మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ద్విషష్టితమః సర్గం అంటే రామాయణంలోని అరణ్యకాండ యొక్క 62వ అధ్యాయం. ఈ సర్గలో, రాముడు, సీతా, లక్ష్మణులు దండకారణ్యంలో అనేక కష్టాలను ఎదుర్కొంటారు. ప్రధాన సంఘటన సీత హరణం. రాక్షసుడు రావణుడు, సీతను అపహరించడానికి వచ్చి, ఆమెను బలవంతంగా తన రథంలో ఎక్కించుకొని, లంకకు తీసుకువెళ్తాడు. సీత విడిపించబడటానికి ఆర్తనాదం చేస్తుంది, కానీ ఆమెను రక్షించడానికి ఎవ్వరూ ఉండరు.
వివాహం అయినప్పటి నుండి తనను క్షణం కూడా ఎడ బాయని సీత ఒక్కసారిగా తనను విడిచి పోవడం చూచి రాముడు హతాశుడయ్యాడు. రాముడికి కన్ను మూసినా తెరిచినా సీత రూపమే కనిపిస్తూ ఉంది. సీత చెట్ల నుండి పూలు కోస్తున్నట్టు, పూపొదలలో తిరుగుతున్నట్టు ఊహించుకుంటున్నాడు. ఆమెను తన దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. తన దగ్గరకు రాలేదేమా అని అలుగుతున్నాడు. సీత తనను ఆట పట్టించడానికి తనకు దూరంగా తనకు కనపడకుండా ఉందని ఆమెను రా రమ్మని పిలుస్తున్నాడు. నీవు లేకపోతే పర్ణశాల శూన్యంగా ఉందని నిష్టూరం ఆడుతున్నాడు. ఎంతకూ సీ కనపడలేదు.
మరలా లక్ష్మణుడి వంక చూచాడు. “లక్ష్మణా! నేను ఇంతగా పిలుస్తుంటే, ఇంతగా పరితపిస్తుంటే సీత ఎందుకు రావడం లేదు. సీతను రాక్షసులు చంపి తిని ఉంటారంటావా!” అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు.
మరలా తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. “ఓ సీతా! నీకు ఎంత ఆపద సంభవించినది. ఇది తెలిస్తే పాపం కైక ఎంత సంతోషిస్తుందో! ఆమె కోరిక తీరినట్టయింది కదా! సీతా! నీతో కలిసి అయోధ్యనుండి బయటకు కాలు పెట్టాను. వనవాసానంతరము నీవు లేకుండా అయోధ్యలో ఎలా కాలు పెట్టను? సీతను ఎవరికో అప్పగించి వచ్చాను అని తలిస్తే జనం నన్ను పిరికి వాడనీ, పరాక్రమం లేని వాడనీ నిందించరా!
నిజమే! నేను పిరికివాడినే! లేకపోతే చేతిలో ధనుర్బాణములు ఉండగా నిన్ను పోగొట్టుకున్నానే! నేను నిజంగా పిరికివాడినే! మీ తండ్రి జనక మహారాజు వచ్చి ‘నాకుమార్తె సీత ఎక్కడ?” అంటే నేను ఏమి సమాధానం చెప్పాలి. ఆయనకు నా మొహం ఎలా చూపించాలి? అసలు నీవు నా పక్కన లేకుండా చూచి మీ తండ్రి జనకుడు మూర్ఛ చెందడా! అందుకే నేను మరలా అయోధ్యకు వెళ్లను? సీతలేని అయోధ్యలో నేను ఉండలేను.” అని సీత తన ఎదురుగా ఉన్నట్టు ఊహించుకొనని మాట్లాడుతున్నాడు.
ఇంతలో లక్ష్మణుని వంక తిరిగాడు. “లక్ష్మణా! నీవు అయోధ్యకు వెళ్లు. నా కోసరం నువ్వుకూడా ఎందుకు ఈ అడవులలో బాధలుపడతావు. భరతుని శాశ్వతంగా రాజ్యం ఏలుకోమని నామాటగా చెప్పు. నాకు బదులు నా తల్లి కౌసల్యకు నీ తల్లి సుమిత్రకు అభివాదము చెయ్యి నా తల్లిని జాగ్రత్తగా చూసుకో! ఆమె చెప్పిన పనులు చేస్తూ ఉండు. లక్ష్మణా! నా తల్లికి నీవు ఇక్కడ జరిగిన విషయాలు సవిస్తరంగా వివరించు. మాయలేడి రావడం, సీత ఆ లేడి కావాలని కోరడం, నేను దాని కోసరం వెళ్లడం, దానిని కొట్టడం, ఆ లేడి రాక్షసుడుగా మారి అరవడం. నువ్వు రావడం, సీత కనపడకపోవడం, సీత కోసరం నేను విలపించడం, అన్నీ వివరించు.” అని అప్పగింతలు పెడుతున్న రాముని చూచి లక్ష్మణుడు భయంతో వణికిపోయాడు. సీతావియోగదుఃఖం తట్టుకోలేక రాముడు ఎటువంటి దుస్థితికి లోనవుతాడో అని భయపడ్డాడు లక్ష్మణుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకషష్టితమః సర్గం రామాయణంలోని అరణ్యకాండలో 61వ అధ్యాయం. ఈ సర్గలో రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకెళ్లడానికి యత్నాలు ప్రారంభిస్తాడు. సీత అపహరణ సమయంలో జటాయువు రావణుని అడ్డుకుంటాడు. జటాయువు సీతను కాపాడేందుకు రావణుడితో యుద్ధం చేస్తాడు, కానీ రావణుడు జటాయువును గాయపరచి సీతను లంకకు తీసుకెళ్తాడు. రాముడు, లక్ష్మణుడు తిరిగి వచ్చినప్పుడు సీత కనిపించకపోవడంతో, జటాయువుతో జరిగిన సంఘటన గురించి తెలుసుకుంటారు.
ప్రాణాధికంగా ప్రేమించిన భార్య సీత హటాత్తుగా కనపడక పోయేసరికి రాముడికి దుఃఖము, కోపము ముంచుకొచ్చాయి. దానికి కారణం లక్ష్మణుడు అని రాముని అభిప్రాయము. అడగాలంటే లక్ష్మణుని అడగాలి. అందుకే పదే పదే లక్ష్మణుని అడుగుతున్నాడు.
“లక్ష్మణా! చెప్పు. నా భార్య సీత ఎక్కడ ఉంది. నీకు అప్పగించి వెళ్లాను కదా. నా భార్యను ఏమి చేసావు? ఆమె ఎక్కడకు వెళ్లి ఉంటుంది. నా భార్యను ఎవరు బలవంతంగా తీసుకొని వెళ్లారు? నా భార్యను ఎవరు చంపి తిన్నారు? చెప్పు” అంటూ నిలదీస్తున్నాడు.
లక్ష్మణుడికి సీత గురించి తెలియదు అని రామునికి తెలుసు. కాని మనసు నిలవడం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. కాబట్టి చేస్తున్నాడు. లక్ష్మణుని విడిచి పెట్టాడు.
చెట్ల దగ్గరకుపోయి “సీతా సీతా రా! ఎక్కడ దాక్కుని ఉ న్నావు” అని బిగ్గరగా పిలుస్తున్నాడు.
“ఓ సీతా! నీవు ఎక్కడన్నా ఆడుకుంటున్నావా! ఇందాక లేడిపిల్ల కావాలి అని అడిగావు కదా. నీకు ఏదైనా లేడి దొరికిందా. దానితో ఆడుతున్నావా. త్వరగా రా” అని ఎలుగెత్తి పిలుస్తున్నాడు.
మరలా రాముడు లక్ష్మణుని వద్దకు వచ్చాడు. “లక్ష్మణా! సీత లేకుండా నేను బతకలేను లక్ష్మణా! సీతా వియోగంతో కృంగి కృశించి చచ్చిపోతాను. నా తండ్రి దశరథుని పరలోకంలో కలుసుకుంటాను. కాని నాకు ఒకటే భయం. నా తండ్రి నన్ను చూచి “నిన్ను 14 ఏళ్లు వనవాసము చెయ్యమన్నాను కదా. వనవాస కాలము పూర్తి కాకుండా అప్పుడే వచ్చావేమిటి” అని అడిగితే ఏమి చెప్పాలి? నా తండ్రి నన్ను “నువ్వు మాట మీద నిలబడే వాడివి కాదు. నీవు అన్నీ అబద్ధాలు చెబుతావు” అని నిందిస్తే ఎలా భరించాలి. ” అని లక్ష్మణునితో వాపోయాడు.
మరలాసీత గుర్తుకు వచ్చింది. “సీతా! సీతా! ఎక్కడున్నావు సీతా! నన్ను విడిచి పెట్టి ఎక్కడకుపోయావు సీతా! నన్ను విడువకు సీతా. నీవులేనిదే నాకు జీవితం లేదుసీతా!” అని బిగ్గరగా ఏడుస్తున్నాడు.
రాముడు ఎంత ఏడ్చినా సీత తిరిగి రాలేదు. ఇదంతా మౌనంగా చూస్తున్నాడు లక్ష్మణుడు. ఇదంతా తన వల్లే కదా అని మనసులో బాధపడుతున్నాడు. కాసేపు సీత అన్న మాటలను భరిస్తే, కాసేపు సీతకు కనపడకుండా మొహం తప్పిస్తే, ఇంత ఆపద వచ్చి ఉ డేది కాదు కదా అని వాపోతున్నాడు. కాని తన బాధను బయటకు కనపడనీయకుండా రామునికి ధైర్యం చెబుతున్నాడు లక్ష్మణుడు.
“అన్నయ్యా! ఏమిటీ వెర్రి. నీవంటి ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు, ఇంత విషాదము చెందవలెనా! సీత ఎక్కడకూ వెళ్లదు. నీళ్లు తీసుకురావడానికి సరస్సుకు వెళ్లి ఉంటుంది. లేక ఈ అరణ్యములో ఎన్నో కొండగుహలు ఉన్నాయి కదా! ఏ గుహలోనో దాని అందాలు చూస్తూ ఉండి ఉంటుంది. లేక స్నానము చేయడానికి నదికి వెళ్లిందేమో! లేక నిన్ను ఆట పట్టించడానికి ఎక్కడైనా దాక్కుని ఉందేమో! తను కాసేపు కనపడకపోతే మనము ఏమి చేస్తామో అని చూడటానికి ఎక్కడన్నా దాగిఉండవచ్చును.
కాబట్టి ఓ రామా! మనము ఆమెను వెదకడానికి ప్రయత్నం చేద్దాము. అంతేకానీ ఇలా దుఃఖించడం వలన ప్రయోజనము లేదు కదా! నీవు దుఃఖము మాని నాకు అనుజ్ఞ ఇస్తే నేను అడవి అంతా గాలించి సీత జాడ తెలుసుకొనివస్తాను.” అని అన్నాడు లక్ష్మణుడు.
లక్ష్మణుడి మాటలకు ఎంతోసంతోషించాడు రాముడు. “లక్ష్మణా! నువ్వు ఒక్కడివే ఎందుకు. మనం ఇద్దరం కలిసి వెదుకుదాము.” అని అన్నాడు.
తరువాత రాముడు లక్ష్మణుడు కలిసి సీతను వెదకడం మొదలెట్టారు. అడవి అంతా గాలించారు. పక్కనున్న పర్వతములు అన్నీ కలయతిరిగారు. నదీతీరములు వెదికారు. సరస్సులవద్ద వెతికారు. ఎంత వెదికినా సీత కనపడలేదు.
“లక్ష్మణా! ఎంతవెదికినా సీత కపపడటం లేదు. ఏం చేద్దాము.” అని నిరాశగా అన్నాడు రాముడు.
“రామా! అంతలోనే నిరాశచెందకుము. సీత మనకు తప్పకుండా కనపడుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. సీత బతికేఉంది. అందులో సందేహము లేదు.” అని అన్నాడు లక్ష్మణుడు.
“ఏం దొరకడమో ఏమో! మనం ఇద్దరం ఈ అడవి అంతా గాలించాము కదా! సీత సాధారణంగా వెళ్లే ప్రదేశాలు, సరస్సులు, నదీతీరము, పర్వతములు అన్నీ వెదికాము కదా! కాని సీత కనిపించలేదు. ఏం చెయ్యాలో తోచడంలేదు.” అని దుఃఖిస్తున్నాడు.
రాముడు. “సీతాసీతా!” అని మాటి మాటికీ సీతను తలుచుకుంటున్నాడు.
లక్ష్మణుడు రాముని శాయశక్తులా ఓదారుస్తున్నాడు. కాని రాముని దుఃఖము ఉపశమించడం లేదు. అలా సీత కోసం దుఃఖిస్తూనే ఉన్నాడు రాముడు.
కిష్కింధాకాండలో చతుర్థ సర్గ, వాలి వధ అనంతరం సుగ్రీవుడు కిష్కింధ రాజ్యాన్ని పొందుతాడు. సుగ్రీవుడు రాముని సహాయం చేయడానికి తన సైన్యాన్ని సిద్ధం చేయడానికి సమయం తీసుకుంటాడు. వానర సైన్యం సీతాన్వేషణ కోసం వేర్వేరు దిశల్లో పంపబడుతుంది. రాముడు సుగ్రీవుడికి తన బాధను, సీతను వెంటనే వెతకాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తాడు. హనుమంతుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు వంటి ప్రముఖ వానరులు ఈ అన్వేషణలో ముఖ్యపాత్ర పోషిస్తారు. సుగ్రీవుడు, తన ప్రామాణికతను చాటుకొని, సీతను వెతకడం కోసం అన్ని వనరులను వినియోగిస్తాడు. రాముడు, లక్ష్మణుడు ఈ ప్రయత్నంలో ఆశగా ఎదురు చూస్తారు.
లక్ష్మణుని మాటలు విన్న హనుమంతుడు వారు తమకు శత్రువులు కారనీ, వాలి పంపిన వారు కారనీ, ఒక కార్యము నిమిత్తము తిరుగుతున్నారనీ, వీరి మైత్రితో సుగ్రీవుని కష్టములు కూడా గట్టెక్కుతా యని సంతోషించాడు. వీరు కూడా సుగ్రీవుని వలె కష్టములలో ఉన్నట్టున్నారు. వీరి కష్టములను సుగ్రీవుడు తీర్చగలడు. అప్పుడు వీరు కూడా సుగ్రీవునకు సాయము చెయ్యగలరు. వాలి నుండి సుగ్రీవునికి రాజ్యప్రాప్తి కలుగుతుంది.” అని సంతోషించాడు.
తరువాత హనుమంతుడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “మీరు చూడబోతే మునికుమారులవలె ఉన్నారు. కాని చేతిలో ధనుర్బాణములు ఉన్నవి. మీరు ఎవరికోసమో వెతుకుతున్నట్టు కనపడుతూ ఉంది. మీ గురించి వివరంగా చెప్పండి. మీ మాటలు నేను మా రాజుకు చెప్పాలి కదా!” అని అన్నాడు హనుమంతుడు.
అప్పుడు లక్ష్మణుడు హనుమంతునితో ఇలా అన్నాడు. “ఓహనుమా! ఈయన పేరు రాముడు. ఇక్ష్వాకు వంశములో జన్మించిన అయోధ్యాధిపతి దశరథుని పెద్ద కుమారుడు. గుణవంతుడు, రాజ్యము చేయుటకు అర్హుడు. కాని ఒకానొక కారణమున రామునికి రాజ్యము లభించలేదు. పైగా అరణ్యవాసము సంప్రాప్తించింది. రాముని భార్యపేరు సీత. సూర్యుని విడిచి కాంతి ఉండలేనట్టు, రాముని భార్య సీతకూడా, భర్తను విడిచి ఉండలేక, రామునితోపాటు అరణ్యములకు వచ్చింది.
నేను రాముని తమ్ముడను. నా పేరు లక్షణుడు. నేను నా అన్న వదిలను సేవించుకుంటూ వారి వెంట అరణ్యములకు వచ్చాను. మేము పర్ణశాలలో లేని సమయమున, సీత ఒంటరిగా ఉన్నప్పుడు, మాయావి అయిన ఒక రాక్షసుడు రాముని భార్య సీతను అపహరించాడు. మేము సీతను వెతుకుతూ ఉండగా, మా తండ్రి దశరథునికి మిత్రుడు అయిన జటాయువు అనే పక్షిరాజు కనిపించి, సీతను రావణుడు అనే రాక్షసుడు అపహరించి, దక్షిణ దిక్కుగా ఆకాశమార్గమున తీసుకొని వెళ్లాడు అని చెప్పాడు.
తరువాత మేము అడవిలో సీతను గూర్చి వెతుకుతూ దనువు అనే వాడు శాపవశమున వికృతాకారముతో మమ్ములను కబళించడానికి ప్రయత్నించాడు. అతని వలన మాకు మీ రాజు సుగ్రీవుని గురించి తెలిసింది. సీతను అపహరించిన వారి గురించి తెలుసుకొనడంలో సుగ్రీవుడు సామర్థ్యము కలవాడు అని అతడు మాకు తెలిపాడు. సుగ్రీవుని వెతుకుతూ మేము ఇక్కడకు వచ్చాము.
నీ ప్రశ్నలకు సమాధానంగా నేను మా గురించి, ఇక్కడకు మా రాక గురించి వివరంగా చెప్పాను. మేము మీ రాజు సుగ్రీవుని సహాయము కోరుతున్నాము. నేను, రాముడు మీ రాజు సుగ్రీవుని శరణు పొందాము. అయోధ్యాధిపతిగా ఉన్నప్పుడు ఏ రాముడు తన ప్రజలకు ధనకనకవస్తువాహనములను విరివిగా పంచి పెట్టాడో, ఏ రాముడు ముల్లోకములకు రక్షకుడో ఆ రాముడు మీ రాజు సుగ్రీవుని సహాయము కోరుతున్నాడు. ఏ దశరథుడు అందరికీ శరణాగత రక్షకుడుగా ఉండేవాడో, ఆ దశరథకుమారుడు రాముడు మీ రాజు సుగ్రీవుని శరణు కోరుతున్నాడు. ధర్మాన్ని పాలిస్తూ, లోకమునకు రక్షణ అందించిన నా రాముడు మీ రాజు సుగ్రీవుని శరణు కోరుతున్నాడు. ఏ రాముని అనుగ్రహంతో అయోధ్యా ప్రజలు సుఖంగా ఉన్నారో ఆ రాముడు మీ రాజు సుగ్రీవుని అనుగ్రహాన్ని కాంక్షిస్తున్నాడు. ఏ దశరథ మహారాజు తన సామంతురాజులందరినీ అనుగ్రహదృష్టితో చూస్తుంటాడో, ఆ దశరధ మహారాజు కుమారుడు, రాముడు మీ రాజు సుగ్రీవుని అనుగ్రహ వీక్షణాల కోసం ఎదురు చూస్తున్నాడు. తన భార్య సీతా వియోగంతో బాధపడుతున్న రాముని మీద మీ రాజు సుగ్రీవుడు తన అనుగ్రహం చూపాలి.” అని దీనంగా ప్రార్థించాడు లక్ష్మణుడు.
(పైనచెప్పబడిన లక్ష్మణుని దీనాలాపములు ప్రాచ్యప్రతిలో లేవు. ధీరోదాత్తుడైన లక్ష్మణుడు ఈ మాదిరి దీనంగా మాట్లాడటం అనుచితంగా ఉంది. కాబట్టి ఇవి తరువాత చేర్చబడినవిగా ఊహింపబడుతూ ఉంది.)
లక్ష్మణు మాటలు విన్న హనుమంతుడు చాలా సంతోషించాడు. “మా సుగ్రీవుడు మీతో తప్పకుండా మైత్రి చేస్తాడు. సుగ్రీవుడు కూడా బాధలలో ఉన్నాడు. సుగ్రీవుడు తన అన్న వాలితో వైరము పెట్టుకున్నాడు. ఎందుకంటే, వాలి తన తమ్ముడు సుగ్రీవుని భార్యను అపహరించాడు. సుగ్రీవుని అవమానించాడు. రాజ్యము నుండి వెళ్లగొట్టాడు. మీ మాదిరి మా రాజు సుగ్రీవుడు కూడా అరణ్యములలో దీనంగా కాలం గడుపుతున్నాడు. మా రాజు మాతో కలిసి సీతను వెదకడంలో మీకు సాయపడగలడు. మేమందరమూ కలిసి సీతను వెదుకుతాము. రండి మనం అందరము సుగ్రీవుడు మా రాజు సుగ్రీవుని వద్దకు వెళదాము.” అని అన్నాడు హనుమంతుడు.
ఆ మాటలు విన్న లక్ష్మణుడు రాముని చూచి “రామా! సుగ్రీవునికి కూడా మన అవసరము ఉంది. మనకూ సుగ్రీవుని అవసరము ఉంది. కాబట్టి మన కార్యము సఫలము అయినట్టే. ఇతని మాటలు ముఖ కళవళికలు చూస్తుంటే నాకు ఇతని మీద నమ్మకం కలుగుతూ ఉంది. ఇతని ముఖం చూస్తే ఇతడు అబద్ధం ఆడతాడు అని అనిపించడం లేదు. మనం వీరితో స్నేహం చేయవచ్చు.” అని అన్నాడు లక్ష్మణుడు.
ఇంతలో హనుమంతుడు తన సన్యాసి రూపము విడిచి తన నిజరూపము అయిన వానర రూపము ధరించాడు. శరీరం పెంచాడు. రామలక్ష్మణులను తన బుజాల మీద ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసుకొని వెళ్లాడు. హనుమంతుడు కూడా తన రాజు సుగ్రీవునికి మరలా రాజ్య ప్రాప్తి కలుగుతుందనే సంతోషంతో రామలక్ష్మణులను సుగ్రీవుని వద్దకు తీసుకొని వెళ్లాడు.
రామాయణంలోని కిష్కింధాకాండ తృతీయ సర్గలో, సుగ్రీవుడు రాముని సహాయంతో తన అన్న వాలిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతాడు. సుగ్రీవుడు, రాముడు కలిసి, వాలిని సవాలు చేయడానికి పథకాలు వేస్తారు. సుగ్రీవుడు వాలిని పిలిచి, సవాలు చేస్తాడు. రాముడు తన విల్లుతో దాక్కుని ఉంటాడు, సుగ్రీవుడు వాలితో యుద్ధం చేస్తాడు. రాముడు సుగ్రీవుని గుర్తించడానికి ఒక సూచిక ఇవ్వమని సూచిస్తాడు, ఎందుకంటే వాలి, సుగ్రీవులు ఒకేలా కనిపిస్తారు. సుగ్రీవుడు మెడలో పచ్చ కంబళిని ధరిస్తాడు. రాముడు ఈ సూచికతో వాలిని బాణంతో వధిస్తాడు. సుగ్రీవుడు తన రాజ్యాన్ని తిరిగి పొందుతాడు.
సుగ్రీవుడు చెప్పిన మాటలను జాగ్రత్తగా విన్నాడు హనుమంతుడు. వెంటనే ఋష్యమూక పర్వతము నుండి రామలక్ష్మణులు ఉన్నచోటికి వెళ్లాడు. హనుమంతుడికి ఆ మానవులు ఎవరో తెలియదు. అందుకని నిజరూపంతో పోకుండా ఒక సన్యాసి వేషము ధరించాడు. రామలక్ష్మణుల ముందుకు వెళ్లాడు. రామ లక్ష్మణులు సన్యాసి వేషములో ఉన్న హనుమంతుని చూచి అభివాదము చేసారు. రామలక్ష్మణులను చూచి హనుమంతుడు ఇలా అన్నాడు.
“మీరు ముని కుమారులవలె ఉన్నారు. కాని మీ చేతిలో ధనుర్బాణములు ఉన్నవి. మీరు వీరుల వలె కనపడుతున్నారు. కాని జటాజూటములు ధరించి ఉన్నారు. మీరు ఒకరిని ఒకరు పోలి ఉన్నారు. కవలలవలె ఉన్నారు. మీరు దేవలోకము నుండి దిగివచ్చిన సూర్య చంద్రుల మాదిరి కనపడుతున్నారు. దేవతారూపములలో ఉన్న మానవుల మాదిరి కనపడుతున్నారు.
మీరు ఆజానుబాహులుకదా! మరి మీరు ఎటువంటి అలంకారములు ధరించలేదేమి? మిమ్ములను చూస్తుంటే మీరు ఈ భూమండలము అంతా పరిపాలించ గల సమర్థులు అని నమ్ముతున్నాను. మీ గురించి మాకు తెలపండి.
ఇక నా గురించి చెబుతాను వినండి. నా పేరు హనుమంతుడు. వానర రాజు సుగ్రీవుడు మా ప్రభువు. ఈ ఋష్యమూక పర్వతము మీద ఉన్నాడు. ఆయన మీ గురించి తెలుసుకొని రమ్మని నన్ను పంపాడు. కాబట్టి మీ వివరాలు నాకు తెలియజేయండి.” అని పలికాడు హనుమంతుడు.
ఆ మాటలకు రాముడు చాలా సంతోషించాడు. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టయింది అని అనుకున్నాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “లక్ష్మణా! మనము ఎవరి కోసరం వెదుకుతున్నామో ఆ సుగ్రీవుని మంత్రి మనవద్దకు వచ్చాడు. ఈ వానరుని మాటలు చూడగా మనతో స్నేహము చేయవలెనని తలంపుతో ఉన్నట్టు కనపడుతూ ఉంది. ఇతడు చాకచక్యంగా మాట్లాడటం తెలిసిన వాడు. మంచి స్నేహశీలి. కాబట్టి లక్ష్మణా! ఇతనితో నీవు మాట్లాడు. నాకు చూడగా ఇతడు నాలుగు వేదములు, వ్యాకరణశాస్త్రము చదివిన వాడులాగా కనపడుతున్నాడు. లేకపోతే ఇంత చాకచక్యముగా, ఒక్క అపశబ్దము కూడా లేకుండా మాటలాడలేడు.
లక్ష్మణా! ఇతని శరీరములో ఎక్కడా ఒక్క అవలక్షణము కూడా కనపడటం లేదు. సర్వలక్షణ సంపన్నుడు లాగా ఉన్నాడు. ఇతని మాటలు వింటుంటే ఇంకా వినాలని అనిపిస్తూ ఉంది కానీ విసుగురావడం లేదు. కాబట్టి నీవు అతనితో మాటలాడుము.” అని అన్నాడు రాముడు.
అప్పుడు లక్ష్మణుడు హనుమంతునితో తాము వచ్చిన పని సూటిగా తెలిసాడు. ” మేము అయోధ్యాధిపతి దశరథుని కుమారులము. ఇతను రాముడు. నా పేరు లక్ష్మణుడు. నా అన్న రాముని భార్యను ఎవరో రాక్షసుడు అపహరించాడు. ఆమెను మేము వెతుకుతున్నాము. మీ రాజు సుగ్రీవుడు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడని తెలిసింది. అందువలన మీ రాజు సుగ్రీవునితో స్నేహము చేయవలెనని, పరస్పరసాయము చేసుకొనవలెనని అభిలషించుచున్నాము.”అని సూటిగా బదులు చెప్పాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు పలికినపలుకులు విన్న హనుమంతుడు చాలా సంతోషించాడు. తన రాజు సుగ్రీవుని పని కూడా సానుకూలము అవుతుందని మనసులో అనుకున్నాడు.
శ్రీమద్రామాయణముకిష్కింధాకాండము మూడవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ షష్టితమః సర్గం రామాయణంలోని అరణ్యకాండలో 60వ అధ్యాయం. ఈ సర్గలో రాముడు, సీత, లక్ష్మణులు పంచవటిలో ఉంటారు. రావణుడు మారీచుడి సహాయంతో సీతను అపహరించడానికి కుట్ర పన్నుతాడు. మారీచుడు మాయామృగం రూపంలో వచ్చి, సీతను ఆకర్షిస్తాడు. సీత ఆ మృగాన్ని పట్టుకోవాలనడంతో, రాముడు దాన్ని వెంబడించడానికి వెళ్ళిపోతాడు. రాముడు వెళ్ళిపోయిన తర్వాత, రావణుడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చి సీతను అపహరిస్తాడు.
రాముడు సీత కోసం పిచ్చిగా పర్ణశాల అంతా తిరుగు తున్నాడు పరిసరాలు వెతికిన చోటనే వెతుకుతున్నాడు. సీత ఎక్కడన్నా దొరక్కపోతుందా అనే కొన ఆశతో వెదుకుతున్నాడు. సీత నిలబడ్డ చోటు, సీత కూర్చున్న చోటు, సీత వాడిన దర్భాసనము, వీటిని చూచి భోరున విలపిస్తున్నాడు.
“నాసీతను రాక్షసులు పీక్కుతిని ఉంటారు. లేదా రాక్షసులను చూచి సీత మరణించి ఉంటుంది. లేక సీతను ఎవరైనా అపహరించి ఉంటారు. లేక సీత నన్ను వెదుక్కుంటూ అరణ్యంలో దారి తప్పిపోయి ఉంటుంది. లేక సీత నన్ను ఆట పట్టించడానికి ఎక్కడైనా దాక్కుని ఉంటుంది. లేదా పుష్పములు ఫలములు తీసుకురావడానికి ఆడవిలోకి వెళ్లి ఉంటుందేమో! సీతకు తామర పూలుఅంటే ఇష్టం. వాటిని కోయడానికి సరస్సు వద్దకు వెళ్ళిందేమో, లేక సీత నీరు తీసుకురావడానికి గోదావరి తీరాననికివెళ్లి ఉంటుందా!” ఇలా పరి పరి విధములుగా ఆలోచిస్తూ ఆ ప్రాంతం అంటా కలయ తిరుగుతున్నాడు రాముడు.
ఒక చెట్టు దగ్గర నుండి మరొక చెట్టు వద్దకు, ఒక కొండ నుండి మరొక కొండవద్దకు, ఒక కాలువనుండి మరొక కాలువ వద్దకు తిరుగుతున్నాడు. పొదలు, పుట్టలు గుట్టలు వెదుకుతున్నాడు. చెట్లను అడుగుతున్నాడు. సీతకు ఇష్టమైనపూలమొక్కలను అడుగుతున్నాడు. పూలను అడుగుతున్నాడు. పిచ్చివాడి వలె వాటితో మాట్లాడుతున్నాడు. ఏడుస్తున్నాడు.
చెట్లు, పుట్టలు, మొక్కలు అయిపోయిన తరువాత అక్కడ ఉన్న సీత పెంపుడు జంతువులను అడుగుతున్నాడు. జింకలను, ఏనుగులను అడుగుతున్నాడు. తరువాత సీత తనకళ్ల ఎదురుగాఉన్నట్టు ఊహించు కుంటూ తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. సీత పరుగెత్తుతున్నట్టు ఊహించుకుంటూ ఆమెను ఆగమని అరుస్తున్నాడు. అంతలోనే నిరాశ. సీతను ఎవరో చంపేసి ఉంటారు అని కుమిలిపోతున్నాడు. రాక్షసులు ఆమెను చంపేటప్పుడు, గొంతునులిమే టప్పుడు సీత ఎలా బాధపడి ఉంటుందో తలచుకుంటూ ఏడుస్తున్నాడు. “సీతను నేను రాక్షసులకు ఆహారంగా వదిలి వెళ్లినట్టున్నాను.” అని అనుకుంటూ కుమిలి పోతున్నాడు.
లక్ష్మణునిపట్టుకొని “లక్ష్మణా! సీతనీకు ఎక్కడైనా కనిపించిందా” అని నిలదీసి అడుగుతున్నాడు. దాదాపు ఉన్నత్త స్థితిలో ఉన్నాడు. రాముడు.
(రాముడు ఇలా అధైర్యంగా, బేలగా, ఏడవడం గురించిన ఈ సర్గ ప్రాచ్యప్రతిలో లేదు అని పండితుల అభిప్రాయము).
రామాయణంలోని కిష్కింధాకాండ ద్వితీయ సర్గలో, హనుమంతుడు రాముడు, లక్ష్మణుడిని సుగ్రీవుని వద్దకు తీసుకువస్తాడు. సుగ్రీవుడు తన పీడలను వివరించి, వాలి తో విభేదించి, రాముని సాయంతో వాలిని సవాలు చేయాలని కోరుకుంటాడు. రాముడు, సుగ్రీవుని సమస్యలను వినిపించి, సాయం చేస్తానని హామీ ఇస్తాడు. సుగ్రీవుడు తన భయాలను, సీతాన్వేషణను రామునితో చర్చిస్తాడు. సుగ్రీవుడు రాముని స్నేహం మరియు సాయాన్ని స్వీకరించి, తన పునరుద్ధరణ కోసం ముందుకు సాగుతాడు. ఈ సర్గలో సుగ్రీవ-రాముల స్నేహం మరింత బలపడుతుంది.
రామ లక్ష్మణులను చూచి పారి పోయిన సుగ్రీవుడు ఇంకా భయపడుతూనే ఉన్నాడు. ఒక చోట నిలవడం లేదు. అన్ని దిక్కులా చూస్తున్నాడు. రామలక్ష్మణులు ఎటు వైపు నుండి వచ్చి తన మీద దాడి చేస్తారేమోనని భయంతో వణికిపోతున్నాడు. మహాబలవంతులు, ధనురాణములు ధరించిన రామలక్ష్మణులను చూచి సుగ్రీవునకు ధైర్యం సడలిపోయింది. బాగా ఆలోచించాడు. తన బలం గొప్పదా లేక ఆ మానవుల బలం గొప్పదా అని తనలో తాను తర్కించుకుంటున్నాడు. తనతో పాటుగా ఉన్న మంత్రులను పిలిచాడు. వారికి రామలక్ష్మణుల గురించి చెప్పాడు.
“అదుగో అటు చూడండి. ఆ మానవులు ఇద్దరూ నారచీరలు కట్టుకొని, ధనుర్బాణములు ధరించి దేనికోసమో వెదుకుతున్నారు. వారు వాలి పంపిన వారు అని నా అనుమానము. లేకపోతే క్రూరమృగములు సంచరించు, మానవులు చొరరాని ఈ దుర్గమారణ్యములో ఈ మానవులకు ఏమి పని. వీరు నిశ్శంశయంగా వాలి నాకోసం పంపినవారే. మనము ఇక్కడి నుండి వేరు చోటికి వెళ్లడం మంచిది.” అని అన్నాడు సుగ్రీవుడు.
సుగ్రీవుని మాట ప్రకారము ఆ వానరులు అందరూ వేరే ప్రదేశానికి వెళ్లారు. అక్కడ అందరూ వలయాకారంలో కూర్చున్నారు. మధ్యలో సుగ్రీవుడు కూర్చున్నాడు. ఆ వానరులలో హనుమంతుడు అనే పేరుగల వానరుడు, రామలక్ష్మణులను గురించి భయపడుతున్న సుగ్రీవుని చూచి ఇలా అన్నాడు.
“ఓ వానర రాజా! నీవు ఎందుకు వాలిగురించి భయపడతావు. మనము మలయ పర్వతము మీద ఉన్నాము. వాలి ఈ పర్వతము మీదికి రాలేడు. కాబట్టి వాలి వలన మనకు భయం లేదు. అదీ కాకుండా మనకు కనుచూపు మేరలో వాలి కనపడటం లేదు కదా. మరి నువ్వు వాలి గురించి ఎందుకు భయపడుతున్నావు. నీ భయానికి నాకు కారణం కనిపించడం లేదు. నీవు వాలి గురించి అనవసరంగా భయపడుతున్నావు. ఆ భయం వలన నీకు బుద్ధి క్షీణించింది. పైగా వానరసహజమైన చపలత్వము నిన్ను ఆవహించింది.
సుగ్రీవా! నీవు వానర రాజువు. రాజే ఇలా భయపడితే ఎలాగ? నీ మనస్సును ధృఢంగా ఉంచుకో. అనవసరంగా భయాందోళనలకు గురి కావద్దు. స్థిరమైన బుద్ధితో ఆలోచించు. స్థిరబుద్ధితో ఆలోచించ లేని రాజు ప్రజలను పాలించడానికి అర్హుడు కాడు. కాబట్టి భయపడటం మాను.” అని హితోపదేశం చేశాడు హనుమంతుడు. హనుమంతుని మాటలతో సుగ్రీవుని భయం తగ్గింది. హనుమంతునితో సుగ్రీవుడు ఇలా అన్నాడు. “అది కాదు హనుమాన్! ఆ మానవులను చూడు. వారు ఆజానుబాహులు. ధృడకాయులు. ధనుర్బాణములు ధరించిన వారు. వారిని చూచి ఎవరికి భయం కలగదు చెప్పు. వారు వాలి పంపగా నాకోసం వచ్చినవారే. సందేహము లేదు. లేకపోతే ఆ మానవులకు ఈ ఘోరారణ్యములో ఏమి పని.
వాలికి ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. వారిలో వీరూ ఒకరేమో! వీరిని వాలి పంపాడేమో! వాలిని నమ్మకూడదు. శత్రువులను ఒక కంటితో కనిపెట్టి ఉండటం రాజధర్మం కదా! అందులోనూ కపటంగా వ్యవహరించే వాలితో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనం భయపడకుండా, వారేం చేస్తారులే అని నిర్లక్ష్యంగా ఉంటే, అదును చూచి శత్రువులు మన మీద దెబ్బతీస్తారు. పైగా వాలి చాలా తెలివిగలవాడు. మన గురించి అన్ని విషయములను సేకరిస్తూ ఉంటాడు. అలాంటి వారి గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
కాబట్టి మనం ఒక పని చేద్దాము. ఓ వానర వీరుడా! హనుమా! నువ్వు సామాన్య మానవుని వేషంలో ఆ మానవుల వద్దకు వెళ్లు. వారి ఇంగితమును గ్రహించు. నీ మాటలతో వారు ఎవరో! ఎక్కడ నుండి వచ్చారో! ఇక్కడకు ఎందుకు వచ్చారో! ఎవరి కోసరం వచ్చారో నేర్పుగా మాట్లాడి తెలుసుకో! వారిని నీ పొగడ్తలతో సానుకూల పరుచుకో. చక్కగా మాట్లాడు. వారి మనోభావాలను గుర్తించు. వారికి నీ మీద విశ్వాసం కలిగేటట్టు ప్రవర్తించు. అసలు వారు ఇక్కడకు ఎందుకు వచ్చారో తెలుసుకో. ఆ మానవులు ఏమైనా దురాలోచనలతో వచ్చారా! లేక నిర్మలమైన మనస్సులతో వచ్చారా అనే విషయం గ్రహించు. అసలు వాళ్లు మంచి లేక అనే విషయాన్ని వారి మాట్లాడే మాటలను బట్టి పసిగట్టు. వెళ్లు. కార్యము సానుకూలం చేసుకొని రా!” అని సుగ్రీవుడు హనుమంతుని రామలక్ష్మణుల వద్దకు దూతగా పంపాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకోనషష్టితమః సర్గం, రామాయణంలోని ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో రాముడు, సీత మరియు లక్ష్మణులు అరణ్యంలో నివసిస్తున్నప్పుడు సీత హరణం జరుగుతుంది. రావణుడు మారీచుని సహాయంతో సీతను మాయాజాలంతో మోసపుచ్చి హరిస్తాడు. మారీచుడు స్వర్ణమృగం రూపంలో వస్తుంది, దాన్ని వెంటపడి తీసుకురావాలని సీత కోరుతుంది. రాముడు, లక్ష్మణుడు ఆ మృగాన్ని వేటాడడానికి వెళ్లడం వల్ల సీతను రక్షించడానికి ఎవరూ లేకుండా పోతారు.
అప్పటి దాకా సీత ఆశ్రమంతో ఉంటుంది అనే ఆశతో వడివడిగా ఆశ్రమానికి వచ్చారు రామలక్ష్మణులు. కాని సీత ఆశ్రమంలో లేదు అని తెలిసిన తరువాత సీతను రాక్షసులు అపహరించడం కానీ, చంపడం కానీ చేసి ఉంటారని రూఢి చేసుకున్నాడు రాముడు.
ఇప్పుడు లక్ష్మణుని చూచి సూటిగా ఒక ప్రశ్న వేసాడు. “లక్ష్మణా! నేను నీ మీద ఉన్న నమ్మకంతో, విశ్వాసంతో, సీతను నట్టడివిలో వదిలి వచ్చాను కదా! మరి నా ఆజ్ఞలేకుండా నీవు ఆమెను ఎందుకు వదిలివచ్చావు? ఇది నీకు భావ్యమా!” అని సూటిగా ప్రశ్నించాడు రాముడు.
అప్పుడు లక్ష్మణుడు రామునితో జరిగింది జరిగినట్టు పూసగుచ్చినట్టు వివరించాడు. “రామా! నేను స్వయంగా సీతను విడిచి రాలేదు. నేను నా ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోలేదు. నీ మాట శిరసావహించి సీతను కాపాడుతున్నాను. కానీ సీత హా సీతా హా లక్ష్మణా అన్న నీ అరుపులు విని నన్ను నీ వద్దకు పొమ్మని, నిన్ను రక్షించమనీ ప్రేరేపించింది. ఆమె బలవంతంతోనే నేను ఆమెను విడిచి నీ వద్దకు వచ్చాను.
నీవు అరిచినట్టు అరుపులు వినపడగానే, సీత తల్లడిల్లిపోయింది. నన్ను చూచి “లక్ష్మణా! మీ అన్న ఆపదలో ఉన్నాడు. వెళ్లు. ఆయనను రక్షించు.” అని నన్ను తొందరపెట్టింది. అయినా నేను కదలలేదు. నన్ను వెళ్లమంటూ అనేక సార్లు తొందరపెట్టింది. అప్పటికీ నేను ఆమెతో ఇలా అన్నాడు. “సీతా! రాముని భయపెట్టే, రామునికి అపకారం చేసే వాడు ఈ భూమి మీద లేడు. నీవు నిశ్చింతగా ఉండు. అది రాముని కంఠస్వరము కాదు. ఎవరో రాముని అనుకరించారు.
ఓ సీతా! దేవతలు కూడా రాముని రక్షణ కోరతారే! అటువంటి రాముడు ఒకరి రక్షణ కోరతాడా! అసంభవము. ఇది రాక్షసులు పన్నాగము. రాక్షసమాయ. దీనికి మీరు ఒక సాధారణ స్త్రీ వలె భయపడవద్దు. నిశ్చింతగా ఉండండి. ఓ సీతా! రాముడి బలపరాక్రమ ములు నాకు తెలుసు. రాముని జయించగలవాడు ముల్లోకములలో లేడు. ఇంక ఈ సామాన్య రాక్షసుడు ఎంత?” అని ఆమెను అనునయించాను.
కాని రామా! సీత నన్ను అనకూడని పరుషమైన మాటలు అన్నది. “నీ సోదరుడు మరణించిన తరువాత నువ్వు నన్నుపొందడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది. నీవు ఎన్నటికీ నన్ను పొందలేవు. నీవు భరతుడు కలిసి ఈ పన్నాగము పన్నినట్టు ఉన్నారు. లేకపోతే రాముడు అంతగా అరుస్తున్నా ఎందుకు వెళ్లవు? నీవు అవకాశం కొరకు ఎదురు చూస్తున్న శత్రువువు. నీవు రాముని వెంట ఉంటూ రాముని చావు కోరుకుంటున్న కనపడని శత్రువు.” అని నన్ను నానారకాలుగా నిందించింది.
ఆ నిందలు భరించలేక నేను సీతను విడిచి నీకోసం రావలసి వచ్చింది.” అని వివరించాడు లక్ష్మణుడు.
అయినా రాముడు ఆ సమాధానంతో తృప్తి చెందలేదు. “ఏది ఏమైనా లక్ష్మణా! నీవు నా ఆజ్ఞను ధిక్కరించి సీతను అడవిలో విడిచి రావడం మంచిది కాదు. నా బలపరాక్రమములు తెలిసి కూడా, సీత ఆవేశంతో కోపంతో ఏవేవో అన్నదని, నీవు సీతను ఒంటరిగా అడవిలో విడిచి రావడం ఏం బాగుంది? నీవు సీతను నిస్సహాయ స్థితిలో విడిచి రావడం నాకు ఏ మాత్రం సంతోషంగా లేదు.
ఏవో నాలుగు పరుష వాక్కులు సీత పలికిందని అలా ఒంటరిగా విడిచి పెట్టి వస్తావా! అంటే అంది. ఏమయింది. ఆమెకు కోపం వచ్చింది సరే! నీవు కూడా ఎందుకు కోపం తెచ్చుకున్నావు. నా ఆజ్ఞను ఎందుకు ధిక్కరించావు. నీవు అన్ని విధాలా తప్పు చేసావు. సరిదిద్దుకోలేని తప్పు చేసావు.
నేను వెంబడించిన మృగాన్ని నేను నా బాణంతో కొట్టాను. వెంటనే వాడు రాక్షసుడిగా మారి కిందపడ్డాడు. నేను అరిచినట్టు నా గొంతుతో అరిచాడు. ఆ అరుపులను సీత గుడ్డిగా నమ్మింది. ఆమె కోపాన్ని తట్టుకోలేక నీవు ఆమెను వదిలి వచ్చావు. అంతే కదా! దాని ఫలితంగా నాసీత నాకు దూరం అయింది.” అని రాముడు లక్ష్మణుని చేతలను తప్పు పట్టాడు.
రామాయణంలోని కిష్కింధాకాండలో, రాముడు, లక్ష్మణుడు సుగ్రీవుడిని కలుసుకోవడానికి కిష్కింధకు చేరుకుంటారు. సుగ్రీవుడు, తన అన్న వాలితో విభేదించి, రాముడి సహాయంతో తన రాజ్యాన్ని తిరిగి పొందాలని కోరుకుంటాడు. రాముడు సీతాన్వేషణలో సుగ్రీవుడికి సహాయం చేయడానికి అంగీకరిస్తాడు. హనుమంతుడు రాముడి ప్రాముఖ్యతను గుర్తించి, సుగ్రీవుని దగ్గరకు తీసుకువెళ్ళి పరిచయం చేస్తాడు. సుగ్రీవుడు తన సైన్యంతో రాముడికి సహకారం అందించడానికి సిద్ధమవుతాడు. ఈ సర్గలో సుగ్రీవ-రాముల మధ్య స్నేహం, సీతాన్వేషణ, వాలిని సవాలు చేయడం మొదలైన అంశాలు ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి.
రామ లక్ష్మణులు పంపా సరస్సును సమీపించారు. ఆ సరస్సు చూడటానికి చాలా మనోహరంగా ఉంది. సరస్సునిండా పద్మములు,కలువలు వికసించి ఉన్నాయి. ఆ సరస్సు అందాలు చూడగానే రాముని హృదయం అంతా బాధతో నిండి పోయింది.
“లక్ష్మణా! ఈ సరస్సు చూడు ఎంత హృదయానందాన్ని కలిగిస్తూ ఉందో. కాని సీతా వియోగంతో బాధపడుతున్న నాకు ఈ సరస్సు అందాలు ఏమాత్రం సంతోషాన్ని కలిగించడం లేదు. సీతా వియోగంతో బాధపడుతున్న నాకు ఈ ప్రకృతి అందాలు ఇంకా దు:ఖమును ఎక్కువ చేస్తున్నాయి. నా మనోవ్యధ ఎప్పుడు తీరుతుందో ఏమో! కాని లక్ష్మణా! ఈ వనములో ఉన్న పుష్పముల మీదినుండి వీచు గాలి మనకు మార్గాయాసమును పూర్తిగా తొలగించినది.
లక్ష్మణా! ఆ కోయిలలు చూడు ఎలా కూస్తున్నాయో. సీత కూడా ఆ కోయిల కూతలు విని నన్ను పిలిచి ఆ కోయిల కూతలు నాకూ వినిపించేది. నా సీత నాకు దొరకని పక్షంలో, నా సీతను నేను చూడని పక్షంలో నేను బతికి ఉండటం వృధా! ఇటువంటి సుందర దృశ్యములు ఎన్ని చూచినా సీతను చూచిన దానితో సాటి రావు కదా! పైగా ఈ వసంత ఋతువు దృశ్యములు, ఈ మలయమారుతము, వసంత శోభ నా వ్యధను ఎక్కువ చేస్తున్నాయి. నా సీతను ఆ రాక్షసుడు ఎత్తుకొని పోకపోయి ఉంటే నేను కూడా సీత తో కలిసి ఈ వసంత ఋతువు శోభను తనివిదీరా అనుభవించేవాడిని కదా!
లక్ష్మణా! సీత బతికి ఉంటే, సీత ఉన్న చోటున కూడా ఈ వసంత ఋతువు ఉంటుంది కదా! సీత కూడా నా మాదిరే విరహవేదన అనుభవిస్తూ ఉంటుంది కదా! నా మాదిరే సీత కూడా ఈ వసంత శోభను అనుభవించలేదు కదా! అవును. ఈ మనోహర దృశ్యములు ఆమెకు కూడా ఏమాత్రం ఆనందాన్ని కలిగించలేవు. ఎందుకంటే నేను, సీత దేహాలు వేరైనా మా మనసులు ఒకటే. నా మనస్సు ఆమె మీద, ఆమె మనస్సు నా మీదా లగ్నం అయి ఉన్నాయి.
లక్ష్మణా! నేను సీత కలిసి ఉన్నప్పుడు మా ఇద్దరికీ ఆహ్లాదమును కలిగించిన ఈ మలయమారుతము ప్రస్తుతము నాకు అగ్ని వీచికలవలె తాకుతూ ఉన్నాయి. లక్ష్మణా! చూచావా! ఆ కాకి ఎలా అరుస్తూ ఉందో! నాకు మరలా సీతా సంయోగం కలుగుతుందని చెబుతూ ఉన్నట్టు లేదూ! సీతకు పద్మములు అంటే ఎంతో ఇష్టం. ఈ పంపా సరోవరములో ఉన్న పద్మములను చూచి సీత ఎంత సంతోషించేదో కదా! సీత లేకుండా నేను ఈ పద్మముల శోభను అనుభవించలేకున్నాను.
లక్ష్మణా! సీత నా దగ్గరగా ఉన్నప్పుడు నాకు ఏ యే వస్తువులు, దృశ్యములు ఆనందాన్ని కలిగించాయో అవే వస్తువులు, అవే దృశ్యములు ఇప్పుడు నాకు భేదాన్ని కలిగిస్తున్నాయి. లక్ష్మణా! సీత నాకు కనపడితే, సీతతో సహా నేను ఇక్కడనే స్థిరనివాసము ఏర్పరచు కొనవలెనని కోరికగా ఉంది. సీతతో సహా ఇక్కడ ఉంటే, నాకు దేవేంద్రపదవి కూడా అక్కరలేదు అనిపిస్తూ ఉంది. అయోధ్యకు కూడా తిరిగి వెళ్లను. ఇక్కడే ఉండిపోతాను. ఈ వనసీమలలో, ఈ సరోవర తీరములలో, పచ్చికబయళ్లలో సీతతో విహరిస్తూ ఉంటే, నాకు ఏ చింతా ఉండదు. ఏ వస్తువూ కావాలని అనిపించదు. ఈ అందమైన పంపాసరస్సులో నేను సీత జలకాలాడటం కన్నా ఆనందం ఏముంటుంది చెప్పు.
లక్ష్మణా! నేను లేకుండా నా సీత ఇంకా ప్రాణాలతో ఉంటుందంటావా! ఏమో! ఆలోచించే కొద్దీ నా మనసు వికలం అవుతూ ఉంది. సీత తండ్రి జనకమహారాజు వచ్చి నా సీత ఏదీ అని అడిగితే ఏమని చెప్పాలో అర్థంకావడం లేదు. నా దురదృష్టం కొద్దీ నేను రాజ్యాన్ని పోగొట్టుకొని అడవులకు వచ్చాను. సీత కూడా నా వెంట రావాలా! ఒకవేళ వచ్చినా రాక్షసుల చేత అపహరింపబడాలా! అంతా నా దురదృష్టం కాకపోతే మరేమిటి! రాజ్యభ్రష్టుడు, బుద్ధిలేని వాడు అయిన నన్ను నమ్ముకొని నా వెంట వచ్చిన సీత లేకుండా నేను ఎలా జీవించేది!
లక్ష్మణా!సీత ఎంత మధురంగా మాట్లాడేది. నాతో పరిహాసమాడేది. అటువంటి సీత పలుకులు మరలా ఎప్పుడు వింటానో కదా! నాతో పాటు అడవిలో ఎన్నో కష్టములు అనుభవించుచున్నా. సీత తాను ఏ కష్టములు పడనట్టుగా ఆనందించుచున్నట్టు కనపడేది. నా తో ఎంతో సంతోషంగా మాటలాడుతూ ఉండేది. అటువంటి సీతను వదిలి నేను ఒంటరిగా అయోధ్యకు వెళితే, నా తల్లి కౌసల్య “రామా! నా కోడలు సీత ఎక్కడ. ఆమెను ఎక్కడ వదిలి వచ్చావు”అని అడిగితే నేను ఏమని సమాధానము చెప్పాలి.
ఓ లక్ష్మణా! నేనుసీత లేకుండా అయోధ్యకు రాలేదు. కాబట్టి నీవు ఒంటరిగా అయోధ్యకు వెళ్లు. నేను ఈ అరణ్యములలోనే సీతా వియోగంతో ఆ తనువు చాలిస్తాను.” అని విలపించాడు రాముడు.
ఆ మాటలు అన్నీ ఓపిగ్గా విన్నాడు లక్ష్మణుడు. “ఓ రామా! ఉ త్తమకులములో పుట్టిన వాడవు. అమిత పరాక్రమవంతుడవు. నీవే ఇలా అధైర్యపడితే ఎలా! నీ వంటి నిర్మల బుద్ధి కలవారికి ఈ ప్రకారము మందబుద్ధితో ఆలోచించడం శోభించదు. రామా! మనకు ఎక్కువ ప్రియమైన వాళ్లు దూరమైనపుడు దుఃఖముకలగడం సహజము. దానికి ఉపాయం వెతకాలి కానీ, ఇలా దు:ఖించడం వలన ప్రయోజనము లేదు. ముందు మనము ఆ రావణునిజాడ కనుక్కోవాలి. వాడు ఆకాశంలో ఉన్నా పాతాళంలో ఉన్నా వాడిని వదిలేది లేదు. వాడు సీతను తెచ్చి అప్పగించాలి. లేకపోతే మనచేతిలో చావాలి.
అన్నిటికన్నా ముందు నీవు ధైర్యంగా ఉండాలి. ఈ దీనత్వాన్ని వదిలిపెట్టాలి. కార్యరంగంలోకి దూకాలి. దానికి తగిన ఉత్సాహమును తెచ్చుకోవాలి. మానవ శరీరానికి ఉత్సాహాన్ని మించిన బలం వేరొకటి లేదు. ఉత్సాహవంతునకు లభించనిది ఏదీ లేదు. ఉత్సాహవంతుడు ఓటమిని ఎరుగడు. కాబట్టి రామా! నీవుకూడా ఉత్సాహమును తెచ్చుకో. సీతను తిరిగి సాధించుటకు ప్రయత్నము చెయ్యి. నీ పరాక్రమాన్ని గుర్తుకు తెచ్చుకో. నీ శోకాన్ని పక్కనపెట్టు. మనస్సును నిగ్రహించుకో.” అని రామునికి హితబోధ చేసాడు లక్ష్మణుడు.
లక్ష్మణుని మాటలతో రాముడు తన శోకాన్ని విడిచిపెట్టాడు. ధైర్యము, ఉత్సాహాన్ని తెచ్చుకున్నాడు. రాముడు, లక్ష్మణుడు పంపాసరోవరమును దాటారు.
వీరిద్దరినీ ఋష్యమూక పర్వతము పైనుండి సుగ్రీవుడు అనే వానర రాజు చూస్తున్నాడు. సుగ్రీవునికి భయం పట్టుకుంది. ఆ మానవులు ఇద్దరూ వాలి పంపగా తనకోసం వచ్చారేమో, తనను చంపుతారేమో అని భయపడ్డాడు. ఆ భయంతో కుంగిపోయాడు సుగ్రీవుడు. వెంటనే సుగ్రీవుడు తన వెంట ఉన్న వానరులతో సహా అక్కడి నుండి పారిపోయాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ అష్టపంచాశః సర్గః (58వ సర్గ), రాముడు లక్ష్మణుడితో కలిసి సీత కోసం ఆత్రంగా అన్వేషణ చేస్తూ, మార్గమధ్యంలో జటాయువును కలుస్తాడు. జటాయువు, రావణుడు సీతను అపహరించిన విషయాన్ని రాముడికి తెలియజేయడానికి ప్రయత్నిస్తాడు. తన చివరి శ్వాసలో జటాయువు సీత అపహరణ వివరాలు చెప్పి మరణిస్తాడు. జటాయువు త్యాగానికి రాముడు దుఃఖిస్తూ, అతనికి అర్హమైన అంత్యక్రియలు నిర్వహిస్తాడు.
అప్పటిదాకా రాముడు లక్ష్మణుడిని ఏం జరిగింది అని అడగలేదు. తాను ఏం చేసిందిచెప్పాడు. ఇప్పుడు అడగడం మొదలెట్టాడు.
“లక్ష్మణా! నేను నిన్నుసీతకు రక్షణగా ఉంచాను కదా! నా సీతను ఒంటరిగా ఎందుకు వదిలి వచ్చావు? నా సీత ఇప్పుడు ఎక్కడ ఉంది.? పర్ణశాలలో క్షేమంగా ఉందా! ఉందని నీవు చెప్పగలవా? నేను అరణ్యాలకు వస్తున్నా కష్టనష్టాలకు ఓర్చి నన్ను అనుసరించిన సీత ఇప్పుడు ఎక్కడ ఉంది? సీత లేకపోతే నేను క్షణకాలం కూడా జీవించలేను కదా! మరి నా సీత ఎక్కడుందో చెప్పవా?
లక్ష్మణా! నాకు సీత తోడిదే లోకం. సీత లేకుండా నేను స్వర్గాధిపత్యము కూడా అంగీకరించను. అటువంటి నా సీతను ఏమి చేసావు? సీత జీవించి ఉంటుందంటావా! నా సీత మరణిస్తే, ఆమె దుఃఖంతో నేను మరణిస్తే, మమ్ములను అడవులకు పంపిన కైక ఆనందిస్తుందేమో కదా! అప్పుడు నాతల్లి కౌసల్య, కైకకు ఊడిగం చేస్తుందేమోకదా!
లక్ష్మణా! నిజంచెప్పు. సీత జీవించి ఉంది అంటేనే నేను ఆశ్రమానికి వస్తాను. లేకపోతే ఇక్కడే ప్రాణ త్యాగం చేస్తాను. నేను ఆశ్రమం చేరగానే సీత ఎదురొచ్చి చిరునవ్వుతో నన్ను పలకరించక పోతే నేను బతికి ఉండీ వృధా! లక్ష్మణా! సీత ఇంకా జీవించి ఉందంటావా! లేక నువ్వు ఇటు రాగానే రాక్షసులు ఆమెను చంపి తిని ఉంటారా! ఒకవేళ సీత బతికి ఉంటే, నా వియోగబాధతో ఎంతగా పరితపిస్తూ ఉందో కదా!
లక్ష్మణా! మారీచుడు హా లక్ష్మణా! అని అరిచినప్పుడు నీకు కూడా నాకు అపకారం జరిగిందని అనుమానం కలిగిందా! నేను అరిచినట్టు వినపడ్డ అరుపులు విని నిన్ను సీత పంపగా నా వద్దకు వచ్చావా! లేక నువ్వే ఆ రాక్షసుని అరుపులు విని నాకేమైనా ఆపద జరిగిందని సీతను ఒంటరిగా వదిలి వచ్చావా!
ఏది ఏమైనా నీవు ఈ అరణ్యంలో సీతను ఒంటరిగా వదిలి వచ్చి చాలా పెద్ద తప్పు చేసావు. నీవు రావడంతో రాక్షసులకు మన మీద పగ తీర్చుకోడానికి ఆస్కారం కల్పించినట్టయింది. ఎందుకంటే, నేను ఖరుడిని, దూషణుడిని, రాక్షసులను చంపానుకదా. అందుకని నా మీద ప్రతీకారము తీర్చుకోడానికి రాక్షసులందరూ పొంచి ఉన్నారు. నీవు కూడా లేని సమయం చూచి రాక్షసులుసీతను చంపి ఉంటారు!
లక్ష్మణా! చూచావా! అడవిలో ఉన్నా నాకు ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో! ఇదంతా నా పూర్వజన్మ పాపఫలం. లేకపోతే నాకే ఇన్ని కష్టాలు రావాలా!” అని కాసేపు తనలో తాను అనుకుంటూ, కాసేపు లక్ష్మణుని చూచి మాట్లాడుతూ వడి వడిగా ఆశ్రమం వేపు నడుస్తున్నావు రాముడు.
రామ లక్ష్మణులు పర్ణశాలను చేరుకున్నారు. పర్ణశాల వద్ద సందడి లేదు. నిర్మానుష్యంగా ఉంది. నడిచి నడిచి అలసి పోయిన ముఖంతో రాముడు ఆశ్రమం చుట్టు పక్కల సీత కోసం ఆతురతగా వెదుకుతున్నాడు. సీత ఎక్కడా కనపడలేదు. చేతులతో ముఖం కప్పుకొని కూలబడ్డాడు రాముడు.
“లక్ష్మణా! నేను అనుకున్నట్లే జరిగింది.” అని రోదిస్తున్నాడు రాముడు.
అయోధ్యాకాండలోని నవతితమః సర్గ అంటే 90వ సర్గ. ఈ సర్గలో, భరతుడు రాముని పాదుకలను సత్కారంతో తీసుకొని, సపరివారం అయోధ్యకు తిరిగి వచ్చాడు. భరతుడు రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి, వాటి మార్గదర్శకత్వంలో రాజ్యాన్ని పాలిస్తానని ప్రతిజ్ఞ చేయడు. భరతుడు తన తండ్రి దశరథ మహారాజు మరణం, రాముని అరణ్యవాసం వంటి ఘోర సంఘటనల కారణంగా మనోవ్యధతో బాధపడతాడు. అతను నందిగ్రామంలో నివసిస్తూ, తాను రాముని ప్రతినిధిగా మాత్రమే ఉండి, రాముడు తిరిగి వచ్చే వరకు రాజ్యాన్ని రక్షించాలని నిర్ణయించుకుంటాడు. ప్రజలందరూ భరతుని ధర్మనిష్ఠ, విధేయతను ప్రశంసిస్తూ, రాముడు తిరిగి వచ్చే రోజును ఎదురుచూస్తారు.
భరద్వాజ మహర్షి ఆశ్రమము క్రోసెడు దూరము ఉండగానే భరతుడు తన సేనలను పరివారమును అక్కడే ఆగిపొమ్మన్నాడు. ఆయుధములను విడిచిపెట్టాడు. తాను పట్టుబట్టలు ధరించాడు. కులగురువు వసిష్ఠుడు ముందు నడుస్తూ ఉండగా, తన మంత్రులు వెనక రాగా, కాలి నడకన భరద్వాజ మహర్షి ఆశ్రమమునకు వెళ్లాడు.
భరద్వాజుని ఆశ్రమము కనుచూపు దూరములో ఉండగానే మంత్రులను ఆగిపొమ్మన్నాడు. వసిష్ఠుడు వెంటరాగా ఆశ్రమమునకు వెళ్లాడు. వసిష్ఠుని చూడగానే భరద్వాజుడు సంభ్రమంతో ఎదురు వచ్చాడు. అర్ఘ్య పాద్యములు ఇచ్చిసత్కరించాడు. భరతుని ఆదరంతో ఆహ్వానించాడు. భరతునికి అర్ఘ్యము పాద్యము ఇచ్చాడు. ఇరువురికీ ఫలములు ఇచ్చాడు. భరతుని యోగక్షేమములు కనుక్కున్నాడు భరద్వాజుడు. భరతుడు భరద్వాజునితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! మేమంతా కుశలమే. మీరు మీ ఆశ్రమ వాసులు ఏ బాధా లేకుండా తపస్సు చేసుకుంటూ ఉన్నారు కదా!” అని అడిగాడు భరతుడు.
“మహారాజా! మాకు ఏ బాధా లేదు. ప్రశాంత జీవనము గడుపుతున్నాము. కానీ అయోధ్యలో ఉండి రాజ్యపాలన చేయవలసిన వాడివి, ఇలా అడవుల వెంట తిరగడానికి కారణమేమి? నీ అన్న రాముడు తండ్రి ఆదేశమును పాలించుటకు అరణ్యములకు వెళ్లాడు. అదినాకు తెలుసు. కాని నీవు ఇక్కడకు ఎందుకు వచ్చావు. రామునికి ఏదైనా అపకారము తలపెడుతున్నావా? లేకపోతే రాజ్యమును విడిచి ఇక్కడకు రావడానికి కారణమేమి?” అని అడిగాడు భరద్వాజుడు.
భరద్వాజుడు కూడా తనను అనుమానించడం చూచి తట్టుకోలేకపోయాడు భరతుడు. తన తల్లి చేసిన పాపపు పనికి తాను శిక్ష అనుభవిస్తున్నాడు అని అనుకున్నాడు మనసులో. భరద్వాజునితో ఇలా అన్నాడు.
“ఓ మహర్షీ! తమరు కూడా నన్ను అనుమానిస్తే నాకు ఇంక మరణమే శరణ్యము. రాముని అరణ్యవాసములో నా ప్రమేయము ఎంతమాత్రమూ లేదు. నన్ను నమ్మండి. ఆ సమయములో నేను అయోధ్యలో లేను. నేను లేని సమయమున నా తల్లి కైక నా తండ్రిని అనుచితములైన వరములు కోరి నాకు ఇంత చేటు తెచ్చిపెట్టినది. రాముని అడవులపాలు చేసినది. నాకు రాజ్యము లభిస్తుంది అని నాకు ఎంత మాత్రము సంతోషముగా లేదు. నా తల్లి కోరికను నేను అనుమతించను. ఆచరించను.
ప్రస్తుతము నేను ఇక్కడకువచ్చినకారణము… రాముని ప్రార్థించి, అర్థించి, అయోధ్యకు తీసుకొని వెళ్లి ఆయనకు పట్టాభిషేకము జరిపించడం. అదే నా ప్రధమ కర్తవ్యం. కాబట్టి రాముడు ప్రస్తుతము ఎక్కడ ఉన్నాడో నాకు తెలుపండి.”అని అడిగాడు. భరతుని మాటలు విన్న భరద్వాజుడు అతని పట్ల ప్రసన్నుడయ్యాడు.
“రాకుమారా! నీవు ఇక్ష్యాకు వంశములో పుట్టవలసినవాడవు. ధర్మాత్ముడవు. ధర్మము కోసరం అయాచితముగా వచ్చిన రాజ్యమును త్యజిస్తున్నావు. మరింత శ్లాఘనీయుడవు. నీ మనసులో మాట నాకు తెలియును. కానీ నీ శీలమును పదిమందికి తెలియజేయుట కొరకు ఆవిధంగా అడిగాను. ఇప్పుడు నీ ధర్మప్రవర్తన లోకమునకు వెల్లడి అయింది. రాముడు, లక్ష్మణుడు సీత ఎక్కడ ఉన్నారో నాకు తెలియును. ప్రస్తుతము వారు చిత్రకూట పర్వతము మీద నివసిస్తున్నారు. నీవు ఈరోజు ఇక్కడే విశ్రాంతి తీసుకొని రేపు చిత్రకూటమునకు వెళ్లవచ్చును.” అని పలికాడు భరద్వాజుడు. భరద్వాజుని మాట మన్నించి భరతుడు ఆ రాత్రికి ఆయన ఆశ్రమములోనే విశ్రాంతి తీసుకున్నాడు.