మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ చతుర్దశః సర్గంలో, విష్ణుమూర్తి తన అమృతమయ సాయుధాన్ని ఋషులకు అందించి, వారి యజ్ఞాన్ని రక్షించమని సూచించాడు. ఆయన యజ్ఞవాటిక వద్దకు చేరి, ఋషుల నిష్టను చూసి ప్రశంసించాడు. వసిష్ఠుడు ఈ అద్భుతాన్ని చూచి ఆనందించాడు. మహాముని విశ్వామిత్రుడు భద్రత కాపాడినందుకు రామ, లక్ష్మణులను సంతోషంగా ఆశీర్వదించాడు. దుష్ట శక్తులపై విజయం సాధించడంలో రాముడు, లక్ష్మణుడు తమ ధైర్యాన్ని, సత్తాను ప్రదర్శించారు.
ఒక సంవత్సరకాలం గడిచింది. అశ్వవమేధయాగముకొరకు వదిలి పెట్టబడిన అశ్వము తిరిగి వచ్చింది. దశరథుడు సరయూ నదీ తీరమున ఉత్తర భాగమున అశ్వమేధ యాగము ప్రారంభించాడు. ఋష్యశృంగుని ప్రధాన ఋత్విక్కుగా ఉంచుకొని పురోహితులు యజ్ఞము ప్రారంభించారు.
వేదవిదులయిన ఋత్విక్కులు వేదములలో చెప్పిన ప్రకారము యజ్ఞము చేస్తున్నారు. అశ్వమేధ యాగములో ముఖ్య అంశములైన ప్రవర్ణ్యము, ఉపసదమును బ్రాహ్మణులు వేదోక్తముగా నిర్వహించారు. ఇంద్రునికి హవిర్భాగములను అర్పించారు. శ్రేష్టమైన సోమ లతను నలగగొట్టి, రసము తీసారు. దీనితో యాగములో మాధ్యందిన సవము వేదోక్తముగా చేసారు.
తరువాత ఋత్తిక్కులు దశరధునితో తృతీయ సవనమును కూడా నిర్వర్తింపచేసారు. ఆ యాగములో ఏ చిన్న తప్పుకూడా దొర్లకుండా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు.
ఆ యాగమునకు వచ్చిన బ్రాహ్మణుల కందరకూ ఆకలి అనేది తెలియకుండా మృష్టాన్న భోజనములు సమకూర్చారు. ఆ యాగము జరిగిన ಅನ್ನ రోజులు బ్రాహ్మణులు, రాజాధిరాజులు, వారి వెంట వచ్చిన ఉద్యోగులు, భటులు, సన్యాసులు, తాపసులు అందరికీ సమృద్ధిగా భోజన సదుపాయములు చేసారు. తృప్తిగా భోజనములు చేసిన వారికి వస్త్రములు కూడా ఇచ్చి సత్కరించారు.
వచ్చిన వారందరూ తృప్తిగా భోజనము చేసి దశరధుని పుత్రవంతునిగా దీవించారు. ఆ మాటలు విని దశరధుడు పరమానంద భరితుడయ్యాడు. యాగము జరుగుతున్న సమయములో వేద పండితుల మధ్య వాగ్వివాదములు రసవత్తరముగా జరుగుతుండేవి.
యాగములో ఊపస్తంభములు నిలుప వలసిన సమయము వచ్చినది. బిల్వ వృక్షము కర్రతో చేసిన ఊపస్తంభములు ఆరు, చండ్రకర్రతో చేసినవి ఆరు, మోదుగ కర్రతో చేసినవి ఆరు, శ్లేషాత్మకము అనే కర్రతో చేసినది ఒకటి, దేవదారు కర్రతో చేసినవి. రెండు యాగ వాటికలో పాతారు. ఒకదానికి మరొక దానికి బారెడు వెడల్పు ఉండేట్టు పాతారు. ఆ ఊపస్తంభములను బంగారముతో అలంకరించారు. ఆ ఇరవై యొక్క ఊపస్తంభములను రంగు రంగుల వస్త్రములతో అలంకరించారు.
వేదములలో చెప్పిన ప్రకారము యజ్ఞ కుండము లను ఏర్పాటుచేసారు. దశరథుడు, ఆయన భార్యలు కూర్చొనుటకు వీలుగా గరుడుని ఆకారములో ఒక వేదికను నిర్మించారు.
దేవతలకు బలి ఇచ్చేనిమిత్తము ఆ ఊపస్తంభములకు రకరకాల పక్షలను, పశువులను, పాములను కట్టారు. యజ్ఞము కొరకు వదిలిన అశ్వమును ఒక ఊపస్తంభమునకు కట్టారు. మూడు వందల వశు వులను, యజ్ఞాశ్వమును ఆ ఊపస్తంభములకు కట్టారు.
తరువాత దశరధుని పట్టమహిషి కౌసల్య అక్కడకు వచ్చింది. అశ్వమును కట్టిన ఊపస్తంబమునకు మూడుమార్లు ప్రదక్షిణము చేసింది. ఆ యజ్ఞాశ్వమును మూడు కత్తులతో చంపింది. శాస్త్రములో చెప్పిన ప్రకారము ఆ రోజు రాత్రి అంతా కౌసల్య ఆ గుర్రము పక్కన నివసించింది.
మరునాడు ఆ యాగమునకు హోత, అధ్వర్యువు, ఉద్గాత అనే ముగ్గురు ఋత్తిక్కులు పట్టపురాణి కౌసల్యను ఆమె ఇద్దరు పరిచారికలను దానముగా తీసుకున్నారు. తరువాత మరొక ఋత్విక్కు చంపబడిన ఆ గుర్రము మెదడును పక్వము చేసి హోమం చేసాడు. దశరథుడు ఆ హోమము లో నుండి వచ్చిన పొగను తృప్తిగా వాసన చూచాడు.
తరువాత పదహారు మంది ఋత్విక్కులు చంపబడిన ఆ అశ్వము యొక్క శరీర భాగములను శాస్త్రోక్తముగా హోమం చేసారు.
కల్పసూత్ర ప్రకారంగా అశ్వమేధ యాగము మూడు రోజులు వేదోక్తంగా జరపాలి. మొదటి రోజు యజ్ఞమునకు చతుష్టోమము, రెండవ రోజు కార్యక్రమమునకు ఉక్యము, మూడవ రోజు కార్యక్రమమునకు అతి రాత్రము అని పేరు. ఇవే కాకుండా దశరథుడు ఇతరములైన అనేక కార్యక్రమములు చేయించాడు.
యాగము పూర్తి అయిన తరువాత దశరథుడు తూర్పుదిక్కున ఉ న్న తన రాజ్యమును హోతకును, పశ్చిమ దిక్కున ఉన్న తన రాజ్యమును అధ్వర్యునకును, దక్షిణదిక్కున ఉన్న దేశమును బ్రహ్మకు దానంగా ఇచ్చాడు. ఈ విధంగా చేయవలెనని వేదములు సూచిస్తున్నాయి. యాగఫలమును పొందుటకు దశరథుడు ఈ విధంగా తనరాజ్యమును బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. కాని ఆ బ్రాహ్మణులు ఆ రాజ్యమును తిరిగి దశరథునికి ఇచ్చి దానికి తగిన ప్రతిఫలముగా పదిలక్షల గోవులు, వందకోట్ల బంగారు నాణెములు, నాలుగు వందల కోట్ల వెండి నాణెములు తీసుకున్నారు.
ఆ బ్రాహ్మణులు ఆ ధనమును వశిష్టునకు ఋష్యశృంగునకు ఇచ్చారు. వారు ఆ ధనమును అందరికి న్యాయప్రకారంగా పంచి పెట్టారు. అందరూ సంతృప్తి చెందారు. ఇది కాకుండా యాగమును చూడటానికి వచ్చిన వారికి కోటి బంగారు నాణెములు దానంగా ఇచ్చాడు దశరథుడు.
అన్ని అయిపోయిన తరువాత ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి తనకు కూడా ఏమన్నా ఇవ్వమని యాచించాడు. ఆ సమయంలో దశరథుని చేతిలో ఉన్న బంగారు ఆభరణమును ఆ పెద బ్రాహ్మణునికి బహూకరించాడు. తరువాత యాగమునకు వచ్చిన బ్రాహ్మణులందరికీ భక్తితో నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నాడు దశరథుడు. ఆ ప్రకారంగా అశ్వమేధ యాగమును పూర్తి చేసాడు దశరథుడు.
తరువాత దశరథుడు ఋష్యశృంగుని చూచి “ఓ మహాత్మా! అశ్వమేధ యాగము నా చేత చేయించారు. తరువాత నాకు పుత్ర సంతానము కలిగి నా వంశము వృద్ధిచెందేటట్టు నాచేత ఒక యాగము చేయించవలసినది” అని ప్రార్థించాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచదశః సర్గలో, రాజు దశరథుడు ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో సంతానం పొందాలనే లక్ష్యంతో పుత్రకామెస్టి కర్మను ప్రారంభించాడు. దశరథ రాజు నిర్వహించే అశ్వ పూజలో అర్పించిన నైవేద్యాలను స్వీకరించడానికి ఖగోళ జీవులు గుమిగూడారు. వారు రావణుడి దురాగతాలను చూసి కలవరపడి, రావణుని అంతమొందించే మార్గం కోసం ఆలోచించమని బ్రహ్మను అభ్యర్థిస్తారు. విష్ణువు అక్కడికి చేరుకుని, రావణుని అంతమొందించడానికి తాను మానవునిగా అవతారమెత్తుతానని హామీ ఇవ్వడంతో బ్రహ్మ మరియు ఇతర దేవతలను శాంతింపజేస్తాడు.
ఋష్యశృంగుడు బాగా ఆలోచించాడు. తరువాత దశరథునితో ఇలా అన్నాడు. “మహారాజా! తమకు పుత్ర సంతానము కలగడం కోసరం, మీకు పుత్ర సంతానమును కలిగించే ఒక ఇష్టిని (యాగమును) మీచేత చేయిస్తాను. ఈ యాగమును వేదములో చెప్పబడిన అధ్వర శిరస్సు అనే మంత్రముల ఆధారంగా చేయిస్తాను.” అని పలికాడు.
దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. యాగం ఆరంభం అయింది. వేద మంత్రములు చదువుతూ హోమం చేస్తున్నారు. యా యజ్ఞములో హవిర్భాగములు స్వీకరించుటకు దేవతలు అక్కడకు వచ్చారు. ఆ సమయంలో దేవతలందరూ బ్రహ్మదేవుని కలిసి ఆయనతో ఇలా అన్నారు.
” ఓ బ్రహ్మదేవా! భూలోకంలో రావణుడు అనే రాక్షసుడికి మీరు ఎన్నో వరాలు ఇచ్చారు. ఆ వరాల ప్రభావంతో గర్వించి ఆ రాక్షసుడు దేవతలను, మునులను, సజ్జనులను బాధిస్తున్నాడు. అతనిని కట్టడి చేయడం మా వల్ల కావడం లేదు. ఎందుకంటే మీరు అతనికి వరాలు ఇచ్చారు. వాటిని మేము గౌరవించాలి కదా. అందుకని మేము అతని మీద కఠినంగా వ్యవహరించలేకపోతున్నాము. అతడు చేయు అకృత్యములను చూచీ చూడకుండా పోతున్నాము.
(మంత్రిగారి అండదండలు ఉంటే పేరు మోసిన రౌడీలను మాత్రం పోలీసులు ఏమి చేయగలరు చెప్పండి.)
తమరి వరాల అండ చూచుకొని అతడు ముల్లోకములను బాధిస్తున్నాడు. దిక్పాలకులను లెక్క చెయ్యడం లేదు. ఇంద్రునికూడా ధిక్కరిస్తున్నాడు. ఇంక భూలోక వాసుల కష్టములకు అంతు లేదు. మునులను బ్రాహ్మణులను బాధిస్తున్నాడు. వారిని యజ్ఞయాగములు చేసుకోనివ్వడం లేదు. వాడి మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవరికీ లేదు.
ఇంక సూర్యుడు అతని దగ్గర చల్లగా ఉంటాడు. వాయువు అతని వద్ద మెల్లగా వీస్తాడు. సముద్రుడు కూడా అతనిని చూడగానే అలలను వెనక్కు లాక్కుంటాడు. శాంతంగా ఉంటాడు. ఆ రావణుని వలన భయపడని వాడు లేదు. అందుకని అతనిని సంహరించి ముల్లోకము లను రక్షించే ఉపాయం ఆలోచించండి.” అని ప్రార్థించారు.
బ్రహ్మదేవుడు ఆలోచించాడు. “దేవతలారా! వాడిని చంపడానికి ఒకే ఒక ఉపాయం ఉంది. నేను ఇచ్చిన వర ప్రభావంతో వాడు నరులు చేతిలో తక్క ఇంక ఎవరి చేతిలోనూ చావడు. అలాంటి వరం ఇచ్చాను కాబట్టి రావణుడు మనుష్యుల చేతిలోనే చావాలి. అది తక్క మరొక ఉపాయము లేదు.” అని అన్నాడు బ్రహ్మ.
అమ్మయ్య! రావణుడి చావుకు ఏదో ఒక కారణం దొరికింది అని సంతోషించారు దేవతలు. ఇంతలో విష్ణుమూర్తిఅక్కడకు వచ్చాడు. దేవతలందరు విష్ణువుకు నమస్కరించారు. ఆయనతో ఇలా అన్నారు.
” ఓ దేవదేవా! ముల్లోకములను కాపాడటానికి మిమ్మల్ను ఒక పని చేయమని కోరుతున్నాము. అయోధ్యకు రాజు అయిన దశరథుడు పుత్రుల కొరకు ఒక యాగము చేస్తున్నాడు. ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్నారు. తమరు మా మీద దయయుంచి మీరు నలుగురుగా విడిపోయి, ఆయన ముగ్గురు భార్యలకు పుత్రులుగా జన్మించండి. బ్రహ్మదేవుని వరగర్వంతో రావణుడు అనే రాక్షసుడు ముల్లోకములలో బ్రాహ్మణులను, మునులను, దేవతలను బాధపెడు తున్నాడు. మితి మీరుతున్న ఆ రావణుని సంహరించండి. లోకాలను కాపాడండి. ఒక్క నరుడే ఆ రాక్షసుని సంహరించగలడు. కాబట్టి తమరు మానవుడిగా జన్మించి ఆ రాక్షసుని సంహరించండి.” అని వేడుకున్నారు.
విష్ణుమూర్తి వారి ప్రార్థనలను సొంతం విన్నాడు. వారితో ఇలా అన్నాడు. “ఓ దేవతలారా! మీరు భయపడకండి. మీకు త్వరలో రావణుని బారి నుండి విముక్తి లభిస్తుంది. మీరుకోరినట్టు నేను భూమి మీద అవతరిస్తాను. ఆ రావణుని సంహరిస్తాను. పదకొండు వేల సంవత్సరములు ఈ భూమిని పాలిస్తాను. ధర్మసంరక్షణ చేస్తాను.” అని పలికాడు విష్ణుమూర్తి.
“ ఓ విష్ణుదేవా! నీవు లోక భయంకరుడైన రావణుని సంహరించి తిరిగి స్వర్గలోకమునకు తిరిగి రమ్ము.” అని వేడుకొన్నారు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదిహేనవ సర్గ సంపూర్ణము.
“రామాయణం” లో అయోధ్యాకాండ త్రయోదశః సర్గం (13వ సర్గ) ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఈ సర్గలో, రాముడు తన తండ్రి ఆజ్ఞను గౌరవించి వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. సుమంతుడు, రాముడు, సీత, మరియు లక్ష్మణులను వనానికి చేరవేయడానికి రథాన్ని సిద్ధం చేస్తాడు. అయోధ్య ప్రజలు రాముడి వనవాసానికి తీవ్ర విచారంలో కూరుకుపోతారు. వారు రథం వెంబడి దూరం వరకూ నడుస్తూ, తమ ప్రేమను మరియు ఆందోళనను వ్యక్తం చేస్తారు. సీత మరియు లక్ష్మణులు కూడా రాముడితో వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. ఈ సర్గలో రాముడు తన తల్లి కౌసల్య మరియు సుమిత్రలతో, మరియు తన గురువు వశిష్ఠునితో సన్మానంగా నడుచుకుంటాడు. ఈ సర్గలో రాముడు తన ధైర్యం, విధేయత మరియు ధర్మాన్ని పాటించే గుణాలను ప్రదర్శిస్తాడు, ఇది కథలో కీలకమైన మలుపు తెస్తుంది.
దశరథుడు ఎన్నడూ అంతటి దీనస్థితికి లోను కాలేదు. ఒకరిని శాసించడమే కానీ ఒకరి ముందు దేహీ అని నిలబడలేదు. ఈనాడు రాముని కోసరం కైక ముందు చేతులు జోడించి మోకరిల్లాడు. ప్రాధేయపడ్డాడు. భంగపడ్డాడు. కానీ కైక మనసు కరిగినట్టు లేదు. తాను కోరిన వరాలను ఉపసంహరించుకోలేదు. పైగా పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడింది.
“ఓ దశరథమహారాజా! నీవేదో సత్యవాక్పరిపాలకుడవు అనీ, ఆడినమాట తప్పవనీ, అడిగినవి అన్నీ ఇస్తావనీ, లోకమంతా గొప్పగా చెప్పుకుంటారుకదా! ఇదేనా తమరి సత్యవాక్పరిపాలన! ఇదేనా తమరిసత్యసంధత! నీవు ఆడిన మాట తప్పని వాడివే అయితే నేను కోరిన వరములు ఎందుకు ఇవ్వవు? ఇన్ని కుంటి సాకులు ఎందుకు చెబుతావు. కల్లబొల్లి ఏడుపులు ఎందుకు ఏడుస్తావు? ఏది ఏమైనా, మిన్ను విరిగి మీద పడ్డా, రాముడు వనవాసానికి వెళ్లాలి. భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి. ఇది తప్పదు.” అని ఖరాఖండిగా చెప్పింది కైక. తాను ఇంత బతిమాలినా కైక మనసు కరగనందుకు దశరథునికి కోపమూ దు:ఖము ముంచుకొచ్చాయి. తట్టుకోలేక కిందపడిపోయాడు. తల పైకెత్తి కైకను చూస్తూ—
” ఓసి దుర్మార్గురాలా! నువ్వు నాకు భార్యవా! శత్రువువా! నా చావు కోరుకుంటావా! రాముడు అరణ్యాలకు వెళ్లిన తరువాత నేను బతికి ఉండటం కలలోని మాట! నా చావు కోరే నీవు, నేను చచ్చిన తరువాత సుఖపడాలని కోరుకొనే నీవు, నాకు భార్యవు ఎలా అవుతావు? నేను చచ్చి స్వర్గానికి పోతే అక్కడ దేవతలు ‘ఓ దశరథమహారాజా! భూలోకములో రాముడు క్షేమముగా ఉన్నాడా’ అని అడిగితే వారికి ఏమని బదులు చెప్పాలి. ఒక ఆడుదాని మాటకు కట్టుబడి నా కన్నకొడుకును అరణ్యాలకు పంపానని చెప్పనా! నా వంటి వాడు అలా చేసాడు అంటే ఎవరన్నా నమ్ముతారా! ఎంతకాలముగానో సంతానము లేకుండా అలమటించిన నేను, ఈ నాడు నాకు పుత్రులు కలిగితే. వారిని అడవుల పాలు ఎలా చెయ్యను.
ఓ కైకా! నన్ను చంపెయ్యి. రామునికి దుఃఖం కలిగించే బదులు నీ చేతిలో చావడమే మేలు. చంపు నన్ను చంపు” అని ఆవేశంతో అంటూ కూలబడిపోయాడు దశరథుడు.
కైక ఏమీ బదులు చెప్పలేదు. మౌనంగా ఉండిపోయింది. దశరథుడు అలా పడి ఉండగానే రాత్రి అయింది. చంద్రుడు ఉదయించాడు. కైకను బతిమాలి లాభం లేదనుకొని ప్రకృతిని ప్రార్థిస్తున్నాడు దశరథుడు. ” ఓ చంద్రా! ఈ రాత్రి కాళరాత్రి కానీకు. రేపు తెల్లవారనీయకు. తెల్లవారితే రాముడు అడవులకు పోతాడు. ఈ రాత్రి ఇలాగే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సూర్యుని వెలుగులో ఆ నీచురాలు కైక ముఖం చూడటం నాకు ఎంతమాత్రం ఇష్టంలేదు.” అని మనసులోనే అనుకున్నాడు.
కాని దశరథునికి ఆశ చావలేదు. “ఏమో ఇంకోసారి బతిమాలితే కైక మనసు మార్చుకుంటుందేమో! మరొక సారి అడిగి చూద్దాం.” అని అనుకున్నాడు దశరథుడు. మరలా కైకను చూచి ఇలా అన్నాడు.
ఓ నా ముద్దుల భార్య కైకా! నువ్వు చాలా మంచిదానివి కదూ! అది తెలియక ఏదేదో అన్నానులే! పట్టించుకోకు. అయినా నా లాంటి వృద్ధునితో పరాచికాలేమిటి చెప్పు. అయినా అయోధ్యకు రాజును కదా! నన్ను ఇలా ఇబ్బంది పెట్టవచ్చా! నీలాంటి మంచి వాళ్లు ఇలా చెయ్యవచ్చా! నా మీద కాస్త కరుణ చూపు. నీ దయ నామీద ప్రసరింపచెయ్యి. అయినా నేను రామునికి పట్టాభిషేకం చెయ్యడం ఏమిటి? ఈ రాజ్యం నీది. నువ్వే రామునికి ఈ రాజ్యాన్ని ఇవ్వు. నీవే రాముని పట్టాభిషిక్తుని చెయ్యి ఆ కీర్తి ప్రతిష్టలు నువ్వే పొందు. నేను కాదన్నానా! నువ్వు ఆ పని చేసావనుకో నేను, అయోధ్య ప్రజలు, సమస్తలోకాలు, గురువులు అంతరూ నిన్ను మెచ్చుకుంటారు. నీ కుమారుడు భరతుడు కూడా రామ పట్టాభిషేకము చేసినందుకు ఎంతగానో శ్లాఘిస్తాడు. ఇంతమంది మెప్పు పొందడం సామాన్యమా చెప్పు. కాబట్టి రామ పట్టాభిషేకము నీ చేతులమీదుగా జరిపించు.” అని దీనంగా ప్రార్థించాడు.
కాని కైక మనసు ఇసుమంత కూడా మారలేదు. ఏమీ మాట్లాడకుండా మిన్నకుంది. దశరథునికి ఆఖరి ఆశకూడా వమ్ము అయి పోయింది. మనసు ఆ దు:ఖాన్ని తట్టుకోలేకపోయింది. కళ్లు బైర్లుకమ్మాయి. అలాగే సొమ్మసిల్లిపోయాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ ద్వాదశః సర్గః రామాయణంలోని మరో కీలక అధ్యాయం. ఈ సర్గలో, విశ్వామిత్ర మహర్షి రాముడు, లక్ష్మణులతో కలిసి సిద్ధాశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ, రాక్షసులు మరో యజ్ఞాన్ని భంగం చేయడానికి ప్రయత్నిస్తారు. రాముడు వారికి ధైర్యంగా ఎదురించి, యజ్ఞాన్ని కాపాడతాడు. అనంతరం, విశ్వామిత్రుడు రాముడికి మహాబలశాలి వాయుదేవుని కుమారుడు హనుమంతుని కథ చెబుతాడు.
వసంత ఋతువు ప్రవేశించింది. వసంత ఋతువులో తాను తలపెట్టిన యజ్ఞమును చేయ సంకల్పించాడు దశరథుడు. దశరథుడు మునిశ్రేష్టుడైన ఋష్యశృంగుని వద్దకుపోయి తనకు పుత్రసంతానము కలిగేటట్టు యజ్ఞము చేయించవలసిందిగా ప్రార్థించాడు. దానికి ప్రధాన ఋత్విక్కుగా ఋష్యశృంగుని ఉండవలసిందిగా అభ్యర్ధించాడు. దానికి అంగీకరించాడు ఋష్యశృంగుడు.
” ఓ దశరథ మహారాజా! అటులనే కానిమ్ము. నేను మీ చేత అశ్వమేధ యాగము చేయిస్తాను. తరువాత పుత్ర సంతానము కొరకు మరొక యాగము చేయిస్తాను. ముందు అశ్వమేధ యాగమునకు కావలసిన సంభారములు సేకరించుము. ఒక ఉత్తమాశ్వమును సేకరించి, దానిని యజ్ఞాశ్వముగా విడువుము.” అని అన్నాడు. ఆ మాటలకు మహదానందము పొందాడు దశరథుడు. వెంటనే తన మంత్రి సుమంతుని రావించాడు.
“సుమంతా! మనము అశ్వమేధయాగము చేయబోతున్నాము. నీవు వెంటనే మన పురోహితులు వసిష్ఠుని, బ్రాహ్మణులను, ఋత్విక్కులను, సుయజ్ఞుడు మొదలగు వారిని పిలిపింపుము,” అని ఆదేశించాడు.
సుమంతుడు దశరధుని ఆజ్ఞ ప్రకారము అందరినీ సమావేశపరిచాడు. దశరధుడు వారినందరినీ పూజించి సత్కరించాడు. వారితో ఇలా అన్నాడు.
“బ్రాహ్మణోత్తములారా! నేను అశ్వమేధయాగము చేయబోతున్నాను. దానికి ఋష్యశృంగుడు ప్రధాన ఋత్విక్కుగా ఉండుటకు అంగీకరించాడు. మీరందరూ ఆ యజ్ఞమును నిర్విఘ్నముగా జరిపించాలి.” అని వారిని ప్రార్థించాడు. దానికి వారందరూ సమ్మతించారు.
“రాజా నీవు ధర్మసమ్మతంగా యాగము చేస్తున్నావు. నీకు యాగఫలము దక్కుతుంది. నీకు నలుగురు పుత్రులు జన్మిస్తారు”అని వారు దశరథుని ఆశీర్వదించారు. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. తరువాత యాగమునకు కాలవసిన ఏర్పాట్లు చేయడానికి మంత్రులను నియమించి, దశరథుడు అంతఃపురమునకు వెళ్లాడు.
“రామాయణం” లో అయోధ్యాకాండము ద్వాదశః సర్గం (12వ సర్గ) చాలా ప్రాముఖ్యత కలిగినది. ఈ సర్గలో దశరథుడు రాముని వనవాసానికి పంపించడానికి సిద్ధమవుతాడు. కైకేయి, తన భర్తకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమని దశరథుని పై ఒత్తిడి తెస్తుంది. రాముడు తన తండ్రి ఆజ్ఞను శిరసావహించి, సీత మరియు లక్ష్మణులతో పాటు వనవాసానికి బయలుదేరుతాడు. ఈ సర్గ రాముడి విధేయత, ధైర్యం, మరియు పితృవాక్య పరిపాలన అనే గొప్ప గుణాలను ప్రతిబింబిస్తుంది. అయోధ్య ప్రజలు రాముని వనవాసానికి చాలా బాధపడతారు. రాముడు, సీత మరియు లక్ష్మణులు వనానికి వెళ్ళడం ద్వారా కథలో కీలక మలుపు వస్తుంది.
కైక మాటలు విన్న దశరథుడికి నోటమాట రాలేదు. అలాగే నిశ్చేష్టుడయ్యాడు. ఇది కలా నిజమా అనే భ్రమలో పడ్డాడు. లేక తనకేమన్నా చిత్తభ్రమ కలిగిందా లేక తనకు ఏమన్నా మానసిక వ్యాధి సోకిందా అని అనుమానపడ్డాడు. దశరథుని మనసు, కైక తన మాటలతో కొట్టిన దెబ్బను తట్టుకోలేకపోయింది. క్రమ క్రమంగా స్పృహ కోల్పోయాడు. కైక చల్లని నీరు తెప్పించి మొహాన చిలకరించింది.
కొంచెం తేరుకున్నాడు దశరథుడు. కళ్లుతెరిచాడు. కైకను చూచాడు. “ఛీ ఛీ పాపాత్మురాలా నీవా” అంటూ మరలా సృహ తప్పాడు. చాలా సేపటివరకూ అలాగే ఉన్నాడు. కైక తగు ఉ పచారములు చేసి స్పృహ తెప్పించింది. మెల్లిగా లేచి కూర్చున్నాడు. జరిగిందంతా కొంచెం కొంచెం గుర్తుకు వస్తూ ఉంది. కైక వరాలు కోరడం వరకూ గుర్తుకు వచ్చింది. కోపంతో ఊగిపోయాడు. కైక వంక చూచి ఇలా అన్నాడు.
“ఓసి దుర్మార్గురాలా! నీవేనా ఈ మాటలు అన్నది. నా రాముడు కానీ, నేను కానీ, నీకు ఏమి అపకారము చేసాము. మాకు ఎందుకు ఇంతటి దారుణమైన శిక్ష విధిస్తున్నావు. తాను పుట్టినప్పటినుండి రాముడు నిన్ను తన కన్నతల్లి కన్నా మిన్నగా భావించాడు కదా. అలాంటి రామునికే నీవు ద్రోహం తలపెడతావా! ఇది నీకు న్యాయమా! నీవు రాచ పుట్టుక పుట్టావని, ఉత్తమ క్షత్రియుని కుమార్తెవని నిన్ను వివాహం చేసుకొని మా కుటుంబంలోకి తీసుకొని వచ్చాను. కాని ఏం ఇంటి గడప తొక్కావో ఆ ఇంటి నాశనమునే కోరుతావు అని అనుకోలేదు. ఒక భయంకర విషనాగును తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు అయింది.
అది సరే. రాముని వనములకు పంపమన్నావు కదా! లోకము అంతా రాముని సకల సద్గుణ సంపన్నుడు అని కీర్తిస్తుంటే, అతనిలో ఏ దోషము చూపి నేను రాముని వనములకు పంపాలి. ఓ కైకా! నీకు తెలుసో లేదో! నేను నా భార్యలైన కౌసల్యను, సుమిత్రను, నిన్ను సైతం వదిలిపెడతానేమో గాని రాముని మాత్రం వదలను తెలుసా! రాముని చూస్తే నాకు పోయిన ప్రాణాలు లేచి వస్తాయి. రాముడు కనపడక పోతే నాకు పై ప్రాణాలు పైకేపోతాయి. ఎందుకంటే సూర్యుడు లేకుండా లోకాలు ఉంటాయేమో కాని, నీరు లేకుండా పంటలు పండుతా యోమే కానీ, రాముడు లేకుండా నేను క్షణకాలం కూడా బతకలేను. ఇది యదార్థము.
కైకా! కోపంలో ఏదేదో అన్నాను. నన్ను క్షమించు. నీ పాదాలంటి వేడుకుంటున్నాను. నీ మంకు పట్టు వదిలిపెట్టు. ఇంకేమన్నా వరాలు కావాలో కోరుకో ఇస్తాను. ” అని కైక మొహంలోకి చూచాడు. కైక మాట్లాడలేదు. మొహం అటు తిప్పుకుంది. మరలా దశరథుని కోపం తారస్థాయికి చేరింది.
“ఓసి దుర్మార్గురాలా! అసలు ఇంతటి పరమదారుణమైన కోరిక కోరాలనే ఆలోచన నీకు ఎలా వచ్చిందే!” అని అరిచాడు.
అంతలోనే తేరుకొని “అలా కాదులే! ఆ! నాకు తెలిసిందిలే! నాకు భరతుని మీద ఎంత ప్రేమ ఉందో పరీక్ష చేద్దామని అలా అన్నావు కదూ! అంతే అయి ఉంటుంది. లేకపోతే అలాంటి వరాలు ఎందుకు కోరతావు! ఎందుకంటే నీవు ఇదివరకు మాట్లాడేటప్పుడు ‘రాముడే నా పెద్ద కుమారుడు. భరతుడు నా రెండవ కుమారుడు’ అని ఎన్నిసార్లు నువ్వు అనలేదు. ఆ మాటలు మేమందరమూ విని ఎంతో సంతోషించాము కదా! ఇప్పుడు కూడా అలాగే నన్ను పరీక్షించడానికి అలా అంటున్నావు అని నాకు తెలుసు. అలాగే అగుగాక! లేకపోతే నీకు రాముని మీద ద్వేషభావం ఎందుకు ఉంటుంది. ఏమో!
అది సరే! రాముని పట్టాభిషేక వార్త విని రాముడు అంటే పడని వాళ్లు నీకు ఏమన్నా దుర్భోధలు చేసారా! ఆ మాటలు విని నువ్వు కోపగృహంలో పడుకున్నావా! కైకా! నీవు వివేకము కలదానవు. నీతి మంతురాలివి. ఎవరో చెప్పిన మాటలు వినవచ్చునా! కైకా! నీవు ఇదివరకు ఇలాంటి మాటలు మాట్లాడావా! అందుకే నీవు ఇలాంటి కోరికలు కోరావు అంటే నమ్మలేకపోతున్నాను. నా మీద దయయుంచి ఇదంతా నిజం కాదని చెప్పు. నా మనసు కుదుటపడుతుంది.
ఓ కైకా! నీవు చిన్నప్పటినుండి రాముని, భరతుని నీ ఒడిలో కూర్చోపెట్టుకొని ఎన్నో కథలు చెప్పావు కదా! నీ మెత్తటి ఒడిలో కూర్చున్న రాముడు ముళ్లపొదలతో నిండిన అడవులలో ఎలా ఉండగలడు అని అనుకుంటున్నావు. రాముడు మాత్రం తక్కువ వాడా! తన కన్నతల్లి కౌసల్య కన్నా నీకు ఎక్కువ సేవలు చేసాడు కదా! అలాంటి రాముని దూరంగా ఉంచాలని ఎందుకు అనుకుంటున్నావు? నీకు ఎంతో మంది దాసదాసీ జనము ఉన్నా నీకు భక్తితో ఎన్నో సేవలు చేసాడు కదా రాముడు. అసలు రాముడు తప్ప నీకు అత్యధికంగా సేవలు చేసిన వాళ్లు వేరే ఎవరు ఉన్నారో చెప్పు.
పోనీ రాముడు ఏమన్నా అకృత్యాలు చేసాడా అంటే… అదీ లేదు. రాముడు అయోధ్య ప్రజలందరికీ ప్రియమైన వాడు. తాను చేసిన మంచి కార్యములకు అందరి చేతా మన్ననలు పొందిన వాడు. అతని మీద కొంచెం కూడా అపనింద పడే అవకాశము లేదు. మరి ఎందుకు రాముని అరణ్యవాసము చెయ్యమంటున్నావు. ఏ కారణం లేకుండా అలా ఎందుకు అడిగావు.
ఓ కైకా! రాముడు ఎటువంటి వాడో నీకు తెలుసు. అయినా మరొకసారి చెబుతాను విను. రాముడు తన సత్యసంధతతో లోకాలను, తన దాన ధర్మములతో దీనజనమును, తన శుశ్రూషులతో గురువు లను, తన వీరత్వముతో శత్రువులను జయించాడు. సత్యము, దానము, ఏకాగ్రత, త్యాగము, మైత్రి, శౌచము, మంచితనము, విద్య, గురువులకు శుశ్రూష, ఇవన్నీ రామునికి సహజంగా పుట్టుకతో వచ్చిన గుణాలు. కపటము అనేమాటకు రామునికి అర్థం తెలియదు. అటువంటి “రామునికి అపకారము చెయ్యవలెనని దుర్బుద్ధి నీకు ఎలా పుట్టింది.
కైకా! రాముడు ఎవ్వరితోనూ పరుషంగా మాట్లాడటం నేను చూడలేదు. అందరితో ఎంతో ప్రియంగా మాట్లాడేవాడు. అలాంటి రామునితో నీ కోసం పరుషంగా ఎలా మాట్లాడమంటావు. అడవులకు పో అని ఎలా చెప్పమంటావు?
ఓ కైకా! మరలా వేడుకుంటున్నాను. నాకా వయసు అయిపోయింది. వృద్ధుడను అయ్యాను. ఇప్పుడు నాకు రాముడే దిక్కు. ఈ వయసులో నాకు రాముని దూరం చెయ్యకు. నువ్వు కావాలంటే నా రాజ్యము యావత్తు నీకు ధారపోస్తాను. రాముని మాత్రం నాకు విడిచిపెట్టు. ఓ కైకా! నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. ఈ వృద్ధుని మీద కోపం మాను. రాముని విడిచిపెట్టు నా ప్రాణాలు కాపాడు. ఇదే నా కోరిక. నా ఆఖరి కోరిక మన్నించు.” అని కైక పాదాల మీద పడిపోయాడు దశరథుడు.
దశరథుని దీన మైన మాటలు కైకలో ఎలాంటి మార్పును తీసుకురాలేకపోయాయి. స్వార్ధం ఆమె హృదయంలో కరుడు గట్టిపోయింది. అందుకే దశరథుడు ఎంత దీనంగా వేడుకున్నాడో అంత కఠినంగా ములుకుల వంటి మాటలు మాట్లాడింది.
“ఓ దశరథమహారాజా! నీవు వీరుడవు. యుద్ధరంగంలో నిన్ను రెండు సార్లు కాపాడి నీ ప్రాణాలు రక్షించి నందుకు నాకు రెండు వరాలు ఇస్తాను అన్నావు. ఆ వరాలు ఇప్పుడు కోరాను. ఏవోవో మాటలు చెప్పి నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నావు. ఇది నీకు ధర్మమా! ఇది ధర్మాత్ములు చేసే పనేనా! ఆడిన మాట తప్పడానికి ప్రయత్నించే నీవు ధర్మాత్ముడివా! ఈ విషయం నీవు భక్తితో పూజించే ఋషులకు, మునులకు చెప్పు.
‘అయ్యా! నా భార్య కైక నా ప్రాణాలను రక్షించింది. కైక అనుగ్రహము వలననే నేను బతుకుతున్నాను. అలాంటి కైకకు నేను ఇచ్చిన మాటను తప్పాను.’ అని చెప్పు. వాళ్లు నిన్ను ధర్మాత్ముడు అంటారా! లేక మాట తప్పిన వాడంటారా!
ఓ దశరథ మహారాజా! ఆడిన మాట తప్పి నువ్వు నీ వంశమునకు, నీ పూర్వీకులకు కళంకము తీసుకొని వస్తున్నావు. ఆడిన మాట కోసం శిబి చక్రవర్తి తన శరీరమునే కోసి ఇచ్చాడు. అలర్కుడు తన నేత్రములను దానం చేసాడు. వారంతా నీ వంశములోని వారే. సముద్రుడు దేవతలకు ఇచ్చినమాట ప్రకారము చెలియలి కట్ట దాటడం లేదు. వారంతా ఆడిన మాటకు కట్టుబడి ఉన్నారు కదా! నీకేమయింది. ఇచ్చిన వరాలను వెనక్కు తీసుకుంటున్నావు. నీ దుర్బుద్ధి నాకు తెలుసు. రాముని యువరాజుగా చేసి కౌసల్యను పట్టపురాణిగా చేసి నన్ను నా కుమారుని అనాధలుగా చెయ్యాలని చూస్తున్నావు..
ఇంతెందుకు. ఓ దశరధమహారాజా! నేను అడిగింది ధర్మమ అధర్మమో, సత్యమో అసత్యమో, నాకు అనవసరము. మీరు నాకు రెండు వరాలు ఇస్తాను అన్నారు. ఆ వరాలు నాకు ఇవ్వాలి అంతే. దీనికి తిరుగు లేదు. నా మాటలు లక్ష్యపెట్టకుండా రామునికి పట్టాభిషేకము చేస్తే నేను నీ ఎదుటనే విషం తాగి చస్తాను. తన కుమారుడు యువరాజు అని విర్రవీగుతున్న నా సవతి కౌసల్యకు నమస్కారం చేసే కంటే చావడం మేలు.
ఓ దశరథ మహారాజా! నా మీద నా కొడుకు భరతుని మీద ఒట్టుపెట్టుకొని చెబుతున్నాను. రాముడు అరణ్యములకు వెళ్లాలి.
నాకుమారుడు యువరాజు కావాలి. అంతే. ఇంక దేనికీ నేను ఒప్పుకోను. ఆ రెండు తప్ప ఈ లోకంలో ఏవీ నాకు అక్కరలేదు. తరువాత తమరి ఇష్టం.” అని పలికి కైక మౌనంగా ఉండిపోయింది. కైకేయి మనోనిశ్చయము విని దశరథుడు నోటమాట రాకుండా మౌనంగా ఉండిపోయాడు. భరతుని పట్టాభిషేకము కన్నా రామ వనవాసము దశరథుని మనసు బాగా కలచి వేసింది. అటువంటి దుర్గార్గపు వరములు కోరిన కైక వంక చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. దశరథునికి మతిభ్రమించి నట్టు అయింది. పిచ్చివాడి మాదిరి దిక్కులు చూస్తున్నాడు. మూర్ఛరోగి మాదిరి వణుకుతున్నాడు. ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఏమి చేస్తున్నాడో తెలియని పరిస్థితి. అమాయకంగా కైక వంక చూచాడు.
“ఓ కైకా! నీకు ఇటువంటి దుర్మార్గపు ఆలోచన ఎవరు చెప్పారు? ఒకవేళ ఎవరైనా నీకు దుర్బోధ చేసారే అనుకో! నువ్వు సిగ్గు లేకుండా నన్ను అడుగుతావా! నీకే మన్నా దయ్యం పట్టిందా. లేక పిశాచము ఆవహించిందా. ఇంత విపరీతంగా ప్రవర్తిస్తున్నావు. నీకు చిన్నప్పటినుండీ ఇలాంటి విపరీతమైన ఆలోచనలు ఉన్నట్టు మీ వాళ్లు నాకు చెప్పనేలేదు. అయోధ్య వచ్చిన తరువాత కూడా నువ్వు ఇలా విపరీతంగా ప్రవర్తించలేదు. ఈరోజు నీకేం పుట్టింది. ఇలా మాట్లాడుతున్నావు.
ఇంతకూ నీకు ఎవరి వల్ల భయము. రాముని వల్లనా! లేకపోతే భరతునికి పట్టాభిషేకంతో ఊరుకోక రాముని వనవాసము ఎందుకు కోరుతున్నావు. రాముడంటే నీకు ఎందుకు అంత భయం? కైకా! మరలా చెబుతున్నాను. నాకు, నా కుమారుడు రామునికి, నీ కుమారుడు భరతునికి, అయోద్యకు క్షేమం కోరేదానివయితే నీవు కోరిన వరములు ఉపసంహరించుకో. బాగుపడతావు.” అప్పటిదాకా సౌమ్యంగా ఉన్న దశరథుడుఒక్కసారిగా రెచ్చిపోయాడు. తిట్టడం మొదలెట్టాడు.
“ఓసి పాపాత్మురాలా! క్రూరురాలా! క్షుద్రురాలా! దుర్మార్గురాలా! నాలో నా రామునిలో నీకు ఏం దోషాలు కనపడ్డాయే! మేము నీకు ఏం ద్రోహం చేసామే! నీకు తెలుసో లేదో. భరతుని హృదయం నాకు బాగా తెలుసు. రాముని కాదని భరతుడు రాజ్యాభిషేకమునకు ఎంతమాత్రమూ అంగీకరించడు. నీ కొడుకు సంగతి నీకు బాగా తెలియదు. రాముని కన్నా భరతునికి ధర్మములు ఎక్కువ తెలుసు. ధర్మాచరణములో రాముని కన్నా భరతుడే మిన్న.” దశరథుడు వెంటనే దీనంగా మారిపోయాడు.
“కైకా! కైకా! నేను రాముని వద్దకు పోయి ‘రామా! నీవు అరణ్యములకు పోవాలి’ అని ఎలా చెప్పగలను. అలా చెప్పిన తరువాత రాముని మొహం ఎలా చూడగలను. అది అటుండనీ. నేను రామ పట్టాభిషేక నిర్ణయాన్ని అందరితో చర్చించి వారి ఆమోదము పొందిన తరువాతనే తీసుకున్నాను. సామంత రాజులందరినీ ఆహ్వానించాను. ఇప్పుడు నేను నా నిర్ణయాన్ని మార్చుకుంటే వాళ్లందరూ ఏమంటారు? ఈ ప్రకారంగా క్షణక్షణమూ నిర్ణయాలు మార్చుకొనేవాడు ఇన్నాళ్లు అయోధ్యను ఎలా పరిపాలించాడు అని హేళన చేయరా! అది నీకు ఇష్టమా! ఇప్పుడు రాముడు వనవాసమునకు వెళితే, రేపు పురప్రముఖులు అంతా వచ్చి “మా రాముడు ఏడీ!” అని అడిగితే నేను వారికి ఏమని సమాధానము చెప్పగలను.
“అయ్యా! నా భార్య కైక మాట విని రాముని అరణ్యములకు పంపాను” అని చెబితే ఎవరూ నా మాట వినరు. దశరథుడు అబద్ధం చెబుతున్నాడు అని అనుకుంటారు. అది నీకు సమ్మతమా!
కౌసల్య వచ్చి నా కుమారుడు రాముని అరణ్యములకు ఎందుకు పంపావు? కారణం ఏమిటి? అన్ని నన్ను నిలదీస్తే ఆమెకు నేను ఏమని సమాధానం చెప్పగలను. నా మూడోభార్య మాటవిని రాముని అరణ్యములకు పంపాను అని చెబితే నాగురించి కౌసల్య ఎంత నీచంగా అనుకుంటుంది. అది నీకు సమ్మతమా!
కైకా! నీకుమారునికి పట్టాభిషేకము అంటే ఏదో నీ కుమారునికి మేలు చేస్తున్నావు అనుకోవచ్చు. కాని రాముని అరణ్యములకు పంపే హక్కు నీకూ నాకూ ఎక్కడిది! ఆలోచించు. నా కుమారుని అడవులకు పంపే అధికారము మీకు ఎక్కడిది అని కౌసల్య నన్ను నిలదీస్తే, నేను ఏమని సమాధానము చెప్పను? కైకా! నీకు ప్రీతి కలిగించడం కోసరం నేను కౌసల్యను ఎంతగా నిరాదరించానో నీకు తెలుసు కదా! ఆమె నాకు సేవలు చెయ్యడానికి వస్తే నీ మీద ఉన్న వల్లమాలిన ప్రేమతో ఆమెను నిరాకరించాను. ఎవరి కోసం? నీ కోసమే కదా! కనీసం ఆ కృతజ్ఞత కూడా నీకు లేదా! అవునులే! చేసిన మేలు మర్చిపోయే వాళ్లకు ఎంత చేసి మాత్రం ఏమి లాభం! రోగంతో బాధపడేవాడికి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినట్టు అయింది.
కౌసల్య సంగతి అటుంచు. నీ మాటలు విని నేను రాముని అడవులకు పంపితే, సుమిత్ర నా గురించి ఏమనుకుంటుంది! ఇంక నన్ను నమ్ముతుందా! తనకుమారుడు లక్ష్మణునికి కూడా ఇదే గతి పడుతుంది అని అనుకోదూ! వీళ్లు సరే కన్న తల్లులు. మరి రాముని నమ్ముకొని పుట్టింటి నుండి అయోధ్యకు వచ్చిన రాముని అర్థాంగి సీత. ఆమె గతేం కావాలి. భర్త అరణ్యవాసము, మామగారి దుర్మరణ వార్తలు సీత వినడం అవసరమా! ఎందుకంటే రాముడు అడవులకు పోతుంటే ఆ సన్నివేశము చూసి సీత రోదిస్తుంటే నా గుండెలు బ్రద్దలవుతాయి. నేను మరణించడం తథ్యం. అప్పుడు నీవు, హాయిగా విధవరాలుగా, కొడుకుతో సహా రాజ్యము ఏలుకుంటావు. ఇదేగా నీవు కోరుకొనేది. నీ కోరికల ఫలితం.
కైకా! నీ అందచందాలు చూసి నీవు మంచిదానవు అనుకున్నాను కానీ నీ కడుపులో ఇంత విషం ఉందనుకోలేదు. కడుపులో ఇంత విషం దాచుకొని నాతో ఇన్నాళ్లు ఎన్నో ప్రీతికరమైన మాటలు మాట్లాడావన్నమాట! ఎంత మోసం? అవునులే. నిన్ను అనుకోని ఏం లాభం. నా ఖర్మ ఇలా కాలింది. ‘రాజ్యము ఇస్తాననని ఆశపెట్టి తుదకు కొడుకును అడవులకు పంపిన దుర్మార్గుడైన తండ్రి ఈ దశరథుడు’ అని లోకులందరూ నన్ను ఆడిపోసుకుంటుంటే, వారి మాటలు పడాల్సిన దౌర్భాగ్యము నాకు పట్టింది. నీమాటలు విన్నందుకు కదా నాకు ఇన్ని కష్టాలు దాపు రించాయి. ఏ జన్మలో ఏం పాపం చేసానో ఈ జన్మలో అనుభవి స్తున్నాను. లేకపోతే ఎక్కడో కేకయ దేశంలో ఉన్న నిన్ను పెళ్లి చేసుకొని నా మెడకు నేను ఉరితాడు బిగించుకున్నాను. నువ్వే నా మృత్యు దేవతవు అని తెలుసుకోలేకపోయాను. ఇన్నాళ్లు భయంకరమైన విషనాగును పక్కలో పెట్టుకున్నాను.
కన్నకొడుకును అడవులకు పంపిన పాపాత్ముడు వీడూ ఒక తండ్రేనా! ఒక ఆడదాని కోరికలు తీర్చడం కోసం కన్నకొడుకును అరణ్యవాసమునకు పంపిన మూర్ఖుడు’ అని అయోధ్యావాసులు అందరూ నన్ను దూషిస్తారు. పాపం రాముడు. వాడికి చిన్నప్పటి నుండీ అన్నీ కష్టాలే. చిన్నపుడే ఉపనయనం చేసి గురుకులానికి పంపాను. గురువుల వద్ద చదువు, బ్రహ్మచర్యము, కఠోర నియమాలు, వీటితోనే గడిచిపోయింది. ఏదో రాజ్యాభిషిక్తుడై సుఖపడతాడు అనుకుంటే మరలా అరణ్యవాసం సంప్రాప్తమయింది. అడవులలో అన్నీ కష్టాలే. రాముని జీవితంలో సుఖపడే రాత లేదేమో!
పోనీ రాముడైనా “నేను అరణ్యాలకు పోను” అంటే అదొకదారి. కాని నేను రాముడిని పిలిచి “రామా! నీవు పధ్నాలుగేళ్లు అరణ్యములకు వెళ్లాలి అంటే చాలు” మరుక్షణం వెళ్లిపోతాడు. నా మాటంటే రామునికి వేదవాక్కు. పితృవాక్య పరిపాలనను పక్కన పెట్టి “నేనెందుకు అరణ్యాలు పోవాలి. నేను వెళ్లను” అని రాముడు అంటే ఎంత బాగుంటుంది. కాని అనడు. ఎందుకంటే రామునికి కపటం తెలియదు. నిర్మలహృదయుడు. నా మాట ధిక్కరించడం, అతిక్రమించడం నాకు ఎంతో ఇష్టం అని రామునికి ఎలా తెలిసేది! నేనా చెప్ప లేను. రామునికి ఎవరు రాముడు అరణ్యములకు పోయిన తరువాత మరణించే బదులు ఇప్పుడే నాకు మరణం సంభవిస్తే అని సమస్యలు తీరిపోతాయి. జీవితంలో ఇంకా ఇటువంటి దుర్మార్గాలు చెయ్యకుండా శాశ్వత విముక్తి లభిస్తుంది. నేను కాదు, కొడుకు అరణ్యాలకు పోయి, భర్త మరణిస్తే కౌసల్య ఎలా జీవించి ఉంటుంది. తాను కూడా నాతోపాటు స్వర్గం చేరుకుంటుంది.
ఓ కైకా! మేమందరమూ పోయిన తరువాత హాయిగా సుఖంగా నువ్వు నీ కొడుకూ రాజ్యం ఏలుకోండి. ఇప్పటిదాకా ఇక్ష్వాకు వంశము మచ్చలేకుండా నడిచింది. ఈనాటికి నీ వలన మా వంశము మీద మాయని మచ్చ పడింది. ఇదిగో కైకా! ఇప్పుడే చెబుతున్నాను. రాముని వనవాసము, నా మరణము, ఒకేసారి సంభవిస్తాయి. భరతుని నాకు పితృకార్యాలు చెయ్యవద్దని చెప్పు. రాముని కాదని రాజ్యమేలే వాడు నా కొడుకు కాదు.
ఓసి దుర్మార్గురాలా! ఇన్ని మాటలు అంటున్నా నీ మనసు కరగలేదా! నీది మనసా లేక బండరాయా! నా కొడుకు అరణ్యములకు పోయి నేను మరణిస్తే విధవరాలిగా సుఖాలు అనుభవిద్దాము అనుకుంటున్నావా!
నీ వలన మా వంశం అంతా సర్వ నాశనము అయింది కదే దుర్మార్గురాలా! ఇంతకాలమూ ఒక రాజకుమారుడిగా, రథములమీద, హయముల మీదా తిరిగిన రాముడు ఇప్పుడు కారడవులలో, కటిక రాళ్ల మీద ఒట్టి కాళ్లతో తిరగాలా! ఇన్నాళ్లు రాచభవనంలో షడ్రసోపేతమైన విందుభోజనము చేసిన వాడు అడవులలో కంద మూలములు తినాలా! అనుక్షణమూ పీతాంబరములు, పట్టువస్త్ర ములు తప్ప వేరు వస్త్రములు ధరించని రాముడు అడవులలో నారబట్టలు ఎలా ధరించగలడు. రాముడు అరణ్యములకు వెళ్లాలి అన్న దురాలోచన నీ మస్తిష్కములో ఎవరు జొప్పించారు కైకా!
నీ ప్రవర్తన చూస్తుంటే మీ ఆడవాళ్లందరూ పైకి ప్రేమ నటిస్తూ లోలోపల గొంతులు కోస్తారని తెలుస్తూ ఉంది. కాని అందరు స్త్రీలు నీ మాదిరి ఉండరులే. మహాపతివ్రతలు కూడా ఉంటారు. ఓ కైకా! ఓ స్వార్థపరురాలా! ఓ దుర్మార్గురాలా! ఓ క్రూరురాలా! ఈరోజు కేవలం నన్ను అష్టకష్టాల పాలు చెయ్యాలని కంకణం కట్టుకున్నావా. ఇలా మాట్లాడు తున్నావు. రాముడు అడవులలో కష్టాలు పడుతున్నాడు అని తెలిసి ఈ జగత్తు అంతా నిన్ను దూషించక మానదు. పురుషులంతా నీ లాంటి భార్యలను వదిలివేస్తారు.
ఓ కైకా! నామాట వినవే. ఒక్కసారి ఆ కల్యాణ రాముని చూడవే! రాముడిని చూస్తుంటే నయనాదం కలగడం లేదా నీకు. కైకా! ఈ ప్రపంచంలో సూర్యుడు ఉదయించకపోయినా బతక వచ్చు. ఇంద్రుడు వానలు కురిపించకపోయినా బతక వచ్చు కానీ రాముడు లేనిది ఎవరూ బతకలేరు. అలాంటిది నేను ఎలా జీవించి ఉండగలను. నీ వరాలు అనే పాము కాటుతో నాకు మరణం తథ్యం. ఇన్నాళ్లు. పాములాంటి నిన్ను పక్కనపెట్టుకొని ఈ నాడు నీ చేత కాటు వేయించుకున్నాను.
ఓ కైకా! మూర్ఖురాలా! నా రాముని అరణ్యములకు పంపి, నన్ను చంపి, నువ్వు నీ కొడుకు నా శత్రువులకు ఆనందం కలగించ దలచుకున్నారా! ఇలాంటి మాటలు మాట్లాడినందుకూ ఇటువంటి కోరికలు కోరినందుకూ నీ తల ఎందుకు వెయ్యివక్కలు కాలేదా అని అనుమానంగా ఉంది. ఎందుకంటే ఎవరితోనూ పరుషంగా మాట్లాడటం తెలియని రామునికి అపకారం చెయ్యడం, అడవులకు పంపాలి అని కోరడం లాంటి మహాపాపం చేసిన తరువాత నువ్వు ఇంకా బతికి ఉండటమా!
ఓ కైకా! నా నిర్ణయం విను. నువ్వు ఎంత ఏడ్చినా మొత్తుకున్నా ఆఖరుకు చచ్చినా నువ్వు కోరిన కోరికలు తీర్చను. నీ మాట నెరవేర్చను. నాకు అసత్యదోషం అంటినా సరే. లెక్క చేయను. ఎందుకంటే మంచి వాళ్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోడం ధర్మం కానీ, నీ లాంటి దుర్మార్గులకు, అబద్ధాలు ఆడేవాళ్లకు, దుష్టురాలకు, కులనాశకులకు, నా మనసుకు కష్టము కలిగించిన దానికి, ఆఖరుకు నా హృదయంలో చిచ్చుపెట్టిన పాషండురాలికి ఇస్తానన్న వరాలు ఇవ్వక పోవడమే ధర్మం.
ఓ కైకా! మరలా మరలా చెబుతున్నాను. రాముని విడిచి నేను ఉండలేను. రాముడు లేనిదే బతుకలేను. ఇంక నాకు సుఖసంతోషాలు ఎక్కడ ఉంటాయి. కాబట్టి నన్ను కరుణించు. నీ పాదాలు పట్టుకుంటాను. నీ వరాలు ఉపసంహరించుకో. నన్ను, లోకాన్ని రక్షించు.” అని కైక పాదాలమీద పడబోయాడు దశరథుడు.
అప్పటి దాకా మౌనంగా అన్నీ వింటూ ఉంది కైక. సహజంగా ఉ త్తమురాలైన కైక మనసు ద్రవించి పోయింది. దీనంగా రోదిస్తున్న భర్త ఎక్కడ తన కాళ్లు పట్టుకుంటాడో, తనపాతివ్రత్యానికి ఎక్కడ భంగం కలుగుతుందో అని దూరంగా జరిగింది. కైక కాళ్లు పట్టుకోకుండానే దశరథుడు కిందపడిపోయాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకాదశః సర్గములో, తన మంత్రి సుమంత్రుని సలహా మేరకు, దశరథుడు ఋష్యశృంగ మహర్షి మరియు అతని భార్య శాంతను తన రాజధాని అయోధ్యకు తీసుకురావడానికి అంగ రాజ్యానికి వెళ్తాడు.
ఋశ్యశృంగస్యాయోధ్యాప్రవేశః
భూయ ఏవ హి రాజేంద్ర శృణు మే వచనం హితమ్ |
యథా స దేవప్రవరః కథయామేవమబ్రవీత్ ||
1
ఇక్ష్వాకూణాం కులే జాతో భవిష్యతి సుధార్మికః |
రాజా దశరథో రాజా శ్రీమాన్సత్యప్రతిశ్రవః ||
“ఓ దశరథమహారాజా! తమరి గురించి సనత్కుమారుడు ఇంకా ఏమి చెప్పాడో వినండి.
‘రాబోవు కాలంలో ఇక్ష్వాకు వంశంలో ధర్మాత్ముడు, శీలవంతుడు అయిన దశరథుడు అనే రాజు జన్మిస్తాడు. ఆయనకు పుత్రసంతానము కలుగదు. రోమపాదుడు దశరథునకు మిత్రుడు. దశరథుడు రోమపాదుని వద్దకు వెళ్లి ఋశ్యశృంగుని అయోధ్యకు పంపమని, తనకు పుత్రసంతానము కలిగేట్టు ఒకయాగం చేయించమని అర్థిస్తాడు. దానికి రోమపాదుడు అంగీకరిస్తాడు. రోమపాదుడు ఋష్యశృంగుని అయోధ్యకు పంపుతాడు. తనకు సంతాన ప్రాప్తి కలిగేటట్టు యజ్ఞము చేయించమని దశరథుడు ఋష్యశృంగుని ప్రార్థిస్తాడు. ఋష్యశృంగుడు దశరథుని చేత యజ్ఞము చేయిస్తాడు. ఫలితంగా దశరథునకు అమిత పరాక్రమవంతులు, వంశోద్ధారకులు అయిన నలుగురు పుత్రులు కలుగుతారు.’ అని సనత్కుమారుడు చెప్పగా నేను విన్నాను.
కాబట్టి ఓ దశరథ మహారాజా! ఆ మహాఋషి మాటలు తప్పవు. నీవు వెంటనే అంగదేశమునకు స్వయముగా పోయి ఋష్యశృంగుని తీసుకొని రమ్ము. యజ్ఞము చేయింపుము. నీకు పుత్ర సంతానము కలుగుతుంది.” అని సుమంతుడు చెప్పాడు.
ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. పురోహితుడైన వశిష్టుని అనుమతి తీసుకున్నాడు. తన మంత్రులతో సహా అంగదేశము నకు వెళ్లాడు. అంగరాజు దశరథుని సాదరంగా ఆహ్వానించాడు. అతిథి సత్కారములు చేసాడు. అంగరాజు పక్కన అగ్ని వలె ప్రకాశించు చున్న ఋష్యశృంగుని చూచాడు దశరథుడు. రోమపాదుడు దశరథుని ఋష్యశృంగునికి పరిచయం చేసాడు. ఋష్యశృంగుడు దశరథునికి నమస్కరించాడు.
దశరథుడు అంగరాజ్యములో ఏడురోజులు ఉన్నాడు. ఎనిమిదవ రోజున తాను వచ్చిన పని తెలిపాడు.
“ఓ అంగరాజా! నేను ఒక యజ్ఞము చేయ సంకల్పించాను. ఆ యజ్ఞమునకు నీ కుమార్తె శాంతను, అల్లుడు ఋష్యశృంగుని అయోధ్యకు పంపవలసింది.” అని ప్రార్థించాడు. దానికి అంగరాజు అంగీకరించాడు.
ఋష్యశృంగుడు సతీసమేతంగా అయోధ్యకు ప్రయాణమయ్యాడు. తమ రాకను దశరథుడు ముందుగా నే అయోధ్యావాసులకు తెలియజేసాడు. స్వాగత సత్కారములు ఘనంగా చేయమని ఆదేశించాడు.
దశరధుడు ఋష్యశృంగుని తీసుకొని అయోధ్యా నగరము ప్రవేశించాడు. అయోధ్యాపురవాసులు వారికి మంగళవాద్యములతో ఘనస్వాగతం పలికారు. శాంతను చూచి అంతఃపుర స్త్రీలు ఎంతో సంతోషించారు. ఆమెను సాదరంగా ఆహ్యానిం చారు. శాంతా ఋష్యశృంగులు అయోధ్యలో కొంతకాలము ఉన్నారు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదకొండవసర్గ సంపూర్ణము.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండములో త్రయోదశః సర్గలో రాజు దశరథుడు వైదిక కర్మకు సంబంధించిన పనులను ప్రారంభించమని రాజ పురోహితుడైన వశిష్ట ఋషిని అభ్యర్థించాడు. వశిష్ఠ మహర్షి కార్యాలను అమలు చేయడంలో పాటించాల్సిన క్రమశిక్షణ గురించి సంబంధిత వారందరికీ సూచించాడు. వశిష్ఠ మహర్షి మంత్రివర్యుడైన సుమంత్రుడికి ఇతర దేశాలలోని వివిధ రాజులను ఆహ్వానించమని ఆదేశిస్తాడు, మరియు ఆ రాజులను గొప్ప ఆతిథ్యంతో స్వాగతిస్తారు. దశరథ రాజు తన భార్యలతో కలిసి కర్మ ప్రతిజ్ఞ చేసి కర్మ మందిరంలోకి ప్రవేశిస్తాడు.
ఋశ్యశృంగం పురస్కృత్య యజ్ఞకర్మారభంస్తదా |
యజ్ఞవాటగతాః సర్వే యథాశాస్త్రం యథావిధి |
శ్రీమాంశ్చ సహపత్నీభీ రాజా దీక్షాముపావిశత్ ||
37
Balakanda Sarga 13 In Telugu Pdf With Meaning
యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి ఒక సంవత్సరము పట్టింది. మరలా వసంత ఋతువు వచ్చింది. దశరథుడు సంతానము కొరకు యజ్ఞము చేయుటకు యాగశాలలో ప్రవేశించాడు. పురోహితులైన వశిష్టులకు బ్రాహ్మణులకు నమస్కరించాడు. “మీరందరూ ఈ యజ్ఞమును వేదోక్తముగా నిర్విఘ్నముగా జరిపించండి.” అని వారిని ప్రార్థించాడు.
“మహారాజా! మీరు కోరినట్లే జరుగుతుంది” అని బ్రాహ్మణులు ఆశీర్వదించారు.
తరువాత పురోహితుడైన వశిష్టుడు జ్ఞానవృద్ధులైన బ్రాహ్మణులను, వాస్తు శిల్పులను, శిల్పులను, కొయ్యపనిచేసే వారిని, మట్టిపని చేసేవారిని, వినోద కార్యక్రమములకు నటులను, నటీమణులను, “దశరథమహారాజు గారు అశ్వమేధ యాగము చేయ సంకల్పించారు. మీరందరూ ఆ కార్యక్రమునకు తగు భవనములను, వేదికలను, యాగశాలలను నిర్మించండి. తగు ఏర్పాట్లు చేయండి. యజ్ఞమునకు వచ్చువారికి భోజన సదుపాయములు వసతి సదుపాయములు చేయండి. తగినన్ని వసతి గృహములు నిర్మించండి. ఎవరికీ ఏలాంటి అసౌకర్యము కలగకుండా చూడండి. అన్ని వర్ణముల వారిని సమంగా ఆదరించండి. ఎవరి మీద కోపతాపములు చూపకండి. ఆహూతులను బాధపెట్టకండి. ఈయజ్ఞమునకు కావలసిన పనులు చేయువారికి తగిన భోజన వసతి సౌకరర్యములు కల్పించండి. వారికి తగిన పారితోషికములు ఇవ్వండి. సత్కరించండి. అన్ని పనులను శ్రద్ధతో జరిగేటట్టు చూడండి. అలక్ష్యము పనికిరాదు.” అని ఆదేశించాడు వశిష్టుడు.
పిమ్మట వశిష్టుడు మంత్రి సుమంతుని పిలిపించాడు. “సుమంతా! నీవు ఈ యాగమునకు భూమండలములోని రాజులందరికీ ఆహ్వానములు పంపించు. మిథిలాధిపది జనకుడు మనకు బంధువు. ఆయనను స్వయంగా, ప్రత్యేకంగా ఆహ్వానించు. అలాగే కాశీరాజును కూడా నీవు స్వయంగా వెళ్లి తీసుకొని రా. ఇంకా మహారాజు గారి మామగారు కేకయ దేశాధి పతి కేకయ రాజును కూడా స్వయంగా ఆహ్వానించు. అలాగే అంగదేశాధీశుడు రోమపాదుని కూడా సాదరంగా ఆహ్వానించు. ఇంకా తూర్పుదేశపు రాజులను, దక్షిణదేశపు రాజులను, సింధు, సౌరాష్ట్ర దేశాధీశులను ఆహ్వానించు. మన రాజ్యముతో స్నేహ సంబంధములు కలిగిన రాజులందరినీ ఆహ్వానించు. పైన చెప్పిన వారందరినీ సకుటుంబ, సపరివార సమేతముగా యజ్ఞమునకు రమ్మని ఆహ్వానించు.” అని పలికాడు వశిష్టుడు.
వశిష్టుని ఆదేశానుసారము సుమంతుడు జనకుని, కేకయరాజును, కాశీరాజును స్వయంగా ఆహ్వానించడానికి త్వరితముగా వెళ్లాడు. ఆయాకార్యములకు నియమింపబడిన కార్యనిర్వాహకులు, ఆయాపనులలో నిష్ణాతులైన పనివారు ఆయా కార్యములు చేయుటలో పూర్తిగా నిమగ్నమైనారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. యజ్ఞమునకు ఆహ్వానము అందుకొన్న రాజులందరూ వారి వారికి తోచిన రత్నములు, మణులు మొదలగు కానుకలతో అయోధ్యా నగరానికి వచ్చారు. వసిష్టుడు వారందరికీ అతిథి సత్కారములకు చేయుటకు తగిన ఏర్పాట్లు చేసాడు. ఆవిషయము దశరథునికి చెప్పాడు.
వశిష్టుడు, ఋష్యశృంగుడు దశరథమహారాజు వద్దకు పోయి ” ఓ దశరథమహారాజా! మనము ఆహ్వానించిన రాజులందరూ అయోధ్యకు వచ్చారు. యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. మీరు యజ్ఞ శాలకు రావాలి.” అనిపలికారు.
ఒక శుభముహూర్తమున దశరథమహారాజు, తన ముగ్గురు భార్యలతో సహా యజ్ఞశాలకు వచ్చాడు. ఋష్యశృంగుని ఆధ్వర్యములో, వసిష్టుని పౌరోహిత్యములో అశ్వమేధయాగము ప్రారంభము అయింది.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదమూడవ సర్గ సంపూర్ణము.
“అయోధ్యాకాండం” వాల్మీకి మహర్షి రామాయణంలోని రెండవ భాగం. ఈ భాగంలో రాముడు, సీతా, లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్లడం, రాముని పాదుకలను భరతుడు పట్టాభిషేకం చేయడం వంటి సంఘటనలు ఉంటాయి. “ఏకాదశ సర్గ” అంటే “అయోధ్యాకాండంలో పదకొండవ అధ్యాయం”. ఈ సర్గలో, దశరథ మహారాజు రాముని అరణ్యవాసానికి పంపిన తర్వాత కలిగిన విచారం మరియు దుఃఖాన్ని వివరించబడింది. సుమంతుడిని పంపి, రాముడు, సీత, లక్ష్మణులని తీసుకురావడానికి ప్రయత్నించినా, వారు తిరిగి రాకపోవడం కూడా ఇందులో ప్రస్తావించబడింది.
దశరథమహారాజు చేత అడిగించుకొని బతిమాలించుకొని తుదకు కైక లేచి కూర్చుంది. మన్మధ బాణములకు బలి అయిన, తన మీది కామానికి దాసోహం అన్న, తన భర్త దశరథమహారాజుతో ఇలా అంది. “మహారాజా! మీరు అన్నట్టు నన్ను ఎవరూ బాధించలేదు. ఎవరూ అవమానించలేదు. నాకు మిమ్మల్ని కొన్ని వరములు అడగ వలెనని ఒక కోరిక కలిగింది. అది మీరు తీర్చాలి. మీరు తీరుస్తాను అని ప్రతిజ్ఞ చేస్తేనే నా కోరికల గురించి చెబుతాను. తీరా నేను అడిగిన తరువాత మీరు కాదు అంటే నా మనసుకు బాధకలుగుతుంది. మరలా మీరు నన్ను బతిమాలాలి కదా!” అని సన్న సన్నగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నట్టు మాట్లాడింది కైక.
ఆ మాటలకు దశరథుడు నవ్వాడు. కైక తల వెంట్రుకలు తన చేతిలోకి తీసుకొని సుతారంగా నిమురుతూ ఇలా అన్నాడు. దానిని తప్పకుండా నెరవేరుస్తాను. సందేహపడకుండా అడుగు. ఎందుకంటే రాముడు నాకు ఆరోప్రాణమ. నా ఐదు ప్రాణాలు లోపల ఉంటే రాముడు నాకు బయట ఉన్న ఆరో ప్రాణము. రాముని చూడనిది నేను ముహూర్త కాలం కూడా జీవించలేను. అటువంటి రాముని మీద ఒట్టుపెట్టుకొని చెబుతున్నాను. ఇంకా నన్ను నమ్మవా!
ఓ కైకా! రాముని రక్షించుకోడానికి నేను నా ప్రాణాలను, నా ముగ్గురు కుమారుల ప్రాణాలను కూడా బలిపెట్టడానికి సిద్ధంగా ఉ న్నాను. అటువంటి రాముని మీద ఒట్టుపెట్టుకుంటున్నాను. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు. నీ మనసులో ఏముందో తెలుసుకోడానికి నా మనసు అల్లల్లాడిపోతూ ఉంది. నా మీద దయయుంచి నీ కోరిక వెల్లడించు.
అసలు నా మీద నీకు ఎందుకింత అపనమ్మకము. నా మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి కదా! నన్ను శాసించే అధికారం నీకు ఉంది. ఇంకా విను. నేను రాముని మీదనే కాదు. నేను ఇప్పటి దాకా యజ్ఞయాగములు చేసి ఆర్జించిన పుణ్యము మీదకూడా ఒట్టుపెట్టు కొని చెబుతున్నాను. ఇంక నైనా నీ మనసులోని కోరిక బయట పెట్టు. ఇంకా నన్ను చిత్రవధ చెయ్యకు.” అని దీనంగా వేడుకున్నాడు దశరథుడు. ఆ మాటలకు ఎంతో సంతోషించింది కైక. ఇంక తన మనోరథము ఈడేరింది అని మురిసిపోయింది. మెల్లి మెల్లిగా తన మనసులోని కోరికలు దశరథుని తో వెల్లడించసాగింది.
“ఓ దశరథ మహారాజా! మీరు ఎంతో ఒట్టు పెట్టుకొన్నారు. కనుక నా కోరికలు మీరు తీరుస్తారు అని నమ్మకం కుదిరింది. అదీ కాకుండా మీరు చేసిన ప్రతిజ్ఞలను అగ్నిదేవునితో సహా దేవతలందరూ సాక్షీభూతంగా విన్నారు. వారే కాదు సూర్య చంద్రులు, ఆకాశము, గ్రహములు, రాత్రింపగళ్లు, భూమి, గంధర్వులు, రాక్షసులు, నిశా చరులు, సమస్త గృహదేవతలు, ఇంకా ఇతరములైన భూతజాతులు అన్నీ వింటున్నారు. ఓ పంచభూతములారా! సకల దేవతలారా! వినండి. నాకు, నా భర్త దశరథమహారాజుగారు, పూర్వముదేవాసుర యుద్ధములలో నాకు ఇస్తాను అని వాగ్దానము చేసిన రెండు వరములు ఇచ్చుటకు అంగీకరించారు. దానికి మీరే సాక్షులు.” అని పలికి కైక దశరథుని వచన బద్ధుని చేసింది. కైక ఏమి అడిగితే దానిని ఇవ్వడం తప్ప దశరథునికి మరోగత్యంతరం లేదు అన్న పరిస్థితులు కల్పించింది. కైకమీది మోహంతో దశరథుడు ఆమె అన్న మాటలకు అన్నిటికీ మరోమాట మాట్లాడకుండా తలూపుతున్నాడు.
“ఓ దశరథ మహారాజా! ఒక్కసారి మీరు నేను పాల్గొన్న దేవాసుర యుద్ధము జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అప్పుడు ఏం జరిగిందో మీకు జ్ఞాపకం ఉంది కదా! ఆ యుద్ధములో మీరు ఓడిపోయే పరిస్తితి వచ్చింది. మీ రథ, గజ, తురగ, పదాతి బలములు అన్నీ నశించి పోయాయి. అప్పుడు నేను మిమ్ములను రెండు సార్లు ప్రాణాపాయము నుండి రక్షించాను. అప్పుడు మీరు నాకు రెండు వరములు ఇస్తాను అని వాగ్దానము చేసారు. మీకు గుర్తు ఉంది కదా! కాని నేను అప్పుడు ఆ వరములు కోరలేదు. నాకు ఇష్టం వచ్చినపుడు కోరుకుంటాను అని అన్నాను. . మీరు సత్యవాక్పరిపాలకులు. ఆడిన మాట తప్పరు. అందుకని ఆ వరములు ఇప్పుడు కోరుకుంటున్నాను. ఆవరములు మీరు నాకు ప్రసాదించాలి. తీరా నేను అడిగిన తరువాత మీరు ఇవ్వను అంటే నాకు ఆత్మహత్యే శరణ్యము అవుతుంది.” అని నేర్పుగా దశరథుని తన మాటల వలలో ఇరికించింది. వలలో పడ్డ లేడిపిల్లలా అయ్యాడు దశరథుడు. కైకేయి కామ పాశములలో ఇరుక్కుపోయాడు. అన్నిటికీ తలూపాడు. “నీవు ఏం కోరితే అది ఇస్తాను. సందేహించకు” అని వాగ్దానం చేసాడు దశరథుడు.
“ఓ దశరథమహారాజా! ఇప్పుడు నా మనసుకు స్వస్థత చేకూరింది. మీరు చేసిన వాగ్దానమును నెరవేరుస్తారు అనే నమ్మకం కుదిరింది. ఆ నాడు మీరు నాకు ఇచ్చిన వరములు కోరుకుంటు న్నాను. సావధాన చిత్తులై వినండి. మీరు రేపు రాముని పట్టాభిషేకమునకు అనేక సంభారములు సమకూర్చారు కదా! ఎన్నో ఏర్పాట్లు చేసారు కదా! నగరమంతా అలంకరింపచేసారు కదా! చాలాసంతోషము. కాని ఒక చిన్న మార్పు. అదే సంభారములతో, అవే ఏర్పాట్లతో, అవే అలంకరణలతో, రేపు రామునికి బదులు నా కుమారుడు భరతునికి యౌవ్వరాజ్య పట్టాభిషేకము జరిపించండి. ఇది నేను కోరుకునే, మీరు నాకు ఇవ్వడానికి అంగీకరించిన మొదటి వరము.” అంది కైక.
దశరథునికి తలతిరిగినట్టయింది. “మరి రాముడు! రాముడు ఏమవుతాడు!” అని అప్రయత్నంగా అన్నాడు దశరథుడు. వెంటనే కైక “రాముడు పదునాలుగు సంవత్సరములు నార చీరలు కట్టుకొని అరణ్యవాసం చెయ్యాలి. అయోధ్యకు దూరంగా ఉండాలి. ఇదే నా రెండవ వరము.” అని పలికింది కైక.
దశరథునికి నోటి మాట రాలేదు. ఒళ్లంతా మొద్దుబారిపోయింది. శరీరం వశం తప్పుతూ ఉంది. ఏమనాలో తోచని స్థితిలో ఉ న్నాడు దశరథుడు. మరలా ఇలా అంది. “నా కుమారుడైన భరతుడు శత్రుభయం లేకుండా రాజ చేయాలి. (అంటే రాముడు భరతునికి శత్రుసమానుడు అని చెప్పకనే చెప్పింది కైక). అందుకే రాముడు ఈ రోజే అరణ్యములకు వెళ్లాలి. రాముడు వనవాసమునకు వెళ్లడం నేను కళ్లారా చూడాలి. ఓ దశరథ మహారాజా! ఓ సత్యవాక్పరిపాలకా! మీరు అన్న మాట నిలబెట్టుకోండి. నా కోరికలు తీర్చండి. ఎందుకంటే సత్యమునే పలకడం, అన్న మాటకు కట్టుబడి ఉండటం ఇక్ష్వాకు వంశ రాజుల ధర్మము. అన్న మాట నిలబెట్టుకుంటే నీకు పరలోకములో సుఖశాంతులు కలుగుతాయి.” అని తేల్చి చెప్పింది కైక. (ఇంక ఈ లోకంలో నీ పని అయిపోయింది అని అప్రయత్నంగా కైక నోటినుండి వెలువడింది.).
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ దశమః సర్గః రామాయణంలోని ముఖ్యమైన అధ్యాయం. ఈ సర్గలో, విశ్వామిత్ర మహర్షి తన యజ్ఞాలను రక్షించడానికి దశరథ మహారాజును కలిసి, రాముడిని సహాయం చేయమని అడుగుతాడు. తొలుత దశరథుడు ససేమిరా అంటాడు, కానీ వసిష్ఠ మహర్షి సలహా మేరకు, రాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్రతో కలిసి యజ్ఞాలను రక్షించడానికి బయలుదేరుతారు.
ఋశ్యశృంగస్యాంగదేశానయనప్రకారః
సుమంత్రశ్చోదితో రాజ్ఞా ప్రోవాచేదం వచస్తదా |
యథర్శ్యశృంగస్త్వానీతః శృణు మే మంత్రిభిః సహ ||
దశరథుడు అడిగిన ప్రశ్నకు సుమంతుడు ఈ విధంగా సమాధానం చెప్పసాగాడు.
“మహారాజా! రోమపాదుని మంత్రులు రోమపాదునితో ఇలా చెప్పారు.
“మహారాజా! ఋష్యశృంగుడు తాను పుట్టినప్పటినుండి తండ్రిని తప్ప వేరే వారిని చూడలేదు. అతడికి స్త్రీ అంటే ఎలా ఉంటుందో స్త్రీ సుఖం ఎలా ఉంటుందో తెలియదు. అందుకని మనము కొంతమంది వేశ్యలను అక్కడికి పంపి వారి హావభావవిలాసములతో ఋష్యశృంగుని ఆకర్షించి మన నగరమునకు రప్పించెదము.” అని అన్నారు. దానికి రోమపాదుడు అంగీకరించాడు. వెంటనే మంత్రులు కొంతమంది వేశ్యలను రావించి వారిగి తగిన విధంగా సూచనలు ఇచ్చి ఋష్యశృంగుని ఆశ్రమము వద్దకు పంపారు.
ఆ వేశ్యలు విభాండకుడు ఆశ్రమములో లేని సమయములో ఋష్యశృంగుని వద్దకు వెళ్లారు. ఋష్యశృంగునికి కనపడేటట్టు అటూ ఇటూ తిరగ సాగారు. ఋష్యశృంగునికి వారు వింతగా కనపడ్డారు. ఎందుకంటే అతడు అప్పటిదాకా ఆడవాళ్లను చూడలేదు. వారు ఋష్యశృంగుని ముందు తమ ఆటపాటలు ప్రదర్శిస్తున్నారు. అతడు వారి వద్దకు వెళ్లాడు. ఆ వేశ్యలు ఋష్యశృంగునితో ఇలా అన్నారు.
“ఓ బ్రాహ్మణోత్తమా! మీరు ఎవరు? ఇక్కడు ఏమి చేస్తున్నారు.” అని అడిగారు.
“నేను విభాండకుని పుత్రుడను. నాపేరు ఋష్యశృంగుడు. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మీరు ఎవరు. ఇలా ఎందుకు ఉన్నారు.” అని అన్నాడు. వారిని తన ఆశ్రమమునకు తీసుకొని వెళ్లాడు. వారికి మగవారికి ఇచ్చినట్టు అర్ఘ్యము పాద్యము సమర్పించాడు. కాని ఆ వేశ్యలకు లోపల భయంగానే ఉంది. అతని తండ్రి విభాండకుడు వచ్చి తమని చూచి ఎక్కడ శపిస్తాడేమో అని భయపడుతున్నారు. అందుకని వడి వడిగా అక్కడి నుండి వెళ్లాలి అనుకున్నారు. ఆ వేశ్యలు తమ వెంట తెచ్చిన మధురము లైన భక్ష్యములను ఋష్యశృంగునికి ఇచ్చారు.
“ ఓ బ్రాహ్మణోత్తమా! ఇవి మధుర ఫలములు. ఆరగింపుడు.” అని అన్నారు. అతను వాటిని తింటుంటే వారు అతనిని కౌగలించుకొన్నారు. ఋష్యశృంగుడు అటువంటి అనుభూతిని ఎప్పుడూ పొందలేదు. వారు ఇచ్చిన ఆ భక్ష్యములను మధుర ఫలములు అనుకొన్నాడు. కడుపారా తిన్నాడు. తరువాత ఆ వేశ్యలు వెళ్లిపోయారు.
వారు వెళ్లి పోయిన తరువాత ఋశ్యశృంగునికి మనసు వికలమయింది. వారినే తలచు కుంటూ, వారి స్పర్శసుఖమును మరలా మరలా మానసికంగా అనుభవిస్తూ కాలం గడిపాడు.
మరునాడు ఋష్యశృంగునికి మనసు నిలువ లేదు. ఆ వేశ్యలను మరలా కలుసు కోడానికి వారు నిన్న కలిసిన చోటుకు వెళ్లి నిలబడ్డాడు. వేశ్యలు కూడా మరునాడు ఋష్యశృంగుని కొరకు ఆక్కడకు వెళ్లారు. అతనితో ఇలా అన్నారు.
“ఓ బ్రాహ్మణోత్తమా! నిన్న మేము నీ ఆశ్రమమునకు వచ్చినాము కదా. ఈరోజు నీవు మా ఆశ్రమమునకు వచ్చి మా ఆతిధ్యము స్వీకరించ వలెను. నిన్న మీకు ఇచ్చిన ఫలములు నేడు కూడా సమృద్ధిగా ఇచ్చెదము. వాటిని తమరు తనివిదీరా ఆరగింప వచ్చును” అని అన్నారు.
ఋష్యశృంగుడు సరే అని వారి వెంట వెళ్లాడు. ఆ వేశ్యలు ఋష్యశృంగుని అలా అలా ముద్దు చేస్తూ మురిపిస్తూ, అంగదేశమునకు తీసుకొని వెళ్లారు. ఋష్యశృంగుడు అంగదేశములో ప్రవేశించగానే గా వానలు కురిసాయి. పంటలు పండాయి. కరువుకాటకాలు తీరిపోయాయి.
రోమపాదుడు ఋష్యశృంగుని సాదరంగా రాజభవనమునకు ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యములు ఇచ్చిసత్కరించాడు. “మహాత్మా! తమరి రాకచే మా అంగరాజ్యము పావనము అయింది. మా కరువు కాటకాలు తొలగిపోయాయి. తమరి తండ్రిగారు నా మీద కోపించకుండా నన్ను అనుగ్రహించండి. నాకుమార్తె శాంతను వివాహమాడండి. ” అని ప్రార్థించాడు.
ఋష్యశృంగుడు అలాగే అన్నాడు. రోమపాదుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం వైభవంగా జరిపించాడు. తరువాత ఋష్యశృంగుడు భార్య శాంతతో కొంత కాలం పాటు అంగరాజ్యములోనే ఉన్నాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండములో నవమ సర్గము ఒక ముఖ్యమైన భాగము. దశరథ రాజు మంత్రిగా ఉన్న సుమంత్రుడు, ఋషిశృంగ మహర్షి యొక్క ముఖ్యతనను వివరించాడు. ఆ మహర్షిని ఆలోచించిన వైదిక కర్మకు అధ్యక్షత వహించడానికి రాజుని ఆహ్వానించాడు. రాజు వేడుకున్నాడు, ఆ మహర్షి ఏ రాజ్యంలో ప్రవేశించడం మరియు ఆ దేశానికి ప్రజలకు శుభదాయకంగా ఉండడం సంబంధించింది.
ఇదంతా జాగ్రత్తగా గమనిస్తున్న సుమంతుడు ఏకాంతంగా దశరథునితో ఇలా అన్నాడు.
“మహారాజా! ఋత్విక్కులు చెప్పిన మాటలు నేను విన్నాను. తమరికి సంతానము కలిగే విషయం గురించి పూర్వము సనత్కుమారుడు ఇతర ఋషులతో చెప్పగా నేను విన్నాను. అదేమిటంటే…..
కశ్యపునకు విభాండకుడు అనే కుమారుడు ఉన్నాడు. విభాండకుని కుమారుడు ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడికి తన తండ్రి, తాను ఉన్న అరణ్యము తప్ప వేరు ప్రపంచము తెలియదు. అతను లోక ప్రసిద్ధము లైన రెండు రకముల బ్రహ్మచర్యములను అవలంబించిన వాడు.
ఆ సమయంలో అంగదేశమును రోమపాదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు అమితమైన బలపరాక్రమములు కలవాడు. అతడు ఎప్పుడూ ధర్మము తప్పి నడుస్తూ ఉంటాడు. ఆ రాజు అధర్మ వర్తన ఫలితంగా ఆయన దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. రోమపాదుడు తన రాజ్యంలో వచ్చిన కరువుకు ఎంతో దుఃఖించాడు. వెంటనే తనరాజ్యంలో ఉన్న వృద్ధులైన బ్రాహ్మణులను పిలిపించాడు. “ఓ బ్రాహ్మణులారా! మీకు అన్ని ధర్మములు తెలుసు. ఈ అనావృష్టి పోవడానికి నా అధర్మ ప్రవర్తన వలన కలిగిన పాపము తొలగి పోవడానికి మంచి ఉపాయము చెప్పండి.” అని అడిగాడు.
దానికి ఆ బ్రాహ్మణులు ఇలా పలికారు. “ఓ మహారాజా! నీ పాపము పోవడానికి, ఈ కరువు నివారణకు ఒకటే ఉపాయము కలదు. విభాండకుని కుమారుడు, ఋష్యశృంగుడు అనే ముని కుమారుడు ఉన్నాడు. ఆయనను పిలిచి నీ కుమార్తె శాంత అనే కన్యను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించు. ఈ అనావృష్టి తొలగిపోతుంది. కాని ఆ ఋష్యశృంగుడు ఇక్కడకు రావడమే చాలా కష్టం.” అని అన్నారు.
ఋష్యశృంగుని తన రాజ్యమునకు రప్పించుటకు తగిన ఉ పాయము ఆలోచించాడు రోమపాదుడు. తన మంత్రులను పిలిచి “మీరు వెంటనేపోయి ఋష్యశృంగుని తీసుకొనిరండి.” అని ఆజ్ఞాపిం చాడు. విభాండకునికి భయపడి వారు “మేము వెళ్లము” అని అన్నారు. కాని వారు ఋష్యశృంగుని తీసుకొని వచ్చుటకు ఒక ఉపాయమును చెప్పారు. అది ఏమంటే కొంతమంది వేశ్యలను పంపి స్త్రీసాంగత్యము గురించి తెలియని ఋష్యశృంగునికి స్త్రీ సంగమము రుచి చూపించి, తీసుకొని రావచ్చును అనీ, అప్పుడు శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహము చేసి అతని ఇంటనే ఉంచుకొన వచ్చును అనీ, ఋష్యశృంగుడు ఉన్నచోట సుభిక్షముగా ఉంటుందని తెలియజేసారు.
రోమపాదుడు వారు చెప్పిన ప్రకారము చేసి ఋష్యశృంగుని తన రాజ్యమునకు రప్పించుకొని, తన కుమార్తె శాంతను ఇచ్చి వివాహము చేసాడు. ఓ దశరధమహారాజా! తమరు కూడా ఋష్యశృంగుని తీసుకొని వచ్చి యజ్ఞము జరిపించిన తమకు పుత్రసంతానము కలుగుతుంది అని చెప్పుకుంటుంటే నేను విన్నాను.”అని చెప్పాడు సుమంతుడు. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు.
“సుమంతా! రోమపాదుడు ఋష్యశృంగుని తన రాజ్యమునకు ఎలా తీసుకు రాగలిగాడు. వివరంగా చెప్పు.” అని అడిగాడు దశరథుడు సుమంతుడు ఇలా చెప్పసాగాడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో తొమ్మిదవసర్గ సంపూర్ణము.