మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ దశమ సర్గలో, శ్రీరాముడు, సీతమ్మ మరియు లక్ష్మణులు తమ కష్టాలకు పరిష్కారం కోసం రుషి శరభంగుడి ఆశ్రమానికి వెళతారు. రాముడు శరభంగుడి ఆశీస్సులతో సుఖంగా గడుపుతాడు. శరభంగుడు తన చివరి క్షణాల్లో రామునికి పుణ్యాలను వివరించి, దివ్య లోకాలకు వెళ్ళడానికి సిద్ధమవుతాడు.
తన భార్య సీత చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు రాముడు. సీతతో ఇలా అన్నాడు.“ఓ జనకరాజపుత్రీ! సీతా! నీకు అన్ని ధర్మాలూ తెలుసు. నీవు పలికిన పలుకులు నీ సాత్విక ప్రవృత్తికి తగినట్టుగానూ, ధర్మబద్ధంగానూ, యుక్తియుక్తంగానూ ఉన్నాయి.
దీనులను రక్షించడానికే క్షత్రియులు ఆయుధములు చేపడతారని నీవే చెప్పావు కదా! ఈ దండకారణ్యములో ఎంతో మంది మునులు ఉన్నారు. వారికి తపస్సు తప్ప వేరొక పని లేదు. వారందరూ పూజనీయులు. గౌరవింపతగ్గవారు. అటువంటి వారిని రాక్షసులు అనేక రకాలుగా బాధలు పెడుతున్నారు. చంపుతున్నారు. ఆ పరిస్థితులలో ఆ మునులు తమ బాధలనుండి రక్షించమని నన్ను శరణుకోరారు.
ఆ మునులు ఎవరికీ అపకారముచెయ్యరు. దొరికిన కందమూలములు, ఫలములు తిని తపస్సు చేసుకుంటున్నారు. అటువంటి వారికి ఈ రాక్షసుల వలన శాంతి, సుఖము లేకుండా పోయాయి. నరమాంస భక్షకులైన రాక్షసులు ఎప్పుడు ఎవరిని చంపుతారో అని భయంతో వణికిపోతున్నారు. వారందరూ రాక్షసుల బారినుండి తమను కాపాడమని నన్ను అర్ధించారు.
ఒక క్షత్రియుడుగా, ఒక రాజుగా నేనే వారి వద్దకుపోయి, “మీకు నేను ఏమి సేవ చేయాలి” అని అడగడం పోయి, వారే నా
దగ్గరకు వచ్చి తమను కాపాడమని నన్ను అర్థించారు. అందుకు ఒక రాజుగా నేను సిగ్గుపడాలి. నేను వారిని “నేను మీకు ఏమిసేవ చేయగలను” అని అడిగినప్పుడు వారు చెప్పిన మాటలను నీకు చెబుతున్నాను.
“రామా! ఈ దండకారణ్యములో కామరూపులైన రాక్షసులు స్థావరములు ఏర్పరచుకొని ఉన్నారు. వారు నరమాంసభక్షకులు. మేము హోమాలు, యాగాలు చేస్తుంటే వాటిని పాడుచేస్తున్నారు. అదేమని అడిగితే చంపుతున్నారు. మా తపోబలముచేత వారిని మేము ఎదుర్కోగలము, చంపగలము. కాని ఎంతో కష్టపడి ఆర్జించిన మా తపోమహిమలను ఈ నీచుల కోసరం వెచ్చించడం మాకు ఇష్టం లేదు. అందుచేత, ఆ రాక్షసులు మమ్ములను ఎన్ని బాధలు పెడుతున్నా, మా యజ్ఞులు పాడుచేస్తున్నా, మమ్ములను చంపుతున్నా, భరిస్తున్నాము, సహిస్తున్నాము. ఇప్పుడు నీవు వచ్చావు కాబట్టి, నిన్ను అర్ధిస్తున్నాము. ఈ ప్రాంతము నీరాజ్యములో ఉన్నది కాబట్టి నీవే మాకు రక్షకుడవు.”
సీతా! ఈ ప్రకారంగా వారు నాతో పలికిన పలుకులు విని నేను ఊరుకోలేకపోయాను. వారికి అపకారము చేస్తున్న రాక్షసులను సంహరిస్తానని వారికి మాట ఇచ్చాను. ఆ మాట నెరవేర్చడం క్షత్రియునిగా నా కర్తవ్యం. నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకూ వారికి ఇచ్చిన మాటను నెరవేర్చడానికే ప్రయత్నిస్తాను. అవసరం అయితే మీ అందరినీ, నా ప్రాణాలను సైతం విడిచిపెడతాను కానీ ఆ బ్రాహ్మణులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తాను. ఇదే నా నిశ్చయము. ఒక క్షత్రియునిగా, ఒక రాజుగా, వారు అడగకపోయినా, నేను వారి కష్టాలు తీర్చాలి. వారికి రక్షణ కల్పించాలి. వారే అడిగినప్పుడు ఇంక వేరుచెప్పాలా!
ఓ సీతా! నీకు తగినట్టు నీవు చెప్పావు. అందులో తప్పులేదు. నిన్ను నేను నా ప్రాణముల కంటే ఎక్కువగా ప్రేమిస్తాను. మునులకు ఇచ్చిన మాటనుకూడా నెరవేరుస్తాను.” అని అన్నాడు రాముడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” అష్టాదశః సర్గలో, రాముడు శూర్పణఖ తన వైపుకు వెళ్లడాన్ని అడ్డుకుంటాడు మరియు బదులుగా లక్ష్మణుడిని వెతకమని కోరతాడు. లక్ష్మణుడు ఆమెను తన మాటల్లోనే తిప్పికొట్టడంలో పదజాలాన్ని ఉపయోగిస్తాడు. కానీ ఆమె లక్ష్మణుడి మాటల అర్థాన్ని గ్రహించి సీతను తినడానికి పరుగెత్తుతుంది. లక్ష్మణుడు ఆమెను అపవిత్రం చేస్తాడు మరియు ఆమె అక్కడ నుండి శబ్దంతో పారిపోతుంది, హింసాత్మక రాక్షసుడైన తన సోదరుడు ఖరాకు నివేదించడానికి మాత్రమే. ఇది రాముడు మరియు రామాయణానికి మరో రౌండ్ ఇబ్బందులను ప్రేరేపించే పరిస్థితి.
కామంతో కాలిపోతున్న శూర్పణఖను చూచాడు. రాముడు. చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. “ఓ సుందరీ! నీవు నన్ను పెళ్లిచేసు కుంటాను అన్నావు. కాని నాకు ఇదివరకే పెళ్లి అయింది. ఈమే నా భార్య. ఈమె అంటే నాకు ప్రాణము. నీవు మళ్లీ నన్ను పెళ్లిచేసుకుంటే నీకు సవతి పోరు తప్పదు. నాతో కోరికలు తీర్చుకోవాలి అని గాఢంగా కోరుకున్న నీకు సవతి పోరు ఉండటం నీవు సహించగలవా! నీవంటి కాముకులు సవతి పోరు అస్సలు సహించలేరు.
అడుగో అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన నా తమ్ముడు లక్ష్మణుడు. మంచి అందగాడు.
(ఇక్కడ వాల్మీకి ‘అకృతదారశ్చ’ అని వాడాడు. దీనికి అర్థం పెళ్లికానివాడు, అనీ, భార్య దగ్గరలేని వాడు అనీ అర్థం చెప్పుకోవచ్చు. పెళ్లికాని వాడు అంటే రాముడు అబద్ధం చెప్పినట్టు అవుతుంది కదా! అందుకని ఒంటరి వాడు. భార్య దగ్గర లేని వాడు అని అర్థం చెప్పుకోవడం సమంజసంగా ఉంటుంది అని నా భావన)
పాపం అతనికి భార్యాసౌఖ్యము లేదు. ప్రస్తుతము అతనికి భార్య అవసరము ఉంది. కాబట్టి అతడు నీకు తగిన భర్త. పైగా నీవు అతనిని పెళ్లిచేసుకుంటే నీకు సవతి బాధ ఉండదు. కాబట్టి నన్ను విడిచిపెట్టి అతని వద్దకు పో!” అని అన్నాడు రాముడు.
ఇద్దరూ అందగాళ్లే. ఎవరైనా ఒకటే అనుకుంటూ శూర్పణఖ లక్ష్మణుని వద్దకు వెళ్లింది. శూర్పణఖ మొదట రాముని వద్దకు పోవడం, ఆయనతో మాట్లాడటం, తరువాత తన వద్దకు రావడం చూస్తున్నాడు లక్ష్మణుడు. శూర్పణఖ చకా చకా లక్ష్మణుని వద్దకు వెళ్లింది.
“ఓ సుందరాకారా! నా పేరు శూర్పణఖ. నన్ను వివాహం చేసుకుంటే నీకు అమర సుఖాలు అందిస్తాను. ఈ వనసీమలలో మనం హాయిగా విహరిద్దాము. రా! నాతోరా!” అని తొందరపెట్టింది శూర్పణఖ.
లక్ష్మణుడు ఆమెను చూచి ఇలా అన్నాడు. “ఓ లలనా! నేను నా అన్న రామునికి సేవకుడను. నా అన్నకు వదినకు దాసుడను. నేనే వారికి సేవలు చేస్తుంటే, నువ్వు కూడా నన్ను పెళ్లిచేసుకొని వారికి సేవలుచేస్తావా! ఎవరైనా రాణి కావాలని కోరుకుంటారు కానీ సేవకురాలు కావాలని కోరుకుంటారా చెప్పు. కాబట్టి నేను నీకు తగినవాడను కాను. నీవు రాముని వద్దకు వెళ్లు. ఆయనకు చిన్నభార్యగా ఉన్నా, ఆనందం అనుభవిస్తావు. అప్పుడు నేనేనీకు సేవలు చేస్తాను.
రాముని భార్యను చూడు. ఎంత అందవికారంగా ఉందో! పైగా ముసలిది. పొట్టలోపలికి పోయి ఎంత వికృతంగా ఉందో చూడు! ఇంకొక్కసారి అడిగావనుకో రాముడు తన అందవికారి అయిన భార్యను విడిచి నిన్నే పెళ్లాడతాడు. రామునితో అమర సుఖాలు అనుభవించు. అయినా లోకోత్తర సుందరి అయిన నిన్ను వదిలి బుద్ధి ఉన్నవాడు ఎవరైనా ఆ మనుష్యకాంతను కోరుకుంటారా చెప్పు! కాబట్టి వెంటనే రాముని వద్దకు వెళ్లు. నీ మంచికోరి చెబుతున్నాను. విను.” అని బంతిని తిరిగి రాముని వద్దకు నెట్టాడు.
లక్ష్మణుడు తనను ఆట పట్టిస్తున్నాడు అని దాని మట్టి బుర్రకు తోచలేదు. ఇదేదో బాగానే ఉందనుకొని, శూర్పణఖ తిరిగి రాముని వద్దకు పోయింది.
“రామా! నన్ను చూడు. నీ భార్యను చూడు. నేను లోకోత్తర సౌందర్యవతిని. నీ భార్య కురూపి. పైగా ముసలిది. దానితో ఏం సుఖపడతావు. నాతో రా. నన్ను పెళ్లిచేసుకో. నీకు అమరసుఖాలు రుచి చూపిస్తాను.
(సీతను చూపిస్తూ) ఈ అందవికారిని చూచా నన్ను వద్దంటున్నావు. ఇది ఉండబట్టి కదా నువ్వు నన్ను కాదంటున్నావు. చూస్తూ ఉండు. ఇప్పుడే దీనిని కరా కరా నమిలి తింటాను. అప్పుడు నాకు సవతి పోరు ఉండదుగా! రా రామా! మనం హాయిగా పెళ్లిచేసుకొని సుఖిద్దాము.” అని రాముని బలవంతం చేసింది. శూర్పణఖ. సీతను చంపడానికి ఆమె మీదికి వెళ్లింది. వెంటనే రాముడు శూర్పణఖను అడ్డుకున్నాడు. పక్కకు నెట్టాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.
“లక్ష్మణా! ఇలాంటి దుష్టులతోనా నీ పరిహాసాలు. ఇప్పుడు చూడు ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. లేకపోతే ఈ దుష్టురాలు సీతను చంపి ఉండేది. సీత చూడు భయంతో ఎలా వణికిపోతూ ఉందో! లక్ష్మణా! దీనికి దీని అందం చూచుకొని గర్వం. ఆ గర్వం పోగొట్టు. దీనిని అంగవిహీనురాలిగా, అందవిహీనురాలిని చెయ్యి. లేకపోతే ఇది సీతను చంపుతుంది.” అని అన్నాడు రాముడు.
అప్పుడు లక్ష్మణుడు కత్తి తీసుకొని శూర్పణఖ ముక్కు చెవులు కోసి అంగవిహీనురాలిని, అందవిహీనురాలిని చేసాడు లక్ష్మణుడు. హటాత్తుగా జరిగిన ఈ పరిణామానికి తట్టుకోలేకపోయింది శూర్పణఖ. పైగా తెగి పడిన ముక్కు, చెవుల నుండి రక్తం ధారాపాతంగా కారుతూ ఉంది. వెంటనే రాముని వదిలి అడవిలోకి పారిపోయింది.
(ఇటీవల కొంత మంది విమర్శకులు, స్త్రీవాదులు ఈ సంఘటనను విమర్శిస్తుంటారు. శూర్పణఖ ఒక స్త్రీ. ఇష్టంలేకపోతే ఇష్టంలేదని చెప్పవచ్చుకాని, ముక్కు చెవులు కోయడం అమానుషం, దారుణం అని వాదిస్తుంటారు. కాని ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. శూర్పణఖ ఆటవికురాలు. రాక్షసి. నరమాంసభక్షకి. సీతను చంపడానికి ఆమె మీదికి ఉరికింది. అప్పుడు ఏం చెయ్యాలి. ” అయ్యో! శూర్పణఖ స్త్రీ. ఆమెను ఏమీ చేయకూడదు”అని ఊరుకోవాలా! అలా ఊరుకుంటే శూర్పణఖ సీతను మిరపకాయ బజ్జీ తిన్నట్టు కరా కరా నమిలి తిని ఉండేది. తన భార్య అయిన సీతను రక్షించుకోవడం రాముని ధర్మం కాదా!
“తనకు కానీ, తన వారికి కానీ, తన ఆస్తికి కానీ ఆపద కలిగినప్పుడు, ఆ ఆపద కలిగించేవారిని చంపినా, గాయపరిచినా అది నేరం కాదు.” అని నేటి న్యాయశాస్త్రం కూడా చెబుతుంది. దానిని రైట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. రాముడు కూడా అదే పని చేసాడు. అయినా రాముడు శూర్పణఖను చంపలేదు. కేవలం ముక్కు చెవులుకోయించాడు. సీత ప్రాణాలు రక్షించాడు. కాబట్టి నేటి విమర్శకులు అనుకుంటున్నట్టు రాముడుకానీ, లక్ష్మణుడుకానీ శూర్పణఖ ముక్కు చెవులు కోయడంలో అనుచితంగా ప్రవర్తించలేదు. పైగా న్యాయసూత్రాలు పాటించారని చెప్పుకోవచ్చు.)
ఆ ప్రకారంగా ముక్కునుండి చెవుల నుండి రక్తం కారుతుంటే శూర్పణఖ పరుగెత్తిపోయింది. జన స్థానములో తన చుట్టు రాక్షస సేనలు ఉండగా, శూర్పణఖ అన్న ఖరుడు కూర్చొని ఉన్నాడు. శూర్పణఖ సరాసరి తన అన్న ఖరుని వద్దకు వెళ్లింది. ఏడుస్తూ నేలమీద పడిపోయింది.
తన చెల్లి అలా పడిపోవడం చూచి సహించలేక పోయాడు ఖరుడు. ఆమె వద్దకు వచ్చి ఆమెను లేవనెత్తాడు. ఆమె చెవుల నుండి, ముక్కునుండి రక్తం కారడం చూచాడు. ఏం జరిగింది అని అడిగాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ చతురశీతితమః సర్గ, “గుహాగమనమ్”, రామాయణంలోని ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో భరతుడు మరియు గుహా మధ్య జరిగిన సంభాషణలు, భరతుడి రాముడి పట్ల ఉన్న ప్రేమను మరియు గౌరవాన్ని ప్రతిబింబిస్తాయి. గుహా, భరతుడికి రాముడి స్మృతులను వివరించి, అతడికి సహాయం చేయడానికి సన్నద్ధత వ్యక్తం చేస్తాడు. ఈ సర్గ, భక్తి, స్నేహం, మరియు విధేయతను హృదయానికి హత్తుకునేలా చూపిస్తుంది.
గంగానదీతీరమున ఉన్న శృంగిబేరపురమునకు రాజు గుహుడు. రామునికి ఆప్తమిత్రుడు. గంగానది పొడుగునా విడిది చేసిన సైన్యములను చూచాడు గుహుడు. వెంటనే తన మంత్రులను, బంధువులను సమావేశపరిచాడు.
“మీరంతా చూచి ఉంటారు. గంగానదీ తీరాన అశేష సైన్యము విడిది చేసి ఉన్నది. దీని లెక్క నాకు ఊహకు అందడం లేదు. ఈ సైన్యము అయోధ్యనుండి వచ్చినట్టు కనపడుతూ ఉంది. భరతుడు రాముని వెదుకుతూ వచ్చాడేమో తెలియదు. మనము రాముని మిత్రులమని మనలను బంధించడానికి వచ్చాడా! లేక మనలనందరినీ చంపుతాడా! రాముడు బతికి ఉంటే శాశ్వతముగా తనకు రాజ్యము లభించదని రాముని కూడా చంపడానికి వచ్చాడా! రాముడు మనకు రాజే కాదు. మనకు మిత్రుడు కూడా. అందుచేత రాముని రక్షించడం మన కర్తవ్యము.
అందుకని మీరందరూ ఆయుధములను చేత బట్టి గంగానదీ తీరములో నిలబడండి. మనము కేవలము గంగాతీరమును రక్షిస్తున్నాము అనే మిషతో అక్కడ ఉండండి. మనసేనలను కూడా సమాయత్తము చేయండి. మనకు ఐదువందల పడవలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క పడవలో నూరుగురు సైనికులు ఉండండి. గంగా తీరమును రక్షిస్తూ ఉన్నట్టు పడవల మీద తిరగండి. భరతుడు ఏ బుద్ధితో వచ్చాడో తెలియదు. భరతుడు రాముని క్షేమం కోరే వాడయితే అతనిని వెళ్లనిద్దాము. లేని ఎడల అతనిని అడ్డుకుందాము. దీనికి మీరు సంసిద్ధంగా ఉండండి.” అని పలికాడు.
తరువాత సాంప్రదాయ ప్రకారము తన శక్తికొద్దీ కానుకలు తీసుకొని గుహుడు భరతుని వద్దకు వెళ్లాడు. గుహుని రాకను సుమంత్రుడు చూచాడు. ఆ విషయము భరతునికి చెప్పాడు.
“మహారాజా! గుహుడు తన బంధుమిత్రులతో తమ దర్శనానికి వచ్చాడు. గుహుడు రామునికి మంచి మిత్రుడు. రాముడు అడవులకు వెళ్లేటప్పుడు రామునికి ఆతిధ్యము ఇచ్చాడు. రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారో గుహునికి తెలిసి ఉంటుంది. కాబట్టి గుహుని ఆదరించు.” అని అన్నాడు సుమంత్రుడు. ఆ మాటలకు భరతుడు చాలా సంతోషించాడు. “సుమంత్రా! వెంటనే గుహుని నా వద్దకు తీసుకొని రా!” అని ఆదేశించాడు. సుమంత్రుడు గుహుని భరతుని వద్దకు తీసుకొని వెళ్లాడు. గుహుడు భరతునికి వినయంగా నమస్కరించాడు. “ఈ శృంగిబేర పురమునకు నేను రాజును. నాపేరు గుహుడు. మీకు దాసుడను. ఈ పురము మీ పురమే అనుకొనుడు. మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉండండి. మేము నీ కోసరము ఫలములు, దుంపలు, మాంసము తీసుకొని వచ్చాము. మా సపర్యలను స్వీకరించి మీరు ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించండి.” అని అన్నాడు గుహుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ నవమ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణుడు దండకారణ్యంలో మరింత లోతుగా ప్రవేశిస్తారు. అక్కడ, రాక్షసులకు భయంకరంగా కనిపించే విరాఢుడిని ఎదుర్కొంటారు. విరాఢుడు సీతను అపహరించాలని ప్రయత్నిస్తాడు, కానీ రాముడు, లక్ష్మణుడు అతనితో తీవ్రంగా యుద్ధం చేసి, అతనిని సంహరిస్తారు.
రాముడు, లక్ష్మణుడు, సీత అరణ్యమార్గములో పోతూ ఉన్నారు. అప్పుడు సీత రాముని చూచి ఇలా పలికింది.
“నాధా! ధర్మము, ధర్మ సంపాదన చాలా నిశితమైనవి. కోరికలకు, వ్యసనములకు దూరంగా ఉన్నవారే ధర్మముగా జీవించగలరు. వ్యసనములకు మూలము కామము. కామము వలన ముఖ్యంగా మూడు వ్యసనములు కలుగుతాయి. అందులో మొదటిది అసత్యము పలకడం. రెండవది పరుల భార్యలను కోరడం. మూడవది ఎదుటి వారి మీద ఎలాంటి విరోధము లేకుండానే వారిని హింసించడం.
ఇంక నీ సంగతి తీసుకుంటే నీవు సత్యవాక్పరిపాలకుడవు. అసత్యము పలకడం అంటే ఎలాంటిదో నీకు తెలియదు. ఇంక నీకు పరస్త్రీలమీద వాంఛ మనసులో కానీ, వాక్కులో కానీ, కర్మలో గానీ లేదు. అది నాకు తెలుసు. నీవు తండ్రిమాటకు విలువ ఇచ్చి రాజ్యమును త్యజించి, అడవులకు వచ్చావు. పైగా నీవు జితేంద్రియుడవు. ఇంతకన్నా సుగుణములు ఇంకా ఏమి కావాలి.
ఇంక మూడవది ఎదుటి వారిమీద ఎలాంటి వైరభావము లేకపోయినా, వారిని వధించడం. ఈ వ్యసనము నీకు ఎందుకో వచ్చింది. కారణం తెలియదు. ఈ దండకారణ్యములో నివసించు రాక్షసులను చంపుతానని ఋషులకు మాట ఇచ్చావు. ఆ కార్యక్రమము మీద నీవు లక్ష్మణునితో కలిసి ఆయుధములు ధరించి బయలుదేరావు. ఇది చూచి నా మనసు చాలా వికలమయింది. దీని గురించి నేను అన్ని విధాలా ఆలోచించాను. నా మనసుకు సరిఅయిన సమాధానము దొరకలేదు.
నీవు ఈ విధంగా ధనుర్బాణములను, కత్తులను ధరించి దండకారణ్యములోనికి వెళ్లడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే చేతిలో ధనుర్బాణములు ఉంటే దొరికిన మృగాన్ని చంపాలి అన్న ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చినపుడు అమాయకమైన మృగాలను చంపకుండా వదులుతావా! చేతిలో ధనుస్సు, కత్తి ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా హింస చేయవలెనని బుద్ధిపుట్టడం క్షత్రియులకు సహజం. దీని గురించి నీకు ఒక కథ చెబుతాను.
ఒక వనములో ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తపస్సుకు విఘ్నం కలిగించాలని అనుకున్నాడు ఇంద్రుడు. ఇంద్రుడు ఒక భటుని రూపంలో చేతిలో ఒక కత్తితో ఆ ఋషి దగ్గరకు వచ్చాడు. “ఓ మహాత్మా! నేను అత్యవసరమైన పని మీద వెళుతున్నాను. నేను వచ్చువరకు ఈ ఖడ్గమును తమరి దగ్గర ఉంచండి. నా పని అయిపోయిన తరువాత వచ్చి తీసుకుంటాను.” అని అన్నాడు. ఆ ఋషి సరే అన్నాడు. ఆ ఖడ్గమును తన ఆశ్రమములో ఒక మూల పెట్టించాడు. భటుని రూపంలో ఉన్న ఇంద్రుడు వెళ్లిపోయాడు.
తాను ఆశ్రమములో లేని సమయములో ఆ కత్తిని ఎవరైనా ఎత్తుకుపోతారని, ఆఋషి ఎప్పుడూ ఆ కత్తిని తనతోపాటు తీసుకొని వెళుతూ ఉండేవాడు. ఎల్లప్పుడూ కత్తి అతని వద్ద ఉండటంతో ఆ కత్తిని ఉపయోగించడం మొదలు పెట్టాడు. ఆ ఋషి బుద్ధి క్రూరంగా మారిపోయింది. వినోదం కొరకు ఏదో ఒక జంతువును చంపడం అలవాటు అయింది. క్రమంగా అతని బుద్ధి తపస్సు మీదినుండి వేటమీదికి మళ్లింది. తుదకు ఆ ఋషికి నరకం సంప్రాప్తించింది. ఇంద్రుడి కోరిక నెరవేరింది.
నాథా! సత్త్వగుణ సంపన్నుడు అయిన ఆ ఋషి కూడా ఎల్లప్పుడూ ఆయుధము తన వద్ద ఉండటం వల్ల, అతని మనసు క్రూరంగా మారిపోయింది. ఆయుధములకు ఆ శక్తి ఉంది. ఆయుధము, అగ్ని రెండూ ప్రమాదహేతువులు అని మీకు తెలియనిది కాదు. మీ దగ్గర నాకు ఉన్న చనువు వలన మీకు చెబుతున్నాను. అంతేగానీ ఈ విషయములు అన్నీ మీకు తెలియవు అని కాదు.
నాధా! ఈ అడవిలో ఉన్న రాక్షసులకు మీకూ ఎలాంటి వైరము లేదు. వారు మనకు ఎలాంటి అపకారమూ చేయలేదు. కేవలము మీ వద్ద ఆయుధములు ఉన్న కారణంగా వాళ్లను చంపాలి అని అనుకుంటున్నారు. ఆ ఆలోచన మంచిది కాదు అని నా అభిప్రాయము. వారు ఏ అపరాధమూ చేయకుండా వారిని శిక్షించడం లోకసమ్మతం కాదు. ప్రజలు దానిని హర్షించరు.
ప్రజారక్షణ కోసరం ఆయుధములను ధరించడం క్షత్రియధర్మము. దానిని నేను కాదనను. కాని మీరు ప్రస్తుతము ముని వృత్తిలో ఉన్నారు. మీరు క్షత్రియధర్మము పాటించడం అనుచితము అని నా అభిప్రాయము. అయినా అడవులు ఎక్కడ! ఆయుధములు ఎక్కడ! క్షత్రియధర్మమెక్కడ! తపోవృత్తి ఎక్కడ! ఇవి పరస్పరమూ విరుద్ధముగా ఉన్నాయి కదా! కాబట్టి మీరు దేశధర్మమును పాటించడం మంచిది. అంటే మీరు ప్రస్తుతము వనములో ముని వృత్తిలో ఉన్నారు కాబట్టి మునుల వలె ప్రవర్తించడం మంచిది. అంతేకానీ హింసకు పాల్పడకూడదు.
మీరు అయోధ్యకు వెళ్లిన తరువాత మీ ఇష్టం వచ్చినట్టు ఆయుధములు ధరించి క్షత్రియ ధర్మమును పాటించవచ్చును. నీ తల్లి తండ్రులు నిన్ను నార చీరలు ధరించి. జటలు కట్టుకొని వనవాసము చేయమని నిర్దేశించారు. వారి ఆజ్ఞప్రకారము ముని వృత్తిలో ఉంటే వారూ సంతోషిస్తారు. అదే ధర్మము. ధర్మాచరణమే మీ కర్తవ్యము. కాబట్టి నాధా! మీరు అడవులలో ఉన్నారు కాబట్టి మంచి బుద్ధితో సత్వగుణమును, తపోధర్మమును పాటించండి. క్షాత్రమును వదిలిపెట్టండి. అనవసరంగా నీకు ఏ మాత్రం హాని చేయని వారిని హింసించకండి.
ఏదో స్త్రీ చాపల్యంతో మాట్లాడాను. ఏమీ అనుకోకండి. ఎందుకంటే తమరికి తెలియని ధర్మము లేదు. నేను చెప్పానని కాకుండా ఈ విషయం లక్ష్మణునితో కూడా ఆలోచించి తగు నిర్ణయం తీసుకోండి.” అని సీత మెత్త మెత్తగా తన అభిప్రాయాన్ని రామునికి తెలియజేసింది.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” సప్తదశః సర్గలో, శూర్పణఖ, రామాయణంలోని సమస్య రాక్షసత్వం ఇక్కడ ప్రవేశిస్తుంది. ఆమె రాముడి కుటీరానికి చేరుకుని రాముడికి తన భార్యను అందజేస్తుంది. ఆమె రావణుడి సోదరి మరియు ఆమె భర్త విద్యుత్ జిహ్వాను రావణుడు ఒంటరిగా చంపాడు, అతని స్వంత సోదరిని వితంతువుగా మార్చాడు. పాత రాక్షసి అయిన ఆమె సీతను విడిచిపెట్టి రాముడు తనను వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది.
రాముడు ఆశ్రమానికి వచ్చిన తరువాత అగ్నిహోత్రము మొదలగు కార్యములు నిర్వర్తించాడు. సీతతో, లక్ష్మణునితోనూ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆశ్రమము బయట కూర్చుని ఉన్నాడు. ఇంతలో జటాయువు వారి వద్దకు వచ్చాడు.
“రామా! నేను ఇక్కడకు వచ్చి చాలాకాలము అయినది. నాకు నా బంధువులను, మిత్రులను చూడవలెనని కోరికగా ఉన్నది. నేను పోయి నా బంధుమిత్రులను చూచి వెంటనే వస్తాను. అనుజ్ఞ ఇవ్వండి.” అని అడిగాడు. రాముడు సంతోషంతో సమ్మతించాడు. జటాయువు వెళ్లిపోయాడు.
కొంత సేపు తరువాత ఒక రాక్షస స్త్రీ ఆ ప్రదేశమునకు వచ్చింది. ఆమె పేరు శూర్పణఖ. రావణుని చెల్లెలు. ఆమె అక్కడకు వచ్చి రాముని చూచింది. బలిష్టమైన బాహువులతో, సింహము వక్షస్థలము వలె విశాలమైన వక్షస్థలముతో, తామర రేకుల వంటి కన్నులతో, ఆజానుబాహుడైన రాముని చూచింది. జగన్మోహనాకారుడైన రాముని చూచి శూర్పణఖ మోహపరవశురాలయింది. మన్మధుడు ఆమె మీద పుష్పబాణములు ప్రయోగించాడు.
రాముని మొహం చాలా అందంగా ఉంటే, శూర్పణఖ ముఖం వికృతంగా ఉంది. రాముని నడుము సన్నగా ఉంటే, ఆమెది బానపొట్ట. రాముని కళ్లు విశాలంగా ఉంటే, ఆమె కళ్లు వికృతంగా ఉన్నాయి. రాముని జుట్టు అందంగా ఉంటే ఆమె జుట్టు ఎర్రగా వికారంగా ఉంది. రామునిది మోహనాకారమైతే ఆమెది వికారరూపము.
రాముని కంఠస్వరము మధురంగా ఉంటే ఆమె కంఠధ్వని గార్ధభమును తలపిస్తూ ఉంది. రాముడు నవయౌవనుడు. ఆమె వయసుమళ్లిన స్త్రీ. రాముని మాటలు మృదువుగా ఉంటే ఆమె భాష గ్రామ్యంగా కఠోరంగా ఉంది. రాముని ప్రవర్తన ధర్మపరంగా ఉంటే ఆమెది అధర్మ ప్రవర్తన.
రాముని చూస్తే ఆనందం కలిగితే ఆమెను చూస్తే ఏహ్యభావము కలుగుతూఉంది. ఇలా హస్తిమశకాంతర వైవిధ్యము ఉన్న శూర్పణఖ రాముని చూచి మోహించింది.
తన సహజరూపంతో పోతే రాముడు తనను వరించడని, వెంటనే తన రూపంమార్చింది. నవయౌవన వతిగా తయారయింది. రాముని సమీపించింది.
“ఓ సుందరాకారా! నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఈమె నీ భార్య అనుకుంటాను. భార్యాసమేతంగా భయంకరమైన ఈ అడవిలో ఎందుకు ఉన్నావు. నీ వాలకం చూస్తుంటే నీవు గృహస్తులా లేవే. జటాజూటములు ధరించి ముని కుమారుని వలె ఉన్నావు. నీ చేతిలో ఉన్న ధనుర్బాణములను బట్టి నీవు క్షత్రియుడవు అని తెలుస్తూ ఉంది. ఇంతకూ నీవు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏ పనిమీద వచ్చావు? నిజం చెప్పు.” అని నిలదీసింది శూర్పణఖ.
అప్పుడు రాముడు ఆమెతో ఇలా అన్నాడు. “ఓ తరుణీ! నా పేరు రాముడు. నేను అయోధ్యాధీశుడు దశరథుని కుమారుడను. ఈమె నాభార్య సీత. అతను నా తమ్ముడు లక్ష్మణుడు. మీము మా తండ్రిగారి ఆజ్ఞమేరకు వనవాసము చేస్తున్నాము. ఇంతకూ నీవు ఎవరు? నీ నివాసము ఎక్కడ? నీ భర్తపేరు ఏమిటి?” అని అడిగాడు రాముడు. దానికి శూర్పణఖ ఇలా బదులు చెప్పింది.
“ఓరామా! నేను ఒక రాక్షస స్త్రీని. నా పేరు శూర్పణఖ. నేను రాక్షస స్త్రీని అయినా నేను కామరూపము ధరించు శక్తి కలదానను. ఈ అరణ్యమే నా నివాసము. విశ్రవసుని కుమారుడు రావణుడు నా అన్న. మహా పరాక్రమ వంతుడు. నీవు ఆయన గురించి వినేవుంటావు. ఆయన తమ్ముడు, మహాబలవంతుడైన కుంభకర్ణుడు.
ఎల్లప్పుడూ నిద్రాదేవిని సేవిస్తుంటాడు. రాక్షస వంశములో తప్పపుట్టిన వాడు విభీషణుడు. ఆయన కూడా నా సోదరుడే. ఇక్కడే జనస్థానములో నివాసము ఏర్పరచుకున్న ఖరుడు, దూషణుడు కూడా నా సోదరులే. నేనువారి వద్దనే ఉంటున్నాను.
తొలిసారిగా అతిలోకమన్మధాకారుడవైన నిన్ను చూచాను. నీ మోహంలో పడ్డాను. నిన్ను ప్రేమించాను. నా మనసులో నువ్వే నా భర్తవు అని అనుకొన్నాను. దానికి తిరుగులేదు. ఈమె నీ భార్య అంటున్నావు. నేను ఉన్నానుగా. ఇంకా ఈమెతో నీకు ఏం పని. నా అందంతో పోలిస్తే ఈసీత వికారంగా ఉంది కదూ! ఈమెను వదిలెయ్యి.
నువ్వు ఊ అంటే నేను ఈమెను నీ తమ్ముని విరుచుకొని తింటాను. తరువాత మనం ఇద్దరం ఈ అరణ్యములో, పర్వతశిఖరములలో ఆనందంగా విహరిద్దాము. నాతో వచ్చెయ్యి” అని పలికింది శూర్పణఖ.
(శూర్పణఖ మాటలు వింటుంటే మీకు ఏమనిపిస్తూ ఉంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్స్టెట్ శూర్పణఖతోనే మొదలయిందా అనిపించడం లేదూ!
ఇంకా చూడండి….ఈ కాలం కుర్రాళ్లు అనేమాట….. “నేను నిన్ను చూడగానే ఫిక్స్ అయ్యాను. ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమించాలి, నేను ఫిక్స్ అయ్యానుగా….. తప్పదు. లేకుంటే ఆసిడ్ పోస్తా, బ్లేడుతో గొంతుకోస్తా. నాకు దక్కనిది వేరే ఎవరికీ దక్కడానికి వీలులేదు. అడ్డం వచ్చిన వాళ్లని నరుకుతా” ఇవే కదా నేటి డైలాగులు.
ఈ తరహా ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి. ఇది శూర్పణఖతోనే మొదలయినట్టుంది. ఈ నాటిదాకా కొనసాగుతూ ఉంది. నాడు శూర్పణఖ కూడా తాను రాముడికి ఇష్టమా లేదా అని ఆలోచించలేదు. ఈ నాడు కూడా కుర్రాళ్లు తనంటే ఆ అమ్మాయికి ఇష్టమా లేదా అని ఆలోచించరు.
ఏదో ఒక లాగ లైన్ లో పెట్టడానికీ, బుట్టలో వేసుకోడానికి ప్రయత్నిస్తారు. లేకపోతే ఉందిగా అంటారు. అదీకాకపోతే చంపడం, చావడం. దీనికి ప్రతీక శూర్పణఖ కామం. దీనిని లవ్ అనరు. కామం(లస్ట్) అంటారు. అది తెలుసుకోవాలి.)
రామాయణంలోని అయోధ్యాకాండ ద్వినవతితమ (92వ) సర్గలో, మంత్రుడు భరతుని వద్దకు చేరి, దశరథ మహారాజు మరణాన్ని, రాముని అరణ్యవాసాన్ని తెలిపాడు. భరతుడు, ఈ వార్త విని గుండె పగిలినట్టు బాధపడతాడు. ఆతరువాత భరతుడు, సతీమణి మాండవితో కలసి అయోధ్యకు ప్రయాణిస్తాడు. అక్కడ, రాజభవనం వదలి సుమంత్రుడు, వసిష్ఠుడు మరియు ఇతర మంత్రులు భరతుని స్వాగతం పలుకుతారు. భరతుడు, కైకేయిని చూడగానే, ఆమె కృత్యాన్ని ధిక్కరిస్తాడు. వసిష్ఠుడు, భరతుని రాముని పిలవడానికి, సింహాసనం పైకి తీసుకురావడానికి సూచిస్తాడు. ఈ సర్గ భరతుని ధర్మబద్ధత, రామునిపై ప్రేమను, అయోధ్య ప్రజల దుఃఖాన్ని తెలుపుతుంది.
మరునాడు తెల్లవారింది. భరతుడు భరద్వాజుని వద్దకు పోయి రాముని వద్దకు పోవుటకు ఆయన అనుమతి కోరాడు. అప్పుడే అగ్నికార్యము ముగించుకొని కూర్చుని ఉన్న భరద్వాజుని ఎదుట చేతులు జోడించి నిలబడ్డాడు భరతుడు.
“ఓ భరతా! నీవు నీ పరివారమూ రాత్రి సుఖంగా గడిపారా! మీకు మా ఆతిథ్యము సంతోషాన్ని కలిగించిందా! మీరు మా ఆతిథ్యముతో తృప్తి చెందారా!” అని అడిగాడు భరద్వాజుడు.
“మహర్షీ! తమరు మాకు ఇచ్చిన ఆతిథ్యము మాకు మా పరివారమునకు ఎంతో సంతోషము కలిగించింది. మా వారందరూ
హాయిగా భుజించి నిద్రించారు. నేను నా రాముని వద్దకు పోవడానికి తమరి అనుమతి కోరుతున్నాను. రాముడు ఎక్కడ ఆశ్రమము నిర్మించుకున్నాడో, అది ఇక్కడికి ఎంత దూరం ఉన్నదో, అక్కడకు పోవడానికి మార్గము ఏమిటో తెలియజేయవలసినదిగా కోరుతున్నాను.” అని అడిగాడు భరతుడు.
“ఓ భరతా! ఇక్కడికి మూడున్నర క్రోసుల దూరములో చిత్రకూటము అనే పర్వతము ఉంది. అక్కడే మందాకినీ నది ప్రహిస్తూ ఉంది. అక్కడ ఒక నిర్జన ప్రదేశములో రాముడు పర్ణశాలను నిర్మించుకొని నివసిస్తున్నాడు. నీవు ఇక్కడినుండి నీ సేనలతో, పరివారముతో, దక్షిణముగా గానీ, నైఋతి దిశగా గానీ ప్రయాణం చేస్తే రాముని పర్ణశాలకు చేరుకుంటావు.” అని చెప్పాడు భరద్వాజుడు.
ఇంతలో దశరథుని భార్యలు అక్కడకు చేరుకున్నారు. అందరూ భరద్వాజుని కాళ్లకు నమస్కరించారు. “భరతా!నీ తల్లులను నాకు పరిచయం చెయ్యి” అని అడిగాడు భరద్వాజుడు.
“ఓ మహర్షీ! దీనంగా ఉండి ఉపవాసములతో శరీరం శుష్కింప చేసుకున్న ఈమె దశరథమహారాజు పట్టమహిషి కౌసల్యాదేవి. రాముని కన్న పుణ్యమూర్తి. ఆమెకు ఎడమ పక్కగా నిలబడి ఉన్న ఆమె లక్ష్మణ, శత్రుఘ్నుల తల్లి సుమిత్ర. వారి పక్కనే తలవంచుకొని ఉన్న ఆమె నా తల్లి కైకేయి. కోపస్వభావురాలు. ఏ మాత్రమూ వివేచన లేనిది. గర్విష్ఠి. అందము, ఐశ్యర్యము, అధికారమునకే ప్రాధాన్యం ఇస్తూ వాటి కోసరం ఏమి చెయ్యడానికైనా వెనుకాడని వ్యక్తి. ఈమె కారణంగానే నా అన్న రాముడు అడవుల పాలయ్యాడు. నా తండ్రి అకాలమృత్యువు వాత పడ్డాడు. నేను ఈనాడు పడుతున్న ఇన్ని బాధలకు ఈమెయే మూలకారణము.” అని అన్నాడు భరతుడు.
భరతుని మాటలు సావధానముగా విన్న భరద్వాజుడు ఇలాఅన్నాడు. “ఓ భరతా! అలా మాట్లాడకూడదు. ఇందులో నీ తల్లి దోషము ఏమాత్రమూ లేదు. రాముని అరణ్యవాసము భవిష్యత్తులో ఎన్నో శుభములకు సూచన మాత్రమే. నీ కైక కేవలము నిమిత్త మాత్రురాలు. రాముడు అరణ్యములకు రావడం వలన ఇక్కడ ఉన్న మునులకు, ఋషులకు, దేవతలకు హితము చేకూరుతుంది.’ అని పలికాడు భరద్వాజుడు.
తరువాత భరతుడు ఆయనకు నమస్కరించి ప్రయాణము నకు సిద్ధం కమ్మని తన సైన్యమునకు ఆదేశాలు ఇచ్చాడు. అందరూ తమ తమ రథములను ఎక్కారు. సైన్యం కదిలింది. వారు దక్షిణ దిక్కుగా ప్రయాణం సాగించారు. కొండలు గుట్టలుదాటిప్రయాణము చేస్తున్నారు.
అయోధ్యాకాండం రామాయణంలోని కీలకమైన భాగం. దీని 79వ సర్గలో రాముడు, సీత, లక్ష్మణుడు అరణ్యానికి వెళ్ళారు. 90వ సర్గలో ఋషులు రాముని సత్కరించారు. 100వ సర్గలో, దశరథ మహారాజు రాముని విడిచి, ఆయన కోసం విరహంతో మరణిస్తారు. ఈ సర్గలో కౌసల్య, సుమిత్ర, కైకేయిలు దుఃఖంలో కూరుకుపోతారు. దశరథుడి అంత్యక్రియలు నిర్వహించబడతాయి. ఈ సందర్భంలో, భరతుడు, శత్రుఘ్నుడు రావడంతో అశ్వమేధ యాగం జరుగుతుంది. భరతుడు రాముని తిరిగి పిలవడానికి చిత్తం చేస్తాడు. ఈ సర్గ రామాయణ కథనంలో భావోద్వేగభరితమైన ఘట్టంగా నిలుస్తుంది, రాముని, సీత, లక్ష్మణుల పరితాపం, అయోధ్య ప్రజల దుఃఖాన్ని వివరిస్తుంది.
ఆ రాత్రికి భరద్వాజుడు భరతునికి అతని పరివారమునకు సేనలకు భోజన సదుపాయములను చెయ్యాలని అనుకున్నాడు. దానికి భరతుడు ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! మీరు వసిష్ఠుల వారికి, నాకూ అర్ఘ్యము పాద్యము ఫలములు ఇచ్చి సత్కరించారు కదా! అది చాలు నాకు.” అని అన్నాడు.
“భరతా! నీవు ఏదీ కోరవు అని నాకు తెలుసు. కాని కాదనకుండా నా ఆతిధ్యము స్వీకరించు. నీవు నీ పరివారమును, సైన్యమును ఎందుకు దూరంగా ఉంచావు. మా ఆశ్రమమునకు తీసుకొని రావలసినది.” అని అన్నాడు భరద్వాజుడు.
దానికి భరతుడు ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! తమ ఆశ్రమ ప్రశాంతతకు భంగము కలిగించడం ఇష్టం లేక, తమరి మీద ఉన్న భయ భక్తులతో నేను నాపరివారమును సైన్యమును దూరంగా ఉంచి వచ్చాను. అదీ కాకుండా రాజులు తమ మందీ మార్బలములను, మునులకు దూరంగా ఉంచాలని రాజధర్మము కదా! నా వెంట చతురంగ బలములు వస్తూ ఉన్నాయి. అవి ఇక్కడకు వస్తే ఇక్కడి వృక్ష సంపద, జలసంపద కలుషితము అవుతాయి. అందుకని తీసుకొని రాలేదు.” అని అన్నాడు భరతుడు.
దానికి భరద్వాజుడు నవ్వి “మాకు ఏమీ అసౌకర్యము లేదు. నీ సేనలను ఇక్కడకు రమ్మని చెప్పు” అని ఆదేశించాడు. ఆ ప్రకారము భరతుని సేనలు భరద్వాజుని ఆశ్రమము వద్దకు వచ్చాయి.
భరద్వాజుడు అగ్ని గృహములోనికి ప్రవేశించి భరతుని పరివారమునకు ఆతిథ్యము ఇచ్చుటకు విశ్వకర్మను ఆహ్వానించాడు. దేవేంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడుమొదలగు లోక పాలకులను ఆహ్యానించాడు. భూమి మీద ఉన్న నదులను ఆహ్వానించాడు. దేవతలను, గంధర్వులను, అప్సరసలను ఆహ్వానించాడు. స్వర్గము నుండి, బ్రహ్మలోకమునుండి దేవతా స్త్రీలను ఆహ్వానించాడు. కుబేరునికి, దివ్యమైన వస్త్రములను తీసుకు రమ్మని ఆదేశించాడు.
పిలిచి భరతుని పరివారమునకు సైన్యమునకు కావలసిన ఆహార పదార్థములను, భక్ష్యములను, పానీయములను, మాంసాహారములను, ఫలములను సమకూర్చమని ఆదేశించాడు.
భరద్వాజుడు ఆహ్వానించిన దేవతలందరూ భరద్వాజుని వద్దకు వచ్చారు. ఆయన ఆదేశములు స్వీకరించారు. భరతునికి, ఆయన పరివారమునకు, సైన్యమునకు కావలసిన ఏర్పాట్లు చేసారు. వాయుడు మంద్రంగా వీచ సాగాడు. అప్సరసలు తమ నృత్యగానవినోదములతో వారిని ఆనందపరచసాగారు. విశ్వకర్మ ఆ రాత్రి వారందరూ ఉండటానికి ఒక విశాలమైన మందిరమును సృష్టించాడ భరతుడు తన పురోహితుడు వసిష్ఠుడు, తమ్ముడు శత్రుఘ్నుడు, తన తల్లులతో ఆ భవనములోనికి ప్రవేశించాడు. ఆ భవనములో ఒక పెద్ద రాజ సభ అందులో ఒక సింహాసనము ఉంది. భరతుడు ఆ సింహాసనమునకు నమస్కరించి, తాను పక్కన ఉన్న ఆసనము మీద కూర్చున్నాడు. బ్రహ్మలోకము నుండి వచ్చిన స్త్రీలు, కుబేరుడు పంపగా వచ్చిన స్త్రీలు వారికి సేవలు చేయసాగారు. అప్సరసలు భరతుని తమ నృత్యగానవినోదములతో సంతోషపరచారు.
భరతుని వెంట వచ్చిన వారు. పరివారము, సైనికులు తిన్నంత తిని, తాగి మైమరచిపోయారు. ఆహా ఇంతటి విందు వినోదము తాము ఎప్పటికీ చూడలేము అని అనుకొన్నారు. తాము రాముని వద్దకు కానీ, అయోధ్యకు కానీ రాము. ఇక్కడే ఉంటాము అనితాగిన మత్తులో శపధాలు చేసారు. భరతుని వెంట వచ్చిన వారు. పరివారము, సైనికులు తిన్నంత తిని, తాగి మైమరచిపోయారు. ఆహా ఇంతటి విందు వినోదము తాము ఎప్పటికీ చూడలేము అని అనుకొన్నారు. తాము రాముని వద్దకు కానీ, అయోధ్యకు కానీ రాము. ఇక్కడే ఉంటాము అనితాగిన మత్తులో శపధాలు చేసారు.
తెల్లవారగానే అవేమీ ఉండవు. అంతా మిధ్య అని వారికి తెలియదు. సైనికులకే కాదు, వారి వాహనములు అయిన గుర్రములు ఏనుగులకు, ఒంటెలకు కూడా రుచికరమైన ఆహారము సమకూర్చబడింది. అడిగే వారు లేకపోవడంతో సైనికులు ఇష్టం వచ్చినట్టు తింటూ తాగుతూ స్వైరవిహారం చేసారు. అప్సరసలతో పాలు నృత్యం చేసారు. కేకలుపెడుతున్నారు.
(ఇక్కడ వాల్మీకి మహర్షి ఒక శ్లోకం రాసాడు. భరద్వాజుడు ఇచ్చిన ఆతిథ్యము ఆ మనుషులకు అనగా భరతుని పరివారమునకు, సైనికులకు స్వప్నంలో జరిగినట్టు ఉంది. ఆ రాత్రి గడవగానే అప్పరసలు అందరూ వచ్చిన వారు వచ్చినట్టుగానే వెళ్లిపోయారు. తాగిన మత్తులో జోగుతున్న సైనికులు మాత్రం అక్కడ పడి ఉన్నారు. రాత్రి కనపడ్డ భవనాలు లేవు, ఆహార పదార్థాలు లేవు. పానీయాలు లేవు. అడవి అందులో చెట్లు ఉన్నాయి. ఈ ప్రపంచంలో మనము అనుభవించే సుఖాలు సంతోషాలు అన్నీ మిధ్య. ఏవీ శాశ్వతాలు కావు. తెల్లవారగానే కరిగిపోతాయి. అని ఈ సన్నివేశాన్ని వివరించడం ద్వారా లోకానికి తెలియజెప్పాడు వాల్మీకి.)
అయోధ్యాకాండం అశీతితమ (80వ) సర్గలో, వసిష్ఠుడు దశరథ మహారాజుకు దేనుబుడు అనే విశిష్టమైన ఘీతోపాహారాన్ని సమర్పిస్తాడు. ఈ సమయంలో, దశరథ మహారాజు రాముని వలసకు వెళ్లడం మరియు తన కొడుకుతో విడిపోవడం వల్ల బాధతో ఉంటుంది. వసిష్ఠుడు ధైర్యం చెబుతూ, రాజ్యం పరిపాలన గురించి ఆలోచనలతో నిమగ్నమవుతాడు. దశరథుడు రాముని ఆకస్మిక ప్రయాణం గురించి మాట్లాడుకుంటూ, కైకేయి చేసిన అన్యాయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తాడు. వసిష్ఠుడు దశరథుని ధైర్యం చెప్పి, కౌసల్య, సుమిత్ర మరియు కైకేయిలను సాంత్వన పరుస్తాడు. ఈ సర్గ దశరథ మహారాజు యొక్క భావోద్వేగాలు, రాముని పట్ల అతని అపార ప్రేమను, రాముని విడిపోవడం వలన అతని ఆవేదనను ప్రతిబింబిస్తుంది.
అమాత్యులు భరతుని ప్రయాణమునకు తగిన ఏర్పాట్లు చేసారు.. ఆయాప్రదేశముల స్వభావములను తెలిసిన వారు, నేలను త్రవ్వేవారు, కొలతలు వేసేవారు, యంత్ర కోవిదులు, శిల్పులు, తగిన యంత్రములను నడుపువారు, చెక్కపని వారు, బావులు తవ్వువారు, మార్గములు వేయువారు, వారిని పర్యవేక్షించేవారు ఎవరెవరు ఏ యే పనులకు నియమింపబడ్డారో ఆ పనులను సమర్ధవంతంగా చేస్తున్నారు.
ముందుగా, భరతుడు, ఆయన సైన్యము, రధములు, శకటములు అడవులలో పోవుటకు, మార్గములు, రహదారులు వేస్తున్నారు. అడ్డంగా ఉన్న చెట్లను, పొదలను, తీగలను నరికి మార్గము చేస్తున్నారు. నేలంతా చదును చేస్తున్నారు. పల్లము ప్రదేశములలో మట్టిపోసి, ఎత్తైన ప్రదేశములను చదును చేసి, గుంతలను కప్పివేసి, మార్గములు ఏర్పరుస్తున్నారు. దారిలో సైన్యములకు, భరతుని అనుసరించు వారికీ, కావలసిన నీరు కాలవల ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. నదులు కాలువలు లేని ప్రదేశములలో బావులుత్రవ్వి నీటిని పైకి తోడుతున్నారు. సేనలు నడచు మార్గమును సున్నముతో గట్టిచేసారు. దారిలో పూలచెట్లు నాటించారు. పతాకములతో అలంకరించారు.
ఈ పనులన్నీ చేయుటకు జ్యోతిష్కులు మంచి ముహూర్తములు నిర్ణయించారు. దారిలో భరతుడు, అంత:పురస్త్రీలు, రాజోద్యోగులు విడిది చేయుటకు వివిధములైన గృహములు నిర్మించారు. భరతుడు విడిది చేయు గృహమును ఇతర గృహముల కంటే బాగా అలంకరించారు. ఆ విధముగా కట్టబడిన విడిది గృహములు సరయూనది నుండి గంగానది వరకూ వ్యాపించి ఉ న్నాయి. ఆ ప్రకారంగా భరతుని ప్రయాణమునకు ఏర్పాట్లు చేయబడ్డాయి. (ఆ రోజుల్లో కూడా దేశాధినేత ప్రయాణమునకు నేడు చేసిన మాదిరే ఏర్పాట్లు చేయడం, అప్పటికప్పుడు అన్నీ అమర్చడం నేడు కూడా. చూస్తూనే ఉంటాం.)
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” షోడశః సర్గలో, ఒక రోజు సూర్యోదయానికి ముందు రాముడు సీత మరియు లక్ష్మణులతో కలిసి రోజూ స్నానం చేయడానికి గోదావరి నదికి వెళ్తాడు. దారిలో లక్ష్మణుడు చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ శీతాకాలాన్ని స్తుతిస్తాడు. అలా చేయడం ద్వారా అతను రాణి కైకేయిపై అసహనం వ్యక్తం చేస్తాడు మరియు రాముడు దానిని ఖండించాడు.
కృతాభిషేకః స రరాజ రామః
సీతాద్వితీయః సహ లక్ష్మణేన |
కృతాభిషేకో గిరిరాజపుత్ర్యా
రుద్రః సనందీ భగవానివేశః ||
43
Aranya Kanda Sarga 16 In Telugu Pdf Download
రాముడు సీతతో సహా పంచవటిలో ఆనందంగా గడుపు తున్నాడు. ఇంతలో శరదృతువు ముగిసి, హేమంత ఋతువు ప్రవేశించింది. చలికాలము మొదలయింది.
ఒక రోజు రాముడు పొద్దునే గోదావరినదికి స్నానానికి వెళ్లాడు. రాముని వెంట సీత, లక్ష్మణుడు కూడా వెళ్లారు. ఆ హేమంత ఋతువు అందాలను చూచి లక్ష్మణుడు రాముని తో ఇలా అన్నాడు.
“రామా! నీకు హేమంత ఋతువు అంటే ఎంతో ఇష్టం కదా. ఇప్పుడు హేమంత ఋతువు ప్రవేశించింది. మంచు కురుస్తూ ఉంది. నదీజలాలు స్నానానికి అనుకూలంగా లేవు. చలికి వెచ్చగా అగ్నిహోత్రము దగ్గర ఉండవలెనని కోరికగా ఉంది. పంటలు బాగా పండి కొత్త ధాన్యములు ఇంటికి చేరుతున్నాయి.
ఉత్తరాయనము రాగానే పితృదేవతలను పూజించి జనులు తరిస్తున్నారు. వర్షాకాలము ముగియడంతో రాజులు ఇతర రాజ్యముల మీదికి దండెత్తడానికి ఆసక్తిగా ఉన్నారు. అసలే మంచుతో కప్పబడిన హిమవత్పర్వతము సూర్యుడు భూమికి దూరంగా ఉండటంతో ఇంకా ఎక్కువ మంచుతో శోభిల్లుతోంది..
మనుష్యులు మధ్యాహ్నపు ఎండలో హాయిగా ఉంటున్నారు. రాత్రిళ్లు చలితో వణుకుతున్నారు. పగటి భాగమున కూడా సూర్యుడు తన తీక్షతను కోల్పోయాడు. పగలు కూడా చలిగాలులు వీస్తున్నాయి. అడవులలో జంతువులు కూడా తిరగడం లేదు. గుహలకే పరిమిత మైనాయి. మంచు కురవడంతో రాత్రిళ్లు ఎవరూ ఆరుబయట పడుకోడం లేదు.
చంద్రుడు గుండ్రంగా అందంగా ఉంటాడు. కాని అందాలు ఇప్పుడు సూర్యునికి సంక్రమించాయి. సూర్యుడు కూడా మంచు చేత కప్పబడి, తీక్షత తగ్గి, పూర్ణ చంద్రుని వలె ప్రకాశిస్తున్నాడు. పడమటి దిశనుండి చలిగాలులు వీస్తున్నాయి.
రాత్రి అంతా చలిగా ఉండి, పొద్దున్నే సూర్యోదయం కాగానే పక్షులు కిలా కిలా రావాలతో రెక్కలు విప్పుకొని ఎగిరిపోతున్నాయి. సూర్యకిరణములను పొగ మంచు కప్పడం వలన, సూర్యుడు బాగా పైకి వచ్చినా తీవ్రత తగ్గి నిండు చంద్రుని వలె కనపడుతున్నాడు. ఎండ కొద్ది కొద్దిగా నేల మీద పాకుతూ ఉంది. కాని వేడిగా లేదు.
మధ్యాహ్నము ఎండ చాలా సుఖంగా ఉంది. ఈ అడవిలో ఉన్న పచ్చిక మీద పడ్డ మంచు బిందువులు, పొద్దుటి ఎండలో ముత్యాలమాదిరి ప్రకాశిస్తున్నాయి.
రామా! అటు చూడు! పాపము ఆ ఏనుగు నీళ్లు తాగుదామని తన తొండమును నీటిలో పెట్టి, నీళ్లు జివ్వుమని చల్లగా తగలగానే తన తొండమును వెనక్కు లాగేసుకుంది. అంతెందుకు ఆ పక్షులు కూడా ఆ చల్లదనానికి నీటిలో దిగడానికి జంకుతున్నాయి. రామా! ఈ నదిలో నీరుకూడా అధికంగా చల్లగా ఉండటం వలన తాగడానికి వీలులేకుండా ఉంది కదా!
రామా! అడవిలో ఉన్న మన పరిస్థితి ఇలా ఉంది కదా! మరి అయోధ్యలో భరతుడు ఎలా ఉన్నాడో! నీ యందు భక్తితో అయోధ్యలో ఉన్నా అరణ్యములో ఉన్నట్టు ఉన్నాడేమో! రాజభోగములను విడిచిపెట్టి, నేల మీద పడుకుంటూ, మన మాదిరి ఫలములను ఆహారముగా తీసుకుంటూ జీవనము గడుపుతున్నాడేమో! రామా! మనము స్నానానికి గోదావరి నదికి వచ్చినట్టు భరతుడు కూడా సరయూనదికి స్నానానికి వెళుతూ ఉంటాడనుకుంటాను.
దక్షిణాపథములో ఉన్న మనకే ఇంత చలిగాఉంటే ఉత్తరదేశంలో అయోధ్యలో ఉన్న భరతునికి ఇంకెంత చలిగా ఉందో కదా! ఈ తెల్లవారుజామున సరయూనదిలో ఎలా స్నానం చేస్తున్నాడో కదా! ఎందుకంటే, భరతుడు అయోధ్యలో ఉన్నా, అరణ్యములో ఉన్నా నిన్ను అనుసరిస్తున్నాడు. నీ రాకకై తపిస్తున్నాడు. అటువంటి వాడు స్వర్గలోకాధిపత్యమునకు అర్హుడు.
రామా! సాధారణంగా కుమారుడికి తల్లి బుద్ధులు, కుమార్తెకు తండ్రి బుద్ధులు వస్తాయి అంటారు. కానీ, భరతుడికి తల్లి కైకకు ఉన్న ఏమాత్రమూ రాలేదు. అయినా రామా! దశరథ మహారాజు భార్యగా ఉండి, భరతునికి కన్నతల్లిగా ఉన్న కైకకు ఇంత కుటిలబుద్ధి ఎలా వచ్చిందో తెలియదు కదా.!…” అని లక్ష్మణుడు ఇంకా ఏదో చెప్పబోతుంటే రాముడు అడ్డుకున్నాడు.
“లక్షణా! దయచేసి నీవు ఎట్టి పరిస్థితులలోనూ మాత కైకను దూషించకూడదు. నేను వనవాసము చెయ్యాలని చేస్తున్నాను. ఇందులో ఆమె ప్రమేయము ఎంత మాత్రమూ లేదు. నా బాధ అంతా ఒకటే. భరత శత్రుఘ్నులు నా దగ్గర లేరే అని. అంతే కానీ ఈ వనవాసము నాకు ఎంతో ఆనందమూ కలిగిస్తూ ఉంది. నువ్వు, భరత శత్రుఘ్నులు ఎప్పుడు నా దగ్గరగా ఉంటారో కదా అని ఆతురతగా ఎదురుచూస్తున్నాను.” అని అన్నాడు రాముడు.
ఈ విధంగా మాట్లాడుకుంటూ అందరూ గోదావరీ తీరము చేరుకున్నారు. అందరూ గోదావరిలో దిగి స్నానాలు చేసారు. సీతా రామ లక్ష్మణులు గోదావరిలో పితృతర్పణము, దేవ తరణము, నిర్వర్తించారు. సూర్యోదయ కాలములో అర్ఘ్యము విడిచారు. తరువాత అందరూ ఆశ్రమమునకు వెళ్లారు.
(వాల్మీకి ఈ సర్గలో కేవలము శరదృతువు ఎలా ఉంటుందో వర్ణించాడు. ఈ రోజుల్లో ఈ జనారణ్యాలలో ఉన్న మనకు, పల్లెసీమలలో హేమంత ఋతువులో, ప్రకృతి సౌందర్యము ఎలా ఉంటుందో చూడ్డం కుదరడం లేదు. అందుకని ఆ ప్రకృతి అందాలను మనముందు ఆవిష్కరించాడు మహర్షి వాల్మీకి.)