయం ఏర్పడింది. రాముడు దాని గుర్తింపు గురించి ప్రశ్నించినప్పుడు, జటాయు మానవులతో పాటు జంతు జాతుల సృష్టిని వివరిస్తాడు మరియు తాను దశరథ రాజుకు స్నేహితుడని మరియు అజ్ఞాతవాసంలో ఉన్న రాముడికి సహాయం చేయాలనుకుంటున్నానని రాముడికి తెలియజేస్తాడు.
రాముడు సీత, లక్ష్మణులతో సహా పంచవటికి వెళుతున్నాడు. దారిలో వారికి ఒక వటవృక్షము మీద కూర్చుని ఉన్న పెద్ద ఆకారము కల పక్షి కనపడింది. ఆ అరణ్యములో కామరూపులైన రాక్షసులు నివసిస్తుంటారు అని విని ఉన్నాడు. అందుకని ఆ పక్షిని రాక్షసుడిగా తలచాడు రాముడు.
“నీవు ఎవరవు? ఇక్కడ ఎందుకు ఉన్నావు?” అని అడిగాడు రాముడు.
“రామా! నేను నీకు తెలియకపోయినా నీవు నాకు తెలుసు. నీవు దశరథుని కుమారుడైన రాముడివి. నీ తండ్రి దశరథుడు నాకు మంచి మిత్రుడు.” అని అన్నాడు.
తన తండ్రికి మిత్రుడైన వాడు తనకు గౌరవింపతగ్గవాడు అని అనుకొన్నాడు రాముడు. ఆ పక్షికి అభివాదము చేసాడు. ఆ పక్షి రామునితో ఇలా పలికింది.
“రామా! నీకు పూర్వము ఎంతమంది ప్రజాపతులున్నారో వారి గురించి చెబుతాను శ్రద్ధగా విను.
ప్రజాపతులలో ప్రథముడు కర్దముడు. అతని తరువాతి వాడు విక్రీతుడు. ఆ తరువాత శేషుడు. అతని తరువాత సంశ్రయుడు, స్థాణువు, మరీచి, అత్రి, క్రతువు, పులస్యుడు, అంగిరసుడు, ప్రచేతసుడు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు వరుసగా ప్రజాపతులయ్యారు.
ఆఖరి వాడు కశ్యప ప్రజాపతి. ఆయనకు అరిష్టనేమి అనే పేరుకూడా ఉంది. నీకు చెప్పానే దక్షుడు అని, ఆయనకు అరవై మంది కుమార్తెలు. వారిలో అదితి, దితి, దనువు, కాళిక, తామ్ర, క్రోధవశ,మను, అనల అనే ఎనిమింది కన్యలను కశ్యపప్రజాపతి పెళ్లిచేసుకున్నాడు.
కశ్యపుడు తన భార్యలతో “మీరందరూ నాతో సమానమైన ముల్లోకములను పోషించగలిగే పుత్రులను ప్రసవించండి.” అని కోరాడు. వారిలో అదితి, దితి, కాళిక అనే వారు మాత్రము కశ్యపుని మాట మన్నించారు. మిగిలినవారు ఆయన మాటమీద మనసు పెట్టలేదు.
కశ్యపుని కోరిక ప్రకారము అదితికి పన్నెండు మంది ఆదిత్యులు (ద్వాదశాదిత్యులు), ఎనిమిది మంది వసువులను (అష్టవసువులు. అందులో ఆఖరి వసువే శాపకారణంగా గంగాదేవికి భీష్ముడిగా పుట్టాడు. మహాభారత కధకు మూలపురుషుడు అయ్యాడు), పదకొండు మంది రుద్రులు, ఇద్దరు అశ్వినులు, మొత్తం ముప్పది ముగ్గురు దేవతలుపుట్టారు.
కశ్యపునకు దితి యందు దైత్యులు జన్మించారు. వారందరూ ఈ భూమికి అధిపతులయ్యారు. పూర్వము ఈ భూమి అంతా దైత్యుల అధీనంలో ఉండేది.
కశ్యపునకు దనువు అనే భార్య ద్వారా హయగ్రీవుడు అనే పుత్రుడు కలిగాడు. కాళి అనే భార్యకు నరకుడు, కాలకుడు అనే పుత్రులు జన్మించారు. తామ్ర అనే భార్య క్రౌంచి, భాసి, శ్యేని,ధృతరాష్ట్రి, శుకి అనే ఆడపిల్లలకు జన్మనిచ్చింది. (ఇవి అన్నీ పక్షిజాతుల పేర్లు).ఆ తరువాత క్రౌంచికి ఉలూకములు (గుడ్లగూబలు), భాసి అనేకూతురు భాస పక్షులకు జన్మనిచ్చింది. శ్యేని అనే కూతురుకు శ్యేనములు (డేగలు) పుట్టాయి. ధృతరాష్ట్రికి రకరకాలైన హంస జాతులు, చక్రవాక పక్షులు, జన్మించాయి. ఈ ప్రకారంగా పక్షిజాతి అభివృద్ధిచెందింది.
శుకి అనే కూతురుకు నత అనే కుమారుడు కలిగాడు. నతకు వినత అనే కూతురు పుట్టింది. కశ్యపునకు క్రోధవశ అనే భార్య ద్వారా మృగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రువ అనే పదిమింది పుత్రికలు జన్మించారు. (ఇవన్నీ మృగజాతుల పేర్లు). మృగి సంతానము లేళ్లు, దుప్పులు, జింకలు. ఎలుగుబంట్లు, చామరీ మృగములు ఇంకా ఇతర మృగములు మృగమంద సంతానము. హరికి సింహములు, వానరములు పుట్టాయి. (అందుకే సింహమునకు కోతులకు, హరి అనే పేరు వచ్చింది.
భద్రమదకు ఇరావతి అనే కూతురు పుట్టింది. ఇరావతికి ఐరావతము పుట్టింది. మాతంగికి ఏనుగుజాతి జన్మించింది. శార్దూలి అనే కూతురికి పెద్దపులులు, కొండముచ్చులు జన్మించాయి. శ్వేతకు దిగ్గజములు జన్మించాయి.
సురభి రోహిణి, గంధర్వి అనే ఇద్దరు కూతుళ్లకు జన్మనిచ్చింది. రోహిణికి గోవులు, గోసంతతి, గంధర్వికి అశ్వజాతి, సురసకు రెండు తలలు అంతకన్నా ఎక్కువ తలల పాములు, కద్రువకు ఒక్కొక్క పడగ ఉన్న పాములు జన్మించాయి.
మనువుకు మానవులు జన్మించారు. ఆ మానవులు వారి వారి గుణముల బట్టీ చేసే వృత్తులబత్తీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా విభజింపబడ్డారు. అనల మంచి మంచి ఫలములను ఇచ్చు వృక్షజాతికి జన్మనిచ్చింది.
రామా! నీకు పక్షిజాతులకు జన్మనిచ్చిన వినత, నాగులకు జన్మనిచ్చిన కద్రువ గురించి చెబుతాను విను. వినత శుకికి మనుమరాలు. కద్రువ సురసకు సోదరి. కద్రువకు ఆదిశేషుడు కుమారుడుగా పుట్టాడు. వినతకు గరుడుడు, అరుణుడు అనే పుత్రులు జన్మించారు.
(గరుడుడు విష్ణువుకు వాహనము అయ్యాడు. అరుణుడుకి కాళ్లు లేకపోవడం వల్ల సూర్యుని రథమునకు సారథి అయ్యాడు).
ఆ అరుణుడికి ఇద్దరు కుమారులు. నేను, సంపాతి. నా పేరు జటాయువు. నేను శ్యేని జాతికి చెందిన వాడిని. ఇదీ నా జన్మ వృత్తాంతము.
(అవకాశము వస్తే చాలు, పూర్వకాలపు కవులు కొత్త కొత్త విషయాలను ఆయాపాత్రల ద్వారా మనకు తెలియజేస్తారు. వాల్మీకి ఇక్కడ ఎన్నో కొత్త విషయాలు మనకు చెప్పాడు. ఈభూమి మీద మనుషులు, జంతువులు, పక్షులు, వృక్షములు ఎలా పుట్టాయి, వాటి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి అనే విషయాలను వివరంగా చెప్పాడు.)
రామా! ఈ వనమంతా నాకు బాగాతెలుసు. నీకు ఇష్టం అయితే నేను నీకు ఏదైనా సాయం కావలిస్తే చేస్తాను. నీకు సహాయకుడుగా ఉంటాను. ఈ అడవిలో అనేక క్రూర మృగములు, నరమాంసభక్షకులైన రాక్షసులు ఉన్నారు. నీవు కోరితే మీరు ఇంట లేనపుడు సీత రక్షణ బాధ్యతను నేను వహిస్తాను.” అని అన్నాడు.
జటాయువు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు రాముడు. జటాయువును చూచి తన తండ్రిని గుర్తుకు తెచ్చుకున్నాడు. తండ్రికి మారుగా జటాయువును పూజించాడు రాముడు. తరువాత జటాయువు పంచవటికి మార్గం చూపించాడు. జటాయువుతో కలిసి రాముడు, లక్ష్మణుడు సీతతో సహా పంచవటికి వెళ్లాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ షష్ఠః సర్గం రామాయణంలో కీలకమైన భాగం. ఈ సర్గలో రాముడు, సీత, లక్ష్మణులు పంచవటిలో నివసిస్తారు. అక్కడ సుర్పణఖ తన సోదరులైన ఖర, దూషణలను రాముని మీద దాడి చేయమని ప్రేరేపిస్తుంది. ఖర, దూషణలు తమ దళాలతో రాముడిపై దాడి చేస్తారు. రాముడు ధైర్యంగా యుద్ధం చేసి, ఖర, దూషణలను వధిస్తాడు.
ఆ ప్రకారంగా శరభంగ మహర్షి బ్రహ్మలోకము చేరుకున్నాడు. తరువాత ఆ వనములో నివసించుచున్న మునులు, ఋషులు అందరూ రాముని వద్దకు వచ్చారు. ఆ వచ్చిన వారిలో వైఖానసులు, వాలఖిల్యులు, సంప్రక్షాలులు, మరీచులు, మొదలగు మహాఋషులు అక్కడకు వచ్చారు. వారందరూ రాముని ఇలా అన్నాడు.
“ఓ రామా! నీవు ఇక్ష్వాకు వంశములో శ్రేష్ఠుడవు. దేవేంద్రుడు స్వర్గ లోకమును పాలించినట్టు నీవు ఈ భూమిని పాలిస్తున్నావు. నీవు సత్యమునే పలుకుతావు. అమితమైన పరాక్రమ వంతుడవు. పితృవాక్య పరిపాలన నీ ప్రధానధర్మము. నీకు తెలియని ధర్మము లేదు. అందుకని మీతో మా బాధలను చెప్పుకో దలిచాము. నీవు ఏమీ అనుకోవద్దు.
రాజధర్మము గురించి నీకు చెప్ప పనిలేదు. రాజు తన ప్రజల నుండి ఆరవ వంతు ఆదాయమును పన్నుగా తీసుకొని, దానికి ప్రతిగా ప్రజలకు అన్ని సౌకర్యములు కలిగించాలి. ప్రజలను రక్షించాలి. ఇదీ రాజధర్మము. తన పాలనలో ఉన్న ప్రజలందరినీ కన్న బిడ్డలవలె రక్షించే రాజు చిరకాలము రాజ్యము చేస్తాడు. మరణానంతరము అటువంటి రాజుకు బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. మేము మునులము. తాపసులము. మేము రాజుకు పన్నురూపంలో ఏమీ ఇచ్చుకోలేము. కాని మేము చేసే తపస్సులో నాలుగవ వంతు ఫలము రాజుకు దక్కుతుంది. కాబట్టి మమ్ములను రక్షించే బాధ్యత రాజువైన నీ మీద ఉన్నది.
ప్రస్తుతము మేము నివసించుచున్న ఈముని ఆశ్రమములన్నీ నీ పాలనలో ఉన్నాయి. నీ పాలనలో ఉండి కూడా మేము | అభద్రతా భావంతో బతుకుతున్నాము. మాకు ఎలాంటి రక్షణ, భద్రత లేదు. ఈ అరణ్యములో రాక్షసులు ఎక్కువగా ఉన్నారు. వారు ఎంతో మంది మునులను చంపారు. మాకు ఎన్నో బాధలను కలిగిస్తున్నారు. రామా! మాతో రా! ఆ చనిపోయిన మునుల శవములను మీకు చూపిస్తాము.
ఈ రాక్షసులు మందాకినీ నదీ ప్రాంతములోనూ, చిత్రకూట పర్వతప్రాంతములోనూ, పంపానదీ ప్రాంతములోనూ ఎక్కువగా తిరుగుతున్నారు. ఆ యా ప్రాంతములలో నివసించే మునులను చంపుతున్నారు. వారు పెట్టే బాధలకు అంతు లేదు. ఆ రాక్షసులు చేసే వినాశనమును ఇంక ఎంతమాత్రము మేము సహించలేకపోతున్నాము. నీవే మమ్ములను రక్షించాలి. మేమంతా నీ రక్షణ కోరుతున్నాము. ఆ రాక్షసుల చేతిలో మేము చావకుండా మమ్ములను కాపాడు రామా! ఎందుకంటే నిన్ను మించిన వీరుడు ఈ లోకంలో లేడు అని మా నమ్మకము. నీవే ఈ రాక్షస సంహారమునకు సమర్థుడవు.” అని పలువిధములుగా తమ బాధలు రామునితో విన్నవించుకున్నారు.
రాముడు ఆ మునుల మాటలను శ్రద్ధగా విన్నాడు. తరువాత రాముడు ఆ మునులకు నమస్కరించి ఇలా అన్నాడు.
“ఓ మహామునులారా! మీరు ఇంత దీనంగా నన్ను ప్రార్థించడం తగదు. మీరు నన్ను ఆజ్ఞాపించాలి కాని అర్థించకూడదు. మిమ్మల్ని రక్షించే అవకాశము నాకు కల్పించినందులకు నేనే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ రాక్షసులు పెట్టే బాధల గురించి నేను వింటూనే ఉన్నాను. మీ బాధలు తీర్చడం రాజుగా నా కర్తవ్యం. బాధ్యత. అందుకే మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము నేను ఈ అరణ్యములో ప్రవేశించాను. రాక్షస సంహారంతో నా వనవాసమునకు గొప్ప ఫలము లభిస్తుంది. మీరింక నిర్ణయంగా తపస్సు చేసుకోండి. మీ రక్షణ బాధ్యత నేను వహిస్తాను.” అని రాముడు ఆ మునులకు అభయము ఇచ్చాడు.
తరువాత రాముడు, సీతతో, లక్ష్మణునితో కలిసి సుతీక్షుని ఆశ్రమమునకు వెళ్లాడు. రాముని వెంట కొంతమంది మునులు అనుసరించారు.
అయోధ్యా కాండ సర్గ 57 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. గంగానదిని దాటడానికి రాముడు, సీత, లక్ష్మణుడు నావ ఎక్కిన తరువాత నావ గంగానదిలో సాగిపోయింది. తరువాత సుమంత్రుడు, గుహుడు చాలాసేపు రాముని వనవాసము గురించి మాట్లాడుకున్నారు. తరువాత సుమంత్రుడు రథము తోలుకుంటూ అయోధ్యకు వెళ్లాడు. గుహుడు తన మనుషులద్వారా రాముడు భరద్వాజ ఆశ్రమము చేరుకున్నాడని తెలుసుకున్నాడు.
గంగానదిని దాటడానికి రాముడు, సీత, లక్ష్మణుడు నావ ఎక్కిన తరువాత నావ గంగానదిలో సాగిపోయింది. తరువాత సుమంత్రుడు, గుహుడు చాలాసేపు రాముని వనవాసము గురించి మాట్లాడుకున్నారు. తరువాత సుమంత్రుడు రథము తోలుకుంటూ అయోధ్యకు వెళ్లాడు. గుహుడు తన మనుషులద్వారా రాముడు భరద్వాజ ఆశ్రమము చేరుకున్నాడని తెలుసుకున్నాడు.
సుమంత్రుడు తన రథమును అయోధ్యవైపు తీసుకొని వెళుతున్నాడు. మూడవ రోజు సాయంత్రానికి సుమంత్రుడు అయోధ్యకు చేరుకున్నాడు. అయోధ్య అంతా అంధకార బంధురంగా ఉంది. ఎవరి ఇంట్లోనూ దీపాలు వెలగటం లేదు. ఎప్పుడూ ఆనందోత్సాహాలతో కళకళలాడే అయోధ్య రాముని వియోగంతో విలవిలలాడిపోతోంది అని బాధపడ్డాడు సుమంత్రుడు. సుమంత్రుడు నగరప్రవేశము చేసాడు.
రాముని రథము చూచి పౌరులు గుంపులు గుంపులుగా సుమంత్రుని వెంట బడ్డారు. “రాముడు ఎక్కడ? రాముని ఎక్కడ వదిలి వచ్చావు?” అని ప్రశ్నల వర్షము కురిపిస్తున్నారు. సుమంత్రుడు రథము ఆపి వారితో ఇలా అన్నాడు. “నేనురాముని గంగానదిని దాటించి వచ్చాను. రాముని వద్దనుండి ఆజ్ఞతీసుకొని వచ్చాను.” అని బాధతో చెప్పాడు సుమంత్రుడు.
“రాముడు వనవాసమునకు వెళ్లిపోయాడా. రాముడు ఇంకమాకు కనపడడా” అనుకుంటూ వారు ఎవరి దారిన వారు వెళ్లారు.సుమంత్రుడు దశరథుని అంతఃపురమునకు వెళ్లాడు. అంత:పురములోని స్త్రీలు, రాముడు లేకుండా వంటరిగా వచ్చిన సుమంత్రుని చూచి విలపించారు. సుమంత్రుని చూచి దశరథుని భార్యలు తమలో తాము ఇలా అనుకుంటున్నారు.
“సుమంత్రుని చూచిన కౌసల్య “నా రాముడు ఏడీ” అనిఅడిగితే కౌపల్యకు ఏమి సమాధానము చెబుతాడు. కొడుకు కోడలు తనను విడిచి పెట్టి పోయినా కూడా కౌసల్య ఇంకా జీవించి ఉంటుందా! ఏమో ఆమె బతకడం చాలా కష్టము. ఏం జరుగుతుందో ఏమో!” అని తమలో తాము ఆందోళన చెందుతున్నారు.
ఆ మాటలన్నీవింటూ సుమంత్రుడు దశరథుని మందిరము వైపు వెళుతున్నాడు. సుమంత్రుడు దశరథుని చూచి రాముడు తనతో చెప్పమన్న మాటలు యథాతథంగా వినిపించాడు. రాముని మాటలు విన్న దశరథుడు మూర్ఛపోయాడు. అంతలో అంతఃపుర స్త్రీలు అందరూవచ్చి ఆయనకు ఉపచారములు చేసారు. ఇంతలో కౌసల్యసుమిత్ర అక్కడకు వచ్చారు. దశరథుని పట్టుకొని లేవదీసారు.
దశరథునితో కౌసల్య ఇలాఅంది.”మహారాజా! రాముని అడవిలో వదిలిపెట్టి రామసందేశమును తీసుకొని వచ్చిన సుమంత్రునితో మాట్లాడవేమి. మహారాజా! చెయ్యవలసినది అంతా చేసి ఇప్పుడు మాట్లాడ కుండా మౌనంగా ఉ ంటావెందుకు. ఎలాగైనా నీ మాట నిలబెట్టుకున్నావు. ఆడి తప్పని వాడివని పేరు ప్రతిష్ఠలు గడించావు. సత్యవాక్పరిపాలకుడవై పుణ్యం సంపాదించుకున్నావు. అది చాలులెండి. ఇక్కడ కైక లేదులెండి.
మీరు భయపడనవసరం లేదు. నిర్భయంగా సుమంత్రునిలో మాట్లా డ వచ్చును.” అని కౌసల్య పలికి ఆమెకు దుఃఖము ముంచుకురాగా కిందపడిపోయింది. కిందపడిపోయిన దశరథుని, కౌసల్యను చూచి దశరథుని భార్యలు ఏడుస్తున్నారు. వారి దుఃఖానికి అంతులేదు.
అయోధ్యాకాండ ఏకోనాశీతితమః సర్గములో, భరతుడు చిత్తతో రాముడిని అనుసరించి అరణ్యానికి చేరుకున్నాడు. అతని వెంట సుమంతుడు, వశిష్టుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి తదితరులు ఉన్నారు. రాముడు తన తల్లి కౌసల్యను పలకరించి ఆశీర్వాదం అందుకున్నాడు. భరతుడు రాముని పాదాలను తాకి అయోధ్యకు తిరిగి రావాలని వేడుకున్నాడు. రాముడు తన పాదుకలను భరతునికి సమర్పించి, అవి ఆయుధాలుగా రాజ్యం పరిపాలించమని ఆదేశించాడు. భరతుడు పాదుకలను తీసుకొని, రాముడి ఆజ్ఞ ప్రకారం నందిగ్రామంలో ఉంటూ, రాముడి ప్రతినిధిగా రాజ్యపాలన చేయడానికి తిరిగి వెళ్ళాడు. భరతుడి త్యాగం, భక్తి, సోదర ప్రేమ ఈ సర్గలో స్పష్టంగా దర్శనమిస్తుంది.
పదమూడవ రోజు అలాగడిచిపోయింది. పదునాలుగవ రోజున మంత్రులు పురోహితులు భరతుని వద్దకు వెళ్లారు. “కుమారా! భరతా! మన మహారాజు గారు మృతిచెందారు. పెద్దకుమారుడైన రాముడు తండ్రిమాట ప్రకారము అడవులకు వెళ్లాడు. ప్రస్తుతము అయోధ్యకు రాజు లేడు. రాజు లేని రాజ్యములో అరాచకము చెలరేగుతుంది. అయోధ్య ప్రజలు ధర్మపరులు అందుకని అటువంటి ఉ పద్రవము చెలరేగలేదు. పట్టాభిషేకమునకు నీవు ఆలస్యము చేస్తే, దేశంలో అరాచకము చెలరేగే ప్రమాదము ఉంది. రాజప్రముఖులు, పురప్రముఖులూ పురోహితులూ పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు చేసుకొని నీ అనుమతి కోసరం ఎదురు చూస్తున్నారు. వంశపారపర్యముగా నీవే అయోధ్యకు మహారాజువు. కాబట్టి నీవు అయోధ్యకు రాజ్యాభిషిక్తుడవై మమ్ములను పాలించు.”అని అన్నాడు.
భరతుడు ఆలోచించాడు. వారితో ఇలా అన్నాడు. “మీకందరికీ రాజధర్మము బాగా తెలుసు. రాచరిక వ్యవస్థలో రాచకుటుంబము లోని పెద్దవాడు రాజ్యమునకు అర్హుడు. మహారాజు కుమారులలో పెద్దవాడు రాముడు. అందుకని రాముడే రాజ్యమునకు అర్హుడు. నేను కాదు. నన్ను పట్టాభిషేకము చేసుకోమనడం యుక్తము కాదు. కాబట్టి, రాముని రాజ్యాభిషిక్తుని చేద్దాము. రాముని బదులు నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము చేస్తాను. అందుకని చతురంగ బలములు సిద్ధం చేయండి.
వెంటనే నేను రాముని ఉన్నచోటికి వెళ్లి ఆయనను ఒప్పించి అయోధ్యకు తీసుకొని వస్తాను. లేకపోతే రామునికి అక్కడే పట్టాభిషేకము జరిపించి అయోధ్యాధి పతిగా ఆయనను అయోధ్యకు తీసుకొని వస్తాను. ఎట్టి పరిస్థితులలో కూడా నా తల్లి కైక కోరిక తీరడానికి వీలులేదు. మా తల్లి కోరికకు భిన్నంగా జరగాలి. రాముడు రాజుకావాలి. నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము చెయ్యాలి. కాబట్టి మన ప్రయాణమునకు తగిన ఏర్పాట్లు చేయండి.” అని ఆదేశించాడు భరతుడ ఆయన మాటలకు అందరూ సంతోషంతో అంగీకరించారు. రాముని మీద భరతునికి ఉన్న అనురాగానికి, భక్తికి, అక్కడ ఉన్న వారికండ్ల వెంట ఆనందభాష్పాలు రాలాయి. “భరత కుమారా! తమరి ఆజ్ఞ ప్రకారము తమరి ప్రయాణమునకు అన్ని ఏర్పాట్లు చేస్తాము.” అని అన్నారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” త్రయోదశః సర్గలో, అజ్ఞాతవాసంలో ఉన్న రోజుల్లో నివాసం చేసుకోవడానికి అడవిలో ఒక స్థలాన్ని సూచించమని రాముడు అగస్త్య మహర్షిని అభ్యర్థిస్తాడు. అగస్త్య మహర్షి రామాయణం యొక్క తదుపరి కోర్సును ఊహించాడు మరియు స్త్రీత్వం మరియు సీత చుట్టూ తన సంభాషణను నడిపించాడు. అప్పుడు ఆ ఋషి పంచవటికి వెళ్లమని రాముడికి తెలియజేస్తాడు, అక్కడ సీత తన పరిసరాలను చూసి ముచ్చటగా ఉంటుంది.
పంచవటీగమనమ్
రామ ప్రీతోఽస్మి భద్రం తే పరితుష్టోఽస్మి లక్ష్మణ |
అభివాదయితుం యన్మాం ప్రాప్తౌ స్థః సహ సీతయా ||
అగస్యుడు రామునికి ఆయుధములను ఇచ్చిన తరువాత ఇలా అన్నాడు.
“ఓ రామా! మీరు నన్ను చూడటానికి ఇంత దూరము వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా దూరము ప్రయాణము చేసి వచ్చారు. సుకుమారి అయిన సీత బాగా అలసి పోయినట్టు కనపడుతూ ఉంది. తండ్రి ఆదేశము ప్రకారము వనములకు వచ్చిన నీతో పాటు అనుసరించి వచ్చిన నీభార్య సీత ఇప్పటికి ఎవ్వరూ చేయని మహత్తరమైన పని చేసింది. కాబట్టి ఆమె కష్టపడకుండా చూడవలసిన బాధ్యత నీది.
సాధారణంగా స్త్రీలు సుఖములలో భర్తను వదలకుండా అంటిపెట్టుకొని ఉంటారు. కష్టకాలములో భర్తను వదిలివేస్తారు. ఈ సృష్టి మొదలైనప్పటి నుండి అది స్త్రీ నైజము. ఇంకా స్త్రీల గురించి చెప్పాలంటే వారు మెరుపుల మాదిరి చంచల స్వభావులు. వాడియైన కత్తి మాదిరి చాలా తీక్షణంగా ఉంటారు. గరుడుని మాదిరి వేగంగా ఆలోచిస్తారు.
కానీ నీ భార్య సీతలో ఈ దోషములు ఏవీ లేవు. సీత శాంత స్వభావురాలు. ఉత్తమ పతివ్రత. అందుకే నిన్ను అనుసరించి అడవులకు వచ్చి నీతోపాటు కష్టములు పడుతూ ఉంది. ఓ రామా! నీవు, సీత, లక్ష్మణుడు ఎక్కడ ఉంటారో అక్కడ సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.” అని వారిని శ్లాఘించాడు అగస్త్యుడు.
అగస్యుడు పలికిన మాటలు విన్న రాముడు వినయంగా ఇలా అన్నాడు. “నా గురించి, నా భార్య గురించి, నా తమ్ముని గురించి తమరు నాలుగు మంచి మాటలు చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అనుగ్రహానికి పాత్రుడను అయ్యాను. నేను ఈ అడవిలో ఒక పర్ణశాల నిర్మించుకొని అక్కడ నా వనవాస కాలమును గడపదలచుకున్నాను. దానికి అనువైన ప్రదేశమును మీరు సూచించండి.” అని అడిగాడు రాముడు.
“రామా! ఇక్కడికి రెండు యోజనముల దూరంలో పంచవటి అనే ప్రదేశము ఉంది. అక్కడ ఫలములు, కందమూలములు, నిర్మలమైన జలము సమృద్ధిగా లభిస్తుంది. నీవు పంచవటిలో ఒక ఆశ్రమమును నిర్మించుకొని అక్కడ నీ వనవాసకాలమును గడపవచ్చును. నీకు ఇప్పటికే వనవాసకాలము చాలావరకు గడిచిపోయింది. కొద్దికాలము మాత్రమే మిగిలి ఉంది. ఆ కొద్ది కాలము కూడా పూర్తి చేసి, నీవు నీ తండ్రిమాట నిలబెట్టు. ఆయనను తరింపజెయ్యి.
అసలు నిన్ను ఇక్కడే ఉందామనుకున్నాను. కాని ఒంటరిగా ఉండాలి అన్న నీ మనసులో మాట తెలుసుకొని నిన్ను పంచవటికి పంపుతున్నాను. పంచవటి ఇక్కడకు ఎంతో దూరంలో లేదు. కాబట్టి నీవు ఇక్కడ ఉన్నట్టే పంచవటిలో ఉండవచ్చును. పంచవటి సమీపములో గోదావరీ నది ప్రవహిస్తూ ఉంది. అక్కడ జనసంచారము అంతగా ఉండదు. నీవు ప్రశాంతముగా అక్కడ ఉండవచ్చును.
అటు చూడు. అక్కడ ఒక మధూక చెట్ల వనము కనపడుతూ ఉంది. ఆ మధూక వనమునకు ఉత్తరంగా వెళ్లండి. మీరు ఒక ఎత్తు అయిన ప్రదేశము చేరుకుంటారు. అక్కడి నుండి చూస్తే మీకు పంచవటి కనిపిస్తూ ఉంటుంది.” అని పంచవటికి పోవు మార్గము చెప్పాడు అగస్త్యుడు.
రామలక్ష్మణులు, సీత అగస్త్యునికి నమస్కరించి ఆయన వద్ద అనుజ్ఞ తీసుకున్నారు. అక్కడి నుండి పంచవటికి బయలుదేరారు.
మనలను రక్షించే మాధవుడు వచ్చేనందును మన గతి యేమందు
ప్రభు దశరథునే బతిమాలుదుగద కైకేయిని నే గాదనందుగద
రామునికైన రాజ్యమిత్తుగద ప్రభవయి యేలగ నేనొనర్తు గద
అడవికి బోవ నంటిపోదుగద గుహునితో గూడుక కూడి మురియుదుగద
॥ఆశ॥
నిల్చి దానవుల నెత్తి గొట్టుదుగద కరయుద్ధంబున గౌగలింతుగద
కనకమృగమును రామకాంత తెమ్మంటె ఓ నిర్దయులార అయ్యోనే పోయి
ఆ మృగమును దెచ్చి అమ్మకిత్తుగద హరిని నేనుపోవదందునుగద
ఈ మృగమువెంట, దశముఖు డంతట తపోవేషమున
దశముఖు తన శౌర్యముజూపగ జానకి వణకగ ఆ రావణుడు సీతమ్మను చెరపట్టగ
అప్పుడు నేనుంటే అమ్మ కభయ మిత్తును
॥ఆశ॥
ఆ శ్రీపాదములునట్టే పట్టుకనే మ్రొక్కుదును
హరి దుఃఖింపగ అమ్మడ దెత్తును
సర్వజ్ఞమూర్తి చాలు నీ విరహమందును
విశ్వములో నందరు విన నట్లూరకుండిరీ
సురవరులందరు సుఖంబుగ జూచుచుండిరి.
అయ్యో యిదేమని ఆ బ్రహ్మాదుల శపింతునుగద
॥ఆశ॥
మిత్రవంశునకు నేనేమి చేయుదు నేనెవ్వరివేడుదు
ఏమరియుండిరీ మానినులందరు ఏలపోయెనో యాక్షీరాబ్ధికి
ఏల దశరథుడు యజ్ఞము చేసెను ఎందుకు బుట్టిరియీ లోకమునను
ఎందుకు వచ్చిరి యీవనమునకును ఇట్టి వరములనేలవేడిరి
ఎక్కడ నోపుదు యింతటి జాలి