మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకోనషష్టితమః సర్గం, రామాయణంలోని ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో రాముడు, సీత మరియు లక్ష్మణులు అరణ్యంలో నివసిస్తున్నప్పుడు సీత హరణం జరుగుతుంది. రావణుడు మారీచుని సహాయంతో సీతను మాయాజాలంతో మోసపుచ్చి హరిస్తాడు. మారీచుడు స్వర్ణమృగం రూపంలో వస్తుంది, దాన్ని వెంటపడి తీసుకురావాలని సీత కోరుతుంది. రాముడు, లక్ష్మణుడు ఆ మృగాన్ని వేటాడడానికి వెళ్లడం వల్ల సీతను రక్షించడానికి ఎవరూ లేకుండా పోతారు.
అప్పటి దాకా సీత ఆశ్రమంతో ఉంటుంది అనే ఆశతో వడివడిగా ఆశ్రమానికి వచ్చారు రామలక్ష్మణులు. కాని సీత ఆశ్రమంలో లేదు అని తెలిసిన తరువాత సీతను రాక్షసులు అపహరించడం కానీ, చంపడం కానీ చేసి ఉంటారని రూఢి చేసుకున్నాడు రాముడు.
ఇప్పుడు లక్ష్మణుని చూచి సూటిగా ఒక ప్రశ్న వేసాడు. “లక్ష్మణా! నేను నీ మీద ఉన్న నమ్మకంతో, విశ్వాసంతో, సీతను నట్టడివిలో వదిలి వచ్చాను కదా! మరి నా ఆజ్ఞలేకుండా నీవు ఆమెను ఎందుకు వదిలివచ్చావు? ఇది నీకు భావ్యమా!” అని సూటిగా ప్రశ్నించాడు రాముడు.
అప్పుడు లక్ష్మణుడు రామునితో జరిగింది జరిగినట్టు పూసగుచ్చినట్టు వివరించాడు. “రామా! నేను స్వయంగా సీతను విడిచి రాలేదు. నేను నా ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోలేదు. నీ మాట శిరసావహించి సీతను కాపాడుతున్నాను. కానీ సీత హా సీతా హా లక్ష్మణా అన్న నీ అరుపులు విని నన్ను నీ వద్దకు పొమ్మని, నిన్ను రక్షించమనీ ప్రేరేపించింది. ఆమె బలవంతంతోనే నేను ఆమెను విడిచి నీ వద్దకు వచ్చాను.
నీవు అరిచినట్టు అరుపులు వినపడగానే, సీత తల్లడిల్లిపోయింది. నన్ను చూచి “లక్ష్మణా! మీ అన్న ఆపదలో ఉన్నాడు. వెళ్లు. ఆయనను రక్షించు.” అని నన్ను తొందరపెట్టింది. అయినా నేను కదలలేదు. నన్ను వెళ్లమంటూ అనేక సార్లు తొందరపెట్టింది. అప్పటికీ నేను ఆమెతో ఇలా అన్నాడు. “సీతా! రాముని భయపెట్టే, రామునికి అపకారం చేసే వాడు ఈ భూమి మీద లేడు. నీవు నిశ్చింతగా ఉండు. అది రాముని కంఠస్వరము కాదు. ఎవరో రాముని అనుకరించారు.
ఓ సీతా! దేవతలు కూడా రాముని రక్షణ కోరతారే! అటువంటి రాముడు ఒకరి రక్షణ కోరతాడా! అసంభవము. ఇది రాక్షసులు పన్నాగము. రాక్షసమాయ. దీనికి మీరు ఒక సాధారణ స్త్రీ వలె భయపడవద్దు. నిశ్చింతగా ఉండండి. ఓ సీతా! రాముడి బలపరాక్రమ ములు నాకు తెలుసు. రాముని జయించగలవాడు ముల్లోకములలో లేడు. ఇంక ఈ సామాన్య రాక్షసుడు ఎంత?” అని ఆమెను అనునయించాను.
కాని రామా! సీత నన్ను అనకూడని పరుషమైన మాటలు అన్నది. “నీ సోదరుడు మరణించిన తరువాత నువ్వు నన్నుపొందడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది. నీవు ఎన్నటికీ నన్ను పొందలేవు. నీవు భరతుడు కలిసి ఈ పన్నాగము పన్నినట్టు ఉన్నారు. లేకపోతే రాముడు అంతగా అరుస్తున్నా ఎందుకు వెళ్లవు? నీవు అవకాశం కొరకు ఎదురు చూస్తున్న శత్రువువు. నీవు రాముని వెంట ఉంటూ రాముని చావు కోరుకుంటున్న కనపడని శత్రువు.” అని నన్ను నానారకాలుగా నిందించింది.
ఆ నిందలు భరించలేక నేను సీతను విడిచి నీకోసం రావలసి వచ్చింది.” అని వివరించాడు లక్ష్మణుడు.
అయినా రాముడు ఆ సమాధానంతో తృప్తి చెందలేదు. “ఏది ఏమైనా లక్ష్మణా! నీవు నా ఆజ్ఞను ధిక్కరించి సీతను అడవిలో విడిచి రావడం మంచిది కాదు. నా బలపరాక్రమములు తెలిసి కూడా, సీత ఆవేశంతో కోపంతో ఏవేవో అన్నదని, నీవు సీతను ఒంటరిగా అడవిలో విడిచి రావడం ఏం బాగుంది? నీవు సీతను నిస్సహాయ స్థితిలో విడిచి రావడం నాకు ఏ మాత్రం సంతోషంగా లేదు.
ఏవో నాలుగు పరుష వాక్కులు సీత పలికిందని అలా ఒంటరిగా విడిచి పెట్టి వస్తావా! అంటే అంది. ఏమయింది. ఆమెకు కోపం వచ్చింది సరే! నీవు కూడా ఎందుకు కోపం తెచ్చుకున్నావు. నా ఆజ్ఞను ఎందుకు ధిక్కరించావు. నీవు అన్ని విధాలా తప్పు చేసావు. సరిదిద్దుకోలేని తప్పు చేసావు.
నేను వెంబడించిన మృగాన్ని నేను నా బాణంతో కొట్టాను. వెంటనే వాడు రాక్షసుడిగా మారి కిందపడ్డాడు. నేను అరిచినట్టు నా గొంతుతో అరిచాడు. ఆ అరుపులను సీత గుడ్డిగా నమ్మింది. ఆమె కోపాన్ని తట్టుకోలేక నీవు ఆమెను వదిలి వచ్చావు. అంతే కదా! దాని ఫలితంగా నాసీత నాకు దూరం అయింది.” అని రాముడు లక్ష్మణుని చేతలను తప్పు పట్టాడు.
రామాయణంలోని కిష్కింధాకాండలో, రాముడు, లక్ష్మణుడు సుగ్రీవుడిని కలుసుకోవడానికి కిష్కింధకు చేరుకుంటారు. సుగ్రీవుడు, తన అన్న వాలితో విభేదించి, రాముడి సహాయంతో తన రాజ్యాన్ని తిరిగి పొందాలని కోరుకుంటాడు. రాముడు సీతాన్వేషణలో సుగ్రీవుడికి సహాయం చేయడానికి అంగీకరిస్తాడు. హనుమంతుడు రాముడి ప్రాముఖ్యతను గుర్తించి, సుగ్రీవుని దగ్గరకు తీసుకువెళ్ళి పరిచయం చేస్తాడు. సుగ్రీవుడు తన సైన్యంతో రాముడికి సహకారం అందించడానికి సిద్ధమవుతాడు. ఈ సర్గలో సుగ్రీవ-రాముల మధ్య స్నేహం, సీతాన్వేషణ, వాలిని సవాలు చేయడం మొదలైన అంశాలు ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి.
రామ లక్ష్మణులు పంపా సరస్సును సమీపించారు. ఆ సరస్సు చూడటానికి చాలా మనోహరంగా ఉంది. సరస్సునిండా పద్మములు,కలువలు వికసించి ఉన్నాయి. ఆ సరస్సు అందాలు చూడగానే రాముని హృదయం అంతా బాధతో నిండి పోయింది.
“లక్ష్మణా! ఈ సరస్సు చూడు ఎంత హృదయానందాన్ని కలిగిస్తూ ఉందో. కాని సీతా వియోగంతో బాధపడుతున్న నాకు ఈ సరస్సు అందాలు ఏమాత్రం సంతోషాన్ని కలిగించడం లేదు. సీతా వియోగంతో బాధపడుతున్న నాకు ఈ ప్రకృతి అందాలు ఇంకా దు:ఖమును ఎక్కువ చేస్తున్నాయి. నా మనోవ్యధ ఎప్పుడు తీరుతుందో ఏమో! కాని లక్ష్మణా! ఈ వనములో ఉన్న పుష్పముల మీదినుండి వీచు గాలి మనకు మార్గాయాసమును పూర్తిగా తొలగించినది.
లక్ష్మణా! ఆ కోయిలలు చూడు ఎలా కూస్తున్నాయో. సీత కూడా ఆ కోయిల కూతలు విని నన్ను పిలిచి ఆ కోయిల కూతలు నాకూ వినిపించేది. నా సీత నాకు దొరకని పక్షంలో, నా సీతను నేను చూడని పక్షంలో నేను బతికి ఉండటం వృధా! ఇటువంటి సుందర దృశ్యములు ఎన్ని చూచినా సీతను చూచిన దానితో సాటి రావు కదా! పైగా ఈ వసంత ఋతువు దృశ్యములు, ఈ మలయమారుతము, వసంత శోభ నా వ్యధను ఎక్కువ చేస్తున్నాయి. నా సీతను ఆ రాక్షసుడు ఎత్తుకొని పోకపోయి ఉంటే నేను కూడా సీత తో కలిసి ఈ వసంత ఋతువు శోభను తనివిదీరా అనుభవించేవాడిని కదా!
లక్ష్మణా! సీత బతికి ఉంటే, సీత ఉన్న చోటున కూడా ఈ వసంత ఋతువు ఉంటుంది కదా! సీత కూడా నా మాదిరే విరహవేదన అనుభవిస్తూ ఉంటుంది కదా! నా మాదిరే సీత కూడా ఈ వసంత శోభను అనుభవించలేదు కదా! అవును. ఈ మనోహర దృశ్యములు ఆమెకు కూడా ఏమాత్రం ఆనందాన్ని కలిగించలేవు. ఎందుకంటే నేను, సీత దేహాలు వేరైనా మా మనసులు ఒకటే. నా మనస్సు ఆమె మీద, ఆమె మనస్సు నా మీదా లగ్నం అయి ఉన్నాయి.
లక్ష్మణా! నేను సీత కలిసి ఉన్నప్పుడు మా ఇద్దరికీ ఆహ్లాదమును కలిగించిన ఈ మలయమారుతము ప్రస్తుతము నాకు అగ్ని వీచికలవలె తాకుతూ ఉన్నాయి. లక్ష్మణా! చూచావా! ఆ కాకి ఎలా అరుస్తూ ఉందో! నాకు మరలా సీతా సంయోగం కలుగుతుందని చెబుతూ ఉన్నట్టు లేదూ! సీతకు పద్మములు అంటే ఎంతో ఇష్టం. ఈ పంపా సరోవరములో ఉన్న పద్మములను చూచి సీత ఎంత సంతోషించేదో కదా! సీత లేకుండా నేను ఈ పద్మముల శోభను అనుభవించలేకున్నాను.
లక్ష్మణా! సీత నా దగ్గరగా ఉన్నప్పుడు నాకు ఏ యే వస్తువులు, దృశ్యములు ఆనందాన్ని కలిగించాయో అవే వస్తువులు, అవే దృశ్యములు ఇప్పుడు నాకు భేదాన్ని కలిగిస్తున్నాయి. లక్ష్మణా! సీత నాకు కనపడితే, సీతతో సహా నేను ఇక్కడనే స్థిరనివాసము ఏర్పరచు కొనవలెనని కోరికగా ఉంది. సీతతో సహా ఇక్కడ ఉంటే, నాకు దేవేంద్రపదవి కూడా అక్కరలేదు అనిపిస్తూ ఉంది. అయోధ్యకు కూడా తిరిగి వెళ్లను. ఇక్కడే ఉండిపోతాను. ఈ వనసీమలలో, ఈ సరోవర తీరములలో, పచ్చికబయళ్లలో సీతతో విహరిస్తూ ఉంటే, నాకు ఏ చింతా ఉండదు. ఏ వస్తువూ కావాలని అనిపించదు. ఈ అందమైన పంపాసరస్సులో నేను సీత జలకాలాడటం కన్నా ఆనందం ఏముంటుంది చెప్పు.
లక్ష్మణా! నేను లేకుండా నా సీత ఇంకా ప్రాణాలతో ఉంటుందంటావా! ఏమో! ఆలోచించే కొద్దీ నా మనసు వికలం అవుతూ ఉంది. సీత తండ్రి జనకమహారాజు వచ్చి నా సీత ఏదీ అని అడిగితే ఏమని చెప్పాలో అర్థంకావడం లేదు. నా దురదృష్టం కొద్దీ నేను రాజ్యాన్ని పోగొట్టుకొని అడవులకు వచ్చాను. సీత కూడా నా వెంట రావాలా! ఒకవేళ వచ్చినా రాక్షసుల చేత అపహరింపబడాలా! అంతా నా దురదృష్టం కాకపోతే మరేమిటి! రాజ్యభ్రష్టుడు, బుద్ధిలేని వాడు అయిన నన్ను నమ్ముకొని నా వెంట వచ్చిన సీత లేకుండా నేను ఎలా జీవించేది!
లక్ష్మణా!సీత ఎంత మధురంగా మాట్లాడేది. నాతో పరిహాసమాడేది. అటువంటి సీత పలుకులు మరలా ఎప్పుడు వింటానో కదా! నాతో పాటు అడవిలో ఎన్నో కష్టములు అనుభవించుచున్నా. సీత తాను ఏ కష్టములు పడనట్టుగా ఆనందించుచున్నట్టు కనపడేది. నా తో ఎంతో సంతోషంగా మాటలాడుతూ ఉండేది. అటువంటి సీతను వదిలి నేను ఒంటరిగా అయోధ్యకు వెళితే, నా తల్లి కౌసల్య “రామా! నా కోడలు సీత ఎక్కడ. ఆమెను ఎక్కడ వదిలి వచ్చావు”అని అడిగితే నేను ఏమని సమాధానము చెప్పాలి.
ఓ లక్ష్మణా! నేనుసీత లేకుండా అయోధ్యకు రాలేదు. కాబట్టి నీవు ఒంటరిగా అయోధ్యకు వెళ్లు. నేను ఈ అరణ్యములలోనే సీతా వియోగంతో ఆ తనువు చాలిస్తాను.” అని విలపించాడు రాముడు.
ఆ మాటలు అన్నీ ఓపిగ్గా విన్నాడు లక్ష్మణుడు. “ఓ రామా! ఉ త్తమకులములో పుట్టిన వాడవు. అమిత పరాక్రమవంతుడవు. నీవే ఇలా అధైర్యపడితే ఎలా! నీ వంటి నిర్మల బుద్ధి కలవారికి ఈ ప్రకారము మందబుద్ధితో ఆలోచించడం శోభించదు. రామా! మనకు ఎక్కువ ప్రియమైన వాళ్లు దూరమైనపుడు దుఃఖముకలగడం సహజము. దానికి ఉపాయం వెతకాలి కానీ, ఇలా దు:ఖించడం వలన ప్రయోజనము లేదు. ముందు మనము ఆ రావణునిజాడ కనుక్కోవాలి. వాడు ఆకాశంలో ఉన్నా పాతాళంలో ఉన్నా వాడిని వదిలేది లేదు. వాడు సీతను తెచ్చి అప్పగించాలి. లేకపోతే మనచేతిలో చావాలి.
అన్నిటికన్నా ముందు నీవు ధైర్యంగా ఉండాలి. ఈ దీనత్వాన్ని వదిలిపెట్టాలి. కార్యరంగంలోకి దూకాలి. దానికి తగిన ఉత్సాహమును తెచ్చుకోవాలి. మానవ శరీరానికి ఉత్సాహాన్ని మించిన బలం వేరొకటి లేదు. ఉత్సాహవంతునకు లభించనిది ఏదీ లేదు. ఉత్సాహవంతుడు ఓటమిని ఎరుగడు. కాబట్టి రామా! నీవుకూడా ఉత్సాహమును తెచ్చుకో. సీతను తిరిగి సాధించుటకు ప్రయత్నము చెయ్యి. నీ పరాక్రమాన్ని గుర్తుకు తెచ్చుకో. నీ శోకాన్ని పక్కనపెట్టు. మనస్సును నిగ్రహించుకో.” అని రామునికి హితబోధ చేసాడు లక్ష్మణుడు.
లక్ష్మణుని మాటలతో రాముడు తన శోకాన్ని విడిచిపెట్టాడు. ధైర్యము, ఉత్సాహాన్ని తెచ్చుకున్నాడు. రాముడు, లక్ష్మణుడు పంపాసరోవరమును దాటారు.
వీరిద్దరినీ ఋష్యమూక పర్వతము పైనుండి సుగ్రీవుడు అనే వానర రాజు చూస్తున్నాడు. సుగ్రీవునికి భయం పట్టుకుంది. ఆ మానవులు ఇద్దరూ వాలి పంపగా తనకోసం వచ్చారేమో, తనను చంపుతారేమో అని భయపడ్డాడు. ఆ భయంతో కుంగిపోయాడు సుగ్రీవుడు. వెంటనే సుగ్రీవుడు తన వెంట ఉన్న వానరులతో సహా అక్కడి నుండి పారిపోయాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ అష్టపంచాశః సర్గః (58వ సర్గ), రాముడు లక్ష్మణుడితో కలిసి సీత కోసం ఆత్రంగా అన్వేషణ చేస్తూ, మార్గమధ్యంలో జటాయువును కలుస్తాడు. జటాయువు, రావణుడు సీతను అపహరించిన విషయాన్ని రాముడికి తెలియజేయడానికి ప్రయత్నిస్తాడు. తన చివరి శ్వాసలో జటాయువు సీత అపహరణ వివరాలు చెప్పి మరణిస్తాడు. జటాయువు త్యాగానికి రాముడు దుఃఖిస్తూ, అతనికి అర్హమైన అంత్యక్రియలు నిర్వహిస్తాడు.
అప్పటిదాకా రాముడు లక్ష్మణుడిని ఏం జరిగింది అని అడగలేదు. తాను ఏం చేసిందిచెప్పాడు. ఇప్పుడు అడగడం మొదలెట్టాడు.
“లక్ష్మణా! నేను నిన్నుసీతకు రక్షణగా ఉంచాను కదా! నా సీతను ఒంటరిగా ఎందుకు వదిలి వచ్చావు? నా సీత ఇప్పుడు ఎక్కడ ఉంది.? పర్ణశాలలో క్షేమంగా ఉందా! ఉందని నీవు చెప్పగలవా? నేను అరణ్యాలకు వస్తున్నా కష్టనష్టాలకు ఓర్చి నన్ను అనుసరించిన సీత ఇప్పుడు ఎక్కడ ఉంది? సీత లేకపోతే నేను క్షణకాలం కూడా జీవించలేను కదా! మరి నా సీత ఎక్కడుందో చెప్పవా?
లక్ష్మణా! నాకు సీత తోడిదే లోకం. సీత లేకుండా నేను స్వర్గాధిపత్యము కూడా అంగీకరించను. అటువంటి నా సీతను ఏమి చేసావు? సీత జీవించి ఉంటుందంటావా! నా సీత మరణిస్తే, ఆమె దుఃఖంతో నేను మరణిస్తే, మమ్ములను అడవులకు పంపిన కైక ఆనందిస్తుందేమో కదా! అప్పుడు నాతల్లి కౌసల్య, కైకకు ఊడిగం చేస్తుందేమోకదా!
లక్ష్మణా! నిజంచెప్పు. సీత జీవించి ఉంది అంటేనే నేను ఆశ్రమానికి వస్తాను. లేకపోతే ఇక్కడే ప్రాణ త్యాగం చేస్తాను. నేను ఆశ్రమం చేరగానే సీత ఎదురొచ్చి చిరునవ్వుతో నన్ను పలకరించక పోతే నేను బతికి ఉండీ వృధా! లక్ష్మణా! సీత ఇంకా జీవించి ఉందంటావా! లేక నువ్వు ఇటు రాగానే రాక్షసులు ఆమెను చంపి తిని ఉంటారా! ఒకవేళ సీత బతికి ఉంటే, నా వియోగబాధతో ఎంతగా పరితపిస్తూ ఉందో కదా!
లక్ష్మణా! మారీచుడు హా లక్ష్మణా! అని అరిచినప్పుడు నీకు కూడా నాకు అపకారం జరిగిందని అనుమానం కలిగిందా! నేను అరిచినట్టు వినపడ్డ అరుపులు విని నిన్ను సీత పంపగా నా వద్దకు వచ్చావా! లేక నువ్వే ఆ రాక్షసుని అరుపులు విని నాకేమైనా ఆపద జరిగిందని సీతను ఒంటరిగా వదిలి వచ్చావా!
ఏది ఏమైనా నీవు ఈ అరణ్యంలో సీతను ఒంటరిగా వదిలి వచ్చి చాలా పెద్ద తప్పు చేసావు. నీవు రావడంతో రాక్షసులకు మన మీద పగ తీర్చుకోడానికి ఆస్కారం కల్పించినట్టయింది. ఎందుకంటే, నేను ఖరుడిని, దూషణుడిని, రాక్షసులను చంపానుకదా. అందుకని నా మీద ప్రతీకారము తీర్చుకోడానికి రాక్షసులందరూ పొంచి ఉన్నారు. నీవు కూడా లేని సమయం చూచి రాక్షసులుసీతను చంపి ఉంటారు!
లక్ష్మణా! చూచావా! అడవిలో ఉన్నా నాకు ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో! ఇదంతా నా పూర్వజన్మ పాపఫలం. లేకపోతే నాకే ఇన్ని కష్టాలు రావాలా!” అని కాసేపు తనలో తాను అనుకుంటూ, కాసేపు లక్ష్మణుని చూచి మాట్లాడుతూ వడి వడిగా ఆశ్రమం వేపు నడుస్తున్నావు రాముడు.
రామ లక్ష్మణులు పర్ణశాలను చేరుకున్నారు. పర్ణశాల వద్ద సందడి లేదు. నిర్మానుష్యంగా ఉంది. నడిచి నడిచి అలసి పోయిన ముఖంతో రాముడు ఆశ్రమం చుట్టు పక్కల సీత కోసం ఆతురతగా వెదుకుతున్నాడు. సీత ఎక్కడా కనపడలేదు. చేతులతో ముఖం కప్పుకొని కూలబడ్డాడు రాముడు.
“లక్ష్మణా! నేను అనుకున్నట్లే జరిగింది.” అని రోదిస్తున్నాడు రాముడు.
అయోధ్యాకాండలోని నవతితమః సర్గ అంటే 90వ సర్గ. ఈ సర్గలో, భరతుడు రాముని పాదుకలను సత్కారంతో తీసుకొని, సపరివారం అయోధ్యకు తిరిగి వచ్చాడు. భరతుడు రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి, వాటి మార్గదర్శకత్వంలో రాజ్యాన్ని పాలిస్తానని ప్రతిజ్ఞ చేయడు. భరతుడు తన తండ్రి దశరథ మహారాజు మరణం, రాముని అరణ్యవాసం వంటి ఘోర సంఘటనల కారణంగా మనోవ్యధతో బాధపడతాడు. అతను నందిగ్రామంలో నివసిస్తూ, తాను రాముని ప్రతినిధిగా మాత్రమే ఉండి, రాముడు తిరిగి వచ్చే వరకు రాజ్యాన్ని రక్షించాలని నిర్ణయించుకుంటాడు. ప్రజలందరూ భరతుని ధర్మనిష్ఠ, విధేయతను ప్రశంసిస్తూ, రాముడు తిరిగి వచ్చే రోజును ఎదురుచూస్తారు.
భరద్వాజ మహర్షి ఆశ్రమము క్రోసెడు దూరము ఉండగానే భరతుడు తన సేనలను పరివారమును అక్కడే ఆగిపొమ్మన్నాడు. ఆయుధములను విడిచిపెట్టాడు. తాను పట్టుబట్టలు ధరించాడు. కులగురువు వసిష్ఠుడు ముందు నడుస్తూ ఉండగా, తన మంత్రులు వెనక రాగా, కాలి నడకన భరద్వాజ మహర్షి ఆశ్రమమునకు వెళ్లాడు.
భరద్వాజుని ఆశ్రమము కనుచూపు దూరములో ఉండగానే మంత్రులను ఆగిపొమ్మన్నాడు. వసిష్ఠుడు వెంటరాగా ఆశ్రమమునకు వెళ్లాడు. వసిష్ఠుని చూడగానే భరద్వాజుడు సంభ్రమంతో ఎదురు వచ్చాడు. అర్ఘ్య పాద్యములు ఇచ్చిసత్కరించాడు. భరతుని ఆదరంతో ఆహ్వానించాడు. భరతునికి అర్ఘ్యము పాద్యము ఇచ్చాడు. ఇరువురికీ ఫలములు ఇచ్చాడు. భరతుని యోగక్షేమములు కనుక్కున్నాడు భరద్వాజుడు. భరతుడు భరద్వాజునితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! మేమంతా కుశలమే. మీరు మీ ఆశ్రమ వాసులు ఏ బాధా లేకుండా తపస్సు చేసుకుంటూ ఉన్నారు కదా!” అని అడిగాడు భరతుడు.
“మహారాజా! మాకు ఏ బాధా లేదు. ప్రశాంత జీవనము గడుపుతున్నాము. కానీ అయోధ్యలో ఉండి రాజ్యపాలన చేయవలసిన వాడివి, ఇలా అడవుల వెంట తిరగడానికి కారణమేమి? నీ అన్న రాముడు తండ్రి ఆదేశమును పాలించుటకు అరణ్యములకు వెళ్లాడు. అదినాకు తెలుసు. కాని నీవు ఇక్కడకు ఎందుకు వచ్చావు. రామునికి ఏదైనా అపకారము తలపెడుతున్నావా? లేకపోతే రాజ్యమును విడిచి ఇక్కడకు రావడానికి కారణమేమి?” అని అడిగాడు భరద్వాజుడు.
భరద్వాజుడు కూడా తనను అనుమానించడం చూచి తట్టుకోలేకపోయాడు భరతుడు. తన తల్లి చేసిన పాపపు పనికి తాను శిక్ష అనుభవిస్తున్నాడు అని అనుకున్నాడు మనసులో. భరద్వాజునితో ఇలా అన్నాడు.
“ఓ మహర్షీ! తమరు కూడా నన్ను అనుమానిస్తే నాకు ఇంక మరణమే శరణ్యము. రాముని అరణ్యవాసములో నా ప్రమేయము ఎంతమాత్రమూ లేదు. నన్ను నమ్మండి. ఆ సమయములో నేను అయోధ్యలో లేను. నేను లేని సమయమున నా తల్లి కైక నా తండ్రిని అనుచితములైన వరములు కోరి నాకు ఇంత చేటు తెచ్చిపెట్టినది. రాముని అడవులపాలు చేసినది. నాకు రాజ్యము లభిస్తుంది అని నాకు ఎంత మాత్రము సంతోషముగా లేదు. నా తల్లి కోరికను నేను అనుమతించను. ఆచరించను.
ప్రస్తుతము నేను ఇక్కడకువచ్చినకారణము… రాముని ప్రార్థించి, అర్థించి, అయోధ్యకు తీసుకొని వెళ్లి ఆయనకు పట్టాభిషేకము జరిపించడం. అదే నా ప్రధమ కర్తవ్యం. కాబట్టి రాముడు ప్రస్తుతము ఎక్కడ ఉన్నాడో నాకు తెలుపండి.”అని అడిగాడు. భరతుని మాటలు విన్న భరద్వాజుడు అతని పట్ల ప్రసన్నుడయ్యాడు.
“రాకుమారా! నీవు ఇక్ష్యాకు వంశములో పుట్టవలసినవాడవు. ధర్మాత్ముడవు. ధర్మము కోసరం అయాచితముగా వచ్చిన రాజ్యమును త్యజిస్తున్నావు. మరింత శ్లాఘనీయుడవు. నీ మనసులో మాట నాకు తెలియును. కానీ నీ శీలమును పదిమందికి తెలియజేయుట కొరకు ఆవిధంగా అడిగాను. ఇప్పుడు నీ ధర్మప్రవర్తన లోకమునకు వెల్లడి అయింది. రాముడు, లక్ష్మణుడు సీత ఎక్కడ ఉన్నారో నాకు తెలియును. ప్రస్తుతము వారు చిత్రకూట పర్వతము మీద నివసిస్తున్నారు. నీవు ఈరోజు ఇక్కడే విశ్రాంతి తీసుకొని రేపు చిత్రకూటమునకు వెళ్లవచ్చును.” అని పలికాడు భరద్వాజుడు. భరద్వాజుని మాట మన్నించి భరతుడు ఆ రాత్రికి ఆయన ఆశ్రమములోనే విశ్రాంతి తీసుకున్నాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ సప్తపంచాశః సర్గః (57వ సర్గ), సీతను కనిపెట్టలేక రాముడు లక్ష్మణుడితో కలిసి అరణ్యాన్ని మరింత విస్తృతంగా పరిశీలిస్తాడు. సీత కోసం ఈ ఇద్దరూ నిరంతరంగా అన్వేషణ చేస్తారు. రాముడు తన వ్యాకులతతో, సీత లేకుండా జీవించడం అసాధ్యమని భావిస్తాడు. లక్ష్మణుడు రాముని ధైర్యం చెప్పి, సీతను కనుగొనడం కోసం మరింత కృషి చేస్తాడు. అరణ్యంలో అనేక రాక్షసులను ఎదుర్కొంటారు, కానీ సీతను కనుగొనలేరు.
లంకలో సీత పరిస్థితి ఇలాఉంటే, అక్కడ అరణ్యములో మారీచుని చంపిన రాముడు, వెనక్కు తిరిగి పర్ణశాలకు వస్తున్నాడు. అప్పుడు రామునికి నక్కకూత వికృతంగా వినిపించింది. అపశకున సూచకమైన ఆ నక్కకూత విని రాముడు మనసులో కీడు శంకించాడు. సీతకు లక్ష్మణునికి ఏదైనా ఆపద కలిగిందేమో అని భయపడ్డాడు. అప్పుడు మారీచుడు తన గొంతును అనుకరిస్తూ సీతా లక్ష్మణా అని అరిచిన అరుపులు గుర్తుకు వచ్చాయి రామునికి.
“అయ్యో! ఆ అరుపులు నావి అనుకొని, నాకేమైనా ఆపద కలిగిందని శంకించి, సీత లక్ష్మణుని నా రక్షణ కొరకు పంపలేదు కదా! ఆ సమయంలో రాక్షసులు సీతకు ఏమైనా అపాయము తలపెట్టారో ఏమో! అవును ఇప్పుడు అంతా అర్థం అయింది. ఇది రాక్షసులు మాయోపాయమే. మారీచుడు మాయలేడి రూపం ధరించి నన్ను ఆశ్రమానికి దూరంగా తీసుకొని వెళ్లాడు. నేను మారీచుని కొట్టినపుడు హా సీతా! హా లక్ష్మణా! అని అరిచాడు. సీత తప్పకుండా లక్ష్మణుని నా రక్షణ కోసం పంపి ఉంటుంది.
నేను, లక్ష్మణుడు, దగ్గర లేని సమయంలో సీత క్షేమంగా ఉంటుందా! అసలే ఈ జనస్థానములో ఉన్న రాక్షసులతో నాకు విరోధము ఉంది. ఆ విరోధమును మనసులో పెట్టుకొని రాక్షసులు సీతకు ఏమైనా అపాయం తలపెట్టారో ఏమో!దానికి తోడు అప శకునములు కూడా కనపడుతున్నాయి.” ఈ విధంగా ఆలోచిస్తూ రాముడు ఆశ్రమం వైపు వడి వడిగా వస్తున్నాడు.
ఎంత కాదనుకున్నా రాముని మనస్సు సీత గురించి లక్ష్మణుని గురించి వారి క్షేమం గురించి ఆలోచిస్తూ ఉంది. ఇంతలో తనను వెదుక్కుంటూ వస్తున్న లక్ష్మణుడు కనిపించాడు. లక్ష్మణుని చూడగానే రాముడికి కోపం వచ్చింది. దానితో పాటు దుఃఖం కూడా వచ్చింది. లక్ష్మణుని చేతులుపట్టుకొని ఇలా అన్నాడు.
“నేను నిన్ను సీతకు రక్షణగా ఆశ్రమంలో ఉండమన్నాను. కానీ నీవు సీతను ఒంటరిగా ఆశ్రమంలో విడిచి వచ్చావు. అలా ఎందుకు చేసావు. ఇంకా సీత క్షేమంగా ఉందంటావా? లక్ష్మణా! నాకు అన్నీ అపశకునములు కనపడుతున్నాయి. సీత గురించి నా మనసంతా ఆందోళన చెందుతూ ఉంది. వీటిని బట్టి చూస్తే సీతకు ఏదో ఆపద కలిగి ఉంటుంది. లేదా సీత సంహరింపబడి ఉంటుంది. రాక్షసులు ఆమెను భక్షించి ఉంటారు. ఇందులో సందేహం ఉండటానికి వీలు లేదు.
లక్ష్మణా! మనము మరలా సీతను ప్రాణాలతో చూడగలము అంటావా! ఆ మృగాల అరుపులు, నక్కల కూతలు వింటుంటే సీత క్షేమం మీద అనుమానం కలుగుతూ ఉంది.
అసలు జరిగిందేమిటంటే, సీత ఆ మృగము కావాలని కోరిన తరువాత నేను ఆ మృగమును వెంబడించాను. ఆ మృగాన్ని నా బాణంతో కొట్టాను. నా బాణం తగిలిన ఆ మృగం పెద్దరాక్షసునిగా మారిపోయింది. అప్పుడు అర్థం అయింది అది రాక్షస మాయ అని. అందుకే అంటున్నాను.
ఆశ్రమంలో సీత క్షేమంగా ఉండదు. ఆమెను ఎవరన్నా అపహరించి ఉండాలి. లేక ఆమెను రాక్షసులు చంపి ఉండాలి. ఒక వేళ ఆమెను ఏ రాక్షసుడైనా అపహరించి ఉంటే, ఎంతో దూరం వెళ్లి ఉ డరు. మార్గ మధ్యంలోనే ఉంటారు.” అని రాముడు తనలో తాను అనుకుంటూ వడి వడిగా పర్ణశాల వంక వస్తున్నాడు. అక్ష్మణుడు రాముని అనుసరించి వస్తున్నాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ షట్పంచాశః సర్గః (56వ సర్గ), సీతను రక్షించేందుకు రాముడు పంచవటిని చుట్టుముట్టి అన్వేషిస్తాడు, అనేక రాక్షసులను ఎదుర్కొంటాడు. సీతను కనుగొనలేక, రాముడు లక్ష్మణుడితో కలిసి మరింత విస్తృతంగా వెతుకుతాడు. ఈ సమయంలో, రాముడు సీత కోసం విచారంగా పాటలు పాడుతాడు. సీత కోసం తన ప్రాణాలను అర్పిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు.
తన ముందు అలా ప్రాధేయపడుతున్న రావణుని చూచింది సీత. పక్కన పడి ఉన్న ఒక గడ్డిపరకను తీసి తనకూ రావణుని మధ్య పడవేసింది. రావణునితో ఇలాఅంది..
“ఓ రావణా! ధర్మానికి ప్రతిరూపము, సత్యసంధతకు నిలయము అయిన దశరథుని కుమారుడు రాముడు, ఆజాను బాహుడు, అరవిందదళాయతాక్షుడు అయిన ఆ రాముడు, నా భర్త. నా భర్తే నాకు దైవము. రాముని సోదరుడు లక్ష్మణుడు. వీరిద్దరూ కలిసి నీ ప్రాణములు బలి తీసుకుంటారు. అది తథ్యము. నీవు రాముని ఎదుట నా మీద చేయివేసినట్టయితే, నీసోదరుడు ఖర, దూషణులకు పట్టిన గతే నీకూపట్టి ఉండేది.
ఇందాకటినుండి, నీవు నీ రాక్షస వీరుల గురించి ఏవేవో గొప్పలు చెప్పావు. కానీ అటువంటి రాక్షసులు 14,000 మందిని నా రాముడు ఒంటిచేత్తో మట్టికరిపించాడు. అది మరిచిపోయావా! నా రాముని ధనుస్సునుండి వచ్చిన ఒక్కొక్క బాణము నీ ఒక్కొక్క ప్రాణము తీస్తుంటే అప్పుడు తెలుస్తుంది నా రాముని ప్రతాపం ఏమిటో!
నీవు దేవతలు, దానవులు, అసురులు, గంధర్వులు మొదలగు దేవాసుర గణములతో చావక పోవచ్చు. కాని మానవమాత్రుడైన నా రాముని చేతిలో నీకు చావు తప్పదు. యజ్ఞములో ఊపస్తంభమునకు కట్టిన పశువులాగా నువ్వు గిలా గిలా కొట్టుకుంటున్నావు. నీ చావు త్వరలోనే ఉంది. రాముడు రావడం, నిన్ను చంపడం, నన్ను నీ చెరనుండి విడిపించడం తథ్యం. నీకు ఆయువు మూడింది. నీ వైభవం నశించింది. నీ లంకా రాజ్యలక్ష్మికి వైధవ్యము రానుంది. అది తెలుసుకో!
నేను నా భర్త కలిసి ఉండగా మా ఇద్దరికీ వియోగం కల్పించావు. నీకు కూడా రాబోవు జన్మలలో భార్యవియోగం తప్పదు. వినాశకాలే విపరీతబుద్ధి అని నీకు పోయేకాలం దాపురించబట్టే ఇటువంటి దుర్బుద్ధిపుట్టింది. నేను పవిత్రమైన యజ్ఞభూమిని. నన్ను నీ వంటి ఛండాలుడు తాకనుకూడా తాక జాలడు. నేను రాముని ధర్మ పత్నిని. నా భర్తను తక్క పరపురుషుని కలలో కూడా తలవని దానను. పాపాత్ముడవైన నీవు నన్ను తాకను కూడా తాకలేవు.
నేను రాజహంసను. నీవు కాకివి. నీతో నాకు పొందేమిటి? ఈ శరీరం నీ ఇష్టం. నన్ను బంధించు. చిత్రహింసలకు గురిచెయ్యి.. లేకపోతే చంపెయ్యి. నీనుంచి నా ప్రాణాలను కాపాడుకోవాలనే కోరిక నాకు లేదు. నీవు ఏమి చేసినా నేను మాత్రం నీకు లొంగను. జాగ్రత్త!” అని పలికి తలవంచుకొని నిలుచుంది సీత.
సీత మాటలు విని రావణుడు కోపగించుకోలేదు. ఇప్పటిదాకా రావణుడు తన సంపదలు ఐశ్వర్యము చూపి ఆశపెట్టాడు. కానీ సీత లొంగలేదు. ఇప్పుడు సీతను బెదిరించి లొంగదీసుకోవాలని అనుకున్నాడు. సీతను చూచి పరుషంగా ఇలా అన్నాడు.
“ఓ సీతా! ఇంక నీవు ఏమి చెప్పినా నేను వినదలచుకోలేదు. నీకు పన్నెండు మాసాలు గడువు విధిస్తున్నాను. ఈ లోపల నీవు నా సరసన చేరాలి. లేకపోతే నిన్ను వంటశాలకు పంపించి, ముక్కలు ముక్కలు గా నరికించి, నాకు ఆహారంగా తయారు చేయించు కుంటాను. జాగ్రత్త!” అని పలికాడు.
సీతకు కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలతో రావణుడు ఇలా అన్నాడు. “మీరు సీతకు కాపలాగా ఉండండి. నయానో భయానో సీతను నాకు వశం చేయండి.” అని పలికాడు. వెంటనే ఆ రాక్షస స్త్రీలు సీత చుట్టు వలయాకారంలో నిలబడ్డారు.
“ఈ సీత రాజాంతఃపురములో ఉండటానికి అర్హురాలు కాదు. మీరు ఈమెను అశోక వనమునకు తీసుకొని వెళ్లండి. ఈమెను ఒక రహస్య ప్రదేశములో ఉంచండి. ప్రతిరోజూ ఈమెను బతిమాలో భయపెట్టో ఆమె మనసు నా మీద లగ్నం అయేట్టు చేయండి.” అని ఆదేశించాడు.
వెంటనే ఆ రాక్షస స్త్రీలు సీతను అశోకవనమునకు తీసుకొని వెళ్లారు. లంకారాజ్యములో ఉన్న అశోక వనము ఫలవృక్షములతోనూ పూల తోటలతోనూ, చిన్న చిన్న సరోవరములతో నిండి శోభాయ మానంగా ఉంది. ఆ అశోకవనములో శోకదేవత వలె ఉన్న సీత ఆ రాక్షస స్త్రీల వశంలో బందీగా ఉంది. చిన్నప్పటి నుండిసుకుమారంగా పెరిగిన సీత, భయంకారాకారులైన ఆ రాక్షసస్త్రీల ఆకారములు చూచి, అరుపులు విని భయంతో మూర్ఛపోయింది.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ పంచపంచాశః సర్గః (55వ సర్గ), శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతా దేవితో కలిసి పంచవటిలో నివసిస్తున్నారు. పంచవటిలో ఉన్నప్పుడు, రావణాసురుడు హరిణి రూపంలో వచ్చి సీతను అపహరిస్తాడు. సీతను రక్షించేందుకు లక్ష్మణుడికి ఆదేశాలు ఇచ్చిన రాముడు, సీత అందుబాటులో లేకపోవడంతో విచారంలో పడతాడు.
ఆ ప్రకారంగా ఎనిమిది మంది రాక్షసులను జనస్థానమునకు పంపిన తరువాత రావణుడు, ఇంక రాముని వలన ఇబ్బంది లేదనుకున్నాడు. సీత గురించి ఆలోచంచడం మొదలెట్టాడు. సీతను తలచుకుంటేనే రావణుడికి మదనతాపం ఎక్కువ కాసాగింది. ఎప్పుడెప్పుడు సీతను చూద్దామా అని తొందర తొందరగా అంతఃపురమునకు వెళ్లాడు.
రాక్షస స్త్రీల మధ్య మూర్తీభవించిన శోకదేవత మాదిరి ఉన్న సీతను చూచాడు రావణుడు. సీత కళ్లనుండి కన్నీరు ధారాపాతంగా కారుతూ ఉంది. ఆమెతలవంచి కూర్చుని ఉంది. రావణుడు సీత దగ్గరకు వెళ్లాడు ఆమెను చెయ్యిపట్టుకొని లేవనెత్తాడు. బలవంతంగా ఆమెను తనతో తీసుకువెళ్లాడు. సీతకు తన అంతఃపురము అంతా చూపించాడు.
రావణుని అంతఃపురము అనేక మేడలతోనూ, ప్రాసాదము లతోనూ నిండి ఉంది. అక్కడ వేలకొలది దాసదాసీ జనములు నివసిస్తున్నారు. రావణుని అంతఃపురము అంతా రత్నములతోనూ మణి మాణిక్యాదులతోనూ తులతూగుతూ ఉంది. ప్రాసాదములకు అమర్చిన స్తంభములు అన్నీ బంగారు, వెండితో నిర్మింపబడి ఉన్నాయి. ముఖ ద్వారముల వద్ద దుందుభుల ధ్వనులు శ్రావ్యంగా వినబడుతున్నాయి.
రావణుడు సీతను తీసుకొని సోపానములు అన్నీ ఎక్కాడు. ప్రాసాదములు అన్నీ చూపించాడు. తన అంతఃపురము బయట ఉన్న అందమైన సరస్సులను, బావులను సీతకు చూపించాడు రావణుడు. తన ఐశ్వర్యము అంతా చూచి సీత తనకు వశము అవుతుందని రావణుని భ్రమ.
“ఓ సీతా! ఈ లంకలో బాలురు, వృద్ధులు, యువకులు కలిపి 32 కోట్ల మంది రాక్షసులు ఉన్నారు. వారి కందరికీ నేనే రాజును. నేను కనుసైగ చేస్తే చాలు వేయి మంది పరిచారికలు నాముందు చేతులు కట్టుకొని నిలబడతారు. నా కోరిక మన్నిస్తే నేనే నీ దాసుడిని అవుతాను. నా పరిచారికలు అందరూ నీ ఆజ్ఞానువర్తులు అవుతారు.
నేను చేసిన దండయాత్రలలో అనేక మంది అందమైన స్త్రీలను తీసుకొని వచ్చి నా అంతఃపురములో ఉంచాను. వారందరికీ నీవే యజమానివి. వారందరూ నీకు పరిచర్యలు చేస్తారు. అందుకని నీవు నా భార్యగా ఉండు. ఇంత ఐశ్వర్యము, ఇన్ని సంపదలు చూచి కూడా ఇంకా సందేహిస్తావు ఎందుకు. వెంటనే నా మదన తాపాన్ని చల్లార్చు. నా రాణిగా ఉండు.
నాచే పరిపాలింపబడు అంకారాజ్యము నూరు యోజనముల విస్తీర్ణంతో శోభిల్లుతూ ఉంది. ఈ లంక చుట్టు భయంకరమైన సముద్రము ఉంది. అందువలన మానవమాత్రులు లంక వంక కన్నెత్తి కూడా చూడలేరు. అంతెందుకు సురులు, అసురులు, దేవేంద్రుడు సైతం వచ్చినా నా లంకను జయించలేరు. ముల్లోకములలో నన్ను మించిన పరాక్రమశాలి ఇంకొకరు లేరు.
నీ రామునికి నాకు పోలికే లేదు. రాముడు రాజ్యభ్రష్టుడు. నేను లంకాధీశుడను. రాముడు ముని వృత్తిలో ఉన్నాడు. నేను రాజభోగములు అనుభవించుచున్నాను. రాముడు మానవమాత్రుడు. నేను దైవాంశసంభూతుడను. రాముడు అల్పాయుష్కుడు. నాకు చావు లేకుండా బ్రహ్మ వరం ఉంది. ఇంకా ఆ రాముని గురించి ఎందుకు ఆలోచిస్తావు.
ఓ సీతా! రా! నన్ను వరించు. నేనే నీకు తగిన భర్తను. యౌవనంలో ఉండగానే మనం రతిసుఖాలు అనుభవిద్దాము. నేటి సుఖం నేటిదే. రేపురాదు కదా!
ఓ సీతా! ఇంకా రాముడు వచ్చి నిన్ను రక్షించి తీసుకువెళతాడని ఆశపడుతున్నావేమో! అది ఒట్టి మాట. రాముడు నీ ఊహల్లో కూడా లంక దరిదాపులకు రాలేడు. ఒక వేళ రాముడు సముద్రము దాటి లంకకు వచ్చినా, నా రక్షణలో ఉన్న నిన్ను చూడటం, తాకడం, తీసుకొని వెళ్లడం అసాధ్యం.
నీవు నన్ను వరించి నా రాణివి అయితే, దేవ, దానవ, గంధర్వ, కిన్నెరలు నీకు దాస్యం చేస్తారు. నీవు నేను లంకారా సింహాసనము మీదకూర్చొని పట్టాభిషేకము చేయించుకుందాము. ఆ అభిషేక జలములతో ఇద్దరం పునీతులము అవుదాము.
సీతా! నీ కొరకు అనేక రకములైన పుష్పములను, సుగంధ ద్రవ్యములను, మైపూతలను తెప్పించాను. వాటిని అలంకరించుకో.
ఓ సీతా! నీకు ఇంకొక విషయం చెప్పడం మరిచాను. నేను నా సోదరుడు కుబేరుడిని జయించి అతని వద్దనుండి పుష్పకము అనే మహా విమానమును తీసుకొని వచ్చాను. ఆ విమానము అద్భుతమైనది. విశాలమైనది. నీవు నేను కలిసి పుష్పకవిమానములో విహరిద్దాము.
నేను ఇన్ని చెప్పినా, నా వైభవము అంతా చూపించినా నీ ముఖం అలా దీనంగా ఉండటం బాగాలేదు. నాపట్ల ప్రసన్నంగా ఉండు.” అని పరి పరి విధములుగా బతిమాలుకున్నాడు రావణుడు.
రావణుడు అన్ని మాటలు మాట్లాడుతున్నా సీత రావణుడు చూపించిన వాటి వంక కన్నెత్తి కూడా చూడలేదు. తన ముఖాన్ని పమిట చెంగుతో కప్పుకొని ఏడుస్తూ ఉంది. సీత బాధపడటం చూచాడు రావణుడు సీతలో ఇలా అన్నాడు.
“ఓ సీతా! నీకు పెళ్లి అయిందనీ, నన్ను వరిస్తే ధర్మహాని జరుగుతుందనీ అపోహ పడవద్దు. బహు భార్యాత్వము మాదిరి మా రాక్షసులలో బహుభర్తృత్వము ఆచరణలో ఉంది. కాబట్టి దానిని గురించి నీవు దిగులుపడవద్దు. ఓ సీతా! నాకు నీ పాదములే శరణ్యము నీ పాదములు అంటి వేడుకుంటున్నాను. నన్ను నీ దాసునిగా అనుగ్రహించు. నన్ను స్వీకరించు. నీకు తెలుసో లేదో! ఈ రావణుడు ఇంతవరకూ ఏ స్త్రీ ముందరా ఇలా మోకరిల్లి నమస్కరిస్తూ నిలబడలేదు. ఆ గౌరవం నీకే దక్కింది.” అని ప్రాధేయ పడ్డాడు. లోలోపల ఇంక నాకు సీత వశము అయింది అని సంతోషంతో పొంగిపోయాడు.
అయోధ్యాకాండలోని ఏకోననవతితమః సర్గ అంటే 89వ సర్గ. ఈ సర్గలో, భరతుడు రాముని అశ్రువులతో వేడుకుంటాడు, అతని తండ్రి మరణం తరువాత అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాన్ని పాలించమని కోరతాడు. రాముడు తన వనవాస ప్రతిజ్ఞను విరమించలేదని భరతునికి చెప్తాడు. భరతుడు తన ప్రార్థనలు విఫలమయ్యాక, రాముని పాదుకలను తీసుకొని తిరిగి అయోధ్యకు వెళతాడు. రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి, భరతుడు తాత్కాలికంగా రాజ్యాన్ని పాలించవలసిన బాధ్యతను స్వీకరిస్తాడు. భరతుడు రాముని సాక్షిగా కాబట్టి తాను పాలకుడు కాకుండా సేవకుడిగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. ఈ విధంగా భరతుడు రాముని ఆజ్ఞలను పాటిస్తూ ధర్మాన్ని కాపాడతాడు.
భరతుని మాటలకు అక్కడున్నవారికి దు:ఖము ఆగలేదు. ఏమనాలో తెలియక ఎవరి నివాసములకు వారు వెళ్లారు. ఆ రాత్రి అలా గడిచిపోయింది. మరునాడు సూర్యోదయము అయింది. భరతుడు శత్రుఘ్నునితో ఇలా అన్నాడు. “శత్రుఘ్నా! సూర్యోదయము అయింది. నిద్రలే. తొందరగా గుహుని ఇక్కడకు తీసుకొని రా. అతడు మన సైన్యమును గంగానదిని దాటిస్తాడు. మనకు కూడా గంగానదిని దాటడానికి తగిన ఏర్పాట్లు చేస్తాడు.” అని అన్నాడు.
అప్పుడు శత్రుఘ్నుడు భరతునితో ఇలా అన్నాడు. “నేను నిద్రపోవడం లేదన్నయ్యా. అన్న రాముని గురించి ఆలోచిస్తూ కళ్లు మూసుకొనిపడుకున్నాను. నీ ఆదేశము ప్రకారము గుహుని తీసుకొని వస్తాను.”అని పోబోయాడు. ఇంతలో గుహుడు అక్కడకు వచ్చాడు. ఇద్దరికీ నమస్కరించాడు.
“రాజకుమారులారా! మీకు మీసైన్యమునకు ఎలాంటి అసౌకర్యము కలగలేదు కదా! గంగాతీరమున మీరుసుఖంగా నిద్రించారుకదా!” అని కుశల ప్రశ్నలు వేసాడు గుహుడు. “మిత్రమా! మాకు ఎలాంటి అసౌకర్యమూ కలగలేదు. మేము గంగానదిని దాటవలెను. మీ పరివారమునకు చెప్పి మా అందరినీ గంగానది దాటించు.” అని అన్నాడు.
వెంటనే గుహుడు తన నివాసమునకు వెళ్లాడు. తన పరివారమును అందరినీ పిలిచాడు. “భరతుని ఆదేశము ప్రకారము మనమందరమూ భరతుని ఆయన పరివారమును, సైన్యమును గంగానదిని దాటించవలెను. పడవలను సిద్ధం చేయండి.” అని ఆదేశించాడు.
గుహుని ఆదేశము ప్రకారము ఐదువందల పడవలను సిద్ధం చేసారు. భరతుని కోసరము బాగా అలంకరింపబడిన స్వస్తికము అనే పడవను సిద్ధం చేసాడు గుహుడు. ముందుగా వసిష్ఠుడు మొదలగు బ్రాహ్మణులు ఆ పడవలో ఎక్కారు. తరువాత రాజ మాతలు ఎక్కారు. తరువాత భరతుడు, శత్రుఘ్నుడు ఎక్కారు. భరతుని వెంట వచ్చిన పరివారము, సైన్యములు వారి వారికి నియమింపబడ్డ పడవలలో ఎక్కారు. అందరూగంగానదిని క్షేమంగా దాటారు.
ఏనుగులు మొదలగు జంతువులు హాయిగా ఈదుకుంటూ ఆవల ఒడ్డుకు చేరాయి. మరి కొందరు ఔత్సాహికులు గంగానదిని ఈదుకుంటూ దాటారు. అందరూ ప్రయాగ వనమును చేరుకున్నారు. అందరినీ అక్కడవిడిది చేయమని చెప్పి, భరతుడు వసిష్ఠుడు మొదలగు పురోహితులతో భరద్వాజ ఆశ్రమమునకువెళ్లారు. అందరూ ఫలవృక్షములతో నిండి ఉన్న భరద్వాజ ఆశ్రమము చేరుకున్నారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ చతుఃపంచాశః సర్గం రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ సర్గంలో, రాముడు మరియు లక్ష్మణులు సీతను వెతుకుతూ శబరి ఆశ్రమానికి చేరుకుంటారు. శబరి ఒక దివ్య భక్తురాలిగా, రాముడిని కలవడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంది. రాముడు ఆమె భక్తిని, విశ్వాసాన్ని ప్రశంసిస్తూ సత్సంగం చేస్తాడు.
రావణాసురుడు సీతను తీసుకొని ఆకాశమార్గాన పోతుంటే ఎవరైనా తనను చూస్తారా రక్షిస్తారా అనే ఆశతో సీత కిందికి చూస్తూ ఉంది. అంతలో ఒక కొండశిఖరం మీద కొంత మంది వానరులు కూర్చుని ఉండటం గమనించింది సీత.
సీతకు ఒక ఆలోచన వచ్చింది. రావణుడు వెళుతున్న వేగానికి ఎగురుతున్న తన వల్లెవాటును పట్టుకుంది. తన ఆభరణాలు ఆ వల్లెవాటు వస్త్రములో మూటగా కట్టింది. సరిగ్గా రావణుడు ఆ పర్వతము మీద ఎగురుతున్నప్పుడు. ఆ ఆభరణాల మూటను ఆ వానరుల మధ్య పడేటట్టు జారవిడిచింది. రావణుడు ముందుకు చూస్తూ ఎగురుతూ ఉండటంతో సీత చేసిన పనిని గుర్తించలేదు.
తమ మీద దబ్బున పడ్డ మూటను చూచారు ఆ వానరులు. వెంటనే తలలు పైకెత్తి చూచారు. వారికి ఆకాశంలో ఎగురుతున్న రావణుడు, రావణుని సందిట్లో బందీ అయిన సీత కనిపించారు. వారు రావణుడు వెళ్లిన వేపు చూస్తున్నారు. రావణుడు సీతను తీసుకొని పంపానదిని దాటి దక్షిణదిక్కుగా వెళ్లాడు.
రావణుడు అడవులు, పర్వతములు, నదులు, సరస్సులు దాటుకుంటూ లంకా నగరం వైపు వేగంగా ఎగురుతున్నాడు. తుదకు సముద్రం వద్దకు వచ్చాడు. వేగంగా సముద్రాన్ని దాటాడు. సీతను సందిట్లో ఇరికించుకున్న రావణుడు లంకానగరంలో ప్రవేశించాడు.
నేరుగా తన అంతఃపురానికి వెళ్లాడు రావణుడు. సీతను తన అంతఃపురములో ఒక గదిలో ఉంచాడు. తన అనుచరులను పిలిచాడు.
“ఈమెను నేను చెరబట్టి తీసుకొని వచ్చాను. నా అనుజ్ఞ లేకుండా ఎవరూ ఈమెను తాకడానికి కూడా వీలులేదు. బయట వాళ్లు పురుషులు కానీ, స్త్రీలుకానీ ఈమెను కలవకుండా చూడండి. ఈమె ఏది కోరితే అది ఇవ్వండి. లేదు అనే మాట ఉండకూడదు. ఎవరైనా ఈమెతో నా గురించి చెడుగా మాట్లాడితే వాళ్లకు అదే ఆఖరు రోజు అని గుర్తుపెట్టుకోండి. ఇదినా ఆజ్ఞ” అని కఠినమైన ఆజ్ఞలు ఇచ్చాడు.
తరువాత రావణుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. వెంటనే నరమాంసమును తినే ఎనిమిది మంది రాక్షసులను పిలిచాడు.
“మీరు ఆయుధ ధారులై వెంటనే జనస్థానమునకు వెళ్లండి. అక్కడ ఇదివరకు ఖరుడు, దూషణుడు ఉండేవారు. ఇప్పుడు వారు లేరు. మీరు వారి స్థానములో జనస్థానములో నివసించండి. జనస్థానములో ఉన్న ఖరదూషణులను, 14,000 మంది రాక్షసులను రాముడు అనే మానవుడు సంహరించాడు. అందుకని రామునితో మనకు విరోధము ఏర్పడింది.
ఇప్పుడు మనము ఆ రాముని మీద పగ, ప్రతీకారము తీర్చుకోవాలి. రాముని చంపిన గాని నాకు నిద్ర పట్టదు. అందుకని మీరు జనస్థానములో నివసిస్తూ, ఆ రాముని ప్రతి కదలికను నాకు తెలియజేయండి. మీరు ఆ రాముని చంపడానికి సకల సన్నాహాలు చేయండి. మీరు ఎన్నో యుద్ధములలో నాతో పాటు పాల్గొని మీ ధైర్యసాహసాలు, పరాక్రమాలు ప్రదర్శించారు. అందుకని మిమ్ములను ఈ మహత్కార్యం మీద జనస్థానానికి పంపుతున్నాను.” అని పలికాడు.
రావణుని మాటలను శిరస్సున దాల్చారు ఆ ఎనిమిది మంది రాక్షసులు. రావణుడికి నమస్కరించి, లంకను విడిచి జనస్థానము నకు బయలుదేరారు.
అప్పటికి రావణుడు శాంతించాడు. అతిలోక సౌందర్యవతి అయిన సీత తన అధీనంలో ఉంది కదా అని పొంగిపోయాడు. ఈ ఎనిమిది మంది రాక్షసుల చేతిలో రాముడు హతం అవుతాడు అని ఆనందించాడు.
అయోధ్యాకాండంలో షడశీతితమః సర్గ అంటే 86వ సర్గ. ఈ సర్గలో దశరథ మహారాజు శ్రీరాముని వలక పంపించడంపై దుఃఖంతో మరణిస్తాడు. ఆయన మరణం తరువాత, భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి తీవ్ర దుఃఖంలో ఉంటారు. భారతుడు, శత్రుఘ్నుడు తల్లిదండ్రుల మరణవార్త విని శోకసముద్రంలో మునిగిపోతారు. అప్పుడు వశిష్ఠ మహర్షి, ఇతర సకల గురువులు, మరియు మంత్రి వర్గం దశరథ మహారాజు అంత్యక్రియలు నిర్వహిస్తారు. దశరథుడి మరణం తర్వాత ప్రజలు విసిగిపోతారు. రాజ్యంలో ఈ విషాదం మహోన్నతమైన సంఘటనగా ప్రజలు బాధపడతారు. ఇది రామాయణం యొక్క ప్రధాన సంఘటనలలో ఒకటి.
ఆ రాత్రి గుహుడు లక్ష్మణుని సద్గుణముల గురించి భరతునికి వివరించాడు. “ఓ మహారాజా! రాముడు అడవులలోనికి పోయే ముందు ఇక్కడ నిద్రించాడు. ఆ రాత్రి లక్ష్మణుడు నిద్ర లేకుండా రామునికి సీతకు రక్షణగా ఉన్నాడు.
ఆ సమయంలో నేను లక్ష్మణునితో “లక్ష్మణా! నీకోసరము మా వాళ్లు సుఖకరమైన శయ్య ఏర్పాటు చేసారు. నీవు నిద్రించు. నేను రామునికి ఏ ఆపదా రాకుండా చూసుకుంటాను. ఎందుకంటే లక్ష్మణా! మేము కష్టములు పడటానికి అలవాటు పడ్డాము. రాత్రి నిద్రలేకుండా మేలుకొనడం మాకు అలవాటే. నీవు రాకుమారుడవు. నీవు నిద్రలేకుండా ఉండలేవు. అందుకని వెళ్లి నిద్రించు.
మిత్రమా లక్ష్మణా! నాకు రాముని కంటే ప్రియమైన వాళ్లు ఈ లోకంలో ఎవరూ లేరు. రాముడు అడవులలో ఉన్నంతవరకూ రాముని రక్షణ బాధ్యత నాది. దానిని ఎవరికీ అప్పచెప్పను. నేను రాముని సేవలోనే ఆయన అనుగ్రహమును పొందుతాను. కాబట్టి నేను నా ధనుస్సు చేత బూని సీతారాములను రక్షిస్తాను. నేను సదా ఈ వనములో సంచరిస్తుంటాను కాబట్టి ఈ వనములలో నాకు తెలియనిది అంటూ లేదు. ఎంతటి సైన్యమునైనా ఎదిరించే శక్తి మాకు ఉంది. రామునికి వచ్చిన భయము లేదు. కాబట్టి రాముని రక్షణ బాధ్యత నాకు అప్పచెప్పి నీవు వెళ్లి సుఖముగా నిద్రించు.” అని అన్నాను.
నామాటలు విన్న లక్ష్మణుడు ఇలా అన్నాడు. “మిత్రమా! నాతోపాటు రాజభోగములు అనుభవించిన రాముడు కటికనేల మీద నిద్రించుచుండగా నాకు సుఖమైన శయ్యమీద నిద్ర ఎలా పడుతుంది. అటుచూడు. హంసతూలికా తల్పము మీద శయనించ వలసిన రాముడు గడ్డి మీద పడుకొని ఉన్నాడు.
ఈ రాముడు సామాన్యుడు కాడు. దశరథుడు ఎన్నో యజ్ఞములు యాగములు చేస్తే, ఆయాగముల ఫలితంగా రాముడు జన్మించాడు. ఈ రాముని వదిలి దశరథుడు ఎంతోకాలము జీవించలేడు. నా ఉద్దేశ్యము ప్రకారము దశరథుడు ఈ పాటికి రామ వియోగమును భరించలేక పరలోకగతుడై ఉంటాడు. నా తల్లి సుమిత్ర, రాముని తల్లి కౌసల్యకూడా రాముని విడిచి జీవించలేరు. కనీసము నా తమ్ముడు శత్రుఘ్నుని చూచుకుంటూ నా తల్లి సుమిత్ర ఉండగలదేమో కాని, రాముని వదిలి కౌసల్య జీవించలేదు.
రాముని రాజ్యాభిషిక్తుని చేయలేక పోగా, అరణ్యములకు పంపిన దు:ఖంతో దశరథుడు మరణించడం తథ్యం. ఆ సమయంలో దశరథునికి ప్రేతసంస్కారములు చేయు అదృష్టము కలిగిన భరతుడు, శత్రుఘ్నుడు ధన్యులు. తరువాత భరతుడు పట్టాభిషిక్తుడగును. అందరూ సంతోషంగా ఉంటారు. కాని మేమే ఈ పదునాలుగు సంవత్సరముల వనవాసము పూర్తిచేసుకొని తిరిగి అయోధ్యలో అడుగుపెట్టగలమా అని అనుమానము.” అని లక్ష్మణుడు ఆ రాత్రి పరి పరి విధములు గా చింతించుచూ నిద్రలేకుడా గడిపాడు.
మరునాడు సీతారామలక్ష్మణులు పడవ మీద గంగానదిని దాటారు. ఆ నావను నేనే వారికి సమకూర్చాను. రాముడు ఇక్కడే మర్రిపాలు పూసుకొని జటలు కట్టుకున్నాడు. నారచీరలు ధరించాడు. వారు గంగానదిని దాటివెళ్లిపోయారు.” అని గుహుడు భరతునికి ఆ రాత్రి జరిగిన వృత్తాంతమును వివరించాడు.