అయోధ్యాకాండ షట్షష్ఠితమః సర్గ రామాయణంలో ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో రాముడు సీతా దేవితో కలిసి వనవాసానికి బయలుదేరుతాడు. రథంలో ప్రయాణిస్తూ రాముడు గంగా నదిని చేరుకుంటాడు. అప్పుడు గుహుడు అనే నిశాద రాజు రాముడు, సీత, లక్ష్మణులకు ఆతిథ్యం ఇవ్వడమే కాక, వారికి సహాయం చేస్తాడు. వారు గంగా నదిని దాటడానికి పడవను అందిస్తాడు. రాముడు తన పట్టాభిషేకం రద్దయినప్పటికీ, ధైర్యంగా వనవాసం అంగీకరించి ధర్మాన్ని పాటిస్తాడు. ఈ సర్గ రాముని నిశ్చలత, ధర్మానుస్థానం, మరియు ఆపదలో ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది.
కౌసల్య తన భర్త దశరథుని తలను ఒడిలో పెట్టుకొని దు:ఖిస్తూ ఉంది. తలపైకెత్తి కైకను చూచింది. ఆమె కోపం కట్టలు తెంచుకొంది. “ఏమ్మా! కైకా! నీ కోరిక తీరిందా! నీ మనస్సు శాంతించిందా! ఇంక నువ్వు, నీ కొడుకు, ఈ అయోధ్యను ఏలుకోండి. మీకు అడ్డు వస్తాడని నా కొడుకును అడవులకు పంపావు. ఇప్పుడు మొగుడిని చంపావు. ఇంక నీకు అడ్డేముంది. నా కొడుకు రాముడు నన్ను విడిచి అడవులకు వెళ్లిపోయాడు. నా భర్త నన్ను విడిచి స్వర్గానికి పోయాడు. ఇంక నాకు ఎవరు మిగిలారు. ఎవరి కోసం బతకాలి. నీ లాంటిది తప్ప మొగుడు లేకుండా ఏ స్త్రీ బతకలేదు. బతకడానికి ఇష్టపడదు కూడా.
ఓ కైకా! నీవు ఏం చేస్తున్నావో నీకు తెలిసే చేసావా! లేక ఆ గూని దాని మాటలు విని ఇంతటి ఘోరానికి ఒడిగట్టావా! ఏది ఏమైనా మాకు మా భర్తను దూరం చేసావు. ఓ కైకా! నీవు మాకే కాదు. జనక మహారాజును కూడా దు:ఖములో ముంచావు. తన కూతురు అడవులలో ఎన్ని కష్టములు పడుతున్నదో అని జనకుడు ఎంతదు:ఖిస్తున్నాడో కదా! ఇంతకూ రామునికి తన జనకుని మరణ వార్త ఎలా తెలుస్తుంది. తన తల్లి అనాధ అయింది అని ఎవరు చెబుతారు. రాముడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతారు! నా భర్త రాముని గూర్చి, సీతను గూర్చి, తలంచుకొని ఏడ్చి ఏడ్చి ప్రాణాలు వదిలాడు. నేను కూడా ఆయన వెంటనే వెళతాను. నా భర్తతో పాటు చితి మీదకూర్చుని అగ్నికి ఆహుతి అవుతాను. నా భర్తను అనుసరించడం తప్పనాకు వేరుమార్గము లేదు.” అంటూ కౌసల్య భర్త శవాన్ని కౌగలించుకొని భోరు భోరున ఏడుస్తూ ఉంది.
ఇంతలో కులగురువు వసిష్టులు, అమాత్యులు అక్కడకు చేరుకున్నారు. వసిష్ఠుని ఆదేశము మేరకు అంత:పురపరిచారికలు కౌసల్యను లేపి అక్కడి నుండి దూరంగా తీసుకొని పోయారు. అమాత్యులు దశరథుని శరీరమును ఒక తైలద్రోణిలో పదిలపరిచారు. శవమునకు చేయవలసిన కర్మక్రతువులు అన్నీ నిర్వర్తించారు. ఆ సమయంలో దశరథుని కుమారులు ఎవరూ అయోధ్యలో లేరు. రామలక్ష్మణులు అడవులలో ఉన్నారు. భరత శత్రుఘ్నులు వారి మేనమామల ఇంట్లో ఉన్నారు. అందుకని దశరథునికి దహనక్రియలు నిర్వర్తించడానికి వీలులేదు. వారు వచ్చేదాకా నిరీక్షించాలి. కాబట్టి దశరథుని శరీరమును తైలద్రోణిలో భద్రపరిచారు.
(తైలద్రోణి అంటే పలు విధములైన నూనెలు(preservatives) కలిగిన తొట్టె అని అర్థము. ఈ రోజుల్లో కూడా శవాలను చెడిపోకుండా భద్రపరచడానికి యాసిడ్లు పూసి భద్రపరుస్తారు. మమ్మీలు అన్నీ అలా భద్రపరచబడినవే. ఇదే ప్రక్రియ త్రేతాయుగములో కూడా ఉంది అని తెలుస్తూ ఉంది.)
అప్పటి దాకా దూర దూరంగా ఉన్న దశరథుని భార్యలు అందరూ దగ్గరగా వచ్చారు. తైలద్రోణిలో ఉన్న మహారాజు శవాన్ని చూచి బిగ్గరగా రోదిస్తున్నారు.
“ఓ మహారాజా! మాకు రాముడిని దూరం చేసావు. ఇప్పుడు నువ్వుకూడా దూరంగా వెళ్లిపోయావా! చేతులారా తన భర్తను చంపిన కైక పాలనలో మేము ఎలా ఉండగలము. రాముడూ లేకుండా, నీవూ లేకుండా, ఈ కైక పెట్టే బాధలనుసహిస్తూ మేము ఎలా జీవించగలము. ఈ కైక సామాన్యురాలు కాదు. తన స్వార్థం కోసరం రాముని అడవులకు పంపింది. కట్టుకున్న భర్తను చంపించింది. ఇక మమ్మల్ని మాత్రం విడిచి పెడుతుందా?” అని అగమ్యగోచరమైన వారి భవిష్యత్తును తలచుకుంటూ నేలమీద పడి దొర్లి దొర్లి ఏడుస్తున్నారు.
వీరి పరిస్థితి ఇలా ఉంటే, అటు రాముని, ఇటు మహారాజును పోగొట్టుకున్న అయోధ్యావాసుల జీవితాలలో చీకట్లు ముసురు కున్నాయి. అందరూ శోమసముద్రంలో మునిగిపోయారు. పురజనులు అందరూ వీధులలో గుంపులు గుంపులుగా చేరి కైక అకృత్యములను గురించి తదుపరి పరిణామాల గురించి చర్చించుకుంటున్నారు. కన్నీరు కారుస్తున్నారు. చంద్రుడు లేని ఆకాశం వలె మహారాజులేని అయోధ్య శోభావిహీన అయింది. సూర్యవంశపు మహారాజు అయిన దశరథుని మరణమును చూడలేక సూర్యుడు కూడా పడమటి దిక్కున దాక్కున్నాడు. అయోధ్య అంతా చీకట్లు అలముకున్నాయి.
అయోధ్యాకాండ సప్తషష్ఠితమః సర్గ రామాయణంలో ఒక ముఖ్య ఘట్టం. ఈ సర్గలో, రాముడు సీత, లక్ష్మణులతో కలిసి గంగానదిని దాటి దక్షిణ దిశగా పయనిస్తాడు. వారు చిత్రకూట పర్వతానికి చేరుకుంటారు, అక్కడ సురమ్యమైన ప్రకృతిని చూస్తారు. చిత్రకూటంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించి, వారు నివసించేందుకు సిద్ధపడతారు. అయోధ్యలో, రాముని వనవాసం కారణంగా దశరథుడు మరణిస్తాడు. భరతుడు తన తండ్రి మరణవార్త విని కైకేయి మీద కోపంతో ఉన్నా, రాముని తీసుకురావాలనే సంకల్పంతో చిత్రకూటానికి వెళ్లడానికి సిద్ధపడతాడు. ఈ సర్గ రాముని త్యాగం, భరతుని భక్తి, మరియు దశరథుని దుఃఖాన్ని ప్రతిబింబిస్తుంది.
మరునాడు సూర్యోదయము అయింది. మంత్రులు బ్రాహ్మణులు పురప్రముఖులు సభకు వచ్చారు. ఆ సభకు మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి మొదలగు మహామునులు కూడా వచ్చారు. వారందరూ రాజ పురోహితుడైన వసిష్ఠుని చూచి వేర్వేరుగా ఇలా అన్నారు.
“నిన్న రాత్రి మహారాజు దశరథుడు చనిపోయాడు. పెద్దకుమారుడు రాముడు ఇక్కడ లేడు. అరణ్యములకు వెళ్లాడు. లక్ష్మణుడు కూడా రాముని అనుసరించాడు. మిగలిన ఇద్దరు కుమారులు వారి మాతామహుని ఇంటిలో (తాతగారి ఇంటిలో) ఉన్నారు. ప్రస్తుతము అయోధ్యకు రాజు లేడు. రాజు లేకుండా రాజ్యము ఉండకూడదు. రాజులేని రాజ్యములో అన్ని రకములైన అనర్థములు జరుగుతాయి. యజ్ఞయాగములు జరగవు. పుణ్యకార్యములు జరగవు. అరాచకము ప్రబలుతుంది.
రాజు లేని రాజ్యములో న్యాయము చెప్పేవారు ఉండరు. తప్పుచేసిన వారిని శిక్షించే వారు ఉండరు. ఆస్తి తగాదాలు పరిష్కారం కావు. రాజు లేని రాజ్యములో గోవులకు రక్షణ ఉండదు. వ్యవసాయము కుంటుపడుతుంది. రాజులేని రాజ్యములో విద్యాలయాలు, యుద్ధ విద్యను బోధించు శిక్షణాలయాలు మూతబడతాయి. సైన్యము నిర్యీర్యము అవుతంఉది. రాజు లేని రాజ్యములో ప్రజలకు రక్షణ ఉండదు. ప్రజలునిర్భయంగా తిరగడానికి భయపడతారు.
శత్రు రాజులు మన దేశము మీదికి దండెత్తే అవకాశము ఉంది. రాజ్యములోని సమస్త సంపదలు రాజు అధీనములు, ఆ రాజే లేకపోతే ఆ సంపదలకు అధిపతి ఎవరు అనే సందేహము వస్తుంది. రాజు లేని రాజ్యములో దుండగులు చెలరేగి అన్ని రకాల నేరాలకు పాల్పడతారు.రాజ్యములోని ప్రజలకు రాజే తల్లి, తండ్రి, హితుడు. ధర్మాధర్మ విచక్షణ చేసేదిరాజు. అందుకనే రాజును యమ, కుబేర, ఇంద్ర, వరుణులతో పోలుస్తారు. రాజులేని రాజ్యము అంధకార బంధురము అవుతుంది. కాబట్టి ఓ వసిష్ట మహర్షీ! మేము చెప్పిన విషయములను పరిశీలించి, ఇక్ష్వాకు వంశములోని వారిని ఎవరినైనా ఒక ఉత్తముని రాజ్యాభిషిక్తుని చేయడం ధర్మం.” అని పలికారు.
అయోధ్యాకాండ పంచషష్ఠితమః సర్గః రామాయణంలోని ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో దశరథుడు రాముని వనవాసం పంపడంలో ఉద్భవించిన విచారాన్ని వర్ణిస్తారు. కైకేయి మాట ప్రకారం రాముడు తన భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణుడితో కలిసి వనానికి వెళ్ళడానికి సిద్దపడతాడు. ప్రజలు విచారంతో రాముని వెంటవెళ్లి వనవాసం ఆరంభాన్ని చూస్తారు. దశరథుడు రాముని వనవాసం వెళ్ళిపోవడం వల్ల తీవ్ర విషాదంలో ఉంటాడు. రాముడు తండ్రి ఆజ్ఞ పాటిస్తూ, ధర్మాన్ని పాటిస్తూ, వనవాసం చేయడం ప్రారంభిస్తాడు. ఈ సర్గ రాముని ధర్మపాలనను, కుటుంబ బాంధవ్యాలను, బాధ్యతను ప్రతిబింబిస్తుంది.
మరునాడు తెల్లవారింది. రోజూ మాదిరి వంది మాగధులు దశరథ మహారాజును నిద్రలేపడానికి వచ్చారు. వారు దశరథుని గూర్చి మంగళకరములైన వాక్యములు పలుకుతూ స్తోత్రపాఠములు చదువుతున్నారు. గాయకులు దశరథుని వంశ చరిత్రను గానం చేస్తున్నారు. వారి స్తోత్రపాఠములతో కౌసల్యా మందిరము మారుమోగిపోయింది.
పరిచారికలు దశరథుని నిద్రలేపడానికి ఆయన పడుకున్న శయ్య దగ్గరకు వచ్చారు. మరి కొంత మంది మంచి గంధము కలిపిన నీరుతో నిండిన కుండలు తీసుకొని వచ్చారు. వారు దశరథుని శయ్యకు కొంచెం దూరంలో నిలబడ్డారు. సాధారణంగా మహారాజు ఈపాటికి నిద్రలేచేవారు. కాని ఇన్ని స్తోత్రపాఠములు చదువుతున్నా ఆయన అటు ఇటు కూడా కదలడం లేదు. వారికి అనుమానం కలిగింది. కాని అలాగే నిలబడి పోయారు.
ఇంతలో కొంతమంది వృద్ధ పరిచారికలు, దశరథుని వద్ద చనువు ఉన్న వాళ్లు, అక్కడకు వచ్చారు. విషయం తెలుసుకున్నారు. వారు దశరథుని శయ్య దగ్గరకువెళ్లారు. ఆయనను సున్నితంగా తట్టి లేపడానికి ప్రయత్నించారు. ఆయనలో చలనం లేదు. వారికి భయం వేసింది. వణుకుతూ అలాగే నిలబడిపోయారు. వారి మనస్సు కీడు శంకించింది. మహారాజు మరణవార్తను బయటకు చెప్పడానికి వారికి ధైర్యము చాలడం లేదు. వారు పరుగుపరుగున కౌసల్య సుమిత్రల వద్దకు వెళ్లారు. అప్పటికి వారు నిద్రలేవలేదు. అప్పటికి వారికి విషయం బోధపడింది. రాత్రి అందరూ నిద్రించిన తరువాత దశరథుని ప్రాణాలు నిద్రలోనే పోయాయి. ఆవిషయం రాణులకు తెలియదు అని వారికి అవగతమయింది. వారు ఏడుస్తూ
కౌసల్యను నిద్ర లేపారు. వారికి ఏం చెప్పాలో తోచలేదు. దశరధుని వంక చూపించారు. కౌసల్య దశరధుని వద్దకు వెళ్లింది. ఆయన మరణించాడు అనిఅర్థం అయింది. “హా నాధా!” అంట బిగ్గరగా కేకపెట్టి దశరథుని మీద పడిపోయింది. దశరథుని మరణ వార్త అంత:పురము అంతటా వ్యాపించింది. దశరథుని భార్యలందరూ అక్కడకు చేరుకున్నారు. అందరూ బిగ్గరగా ఏడుస్తున్నారు. కైకకు కూడా దు:ఖము కట్టలు తెంచుకొని వస్తోంది. ఆమెకూడా బిగ్గరగా ఏడుస్తోంది. వారి రోదనలతో అంత:పురము నిండిపోయింది. పరిచారికలకు ఏం చెయ్యాలో తోచడం లేదు. అటుఇటు పరుగెత్తుతున్నారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకషష్టితమః సర్గలో, శునాశేప పురాణం ప్రారంభమైంది మరియు విశ్వామిత్ర పురాణంలో భాగంగా శతానంద మహర్షి దీనిని కొనసాగిస్తున్నాడు. రాముడి తాతయ్య అంబరీషుడు ఒక కర్మను చేపట్టినప్పుడు, ఇంద్రుడు ఆ కర్మ యొక్క గుర్రాన్ని బంధించాడు. అప్పుడు అంబరీషుడు ఆ తప్పిపోయిన గుర్రానికి బదులుగా ఒక మానవ-జంతువుని తీసుకురావలసి వచ్చింది. ఎవరూ అందుబాటులో లేనప్పుడు ఋషికా ఋషి కుమారుడు మరియు విశ్వామిత్రుని మేనల్లుడు అయిన శునాశేప అనే వ్యక్తి తన తల్లిదండ్రులకు ధన మార్పిడిని అందజేస్తాడు.
ఆ ప్రకారంగా త్రిశంకు స్వర్గము సృష్టించి త్రిశంకును అక్కడ ఆ తలకిందులుగా నిలిపాడు విశ్వామిత్రుడు. తరువాత యాగమునకు వచ్చిను ఋషులతో ఇలా అన్నాడు. “ఇప్పటి వరకూ నేను దక్షిణ దిక్కున తపస్సు చేసాను. ఇక్కడ అన్నీ విఘ్నములు కలుగుతున్నాయి. ఇంక మీదట పడమర దిక్కున ఉన్న పుష్కర క్షేత్రములో తపస్సు చేసు కుంటాను.”అని అన్నాడు.
ఆ ప్రకారంగా విశ్వామిత్రుడు పశ్చిమ దిక్కుగా ప్రయాణమై వెళ్లాడు. పుష్కర క్షేత్రము చేరుకున్నాడు. అది ఒక పవిత్రమైన వనము. అక్కడ విశ్వామిత్రుడు కేవలము ఫలములు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేసాడు.
అదే కాలంలో అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. అంబరీషుడు ఒక యాగము చేస్తున్నాడు. అంబరీషుడు యాగం చేయడం ఇష్టం లేని ఇంద్రుడు, యాగపశువును దొంగిలించాడు. యాగ పశువు కనపడకపోయేసరికి పురోహితుడు అంబరీషునితో ఇలా అన్నాడు.
“రాజా! యజ్ఞపశువును ఎవరో తీసుకొని పోయారు. నీవు చేసిన అధర్మము వలననే ఈ ప్రకారము జరిగింది. దీనికి ప్రాయశ్చిత్తము చేయాలి. నీవు యజ్ఞపశువును అయినా తీసుకొని రా లేక పోతే పశు వుకు బదులు ఒక మనిషిని అన్నా తీసుకొని రా. అప్పుడు యజ్ఞము పూర్తి అవుతుంది.” అని అన్నాడు పురోహితుడు.
అంబరీషుడు వేల కొలదీ ఆవులు ఇస్తాను ఒక్క మనిషిని ఇవ్వండి అని ఎందరినో అడిగాడు. కాని ఎవరూ ఒప్పుకోలేదు. గ్రామములు, జనపదములు, పురములు ఎన్నో తిరిగాడు. కాని ఫలితం లేక పోయింది. ఆ సమయంలో ఋచీకుడు అనే మహర్షి తన భార్యా పుత్రులతో భృగుతుంగ పర్వతము మీద ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు.
అంబరీషుడు ఆ ఋచీకమహర్షి వద్దకు వెళ్లాడు. జరిగినది అంతా చెప్పాడు. “ ఓ మహర్షీ! నేను నీకు లక్ష ఆవులను ఇస్తాను. నీ కుమారుని నాకు యజ్ఞపశువుగా ఇవ్వగలరా!” అని అడిగాడు.
“లేదు. నేను నా పెద్ద కుమారుడిని ఇవ్వను. తండ్రికి పెద్ద కుమారుడు అంటే ప్రేమ కదా!” అని అన్నాడు.
ఋచీకుని భార్య ఇలా అంది. “నాకు నా చిన్న కుమారుడు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి నేను నా చిన్న కుమారుని ఎట్టి పరిస్థితులలో కూడా ఇవ్వను.” అని చెప్పింది.
ఋచీకునకు ముగ్గురు కుమారులు. పెద్దకుమారుని తండ్రి, చిన్న కుమారుని తల్లి ఇవ్వను అన్నారు. మిగిలింది మధ్యముడైన శునశ్శేపుడు. ఆ శునశ్శేపుడు అంబరీషునితో ఇలా అన్నాడు.
“ఓ అంబరీషా! పెద్ద కుమారుని నా తండ్రి, చిన్న కుమారుని నా తల్లి అమ్మడానికి ఇష్టపడటంలేదు అంటే మధ్యముడనైన నన్ను అమ్మడానికి ఇష్టపడుతున్నారు అని అర్థం కదా. కాబట్టి మీరు వారికి తగిన మూల్యం ఇచ్చి నన్ను తీసుకొని వెళ్లండి.” అని అన్నాడు.
అంబరీషుడు సంతోషంగా ఋచీకునకు లక్షగోవులు మూల్యంగా చెల్లించి శునశేపుని తన వెంట యజ్ఞపశువుగా తీసుకొని వెళ్లాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ గ్రంథాలు జీవన మరియు బ్రహ్మం, మనస్సు మరియు పరమాత్మ, కర్మ మరియు అనుష్ఠాన, జన్మ మరియు మరణం, అహంకారం మరియు మోక్షం వంటి అనేక విషయాలను ఆలోచించేవి. ఉపనిషత్తులు భారతీయ ధర్మ సంస్కృతికి అమూల్య అంశాలు అందిస్తాయి మరియు ప్రత్యేక సాంప్రదాయాలను వ్యాఖ్యానించేవి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నారాయణోపనిషత్తు గురించి తెలుసుకుందాం.
సృష్టి ప్రారంభంలో ఉన్నవాడు పరమేశ్వరుడైన నారాయణు డొక్కడే.’ అతడు సృష్టి చెయ్యాలి అనుకున్నాడు. అప్పుడు నారాయణు
ని శరీరం నుంచి సూక్ష్మరూపి అయిన హిరణ్య గర్భుడు పుట్టాడు. ఆ తరువాత ఆకాశాది పంచ భూతాలు పుట్టినాయి. ఈ రకంగా నారాయణుని నుండి బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, మరీచి, కశ్యపుడు, మొదలైన ప్రజాపతులు, ఏక దశ రుద్రులు, ద్వాద శాదిత్యులు, అష్ట వసువులు, సకల వేదాలు, ఉద్భవించాయి. ఒకటేమిటి చరా చర జగత్తంతా నారాయణుని నుంచే పుట్టింది. ఇవన్నీ అసలు నారాయణుని లోనే ఉన్నాయి. చివరకు నారాయణుని యందే లయమవు తున్నాయి. ఈ తత్వము ఋగ్వేదంలో చెప్పబడింది.
అథ నిత్యో నారాయణః, బ్రహ్మానారాయణ, శివశ్చ నారాయణః, శక్రశ్చ నారా యణః, ద్యావాపృధివ్యౌ చ నారాయణ: కాలళ్ళ నారాయణః, దివశ్చ నారాయణః ఊర్ధ్వంచ నారాయణః, అధశ్చ నారాయణః, అంతర్బహిశ్చ నారాయణః నారాయణ ఏవేద సర్వం, యద్భూతం యచ్చభవ్యం, నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో, నిరాఖ్యాతశ్శుద్ధో దేవ ఏకో నారాయణః, న ద్వితీయో…స్తి కృశ్చిత్, య ఏవం వేద స విష్ణు రేవ భవతి స విష్ణురేవ భవతి, ఏత ద్యజుర్వేద శిరో ధీతే.
నారాయణుడే సత్యము, నిత్యము అయిన వాడు. నారాయణుడే బ్రహ్మ, నారాయణుడే శివుడు, అతడే ఇంద్రుడు, భూమి, ఆకాశము, కాలము, ధశ దిశలు అంతా నారాయణుడే. ఊర్ధ్వ భాగాన ఉన్నది నారాయణుడే, అధో భాగాన ఉన్నది – నారాయణుడే, మధ్య భాగాన ఉన్నది నారాయణుడే, బాహ్యాంభ్యంత రములందంతటా ఉన్నది నారాయణుడే, భూత భవిష్యద్వర్తమానాలు నారా యణుడే. అతడు నిష్కళంకుడు, నిరంజనుడు, నిర్వి కల్పుడు, పరిశుద్ధమైన వాడు, అద్వితీయుడు. అతన్ని వాక్కులతో నిర్వచించ లేము. నారాయణుడు తప్ప వేరెవ్వరూ లేరు. ఈ విషయం గ్రహించినవాడు కూడా నారాయణుడే అవుతాడు. ఈ విషయము యజుర్వేదంలో చెప్పబడింది.
ముందుగా ‘ఓం’ అనాలి. తరువాత ‘నమో’ అనాలి. ఆ తరువాత ‘నారాయణాయ’ అని చెప్పాలి. ఓం నమో నారాయణాయ అనేది ఎనిమి అక్షరాలు గల అష్టాక్షరీ మహామంత్రం. ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించిచేవాడు పూర్ణా యుష్కుడవుతాడు. ధనధాన్యలు పొందుతాడు. స్వర్గాన్ని పొందుతాడు. బ్రహ్మ పదవి పొందుతాడు. చివరకు అమృతత్వాన్ని కూడా పొందుతాడు అని సామవేదం లో చెప్పబడింది.
అకార, ఉకార, మకారములు కలిసి ‘ఓం’ అనే ప్రణవము అవుతున్నది. ఈ ప్రణవానికి అర్థం – ప్రత్యగాత్మ. ఓంకారాన్ని అర్థయుక్తంగా జపించేవాడు. జనన మరణాది సంసార బంధనాల నుండి విముక్తుడవుతాడు. అష్టాక్షరీ మంత్రో పాసనచేసినవాడు వైకుంఠము చేరతాడు.
సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మ హృదయ పద్మంలో ప్రకాశిస్తుంటాడు. పరబ్రహ్మ స్వరూపుడైన నారాయణుడు దేవకీ పుత్రుడు, మధుసూదనుడు. జీవ కోటి యందంతటా అంతర్యామిగా ప్రకాశిస్తున్నాడు. అతడు సర్వవ్యాపి, ఈ జగత్తుకు కారణభూతుడు. తనకు వేరొక కారణము లేనివాడు. ఈ విషయము అధర్వ వేదంలో చెప్పబడింది.
ఈ ఉపనిషత్తును ఉదయం పూట పారాయణ చేస్తే రాత్రి చేసిన పాపం నశించి పోతుంది. సాయంత్రం పారాయణ చేస్తే పగలు చేసిన పాపం నశిస్తుంది. మధ్యాహ్న కాలంలో సూర్యుని ఎదురుగా కూర్చుని ఈ ఉపనిషత్తు పారాయణ చేస్తే పంచ మహా పాతకాలు నశిస్తాయి.
నారాయణోపనిషత్తును పారాయణ చేస్తే నాలుగు వేదాలు పారాయణ చేసిన ఫలితము దక్కుతుంది. అంత్యకాలంలో నారాయణుని సాయుజ్యం లభిస్తుంది. ఈ రకంగా దీన్ని గురించి తెలుసుకున్నవాడు కూడా సాయుజ్యం పొందుతాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ ద్విసప్తతితమః సర్గలో యాగం విజయవంతంగా ముగిసిన తర్వాత, విశ్వామిత్రుడు రాముడు, లక్ష్మణుడిని సిధాశ్రమానికి తీసుకువెళతాడు. యజ్ఞం సమయంలో రాక్షసులు సుబాహు, మారీచు దాడి చేస్తారు. రాముడు సుబాహును వధించి, మారీచును దూరంగా తరిమేస్తాడు. తర్వాత విశ్వామిత్రుడు రాముడు, లక్ష్మణుడిని మిథిలా నగరానికి తీసుకువెళతాడు.
జనకుని మాటలు విన్న వసిష్ఠుడు విశ్వామిత్రునితో సంప్రదించాడు. తరువాత ఇరువురు మహాఋషులు జనకునితో ఇలా అన్నారు.
“ఓ జనకమహారాజా! అటు ఇక్ష్వాకు వంశము, ఇటు విదేహ వంశమూ రెండూ విశిష్టమైనవే. ఒకదానికి ఒకటి తీసిపోవు. ఈ రెండు వంశములు కలవడం అత్యంత శుభదాయకము. నీ కుమార్తె అయిన సీతను రామునికి, నీ తమ్ముడు కుశధ్వజుని కుమార్తె అయిన ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహం చెయ్యడం వారి వంశ గౌరవములకు, రూప సంపదలకు తగిఉన్నది.
ఈ సందర్భములో ఒక మాట చెప్పాలని మాకు అనిపించింది. నీ తమ్ముడు కుశధ్వజుడు ధర్మాత్ముడు. ఆయనకు ఊర్మిళ కాకుండా ఇంకా ఇరువురు కుమార్తెలు ఉన్న సంగతి మాకు తెలుసు. ఆయన ఇరువురు కుమార్తెలను దశరథుని కుమారులైన భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహము జరిపించండి. రెండు వంశములు ధన్యమవుతాయి. దశరథుని కుమారులైన భరత శత్రుఘ్నులు అంద చందములలోనూ, రూప లావణ్యములలోనూ, బల పరాక్రమములలోనూ రామ లక్ష్మణు లకు ఏ విధంగానూ తీసి పోరు. ఈ వివాహములతో మీ ఇరువురి రాజ్యములు ధృడమైన సంబంధ బాంధవ్యుములు కలిగి ఉంటాయి.” అని పలికారు.
ఆ మాటలు విన్న జనకుడు, వసిష్ఠ విశ్వామిత్రులతో ఇలా అన్నాడు.’ .” ఓ మునిశ్రేష్ఠులారా! మీ సంబంధములతో నేను నా
తమ్ముడు ధన్యులమయ్యాము. నా తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు అయిన మాండవి, శ్రుతకీర్తి లను దశరథుని కుమారులు భరతుడు శత్రుఘ్నులకు ఇచ్చి వివాహము చేయుటకు నేను నాతమ్ముడు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాము. ఈ నాలుగు వివాహములు ఒకే రోజున ఒకే సమయములో ఒకే వివాహ వేదిక మీద జరిపిస్తాను.
ఉత్తర ఫల్గునీ నక్షత్రమునకు సంతాన ప్రదాత అయిన భగుడు దేవత. ఆ శుభనక్షత్రములో ఈ నాలుగు వివాహములు వైభవంగా జరిపించడానికి అనుమతి ఇవ్వండి. మీరు ఇరువురు దగ్గర ఉండి ఈ శుభకార్యములను జరిపించండి. ఈ వివాహములతో అయోధ్య, విదేహ రాజ్యములు ఒకటవుతాయి.” అని వినయంతో పలికాడు జనకుడు.
ఆమాటలు విన్న దశరథుడు ఇలాఅన్నాడు. “ఓ జనక మహారాజా! నీవు, నీ సోదరుడు కుశధ్వజుడు సద్గుణ సంపన్నులు. ధర్మపరులు. మీతో సంబంధము నాకు ఎంతో ఆనంద దాయకము. నేను ఇంక మా నివాసమునకు వెళ్ళెదను. నా కుమారుల చేత వివాహమునకు ముందు జరుగు శ్రాద్ధకర్మలను, దానములను నిర్వర్తింప జేస్తాను.” అని పలికాడు.
తరువాత వసిష్ఠుడు విశ్వామిత్రులతో కూడా తన నివాసమునకు వెళ్లాడు. ఆరోజు తన కుమారుల చేత వేదోక్తంగా శ్రాద్ధకర్మలను నిర్వర్తింపజేసాడు. మరునాడు స్నాతక వ్రతమును జరిపించాడు. ఒక్కొక్క కుమారునిచేత లక్ష గోవులను బ్రాహ్మణులకు దానము ఇప్పించాడు. ఆ విధంగా దశరథుడు తన కుమారులచేత బంగారు తొడుపులు వేసిన కొమ్ములు కలవి, లేగ దూడలతో పాలు ఇచ్చే పాడి ఆవులు నాలుగులక్షల ఆవులను ఇంకా ఇతర ద్రవ్యములను గోదానంగా బ్రాహ్మణులకు ఇప్పించాడు.
(ఈ సర్గలో పెళ్లికి ముందు శ్రాద్ధ కర్మలు జరిపించారు అని ఉంది. మనం ఈ రోజుల్లో పెళ్లిళ్లు ముందు పెద్దలకు పెట్టుకుంటాము అని అంటారు కదా. శ్రాద్ధ కర్మలు అంటే శుభకార్యము జరిపించే ముందు పెద్దలను పూజించడం అని అర్థం చేసుకోవచ్చు)
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ సప్తతితమః సర్గలో రాముడు విశ్వామిత్రునితో కలిసి సిధాశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ పుత్రకామేష్ఠి యాగం జరుగుతుంది. యాగం సమయంలో రావణుడు, కుంభకర్ణుడు, ఇతర రాక్షసులు యాగాన్ని భగ్నం చేయడానికి వస్తారు. రాముడు, లక్ష్మణుడు వీరిని వధించి యాగాన్ని రక్షిస్తారు. యాగం విజయవంతంగా ముగిసిన తర్వాత, అగ్నిదేవుడు దశరథ మహారాజుకు పాయసం అందిస్తాడు, దానిని సంతానము కోసం పంపిస్తారు.
మరునాడు ఉదయం జనకుడు అగ్ని కార్యము, యజ్ఞము పూర్తిచేసాడు. తనపురోహితుడు అయిన శతానందునితో ఇలా అన్నాడు.
“శతానందులవారూ! మా తమ్ముడు శతధ్వజుని, ఆయన కుటుంబమును ఈ వివాహమునకు తీసుకొని వచ్చుటకు తగిన ఏర్పాట్లు చేయండి.” అని చెప్పాడు. శతానందుడు వెంటనే జనకని సోదరుడు కుశధ్వజుని తీసుకొని వచ్చుటకు సాంకాశ్యనగరమునకు దూతలను పంపారు. వారు వాయువేగ మనోవేగములతో సాంకాశ్యనగరము చేరుకున్నారు. జనక మహారాజు సందేశమును వినిపించారు. తమతో మిథిలకు రమ్మని ఆహ్మానించారు.
వెంటనే కుశధ్వజుడు అన్నగారి ఆజ్ఞమేరకు బంధుమిత్ర పరివారములతో మిథిలకు వచ్చాడు. జనకునికి అభివాదము చేసి పురోహితుడు శతానందునికి నమస్కరించాడు. అన్నదమ్ములు ఇరువురూ ఆలోచించుకొని తమ మంత్రులలో శ్రేష్టుడు అయిన సుదాముని దశరథమహారాజును విడిది నుండి బంధుమిత్రులతో సహా తీసుకొని వచ్చుటకు పంపారు.
సుదాముడు దశరథుడు విడిది చేసి ఉన్న చోటికి వెళ్లాడు.
దశరథునితో ఇలా అన్నాడు.
“దశరథమహారాజా! తమకు శుభం కలుగుగాక! మా మహారాజు జనకుడు తమరిని సపరివారసమేతంగా తోడ్కొని రమ్మని నన్ను నియోగించాడు. తమరిని చూచుటకు మా మహారాజు గారు ఆతురతగా ఉన్నారు.” అని పలికాడు.
సుదాముని ఆహ్వానము అందుకున్న దశరథుడు తన పురోహితులు, ఋషులు వెంట రాగా, జనకుని వద్దకు వెళ్లాడు. జనకుని చూచి దశరథుడు ఇలా అన్నాడు.
“ఓ జనక మహారాజా! మా కులగురువు, వసిష్ఠుడు అని మీకు తెలియును కదా! బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారి అనుమతితో మా కులగురువు వసిష్ఠుడు తమరికి మా వంశ వృక్షము గురించి, మా వంశములోని పూర్వ రాజుల గురించి వివరంగా చెప్పగలడు.” అని పలికి దశరథుడు వసిష్ఠునని వంక చూచాడు.
దశరథుని మాటలు విన్న వసిష్ఠుడు లేచి నిలబడ్డాడు. సభాసదులను, జనకుని, సదానందుని చూచి ఇలా అన్నాడు.
“ఓ జనకమహారాజా! సభాసదులారా! ఇప్పుడు నేను ఇక్ష్వాకు వంశము గురించి చెప్పబోవుచున్నాను. సావధానముగా వినండి. అవ్యక్తము నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మ దేవుడు శాశ్వతుడు, నిత్యుడు, అవ్యయుడు. ఆ బ్రహ్మ కుమారుడు మరీచి. మరీచి కుమారుడు కశ్యపుడు. కశ్యపుని కుమారుడు సూర్యుడు. సూర్యునికి మనువు పుట్టాడు. ఆ మనువు ప్రజాపతి అయ్యాడు. ఆ మనువు కుమారుడే ఇక్ష్వాకువు. ఆ ఇక్ష్వాకువు అయోధ్యను మొట్టమొదటి సారిగా పరిపాలించాడు. ఆయన పేరుతోనే ఇక్ష్వాకు వంశము ఆ వించింది.
ఇక్ష్వాకుని కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు బాణుడు. బాణుడు అమితమైన తేజస్సు పరాక్రమము కలవాడు. బాణుని కుమారుడు అనరణ్యుడు. అనరణ్యుని కుమారుడు పృథువు. పృథువు కుమారుడు త్రిశంకువు. త్రిశంకువు కుమారుడు దుందుమారుడు. దుందుమారుని కుమారుడు యువనాశ్వుడు. యువనాశ్వుని కుమారుడు మాంధాత. ఆయన గొప్ప చక్రవర్తి. మాంధాత కుమారుడు సుసంధి. సుసంధికి ఇరువురు కుమారులు వారు ధ్రువసంధి, ప్రసేనజిత్తు. ధ్రువసంధి కుమారుడు భరతుడు. భరతుని కుమారుడు అసితుడు.
హైహయ రాజులైన హైహయుడు, తాలజంఘుడు, శశిబిందు అనువారు అసితునితో శతృత్వము వహించారు. వారందరూ కలిసి అసితుని యుద్ధములో ఓడించారు. అసితుడు రాజ్యము వదిలిపెట్టి తన మంత్రులతోనూ కొద్దిపాటి సేనతోనూ హిమవత్పర్వతము వద్ద ఉన్న భృగుప్రస్రవణము అనే ప్రదేశములో నివసిస్తున్నాడు.
ఆ సమయములో అతని ఇద్దరు భార్యలు గర్భవతులు. ఆ భార్యలిద్దరికీ పడదు. అందులో ఒకామె రెండవ ఆమెకు గర్భస్రావము అగుటకు విషప్రయోగము చేసింది. ఆ సమయములోనే భృగు వంశములో పుట్టిన చ్యవనుడు అక్కడకు రావడం జరిగింది. అసితుని భార్య ఆయనకు నమస్కరించి తనకు తేజశ్శాలి అయిన కుమారుని ప్రసాదించమని కోరింది. అప్పటికే ఆమె మీద విషప్రయోగము జరిగింది. తన సవతికి విషము పెట్టిన కాళింది అనే అసితుని భార్య కూడా చ్యవనునికి నమస్కరించి తనకు కూడా మంచి పుత్రుడు పుట్టాలని కోరింది.
చ్యవనుడు మొదట నమస్కరించిన ఆమెను చూచి “ఓ భాగ్యశాలీ! నీ గర్భములో మహా బలవంతుడైన కుమారుడు పెరుగుతున్నాడు. అతడు మహా వీరుడు. తేజశ్శాలి. ఆ కుమారుడు నీ శరీరములో ఉన్న విషముతో కూడా జన్మించగలడు.” అని పలికాడు. చ్యవనుని మాటలు నిజం చేస్తూ ఆమె ఒక తేజశ్శాలి అయిన కుమారుని ప్రసవించింది. ఆ కుమారుడు విషముతో కూడా జన్మించుటచే సగరుడు అనే పేరుతో పిలువబడ్డాడు.
ఆ సగరుని కుమారుడు అసమంజుడు. అసమంజుని కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుని కుమారుడు దిలీప చక్రవర్తి. దిలీపుని కుమారుడు భగీరథుడు. ఆ భగీరథుడే గంగను భూమిమీదికి తీసుకొని వచ్చాడు. ఆ భగీరథుని కుమారుడు కకుత్తుడు. కకుత్తుని కుమారుడు రఘువు. ఆయన పేరుమీదనే రఘువంశము మొదలయింది.
రఘువు కుమారుడు ప్రవృద్ధుడు. ఆ ప్రవృద్ధుడు శాప వశాత్తు మనిషి మాంసము తినే రాక్షసుడయ్యాడు. ఆయనకు కల్మాషపాదుడు అనే పేరుకూడా ఉంది. ఆ కల్మాషపాదుని కుమారుడు శంఖణుడు. శంఖణుని కుమారుడు సుదర్శనుడు. సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు. అగ్నివర్ణుని కుమారుడు శ్రీఘ్రగురు. శ్రీఘ్రగురు కుమారుడు మరువు. మరువు కుమారుడు ప్రశుక్రుడు. ప్రశుక్రుని కుమారుడు అంబరీషుడు.
అంబరీషుని కుమారుడు నహుషుడు. నహుషుని కుమారుడు నాభాగుడు. నాభాగుని కుమారుడు అజుడు. అజుని కుమారుడే అయోధ్యానగరాధిపతి దశరథమహారాజు. ఈ దశరథమహారాజు పుత్రులే రామలక్ష్మణులు.
ఓ జనక మహారాజా! వీరి వంశక్రమము వింటివి కదా! వీరు మొదటి నుండీ విశుద్ధమైన వంశములో పుట్టినవారు. పరమ ధార్మికులు. ఇక్ష్వాకు వంశములో పుట్టిన వారు. వీరులు. సత్యసంధులు. ఇటువంటి సర్వలక్షణ సమన్వితులను నీ కుమార్తెలు వరించినారు. అందువలన నీవు నీ కుమార్తెలను రామలక్ష్మణులకు ఇచ్చి వివాహము చేయడం శుభప్రదము.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకోనషష్ఠితమః సర్గలో, విశ్వామిత్రుడు త్రిశంకు యొక్క వైదిక కర్మను చేపట్టాడు మరియు వేద పండితులందరినీ ఆహ్వానించడానికి శిష్యులను పంపుతాడు. వశిష్ఠుడు మరియు అతని కుమారులు తప్ప చాలా మంది ఋషులు వచ్చారు. ఇంకా, వశిష్ట కుమారులు విశ్వామిత్ర మరియు త్రిశంకు యొక్క ఈ ఆచారాన్ని అపహాస్యం చేసారు. విశ్వామిత్రుడు విసుగు చెంది వశిష్ట కుమారులపై శాపనార్థాలు పెట్టాడు.
ఛండాలరూపంలో ఉన్న త్రిశంకు మాటలు విన్న విశ్వామిత్రుడు జాలి పడ్డాడు. అతని తో ఇలా అన్నాడు.
“ఓ త్రిశంకూ! బాధ పడకు. నిన్ను, నీ కోరికను, నేను స్వాగతిస్తున్నాను. భయపడకు. నీ వంటి ధర్మాత్మునకు నేను సాయ పడతాను. నీచేత యాగము చేయిస్తాను. ఎంతో మంది మహా ఋషులను నీవు చేయబోయే యాగమునకు ఆహ్వానిస్తాను. నిన్ను ఇదే శరీరముతో అంటే ఈ ఛండాల శరీరముతో స్వర్గమునకు పంపిస్తాను. నీవు నా శరణు పొందావు. నీకు ఏం భయంలేదు. స్వర్గము నీ అరిచేతిలో ఉన్నట్టే.” అని అన్నాడు విశ్వామిత్రుడు.
వెంటనే తన కుమారులను పిలిచాడు. యజ్ఞమునకు కావలసిన వస్తువులు సమకూర్చమని ఆదేశించాడు.
విశ్వామిత్రుడు తన శిష్యులను పిలిచాడు. “మీరందరూ వెళ్లి విశ్వామిత్రుడు త్రిశంకు చేత యజ్ఞము చేయిస్తున్నాడు. అందరూ రండి అని బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను అందరినీ ఆహ్వానించండి. వారిని మీ వెంట తీసుకొని రండి.”అని ఆజ్ఞాపించాడు.
విశ్వామిత్రుని ఆజ్ఞమేరకు ఆయన శిష్యులు అందరూ నలు దిక్కులకు వెళ్లారు. బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను ఆహ్వానించి వారిని తమ వెంట తీసుకొని వచ్చారు. ఆ విషయమును విశ్వామిత్రునికి విన్నవించుకున్నారు.
“గురువు గారూ! తమరి ఆదేశము మేరకు అందరికీ మీరు చేయించబోవు యజ్ఞమును గూర్చి తెలిపి తీసుకొని వచ్చాము. కాని మహోదయుడు, వసిష్ఠుని కుమారులు రాలేదు. మీరు చెప్పిన మాటలు విన్న వారు ఈ విధంగా అన్నారు.
‘ఒక ఛండాలుడు యజ్ఞము చేయాలని సంకల్పించడం. దానిని ఒక క్షత్రియు డైన విశ్వామిత్రుడు చేయించడం. బాగుంది. ఆ యజ్ఞములో అర్పించు హవిస్సులు దేవతలు, ఋషులు ఎలా స్వీకరిస్తారు. క్షత్రియుడైన విశ్వామిత్రుని మాటలు విని ఛండాలుడైన త్రిశంకు చేచి భోజనము చేసినవారు బ్రాహ్మణులైనా, ఋషులైనా వారు స్వర్గానికి ఎలావెళతారు? ఇది సంభవమా!’
అని చాలా దుర్భాషలాడారు గురువు గారూ!” అని విశ్వామిత్రుని శిష్యులు విశ్వామిత్రునితో అన్నారు.
ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు కోపంతో ఊగిపోయాడు. “ఎంతో పవిత్రంగా తపస్సు చేసుకుంటున్న నన్ను వారు ఇన్ని మాటలు అంటారా! వసిష్టకుమారులు అందరూ భస్మమైపోతారు. వారందరూ యమలోకములో శవములను తింటూ ఏడు వందల జన్మలు పడి ఉంటారు. వారందరూ కుక్కమాంసము తినే ముష్టిక జాతిలో పుడతారు. నన్ను పరిహసించిన మహోదయుడు నిషాదుడుగా పుడతాడు. జంతువును చంపి తింటూ చాలాకాలము నిషాదుడుగా జీవిస్తాడు.” అని శపించాడు విశ్వామిత్రుడు.
అయోధ్యా కాండ సర్గ 52 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. మరునాడు తెల్లవారింది. రాముడు లక్ష్మణుని చూచి ఇలా “లక్ష్మణా! మనము గంగానదిని దాటి ఆవలి ఒడ్డుకు చేరుకోవాలి.గుహునితో చెప్పి గంగానదిని దాటుటకు ఒక నావను సిద్ధం చేయమని చెప్పు.” అని అన్నాడు. లక్ష్మణుడు వెంటనే గుహుని పిలిచి ఒక నావను సిద్ధము చేయమని చెప్పాడు. వెంటనే గుహుడు రామలక్ష్మణులు గంగానదిని దాటుటకు ఒక నావను సిద్ధం చేసాడు. అప్పుడు రాముడు గుహునితో ఇలా అన్నాడు.
మరునాడు తెల్లవారింది. రాముడు లక్ష్మణుని చూచి ఇలా “లక్ష్మణా! మనము గంగానదిని దాటి ఆవలి ఒడ్డుకు చేరుకోవాలి.గుహునితో చెప్పి గంగానదిని దాటుటకు ఒక నావను సిద్ధం చేయమని చెప్పు.” అని అన్నాడు. లక్ష్మణుడు వెంటనే గుహుని పిలిచి ఒక నావను సిద్ధము చేయమని చెప్పాడు. వెంటనే గుహుడు రామలక్ష్మణులు గంగానదిని దాటుటకు ఒక నావను సిద్ధం చేసాడు. అప్పుడు రాముడు గుహునితో ఇలా అన్నాడు.
“మిత్రమా! నన్ను నావను ఎక్కించుము” అని అన్నాడు. గుహుడు రామలక్ష్మణులను సీతను నావ ఉన్న ప్రదేశమునకు తీసుకొని వెళుతున్నాడు. అప్పుడు సుమంత్రుడు రాముని చూచి ఇలాఅన్నాడు. “రామా! మీరు గంగానదిని దాటి ఆవల ఒడ్డుకు వెళుతున్నారు. నేనేమి చేయాలి. సెలవివ్వండి.” అని అడిగాడు. రాముడు సుమంత్రుని వీపుమీద చేయి వేసి ఆప్యాయంగా అన్నాడు.
నిమిరి “సుమంత్రా! నీవు అయోధ్యకు తిరిగి పొమ్ము. మా తండ్రి దశరథుని జాగ్రత్తగా చూచుకొమ్ము. నీవు చేసిన సాయమునకు కృతజ్ఞుడను. ఇంక నేను కాలి నడకన అరణ్యములలోకి వెళ్లెదను. నీవు అయోధ్యకు వెళ్లుము.” అని అన్నాడు రాముడు.
అప్పుడు సుమంత్రుడు రాముని చూచి ఇలాఅన్నాడు.
“రామా! అయోధ్యకు రాజువై ఉండి కూడా, నీవు సామాన్యుని వలె అడవులలో తిరుగుతున్నావు. తండ్రి ఆజ్ఞప్రకారము ఇటువంటి పని నీవు మాత్రమే చేయగల సమర్థుడవు. కాని నీకు వచ్చిన కష్టము సామాన్యమైనది కాదు. జీవితములో ఇలాంటి కష్టములు కూడా సంభవిస్తుంటే ఇంక వేదాధ్యయనము చేసి గానీ, మంచి ప్రవర్తన కలిగి ఉండి గానీ ప్రయోజనమేమి.
రామా! నీవు చేసిన వనవాసము వృధాపోదు. ఈవనవాసమునకు ప్రతిఫలముగా నీకు సద్గతులు లభిస్తాయి. కాని మేమే దురదృష్ట వంతులము. నిన్ను అడవుల పాలుచేసిన ఆ కైక చేతి కింద బ్రతుక వలసిన దౌర్భాగ్య ము పట్టినది. ఏం చేస్తాము.” అని రాముని చూచి ఏడ్చాడు సుమంత్రుడు.
రాముడు సుమంత్రుని చూచి ఇలా అన్నాడు. “సుమంత్రా! అన్ని తెలిసినవాడవు నీవే ఇలా దుఃఖిస్తే ఎలాగ. మా ఇక్ష్వాకు వంశమునకు, ముఖ్యంగా మా తండ్రిగారికి నీవు ఆప్తుడవు. కాబట్టి నీవు మా తండ్రిగారి మంచి చెడ్డలు చూడాలి కదా. ఆ కైకను సంతోషపెట్టడానికి మా తండ్రిగారు ఏమి చెప్పినా, ఆయన మనస్సు బాధపడ కుండా నీవు ఆపనులు అన్నీ చేయాలి కదా! ప్రస్తుతము దశరథుడు అయోధ్యకు రాజు ఆయన మాట పాలించడం మన అందరి కర్తవ్యము. దశరథమహారాజు అనుచితమైన పనులు చెప్పినా
అవి చేయడం మన కర్తవ్యము. కాబట్టి నీవు అయోధ్యకు పోయి దశరథ మహారాజుకు, నేను నమస్కరించినట్టుగా చెప్పి, ఇంకా నా మాటలుగా ఇలా చెప్పు. “తండ్రిగారూ! నేను గానీ, లక్ష్మణుడు గానీ, సీత గానీ, మేము అడవులలో నివసించవలసి వచ్చినదే అని ఏ మాత్రమూ బాధపడటం లేదు.
అరణ్యవాసము పదునాలుగుసంవత్సరములు పూర్తిచేసుకొని మేము అయోధ్యకు తిరిగి వస్తాము. అప్పుడు మేమందరమూ నీ కళ్ల ఎదుటనే ఉంటాము.” అని నా మాటగా మా తండ్రిగారికి చెప్పు.
అలాగే మాతల్లి కౌసల్యను, కైకను, ఇతర తల్లుల యోగక్షేమము లను అడిగినట్టు చెప్పు.
నేను, సీత, లక్ష్మణుడు మా తల్లి కౌసల్యకు పాదాభి వందనము చేసామని చెప్పు. మా తండ్రిగారికి మేమందరమూ పాదాభివందనము చేసామని చెప్పు. వీలైనంత త్వరగా మా తమ్ముడు భరతుని తీసుకొని వచ్చి అయోధ్యకు రాజుగా అభిషేకము చేయమని నామాటగా మా తండ్రిగారికి చెప్పు. రాజ్యాభిషిక్తుడు అయిన తరువాత భరతునితో ఈ విధంగా నా మాటగా చెప్పు.
“భరతా! నీకు నీ తల్లి కైక ఎలాగో. నా తల్లి కౌసల్య, లక్ష్మణుని తల్లి సుమిత్రకూడా అలాగే. మన తండ్రిగారి కోరిక అనుసరించి నీవు అయోధ్యకు పట్టాభిషిక్తుడవై ఇహపరములలో సుఖాలు అనుభవించు.” ఈ విధంగా భరతునికి చెప్పు. సుమంత్రా! ఇంక నీవు అయోధ్యకు బయలు దేరు.” అని అన్నాడు.
రాముడు చెప్పి మాటలన్నీ విన్న సుమంత్రుడి దుఃఖానికి అంతులేదు. రామునితో ఇలా అన్నాడు. “రామా! నేను నీ అనుచరుడను. భక్తుడను. కాని, నీవు చెప్పిన పనులన్నీ నేను చేయలేను. నన్ను క్షమించు. నిన్ను ఈ అడవులలో విడిచి పెట్టి నేను ఒంటరిగా అయోధ్యకు వెళ్లలేను. రాముడు నా రథము మీద అడవులకు వస్తున్నప్పుడు, అయోధ్యా వాసులు ఆ రథం వెంట పరుగెత్తి ఎంతో దు:ఖించారు.
ఇప్పుడు రాముడు లేకుండా నేను రథాన్ని మాత్రం అయోధ్యకు తీసుకొని వెళితే వారి గుండెలు బద్దలవుతాయి. ఎందుకంటే అయోధ్యావాసుల గుండెల్లో నీవు కొలువుదీరి ఉన్నావు. వారు దూరంగా ఉన్నా అనుక్షణం నిన్ను తలచుకుంటూనే ఉంటారు. ఓ రామా! నీవు అరణ్యమునకు నారథము మీద వచ్చునప్పుడు అయోధ్యాపౌరులు ఎంతగా ఏడ్చారో, ఇప్పుడు నీవు లేకుండా వచ్చిన రథమును చూచి అంత కన్నా ఎక్కువ ఏడుస్తారు. కాబట్టి నీవు లేని రథమును నేను అయోధ్యకు తీసుకొని వెళ్లలేను.
అది సరే! నేను కౌసల్య వద్దకు పోయి ఏమని చెప్ప మంటావు? నీ కుమారుని అరణ్యములలో విడిచివచ్చాను అని చెప్పమంటావా! అది నా వల్లకాదు. ఆమాట చెప్పి నీ తల్లిని మరింత దుఃఖపెట్టలేను. కాబట్టి నేను అయోధ్యకు తిరిగి వెళ్లలేను. నీ వెంటనే ఇక్కడే ఉంటాను. అలా కాకుండా నన్ను వదిలిపెట్టి నీవు వెళ్లిపోతే, నేను ఇక్కడే చితి పేర్చుకొని అగ్నిలో దూకుతాను. ఓ రామా! నేను నీకు ఎలాంటి ఇబ్బంది కలిగించను. నీకు సాయంగాఉంటాను.
అనువైన మార్గములలో నిన్ను రథం మీద తీసుకొని వెళతాను. ఇంతకాలము నీవు ఎక్కిన రథము తోలాను. ఇప్పుడు నీ వెంట ఉండి నీతో వనవాససుఖము అనుభవిస్తాను. ఓ రామా! నేనే కాదు. నీకు సేవచేసిన ఈ హయములు కూడా ఉత్తమ గతులు పొందగలవు. నాకు స్వర్గలోక సుఖములు కూడా వద్దు.
నీతోపాటు అరణ్యములలో ఉంటాను. నీవు లేని అయోధ్యలో ఉండలేను. వనవాసము పూర్తి అయిన తరువాత మనమందరమూ ఇదే రథము మీద అయోధ్యకు పోదాము. ఓ రామా! నీ వెంట ఉంటే ఈ పదునాలుగు సంవత్సరములు క్షణాల్లా గడిచిపోతాయి. కాబట్టి నన్ను నీ వెంట ఉండేటట్టు అనుగ్రహించు.” అని వేడుకున్నాడు సుమంత్రుడు.
ఆ మాటలువిన్న రాముడు సుమంత్రునితో ఇలా అన్నాడు. “నీకు నా మీద ఉన్న భక్తి, గౌరవము నాకు తెలియవా చెప్పు. అయినా నిన్ను అయోధ్యకు ఎందుకు పంపుతున్నానో తెలుసా! నేను నిజంగా వనవాసమునకు వెళ్లాను అని నీవు కైకకు చెబితే ఆమె నమ్ముతుంది. లేకపోతే మహారాజు దశరథుడు నన్ను వేరేచోటికి పంపి వనవాసము నకు పంపాను అని అబద్ధం చెప్పాడు అని అనుకుంటుంది.
కాబట్టి నీవు వెళ్లి మా వనవాసము సంగతి చెప్పి, కైక మనసులో ఉన్న శంకను పోగొట్టాలి.
నీ మాట నమ్మి కైక తన కుమారునికి పట్టాభిషేకము చేయిస్తుంది. లేకపోతే అయోధ్య అనాధగా ఉండిపోతుంది. కాబట్టి నీవు అయోధ్యకు వెళ్లక తప్పదు. అయోధ్యకు పోయి నీకు ఏమేమి
చెయ్యమని చెప్పానో అవన్నీ చేయి.” అని పలికాడు రాముడు. తరువాత గుహుని చూచి రాముడు ఇలా అన్నాడు. “మిత్రమా! నేను జనావాసములలో నివసించరాదు. కేవలము అరణ్యములలో ఆశ్రమములలో ముని వేషధారణలో నివసించాలి. కాబట్టి నేను లక్ష్మణుడు జటలు ధరించాలి. దానికి అనువగు మర్రిపాలు తెప్పించు.” అని అన్నాడు.
వెంటనే గుహుడు మర్రిపాలు తెప్పించాడు. ఆ మర్రిపాలను రాముడు లక్ష్మణుడు తమ వెంట్రుకలకు పట్టించారు. తన కేశములను పైకి ఎత్తి ముని కుమారుల వలె కట్టుకున్నారు. అప్పుడు రామక్ష్మణులు ముని కుమారులవలె శోభించారు. తరువాత రాముడు వెంటనే త్వర త్వరగా గంగానది వైపు వెళ్లాడు. సీత, లక్ష్మణుడు రాముని అనుసరించారు. అందరూ పడవను సమీపించారు.
“లక్ష్మణా! ముందు నీవు పడవలో ఎక్కి తరువాత సీతను ఎక్కించుము.” అని అన్నాడు. కాని లక్ష్మణుడు ముందు సీతను పడవలో ఎక్కించి తరువాత తాను ఎక్కాడు. తరువాత రాముడు పడవలో ఎక్కాడు. పడవ మెల్లిగా గంగానదిలో కదిలింది. రాముడు, సీత, లక్ష్మణుడు గంగానదీమతల్లికి నమస్కరించారు. రాముడు గుహునికి, సుమంత్రునికి వీడ్కోలు చెప్పాడు.
పడవ గంగానది మధ్యకు చేరుకుంది. అప్పుడు సీతాదేవి గంగానదికి నమస్కరించి ఇలా మొక్కుకుంది. “తల్లీ గంగా మాతా! నేను, రాముడు, లక్ష్మణుడు పద్నాలుగేళ్లు వనవాసము చేసి సుఖంగా తిరిగి వచ్చేట్టు దీవించు. తిరిగి వచ్చునపుడు నిన్ను పూజిస్తాను. నీదీవెనలు ఫలించి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకము చేసుకున్న నాడు, నీకు సంతోషము కలిగేటట్టు బ్రాహ్మణులకు లక్షలాది గోవులను, వస్త్రములను, దానంగా ఇస్తాను.
బ్రాహ్మణులకు భోజనము పెడతాను. నేను వనవాసము నుండి తిరిగి వచ్చిన తరువాత నీకు నూరు కుండలతో సురను (మద్యమును), మాంసాహారమును సమర్పించుకుంటాను. నీకే కాదు, నీ తీరమున గల సమస్త దేవాలయములలోనూ పూజలు చేయిస్తాను. మేము క్షేమంగా అయోధ్యకు తిరిగి వచ్చేట్టు దీవించు.” అని గంగా దేవికి మొక్కుకుంది సీత.
పడవ గంగానది దక్షిణ తీరమునకు చేరింది. సీతారామ లక్షణులు పడవ దిగి అడవిలోకి నడుచుకుంటూ వెళ్లారు. రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “లక్ష్మణా! మనము జనావాసములలో ఉన్నను, జనములు లేని ప్రదేశములో ఉన్నను, మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనలను మనం రక్షించుకోవాలి. ఈ అరణ్యములో జన సంచారము కనపడటంలేదు.
వన్యమృగములనుండి మనలను మనం రక్షించుకోవాలి. అందుకని నీవు ముందు నడువు. నేను నీ వెనక నడిచెదను. మనమధ్య సీత ఉంటుంది. మనము ఇద్దరము ఒకరిని ఒకరు రక్షించుకుంటూ సీతను కూడా రక్షించాలి. లక్ష్మణా! మనకు ముందుజాగ్రత్త అవసరము. పరిస్థితి దాటిపోయిన తరువాత, చింతించి ప్రయోజనము లేదు. సీతకు వనవాసములోని కష్టముల గురించి తెలియదు. ఇంక మీదట తెలుసుకుంటుంది. సీతా! ఈ అరణ్యములలో ఉద్యానవనములు చేయి
ఉండవు. అగాధమైన లోయలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా నడవాలి.”అని అన్నాడు రాముడు. రాముడు చెప్పినట్టు లక్ష్మణుడు ముందు నడుస్తూ దారిని చూపిస్తున్నాడు. తరువాత సీత, ఆమె వెనక రాముడు నడుస్తున్నారు.
వీరి సంగతి ఇలాఉంటే అక్కడ సుమంత్రుడు, పడవ కంటికి కనపడినంతవరకూ రాముని చూస్తూ ఉన్నాడు. పడవ కనుమరుగు కాగానే, దుఃఖంతో కుమిలిపోయాడు. రథమును తీసుకొని అయోధ్యకు వెళ్లాడు.
రాముడు, సీతా లక్ష్మణులతో అడవులలో ప్రయాణం చేసి వత్సదేశము చేరుకున్నాడు. ఇంతలో చీకటి పడింది. రామ లక్ష్మణులు అడవిలో దొరికే వరాహములను, దుప్పులను, చంపి వాటి మాంసమును సేకరించారు. అందరూ ఒక పెద్ద వృక్షము మొదట విశ్రమించారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ పంచచత్వారింశః సర్గ, “పౌరయాచనమ్”, రామాయణంలోని ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, అయోధ్య నగర ప్రజలు రాముడిని తిరిగి రావలసిందిగా అభ్యర్థిస్తారు. రాముడు వనవాసానికి వెళ్లిపోవడం తో, అయోధ్య ప్రజలు దుఃఖంలో మునిగిపోయి, అతడిని తిరిగి తీసుకురావడం కోసం ప్రయత్నిస్తారు. వారు రాముడి నిష్కళంకత, ధర్మపరిపాలన మరియు ప్రజల పట్ల ఉన్న ప్రేమను వర్ణిస్తూ, అతడి అనువర్తితాన్ని రాముడికి విన్నవిస్తారు. ఈ సర్గలో, ప్రజలు రాముడి పట్ల ఉన్న అభిమానాన్ని, ఆరాధనను, మరియు అయోధ్య ప్రజలు ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్పష్టంగా చూపుతుంది.
అయోధ్యలో పరిస్థితి ఇలా ఉంట, అక్కడ రాముడు రథము మీద అరణ్యములకు వెళుతున్నాడు. రాముని రథం వెంట ఎంతో మంది అయోధ్యాపౌరులు రాముని అనుసరిస్తున్నారు. రాముడు ఎంత చెప్పినా వారు వినకుండా ఆయన రథమును వెంబడిస్తున్నారు. రాముని మీద వారికి ఉన్న ప్రేమ వారిని రాముని నుండి విడదీయ లేక పోయింది. తన తండ్రి మాట నిలబెట్ట డానికి రాముడు అడవులకు వెళుతున్నప్పుడు, రామునికి తోడుగా మేము కూడా అడవులకు ఎందుకు వెళ్లకూడదు అని వారు అనుకున్నట్టున్నారు.
తన వెంటవచ్చు అయోధ్యాపౌరులను చూచి రాముడు తన రథమును ఆపించాడు. వారిని చూచి ఇలా అన్నాడు. “ఓ అయోధ్యా ప్రజలారా! మీరు నా మీద చూపుతున్న ప్రేమాభిమానములకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. కాని నాది ఒక కోరిక. నా మీద మీరు
చూపుతున్న ప్రేమాభిమానములు ఇదేరీతిలో భరతుని మీద కూడా చూపించండి. అలా చేస్తే నాకు ఇంకా ఆనందం కలుగుతుంది.
భరతుడు నా తమ్ముడు. సద్గుణవంతుడు. నా కాన్న బాగుగా రాజ్యమును పరిపాలించగలడు. నా తమ్ముడు భరతుడు వయసులో నా కన్నా చిన్న వాడయినా జ్ఞానములో నా కన్నా పెద్దవాడు. నా కంటే పరాక్రమ వంతుడు. అయోధ్యకు తగిన రాజు అనిపించుకుంటాడు. భరతుడు అన్నివిధములా రాజు కాదగినవాడు.
మనందరికీ ప్రభువు దశరథమహారాజు. ఆయన తన కుమారుడు భరతుని యువరాజుగా ప్రకటించాడు. మనకు మన మహారాజు మాటలను మన్నించాలి. నేను సంతోషంగా అడవులకు వెళ్లాలంటే మీరందరూ మన మహారాజు దశరథుడు కంటనీరు పెట్టకుండా చూచుకోవాలి. కాబట్టి మీరందరూ వెనుకకు మరలండి.” అని అన్నాడు రాముడు.
కాని వారు రాముని మాట వినలేదు. మౌనంగా ఉన్నారు. కొంతమంది వృద్ధ బ్రాహ్మణులు రాముని చూచి ఇలాఅన్నారు. “రామా! నీవు అరణ్యములకు వెళ్లవద్దు. రాముని రథమునకు కట్టిన ఓ హయములారా! మీరు ముందుకు సాగకండి. మన రాముని తిరిగి అయోధ్యకు తీసుకొని రండి. ధర్మాత్ముడు, సకల సద్గుణ సంపన్నుడు అయిన రాముని మీరు అయోధ్యకు తీసుకొని రావలెనే గానీ, అడవులకు తీసుకొని వెళ్లకూడదు.” అని దీనంగా పలికారు.
వారి దీనాలాపములను విన్న రాముడు రథం దిగాడు. సీతను, లక్ష్మణుని కూడా రథం దిగమన్నాడు. నడుచుకుంటూ అడవులకు వెళుతున్నాడు. అయోధ్యావాసులు కూడా ఆయన వెంట నడిచివెళుతున్నారు. వారు రామునితో ఇలా అన్నారు.
“ఓ రామా! మేమంతా బ్రాహ్మణులము. నీవు బ్రాహ్మణులకు హితుడవు. అందుకని మేమంతా నీ వెంట వచ్చుచున్నాము. మేము ప్రతిరోజూ అర్చించే అగ్నులను మా వెంట మోసుకొని వస్తున్నాము. మేము వాజపేయము చేసినప్పుడు మాకు లభించిన తెల్లని గొడుగులు(ఛత్రములు) కూడా మా వెంట వస్తున్నాయి. ప్రస్తుతము నీకు ఛత్రము లేదు. నీవు మా ఛత్రముల నీడలో విశ్రాంతి తీసుకో.
మాకు వేదాధ్యయనము, వేద పఠనము తప్ప మరోవ్యాపకము లేదు. ప్రస్తుతము నీ వెంటవచ్చుటయే మాకు వ్యాపకము. నీవు ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాము. మా వెంట వేదములు ఉంటాయి. మా భార్యలు మమ్ములను తలుచుకుంటూ అయోధ్యలో ఉండగలరు. నీవు అయోధ్యకు తిరిగి రావలెనని మా నిర్ణయము. మా నిర్ణయము ధర్మసమ్మతము. ధర్మసమ్మతమైన మా నిర్ణయమును ధర్మాత్ముడవైన నీవే మన్నించకపోతే వేరువాళ్లు ఎవరు మన్నిస్తారు. మేమందరమూ వృద్ధులము. మా వెంట్రుకలు తెల్లబడ్డాయి. మా ఆశలు కూడా తెల్లబడనీయకు. అయోధ్యకు మరలిరా!
నీ వెంబడి వచ్చుచున్న బ్రాహ్మణులు చాలామంది ఎన్నో యజ్ఞములు మొదలు పెట్టారు. వారందరూ తమ తమ యజ్ఞములను వదిలి వచ్చారు. వారు తాము మొదలు పెట్టిన యజ్ఞములు పూర్చిచేయాలంటే నీవు అయోధ్యకు తిరిగిరావాలి. వారు నీ వెంట అడవులకు వస్తే, వారు తాము మొదలు పెట్టిన యజ్ఞములను ఎలా పూర్తి చేస్తారు.
ఓ రామా! మేమే కాదు. అయోధ్యలో ఉన్న చరాచరములు, సకల జీవరాసులు అన్నీ నీ రాక కొరకు ఎదురుచూస్తున్నాయి.
రామా! ఆ వృక్షములను చూడు. అవి కూడా నీ వెంట అడవులకు రావలెనని ఎంతో కుతూహలముగా ఉన్నాయి కాని వాటి వేళ్లు భూమిలో పాతుకొని పోవడం వల్ల కదలలేక, నీకోసం విలపిస్తున్నాయి. ఆ వృక్షములే కాదు, ఆ వృక్షముల మీద గూళ్లు కట్టుకొని నవసిస్తున్న పక్షలు కూడా ఆహారము మాని నీ కోసం జాలిగా ఎదురు చూస్తున్నాయి. నిన్ను వెనుకకు మరలమని వేడుకుంటున్నాయి.”అని ఆ బ్రాహ్మణులు రాముని వెంట నడుస్తున్నారు.
రాముడు అడవులకు వెళ్లడం తనకు కూడా ఇష్టంలేదు. అన్నట్టు తమసానది వాళ్లకు అడ్డంగా వచ్చింది. అందరూ తమసా నదీ తీరము చేరుకున్నారు. సుమంత్రుడు రథమునకు కట్టిన గుర్రములను విప్పి వాటికి స్నానం చేయించి నీరు త్రాగించాడు. వాటికి తిండి పెట్టాడు.