ఈ సర్గలో, రాముడు సుమంతుని ద్వారా తన తండ్రి మరణవార్త తెలుసుకుంటాడు. ఆయన విషాదంలో మునిగి తండ్రి, జననీ కౌసల్యా గురించి భావోద్వేగంతో మాట్లాడతాడు. భరతుడు ఆయన్ని తిరిగి రావాలని ప్రార్థించినా, రాముడు తన వాగ్దానాన్ని పాటించాల్సిన కర్తవ్యం ఉందని అంటాడు. రాముడు తన తల్లి కౌసల్యా, సుమిత్రా, కైకేయి లకు దాస్యభక్తితో వీడా వడులు చెప్పి, తన ధర్మాన్ని పరిరక్షించాలని నిర్ణయిస్తాడు. రాముడు, సీత, లక్ష్మణులు తమ వనవాసాన్ని కొనసాగించడానికి దండకారణ్యంలోకి వెళ్లి, పుణ్యాశ్రమాలలో నివసిస్తారు. ఈ సర్గ రాముడి ధర్మబద్ధతను, కుటుంబానుభవాలను, దైవిక కర్తవ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
భరతుడు చెప్పిన తండ్రి మరణ వార్తను వినగానే రాముడు కిందపడి మూర్ఛపోయాడు.
(ఇక్కడ మీకు ఒక సందేహము రావచ్చు. 101వ సర్గలో భరతుడు రామునికి దశరథుని మరణ వార్త చెప్పాడు. “గతః స్వర్గం మహాబాహు: పుత్రశోకాభిపీడిత:” పుత్రశోకంతో స్వర్గస్థుడయ్యూడు అని చెప్పాడు. 101వ సర్గ ఆఖరులో రాముడు “ఏవంకృత్వా మహారాజో విభాగం లోకసన్నిధౌ వ్యాదిశ్య చ మాహాతేజ దివం దశరథో గత:” ఈ విధంగా రాజ్యవిభాగము చేసి దశరథుడు దివంగతుడయ్యాడు అని రాముడు కూడా అన్నాడు. కాని 103 వ సర్గ మొదటి భాగంలో తండ్రి మరణ వార్త విని రాముడు మూర్ఛపోయాడు అని ఉంది. ఈ మూర్ఛపోవడం మొదట భరతుడు తండ్రి మరణ వార్త చెప్పినపుడే జరిగి ఉండాల్సింది. ముందు ముందు ఇలాంటి పరస్పర వ్యతిరేక సన్నివేశాలు వస్తుంటాయి. గమనించండి.) మొదలు నరికిన చెట్టులా కిందపడిపోయిన రాముని చూచి సీత ఏడుస్తూ అతని దగ్గరగా వచ్చింది. రాముని మీద నీళ్లు చల్లి అతనికి సేదతీర్చింది. రాముడు మూర్ఛనుండి తేరుకున్నాడు. దీనంగా కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తున్నాడు. రాముడు తన తండ్రి మరణ వార్త విని భరతునితో ఇలా అన్నాడు.
“భరతా! నా తండ్రే లేనపుడు నాకు అయోధ్యతో ఏమి పని! దశరథుడులేని అయోధ్యను నేను మాత్రము ఎలా పరిపాలింపగలను. నా మీద దు:ఖముతో మరణించిన నా తండ్రికి నేను అంతిమ సంస్కారములు చేయడానికి కూడా నోచుకోలేదు కదా! నేను ఆయనకు చెడ పుట్టాను. నేను పెద్దకొడుకుగా ఉండి ఆయనకు ఏమి చేయగలిగాను. పెద్దకొడుకుగా కనీసం నా విధులను కూడా నేను నిర్వర్తించలేకపోయాను.
ఓ భరతా! శత్రుఘ్నా! మీరు ఇద్దరూ పుణ్యాత్ములు. తండ్రి గారికి అంతిమ సంస్కారములు చేయగలిగారు. భరతా! ఇప్పుడే చెబుతున్నాను. ఇప్పుడే కాదు, ఈ పధ్నాలుగు సంవత్సరముల వనవాసము తరువాత కూడా, దశరథుడు లేని అయోధ్యలో నేను అడుగుపెట్టను. దశరథుడులేని అయోధ్యను ఊహించలేను. ఎందుకంటే, వనవాసానంతరము నేను రాజ్యాధికారము చేపడితే నాకు దిశానిర్దేశము ఎవరు చేస్తారు. నాకు మంచీ చెడూ ఎవరు చెబుతారు. నేను అయోధ్యలో ఉన్నప్పుడు నేను చేసిన మంచి పనులను మెచ్చుకుంటూ తండ్రిగారు నాకు ఎన్నో మంచి మాటలు చెప్పేవారు. ఇప్పుడు నాకు అలా ఎవరు చెబుతారు.” అని శోకిస్తున్నాడు రాముడు.
సీతను చూచి రాముడు ఇలా అన్నాడు. “సీతా! నీకు పితృసమానులు, నీ మామగారు మరణించారు. లక్ష్మణుడు పితృహీనుడయ్యాడు. ఇంక మనకు దిక్కు ఎవ్వరు?’ అని విలపిస్తున్నాడు రాముడు. రాముడు ఇలా ఏడుస్తుంటే మిగిలిన తమ్ముళ్లు కూడా ఏడుస్తున్నారు.
కొంచెం సేపటికి లక్ష్మణుడు తేరుకొని అన్నరాముని చూచి “అన్నయ్యా! మనప్రస్తుత కర్తవ్యము తండ్రి గారికి జలతర్పణములు ఇవ్వాలి.” అని గుర్తుచేసాడు.
పితృసమానుడైన మామగారు పరమపదించారు అన్నవార్త విన్న సీత దు:ఖంతో కుమిలిపోయింది. కళ్లనిండా నీళ్లుకమ్ముకున్నాయి. ఏడుస్తున్న సీతను చూచాడు రాముడు. ఆమెను ఓదార్చాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.
“లక్ష్మణా!మనము తండ్రిగారికి పిండప్రదానముచేయవలెను. నీవుపోయి పిండి, బదరీఫలములు సిద్ధ చేయి.” అని అన్నాడు. ముందు సీత నడుస్తుంటే వెనక లక్ష్మణుడు నడుస్తుంటే రాముడు వారి వెనక మందాకినీ నదీ తీరానికి వెళ్లాడు. వారి వెంట సుమంత్రుడు వెళ్లాడు. అందరూ మందాకినీ నదీ తీరానికి చేరుకున్నారు. సుమంత్రుడు తాను ముందుగా నదిలోకిదిగి, తరువాత రామలక్ష్మణులను, సీతను వారి చేతులుపట్టుకొని నదిలోకి దింపాడు. అందరూ స్నానములు చేసారు. రాముడు దోసిలి నిండా నీళ్లు తీసుకొని దక్షిణము వైపుతిరిగి “ఓ తండ్రీ! నీకు జలమును విడుస్తున్నాము. పితృలోకములో ఉన్న నీకు ఈజలము అక్షయంగా ఉపతిష్ఠమగును గాక!”అని ఆ జలమును నదిలో విడిచి పెట్టాడు.
తరువాత రామలక్ష్మణులు మందాకినీ నది ఒడ్డున దశరథునకు పిండితో పిండప్రదానము చేసారు. నేల మీద దరలు పరిచారు. ఆ దర్భల మీద బదరీఫలములతో కూడిన పిండిని పిండములుగాచేసి పెట్టారు. “ఓ తండ్రీ! మేమే ప్రతిదినమూ తినే ఆహారమునే నీకు పిండములుగా సమర్పించుకుంటున్నాము. స్వీకరించు. ఈ లోకంలో పురుషులు దేనిని తింటారో దానినే పితృలోకంలో ఉన్నపితృదేవతలు కూడా తింటారుకదా!” అని పలికాడు రాముడు.
పిండప్రదాన కార్యక్రమము ముగిసినతరువాత అందరూ పర్ణశాలకు చేరుకున్నారు. తరువాత కూడా అన్నదమ్ములు తండ్రిమరణానికి బాధపడుతూనే ఉన్నారు. అన్నదమ్ములు చేస్తున్న రోదన ధ్వనులు దూరంగా ఉన్న సైనికులకు వినబడ్డాయి. ‘భరతుడు రాముని చేరుకున్నాడు, అందరూ దశరథుని మరణానికి దు:ఖిస్తున్నారు’ అని వారు తెలుసుకున్నారు. వారంతా ఎప్పుడెప్పుడు రాముని చూద్దామా అని ఆతురతగా ఉన్నారు. అందరూ రాముని పర్ణశాల వైపుకు ప్రయాణం అయ్యారు.
అందరూ రాముని పర్ణశాలకు చేరుకున్నారు. పర్ణశాల ముందు నేలమీదకూర్చొని ఉన్న రాముని చూచారు. రామునికి ఆ గతి పట్టించిన కైకను, మంధరను నోటికొచ్చినట్టు తిడుతూ ఏడుస్తున్నారు. ఆ పరిస్థితిలో ఉన్న రాముని చూచి వారికి కన్నీళ్లు ఆగలేదు. రాముడు అందరినీ చూచాడు. పురుషులను, స్త్రీలను తన కన్న తల్లి తండ్రులవలె కౌగలించుకొని వారి ఓదార్పువచనములను విన్నాడు. కొంతమంది రామునికి నమస్కరించారు. కొంత మంది రాముని పరామర్శించారు. రాముడు అందరినీ వారి వారి అర్హతలను బట్టి గౌరవించాడు.
ఈ సర్గలో భరతుడు, రాముడి వనవాసాన్ని ముగించి ఆయోధ్యకు తిరిగి రమ్మని వేడుకుంటాడు. రాముడు తన వాగ్దానాన్ని గుర్తుచేసి, వనవాసం పూర్తయ్యే వరకు తిరిగి రాలేనని చెబుతాడు. భరతుడు నిరాశచెందినప్పటికీ, రాముడి పాదుకలను తీసుకుని తిరిగి ఆయోధ్యకు వెళ్ళి, అవి రాజాసనంపై ఉంచి రాముడి తరపున రాజ్యాన్ని పరిపాలిస్తాడు. భరతుడు రాముడి పాదుకలను ప్రతినిధిగా భావించి, ధర్మబద్ధంగా పాలన చేస్తాడు. ఈ సర్గ భరతుడి వినయం, రాముడి నిబద్ధత, సోదరుల మధ్య ఉన్న బంధాన్ని ప్రతిబింబిస్తుంది.
రాముని మాటలు శ్రద్ధగా విన్నాడు భరతుడు. తిరిగి రామునితో ఇలా అన్నాడు. “రామా! నేను ధర్మహీనుడను. నాకు రాజధర్మము గురించి ఏమితెలుసు. నాకు తెలిసిందల్లా ఒకటే. అది మన కులధర్మము. మనవంశాచారము. ఇక్ష్వాకు వంశములో ఇంతవరకూ పెద్దవాడే రాజ్యభారము వహించాడు. పెద్దవాడు ఉండగా చిన్నవాడు రాజు కాలేదు. కాకూడదు. ఇప్పుడు నీవు మన వంశములో పెద్దవాడవు. నేను నీ కన్నా చిన్నవాడను. కాబట్టి నీవు రాజ్యాభిషిక్తుడవు కమ్ము. అదే నాకోరిక.
రామా! మామూలు ప్రజల దృష్టిలో రాజుకూడా ఒక సాధారణమానవుడే. కానీ, రాజు అంటే సాక్షాత్తు విష్ణుస్వరూపుడు. రాజుకాదగ్గ లక్షణాలే నీకే ఉన్నాయి. నాలో ఎంత మాత్రమూ లేవు. కాబట్టి అయోధ్యకు రాజుకాదగ్గ వాడవు నీవే. ఇంక అసలు విషయానికి వద్దాము. నేను కేకయ దేశములో ఉండగా. నీవు అరణ్యములకు వెళ్లగా, మన తండ్రిగారు దశరథమహారాజుగారు స్వర్గస్థులయ్యారు. నేను శత్రుఘ్నుడు కలిసి తండ్రి గారికి అంత్యక్రియలు చేసాము. ఇప్పుడు నీవు తండ్రిగారికి జలతర్పణములు విడువ వలెను. తండ్రిగారికి జ్యేష్టుడవు, ప్రియపుత్రుడవు నీవు. కాబట్టి నీవు విడిచే జలతర్పణములు మన తండ్రిగారికి అత్యంత ప్రియమైనవి.
ఎందుకంటే నేను విన్నదాని ప్రకారము దశరథుడు తన అవసాన కాలములో నిన్నే తలచుకుంటూ, నీమీద దిగులు చేత మరణించాడు. కాబట్టి నీవు జలతర్పణములు విడిస్తేగాని తండ్రిగారి ఆత్మశాంతించదు.” అనిఅన్నాడు భరతుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ త్రింశః సర్గః (30వ సర్గ) రామాయణంలో ఒక కీలక ఘట్టం. ఈ సర్గలో, రాముడు సువర్ణమృగాన్ని వెంబడించి, దాన్ని వేటాడిన తర్వాత, మృగం రూపంలో ఉన్న మారీచుడు తన అసలు రూపంలోకి మారి “హా సీత! హా లక్ష్మణ!” అని కేకలు వేస్తాడు. ఆ కేకలు విని సీత భయంతో లక్ష్మణుని రక్షణ కోసం రమ్మని వేడుకుంటుంది.
రాముడు ఖరుని గదను తుత్తునియలు చేయగానే ఖరుడు నివ్వెరపోయాడు. రాముడు ఖరుడు అప్పటిదాకా మాట్లాడిన మాటలకు ప్రత్యుత్తరము ఇచ్చాడు.
“ఓ రాక్షసాధమా! నీ బలం ఎంతో తేలిపోయింది కదా! వృధాగా అరుస్తావు ఎందుకు. ఏ గదాఘాతముతో నన్ను చంపుదామనుకున్నావో ఆ గద నా బాణఘాతముతో విరిగి ముక్కలై నేలమీద పడిపోయింది. మరి ఇప్పుడు నీవు పోయి మరణించిన నీ సైనికుల బంధుమిత్రుల కన్నీళ్లు ఎలా తుడుస్తావు. నీ మాటలు వమ్ము అయినట్లే కదా!
దుష్టుడు, దుర్మార్గుడు అయిన నిన్ను చంపడానికి నాకు కారణం ఉంది. నీవు చంపదగ్గవాడవు. అందుకే నిన్ను చంపుతున్నాను. నీ కంఠమును తెగనరుకుతాను. నీ నెత్తురుతో భూమాతను తడుపుతాను. నీకు భూపతనము తప్పదు. నిన్ను చంపి ఈ దండకారణ్యమును శత్రుపీడ, రాక్షస పీడ లేకుండా చేస్తాను.
ఇప్పటి దాకా ఈ దండకారణ్యములో నిత్యము బ్రాహ్మణులను, మునులను నీవు నీ పరివారము బాధిస్తున్నారు, చంపుతున్నారు. ఈ రోజు నుంచి ఈ దండకారణ్యములో ఋషులు, మునులు, బ్రాహ్మణులు నిర్భయంగా తపస్సు చేసుకొనేలా చేస్తాను. ఎంతోమంది ఋషులకు, మునులకు ఈ దండకారణ్యము ఆశ్రయము కాగలదు. ఇప్పటి దాకా ఋషులను, మునులను భయపెడుతూ, వారి యజ్ఞయాగములను నాశనం చేస్తూ, వారిని చంపుతున్న రాక్షస స్త్రీలు ఇంక ఈ దండకారణ్యము విడిచిపోకతప్పదు. నీ భార్యలందరూ నీ శవం మీద పడి ఏడ్చేరోజు వచ్చింది.” అని నిర్భయంగా మాట్లాడుతున్న రాముని చూచి ఖరుడు రాముడి బెదిరించడానికి పూనుకున్నాడు.
“ఓ రామా! నీవు అవివేకివే అనుకున్నాను. గర్విష్టివి కూడా. నీకు మహా గర్వము ఉంది. అవసాన దశలో మానవులకు ఇలాంటి గర్వమే ఉంటుంది. చచ్చేముందు సంధిప్రేలాపన లాగా నీవు కూడా ఏదేదో మాట్లాడుతున్నావు.” అంటూ ఖరుడు తగిన ఆయుధము కొరకు చుట్టూ చూచాడు. దగ్గరలోనే ఉన్న ఒక సాలవృక్షమును కూకటి వేళ్లతో పెకలించాడు. దానిని ఆయుధంగా ధరించి, “రామా! ఈ దెబ్బతో నువ్వు చచ్చావురా!” అంటూ ఆ చెట్టును బలంగా రాముని మీదికి విసిరాడు.
రాముడు తన మీదికి అత్యంత వేగంతో దూసుకువస్తున్న సాలవృక్షమును తన వాడి అయిన బాణములతో రెండుగా ఖండించాడు. వెంటనే రాముడు వేయి బాణములను ఒకదాని వెంట ఒకటిగా సంధించి ఖరుని శరీరం అంతా తూట్లు పడేట్టు కొట్టాడు. ఖరుని శరీరం నుండి రక్తం జలపాతంలాగా బయటకు ఉరికింది. తన శరీరం అంతా నెత్తురు కారుతుండగా ఖరుడు రాముని మీదికి పరుగెత్తాడు. రాముడు ఆగ్నేయాస్త్రమును సంధించాడు. ఖరుని గుండెలకు గురిపెట్టి కొట్టాడు. ఆ అస్త్రము ఖరుని గుండెలను చీల్చింది. ఖరుడు మొదలు నరికిన చెట్టులాగా కిందపడ్డాడు. ఖరుని ప్రాణవాయువులు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. దండకారణ్యమునకు శాశ్వతంగా రాక్షస పీడ విరగడ అయింది.
ఆ దృశ్యమును చూచిన దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు రాముని ఎంతో ప్రశంసించారు. అప్పుడు దేవతలు అసలు విషయాన్ని తమలో తాము చెప్పుకున్నారు. “దేవేంద్రుడు శరభంగాశ్రమమునకు ఇందుకే వెళ్లాడట. ఈ ఖరుని దూషణుని సంహరించడానికే ఆ మునులు రాముని ఈ ప్రాంతమునకు తీసుకొని వచ్చారట. ఇంక దండకారణ్యములో ఋషులు, మునులు, బ్రాహ్మణులు సుఖంగా జీవించగలరు.” అని అనుకొన్నారు. అంతట దేవతలు దేవ దుందుభులు మ్రోగించారు. రాముని మీద పుష్పవర్షము కురిపించారు.
రాముడికి, ఖరునికి, దూషణునికి, 14,000 మంది రాక్షసులకు జరిగిన యుద్ధము దాదాపు ఒకటిన్నర ముహూర్తకాలము జరిగింది. (ముహూర్తము అనగా 48 నిమిషములు. అనగా ఒక గంటా పన్నెండు నిమిషముల పాటు జరిగింది.) రాముని వీర్యమును పరాక్రమమును యుద్ధకౌశలమును తలుచుకుంటూ దేవతలు తమ తమ నివాసములకు వెళ్లారు.
రామునికి రాక్షసులకు మధ్యయుద్ధము ముగిసింది అని తెలుసుకొన్న లక్ష్మణుడు సీతతో సహా గుహ నుండి వెలుపలికి వచ్చాడు. రాముని తో వచ్చిన మునులు ఋషులు రాముని అభినందిస్తూ ఉండగా రాముడు సీతా సమేతంగా పర్ణశాలలో ప్రవేశించాడు.
పర్ణశాలలోకి రాగానే సీత తన భర్త రాముని అభినందన పూర్వకంగా కౌగలించుకుంది. తరువాత సీతారాములు బయటకు వచ్చారు. యుద్ధములో చనిపోయిన రాక్షసులను చూచింది సీత. రామునికి ఏ అపాయము కలగనందుకు ఎంతో ఆనందపడింది.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకోనత్రింశః సర్గః (29వ సర్గ) రామాయణంలో ఒక కీలక ఘట్టం. ఈ సర్గలో, రావణుడు మారీచుడిని సీతను అపహరించడానికి సహాయం చేయమని కోరుతాడు. మొదట మారీచుడు, రాముడి శక్తి గురించి తెలుసు కావున, ఈ పని చేయవద్దని రావణుడిని హెచ్చరిస్తాడు. కానీ, రావణుడు అతన్ని బలవంతం చేసి, రాముడు మరియు లక్ష్మణులను వలలో పడేసే పథకాన్ని తయారు చేస్తాడు.
ఒంటరిగా గద ధరించి తన మీదికి వస్తున్న ఖరుని చూచి రాముడు ఇలా అన్నాడు. “ఓ రాక్షసాధమా! నీవు సామాన్యుడివి కావు. చతురంగ బలములు కలిగిన 14,000 మంది సేనలకు అధిపతివి. కాని సాధు జనులు అసహ్యించుకొనే ఎన్నో అకృత్యాలు చేసావు. నీవలన సాధు జనులకు ప్రాణ భయం కలిగింది. ఎల్లప్పుడూ పాపకృత్యములు చేసే నీ వంటి పాపాత్ముడు ఎల్లకాలము జీవించలేడు. అతని పాపములే అతనిని నాశనం చేస్తాయి. అసలు నిన్ను ఆ జనులే చంపాల్సింది. కానీ వారి బదులుగా నేను నిన్ను చంపుతున్నాను. కాని నీవు చేస్తున్నది తప్పు, పాపము అని నీకు తెలియదు. అందుకే ఇన్ని పాపపు పనులు చేసావు. చేసిన పాపములకు ఫలితము అనుభవిస్తున్నావు.
ఈ దండకారణ్యములో ఎంతో మంది ఋషులు, మునులు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నారు. వారు నీకు ఏమి అపకారము చేసారని వారిని అనేక బాధలు పెట్టావు. అడ్డం వచ్చిన వారిని చంపావు. నీకు ధనబలము, అంగ బలమ, సైనిక బలము ఉంది కదా అని విర్రవీగావు. కాని సాధుజనుల ఆగ్రహము ముందు నీ బలము నిలువలేదు. అందుకే పతనమయ్యావు.
నీవే కాదు ఈ సృష్టిలో ప్రతి ప్రాణి కూడా తాను చేసిన పాపపు పనులకు ఫలితమును అనుభవింపక తప్పదు. విషం కలిపిన అన్నం తింటే వెంటనే ఎలా మరణం సంభవిస్తుందో, పాపపు పనులుచేస్తే, ఆ పాపఫలము కూడా వెంటనే కట్టికుడుపుతుంది. దుష్ట శిక్షణ కొరకు ఈ దండకారణ్యములో ఉన్న ఋషులు, మునులు నన్ను ఆశ్రయించారు. అందుకే నేను దుష్టుడవైన నిన్ను చంపుతున్నాను. ఓ ఖరుడా! ఇప్పటిదాకా నీవు నీ అనుచరులు ఈ దండకారణ్యములో ఉన్న మునులను, ఋషులను ఎలా యమపురికి పంపారో, అలాగే నీవు కూడా నీ అనుచరులను అనుసరించి యమపురికి వెళుతున్నావు. నీవు చంపిన మునులందరూ స్వర్గ ద్వారముల వద్ద నిలబడి, నువ్వు నరకానికి పోవడం కళ్లారా చూస్తారు. ఓ దురాత్ముడా! కాచుకో! ఒకే ఒక్క బాణంతో నీ తల తాటి పండు మాదిరి నేల మీద దొర్లుతుంది.” అని తన ధనుస్సు ఎక్కుపెట్టాడు రాముడు.
రాముని సూటి పోటీ మాటలు విన్న ఖరుడు అవమాన భారంతో కోపంతో రగిలిపోయాడు. “ఓ రామా! ఇదేంటి! నిన్ను నువ్వే పొగుడుకుంటున్నావు. నా సైన్యము నశించినా నేను ఇంకా బతికే ఉన్నాను. అప్పుడే నన్ను గెల్చానని గర్వపడుతున్నావు. నిన్ను నీవే అభినందించుకుంటున్నావు.
నీకు తెలుసో లేదో పరాక్రమ వంతులు, వీరులు తమ విజయాన్ని తాము ఎప్పుడూ చెప్పుకోరు. ఇతరులు చెబితే ఆనందిస్తారు. వినయము వివేకము లేని నీ వంటి క్షత్రియాధములు మాత్రమే తమను తాము అభినందించుకుంటారు. అదే పని నీవు చేస్తున్నావు. నిన్ను నీవే పొగుడుకుంటున్నావు.
రామా! నీకు మృత్యువు ఆసన్నమయింది. ముందు అది తెలుసుకో. నిన్ను అభినందించుకోడం మానుకో! లేకపోతే కాలిన దర్భలాగా మసి అయిపోతావు. నీ ఎదుట పాశమును చేత ధరించిన కాల యముడి వలె గదాయుధమును ధరించి కదులుతున్న పర్వతము మాదిరి నిలబడ్డ నన్ను చూస్తున్నావు కదా! జీవులు యముని కాలపాశమునకు బలి అయినట్టు నువ్వు నా గదాయుధమునకు బలి అవుతావు.
ఓ రామా! ఇంకా నీ గురించి ఎంతో చెప్పాలి. కానీ సూర్యాస్తమయము కాబోతోంది. సూర్యాస్తమయం తర్వాత యుద్ధం చేయకూడదని నియమం ఉంది కదా! అందుకని చెప్పడం లేదు. నీవు నా సేనలను 14,000 మందిని మట్టుబెట్టావు. ఈ రోజు నేను నిన్ను చంపి వాళ్ల బంధు మిత్రుల కన్నీళ్లు తుడుస్తాను.”
ఇలా మాట్లాడిన ఖరుడు తన గదను రాముని మీదికి విసిరాడు. రాముడు ఒకే ఒక బాణంతో ఆ గదను ముక్కలు చేసాడు. ఆ ముక్కలు ఉల్కాపాతముల వలె నేలమీద పడ్డాయి.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ అష్టావింశః సర్గ (28వ సర్గ) రామాయణంలో ఒక కీలక ఘట్టం. ఈ సర్గలో, శూర్పణఖా రాముడు మరియు లక్ష్మణుని చేత అవమానింపబడిన తర్వాత తన అన్న రావణుడిని కలుస్తుంది. ఆమె రాముడు, సీత మరియు లక్ష్మణుల గురించి వివరించి, తనపై జరిగిన దాడిని చెప్పుతుంది. సీత యొక్క అపూర్వ సౌందర్యాన్ని వర్ణిస్తూ, ఆమెను కిడ్నాప్ చేయమని పెల్లుబికుతుంది.
రాముని మీదికి పోతున్నాడే కానీ ఖరునికి లోలోపల భయంగానే ఉంది. ఎందుకంటే అప్పటికే రాముడు మహా వీరులు, అసమాన బలవంతులు అయిన దూషణుని, త్రిశిరుని సంహరించాడు. ఇంక తన వంతు వచ్చింది అనుకున్నాడు. పైగా సైన్యము అంతా నశించి పోయింది. కొద్దిమంది మాత్రమే మిగిలి ఉన్నారు. ఆ కొద్దిమందితో రాముని ఎదుర్కోగలనా అని సందేహిస్తున్నాడు. కానీ ధైర్యంగా ముందుకు దూకాడు.
ఖరుడు రాముని మీద నారాచములను (ఇనుప ములికలు అమర్చిన బాణములను) ప్రయోగించాడు. ఖరుడు ఒక చోట ఉండకుండా రణభూమి అంతా కలయ తిరుగుతూ, బాణప్రయోగం చేస్తున్నాడు. రాముని కదలనీయకుండా నాలుగు దిక్కులను తన బాణములతో కప్పివేసాడు.
రాముడు తన ధనుస్సు ఎక్కుపెట్టాడు. ఖరుడు సంధించిన బాణములను ఛిన్నాభిన్నం చేసాడు రాముడు. తన బాణములతో ఆకాశం అంతా నింపాడు రాముడు. సూర్యుడు కూడా కనపడటం లేదు. రాముడు ఖరుడు ఒకరితో ఒకరు భీకరంగా పోరాడుతున్నారు. ఖరుడు రాముని మీద నారాచములు, నాళీకములు, వికర్ణికలు మొదలగు బాణపరంపరలు ప్రయోగించాడు. ఆ సమయంలో రథము మీద ఉన్న ఖరుడు యమధర్మరాజు మాదిరి కనిపించాడు.
అప్పటికే యుద్ధము చేసి పదునాలుగువేలమంది రాక్షసులను చంపిన రాముడు బాగా అలసిపోయి ఉంటాడు అని అనుకొన్నాడు. ఖరుడు. కాని రామునిముఖంలో అలసట ఏమాత్రం కనిపించడం లేదు. పైగా రాముడు ఖరుని చంపడానికి అవకాశము కొరకు ఎదురు చూస్తున్నాడు అని ఖరునికి తెలియదు.
ఖరుడు రాముని ధనుస్సును సగ భాగంలో విరగగొట్టాడు. మరొక బాణంతో రాముని కవచమును విరిచాడు. రాముని కవచము విరిగి నేలమీద పడింది. అదే అవకాశముగా, ఖరుడు రాముని శరీరం అంతా బాణములతో కొట్టాడు. విజయోత్సాహంతో పెద్దగా అరిచాడు. రాముడు వెంటనే తనకు అగస్త్యమహాముని ఇచ్చిన వైష్ణవ ధనుస్సుకు నారి బిగించి సంధించాడు. ముందు ఖరుని ధ్వజమును కూల్చాడు. అది చూచిన ఖరుడు కోపించి రాముని మర్మస్థానముల మీద నాలుగు తీవ్రమైన బాణములు ప్రయోగించాడు. ఆ బాణములు రాముని శరీరమునకు తగిలి రాముని శరీరం అంతా రక్తంతో తడిసి ముద్ద అయింది.
రాముని కోపము కట్టలు తెంచుకుంది. ఒక బాణముతో ఖరుని శిరస్సును, రెండు బాణములతో ఖరుని రెండు చేతులను, మూడు అర్థచంద్రాకారపు బాణములతో ఖరుని వక్షస్థలమును కొట్టాడు. ఎలాగైనా ఖరుని చంపాలని నిశ్చయించుకొన్న రాముడు ఖరుని మీద తీవ్రమైన 13 నారాచములను ప్రయోగించాడు. అందులో ఒక బాణముతో ఖరుని రథము యొక్క నొగలను, నాలుగు బాణములతో నాలుగు గుర్రాలను, ఒక బాణముతో రథ సారథిని, మూడు బాణములతో రధం ముందు భాగమును, రెండు బాణములతో ఖరుని రథము ఇరుసులను, ఒక బాణముతో ఖరుని కంఠమును కొట్టాడు. ఇలా 13 బాణములతో ఖరుని ఆపాదమస్తకము కొట్టాడు రాముడు.
ఖరునికి రథము విరిగిపోయింది. సారథి చచ్చాడు. రథానికి కట్టిన గుర్రాలు నేలకూలాయి. విల్లు విరిగిపోయింది. చేసేది లేక ఖరుడు తన గదను తీసుకొని నేలమీదికి దూకాడు. ఖరుని ఆ విధంగా కొట్టినందుకు ఆకాశంలలో నిలబడి చూస్తున్న దేవతాసమూహములు రాముని అభినందించారు.
“అయోధ్యకాండ సర్గ 101″ రామాయణం లో ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, రాముడు కైకేయి మాట మేరకు తన తండ్రి దశరథుని ఆజ్ఞను పాటించి అరణ్యవాసం కోసం సిద్ధమవుతాడు. లక్ష్మణుడు మరియు సీతా ఆయనతో పాటు రావడానికి నిర్ణయించుకుంటారు. ఈ సమయంలో, అయోధ్య నగరం దుఃఖంలో మునిగిపోతుంది. ప్రజలు రాముడు వెళ్లిపోతుండడాన్ని చూడలేక బాధపడతారు. రాముడు తన తల్లి కౌసల్య, సుమిత్రా, మరియు ఇతర పెద్దలను వీడిపోతాడు. ఆ తరువాత, రథం పై అరణ్యవాసం వైపు పయనమవుతాడు. ఈ సర్గలో రాముడి ధర్మనిష్ట, పితృవాక్యపారిపాలనం, మరియు కుటుంబ పట్ల అతని ప్రేమ స్పష్టంగా కనిపిస్తాయి.
భరతుని రాజ్యమునకు సంబంధించిన విషయములు అన్నీ తెలుసుకున్న తరువాత, రాముడు మరలా అసలు విషయానికి వచ్చాడు. “భరతా! ఇంతకూ నీవు ఈ ముని వేషము ఎందుకు ధరించావు. ఈ అడవులకు ఎందుకు వచ్చావు. దశరథుల వారు నిన్ను అయోధ్యకు రాజ్యాభిషిక్తుని చేసారు కదా. హాయిగా రాజ్యపాలన చేయక, ఈ వనవాసము ఎందుకయ్యా నీకు?” అని అడిగాడు.
దానికి భరతుడు రామునికి ఇలా సమాధానము చెప్పాడు. “రామా! నీకు ఒక అప్రియమైన విషయము చెప్పాలి. నీవు నాకు రాజ్యమును వదిలి అడవులకు రాగానే ఆ దుఃఖము తట్టుకోలేక మన తండ్రి దశరథుడు స్వర్గస్థుడయ్యాడు. అప్పుడు నేను కూడా దగ్గర లేను. నా తల్లి ప్రేరణతో ఈ మహాపాపము చేసాడు మన తండ్రి దశరథుడు. కాని నా తల్లికి ఫలితము దక్కలేదు. ఇటు రాజ్యమూ లేదు. సరికదా.. అటు వైధవ్యము మాత్రము ప్రాప్తించింది. నీవు ఉండగా నేను రాజ్యాభిషిక్తుడను అవడం సాధ్యం కాదు. నీవు మాట ఇచ్చిన తండ్రి ఇప్పుడు లేడు. ఆ మాటకు ఇపుడు విలువ లేదు. కాబట్టి నీవు వనవాసము విడిచి అయోధ్యకు వచ్చి, రాజ్యపాలన చేయుము. అదే నేను కోరేది. మన తల్లులు మువ్వురూ ఇదే మాట మీద ఉన్నారు. నిన్ను మరలా అయోధ్య తీసుకుపోవడానికి వారందరూ వచ్చారు.
రామా! మనవంశాచారము నీకు తెలుసు. మన వంశములో పెద్దవాడికే రాజ్యాభిషేకము జరుగుతుంది. ఇది అనువంశికంగా వస్తున్న ఆచారము. కాబట్టి నీవు రాజ్యాభిషిక్తుడివి కావడం ధర్మమే కాని అధర్మము కాదు. నీ రాక కొరకు అయోధ్య ఎదురుచూస్తూ ఉంది. నేను, శత్రుఘ్నుడు, మన మంత్రులు అందరూ శిరస్సువంచి నీకు నమస్కారము చేస్తున్నాము. మామాట మన్నించు. వంశాచారమును మన్నించు. పెద్దల ఆచారములను గౌరవించు.” అనిచెప్పి చేతులు కట్టుకొని నిలబడ్డాడు భరతుడు.
రాముడు భరతుని కౌగలించుకొని అనునయించాడు. “ఓ భరతా! కులీనుడు, సత్త్వసంపన్నుడు, తేజస్వి, ధృడనిశ్చయము కలవాడు ఎవరైనా తుచ్ఛమైన రాజ్యము కోసరం మాట తప్పుతాడా! నేనూ అంతే. భరతా! నీవు చిన్నవాడవు. నీవు అనవసరంగా నీ తల్లిని దూషిస్తున్నావు. తప్పు. నీ మీద ఉన్న ప్రేమతో అలా చేసింది కానీ వేరుకాదు.
పెద్దలకు భార్యను, పుత్రులను, శాసించే అధికారము ఉంది. ఆ అధికారం తోనే దశరథుడు నాకు నార చీరలు కట్టబెట్టి అరణ్యానికి పంపాడు. నేను ఆయన ఆదేశము పాటించాలి. నేను నా తండ్రి యందు ఎలాంటి గౌరవము చూపిస్తున్నానో, నీవు నీ తల్లి పట్ల అంత గౌరవము చూపించు. నీ తల్లి తనస్వార్థము కోసరం ఇదంతా చేయలేదు. కేవలం నీకోసరమే చేసింది. నీ తల్లి కూడా నా తల్లితో సమానము. నా తల్లి కైక, నా తండ్రి దశరథుడు నన్ను అడవులకు వెళ్లమన్నారు. నేను అడవులకు వచ్చాను. ఇంతకన్నా వేరు విధంగా నేను ఎలా చేయగలను? తల్లి తండ్రుల మాట నాకు శిరోధార్యము కదా!
నా తరువాత రాజ్యమునకు అర్హుడవు నీవు. అందుకని నీవు రాజ్యము చేయవలెను. నేను అరణ్యములలో ఉండవలెను. నా తండ్రి దశరథుడు పదిమంది ఎదుట ఈవిధంగా భాగపంపకములు చేసాడు. నీకు రాజ్యము ఇచ్చాడు. నాకు 14 ఏళ్లు వనవాసము ఇచ్చాడు. దీనిని మనము పాటించాలి. ఇప్పుడు మన తండ్రి స్వర్గస్థుడయ్యాడు. ఆయన లేడు కదా అని మనకు ఆయన మాటను వమ్ముచేయలేము కదా!కాబట్టి నేను రాజ్యాభిషిక్తుని కాలేను.” అని అన్నాడు రాముడు.
అయోధ్యాకాండం శతతమ (100వ) సర్గలో, భరతుడు నందిగ్రామానికి చేరుకుని, అక్కడ నివసిస్తూ పాలనను పర్యవేక్షించడానికి సిద్ధమవుతాడు. అతను రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి, తాను రాముడి ప్రతినిధిగా పాలన చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. భరతుడు వలమాలిన వాస్రాలు ధరించి, నిరాడంబర జీవితం గడపాలని నిర్ణయిస్తాడు. ప్రజలు భరతుని ధర్మ నిష్ఠను, నిస్వార్థతను మెచ్చుకుంటారు. ఈ సర్గలో భరతుడు రాముడి పట్ల తన అపారమైన ప్రేమను, విధి పట్ల తన నిబద్ధతను ప్రదర్శిస్తాడు. రాముడు తిరిగి వస్తాడని ఆశతో, భరతుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, ప్రజల పట్ల ధర్మబద్ధంగా, న్యాయంగా వ్యవహరిస్తాడు. భరతుడి ధర్మ నిష్ఠ, కరుణ, నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి.
భరతుడు మరలా రాముని పాదాల మీదకు జారిపోయాడు. రాముని పాదాలు తన కన్నీటితో కడుగుతున్నాడు. రాముడు వాత్సల్యముతో భరతుని రెండు చేతులతో పైకి లేవనెత్తాడు. తన తొడమీద కూర్చోపెట్టుకున్నాడు. భరతుని కళ్లు తుడిచాడు. శిరస్సు ముద్దుపెట్టుకున్నాడు.
“భరతా! నీవు ఒంటరిగా ఈ అరణ్యములకు ఎందుకు వచ్చావు? తండ్రిగారు దశరథమహారాజుగారు రాలేదా!ఆయన ఎక్కడికి వెళ్లారు? నీవు ఒంటరిగా ఎందుకు వచ్చావు? ఎందుకంటే తండ్రిగారు జీవించి ఉండగా నా కొరకు అరణ్యములకు రావలసిన అవసరము నీకు లేదు కదా! మన వివాహముల తరువాత నీవు నీ మాతామహుల ఇంటికి వెళ్లావు. మరలా ఇన్నాళ్లకు నిన్ను చూడగలిగాను. నాకు చాలాసంతోషంగా ఉంది.
కాని నీవు అరణ్యములకు రావలసిన అవసరమేమి ఉన్నదో నాకు తెలియడం లేదు? తండ్రి గారు క్షేమముగా ఉన్నారా! నేను అడవుల పాలు అయ్యాను అన్న దుఃఖంతో స్వర్గస్థులు కాలేదు కదా! లేకపోతే నీవు చిన్నవాడవు, రాజ్యము చేయుటకు అర్హుడవు కావు అని నీ తండ్రిగారు నీకు రాజ్యము ఇచ్చుటకు నిరాకరించలేదు కదా!
ఏకారణము చేత నీవు ఇక్కడకు వచ్చావో తెలియజెయ్యి. భరతా! నేను అనవసరంగా ఏదేదో ఊహించు కుంటున్నాను. తండ్రిగారు క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. నీవు ఆయనకు ప్రతిరోజూ సేవలు చేస్తున్నావు కదా! నాకే ఆ భాగ్యము లేదు.
మన పురోహితుల వారు వసిష్ఠుల వారు క్షేమంగా ఉన్నారా. నీవు ప్రతిరోజూ ఆయనను పూజిస్తున్నావు కదా! నా తల్లులు కౌసల్య, సుమిత్ర కైకేయి క్షేమంగా ఉన్నారు కదా! మన పురోహితులు, వారి కుమారుడు నీకు సర్వవేళలా అండగా ఉంటూ నీచేత అగ్ని కార్యములు, హెూమములు చేయిస్తున్నారు కదా! నీకు ధర్మాధర్మములను బోధిస్తున్నారు కదా!
నీవు దేవతలను, పితరులను, తల్లి తండ్రులను, గురువులను ప్రతిరోజూ పూజిస్తున్నావు కదా! బ్రాహ్మణులను, వృద్ధులను ఆదరిస్తున్నావు కదా! మనకు అస్త్రవిద్య చెప్పిన గురువు సుధన్వుని తగురీతిలో సత్కరిస్తున్నావు కదా!
నీవు రాజ్యాభిషిక్తుడవు అయిన తరువాత నీతిమంతులు, బుద్ధిమంతులు, విద్యావంతులు, రాజనీతి విశారదులనే మంత్రులుగా నియమించావు కదా! ఎందుకంటే, మంత్రులు రాజనీతికోవిదులు, రాజుయొక్క రహస్యములను కాపాడకలిగిన వారు అయిఉండడం ఎంతో ముఖ్యం. (ఈ నాడు కూడా మంత్రుల చేత ఓత్ ఆఫ్ సీక్రెసీ ప్రమాణం చేయించడం ఆచారం).
భరతా! నీ పాలన ఎలా ఉంది! జాగరూకతతో ఉంటున్నావా లేక సమయం కాని సమయాలలో నిద్రపోతున్నావా! రాజుకు చేటు నిద్ర తెస్తుంది. సదా జాగరూకుడవై ఉండాలి. నీవు ఎల్లప్పుడూ తెల్లవారు జామున లేచి మంత్రాంగములు మంత్రులతో చర్చించాలి. అప్పుడు ఏకాంతము లభిస్తుంది. మరొక మాట! నీవు ఒక్కడివే ఆలోచించి నిర్ణయం తీసుకోడమూ తప్పు. అలాగని ఎక్కువమందితో ఆలోచించడము కూడా తప్పే. ఎందుకంటే నీ ఆలోచనలు అందరికీ తెలిసే ప్రమాదం ఉంది.
భరతా! ఎల్లప్పుడూ తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేపనులకు ప్రాధాన్యం ఇవ్వాలి. అటువంటి పనులను ఆలస్యం చేయకుండా వెంటనే చేయాలి. కాని ఒక విషయంలో జాగ్రత్త వహించాలి. నీవు ఒక పనినిపూర్తి చేసిన తరువాతనే దానిని బహిరంగ పరచాలి. అంతేగానీ, చేయబోయే పనులను ఎవరికీ తెలియనీయ కూడదు. ఎందుకంటే నీ శత్రువులు, నీవు తలపెట్టిన పనులకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది.
నీవు, నీ మంత్రులు నీతిమంతులుగా, రహస్యములను బట్టబయలు చేయకున్నా, మీ చుట్ట పక్కల వారు నేర్పుగా మీ రహస్యములను రాబట్ట వచ్చు. అటువంటి వారిని దూరంగా ఉంచుతున్నావు కదా!
భరతా! అవసరమైతే వేయి మంది మూర్ఖులనైనా వదులు కోగాని, ఒక పండితుని మాత్రము నీ దగ్గరకు చేర్చుకో. పండితులు నీకు ఆపదలలో సాయం చేయగలరు. మూర్ఖులు ఎంతమంది ఉన్నా, తిండి చేటు తప్ప ఎలాంటి సాయమూ చెయ్యరు. మూర్కులైన మంత్రులు పది మంది కన్నా మేధావి, పరాక్రమంతుడు, నిజాయితీ పరుడు, పండితుడు అయిన ఒక్క మంత్రి చాలు. ఆ రాజు క్షేమంగా ఉండగలడు.
నీ సేవకులను వారి వారికి తగిన స్థానములలో నియమించావు కదా! ఎక్కువ సామర్థ్యం ఉన్నవారిని గొప్ప స్థానములలోనూ, కాస్త మధ్యస్థంగా తెలివితేటలు ఉన్నవారిని, మధ్యమ స్థానములలోనూ, పూర్తిగా తెలివితేటలే లేనివారిని అధమ స్థానములలోనూ నియమించావా!
(అంటే మెరిట్ ను బట్టి ఉద్యోగస్థులను నియమించాలి అని రామరాజ్యంలో ఉన్న నిబంధన. ఈ రోజుల్లో ప్రతిభకు పట్టకట్టడం మానేసారు. 60 ఏళ్లుదాటినా రిజర్వేషన్ల పేరిట ప్రతిభను కాల రాస్తున్నారు. మీకు చదువు అక్కర్లేదు, తెలివితేటలు అక్కర్లేదు. పది మార్కులు వచ్చినా చాలు, మీకు రిజర్వేషన్లు ఉన్నాయి అని భరోసా ఇస్తున్నారు. ఇదీ నేటి రాజకీయ రామాయణం.)
నీవు ఉద్యోగులను నియమించే ముందు వారిని కఠిన మైన పరీక్షలకు గురిచేసి అందులోనే నెగ్గిన వారినే ఉద్యోగులుగా నియమిస్తున్నావు కదా! (నేడు మనము అనుసరిస్తున్న యు.పి.యస్.సి లేక ఏ.పి.పి.యస్.సి అలాంటివే కదా.)
నీదేశములో ప్రజలు శాంతి భద్రతలు లోపించి, భయభ్రాంతు లవుతుంటే నీ మంత్రులు చూస్తూ ఊరుకోడం లేదు కదా!
(విజయవాడలో స్కూలుకు పోతున్న చిన్నారిని కిడ్నాప్ చేసి, చంపి, బాయిలర్ లో వేసి కాల్చిన కేసు, రెండు సంవత్సరాలు దాటినా ఒకకొలిక్కిరాలేదు. మన గవర్నమెంటు వారికి చీమ కుట్టినట్టయినా లేదు. ఇదీ నేటి మంత్రుల నిర్వాహకము. పైగా మాది రామరాజ్యము అని గొప్పలుచెప్పుకోడం.).
భరతా! నిన్ను నీ మంత్రులు గౌరవిస్తున్నారా లేక నిన్ను ఎదిరించి అవమానించడం లేదు కదా! (మంత్రులు ముఖ్యమంత్రికి ఎదురు తిరగడం, బహిరంగంగా దూషించడం, అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడం నేడు పరిపాటి అయిపోయింది.)
ఎందుకంటే భరతా! నీ ఆంతరంగికులు, మంత్రులు ఎవరైనా నీకు ఎదురు తిరిగితే అటువంటి వారిని ఉపేక్షించరాదు. అలా ఉపేక్షిస్తే ఆ రాజు ప్రాణాలకే ముప్పు. (ముఖ్యమంత్రి పక్కనే ఉండి, అసమ్మతిని రెచ్చగొట్టి, ముఖ్యమంత్రి పదవికి, ప్రాణానికి ఎసరు పెట్టడం సర్వసాధారణం అయిపోయింది.)
భరతా! ఇంక నీసేనాపతులు ఎలా ఉన్నారు. సమర్థుడు, విద్యావంతుడు, పరాక్రమ వంతుడు, నిజాయితీ పరుడు, నీకు విశ్వాసపాత్రుడు అయిన వారిని నీ సేనాపతులుగా నియమించావు కదా! బలవంతులు, యుద్ధములో నేర్పుప్రదర్శించినవారిని గౌరవిస్తున్నావు కదా!
నీ సైనికులకు సకాలంలో, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, జీత భత్యములు అందజేస్తున్నావు కదా! ఎందుకంటే సకాలంలో జీతభత్యములు అందక పోతే సైనికులలో అసంతృప్తి చెలరేగుతుంది. తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది.
నీ రాజ్యములో ఉండే ప్రజలందరూ నీ పట్ల విధేయులుగా ఉన్నారు కదా. నీకోసం తమ ప్రాణములను సైతం అర్పించుటకు సిద్దంగా ఉన్నారు కదా!
నీ దూతలుగా ఎవరిని నియమించుకున్నావు? వారు నీ దేశములో పుట్టిన వారు అయి ఉండాలి. అన్ని విషయములను తెలిసిన సమర్థుడు అయి ఉండాలి. నీవు చెప్పిన విషయములను నేర్పుగా ఉన్నదిఉన్నట్టు ఎదుటివారికి చెప్పే సామర్థ్యం కలిగి ఉండాలి. పైగా అతడు పండితుడు అయి ఉండాలి. ఇటువంటి అర్హతలు కలిగిన పురుషుని నీ దూతగా నియమించు కున్నావు కదా!
నీ స్వదేశములో గానీ, నీ శత్రుదేశములలో గానీ జరిగే విషయములను ఎప్పటి కప్పుడు గూఢచారుల వలన తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉంటున్నావు కదా!
ఓ భరతా! ఒకసారి నీతో యుద్ధము చేసి ఓడి పోయిన నీ శత్రువు వాడేం చేస్తాడులే అని విడిచిపెట్ట కూడదు. వాడి పట్ల జాగరూకతగా ఉండాలి. వాడు మరలా తన బలాన్ని పెంచుకొని నిన్ను దొంగదెబ్బ తీయగలడు.
భరతా! కేవలము లౌకికసుఖములగురించి ఆలోచించే భరతా! కేవలము లౌకిక సుఖములగురించి ఆలోచించే నాస్తికవాదుల పట్ల జాగ్రత్తగా ఉండు. వారిని దగ్గర చేరనీయకు. అలాగే, చాలా మంది అజ్ఞానులు, తాము పండితులమనీ, తమకు అంతా తెలుసు అనీ విర్రవీగుతుంటారు. అలాంటివారి పట్ల జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇలాంటి వారు ధర్మశాస్త్రములను నమ్మరు. అనవసరమైన తర్కములు చేస్తూ, ప్రజలకు ధర్మశాస్త్రముల పట్ల అపనమ్మకము కలిగిస్తుంటారు. వీరి మాటలు నమ్మకు.
భరతా! అతి పురాతనమైనదీ, ఎందరో చక్రవర్తులు పరిపాలించినదీ అయిన అయోధ్యను జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు కదా! ఎందుకంటే అయోధ్య పురాతనమైనా అన్నీ సౌకర్యములు కల నగరము. అయోధ్యలో ఉన్న వ్యవసాయభూములకు, నివాస స్థలములకు నిర్దిష్టమైన హద్దులు, వాటిని తెలిపే గుర్తులు కలిగి ఉన్నాయి. అందు వలన న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం లేదు. (నేడు మన న్యాయస్థానములలో ఉన్న వ్యాజ్యాలలో 90 శాతము భూమి సరిహద్దు తగాదాలే.) అయోధ్యలో దేవాలయములు, సత్రములు, చెరువులూ సమృద్ధిగా ఉన్నాయి. అయోధ్యలో ఏటా ఉత్సవములు జరుగుతుంటాయి. ప్రజలందరూ సుఖసంతోషాలతో అలరారుతుంటారు. అయోధ్యలో పంటభూములు సమృద్ధిగా ఉన్నాయి. పశుసంపద అపారంగా ఉంది. ఖనిజ సంపదకు ఆలవాలమైన గనులు అనేకం ఉన్నాయి. హింస అనే పదానికి అయోధ్యలో తావు లేదు. అయోధ్యలో పాపాత్ములు లేరు. అయోధ్య కోట సురక్షితమైనది. అటువంటి అయోధ్యను నీవు చక్కగా రక్షిస్తున్నావు కదా!
నీ రాజ్యములో వర్తక వాణిజ్యములు ఎలాంటి ఆటంకములు లేకుండా సాగుతున్నాయి కదా! వర్తకులు నీకు అనుకూలంగా ఉన్నారు కదా! నీ రాజ్యములో గోరక్షణ సాగుతున్నదికదా! నీ పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారు కదా! ఎందుకంటే ప్రజారక్షణ రాజు బాధ్యత.
నీ అంత:పుర స్త్రీలకు నీ రహస్యములను వెల్లడి చేయకుండా, వారిని సరససంభాషణలతో సంతోషపెడుతున్నావు కదా! కాని వారి మాటలకు మోసపోయి తప్పుదారి తొక్కవద్దు.
నీవు గజసంపదను చక్కగా పోషిస్తున్నావు కదా! గజ సంపదను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండు. రాజ్య రక్షణకు గజసంపద చాలా కీలకము.
ఓభరతా! నీవు ప్రతిరోజూ నీ ప్రజలను కలుసుకుంటూ వారి కష్టసుఖములు తెలుసుకుంటున్నావు కదా!
ఓ భరతా! నీ దగ్గర పని చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించి వారు నిన్ను చూడగానే భయపడేట్టు చేయవద్దు. అలాగని వారికి అధిక చనువు ఇవ్వవద్దు. మధ్యేమార్గంగా వారితో మెలుగుతూ ఉండు.
నీ రాజ్యములో ధనము, ధాన్యము, నీరు, నిలవలు సమృద్ధిగా ఉన్నాయికదా. నీకు చాలినంత సైన్యము, యంత్రసామగ్రి సమకూర్చు కున్నావు కదా!
ఓ భరతా! నీ ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంది. నీ ఆదాయము ఎక్కువ, వ్యయము తక్కువగా ఉందికదా!
(నేటి కాలంలో లోటుబడ్జెట్ సర్వసాధారణం అయిపోయింది. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. దాని కోసరం అప్పులు. వాటికి వడ్డీలు. ఆదాయంలోసగం వడ్డీలకే పోతుంది. ఇదీ నేటి ఆర్ధికవ్యవస్థ).
ఓ భరతా! ప్రజాధనము అపాత్రుల చేతులలోనికి వెళ్లడం లేదు కదా! నీవు నీ ధనమును దేవ కార్యములకు, పితృకార్యములకు, అతిధి సత్కారములకు, బ్రాహ్మణులకు, సైనికులకు, మిత్రవర్గములకు వ్యయం చేస్తున్నావు కదా!
భరతా! ఇంక న్యాయ విషయాలకు వస్తాము. నిరపరాధుల మీద నేరం మోపితే, వారిని విచారించకుండా, వారికి తన వాదన వినిపించడానికి అవకాశం ఇవ్వకుండా, దురాశతో అతనికి మరణదండన విధించడం లేదు కదా!
(న్యాయసూత్రాలలో ప్రధానమైనది సహజన్యాయసూత్రము. అంటే ఎవరికైనా అతనికి విరుద్ధంగా ఆదేశాలు ఇచ్చేముందు, అతనికి తన వాదన చెప్పుకొనే అవకాశం ఇవ్వాలి. అలాంటి అవకాశం ఇవ్వకుండా అతనికి విరుద్ధంగా ఏ విధమైన ఆదేశాలు ఇవ్వకూడదు. దీనినే ఏ ప్రపంచ వ్యాప్తంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ నాచురల్ జస్టిస్ అని పిలువబడుతుంటాయి. దీనిని త్రేతాయుగంలోనే రాముడు ఆవిష్కరించాడు.)
భరతా! ఎవరైనా దొంగతనముచేస్తూ ఉంటే ప్రత్యక్షంగా చూచి పట్టుకొంటే, అతడు దొంగతనం చేస్తున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబితే, అటువంటి దొంగలను నీ అధికారులు ధనలోభము చేత విడిచిపెట్టడం లేదు కదా!
(దీనికి వివరణ అనవసరం. అన్నీకాదు కానీ, కొన్ని పోలీసు స్టేషన్లలో జరిగే తంతు ఇదే. అసలు నేరస్తులను విడిచిపెట్టడం, అమాయకుల మీద కేసులు బనాయించడం కొంతమంది పోలీసుల దైనందిన చర్య.)
న్యాయ నిర్ణయము చేసేటప్పుడు నీ న్యాయాధికారులు వీడు ధనికుడు, వీడు పేదవాడు అనే బేధబుద్ధి లేకుండా నిష్పక్షపాతంగా న్యాయ నిర్ణయం చేస్తున్నారు కదా!
భరతా! ఒక విషయం గుర్తుపెట్టుకో. ఏ రాజైనా తన ఇష్టం వచ్చినట్టు శాసనములను చేసి, అమాయకులను కష్టముల పాలు చేస్తాడో, అయాయకుల మీద అక్రమంగా నేరములు మోపి శిక్షిస్తాడో, ఆ రాజు ఎక్కువ కాలము రాజుగా ఉండలేడు. అతని రాజ్యంలో ప్రజలు కార్చిన కన్నీళ్లే ఆ రాజును శిక్షిస్తాయి. సర్వనాశనం చేస్తాయి.
ఓ భరతా! నీ రాజ్యములో శిశువులను, వృద్ధులను, పండితులను ఆదరిస్తున్నావు కదా!
(శిశుసంరక్షణాలయాలు, వృద్ధాశ్రమాలు, వృద్ధాప్య పెన్షన్లు, పండితులకు, కళాకారులకు పెన్షన్లు ఈకోవకే చెందుతాయి. రాముని కాలంలోనే ఇవి అమలులో ఉన్నాయి.).
ఓ భరతా! నీవు ధన సంపాదనకోసం ధర్మాన్ని విడిచిపెట్టడం, సుఖములు మరిగి భోగలాలసుడవై ధర్మమును విడిచి, ధనమును దుర్వినియోగం చెయ్యడం లాంటివి చేయడం లేదుకదా! నీవు ధర్మపరంగా ధనసంపాదన చేస్తూ, ధర్మమార్గంలో సంపాదించిన ధనమునకు తగ్గ కోరికలతో తృప్తిపడుతూ, రాజ్యము చేస్తున్నావుకదా!
ఓభరతా! నీవు ఎల్లప్పుడూ నీ రాజ్యములో ఉన్న ప్రజల క్షేమము కోరుతున్నావు కదా! ఓ భరతా! రాజు చెయ్యకూడనివి,ఆచరించరానివి చెబుతాను విను. రాజునాస్తికుడు కారాదు. అసత్యము పలుకరాదు.
రాజుకు కోపము పనికిరాదు. రాజుకు నిర్లక్ష్యం పనికిరాదు. రాజు విషయములను గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ సాగదీయడం, నాన్చడం పనికిరాదు.
(నేటి రాజకీయ నాయకులకు ఇదే తారక మంత్రము. పార్కలాం. వ్యవహారములను నాన్చడం, సాగదీయడం, కమీటీలపేరుతో కాలయాపన చేయడం, వాటికవే పరిష్కారం అవుతాయి అనుకోవడం నేటి రాజకీయనాయకుల తీరు. ఇది తప్పు, చేయకూడదు అని రాముడు స్పష్టంగా చెప్పాడు.)
జ్ఞానులను నిర్లక్ష్యం చేయకూడదు. రాజులకు సోమరి తనంపనికిరాదు. ఇంద్రియ సుఖములకు లోనుకాకూడదు. సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలే గానీ, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదు. తీసుకొన్ననిర్ణయాలను అమలు చేయకుండా ఉండకూడదు. (రాజకీయనాయకులు ఆర్భాటంగా పునాదిరాళ్లు వేయడం, పనులుమాత్రం మొదలు పెట్టకపోవడం మనం చూస్తూనే ఉన్నాము..)
రాజు తన ఆలోచనలను రహస్యంగా ఉంచాలి. బహిర్గతం చేయకూడదు. ప్రజాక్షేమం పాటించాలి. ప్రజావ్యతిరేక పనులు చేయకూడదు. శత్రువులను నేర్పుగా ఎదుర్కోవాలి కానీ, మూర్ఖంగా ఒక్కుమ్మడిగా ఎదుర్కోకూడదు. రాజైన వాడు పైచెప్పిన వాటిని విడిచిపెట్టాలి. భరతా! మరలా చెప్పుచున్నాను. ఎప్పుడూ నీ సొంత నిర్ణయాలు తీసుకోకు. మంత్రులతో కూలంకళంగా చర్చించి సమిష్టి నిర్ణయాలు తీసుకో. మంత్రులతో నీ చర్చలను చాలా రహస్యంగాఉంచు. నీవు ప్రతిరోజూ నీ భార్యతో కలిసి వేదాధ్యయనము చెయ్యి. అది మంచి ఫలితాలనిస్తుంది.నీ బుద్ధిని ఎల్లప్పుడూ ధర్మము నందే ఉంచు. ధర్మము వలననే అర్థ,కామములను పొందు. మన తండ్రిగారు, మన తాత ముత్తాతలు ఈ మార్గమునే అనుసరించారు. నీవుకూడా అదే ధర్మమార్గము అనుసరించి రాజ్యపాలన చెయ్యి.
మరొక మాట. నీవు భుజించునపుడు నీ మిత్రులతో సహాభుజించు. ఒంటరిగా భుజించవద్దు. పైచెప్పిన ప్రకారము రాజ్యపాలన చేసిన రాజు మరణానంతరము నరకమునకుకాకుండా స్వర్గమునకు వెళతాడు. “అని రాముడు భరతునికి రాజనీతి ఉపదేశించాడు.
అయోధ్యాకాండం ఏకోనశతతమ (99వ) సర్గలో, భరతుడు రాముని పాదుకలను తీసుకుని, సింహాసనంపై ఉంచి అయోధ్యను పాలించే క్రమంలో ఉన్నాడు. భరతుడు, ప్రజలకు రాముడు తిరిగి వచ్చే వరకు తాను రాముని ప్రతినిధిగా ఉంటానని ప్రకటిస్తాడు. అతను ధర్మబద్ధంగా, న్యాయంగా పాలన కొనసాగిస్తాడు. ప్రజలు భరతుని నిస్వార్థతను మెచ్చుకుంటారు. ఈ సర్గలో, భరతుడు నందిగ్రామానికి వెళ్ళి, అక్కడ నివసిస్తూ పాలనను పర్యవేక్షించడానికి సిద్ధమవుతాడు. అతను వలమాలిన వాస్రాలు ధరించి, నిరాడంబర జీవితం గడపాలని నిర్ణయిస్తాడు. ఈ సర్గ భరతుని ధర్మ నిష్ఠను, రాముడి పట్ల అతని అపారమైన ప్రేమను ప్రతిబింబిస్తుంది. భరతుడు, రాముడు తిరిగి వస్తాడని ఆశతో, తన విధిని నిర్వర్తిస్తాడు.
శత్రుఘ్నుడు తన వెంటరాగా భరతుడు వడి వడి గా రాముని వద్దకు వెళుతున్నాడు. భరతుని వెనక వసిష్ఠుడు, దశరథుని ముగ్గురు భార్యలను తీసుకొని వెళుతున్నాడు. సుమంత్రుడు కూడా భరతుని వెనుకనే వెళుతున్నాడు.
భరతునికి దూరంగా ఒక పర్ణశాల కనపడింది. ఆ పర్ణశాల ముందు కొన్ని కట్టెలు,పుష్పములు కనపడ్డాయి. అక్కడ ఉన్న చెట్లకు కొన్ని నారచీరలు వేలాడుతున్నాయి. రాముడు అక్కడే ఉన్నాడు అని రూఢి అయింది భరతునికి. ఉద్వేగంతో వెళుతున్నాడు భరతుడు.
“శత్రుఘ్నా! చూచావా! ఇదే భరద్వాజుడు చెప్పిన ప్రదేశము. ఇక్కడే మందాకినీ నదిప్రవహించుచున్నది. ఇక్కడి చెట్లకు నారచీరలు వేలాడుతూ ఉన్నాయి. అదుగో ఆపర్ణశాల దగ్గర ఉన్న అగ్నినుండిపుట్టిన పొగ పైకి లేస్తూ ఉంది. రాముడు ఇక్కడే ఉన్నాడు అని నా అనుమానము. మనము ఇక్కడే రాముని చూస్తాము.
సుమంతా! అయోధ్యా సింహాసనముమీద కూర్చోవలసిన రాముడు ఇక్కడ కటిక నేల మీద పద్మాసనము వేసుకొని కూర్చొని ఉన్నాడు. దీని కంతటికీ నేనేకారణము. నా మూలముననే రామునికి ఇన్ని కష్టములు వచ్చినవి. నేను, రాముడు సీత పాదముల మీద పడి క్షమాపణ కోరిన కాని నా మనసు శాంతించదు.” అని అంటూ భరతుడు దూరంగా ఉన్న ఆ పర్ణశాల వైపు నడుస్తున్నాడు.
భరతుడు ఆ పర్ణశాలను సమీపించాడు. భరతుని మనస్సంతా ఉద్వేగపూరితంగా ఉంది. ఆ పర్ణశాల లోపలికి తొంగి చూచాడు. జటలు కట్టిన వెంట్రుకలతో, నేల మీద జింక చర్మము పరచుకొని దాని మీద కూర్చుని ఉన్న రాముని చూచాడు భరతుడు. రామునికి అటు ఇటు సీత లక్ష్మణులు కూర్చొని ఉన్నారు.
భరతునికి దుఃఖము పొంగుకొని వచ్చింది. రాముడి దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లాడు. భరతుని కళ్లనిండా నీళ్లు తిరిగాయి. కళ్లు సరిగా కనిపించడం లేదు. దు:ఖముతో గొంతు బొంగురుపోయింది. ఆ బొంగురుగొంతుతో భరతుడు ఇలా అన్నాడు.
“రామా! నీవా ఈ నేలమీద కూర్చొని ఉన్నది. అమాత్యులు సేవిస్తూ ఉంటే, రాజ సింహాసనము మీద కూర్చోవలసిన నీవు జింక చర్మమీద కూర్చొని ఉన్నావా! పట్టు పీతాంబరములు ధరించవలసిన నీవు నారచీరలు కట్టుకొని ఉన్నావా! చిత్ర విచిత్రములైన పుష్పములు ధరించవలసిన నీ శిరసు మీద ఆ జటలు ఎలా ధరించావు? ఒక రాజుగా యజ్ఞయాగములు చేయవలసిన నీవు, ఇక్కడ అడవులలో కష్టములు పడుతున్నావా? అగరు, చందనముతో అలరార వలసిన నీ శరీరము మట్టికొట్టుకొని పోయినదా! సుఖపడవలసిన నీవు ఇలా కష్టములు పడుతుంటే ఆ కష్టములకు కారణమైన నాకు ఈ సుఖములు ఎందుకు?” అని ఏడుస్తూ రాముని పాదముల మీద పడ్డాడు భరతుడు. రాముని పాదములను తన కన్నీటితో తడుపుతున్నాడు.
ఒక సారి తల ఎత్తి రామా! అని పిలిచి మరలా రాముని పాదముల మీదపడిపోయాడు భరతుడు. తరువాత భరతునికి మాటలు రాలేదు. బిగ్గరగా ఏడుస్తున్నాడు. శత్రుఘ్నుడు కూడాదు:ఖము ఆపుకోలేక రాముని పాదముల మీద పడ్డాడు.
రాముడు తమ్ములను చూచిన సంభ్రమంతో భరత శత్రుఘ్నులను తన రెండు చేతులతో పొదివి పట్టుకొని లేవనెత్తాడు. రాముడు భరత శత్రుఘ్నులను గట్టిగా తన హృదయానికి హత్తుకున్నాడు, రామునికి కూడా దుఃఖము ఆగలేదు. భోరున విలపిస్తున్నాడు. ఇంతలో వెనుకగా వస్తున్న సుమంత్రుడు, వసిష్ఠుడు కూడా పర్ణశాల లోపలికి వచ్చారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ సప్తవింశః సర్గం రామాయణంలో కీలకమైన భాగం. ఇందులో రాముడు, సీత, లక్ష్మణులు ఋష్యమూక పర్వతానికి చేరుకొని కబంధుడిని ఎదుర్కొంటారు. కబంధుడు రాక్షసుడు, శాపం కారణంగా అతని శరీరం విచిత్రంగా ఉంటుంది. రామ, లక్ష్మణులు అతన్ని సంహరిస్తారు.
త్రిశిరస్సుడు అనే సైన్యాధిపతి ఖరుడు రాముని వైపు దూసుకువెళ్లడం చూచాడు. వెంటనే త్రిశిరస్సుడు ఖరుడి వద్దకు వచ్చాడు.
“ఓ వీరుడా! ఒక సాధారణ మానవుని సంహరించడానికి నీవు వెళ్లవలెనా! మేము లేమా! నాకు అనుజ్ఞ ఇమ్ము. నేను వెళ్లి రాముని సంహరిస్తాను. ఈ రాముడి చావు నా చేతిలో ఉంది. నేను చంపుతాను. లేకపోతే రాముని చేతిలో నేను చస్తాను. నువ్వు మాత్రం చూస్తూ ఉండు. ఒక వేళ నేను రాముణ్ణి చంపితే మనం అందరం ఆనందంతో జనస్థానమునకు వెళ్ళాము. లేక రాముడు నన్ను చంపితే, అప్పుడు నువ్వే వెళ్లి రాముని చంపవచ్చును.” అని అన్నాడు త్రిశిరుడు.
ఆమాటలు విన్న ఖరుడు ఆనందంతో త్రిశిరునికి రామునితో యుద్ధము చేయమని అనుమతి ఇచ్చాడు. త్రిశిరుడు తన రథము ఎక్కి రాముని మీదికి యుద్ధమునకు వెళ్లాడు. రాముని మీద బాణములను వర్షము వలె కురిపించాడు. ఆ బాణములనన్నింటికీ రాముడు మధ్యలోనే తుంచాడు.
రాముడు త్రిశిరస్సుల మధ్య పోరు భయంకరంగా జరిగింది. త్రిశిరుడు రాముని నుదుటిపై తగిలేటట్టు మూడు బాణములను వదిలాడు. రాముడు కోపించి సర్పములవలె దూసుకు వెళ్లే నాలుగు బాణములను త్రిశిరుని గుండెలకు గురిపెట్టి కొట్టాడు. మరొక నాలుగు బాణములతో త్రిశిరుడు ఎక్కిన రథమునకు కట్టిన గుర్రములను చంపాడు. త్రిశిరుడు తేరుకొనే లోపల రాముడు అతని రథము నడుపుతున్న సారథిని చంపాడు. మరొక బాణంతో త్రిశిరుని పతాకమును విరిచాడు.
త్రిశిరుడు రథమునుండి పైకి ఎగరబోయాడు. ఎగిరే ఆ త్రిశిరుని గుండెలకు గురిపెట్టి రాముడు నాలుగు బాణములను ప్రయోగించాడు. మరొక మూడు బాణములను సంధించి త్రిశిరుని మూడు తలలను ఖండించాడు. త్రిశిరుని తలలు తాటికాయల మాదిరి నేలమీద పడ్డాయి. ఆ వెంటనే త్రిశిరుని శరీరము నేలమీద పడింది.
ఎప్పుడైతే త్రిశిరుడు చచ్చాడో, అతని సేనలు చెల్లాచెదురుగా పారిపోయాయి. రాక్షస సేనలు వెనుతిరిగి పారిపోవడం చూచాడు ఖరుడు. త్రిశిరుడు చచ్చాడు అని తెలుసుకున్నాడు ఖరుడు. పారిపోతున్న సేనలను కూడగట్టుకొని రాముని మీదికి యుద్ధానికి వెళ్లాడు ఖరుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండలోని షడ్వింశః సర్గః రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, రాముడు, సీత మరియు లక్ష్మణుడు పంచవటిలో నివసిస్తున్నారు. అప్పుడు శూర్పణఖా అనే రాక్షసి వారి వద్దకు వచ్చి, రాముడిని పెళ్లి చేసుకోవాలని కోరుతుంది. రాముడు సీతను తన భార్యగా పరిచయం చేసి, శూర్పణఖాను తిరస్కరిస్తాడు.
తన సైన్యము అంతా రాముని బాణములకు ఆహుతి కావడం చూచాడు దూషణుడు. దూషణుడు తన వెంట వచ్చిన రాక్షస సేనలను ఐదువేల మందిని తీసుకొని రాముని మీదికి వెళ్లాడు. (అంటే అప్పటి దాకా ఖరుని వెంట వచ్చిన 14,000 మంది రాక్షసులు చచ్చారు.) ఆ ఐదువేల మంది రాక్షస సైన్యము రాముని చుట్టు ముట్టారు. రాముని మీద శూలములు, పట్టిసములు, కత్తులు, రాళ్లు, చెట్లు, బాణములు వర్షంలా కురిపిస్తున్నారు. రాముడు కూడా తన బాణములతో వారు తన మీదికి విసురుతున్న శూలములను, పట్టిసములను, కత్తులను, చెట్లను, సమర్ధంగా ఎదుర్కొంటున్నాడు.
రాక్షసులు తన మీద ఆయుధములు ప్రయోగించే కొద్దీ రాముని కోపం పెరుగుతూ ఉంది. రాముడు వేలకొలది బాణములతో దూషణుని సైన్యమును కప్పివేసాడు. ఇది చూచిన దూషణుడు రాముని మీద వాడి అయిన బాణములను ప్రయోగించాడు. రాముడు అర్ధచంద్రాకారములో ఉన్న బాణముతో దూషణుని విల్లు విరిచాడు. నాలుగుబాణములతో దూషణుని రథమునకు కట్టిన హయములను చంపాడు. మరొక అర్థచంద్రబాణముతో సారధి తల నరికాడు. మూడుబాణములతో దూషణుని కొట్టాడు.
దూషణుని ధనుస్సు విరిగింది. రథం కూలింది. సారథి చచ్చాడు. దూషణుడు నేలమీదికి దూకాడు. ఒక పెద్ద పరిఘను తీసుకున్నాడు. రాముని మీదికి పరుగెత్తాడు. అది చూచి రాముడు రెండు బాణములతో దూషణుని రెండు చేతులను బుజాల వద్ద నరికాడు. వాడి చేతులు పరిఘతో సహా నేలకూలాయి. చేతులు విరిగిన దూషణుడు నిలువునా కింద పడ్డాడు.
ఇది చూచి దూషణుని సేనాధి పతులు అయిన మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాధీ అను ముగ్గురు తమ తమ ఆయుధములను తీసుకొని రాముని మీదికి వెళ్లారు. మహాకపాలుడు శూలమును, స్థూలాక్షుడు పట్టిసమును, ప్రమాథి గండ్రగొడ్డలిని ధరించారు. వారిని చూచి రాముడు వారి మీద బాణవర్షము కురిపించాడు. మహాకపాలుని తల నరికాడు. స్థూలాక్షుని కళ్లలో రాముడు వదిలిన బాణములు గుచ్చుకున్నాయి. ప్రమాథి గుండెలను చీల్చాడు రాముడు. ఆ ప్రకారంగా రాముడు దూషణుని, అతని సేనాధి పతులు ముగ్గురను, ఐదువేలమంది సైనికులను మట్టుబెట్టాడు.
తన సోదరుడు దూషణుడు అతని సైన్యము సమూలంగా నాశనం అవడం చూచాడు ఖరుడు. తన సేనాధి పతులను పిలిచాడ.
“సేనానాయకులారా! నా సోదరుడు దూషణుడు అతని సైన్యము రాముని చేతిలో హతం అయ్యారు. మీరు మీ మీ సేనలతో రాముని హతమార్చండి. వెళ్లండి” అని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా తన సేనానాయకులను ఆజ్ఞాపించిన ఖరుడు తాను కూడా ఆయుధములు ధరించి రాముని మీదికి పరుగెత్తాడు. ఖరుని సేనానాయకులైన శ్యేనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పరుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్పాస్యుడు, రుధిరాశనుడు అనే పన్నెండు మంది సేనానాయకులు ఖరుని వెంట రాముని మీదికి ఉరికారు.
రాముడు తన వజ్రసమానములైన బాణములతో ఖరుని సేనలను తుత్తునియలు చేసాడు. రాముడు కర్ణి అనే పేరుగల నూరు బాణములతోనూ, మరో వెయ్యిమందిని వాడి అయిన బాణములతోనూ సంహరించాడు. రాముని చేత చంపబడ్డ రాక్షసుల శరీరములతో ఆ ప్రాంతమంతా కప్పబడిపోయింది.
ఏ వాహనమూ లేకుండా, ఇతర సైన్యసాయము లేకుండా రాముడు ఒంటరిగా ధనుర్ధారియై 14,000 మంది రాక్షసులను మట్టుబెట్టాడు. వారిలో ఖరుడు, త్రిశిరుడు మిగిలారు. తన సైన్యము అంతా సర్వనాశనం కావడం చూచి ఖరుడు కోపంతో రగిలిపోయాడు. తన రథం ఎక్కి, ఆయుధములను ధరించి, రాముని మీదికి వెళ్లాడు.