మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ పంచషష్టితమః సర్గం (65వ సర్గ) రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో, రాముడు సీతను వెతికే ప్రయాణంలో కబంధుడిని ఎదుర్కొంటాడు. కబంధుడు రాక్షసుడిగా ఉండి, తన శాప విమోచనం కోసం రాముడి సహాయాన్ని కోరుతాడు. రాముడు, లక్ష్మణుడితో కలిసి, కబంధుడిని హతమార్చి, అతని శాపాన్ని తొలగిస్తాడు. శాప విముక్తి తరువాత, కబంధుడు రాముడికి సుగ్రీవుని గురించి, అతని సహాయం పొందే విధానాన్ని వివరిస్తాడు.
సీతా వియోగంతో రామునికి తాను ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. ముల్లోకాల్ని నాశనం చేస్తానని విల్లు ఎక్కుపెట్టడం చూచి లక్ష్మణుడు తల్లడిల్లిపోయాడు. వెంటనే రామునితో ఇలా అన్నాడు.
“రామా! నీవు సౌమ్యుడవు. మృదుస్వభావుడవు. సకల జనులకు హితుడవు. అటువంటి నీవు ముల్లోకములకు హాని కలిగిస్తాను అనడం భావ్యమా! నీ శాంత స్వభావాన్ని విడిచిపెట్టవచ్చునా! చంద్రునికి వెన్నెల, సూర్యునికి వేడి, భూమికి క్షమ ఎలా అలంకారాలో నీకు సౌమ్యత, సాధుజన ప్రియత్వము అలంకారాలు. ఇన్నాళ్లు సంపాదించుకున్న కీర్తిని ఒక్కసారిగా నాశనం చేసుకుంటావా!
సీతను అపహరించింది ఎవడో ఒక రాక్షసుడు. వాడిని శిక్షించాలి గానీ, ముల్లోకాలను క్షోభింపజేయడం యుక్తము కాదు కదా! ఇక్కడ ఏం జరిగిందో, ఎవరెవరికి యుద్ధం జరిగిందో, అసలు ఈ యుద్ధముతో సీతాపహరణమునకు సంబంధం ఉందో లేదో తెలియదు. ఈ రక్తపు మరకలు ఎవరివో తెలియదు.
కాని ఇక్కడ ఒక యుద్ధము జరిగింది అన్నమాట వాస్తవము. కాని ఈ యుద్ధము ఇద్దరి మధ్య జరిగిందే కానీ, పెద్ద సైన్యము మధ్య జరిగింది కాదు. పెద్దసైన్యము వచ్చిన గుర్తులు కనిపించడం లేదు. ఇద్దరు యుద్ధం చేసుకుంటే ఒకడు చావాలి. మరొకడు గెలవాలి. కాబట్టి ఆ చచ్చినవాడు ఇక్కడే ఎక్కడో పడి ఉంటాడు. వాడిని పట్టుకుంటే మనకు సీత జాడతెలియవచ్చు. కాబట్టి ఆ ఇద్దరి గురించి నీవు నీ ఆయుధమును ప్రయోగించడం ఉచితం కాదు.
నీ భార్యను అపహరించడం క్షమించరాని నేరము. మనము ఆ నేరము చేసిన అపరాధిని పట్టి శిక్షిస్తాము. నీకు ఈ ప్రకృతి సాయం చేయడం లేదు అని అనుకుంటున్నావు. అలా అని ఎందుకు అనుకుం వు. దక్షిణ దిక్కుగా పొమ్మని చెప్పింది ఆ మూగజీవాలే కదా! ఇంక చెట్టు, పుట్టలు, పర్వతాలు, నదులు తాము చూచిన విషయాన్ని నీకు ఎలా తెలియజేయగలవు. వాటికి నీకు సాయం చేయాలని ఉన్నా చేయలేవు కదా! అందుకని శాంతం వహించు.
మనము ఇక్కడ ఉన్న మునులను, ఋషులను కలిసి వారి సాయంతో సీతను గురించి వెదుకుదాము. ఈ అడవి, పర్వతములు, నదీతీరములు అణువు అణువునా గాలిద్దాము. సీత జాడ తెలిసే వరకూ, సీతను అపహరించిన వాడు దొరికే వరకూ మనకు అన్ని లోకములు వెదుకుదాము. ఒక వేళ దేవతలు గానీ, దానవులు గానీ ఈ పని చేసి ఉంటే, వారికి ఒక అవకాశం ఇద్దాము. అప్పటికీ వారు దారికి రాకపోతే, అప్పుడు వారిని కఠినంగా శిక్షిద్దాము. ముందు మనము సామోపాయముతోనూ, మన ఉదాత్తమైన శీలము తోనూ, వినయంగా అడుగుదాము. వారు మాట వినకపోతే, అప్పుడు నీ పరాక్రమం చూపించవచ్చును.” అని రాముని శాంతింపజేసాడు. లక్ష్మణుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ చతుఃషష్టితమః సర్గం (64వ సర్గ) రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రాముడు సీతను వెతికే క్రమంలో హనుమంతుని, జటాయువును కలుస్తాడు. జటాయువు రావణుడి చేతిలో సీత అపహరణను చూసి రామునికి ఆ విషయాన్ని తెలియజేస్తాడు. జటాయువు ధైర్యం మరియు సీతను రక్షించడానికి చేసిన ప్రయత్నం రాముడికి ఎంతో ప్రేరణ ఇస్తుంది.
రాముడికి ఇంకాఆశ చావలేదు. ‘ఏమో సీత ఎక్కడికైనా వెళ్లిందేమో. మనము అనవసరంగా ఆందోళన పడుతున్నామేమో’ అనే ఆలోచన వచ్చింది. వెంటనే లక్ష్మణుని పిలిచి
“లక్ష్మణా! నీవు వెంటనే గోదావరీనదీ తీరానికి వెళ్లు. అక్కడ సీత తామరపూలు కొయ్యడానికి కానీ, స్నానానికి కానీ వెళ్లిందేమో చూడు.’ ఇదే ఆఖరి ఆశ.” అన్నాడు రాముడు.
అన్న మాట ప్రకారము లక్ష్మణుడు గోదావరీ నదీతీరానికి వెళ్లాడు. తీర ప్రాంతము అంతా వెదికాడు. కానీ సీత జాడ ఎక్కడా కనపడలేదు. నిరాశతో రాముని వద్దకు వచ్చాడు.
“అన్నయ్యా! నేను గోదావరి తీరం అంతా వెదికాను. బిగ్గరగా అరిచాను. సీత ఎక్కడా కనిపించలేదు.” అని చెప్పాడు.
ఆఖరి ఆశకూడా వమ్ముకావడంతో రాముడు హతాశు డయ్యాడు. కాని రామునికి ఇంకా కొస ఆశ మిగిలి ఉంది. “లక్ష్మణుడు సరిగా చూచాడో! లేదో ఏమో!” అని తానే స్వయంగా గోదావరీ నదీ తీరానికి వెళ్లాడు. సీతా! సీతా! అని బిగ్గరగా అరుస్తూ ఆ ప్రాంతమంతా కలయ తిరిగాడు.
రావణుడు సీతను అపహరించిన సంగతి అక్కడ ఉన్న వృక్షములకు, జంతువులకు, పక్షులకు, గోదావరీ నదికి తెలుసు. కాని అవి చెప్పలేవు. రాముడు నిరాశ చెందాడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! నేను ఎంత ఎలుగెత్తి పిలిచిననూ ఈ వనములో ఉన్న చెట్లు, పక్షులు, జంతువులు, గోదావరి నది ఎవరూ బదులు చెప్పడం లేదు. ఏం చేయాలి. నీ పాణిని గ్రహించిన సీత ఏదీ అని సీత తల్లి తండ్రులు అడిగితే నేను ఏమి సమాధానము చెప్పాలి.
లక్ష్మణా! నా రాజ్యము పోయినా, అరణ్యవాసము సంప్రాప్తిం చినా, నేను అధైర్యపడక సీతను చూచి బతుకుతున్నాను. ఇప్పుడు ఆ సీత నన్ను విడిచి పోయింది. ఇప్పుడు నేను ఎవరిని చూచి బతకాలి. నాకు ధైర్యము చెప్పేవాళ్లు ఎవరు.
లక్ష్మణా! చూచావా! ఈ మృగములు నన్ను చూచి తలలు ఎత్తి ఏమో చెప్పాలి అనుకుంటున్నాయి. కాని చెప్పలేకపోతున్నాయి. సీత గురించి వీటికి తెలిసి ఉంటుంది. ఉండు వీటిని అడుగుతాను.” అని రాముడు ఒక్కొక్క మృగం దగ్గరకు పోయి “సీత ఎక్కడ ఉందో నీకు తెలుసా!” అని ప్రతి మృగమును అడుగుతున్నాడు.
వాటి కళ్ల వెంట కన్నీరు కారుతూ ఉంది. కాని ఏమీ చెప్పలేకపోతున్నాయి. కాని అవి ఒక సంకేతమును ఇచ్చాయి. ఆ మృగములు తమ మోరలు ఎత్తి అరుస్తూ దక్షిణ దిక్కుకు పరుగెడుతున్నాయి. ఆకాశం వంక చూస్తున్నాయి. మరలా దక్షిణ దిక్కుగా పరుగెడుతున్నాయి.
రాముడు సీతా వియోగ దుఃఖంలో ఉన్నాడు. కానీ లక్ష్మణుడు సూక్ష్మబుద్ధితో వాటి సంకేతాలు గ్రహించాడు. “రామా! గమనించావా! నువ్వు “మీరు సీతను చూచారా! సీత ఎక్కడకు వెళ్లింది” అని అడగగానే ఈ మృగములు ఆకాశం వంక చూస్తూ దక్షిణ దిక్కుగా పరుగెడుతున్నాయి. ఎవరో సీతను ఆకాశ మార్గంలో దక్షిణదిక్కుగా తీసుకువెళ్లినట్టు వాటి చర్యలను బట్టి తెలుస్తూ ఉంది. కాబట్టి మనము దక్షిణ దిక్కుగా వెళ్లి వెదుకుదాము. సీత జాడ ఏమైనా తెలుస్తుందేమో!” అని అన్నాడు లక్ష్మణుడు.
ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడికి గడ్డిపరక దొరికినా లాభమే అన్నట్టు రాముడికి లక్ష్మణుడు చెప్పిన ఈ చిన్న మాట ఆశను రేకెత్తించింది. “లక్ష్మణా! అలాగే చేద్దాము. పద పోదాం.” అన్నాడు రాముడు. రాముడు లక్ష్మణుడు ఇద్దరూ దక్షిణ దిక్కుగా వెళు తున్నారు.మార్గంలో సీత ధరించిన పూలు చెల్లాచెదురుగా పడిఉ డ చూచారు.
రాముడు ఆపూలను చూచాడు. “లక్ష్మణా! ఈ పూలు చూచావా! ఈ రోజు ఉదయం నేను అడవిలో నుండి కోసుకొని వచ్చి సీతకు ఇచ్చాను. ఈ పూలు ఇంకా వాడిపోలేదు. ఇప్పుడు ఈ పుష్పాలు మనకు దారి చూపుతున్నాయి.” అని సంతోషించాడు.
మరలా రాముడు తన ధోరణిలో మాట్లాడుతున్నాడు. “ఓ పర్వతములారా! మీకు సీత జాడ తెలుసు. ఎవరు తీసుకొనిపోయారో తెలుసు. తెలిసీ చెప్పకపోయారో నా బాణములతో మిమ్ములను పిండి పిండి చేస్తాను.” అని పెద్దగా అరిచాడు. రాముని మాటలకు పర్వతములు బదులు చెబుతున్నాయా అన్నట్టు రాముని మాటలు ప్రతిధ్వనించాయి.
ఇంతలో నేలమీద అటు ఇటు పరుగెట్టినట్టు పెద్ద పెద్ద అడుగులు, చిన్న చిన్న అడుగులు కనపడ్డాయి. పెద్ద అడుగులు రాక్షసునివి గానూ చిన్న అడుగులు సీతవి గానూ పోల్చుకున్నారు రామలక్ష్మణులు. ఆతురతగా ముందుకు నడిచారు.
వారికి ఒక వటవృక్షము దగ్గర విరిగిన ధనుస్సు బాణములు, ముక్కలైన రథము కనపడ్డాయి. అక్కడ ఒక యుద్ధం జరిగినట్టు ఆనవాళ్లు కనపడ్డాయి. అక్కడక్కడా విరిగిన ఆభరణములు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. వాటిని సీత ఆభరణములుగా గుర్తించాడు రాముడు. వారు అక్కడ సీత జాడ కోసరం నిశితంగా వెదుకుతున్నారు. “లక్ష్మణా! ఇటు చూడు. ఇక్కడ నేల మీద రక్త బిందువులు కనపడుతున్నాయి. ఇది చూస్తుంటే ఇక్కడ ఆ రాక్షసుడు సీతను చంపి ఉంటాడు. లక్ష్మణా! చూస్తుంటే ఇక్కడ ఇద్దరు రాక్షసులు యుద్ధము చేసిన గుర్తులు కనిపిస్తున్నాయి. ఇదుగో ఇటు చూడు! బంగారముతో అలంకరింపబడిన ధనుస్సు ఇక్కడ విరిగిపడి ఉంది. ఇది ఎవరిదిఅయి ఉంటుందో తెలియదు. లక్ష్మణా! ఇటుచూడు. ఇక్కడ బంగారు కవచము పడిఉంది. ” అని అన్నాడు రాముడు.
“అన్నయ్యా! ఇక్కడ ఎవరిదో పెద్ద ఛత్రము పడిఉంది. అదుగో అక్కడ పిశాచముఖములు కలిగిన గాడిదలు చచ్చి పడిఉన్నాయి. ఇవన్ని చూస్తుంటే నువ్వు అన్నట్టు ఇక్కడ ఏదో యుద్ధము జరిగినట్టు కనపడుతూ ఉంది.” అని అన్నాడు లక్ష్మణుడు.
“లక్ష్మణా! ఈ రథము ఎవరిదో మహారాజుదిగా ఉంది. అంతా బంగారంతో చేయబడి ఉంది. ఇక్కడ పడిఉన్న బాణములు కూడా చాలా పొడుగ్గా ఉన్నాయి. బంగాచపు ములికలు కలిగి ఉన్నాయి. రెండు అమ్ములపొదులు కూడా ఉన్నాయి. రథసారథికూడా చచ్చిపడి ఉన్నాడు. ఈసారథి చేతిలో రథమునకు కట్టిన గాడిదల కళ్ళెములు, కొరడా ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు చామరములు వీచే వాళ్లుకూడా చంపబడినట్టున్నారు. వాళ్ల శరీరాలు చెల్లాచెదరుగా పడిఉన్నాయి. వీరందరూ ఇక్కడ జరిగిన యుద్ధములో చంపబడినట్టున్నారు” అని రాముడు అక్కడ పడి ఉన్న మృతదేహాలను చూస్తున్నాడు.
లక్ష్మణుడు కూడా వారిని చూచి వారు రాక్షసులు అని పోల్చుకున్నాడు. కాని సీత ఏమయిందో తెలయడం లేదు. రామునికి అర్థం అయింది. ఇదంతా రాక్షసుల పని అని. లక్ష్మణుని చూచి రాముడు ఇలా అన్నాడు.
“ఓ లక్ష్మణా! ఇదంతా చూస్తుంటే ఇక్కడ రాక్షసుల మధ్య యుద్ధం జరిగినట్టు కనపడుతూ ఉంది. సీతను తీసుకువెళ్లడం గానీ, చంపి తినడం గానీ జరిగి ఉండవచ్చు. సీత గురించి ఇక్కడ ఘోరయుద్ధం జరిగినట్టు ఆనవాళ్లు కనపడు తున్నాయి. దేవతలుగానీ వనదేవతలు గానీ సీతను రక్షించలేదు. ఏది ఏమయినా నాకు తీరని నష్టం కలుగజేసారు. నాకు సహజంగా దయాగుణం ఉంది. అనవసరంగా నేను ఎవరికీ అపకారము చెయ్యను. నా దయా గుణమును దేవతలు, వనదేవతలు, రాక్షసులు నా చేతగాని తనంగా భావిస్తున్నారు. నన్ను పరాక్రమము లేని వాడుగా అనుకొంటున్నారు. నా దయాగుణమే నాకు శత్రువుగా పరిణమించింది.
అందుకని, నేను నా దయాగుణమును తొక్కిపట్టి, విజృంభిస్తాను. సకల భూతములను, రాక్షసులను నాశనం చేస్తాను. యక్షగంధర్వ, పిశాచ, దానవులను క్షోభపెడతాను. ఎవరినీ సుఖంగా బతకనివ్వను. నా అస్త్ర శస్త్రములతో ముల్లోకములను అల్లకల్లోలం చేస్తాను. ఈ దేవతలు నా సీతను నాకు క్షేమంగా అప్పగించకపోతే నా పరాక్రమము ఏమిటో వారికి తెలియజేస్తాను.” అని పలికి విల్లు ఎక్కుపెట్టాడు రాముడు.
“లక్ష్మణా! ఇక్కడ ఉన్న వారందరికీ నా సీతకు ఏమయిందో తెలుసు. కానీ నాకు చెప్పడం లేదు. వారు, దేవతలు కానీ, రాక్షసులు గానీ, నా సీత జాడ చెప్పకపోయినా, నా సీతను నాకు సజీవంగా నాకు అప్పగించకపోయినా, ఈ బాణంతో ముల్లోకములను క్షోభింపజేస్తాను.” అని విల్లు ఎక్కుపెట్టాడు రాముడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ త్రిషష్టితమః సర్గం (63వ సర్గ) రామాయణంలో ప్రధానమైన భాగం. ఈ సర్గలో, రావణుడు మాయా సీతను అపహరించిన తరువాత, రాముడు సీతాన్వేషణ కోసం సుగ్రీవుని, హనుమంతుని సహాయంతో వనాలను అన్వేషిస్తాడు. ఈ అన్వేషణలో రాముడు అనేక వనాలను, అడవులను దాటుతూ సీతను వెతుకుతాడు. ఈ సర్గలో, రాముడు తన భార్య సీతను రక్షించడానికి ఎంతో సాహసాన్ని, ధైర్యాన్ని ప్రదర్శిస్తాడు. రాముని తపస్సు, కృషి, ధర్మపాలన ఈ సర్గలో స్పష్టంగా కనిపిస్తాయి.
రాముడి దుఃఖానికి అంతులేకుండా పోయింది. లక్ష్మణుడు ఎంత ఓదారుస్తున్నా రాముడు సీత మీద ఉన్న ప్రేమ వలన ఆమెకోసం విలపిస్తున్నాడు. తనలో తనే మాట్లాడుకుంటున్నాడు.
“నేను ఎన్నో పాపాలు చేసి ఉంటాను. అందుకనే నాకు కష్టాలు ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి. నేను ఊరికే అనడం లేదు లక్ష్మణా! నాకు రాజ పోయింది. బంధుమిత్రులు దూరం అయ్యారు. తల్లి దూరం అయింది. తండ్రి మరణించాడు. ఇప్పుడు నా భార్యకూడా నాకు దూరం అయింది. ఇది పాపకర్మల ఫలితం కాదా!
సీతను ఎవరైనా ఎత్తుకుపోతుంటే ఆమె ఎంతగా విలపించి ఉంటుందో తలచుకుంటేనే భయంగా ఉంది. సందేహము లేదు. సీతను రాక్షసులే అపహరించారు. నరమాంస భక్షకులైన రాక్షసులు సీతను అపహరించి, ఆమె కంఠమును ఖండించి ఆమె నెత్తురు తాగి ఉంటారు. ఆ సమయంలో ఆమె ఎంతగా ఏడ్చిందో కదా!
లక్ష్మణా! నీకు తెలుసుకదా! సీత, నేను, ఆ శిలాఫలకము మీద కూర్చుని ఎన్నో సాయంత్రాలు గడిపాము కదా! లక్ష్మణా! సీత గోదావరికి స్నానం నిమిత్తం వెళ్లి ఉంటుందంటావా! కాని ఆమె ఎప్పుడూ ఒంటరిగా గోదావరికి స్నానానికి వెళ్లదే! నేను తోడు లేనిదే సీత కనీసము తామరపూల కోసరం కూడా తటాకమునకు వెళ్లదు. ఎందుకంటే సీత మహాభయస్తురాలు.” అని లక్ష్మణునితో అన్నాడు.
తల పైకి ఎత్తాడు. ఆకాశంలో సూర్యుడు వెలుగుతున్నాడు. “ఓ సూర్యభగవానుడా! నీవు లోకమంతా వెలుగుతుంటావు కదా! నా సీత ఎక్కడైన కనపడిందా! నీవు చూచావా! చూస్తే నాకు చెప్పవా!” అని సూర్యుడిని వేడుకున్నాడు. అలాగే వాయుదేవుడిని కూడా వేడుకున్నాడు.
ఇదంతా చూచిన లక్ష్మణుడికి కూడా దుఃఖం ముంచు కొచ్చింది. తనూ దుఃఖిస్తే రాముడు ఇంకా దైన్యానికి లోనవుతాడని తనలో తాను తమాయించుకున్నాడు. రాముని చూచి ఇలా అన్నాడు.
“రామా! ఇంక చాలు. సీత కోసం దుఃఖించడం మాను. ఇలా దుఃఖిస్తూ కూర్చుంటే సీత తిరిగి వస్తుందా! పద. సీతను వెదుకుదాము. నీ వంటి బుద్ధిమంతులు కష్టములు వచ్చినప్పుడే ఎంతో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. కాబట్టి రామా! ధైర్యము తెచ్చుకో. ” అని రామునికి ధైన్యవచనాలు పలికాడు. కానీ రాముడి మీద అవి పనిచేయలేదు. (ఈ సర్గ కూడా ప్రాచ్యప్రతిలో లేదు. అందుకని ఈ సర్గ కూడా తరువాత చేర్చబడినది అని పండితుల అభిప్రాయము.)
కిష్కింధాకాండలో పంచమ సర్గలో, సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని నాలుగు దిశల్లో సీతాన్వేషణకు పంపిస్తాడు. హనుమంతుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు, అంగదుడు మొదలైన ప్రముఖులు అన్వేషణలో పాల్గొంటారు. హనుమంతుడికి రాముడు సీతదేవి కనిపిస్తే ఇచ్చేందుకు తన ఉంగరాన్ని ఇస్తాడు. వానరులు ప్రతి కొండ, అడవి, సముద్రం వెతుకుతారు. ఈ సమయంలో సీతదేవి లక్షణాలను వివరించటం ద్వారా రాముడు హనుమంతుడికి ముఖ్యమైన సూచనలు ఇస్తాడు. అన్వేషణ బృందం దక్షిణ దిశగా పయనిస్తుంది, హనుమంతుడు తన శక్తిని వినియోగించి, సముద్రాన్ని దాటి లంకకు చేరుకోవడానికి సన్నద్ధమవుతాడు. ఈ సర్గలో అన్వేషణకు సంబంధించిన ప్రణాళికలు, స్నేహబంధం మరియు ధైర్యం ప్రాముఖ్యత వహిస్తాయి.
హనుమంతుడు రామలక్ష్మణులను తన బుజముల మీద ఎక్కించుకొని ఋష్యమూక పర్వతము నుండి మలయ పర్వతమునకు తీసుకొని వెళ్లాడు. రామలక్ష్మణులను మలయ పర్వతము మీద దించి, సుగ్రీవుని వద్దకు వెళ్లాడు.
“ఓ సుగ్రీవా! వీరు రాముడు లక్ష్మణుడు అనే పేర్లు గల రాజకుమారులు. నేనే వీరిని నా వెంట తీసుకొని వచ్చాను. రాముడు మహా పరాక్రమ వంతుడు. రాముడు ఇక్ష్వాకు వంశములో పుట్టిన వాడు. ధర్మము తెలిసిన వాడు. దశరథుని కుమారుడు. తండ్రి ఆజ్ఞప్రకారము వనవాసము చేస్తున్నాడు. రాముడు వనవాసము చేయుచుండగా రావణుడు అనే రాక్షసుడు ఈయన భార్య సీతను అపహరించాడు. ఆ రాముడు ప్రస్తుతము నీ శరణు కోరుతున్నాడు. రాముడు, లక్ష్మణుడు నీతో స్నేహము చేయవలెనని అభిలషిస్తున్నారు. వీరి స్నేహమును అంగీకరించు. దీని వలన మీ ఇద్దరికీ లాభము చేకూరుతుంది. వీరిరువురూ పూజింప తగిన వారు. వీరిని మిత్రులుగా స్వీకరించి పూజించు.” అని పలికాడు హనుమంతుడు.
ఆ మాటలు విన్న సుగ్రీవుడు చాలా సంతోషించాడు.
రాముని చూచి ఇలా అన్నాడు. “ఓ రామా! మీ గుణగణముల గురించి హనుమంతుడు నాతో చెప్పాడు. మీరు ఉత్తమ మానవులు. నేను వానరుడను. ఈ వానరుడితో స్నేహము కోరుతున్నారంటే, ఇది మీరు నాకు చేస్తున్న సత్కారముగా భావిస్తున్నాను. మీకు నాతో స్నేహం చేయడం ఇష్టం అయితే, నా చేతులు మీకోసం చాస్తున్నాను. మీ చేతితో నా చేతిని తాకండి. కరచాలనం చెయ్యండి.” అని అన్నాడు సుగ్రీవుడు.
సుగ్రీవుడు పలికిన పలుకులు విన్న రాముడు చాలా సంతోషించాడు. సుగ్రీవుని హస్తము పట్టుకున్నాడు. సుగ్రీవునితో స్నేహం అంగీకరించాడు. సుగ్రీవుని గాఢంగా కౌగలించుకున్నాడు. ఈ సన్నివేశము చూచి హనుమంతుడు చాలా ఆనందించాడు. రెండు కర్రలతో నిప్పుపుట్టించాడు. అగ్ని రగిల్చాడు. ఆ అగ్నిని రాముడు సుగ్రీవుని మధ్య ఉంచాడు. రాముడు, సుగ్రీవుడు ఆ అగ్ని చుట్టు ప్రదక్షిణము చేసారు. అగ్నిసాక్షిగా రాముడు సుగ్రీవులు మిత్రులయ్యారు.
సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు. “మనము ఇద్దరమూ సమానమైన దు:ఖములో ఉన్నాము. ఒకరి దు:ఖములను ఒకరం పంచుకుందాము. ఇకమీదట మన సుఖదు:ఖములను సమానంగా పంచుకుందాము.” అని అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు పక్కనే ఉన్న సాల వృక్షము నుండి ఒక కొమ్మను విరిచాడు. కింద పరిచాడు. రాముడు సుగ్రీవుడు దాని మీద కూర్చున్నారు. తరువాత హనుమంతుడు ఒక చందన వృక్షము కొమ్మను తెచ్చి లక్ష్మణునికి కానుకగా ఇచ్చాడు. సుగ్రీవుడు రాముని చూచి ఇలా అన్నాడు.
“ఓ రామా! నా అన్న వాలి నన్ను చాలా అవమానించాడు. నాతో శతృత్వము పెంచుకున్నాడు. నా నుండి నా భార్యను లాక్కున్నాడు. నన్ను రాజ్యము నుండి తరిమేసాడు. నేను, నా అన్న వాలికి భయపడి, అపరిమిత మైన దుఃఖమును అనుభవిస్తూ, ఈ ఋష్యశృంగ పర్వతము మీద నివసిస్తున్నాను. రామా! ఇప్పుడు నాకు నీ అభయము కావాలి. నాకు వాలి నుండి రక్షణ కావాలి. నా రాజ్యము నాకు కావాలి. నా భార్య నాకు కావాలి. ఇదంతా నీ వల్లే జరగాలి.” అని అన్నాడు సుగ్రీవుడు.
రాముడు సుగ్రీవుని మాటలకు నవ్వుతూ ఇలా అన్నాడు. “నేను నీకు తప్పకుండా సాయము చేస్తాను. నీ భార్యను అపహరించిన వాలిని చంపి నీ భార్యను నీకు తెచ్చి అప్పగిస్తాను. ఈ బాణములు చూచావు కదా. ఇవి అమోఘమైనవి. వీటితో వాలిని వధిస్తాను.” అని అన్నాడు రాముడు.
రాముని మాటలు విని సుగ్రీవుడు పరమానంద భరితుడయ్యాడు. “ఓ రామా! నీ మాటలు వింటుంటే నాకు నా భార్యను తిరిగి పొందినంత ఆనందంగా ఉంది. నాకు వాలి వలన కలిగిన భయాన్ని శాశ్వతంగా తొలగించు. వాలి నన్ను మరలా ఎటువంటి బాధ పెట్టకుండా చెయ్యి” అని అన్నాడు సుగ్రీవుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ద్విషష్టితమః సర్గం అంటే రామాయణంలోని అరణ్యకాండ యొక్క 62వ అధ్యాయం. ఈ సర్గలో, రాముడు, సీతా, లక్ష్మణులు దండకారణ్యంలో అనేక కష్టాలను ఎదుర్కొంటారు. ప్రధాన సంఘటన సీత హరణం. రాక్షసుడు రావణుడు, సీతను అపహరించడానికి వచ్చి, ఆమెను బలవంతంగా తన రథంలో ఎక్కించుకొని, లంకకు తీసుకువెళ్తాడు. సీత విడిపించబడటానికి ఆర్తనాదం చేస్తుంది, కానీ ఆమెను రక్షించడానికి ఎవ్వరూ ఉండరు.
వివాహం అయినప్పటి నుండి తనను క్షణం కూడా ఎడ బాయని సీత ఒక్కసారిగా తనను విడిచి పోవడం చూచి రాముడు హతాశుడయ్యాడు. రాముడికి కన్ను మూసినా తెరిచినా సీత రూపమే కనిపిస్తూ ఉంది. సీత చెట్ల నుండి పూలు కోస్తున్నట్టు, పూపొదలలో తిరుగుతున్నట్టు ఊహించుకుంటున్నాడు. ఆమెను తన దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. తన దగ్గరకు రాలేదేమా అని అలుగుతున్నాడు. సీత తనను ఆట పట్టించడానికి తనకు దూరంగా తనకు కనపడకుండా ఉందని ఆమెను రా రమ్మని పిలుస్తున్నాడు. నీవు లేకపోతే పర్ణశాల శూన్యంగా ఉందని నిష్టూరం ఆడుతున్నాడు. ఎంతకూ సీ కనపడలేదు.
మరలా లక్ష్మణుడి వంక చూచాడు. “లక్ష్మణా! నేను ఇంతగా పిలుస్తుంటే, ఇంతగా పరితపిస్తుంటే సీత ఎందుకు రావడం లేదు. సీతను రాక్షసులు చంపి తిని ఉంటారంటావా!” అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు.
మరలా తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. “ఓ సీతా! నీకు ఎంత ఆపద సంభవించినది. ఇది తెలిస్తే పాపం కైక ఎంత సంతోషిస్తుందో! ఆమె కోరిక తీరినట్టయింది కదా! సీతా! నీతో కలిసి అయోధ్యనుండి బయటకు కాలు పెట్టాను. వనవాసానంతరము నీవు లేకుండా అయోధ్యలో ఎలా కాలు పెట్టను? సీతను ఎవరికో అప్పగించి వచ్చాను అని తలిస్తే జనం నన్ను పిరికి వాడనీ, పరాక్రమం లేని వాడనీ నిందించరా!
నిజమే! నేను పిరికివాడినే! లేకపోతే చేతిలో ధనుర్బాణములు ఉండగా నిన్ను పోగొట్టుకున్నానే! నేను నిజంగా పిరికివాడినే! మీ తండ్రి జనక మహారాజు వచ్చి ‘నాకుమార్తె సీత ఎక్కడ?” అంటే నేను ఏమి సమాధానం చెప్పాలి. ఆయనకు నా మొహం ఎలా చూపించాలి? అసలు నీవు నా పక్కన లేకుండా చూచి మీ తండ్రి జనకుడు మూర్ఛ చెందడా! అందుకే నేను మరలా అయోధ్యకు వెళ్లను? సీతలేని అయోధ్యలో నేను ఉండలేను.” అని సీత తన ఎదురుగా ఉన్నట్టు ఊహించుకొనని మాట్లాడుతున్నాడు.
ఇంతలో లక్ష్మణుని వంక తిరిగాడు. “లక్ష్మణా! నీవు అయోధ్యకు వెళ్లు. నా కోసరం నువ్వుకూడా ఎందుకు ఈ అడవులలో బాధలుపడతావు. భరతుని శాశ్వతంగా రాజ్యం ఏలుకోమని నామాటగా చెప్పు. నాకు బదులు నా తల్లి కౌసల్యకు నీ తల్లి సుమిత్రకు అభివాదము చెయ్యి నా తల్లిని జాగ్రత్తగా చూసుకో! ఆమె చెప్పిన పనులు చేస్తూ ఉండు. లక్ష్మణా! నా తల్లికి నీవు ఇక్కడ జరిగిన విషయాలు సవిస్తరంగా వివరించు. మాయలేడి రావడం, సీత ఆ లేడి కావాలని కోరడం, నేను దాని కోసరం వెళ్లడం, దానిని కొట్టడం, ఆ లేడి రాక్షసుడుగా మారి అరవడం. నువ్వు రావడం, సీత కనపడకపోవడం, సీత కోసరం నేను విలపించడం, అన్నీ వివరించు.” అని అప్పగింతలు పెడుతున్న రాముని చూచి లక్ష్మణుడు భయంతో వణికిపోయాడు. సీతావియోగదుఃఖం తట్టుకోలేక రాముడు ఎటువంటి దుస్థితికి లోనవుతాడో అని భయపడ్డాడు లక్ష్మణుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకషష్టితమః సర్గం రామాయణంలోని అరణ్యకాండలో 61వ అధ్యాయం. ఈ సర్గలో రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకెళ్లడానికి యత్నాలు ప్రారంభిస్తాడు. సీత అపహరణ సమయంలో జటాయువు రావణుని అడ్డుకుంటాడు. జటాయువు సీతను కాపాడేందుకు రావణుడితో యుద్ధం చేస్తాడు, కానీ రావణుడు జటాయువును గాయపరచి సీతను లంకకు తీసుకెళ్తాడు. రాముడు, లక్ష్మణుడు తిరిగి వచ్చినప్పుడు సీత కనిపించకపోవడంతో, జటాయువుతో జరిగిన సంఘటన గురించి తెలుసుకుంటారు.
ప్రాణాధికంగా ప్రేమించిన భార్య సీత హటాత్తుగా కనపడక పోయేసరికి రాముడికి దుఃఖము, కోపము ముంచుకొచ్చాయి. దానికి కారణం లక్ష్మణుడు అని రాముని అభిప్రాయము. అడగాలంటే లక్ష్మణుని అడగాలి. అందుకే పదే పదే లక్ష్మణుని అడుగుతున్నాడు.
“లక్ష్మణా! చెప్పు. నా భార్య సీత ఎక్కడ ఉంది. నీకు అప్పగించి వెళ్లాను కదా. నా భార్యను ఏమి చేసావు? ఆమె ఎక్కడకు వెళ్లి ఉంటుంది. నా భార్యను ఎవరు బలవంతంగా తీసుకొని వెళ్లారు? నా భార్యను ఎవరు చంపి తిన్నారు? చెప్పు” అంటూ నిలదీస్తున్నాడు.
లక్ష్మణుడికి సీత గురించి తెలియదు అని రామునికి తెలుసు. కాని మనసు నిలవడం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. కాబట్టి చేస్తున్నాడు. లక్ష్మణుని విడిచి పెట్టాడు.
చెట్ల దగ్గరకుపోయి “సీతా సీతా రా! ఎక్కడ దాక్కుని ఉ న్నావు” అని బిగ్గరగా పిలుస్తున్నాడు.
“ఓ సీతా! నీవు ఎక్కడన్నా ఆడుకుంటున్నావా! ఇందాక లేడిపిల్ల కావాలి అని అడిగావు కదా. నీకు ఏదైనా లేడి దొరికిందా. దానితో ఆడుతున్నావా. త్వరగా రా” అని ఎలుగెత్తి పిలుస్తున్నాడు.
మరలా రాముడు లక్ష్మణుని వద్దకు వచ్చాడు. “లక్ష్మణా! సీత లేకుండా నేను బతకలేను లక్ష్మణా! సీతా వియోగంతో కృంగి కృశించి చచ్చిపోతాను. నా తండ్రి దశరథుని పరలోకంలో కలుసుకుంటాను. కాని నాకు ఒకటే భయం. నా తండ్రి నన్ను చూచి “నిన్ను 14 ఏళ్లు వనవాసము చెయ్యమన్నాను కదా. వనవాస కాలము పూర్తి కాకుండా అప్పుడే వచ్చావేమిటి” అని అడిగితే ఏమి చెప్పాలి? నా తండ్రి నన్ను “నువ్వు మాట మీద నిలబడే వాడివి కాదు. నీవు అన్నీ అబద్ధాలు చెబుతావు” అని నిందిస్తే ఎలా భరించాలి. ” అని లక్ష్మణునితో వాపోయాడు.
మరలాసీత గుర్తుకు వచ్చింది. “సీతా! సీతా! ఎక్కడున్నావు సీతా! నన్ను విడిచి పెట్టి ఎక్కడకుపోయావు సీతా! నన్ను విడువకు సీతా. నీవులేనిదే నాకు జీవితం లేదుసీతా!” అని బిగ్గరగా ఏడుస్తున్నాడు.
రాముడు ఎంత ఏడ్చినా సీత తిరిగి రాలేదు. ఇదంతా మౌనంగా చూస్తున్నాడు లక్ష్మణుడు. ఇదంతా తన వల్లే కదా అని మనసులో బాధపడుతున్నాడు. కాసేపు సీత అన్న మాటలను భరిస్తే, కాసేపు సీతకు కనపడకుండా మొహం తప్పిస్తే, ఇంత ఆపద వచ్చి ఉ డేది కాదు కదా అని వాపోతున్నాడు. కాని తన బాధను బయటకు కనపడనీయకుండా రామునికి ధైర్యం చెబుతున్నాడు లక్ష్మణుడు.
“అన్నయ్యా! ఏమిటీ వెర్రి. నీవంటి ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు, ఇంత విషాదము చెందవలెనా! సీత ఎక్కడకూ వెళ్లదు. నీళ్లు తీసుకురావడానికి సరస్సుకు వెళ్లి ఉంటుంది. లేక ఈ అరణ్యములో ఎన్నో కొండగుహలు ఉన్నాయి కదా! ఏ గుహలోనో దాని అందాలు చూస్తూ ఉండి ఉంటుంది. లేక స్నానము చేయడానికి నదికి వెళ్లిందేమో! లేక నిన్ను ఆట పట్టించడానికి ఎక్కడైనా దాక్కుని ఉందేమో! తను కాసేపు కనపడకపోతే మనము ఏమి చేస్తామో అని చూడటానికి ఎక్కడన్నా దాగిఉండవచ్చును.
కాబట్టి ఓ రామా! మనము ఆమెను వెదకడానికి ప్రయత్నం చేద్దాము. అంతేకానీ ఇలా దుఃఖించడం వలన ప్రయోజనము లేదు కదా! నీవు దుఃఖము మాని నాకు అనుజ్ఞ ఇస్తే నేను అడవి అంతా గాలించి సీత జాడ తెలుసుకొనివస్తాను.” అని అన్నాడు లక్ష్మణుడు.
లక్ష్మణుడి మాటలకు ఎంతోసంతోషించాడు రాముడు. “లక్ష్మణా! నువ్వు ఒక్కడివే ఎందుకు. మనం ఇద్దరం కలిసి వెదుకుదాము.” అని అన్నాడు.
తరువాత రాముడు లక్ష్మణుడు కలిసి సీతను వెదకడం మొదలెట్టారు. అడవి అంతా గాలించారు. పక్కనున్న పర్వతములు అన్నీ కలయతిరిగారు. నదీతీరములు వెదికారు. సరస్సులవద్ద వెతికారు. ఎంత వెదికినా సీత కనపడలేదు.
“లక్ష్మణా! ఎంతవెదికినా సీత కపపడటం లేదు. ఏం చేద్దాము.” అని నిరాశగా అన్నాడు రాముడు.
“రామా! అంతలోనే నిరాశచెందకుము. సీత మనకు తప్పకుండా కనపడుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. సీత బతికేఉంది. అందులో సందేహము లేదు.” అని అన్నాడు లక్ష్మణుడు.
“ఏం దొరకడమో ఏమో! మనం ఇద్దరం ఈ అడవి అంతా గాలించాము కదా! సీత సాధారణంగా వెళ్లే ప్రదేశాలు, సరస్సులు, నదీతీరము, పర్వతములు అన్నీ వెదికాము కదా! కాని సీత కనిపించలేదు. ఏం చెయ్యాలో తోచడంలేదు.” అని దుఃఖిస్తున్నాడు.
రాముడు. “సీతాసీతా!” అని మాటి మాటికీ సీతను తలుచుకుంటున్నాడు.
లక్ష్మణుడు రాముని శాయశక్తులా ఓదారుస్తున్నాడు. కాని రాముని దుఃఖము ఉపశమించడం లేదు. అలా సీత కోసం దుఃఖిస్తూనే ఉన్నాడు రాముడు.
కిష్కింధాకాండలో చతుర్థ సర్గ, వాలి వధ అనంతరం సుగ్రీవుడు కిష్కింధ రాజ్యాన్ని పొందుతాడు. సుగ్రీవుడు రాముని సహాయం చేయడానికి తన సైన్యాన్ని సిద్ధం చేయడానికి సమయం తీసుకుంటాడు. వానర సైన్యం సీతాన్వేషణ కోసం వేర్వేరు దిశల్లో పంపబడుతుంది. రాముడు సుగ్రీవుడికి తన బాధను, సీతను వెంటనే వెతకాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తాడు. హనుమంతుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు వంటి ప్రముఖ వానరులు ఈ అన్వేషణలో ముఖ్యపాత్ర పోషిస్తారు. సుగ్రీవుడు, తన ప్రామాణికతను చాటుకొని, సీతను వెతకడం కోసం అన్ని వనరులను వినియోగిస్తాడు. రాముడు, లక్ష్మణుడు ఈ ప్రయత్నంలో ఆశగా ఎదురు చూస్తారు.
లక్ష్మణుని మాటలు విన్న హనుమంతుడు వారు తమకు శత్రువులు కారనీ, వాలి పంపిన వారు కారనీ, ఒక కార్యము నిమిత్తము తిరుగుతున్నారనీ, వీరి మైత్రితో సుగ్రీవుని కష్టములు కూడా గట్టెక్కుతా యని సంతోషించాడు. వీరు కూడా సుగ్రీవుని వలె కష్టములలో ఉన్నట్టున్నారు. వీరి కష్టములను సుగ్రీవుడు తీర్చగలడు. అప్పుడు వీరు కూడా సుగ్రీవునకు సాయము చెయ్యగలరు. వాలి నుండి సుగ్రీవునికి రాజ్యప్రాప్తి కలుగుతుంది.” అని సంతోషించాడు.
తరువాత హనుమంతుడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “మీరు చూడబోతే మునికుమారులవలె ఉన్నారు. కాని చేతిలో ధనుర్బాణములు ఉన్నవి. మీరు ఎవరికోసమో వెతుకుతున్నట్టు కనపడుతూ ఉంది. మీ గురించి వివరంగా చెప్పండి. మీ మాటలు నేను మా రాజుకు చెప్పాలి కదా!” అని అన్నాడు హనుమంతుడు.
అప్పుడు లక్ష్మణుడు హనుమంతునితో ఇలా అన్నాడు. “ఓహనుమా! ఈయన పేరు రాముడు. ఇక్ష్వాకు వంశములో జన్మించిన అయోధ్యాధిపతి దశరథుని పెద్ద కుమారుడు. గుణవంతుడు, రాజ్యము చేయుటకు అర్హుడు. కాని ఒకానొక కారణమున రామునికి రాజ్యము లభించలేదు. పైగా అరణ్యవాసము సంప్రాప్తించింది. రాముని భార్యపేరు సీత. సూర్యుని విడిచి కాంతి ఉండలేనట్టు, రాముని భార్య సీతకూడా, భర్తను విడిచి ఉండలేక, రామునితోపాటు అరణ్యములకు వచ్చింది.
నేను రాముని తమ్ముడను. నా పేరు లక్షణుడు. నేను నా అన్న వదిలను సేవించుకుంటూ వారి వెంట అరణ్యములకు వచ్చాను. మేము పర్ణశాలలో లేని సమయమున, సీత ఒంటరిగా ఉన్నప్పుడు, మాయావి అయిన ఒక రాక్షసుడు రాముని భార్య సీతను అపహరించాడు. మేము సీతను వెతుకుతూ ఉండగా, మా తండ్రి దశరథునికి మిత్రుడు అయిన జటాయువు అనే పక్షిరాజు కనిపించి, సీతను రావణుడు అనే రాక్షసుడు అపహరించి, దక్షిణ దిక్కుగా ఆకాశమార్గమున తీసుకొని వెళ్లాడు అని చెప్పాడు.
తరువాత మేము అడవిలో సీతను గూర్చి వెతుకుతూ దనువు అనే వాడు శాపవశమున వికృతాకారముతో మమ్ములను కబళించడానికి ప్రయత్నించాడు. అతని వలన మాకు మీ రాజు సుగ్రీవుని గురించి తెలిసింది. సీతను అపహరించిన వారి గురించి తెలుసుకొనడంలో సుగ్రీవుడు సామర్థ్యము కలవాడు అని అతడు మాకు తెలిపాడు. సుగ్రీవుని వెతుకుతూ మేము ఇక్కడకు వచ్చాము.
నీ ప్రశ్నలకు సమాధానంగా నేను మా గురించి, ఇక్కడకు మా రాక గురించి వివరంగా చెప్పాను. మేము మీ రాజు సుగ్రీవుని సహాయము కోరుతున్నాము. నేను, రాముడు మీ రాజు సుగ్రీవుని శరణు పొందాము. అయోధ్యాధిపతిగా ఉన్నప్పుడు ఏ రాముడు తన ప్రజలకు ధనకనకవస్తువాహనములను విరివిగా పంచి పెట్టాడో, ఏ రాముడు ముల్లోకములకు రక్షకుడో ఆ రాముడు మీ రాజు సుగ్రీవుని సహాయము కోరుతున్నాడు. ఏ దశరథుడు అందరికీ శరణాగత రక్షకుడుగా ఉండేవాడో, ఆ దశరథకుమారుడు రాముడు మీ రాజు సుగ్రీవుని శరణు కోరుతున్నాడు. ధర్మాన్ని పాలిస్తూ, లోకమునకు రక్షణ అందించిన నా రాముడు మీ రాజు సుగ్రీవుని శరణు కోరుతున్నాడు. ఏ రాముని అనుగ్రహంతో అయోధ్యా ప్రజలు సుఖంగా ఉన్నారో ఆ రాముడు మీ రాజు సుగ్రీవుని అనుగ్రహాన్ని కాంక్షిస్తున్నాడు. ఏ దశరథ మహారాజు తన సామంతురాజులందరినీ అనుగ్రహదృష్టితో చూస్తుంటాడో, ఆ దశరధ మహారాజు కుమారుడు, రాముడు మీ రాజు సుగ్రీవుని అనుగ్రహ వీక్షణాల కోసం ఎదురు చూస్తున్నాడు. తన భార్య సీతా వియోగంతో బాధపడుతున్న రాముని మీద మీ రాజు సుగ్రీవుడు తన అనుగ్రహం చూపాలి.” అని దీనంగా ప్రార్థించాడు లక్ష్మణుడు.
(పైనచెప్పబడిన లక్ష్మణుని దీనాలాపములు ప్రాచ్యప్రతిలో లేవు. ధీరోదాత్తుడైన లక్ష్మణుడు ఈ మాదిరి దీనంగా మాట్లాడటం అనుచితంగా ఉంది. కాబట్టి ఇవి తరువాత చేర్చబడినవిగా ఊహింపబడుతూ ఉంది.)
లక్ష్మణు మాటలు విన్న హనుమంతుడు చాలా సంతోషించాడు. “మా సుగ్రీవుడు మీతో తప్పకుండా మైత్రి చేస్తాడు. సుగ్రీవుడు కూడా బాధలలో ఉన్నాడు. సుగ్రీవుడు తన అన్న వాలితో వైరము పెట్టుకున్నాడు. ఎందుకంటే, వాలి తన తమ్ముడు సుగ్రీవుని భార్యను అపహరించాడు. సుగ్రీవుని అవమానించాడు. రాజ్యము నుండి వెళ్లగొట్టాడు. మీ మాదిరి మా రాజు సుగ్రీవుడు కూడా అరణ్యములలో దీనంగా కాలం గడుపుతున్నాడు. మా రాజు మాతో కలిసి సీతను వెదకడంలో మీకు సాయపడగలడు. మేమందరమూ కలిసి సీతను వెదుకుతాము. రండి మనం అందరము సుగ్రీవుడు మా రాజు సుగ్రీవుని వద్దకు వెళదాము.” అని అన్నాడు హనుమంతుడు.
ఆ మాటలు విన్న లక్ష్మణుడు రాముని చూచి “రామా! సుగ్రీవునికి కూడా మన అవసరము ఉంది. మనకూ సుగ్రీవుని అవసరము ఉంది. కాబట్టి మన కార్యము సఫలము అయినట్టే. ఇతని మాటలు ముఖ కళవళికలు చూస్తుంటే నాకు ఇతని మీద నమ్మకం కలుగుతూ ఉంది. ఇతని ముఖం చూస్తే ఇతడు అబద్ధం ఆడతాడు అని అనిపించడం లేదు. మనం వీరితో స్నేహం చేయవచ్చు.” అని అన్నాడు లక్ష్మణుడు.
ఇంతలో హనుమంతుడు తన సన్యాసి రూపము విడిచి తన నిజరూపము అయిన వానర రూపము ధరించాడు. శరీరం పెంచాడు. రామలక్ష్మణులను తన బుజాల మీద ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసుకొని వెళ్లాడు. హనుమంతుడు కూడా తన రాజు సుగ్రీవునికి మరలా రాజ్య ప్రాప్తి కలుగుతుందనే సంతోషంతో రామలక్ష్మణులను సుగ్రీవుని వద్దకు తీసుకొని వెళ్లాడు.
రామాయణంలోని కిష్కింధాకాండ తృతీయ సర్గలో, సుగ్రీవుడు రాముని సహాయంతో తన అన్న వాలిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతాడు. సుగ్రీవుడు, రాముడు కలిసి, వాలిని సవాలు చేయడానికి పథకాలు వేస్తారు. సుగ్రీవుడు వాలిని పిలిచి, సవాలు చేస్తాడు. రాముడు తన విల్లుతో దాక్కుని ఉంటాడు, సుగ్రీవుడు వాలితో యుద్ధం చేస్తాడు. రాముడు సుగ్రీవుని గుర్తించడానికి ఒక సూచిక ఇవ్వమని సూచిస్తాడు, ఎందుకంటే వాలి, సుగ్రీవులు ఒకేలా కనిపిస్తారు. సుగ్రీవుడు మెడలో పచ్చ కంబళిని ధరిస్తాడు. రాముడు ఈ సూచికతో వాలిని బాణంతో వధిస్తాడు. సుగ్రీవుడు తన రాజ్యాన్ని తిరిగి పొందుతాడు.
సుగ్రీవుడు చెప్పిన మాటలను జాగ్రత్తగా విన్నాడు హనుమంతుడు. వెంటనే ఋష్యమూక పర్వతము నుండి రామలక్ష్మణులు ఉన్నచోటికి వెళ్లాడు. హనుమంతుడికి ఆ మానవులు ఎవరో తెలియదు. అందుకని నిజరూపంతో పోకుండా ఒక సన్యాసి వేషము ధరించాడు. రామలక్ష్మణుల ముందుకు వెళ్లాడు. రామ లక్ష్మణులు సన్యాసి వేషములో ఉన్న హనుమంతుని చూచి అభివాదము చేసారు. రామలక్ష్మణులను చూచి హనుమంతుడు ఇలా అన్నాడు.
“మీరు ముని కుమారులవలె ఉన్నారు. కాని మీ చేతిలో ధనుర్బాణములు ఉన్నవి. మీరు వీరుల వలె కనపడుతున్నారు. కాని జటాజూటములు ధరించి ఉన్నారు. మీరు ఒకరిని ఒకరు పోలి ఉన్నారు. కవలలవలె ఉన్నారు. మీరు దేవలోకము నుండి దిగివచ్చిన సూర్య చంద్రుల మాదిరి కనపడుతున్నారు. దేవతారూపములలో ఉన్న మానవుల మాదిరి కనపడుతున్నారు.
మీరు ఆజానుబాహులుకదా! మరి మీరు ఎటువంటి అలంకారములు ధరించలేదేమి? మిమ్ములను చూస్తుంటే మీరు ఈ భూమండలము అంతా పరిపాలించ గల సమర్థులు అని నమ్ముతున్నాను. మీ గురించి మాకు తెలపండి.
ఇక నా గురించి చెబుతాను వినండి. నా పేరు హనుమంతుడు. వానర రాజు సుగ్రీవుడు మా ప్రభువు. ఈ ఋష్యమూక పర్వతము మీద ఉన్నాడు. ఆయన మీ గురించి తెలుసుకొని రమ్మని నన్ను పంపాడు. కాబట్టి మీ వివరాలు నాకు తెలియజేయండి.” అని పలికాడు హనుమంతుడు.
ఆ మాటలకు రాముడు చాలా సంతోషించాడు. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టయింది అని అనుకున్నాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “లక్ష్మణా! మనము ఎవరి కోసరం వెదుకుతున్నామో ఆ సుగ్రీవుని మంత్రి మనవద్దకు వచ్చాడు. ఈ వానరుని మాటలు చూడగా మనతో స్నేహము చేయవలెనని తలంపుతో ఉన్నట్టు కనపడుతూ ఉంది. ఇతడు చాకచక్యంగా మాట్లాడటం తెలిసిన వాడు. మంచి స్నేహశీలి. కాబట్టి లక్ష్మణా! ఇతనితో నీవు మాట్లాడు. నాకు చూడగా ఇతడు నాలుగు వేదములు, వ్యాకరణశాస్త్రము చదివిన వాడులాగా కనపడుతున్నాడు. లేకపోతే ఇంత చాకచక్యముగా, ఒక్క అపశబ్దము కూడా లేకుండా మాటలాడలేడు.
లక్ష్మణా! ఇతని శరీరములో ఎక్కడా ఒక్క అవలక్షణము కూడా కనపడటం లేదు. సర్వలక్షణ సంపన్నుడు లాగా ఉన్నాడు. ఇతని మాటలు వింటుంటే ఇంకా వినాలని అనిపిస్తూ ఉంది కానీ విసుగురావడం లేదు. కాబట్టి నీవు అతనితో మాటలాడుము.” అని అన్నాడు రాముడు.
అప్పుడు లక్ష్మణుడు హనుమంతునితో తాము వచ్చిన పని సూటిగా తెలిసాడు. ” మేము అయోధ్యాధిపతి దశరథుని కుమారులము. ఇతను రాముడు. నా పేరు లక్ష్మణుడు. నా అన్న రాముని భార్యను ఎవరో రాక్షసుడు అపహరించాడు. ఆమెను మేము వెతుకుతున్నాము. మీ రాజు సుగ్రీవుడు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడని తెలిసింది. అందువలన మీ రాజు సుగ్రీవునితో స్నేహము చేయవలెనని, పరస్పరసాయము చేసుకొనవలెనని అభిలషించుచున్నాము.”అని సూటిగా బదులు చెప్పాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు పలికినపలుకులు విన్న హనుమంతుడు చాలా సంతోషించాడు. తన రాజు సుగ్రీవుని పని కూడా సానుకూలము అవుతుందని మనసులో అనుకున్నాడు.
శ్రీమద్రామాయణముకిష్కింధాకాండము మూడవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ షష్టితమః సర్గం రామాయణంలోని అరణ్యకాండలో 60వ అధ్యాయం. ఈ సర్గలో రాముడు, సీత, లక్ష్మణులు పంచవటిలో ఉంటారు. రావణుడు మారీచుడి సహాయంతో సీతను అపహరించడానికి కుట్ర పన్నుతాడు. మారీచుడు మాయామృగం రూపంలో వచ్చి, సీతను ఆకర్షిస్తాడు. సీత ఆ మృగాన్ని పట్టుకోవాలనడంతో, రాముడు దాన్ని వెంబడించడానికి వెళ్ళిపోతాడు. రాముడు వెళ్ళిపోయిన తర్వాత, రావణుడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చి సీతను అపహరిస్తాడు.
రాముడు సీత కోసం పిచ్చిగా పర్ణశాల అంతా తిరుగు తున్నాడు పరిసరాలు వెతికిన చోటనే వెతుకుతున్నాడు. సీత ఎక్కడన్నా దొరక్కపోతుందా అనే కొన ఆశతో వెదుకుతున్నాడు. సీత నిలబడ్డ చోటు, సీత కూర్చున్న చోటు, సీత వాడిన దర్భాసనము, వీటిని చూచి భోరున విలపిస్తున్నాడు.
“నాసీతను రాక్షసులు పీక్కుతిని ఉంటారు. లేదా రాక్షసులను చూచి సీత మరణించి ఉంటుంది. లేక సీతను ఎవరైనా అపహరించి ఉంటారు. లేక సీత నన్ను వెదుక్కుంటూ అరణ్యంలో దారి తప్పిపోయి ఉంటుంది. లేక సీత నన్ను ఆట పట్టించడానికి ఎక్కడైనా దాక్కుని ఉంటుంది. లేదా పుష్పములు ఫలములు తీసుకురావడానికి ఆడవిలోకి వెళ్లి ఉంటుందేమో! సీతకు తామర పూలుఅంటే ఇష్టం. వాటిని కోయడానికి సరస్సు వద్దకు వెళ్ళిందేమో, లేక సీత నీరు తీసుకురావడానికి గోదావరి తీరాననికివెళ్లి ఉంటుందా!” ఇలా పరి పరి విధములుగా ఆలోచిస్తూ ఆ ప్రాంతం అంటా కలయ తిరుగుతున్నాడు రాముడు.
ఒక చెట్టు దగ్గర నుండి మరొక చెట్టు వద్దకు, ఒక కొండ నుండి మరొక కొండవద్దకు, ఒక కాలువనుండి మరొక కాలువ వద్దకు తిరుగుతున్నాడు. పొదలు, పుట్టలు గుట్టలు వెదుకుతున్నాడు. చెట్లను అడుగుతున్నాడు. సీతకు ఇష్టమైనపూలమొక్కలను అడుగుతున్నాడు. పూలను అడుగుతున్నాడు. పిచ్చివాడి వలె వాటితో మాట్లాడుతున్నాడు. ఏడుస్తున్నాడు.
చెట్లు, పుట్టలు, మొక్కలు అయిపోయిన తరువాత అక్కడ ఉన్న సీత పెంపుడు జంతువులను అడుగుతున్నాడు. జింకలను, ఏనుగులను అడుగుతున్నాడు. తరువాత సీత తనకళ్ల ఎదురుగాఉన్నట్టు ఊహించు కుంటూ తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. సీత పరుగెత్తుతున్నట్టు ఊహించుకుంటూ ఆమెను ఆగమని అరుస్తున్నాడు. అంతలోనే నిరాశ. సీతను ఎవరో చంపేసి ఉంటారు అని కుమిలిపోతున్నాడు. రాక్షసులు ఆమెను చంపేటప్పుడు, గొంతునులిమే టప్పుడు సీత ఎలా బాధపడి ఉంటుందో తలచుకుంటూ ఏడుస్తున్నాడు. “సీతను నేను రాక్షసులకు ఆహారంగా వదిలి వెళ్లినట్టున్నాను.” అని అనుకుంటూ కుమిలి పోతున్నాడు.
లక్ష్మణునిపట్టుకొని “లక్ష్మణా! సీతనీకు ఎక్కడైనా కనిపించిందా” అని నిలదీసి అడుగుతున్నాడు. దాదాపు ఉన్నత్త స్థితిలో ఉన్నాడు. రాముడు.
(రాముడు ఇలా అధైర్యంగా, బేలగా, ఏడవడం గురించిన ఈ సర్గ ప్రాచ్యప్రతిలో లేదు అని పండితుల అభిప్రాయము).
రామాయణంలోని కిష్కింధాకాండ ద్వితీయ సర్గలో, హనుమంతుడు రాముడు, లక్ష్మణుడిని సుగ్రీవుని వద్దకు తీసుకువస్తాడు. సుగ్రీవుడు తన పీడలను వివరించి, వాలి తో విభేదించి, రాముని సాయంతో వాలిని సవాలు చేయాలని కోరుకుంటాడు. రాముడు, సుగ్రీవుని సమస్యలను వినిపించి, సాయం చేస్తానని హామీ ఇస్తాడు. సుగ్రీవుడు తన భయాలను, సీతాన్వేషణను రామునితో చర్చిస్తాడు. సుగ్రీవుడు రాముని స్నేహం మరియు సాయాన్ని స్వీకరించి, తన పునరుద్ధరణ కోసం ముందుకు సాగుతాడు. ఈ సర్గలో సుగ్రీవ-రాముల స్నేహం మరింత బలపడుతుంది.
రామ లక్ష్మణులను చూచి పారి పోయిన సుగ్రీవుడు ఇంకా భయపడుతూనే ఉన్నాడు. ఒక చోట నిలవడం లేదు. అన్ని దిక్కులా చూస్తున్నాడు. రామలక్ష్మణులు ఎటు వైపు నుండి వచ్చి తన మీద దాడి చేస్తారేమోనని భయంతో వణికిపోతున్నాడు. మహాబలవంతులు, ధనురాణములు ధరించిన రామలక్ష్మణులను చూచి సుగ్రీవునకు ధైర్యం సడలిపోయింది. బాగా ఆలోచించాడు. తన బలం గొప్పదా లేక ఆ మానవుల బలం గొప్పదా అని తనలో తాను తర్కించుకుంటున్నాడు. తనతో పాటుగా ఉన్న మంత్రులను పిలిచాడు. వారికి రామలక్ష్మణుల గురించి చెప్పాడు.
“అదుగో అటు చూడండి. ఆ మానవులు ఇద్దరూ నారచీరలు కట్టుకొని, ధనుర్బాణములు ధరించి దేనికోసమో వెదుకుతున్నారు. వారు వాలి పంపిన వారు అని నా అనుమానము. లేకపోతే క్రూరమృగములు సంచరించు, మానవులు చొరరాని ఈ దుర్గమారణ్యములో ఈ మానవులకు ఏమి పని. వీరు నిశ్శంశయంగా వాలి నాకోసం పంపినవారే. మనము ఇక్కడి నుండి వేరు చోటికి వెళ్లడం మంచిది.” అని అన్నాడు సుగ్రీవుడు.
సుగ్రీవుని మాట ప్రకారము ఆ వానరులు అందరూ వేరే ప్రదేశానికి వెళ్లారు. అక్కడ అందరూ వలయాకారంలో కూర్చున్నారు. మధ్యలో సుగ్రీవుడు కూర్చున్నాడు. ఆ వానరులలో హనుమంతుడు అనే పేరుగల వానరుడు, రామలక్ష్మణులను గురించి భయపడుతున్న సుగ్రీవుని చూచి ఇలా అన్నాడు.
“ఓ వానర రాజా! నీవు ఎందుకు వాలిగురించి భయపడతావు. మనము మలయ పర్వతము మీద ఉన్నాము. వాలి ఈ పర్వతము మీదికి రాలేడు. కాబట్టి వాలి వలన మనకు భయం లేదు. అదీ కాకుండా మనకు కనుచూపు మేరలో వాలి కనపడటం లేదు కదా. మరి నువ్వు వాలి గురించి ఎందుకు భయపడుతున్నావు. నీ భయానికి నాకు కారణం కనిపించడం లేదు. నీవు వాలి గురించి అనవసరంగా భయపడుతున్నావు. ఆ భయం వలన నీకు బుద్ధి క్షీణించింది. పైగా వానరసహజమైన చపలత్వము నిన్ను ఆవహించింది.
సుగ్రీవా! నీవు వానర రాజువు. రాజే ఇలా భయపడితే ఎలాగ? నీ మనస్సును ధృఢంగా ఉంచుకో. అనవసరంగా భయాందోళనలకు గురి కావద్దు. స్థిరమైన బుద్ధితో ఆలోచించు. స్థిరబుద్ధితో ఆలోచించ లేని రాజు ప్రజలను పాలించడానికి అర్హుడు కాడు. కాబట్టి భయపడటం మాను.” అని హితోపదేశం చేశాడు హనుమంతుడు. హనుమంతుని మాటలతో సుగ్రీవుని భయం తగ్గింది. హనుమంతునితో సుగ్రీవుడు ఇలా అన్నాడు. “అది కాదు హనుమాన్! ఆ మానవులను చూడు. వారు ఆజానుబాహులు. ధృడకాయులు. ధనుర్బాణములు ధరించిన వారు. వారిని చూచి ఎవరికి భయం కలగదు చెప్పు. వారు వాలి పంపగా నాకోసం వచ్చినవారే. సందేహము లేదు. లేకపోతే ఆ మానవులకు ఈ ఘోరారణ్యములో ఏమి పని.
వాలికి ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. వారిలో వీరూ ఒకరేమో! వీరిని వాలి పంపాడేమో! వాలిని నమ్మకూడదు. శత్రువులను ఒక కంటితో కనిపెట్టి ఉండటం రాజధర్మం కదా! అందులోనూ కపటంగా వ్యవహరించే వాలితో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనం భయపడకుండా, వారేం చేస్తారులే అని నిర్లక్ష్యంగా ఉంటే, అదును చూచి శత్రువులు మన మీద దెబ్బతీస్తారు. పైగా వాలి చాలా తెలివిగలవాడు. మన గురించి అన్ని విషయములను సేకరిస్తూ ఉంటాడు. అలాంటి వారి గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
కాబట్టి మనం ఒక పని చేద్దాము. ఓ వానర వీరుడా! హనుమా! నువ్వు సామాన్య మానవుని వేషంలో ఆ మానవుల వద్దకు వెళ్లు. వారి ఇంగితమును గ్రహించు. నీ మాటలతో వారు ఎవరో! ఎక్కడ నుండి వచ్చారో! ఇక్కడకు ఎందుకు వచ్చారో! ఎవరి కోసరం వచ్చారో నేర్పుగా మాట్లాడి తెలుసుకో! వారిని నీ పొగడ్తలతో సానుకూల పరుచుకో. చక్కగా మాట్లాడు. వారి మనోభావాలను గుర్తించు. వారికి నీ మీద విశ్వాసం కలిగేటట్టు ప్రవర్తించు. అసలు వారు ఇక్కడకు ఎందుకు వచ్చారో తెలుసుకో. ఆ మానవులు ఏమైనా దురాలోచనలతో వచ్చారా! లేక నిర్మలమైన మనస్సులతో వచ్చారా అనే విషయం గ్రహించు. అసలు వాళ్లు మంచి లేక అనే విషయాన్ని వారి మాట్లాడే మాటలను బట్టి పసిగట్టు. వెళ్లు. కార్యము సానుకూలం చేసుకొని రా!” అని సుగ్రీవుడు హనుమంతుని రామలక్ష్మణుల వద్దకు దూతగా పంపాడు.