మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” ద్వాదశః సర్గలో, రాముడు, లక్ష్మణుడు, సీత అగస్త్య మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశిస్తారు. అగస్త్య మహర్షి కూడా చాలా కాలం పాటు రాముడిని స్వీకరించడానికి వేచి ఉన్నాడు మరియు ఇప్పుడు వారిని అన్ని గౌరవాలతో స్వీకరిస్తాడు, రాముడిని విష్ణువు అవతారంగా గ్రహించాడు. అగస్త్య మహర్షి విష్ణువు యొక్క దివ్యమైన ధనుస్సును, ఎప్పుడూ బాణాలతో నిండిన రెండు వణుకులను మరియు బంగారు తొడుగులో బంగారు ఖడ్గాన్ని రాముడికి ఇస్తాడు, అదే ఆయుధాలతో విష్ణువు ఒకప్పుడు భూమిపై చెడును నిర్మూలించాడని చెప్పాడు.
అగస్త్యదర్శనమ్
స ప్రవిశ్యాశ్రమపదం లక్ష్మణో రాఘవానుజః |
అగస్త్యశిష్యమాసాద్య వాక్యమేతదువాచ హ ||
1
రాజా దశరథో నామ జ్యేష్ఠస్తస్య సుతో బలీ |
రామః ప్రాప్తో మునిం ద్రష్టుం భార్యయా సహ సీతయా ||
రాముని ఆదేశానుసారము లక్ష్మణుడు అగస్త్యముని ఆశ్రమంలోకి వెళ్లాడు. లోపల అగస్త్యముని శిష్యుని వద్దకు పోయి “అయోధ్యాధీశుడు, దశరధ మహారాజు కుమారుడు, రాముడు, తన భార్య సీతతో సహా అగస్యులవారి దర్శనానికి వచ్చి వేచి ఉన్నారని మనవి చెయ్యి” అని అన్నాడు.
ఆ శిష్యుడు లక్ష్మణుని చూచి “మీరు ఎవరు?” అని అడిగాడు.
“నేను రాముని తమ్ముడను. లక్ష్మణుడను, సదా రాముని హితము కోరేవాడిని. రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము అరణ్యవాసము చేయుచున్నాడు. ఆయన భార్య సీత, నేను ఆయనను అనుసరించు చున్నాము. ” అని అన్నాడు.
“మంచిది. మీరు ఇక్కడే ఉండండి. నేను మహర్షులవారికి మీ గురించి చెప్పి వస్తాను.” అని లోపలకు వెళ్లాడు.
అగ్ని గృహములో ఉన్న అగస్త్యుని వద్దకు పోయి రాముడు, లక్ష్మణుడు, సీత రాక గురించి తెలిపాడు. ఆ మాటలు వినిన అగస్యుడు ఎంతో సంతోషించాడు.
“ఎన్నోనాళ్ల నుండి నేను రాముని దర్శనము కొరకు ఎదురుచూస్తున్నాను. ఇంతకాలానికి రాముడు నన్నే వెదుకు కొనుచూ నా వద్దకు వచ్చాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు వెంటనే పోయి రాముని, సీతను, లక్ష్మణుని సగౌరవంగా నా వద్దకు తీసుకొని రా. అయినా రాముని రాక గురించి నాకు చెప్పవలెనా. రాముని అంతసేపు బయట నిలబెట్టవలెనా. వెంటనే నావద్దకు తీసుకొని రావలదా! ” అని శిష్యునితో అన్నాడు.
వెంటనే ఆ శిష్యుడు పరుగు పరుగున రాముని వద్దకు పోయి “రాముడు ఎక్కడ? రాముడు ఎక్కడ? రామునికి ఎలాంటి అనుమతి అవసరం లేదు. వెంటనే లోపలకు రావచ్చును.” అని అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు ఆ శిష్యునకు ద్వారము వద్ద ఉన్న రాముని సీతను చూపించాడు. వెంటనే ఆ శిష్యుడు రాముని గౌరవించి, సత్కరించి అగస్త్యుని వద్దకు తీసుకొని వెళ్లాడు.
రాముడు లోపలకు రావడం చూచి అగస్త్యుడు రామునికి ఎదురు వచ్చాడు. రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.
“లక్ష్మణా! అటు చూడు! అగ్ని వలె వెలుగుతున్న అగస్త్యమహర్షి మనకోసం వస్తున్నాడు.” అని అన్నాడు.
రాముడు అగస్త్యుని పాదాల మీద పడి నమస్కరించాడు. తరువాత సీత, లక్ష్మణుడు కూడా మహామునికి పాద నమస్కారము చేసారు. అగస్త్యుడు రామునికి అర్ఘ్యము, పాద్యము ఇచ్చాడు. ఒక ఆసనము చూపించాడు. తరువాత అగ్నిహోత్రము ముగించుకొని, అతిథిపూజ చేసి రామలక్ష్మణులకు సీతకు ఆహారము ఇచ్చాడు. భోజన కార్యక్రమము అయిన తరువాత రాముడు అగస్త్యుని పక్కనే ఒదిగి కూర్చున్నాడు. అగస్త్యుడు రామునితో ఇలా అన్నాడు.
“రామా! ముందుగా అగ్నిహోత్రము చేసి, అతిధులను పూజించి, తరువాత భోజనము చేయవలెను. అలాచేయని వాడు నరకానికి పోతాడు.
రామా! నీవు క్షత్రియుడవు. అయోధ్యకు రాజువు. ధర్మము తెలిసినవాడవు. అందరి చేతా గౌరవింప తగినవాడవు. అలాంటి నీవు ఈ రోజు మాకు అతిథిగా వచ్చావు. మాకు చాలా సంతోషంగా ఉంది.
రామా! నీకు కొన్ని ఆయుధములను ఇస్తాను. ఇది విష్ణుదేవుని ధనుస్సు. ఇది విశ్వకర్మ నిర్మించాడు. ఇది అక్షయతూణీరము. ఈ తూణీరములో బాణములు ఎప్పటికీ నిండుగా ఉంటాయి. ఈ ఖడ్గము దేవేంద్రుడు ఇచ్చాడు.
ఇవన్నీ దివ్యమైన ఆయుధములు. ఇవన్నీ విష్ణువు, ఇంద్రుడు దేవాసుర యుద్ధములో ఉపయోగించి విజయలక్ష్మిని వరించారు. ఈ ఆయుధములను నీవు స్వీకరించు. నీకు జయం కలుగుతుంది.” అని పలికి అగస్త్యుడు దివ్యమైన ధనుర్బాణములను, ఖడ్గమును రామునికి ఇచ్చాడు.
పల్లవి : తానీషా : ఏ దేశమున నుండువారు మీరలెందుండి యిట వచ్చినారు
రామ : తొలుత గోదావరియందు మా స్థలమది భద్రాచలమందు
తానీషా : ఎవరి జవానులు మీరు మిమ్మెవరు బంపక వచ్చినారు
రామ :దాసజవానులు మేము రామదాసు పంపగ వచ్చినాము
తానీషా : ఏ కులమువారు మీరు మీరిద్దరు నే వరుసవారు
రామ : ఇనవంశమున బుట్టినాము మేమిద్దర మన్నదమ్ములము
తానీషా : ఏమి నామము గలవారు మీరేమి నియమము గలవారు
రామ : రామోజీ లక్ష్మోజినామం వహ్వా రామానుజ మతమువారం
తానీషా : ఎన్నిదినములనుండి మీరు వారిసన్నిధి కొలువై యున్నారు
రామ : తాతముత్తాతలు మేము మూడుతరములనుండి యున్నాము
తానీషా : ఏమి జీతమిచ్చెదరు మీకు ఏమి జీవనమిచ్చెదరు
రామ : సమ్మతిలేని జీతము ప్రసాదమునకే కుదిరినాము
తానీషా : ఎందుకు పంపించినారు మీరేమి పనిగ వచ్చినారు.
రామ : సర్కార్బాకీ పైకము మాచేత బంపగ వచ్చినాము
తానీషా : అర్థమంతయు దెచ్చినారా లేక వ్యర్థముగ వచ్చినారా
రామ : వ్యర్థులముగ మేము రాము మీయర్థమంత దెచ్చినాము
తానీషా : బైఠోజి బైరోజి మీ మాటలు చూడగ వేరు
రామ : బైఠోజి వారముగాము మీ భేటికి వచ్చినాము
తానీషా : లక్షలారును దెచ్చినారా యింకా శిక్షలో నుండమన్నారా
రామ : లక్షలారునియ్యగలము మూడు లక్షలు మేమియ్యగలము
తానీషా : పంపిన పైకము తెండి యాపయిన తమాషా చూడండి
రామ : పదివేలు తెచ్చినామండి యాపయిన మాచేత లేదండి
తానీషా : మగురూర్మాటలు మీతో మాతో మరలించుచున్నారు.
రామ : మగురూరి వారితో మేము మాట్లాడువారము కాము
తానీషా : ధనము మాచేతికియ్యండి యావెనుక ఖైదులోకి పొండి
రామ : ఖైదులోకి మేము పోము మీ ఖజాన పైకమిచ్చేము
తానీషా : చెల్లింతురా ద్రవ్యమంత రసీదు నడుగుట కడువింత
రామ : ఉంగరంబులీడెమందు నుప్పొంగుచు తొడదట్టెయందు
తానీషా : మొహరువేసినంతను మోహనాంగుడు సంతసమునను
మీ రూపు మీ సొగసు మీ చక్కదన మెన్నలేరు
ఈ ధరయందున
మాయావేషముల గారడి మాయమీరు
నెరవుతో బన్నివారనితోచెను
ఇంత రాత్రివేల నీ యర్థమిప్పుడు
ఎంతని పరికింపను
రంతు సేయక రేపంతయు చెల్లింపుడు
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ చతుర్థ సర్గం రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. ఈ సర్గలో రాముడు, సీత మరియు లక్ష్మణుడు పంచవటిలో నివసిస్తారు. ఈ క్రమంలో, శూర్పణఖ రాముణ్ని చూసి, అతనిపై మోహించి, ప్రేమను ప్రదర్శిస్తుంది. అయితే, రాముడు ఆమెను తిరస్కరిస్తాడు. కోపంతో శూర్పణఖ సీతపై దాడి చేస్తుంది.
ఆ ప్రకారంగా రాముని లక్ష్మణుని విరాధుడు ఎత్తుకొని పోవడం చూచి సీత పెద్దగా ఏడవసాగింది. పెద్ద పెద్ద గా కేకలు వేసింది.
“ఓ రాక్షసుడా నీకు ఓ నమస్కారము. వాళ్లను వదిలిపెట్టు. కావాలంటే నన్ను తీసుకొనిపో. నాకు భయంగా ఉంది. నేను ఒంటరిగా ఇక్కడ ఉంటే ఈ అరణ్యములో ఉండే క్రూర మృగాలు నన్ను తినేస్తాయి.” అని పెద్ద పెట్టున కేకలు వేసింది.
ఆ కేకలు విన్నారు రామలక్ష్మణులు. వెంటనే విరాధుని చంపడానికి పూనుకున్నారు. వెంటనే లక్ష్మణుడు తన చేతిలో ఉన్న కత్తితో విరాధుని ఎడమచేతిని ఖండించాడు. రాముడు విరాధుని కుడి చేతిని విరిచేసాడు. రెండు చేతులు విరిగిన విరాధుడు రామలక్ష్మణులను కిందికి విసిరేసాడు. బాధతో గిలా గిలా కొట్టుకుంటూ కిందపడి మూర్ఛపోయాడు.
కిందపడ్డ విరాధుని రామలక్ష్మణులు కాళ్లతోనూ చేతులతోనూ మర్దించారు. పైకి ఎత్తి నేల మీద పడేసారు. కత్తులతో చీల్చారు. ఏమి చేసినా విరాధుని ప్రాణం పోలేదు. వరప్రసాది అయిన విరాధుడు ఆ ప్రకారంగా చావడు అని గ్రహించాడు రాముడు.
“లక్ష్మణా! ఈ విరాధుడు కత్తులతోనూ, ఆయుధములతోనూ చావడు. అలా చావు రాకుండా వీడికి వరం ఉంది. అందుకని మనం వీడిని గొయ్యి తీసి పాతిపెడదాము. సహజంగా వాడికి ప్రాణం పోతుంది. కాబట్టి నువ్వు వీడిని పూడ్చి పెట్టడానికి తగినంత గొయ్యి తవ్వు.” అని అన్నాడు. గొయ్యి తవ్వే లోపల విరాధుడు లేవకుండా రాముడు వాడి గొంతు మీద కాలు పెట్టి నిలుచున్నాడు.
అప్పుడే మూర్ఛనుండి తేరుకున్న విరాధుడు రాముని మాటలు విన్నాడు. విరాధుడు రామునితో ఇలా అన్నాడు.
“రామా! నువ్వు ఎవరో గుర్తించాను. నీభార్య సీతను, నీ తమ్ముడు లక్ష్మణుని కూడా గుర్తించాను. మీరు మహా పరాక్రమ వంతులు. మీచేతిలో నేను ఎప్పుడో చచ్చాను. ఇప్పుడు ప్రత్యేకంగా చంపడం ఎందుకు. ఇంక నా గురించి చెబుతాను.
నేను తుంబురుడు అనే పేరుగల గంధర్వుడను. ఒక సారి నేను రంభయొక్క వ్యామోహంలో పడి కుబేరుని సేవకు పోలేదు. కుబేరుని శాపము వలన నాకు ఈ రాక్షస రూపము ప్రాప్తించింది. “దశరథుని కుమారుడు రాముడు ఎప్పుడు నిన్ను యుద్ధంలో చంపుతాడో అప్పుడు నీకు నిజరూపం వస్తుంది” అని కుబేరుడు నాకు శాపవిమోచన మార్గము చెప్పాడు. ఇప్పుడు మీ దర్శనభాగ్యము కలిగింది. నాకు శాపవిమోచనము అయింది. నేను నా లోకానికి వెళ్లిపోతాను. నాకు అనుజ్ఞు ఇవ్వండి.” అని ప్రార్థించాడు.
రామ లక్ష్మణులు విరాధుని ప్రార్థనను మన్నించారు. విరాధుడు రామునితో ఇలా అన్నాడు. “రామా! ఇక్కడికి ఒకటిన్నర యోజనముల దూరములో శరభంగుడు అనే ముని ఆశ్రమము ఉంది. మీరు అక్కడకు వెళ్లండి మీకుశుభం కలుగుతుంది. ప్రస్తుతము మీరు నన్ను ఒక గోతిలో పాతిపెట్టండి. మరణించిన రాక్షసులను గొయ్యి తీసి అందులో పాతి పెట్టడం పురాతన ఆచారము. అలా చేస్తే మాకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి.” అని అన్నాడు.
తరువాత విరాధుడు తన ప్రాణాలు వదిలాడు. విరాధుని కోరిక ప్రకారము లక్ష్మణుడు గొయ్యి తీసాడు. రాముడు విరాధుని గొంతు మీది నుండి తన కాలు తీసాడు. విరాధుడు పెద్దపెట్టున అరిచాడు. ఆ అరుపులకు అడవి మారుమోగిపోయింది. వెంటనే లక్ష్మణుడు పెద్దపెద్ద గా కేకలు పెడుతున్న విరాధుని గోతిలో పడదోసాడు.
ఆ ప్రకారంగా రామలక్ష్మణులు, ఏ ఆయుధము చేత కూడా చావని విరాధుని, గోతిలో పెట్టి పూడ్చిపెట్టడం ద్వారా సంహరించారు. రాముని చేతనే చావ వలెనని కోరిక కల విరాధుడు, తన మరణ రహస్యమును కూడా రామునికి చెప్పాడు. అందుకని రాముడు అతడిని గోతిలో పాతిపెట్టడం ద్వారా సంహరించాడు. విరాధుడు మరలా లేవకుండా ఆ గోతి మీద పెద్ద పెద్ద బండ రాళ్లను కూడా పెట్టారు. తరువాత వారు సీత వద్దకు పోయి ఆమె భయాన్ని పోగొట్టారు. విరాధుని మరణంతో సీతారామలక్ష్మణులు సంతోషంగా ఉన్నారు.
(విరాధుని కధ మనకు కొంచెం విచిత్రంగా ఉంది కదూ! పైన చెప్పిన విధంగా గోరఖపూర్ ప్రతిలో ఉంది. రాముడు మహా బలవంతుడు. అస్త్రశస్త్ర సంపన్నుడు. అటువంటి రాముడు విరాధుడు సీతను ఎత్తుకొని పోగానే ఏడుస్తాడు. అదీ సీతను విరాధుడు ఎత్తుకొని పోయినందుకు కాదు. తమకు కలిగిన కష్టములను చూచి కైక కళ్లు చల్లబడ్డాయి కదా అని ఏడుస్తాడు. అప్పుడు లక్ష్మణుడు రాముని పరాక్రమమును గుర్తుచేస్తాడు. అయినా రాముడు ఏమీ చేయడు.
తరువాత విరాధుడు రామ లక్ష్మణులను బుజాల మీద ఎత్తుకొని పోతుంటే, “ఎటూ మనం అటే వెళతాము కదా కాస్త దూరం కలిసి వచ్చిందిలే” అని అనుకుంటాడు రాముడు. అంతేగానీ సీత ఒంటరిగా ఉంది, ఆమెకు ఏమన్నా ఆపద కలుగుతుంది అని గుర్తుకు రాదు. సీత కూడా “రామా నన్ను రక్షించు” అని ఏడవదు. విరాధునితో “నన్ను ఇక్కడ క్రూరమృగాలు తింటాయి. కావాలంటే నన్నుఎత్తుకొని పో, రామలక్ష్మణులను వదిలిపెట్టు” అని అరుస్తుంది. అప్పుడు రామునికి సీత ఒంటరిగా ఉంది అని గుర్తుకు వస్తుంది.
తాము విరాధుని చంపాలి అని అనుకుంటాడు. తరువాత విరాధుడు కూడా తనశాపవృత్తాంతము చెబుతాడు. తన శరీరాన్ని గోతిలో పెట్టి పాతిపెట్టమని కోరతాడు. తరువాత ప్రాణాలు విడుస్తాడు. రాముడు విరాధుని గొంతు మీద కాలు తీయగానే పెద్దగా అరుస్తాడు. అలా అరుస్తూ గిలా గిలా కొట్టుకుంటున్న విరాధుని రామలక్ష్మణులు గోతిలోకి తోసి కప్పెడతారు. వాడు లేవకుండా బండరాళ్లు పెడతారు. విరాధుడు ఇలాగే చస్తాడు అని రాముడు లక్ష్మణునికి చెబుతాడు. ఇవన్నీ ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నాయి కదా!
కాని రామాయణం ప్రాచ్య ప్రతిలో కధ వేరుగా ఉంది. విరాధుడు సీతను లాక్కుని తన తొడమీద కూర్చోపెట్టుకోగానే సీతకు కలిగిన దుస్థితికి రాముడికి దుఃఖము కలుగుతుంది. లక్ష్మణుడు రామునికి ధైర్యము చెప్పి విరాధుని మీద ఏడు బాణాలు ప్రయోగిస్తాడు. విరాధుడు లక్ష్మణుని మీద శూలం విసురుతాడు. రాముడు దానిని రెండు ముక్కలుగా విరిచేస్తాడు. మరొక బాణంతో రాముడు విరాధుని వక్షస్థలం చీలేట్టు కొడతాడు. విరాధుడు కిందపడతాడు. కాని చావడు.
రామునికి తనశాప వృత్తాంతము చెబుతాడు. రామునికి కోపం తెప్పించడానికే, రాముని చేతిలో మరణించి శాపవిముక్తి పొందడానికే సీతను లాక్కున్నాను అని చెబుతాడు. తరువాత రాక్షసుల ఆచారం కార తన శరీరాన్ని గోతిలో కప్పెట్టమంటాడు. తరువాత శరభంగ ముని గురించి చెప్పి, తన నిజ స్వరూపంతో గంధర్వలోకానికి వెళ్లిపోతాడు. ఈకథ సందర్భోచితంగా ఉంది. కాబట్టి మనము దీనినే అనుసరిద్దాము. పైవిషయములను నేను ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారి శ్రీమద్రామాయణము అరణ్యకాండ నుండి గ్రహించాను. వారికి నా పాదాభివందనములు. కృతజ్ఞతలు.)
పల్లవి :ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకైన
నీ మాయ తెలియవశమా
కామారి వినుతగుణధామకువలయదళ
శ్యామా నన్ను గన్న తండ్రి రామా
సుతుడనుచు కవులు క్షితినాథుడనుచు భూ
పతులు కొలిచిరిగాని పతితపావనుడనుచు
మతి తెలియలేరైరి.
॥ఏమయ్య॥
చెలిమి కొడవనుచు పాండవులు నిజ
విరోధివటంచు నల జరాసంధాదులు కలవాడవని
కుచేలుండు నెరింగిరి గాని ఓజలజాక్ష నిన్ను సేవింపలేరైరి
॥ఏమయ్య॥
నరుడవని నరులు తమ దొరవనుచు యాదవులు
నరుడవనుచు కోపింతురు కరివరద భద్రాద్రిపుర నిలయ
రామదాస పరమాత్ముడని నిన్ను భావింపలేరైరి
॥ఏమయ్య॥
8. పున్నాగరావళి చాపుతాళం
పల్లవి : ఏల దయరాదో రామయ్య నీకేల దయరాదో
మీ మేలుకై పాటుబడితిని యేల మీ భండము చాలుచాలును
॥ఏల॥
చరణములు
బ్రహ్మ గూర్పగదే అహోవరబ్రహ్మకావగదే
బ్రహ్మజనక భవ బ్రహ్మేంద్రాదులు బ్రహ్మానందము పాలైనారట
॥ఏల॥
పాపములచేత రామయ్య నేనోపలేను గదే
శ్రీభూపతి యే ప్రాపులేక నీ ప్రాపేగోరితి ఘోరరూపయిక
అయోధ్యా కాండ సర్గ 56 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. మరునాడు ఉదయం రాముడు ముందుగా మేల్కొన్నాడు. లక్ష్మణుని నిద్రలేపాడు. “లక్ష్మణా! మనము బయలుదేరు వేళ అయినది. తొందరగా నిద్రలే.” అని నిద్రలేపాడు. తరువాత సీతకూడా నిద్రలేచింది. అందరూ యమునలో స్నానం చేసారు. ప్రాతఃసంధ్యా కార్యక్రమములు నిర్వర్తించి చిత్రకూటమునకు ప్రయాణము అయ్యారు. రాముడు సీతకు దారిలో కనపడ్డ వృక్షముల గురించి, పుష్పముల గురించి వివరిస్తున్నాడు. చిత్రకూట పర్వతము మీద ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వాటిని సీతకు చూపించాడు రాముడు. అలా నడుచుకుంటూ వారు ముగ్గురూ చిత్రకూట పర్వతమును చేరుకున్నారు. అక్కడ కాసేపు ఆగాడు రాముడు.
మరునాడు ఉదయం రాముడు ముందుగా మేల్కొన్నాడు. లక్ష్మణుని నిద్రలేపాడు. “లక్ష్మణా! మనము బయలుదేరు వేళ అయినది. తొందరగా నిద్రలే.” అని నిద్రలేపాడు. తరువాత సీతకూడా నిద్రలేచింది. అందరూ యమునలో స్నానం చేసారు. ప్రాతఃసంధ్యా కార్యక్రమములు నిర్వర్తించి చిత్రకూటమునకు ప్రయాణము అయ్యారు.
రాముడు సీతకు దారిలో కనపడ్డ వృక్షముల గురించి, పుష్పముల గురించి వివరిస్తున్నాడు. చిత్రకూట పర్వతము మీద ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వాటిని సీతకు చూపించాడు రాముడు. అలా నడుచుకుంటూ వారు ముగ్గురూ చిత్రకూట పర్వతమును చేరుకున్నారు. అక్కడ కాసేపు ఆగాడు రాముడు.
“లక్ష్మణా! ఇక్కడ మనము ప్రశాంతంగా వనవాసము చేయవచ్చును. మనకు కావలసిన ఫలములు, కాయలు దుంపలు, ఆహారమునకు పనికి వచ్చు జంతువులు, స్వచ్ఛమైన నీరు పుష్కలంగా ఉన్నాయి. ఈ పర్వతము మీద చాలామంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు.” అని అన్నాడు.
వారు అలా మాట్లాడుకుంటూ వాల్మీకి ఆశ్రమమునకు చేరుకున్నారు. వాల్మీకి వారిని సాదరంగా ఆహ్వానించాడు. కుశల ప్రశ్నలు వేసాడు. తన గురించి తనయొక్క వనవాసము గురించి వాల్మీకి మహర్షికి వివరంగా తెలిపాడు రాముడు.
తరువాత రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.
“లక్ష్మణా!మనము ఇచ్చటనే ఒక కుటీరము నిర్మించుకొని నివసిస్తాము. కాబట్టి వెంటనే బలమైన కర్రలు తీసుకొని వచ్చి కుటీరము నిర్మించు.” అని అన్నాడు. లక్ష్మణుడు రాముడు చెప్పిన మేరకు ఒక కుటీరము నిర్మించాడు. ఆ పర్ణశాలను చూచి ఎంతో సంతోషించాడు రాముడు. “లక్ష్మణా! మనకు ఈ పర్ణశాలలో చాలాకాలము నివసింపబోవుచున్నాము. కాబట్టి వాస్తుదేవతలను పూజించాలి. వారిని శాంతింపజేయాలి. ముందుగా మనము లేడి మాంసముతో వాస్తుపూజ చేద్దాము.
కాబట్టి ఒక లేడిని చంపి దాని మాంసము తీసుకొని రా. శాస్త్రము ప్రకారము చేయవలసిన కర్మ కనుక లేడిని చంపిన పాపము అంటదు.” అని అన్నాడు రాముడు. వెంటనే లక్ష్మణుడు అడవిలోకి పోయి ఒక లేడిని వేటాడి తీసుకొనివచ్చాడు. దాని మాంసమును అగ్నిమీద ఉడికించాడు. గృహపూజకు సిద్ధం చేసాడు. “రామా! లేడి మాంసము ఉడికించాను. పూజకు అన్నీసిద్ధం చేసాను.ఇంక పూజకు ఉపక్రమించండి.” అని అన్నాడు లక్ష్మణుడు.
రాముడు స్నానము చేసి శుచిగా వచ్చి కూర్చున్నాడు. వేదమంత్రములను పఠిస్తూ గృహపూజ,వాస్తుదేవతా పూజను శాస్త్రోక్తంగా చేసాడు. దేవతల నందరినీ పూజించాడు. సీతా సమేతంగా ఆ పర్ణశాలలో గృహప్రవేశము చేసాడు రాముడు. తరువాత రాముడు విశ్వేదేవతలకు, త్రిమూర్తులకు బలులు సమర్పించాడు.
లక్ష్మణుడు పర్ణశాల లోపల వేదికలను, అగ్ని గృహమును నిర్మించాడు. తరువాత సీతారాములు అడవిలో లభించు ఫలములు, పుష్పములు, పక్వమైన మాంసముసేకరించి వాటితో భూతతృప్తి గావించారు. తరువాత అందరూ ఆ పర్ణశాలలో ప్రవేశించారు. అప్పటి నుండి సీతారామలక్ష్మణులు ఆ పర్ణశాలలో నివసిస్తున్నారు. అరణ్యములలో విహరిస్తూ, ఫలములు, కాయలు, దుంపలు, తేనె మొదలగు తినే పదార్ధములు సేకరిస్తూ, వాటిని తింటూ, ఆహ్లాదంగా జీవితం గడుపుతున్నారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ 82వ సర్గ, “సేనాప్రస్థాపనమ్”, రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, భరతుడు తన అన్న రాముడిని తిరిగి తీసుకురావడానికి వనానికి సేనను ప్రస్థానిస్తాడు. భరతుడు తన సైన్యంతో సహా, రాముడు ఉంటున్న అరణ్యానికి బయలుదేరతాడు. ఈ సర్గ భరతుడి ధైర్యం, రాముడి పట్ల అతని అపారమైన ప్రేమ, మరియు రాముడు తిరిగి రావాలని కోరుకునే భరతుడి పట్టుదలను స్పష్టంగా చూపిస్తుంది. సేనాప్రస్థాపన సందర్భంలో, భరతుడు తన సైన్యానికి మార్గదర్శకత్వం చేస్తూ, రాముడి సేవలో ఉండడం తన కర్తవ్యంగా భావిస్తాడు. ఈ సర్గ భరతుడి విధేయత, ధర్మపరాయణత, మరియు కుటుంబ ప్రేమను హృదయానికి హత్తుకునేలా చిత్రిస్తుంది.
రాజసభలో వసిష్ఠుడు ఆదేశము ప్రకారము మంత్రులు సామంతులు పురప్రముఖులు ఎవరికి నిర్దేశించిన ఆసనములలో వారు కూర్చున్నారు. భరతుడు ఉన్నతాసనము అలంకరించాడు. పక్కనే శత్రుఘ్నుడు కూడా కూర్చున్నాడు. అప్పుడు వసిష్ఠుడు లేచి సభను, భరతుని ఉద్దేశించి ఇలా పలికాడు.
‘రాకుమారా! నీకు జయము కలుగు గాక! ఇప్పటి వరకు నీ తండ్రి దశరథుడు ఈ అయోధ్యను ధర్మమును ఆచరించుచూ ప్రజారంజకంగా పరిపాలించాడు. ఈ రాజ్యమును నీకు అప్పగించి దశరథుడు స్వర్గస్థుడయ్యాడు. నీ అన్న రాముడు తండ్రి మాట ప్రకారము రాజ్యమును నీకు వదిలి అరణ్యములకు వెళ్లాడు. కాబట్టి, ఓ భరతా! నీ తండ్రి, నీ అన్న, నీకు అప్పగించిన రాజ్యభారమును నీవు వహించవలెను. వెంటనే అయోధ్యకు పట్టాభిషిక్తుడవు కమ్ము. ఈ అయోధ్యకు, ఉత్తరదేశపు రాజులు, పశ్చిమ దేశపు రాజులు, దక్షిణదేశపు రాజులు, సరిహద్దులలో ఉన్న రాజ్యాధీశులు, ఇంకా నీ అధీనములో ఉన్న ద్వీపములను పరిపాలించు రాజులు నీకు కప్పములు చెల్లించెదరు. ఈ సువిశాల సామ్రాజ్యమును నీవు పరిపాలించు.” అని పలికాడు వసిష్ఠుడు.
అప్పుడు భరతుడు ఇలా అన్నాడు. “కులగురువులు వసిష్టులు ఇలా మాట్లాడటం ఉచితము కాదని నా అభిప్రాయము. నా తండ్రి దశరథుడు ఈ రాజ్యమునకు అధినేత. ఆయన మరణానంతరము ఆయన పెద్దకుమారుడు రాముడు ఈ రాజ్యమునకు అధినేత. రామునికి తప్ప వేరెవ్వరికీ ఈ రాజ్యము మీద అర్హత లేదు. ఇప్పుడు నేను అయోధ్యకు పట్టాభిషిక్తుడను అయితే అంత కన్నా మహాపాపము వేరొకటి ఉండదు. ఆ పాపము చేసి నేను ఇక్ష్వాకువంశమునకు కళంకము తీసుకు రాలేను. నా తల్లి చేసిన పాప కార్యములో నేను పాలుపంచుకోలేను. నా అన్న రామునికి ఇక్కడి నుండి నమస్కారము చేయుచున్నాను. రాముని బదులు నా తల్లి కోరిక నేను తీర్చెదను. రామునికి పట్టాభిషేకము చేసి ఆయన బదులు నేను వనవాసము చేసెదను. ఇది నానిర్ణయము.” అని పలికాడు భరతుడు.
భరతుని నిర్ణయానికి సభలో ఉన్న వారందరూ జయజయధ్వానాలు చేసారు. భరతుడు ఇంకా తన ప్రసంగము కొనసాగించాడు.
“మీ అందరి సహకారంతో నేను ఎలాగైనా రాముని అయోధ్యకు తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నిస్తాను. ఒక వేళ రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము తిరిగి రాకపోతే, నేను కూడా లక్ష్మణునితో పాటు అడవులలోనే ఉంటాను. రాముని వద్దకు వెళ్లుటకు నేను అన్ని ఏర్పాట్లు చేయించాను. సుమంత్రా! నీవు వెళ్లి రాముని వద్దకు పోవుటకు అన్ని ఏర్పాట్లు చెయ్యి. నా వెంట సైన్యము కూడా రావలెను. రాముని రాజలాంఛనములతో అయోధ్యకు తీసుకురావలెను. వెంటనే నా రథమును కూడా సిద్ధము చెయ్యి ” అని అన్నాడు.
భరతుని ఆదేశము ప్రకారము సుమంత్రుడు రధము సిద్ధము చేసాడు. సైన్యాధ్యక్షులు తమ తమ అధీనములో ఉన్న సైన్యములను ప్రయాణానికి సమాయత్తం చేసారు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ ఏకాశీతితమః సర్గ, “సభాస్తానమ్”, రామాయణంలోని ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, భరతుడు తన అన్న రాముడు వనవాసానికి వెళ్లిన తరువాత, అయోధ్యను ఎలా పాలించాలో నిర్ణయించడానికి రాజసభలో సమావేశం నిర్వహిస్తాడు. భరతుడు, రాముడి పట్ల ఉన్న గాఢమైన ప్రేమను మరియు విధేయతను ప్రతిబింబిస్తూ, రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి తనను తాను ప్రతినిధిగా ప్రకటిస్తాడు. ఈ సర్గలో, భరతుడు తన ధర్మాన్ని, భక్తిని, మరియు రాముడి పట్ల ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తూ, ప్రజలతో పాటు తన సామంతులను మరియు రాజకుటుంబాన్ని చర్చించుకుంటాడు. ఈ సంఘటన భరతుడి వినయం, విధేయత, మరియు నిస్వార్థతను హృదయానికి హత్తుకునేలా చూపుతుంది.
దశరథుడు చనిపోయి 13 రోజులు గడిచిపోయాయి. కర్మకాండలు అన్నీ పూర్తి అయ్యాయి. శోకదినములు గడిచిపోయాయి. 14వరోజున రాచరిక లాంఛనాలు ప్రారంభం అయ్యాయి. తెల్లవారు జామునే వందిమాగథులు భరతుని స్తోత్రం చేస్తున్నారు. దుందుభులు మ్రోగిస్తున్నారు. మంగళవాద్యములు మోగుతున్నాయి. వేశ్యలు నృత్యం చేస్తున్నారు. అంతా కాబోయే మహారాజు భరతుని మేలుకొలుపు తున్నారు. కాని ఈ రాజలాంఛనాలు అన్నీ భరతునికి చికాకు పుట్టించాయి. అతనికి ఇంకా దుఃఖము ఎక్కువ అయింది.
“ఆపండి. నేను రాజును కాను.” అని గట్టిగా అరిచాడు.
అన్నీ ఆగిపోయాయి. భరతుడు శత్రుఘ్నుని చూచి ఇలా అన్నాడు.
“శత్రుఘ్నా! చూచావా. కైక వలన ఎంతటి అనర్ధము వాటిల్లిందో. మహారాజు రాజ్యభారము నా మీద మోపి తాను హాయిగా స్వర్గసుఖములు అనుభవిస్తున్నాడు. ఈ కష్టములు అన్నీ నాకు వదిలి రాముడు హాయిగా వనవిహారము చేస్తున్నాడు. నేను ఒంటరిగా మిగిలిపోయాను.’ అని రోదిస్తున్నాడు.
ఇది ఇలా ఉంటే వసిష్ఠుడు రాజసభను ఏర్పాటు చేసాడు. అయోధ్యలో ఉన్న అన్ని కులముల వారినీ, అమాత్యులనూ, పురప్రముఖులను, గణాధ్యక్షులను, సభకు ఆహ్వానించాడు. వారందరూ సభలో తమ తమ ఆసనములమీద కూర్చున్నారు. తరువాత వసిష్ఠుడు భరతుని, శత్రుఘ్నుని, యుధాజిత్తును, సుమంత్రుని తీసుకొని రమ్మని భృత్యులను పంపించాడు. భరతుడు, శత్రుఘ్ను సమేతంగా వచ్చిసభలో కూర్చున్నాడు. భరతుడు రాగానే అందరూ లేచి ఆయనకు అభివాదములు తెలియ జేసారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” ఏకాదశః సర్గలో, రాముడు సరస్సు దాటి వస్తాడు, దాని నుండి దివ్య సంగీతం వినిపిస్తుంది. సరస్సు యొక్క నీటి క్రింద నుండి సంగీత స్వరాలను చూసి ఆశ్చర్యపోయిన అతను అనుసరిస్తున్న ఋషిని విచారించాడు మరియు ఆ ఋషి ఋషి మందకర్ణి యొక్క ఘట్టాన్ని వివరిస్తాడు.
ఆ అడవిలో రాముడు ముందు నడుస్తున్నాడు. సీత మధ్యలో ఉంది. వెనక లక్ష్మణుడు నడుస్తున్నాడు. వారు అనేకములైన కొండలను, సెలయేళ్లను దాటుకుంటూ వెళుతున్నారు. నదీతీరములలో ఇసుక తిన్నెల మీద ఎగురుతున్న సారస పక్షులను, చక్రవాక పక్షులను, జలపక్షులను చూస్తూ ఆనందిస్తున్నారు. గుంపులు గుంపులుగా పోవుచున్న వన్యప్రాణులను చూచి, ఆగి అవి వెళ్లిన మీదట వెళుతున్నారు. సాయంత్రము అయింది. వారు ఒక సరస్సును సమీపించారు.
ఆ సరస్సులో నుండి గీతాలాపనలు, వాద్య ధ్వనులు శ్రవణానందంగా వినిపిస్తున్నాయి. కాని ఆ దరిదాపులలో మానవ సంచారము లేదు. సీతారామలక్ష్మణులు ఆ ధ్వనులు విని ఆశ్చర్యపోయారు. తమ వెంట వస్తున్న ఋషులను ఆ వాద్య ధ్వనులు ఎక్కడినుండి వస్తున్నాయి అని అడిగారు. అందులో ధర్మభృతుడు అనే వృద్ధుడైన ఒక ఋషిఇలా చెప్పసాగాడు.
“రామా! ఈ సరస్సుపేరు పంచ అప్సర సరస్సు. ఈ తటాకము అన్ని ఋతువులలోనూ ఒకే విధంగా నీటితో నిండి ఉంటుంది. ఈ సరస్సును మాణ్ణకర్ణి అనే ఋషి నిర్మించాడు. మాణ్ణకర్ణి అనే ఆ ఋషి పదివేల సంవత్సరములు తీవ్రంగా తపస్సు చేసాడు. ఆ తపస్సుకు దిక్పాలకులు వణికిపోయారు. ఎవరి పదవిని కోరి ఆ ఋషి తపస్సు చేస్తున్నాడో అని భయపడ్డారు. వెంటనే వారుమెరుపు తీగల వలె మెరిసిపోతున్న ఐదుగురు అప్సరసలను పిలిపించారు. ఆ ఋషి తపస్సును భగ్నం చేయమని వారిని పంపారు.
ఆ అప్సరసలు మాణ్ణకర్ణి వద్దకు వచ్చారు. తమ శృంగార హావభావాలతో ఆ మునిని ఆకట్టుకున్నారు. తమకు దాసుడిగా చేసుకున్నారు. శృంగార చేష్టలలో ఓలలాడించారు. ఆ ముని తన తపోబలంతో యువకుడిగా మారిపోయాడు. ఆ ఐదుగురు
అప్సరసలను పెళ్లి చేసుకున్నాడు. వారి కొరకు ఈ సరస్సును సృష్టించి, ఈ సరస్సు అడుగుభాగంలో ఒక గృహమును ఏర్పరిచి అందులో వారితో పాటు నివసిస్తున్నాడు. ఆ ఐదుగురు అప్సరసలు ఆలపించే గీతాలు, వాద్య ధ్వనులే మీరు వింటున్నారు.” అని అన్నాడు.
ఆ మాటలు విన్న రామలక్ష్మణులు సీత ఆశ్చర్యపోయారు. రాముడు అక్కడ కొన్ని మున్యాశ్రమములు చూచాడు. ఆ ఆశ్రమములలో ఉన్న మునులు రాముని సాదరంగా ఆహ్వానించారు. అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించారు. రాముడు ఆ ముని ఆశమములలో కొంత కాలము నివసించాడు. తరువాత రాముడు ఆ అడవిలో ఎన్నో ఆశ్రమములు సందర్శించాడు. ఆయా ఆశ్రమములలో కొంత కాలము నివసించాడు.
ఒక ఆశ్రమములో పది మాసములు, మరొక ఆశ్రమములో ఒక సంవత్సరము, మరొక ఆశ్రమములో నాలుగు మాసములు, ఐదు మాసములు, ఆరు మాసములు, ఒక మాసము, ఒకటిన్నర మాసము, మూడు మాసములు, ఎనిమిది మాసములు ఈ ప్రకారంగా రాముడు, సీత, లక్ష్మణుడు ఒక్కొక్క ఆశ్రమములో పై చెప్పిన విధంగా నివసిం చారు. ఆ విధంగా ముని ఆశ్రమములలో నివసిస్తూ రాముడు, సీత, అక్ష్మణుడు తమ వనవాస కాలములో పది సంవత్సరములు ఆనందంగాగడిపారు.
(దీనికి సంబంధించిన శ్లోకము ఇక్కడ ఉదహరిస్తాను. చదవండి.)
తదాసంవసతస్తస్య మునీనామాశ్రమేషు వై,
రమతశ్చానుకూల్యేన యయు: సంవత్సరా దశ.
ఆ విధంగారాముడు ఆశ్రమములలో నివసిస్తూ ఉండగా పది సంవత్సరములు అనుకూలంగా గడిచిపోయాయి. అంటే ఈ పదిసంవత్సరములు రాముడు ఒక్క రాక్షసుని కూడా చంపలేదు. మరి రాముడు మునులను రక్షిస్తాను అని వారికి ఇచ్చిన మాట ఏమైనట్టు. వారు రాక్షసుల చేతిలో అనుదినమూ బాధలు పడుతున్నారా! చస్తున్నారా! సీతను, లక్ష్మణుని అయినా వదులుకుంటాను కానీ నేను మునులకు ఇచ్చిన మాట తప్పను. అందుకే ధనుర్బాణాలు ధరించాను అన్న రాముడు వారి ఊసెత్తకుండా పది సంవత్సరాలు ఆనందంగా గడిపాడు. కానీ వారి కష్టాలు బాధలు తీర్చలేదు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి?దీని అర్థం ఏమయి ఉంటుంది.
దీనికి సమాధానం మనకు ముప్పదవ సర్గలో కనిపిస్తుంది. రాముడు ఒక్కొక్క రాక్షసుని చంపడానికి ఇష్టపడలేదు. ఒకేసారి రాక్షసులనందరినీ మట్టు పెట్టాలని అనుకున్నాడు. అదును కోసం వేచి ఉన్నాడు. శూర్పణఖ వల్ల ఆ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. మొత్తం 14,000+5,000 సైనికులను ఖరుని, దూషణుని, త్రిశిరుని ఒకేసారి సంహరించి దండకారణ్యములో రాక్షస బాధను శాశ్వతంగా నివారించాడు. రాముడు తాత్కాలిక పరిష్కారం కోసం కాకుండా శాశ్వత పరిష్కారం కోసరం వేచిఉన్నాడు. ఇలా అర్థం చేసుకుంటే రాముని ఆంతర్యం మనకు అర్థం అవుతుంది.)
తరువాత ధర్మజ్ఞుడైన రాముడు, సీతతో, లక్ష్మణునితో ఆయా ఆశ్రమములలో నివసిస్తూ, తుదకు సుతీక్షుని ఆశ్రమమునకు చేరుకున్నాడు. రాముడు సుతీక్షుని ఆశ్రమంలో కొంతకాలము నివసించాడు.
ఒకరోజు రాముడు సుతీక్ష మహామునిని చూచి ఇలా అన్నాడు. “మహాత్మా! అగస్త్యుడు ఈ అరణ్యములోనే ఆశ్రమము నిర్మించుకొని నివసిస్తున్నాడు అని వారి గురించి కథలు కధలు గా విన్నాము. మాకు ఆయనను దర్శించవలెనని కోరికగా ఉంది. ఆయన ఆశ్రమము ఎక్కడ ఉందో దయచేసి తెలియజేయండి.” అని ప్రార్థించాడు.
“రామా! మంచి పని చేస్తున్నావు. నేనే నిన్ను అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్లమని చెబుదాము అని అనుకుంటున్నాను. ఇంతలో నీవే అడిగావు. చాలా సంతోషము. ఈ ఆశ్రమము నుండి నాలుగు యోజనముల దూరంలో దక్షిణ దిశగా అగస్త్యుని సోదరుడు (అగస్త్యభ్రాత) ఆశ్రమము కలదు.
(ఈ అగస్త్య భ్రాత గురించి మన ఇంట్లో పెద్ద వాళ్లకు తెలుసు. అగస్త్యుని సోదరునికి పేరు లేదు. అంతా అగస్త్య భ్రాత అంటారు. “వీడెవడో అగస్త్య భ్రాతలా ఉన్నాడే!” అని అనడం మనం వింటూ ఉంటాము. అగస్త్యభ్రాత అనేది ఒక నానుడి.)
రామా! నీవు అగస్త్య భ్రాత ఆశ్రమములో ఒక రాత్రి ఉండి మరునాడు అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్లు. అగస్త్య భ్రాత ఆశ్రమము నకు ఒక యోజన దూరంలో అగస్త్యుని ఆశ్రమము ఉంది.” అని అన్నాడు.
తరువాత రాముడు సుతీక్షుని వద్ద అనుజ్ఞ తీసుకొని అగస్త్యుని ఆశ్రమమునకు బయలు దేరాడు. దక్షిణ దిశగా నాలుగు యోజనములు ప్రయాణము చేసి అగస్త్య భ్రాత ఆశ్రమమును చేరుకున్నారు.
ఫలవృక్షములు సమృద్ధిగా కల ఆ ప్రాంతమును చూచి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఇక్కడ ఉన్న ఫలవృక్షములు, పిప్పళ్ల చెట్లు, ఆశ్రమము బయట ఉన్న సమిధలు, సేకరించిన దర్భలు, ఆరవేసిన నార చీరలు, చూస్తుంటే సుతీక్ష మహాముని చెప్పిన అగస్త్య భ్రాత ఆశ్రమము ఇదే అని తెలుస్తోంది. అటు చూడు, ఆ ఆశ్రమము పైనుండి అగ్ని హోత్రము నుండి వెలువడే పొగ ఆకాశంలోకి ఎలా పోతోందో! సందేహము లేదు. ఇదే అగస్త్య భ్రాత ఆశ్రమము.
లక్ష్మణా! నీకు తెలుసా! అగస్త్యుడు ఈ దక్షిణ ప్రాంతము అరణ్యములలో నివసించు బ్రాహ్మణులకు తాపసులకు వారికి ఎంతో ఉపకారము చేసాడు. ఎలాగంటే…..
ఈ అడవిలో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారు ఇక్కడ నివసించే బ్రాహ్మణులను, తాపసులను మోసం చేసి చంపి తినేవారు. ఇల్వలుడు ఒక బ్రాహ్మణుడిగా వేషం వేసుకొనేవాడు. “ ఈ రోజు నా తండ్రి ఆబ్దికము మీరు భోజనానికి భోక్తగా రావాలి” అని బ్రాహ్మణులను తన ఇంటికి తీసుకొని వెళ్లేవాడు. వాతాపి ఒక గొర్రెగా మారి పోయేవాడు. శాస్త్రములలో చెప్పబడిన శ్రాద్ధకర్మల విధి ప్రకారము ఇల్వలుడు ఆ గొర్రెను చంపి ఆ మాంసముతో ఆ భోక్తగా వచ్చిన బ్రాహ్మణునకు భోజనం పెట్టేవాడు.
బ్రాహ్మణుడు భోజనం చేసిన తరువాత “వాతాపీ! బయటకు రా!” అని బిగ్గరగా అరిచేవాడు. ఆ బ్రాహ్మణుని పొట్టలో ఉన్న వాతాపి గొర్రెగా మారి, ఆ బ్రాహ్మణుని పొట్టను చీల్చుకొని బయటకు వచ్చేవాడు. వాతాపి, ఇల్వలుడు ఇద్దరూ కలిసి ఆ బ్రాహ్మణుని చంపి తినేవారు. ఈ ప్రకారము ఆ రాక్షసులు ఇద్దరూ ఎంతో మంది బ్రాహ్మణులను చంపారు. ఈ సంగతి తెలిసి దేవతలు, బ్రాహ్మణులు అగస్త్యుని శరణు వేడారు. అగస్త్యుడు సరేఅన్నాడు.
ఒక రోజు అగస్త్యుడు ఇల్వలుని ఇంటికి భోక్తగా వెళ్లాడు. వాతాపి గొర్రెగా మారాడు. ఇల్వలుడు వాతాపిని చంపి ఆ మాంసమును వండి అగస్త్యునికి వడ్డించాడు. అగస్త్యుడు తృప్తిగా భోజనం చేసాడు. “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అంటూ బ్రేవ్మంటూ త్రేన్చాడు. అంతే. అగస్త్యుని పొట్టలో ఉన్న వాతాపి జీర్ణం అయిపోయాడు. ఇది తెలియని ఇల్వలుడు “వాతాపీ! బయటకు రా!’ అని అరిచాడు. ఎంత అరిచినా వాతాపి రాలేదు.
అగస్త్యుడు నవ్వాడు. “ఇంకెక్కడి వాతాపి. వాడు నా పొట్టలో ఎప్పుడో జీర్ణం అయిపోయాడు.” అన్నాడు తన పొట్ట నిమురుకుంటూ. దానికి కోపించి ఇల్వలుడు అగస్త్యుని మీద దాడి చేసాడు. అగస్త్యుడు తన తపోశక్తితో ఇల్వలుని భస్మం చేసాడు. ఆ ప్రకారంగా అగస్త్యుడు ఈ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణులకు, మునులకు రాక్షస బాధ తొలగించాడు. ఆ అగస్త్యుని సోదరుడే ఈ అగస్త్య భ్రాత” అని వివరించాడు రాముడు.
(ఈ రోజుల్లో కూడా తల్లులు పసిబిడ్డలకు ఉగ్గు, పాలు పట్టిన తరువాత “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం మా అబ్బాయి తాగిన పాలుజీర్ణం” అని పొట్ట మీద నిమురడం మనం చూస్తూ ఉంటాము.)
అంతలో సాయంత్రం అయింది. రామలక్ష్మణులు సాయంసంధ్యలు నిర్వర్తించారు. అగస్త్యభ్రాత ఆశ్రమములోనికి ప్రవేశించి ఆయనకు పాదాభివందనము చేసారు. అగస్త్యభ్రాత కూడా రాముని సాదరంగా ఆహ్వానించాడు. ఫలములు పుష్పములు ఇచ్చి సత్కరించాడు. రాముడు, లక్ష్మణుడు, సీత ఆ రాత్రికి ఆ ఆశ్రమములోనే ఉన్నారు.
మరునాడు ఉదయమే లేచి రాముడు సంధ్యావందనాది కార్యక్రమములు పూర్తి చేసుకొని అగస్త్యభ్రాత వద్దకు వెళ్లి అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్లుటకు ఆయన అనుమతి కోరాడు. అగస్త్య భ్రాత రామునికి తన అన్న అగస్త్యుని ఆశ్రమమునకు పోవుటకు మార్గము చెప్పాడు. రాముడు, సీత, లక్ష్మణులు వెంట రాగా అగస్త్య ఆశ్రమమునకు బయలుదేరాడు. అగస్త్య భ్రాత చెప్పిన గుర్తుల ప్రకారము ప్రయాణం చేస్తున్నాడు.
ఒకచోట ఫలవృక్షములు మెండుగా కనిపించాయి. లేళ్లు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. హెూమధూమము పైకి లేస్తోంది. దానిని బట్టి అగస్త్యుని ఆశ్రమము అక్కడకు దగ్గరలోనే ఉంది అని రాముడు అనుకొన్నాడు. అంతలోనే నారచీరలు ఆరవేసి ఉన్న ఆశ్రమ ప్రాంగణము కనపడింది. మృగములు తమ సహజ వైరము మరిచి ప్రశాంతంగా సంచరిస్తున్నాయి.
“ఎవరి తపోప్రభావంచేత రాక్షసులు ఈ ప్రాంతానికి రావడానికి భయపడుతుంటారో ఆ అగస్త్య మహా ముని ఆశ్రమము ఇదే. ఇక్కడకు దేవతలు గంధర్వులు నియమం తప్పకుండా వచ్చి అగస్త్య మహామునిని సేవిస్తుంటారు.
ఈ అగస్త్య మహాముని ఆశ్రమములో అబద్ధాలు చెప్పేవారికి, ఈ క్రూరులకు, వంచకులకు, సాటి మానవులను హింసించేవారికి స్థానము లేదు. ఎంతో మంది మహర్షులు ఇక్కడ తపస్సు చేసి, స్వర్గానికి వెళ్లారు. ఈ ఆశ్రమ ప్రాంతములో ఎవరైనా తపస్సు చేసి కోరికలు కోరుకుంటే వాటిని దేవతలు తప్పకుండా నెరవేరుస్తారు. ఇదీ ఆ ఆశ్రమ మహాత్మ్యం.
లక్ష్మణా! ముందు నీవు ఆశ్రమములోనికి ప్రవేశించి నేను, సీత మహాముని దర్శనానికి వచ్చామని అగస్త్యునికి విన్నవించు” అని రాముడు లక్ష్మణునితో అన్నాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రిసప్తతితమః సర్గలో, పరశు రాముడు నిష్క్రమణ సమయంలో వివాహ బృందం అయోధ్యకు చేరుకుంటుంది. వివాహానికి ముందు వచ్చిన భరతుని మామ అయిన యుధాజిత్ ఇప్పుడు భరతుడు మరియు శత్రుఘ్నులను తన రాజ్యానికి తీసుకువెళతాడు. అప్పటి నుండి రామ, లక్ష్మణులు తమ తండ్రి కోరిక మేరకు వారి వారి సంక్షేమ కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నారు. రాముడు మరియు సీత వారి ఆనందకరమైన వైవాహిక జీవితంలోకి ప్రవేశిస్తారు.
పరశురాముడు మహేంద్రగిరికి వెళ్లిన తరువాత రాముడు తన వద్ద ఉన్న విష్ణుధనుస్సును, బాణమును, వరుణ దేవునికి ఇచ్చాడు. తరువాత రాముడు వసిష్ఠుడు మొదలగు ఋషులకు బ్రాహ్మణులకు నమస్కరించాడు. తండ్రి దశరథుని చూచి ఇలాఅన్నాడు.
“తండ్రీ! పరశురాముడు వెళ్లిపోయాడు. ఇంక మనము అయోధ్యకు ప్రయాణము సాగిద్దాము. మన పరివారమునకు సేనలకు అనుజ్ఞ ఇవ్వండి.” అని అన్నాడు.
అప్పటి దాకా ఆశ్చర్యంతో చూస్తున్న దశరథుడు ఒక్కసారి తెలివిలోకి వచ్చాడు. రాముని గట్టిగా కౌగలించుకున్నాడు. శిరస్సును ముద్దుపెట్టుకున్నాడు. అటు ఇటు చూచి పరశురాముడు వెళ్లి పోయాడు అని నిర్ధారించుకున్నాడు. ఆనందంతో పొంగిపోయాడు. రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు మరలా జన్మమెత్తినట్టు భావించాడు. దశరథుని మనస్సు కుదుట పడింది. తన సైన్యమునకు అయోధ్యకు ప్రయాణము సాగించమని ఆజ్ఞాపించాడు. అందరూ అయోధ్యకు చేరుకున్నారు.
వీరి రాక ముందు తెలిసిన అయోధ్యాపుర వాసులు వారికి ఘనస్వాగతం పలికారు. నగరమంతా మామిడి తోరణములతోనూ, అరటి స్తంభములతోనూ, రకరకాల పూలతోనూ అలంకరించారు. మంగళ వాద్యములతో రామునికి ఎదురేగి స్వాగతం పలికారు. అందరూ రాజనగరు ప్రవేశించారు.
కౌసల్య, సుమిత్ర, కైకేయీ ఎదురుగా వచ్చి కొత్త కోడళ్లను ఆహ్వానించి లోపలకు తీసుకొని వెళ్లారు. సీతకు, ఊర్మిళకు,మాండవికి, శ్రుతకీర్తికి కొత్త పట్టుబట్టలు అలంకరింపజేసారు. నూతన వధూవరులు గృహప్రవేశ కార్యక్రమును నిర్వర్తించారు. గృహదేవతలను పూజించారు. జనకుని పుత్రికలు అత్తగార్లకు, పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నారు. బ్రాహ్మణులకు గోదానములు, సువర్ణదానములను చేసి వారిని తృప్తిపరిచారు. ఆ రాత్రికి వారి వారి భర్తలతో సాంసారిక సుఖములను అనుభవించారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తండ్రి దశరథునికి సేవచేసు కుంటూ ఉన్నారు.
కొన్ని రోజులు గడిచిన తరువాత దశరథుడు భరతుని చూచి ఇలా అన్నాడు.
“నాయనా భరతా! నీ మేనమామ యుధాజిత్తు నిన్ను తన వెంట తీసుకొని వెళ్లుటకు కేకయ రాజ్యము నుండి వచ్చాడు. ఆ విషయము నాకు మిథిలలోనే చెప్పాడు. శుభకార్యములు జరుగు చుండుట వలన వీలు కాలేదు. నీవు నీ తాత గారింటికి వెళ్లి ఆయనను సంతోష పెట్టు.” అని అన్నాడు.
భరతుడు తండ్రి మాట ప్రకారము చేసాడు. తండ్రికి తల్లులకు, పెద్దలకు పురోహితులకు నమస్కరించి వారి ఆశీర్వాదము వారి అనుమతి తీసుకున్నాడు. శత్రుఘ్నుడు వెంట రాగా తన తాతగారి ఇంటికి ప్రయాణమయ్యాడు.
భరత శత్రుఘ్నులు వెళ్లిన తరువాత రామ లక్ష్మణులు తండ్రిగారికి సేవజేసుకుంటూ ఉన్నారు. తండ్రి అనుమతితో రాముడు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పనులను చేసాడు. పూర్తిగా నియమములను పాటిస్తూ తండ్రికి రాజ్యపాలనలో సాయం చేస్తున్నాడు. ఎవరి మనస్సూ నొప్పించకుండా అందరికీ అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు.
రాముని ప్రవర్తనకు, గుణగణములకు అయోధ్య ప్రజలు ఎంతో సంతోషించారు. రాముని వంటి ప్రభువు తమకు కావాలని కోరు కున్నారు.
రాముడు రాజ్యకార్యములలో పడి భార్యను నిర్లక్ష్యము చేయలేదు. సీతను ఎంతో ప్రేమానురాగాలతో చూసుకొనేవాడు. ఎల్లప్పుడూ ఆమెను తన హృదయ పీఠము నందు నిలుపుకొనే వాడు.
సీత కూడా రాముని ఎడల ఎంతో ప్రేమతో ప్రవర్తించేది. రాముని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. రాముడు సీత మధ్య ఉన్న ప్రేమ దినదినాభివృద్ధి చెందుతూ ఉండేది. ఒకరి హృదయము తెలిసి మరొకరు నడుచుకొనేవారు. వారి అన్యోన్యాను రాగములతో కూడిన దాంపత్యము చూచి కౌసల్య ఎంతో మురిసి పోయేది. ఆ ప్రకారంగా రాముడు సీత సాక్షాత్తు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిలాగా ప్రకాశిస్తున్నారు.
అయోధ్యాకాండం యొక్క షట్సప్తతితమః సర్గంలో, దశరథ మహారాజు రాముని వనవాసం పట్ల తీవ్రంగా దుఃఖిస్తూ తన గత పాపాలను తలుచుకుంటాడు. ఆయన కైకేయితో చేసిన వాగ్దానం ఫలితంగా రాముడు అడవికి వెళ్లిపోయినందుకు పశ్చాత్తాపంతో బాధపడతాడు. రాత్రిలో దశరథుడు కౌసల్య, సుమిత్రలతో తన బాధను పంచుకుంటాడు. దశరథుడు రాముని విడిచి ఉండలేక, ఆ వేదనతో అణచిపడి, తన ప్రాణాలను విడుస్తాడు. ఆయన చివరి క్షణాలలో రాముని మరియాదలను, అతని కరుణామయ స్వభావాన్ని తలుచుకుంటాడు. కౌసల్య, సుమిత్రలు దశరథుని మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోతారు, అయోధ్యలో విషాద వాతావరణం నెలకొంటుంది.
మరునాడు తెల్లవారింది. భరతుడు వచ్చాడు అన్న వార్త విని కులగురువు వసిష్ఠుడు భరతుని వద్దకు వచ్చాడు. భరతునితో ఇలా అన్నాడు. “నాయనా భరతా! నీకు శభము అగుగాక! నీ తండ్రి మరణము గురించి దుఃఖించకుము. నీ తండ్రికి కర్మకాండలు జరిపించు.” అని పలికాడు. కులగురువు వసిష్ఠుని ఆదేశము ప్రకారము భరతుడు తన తండ్రికి ఉత్తర క్రియలు అన్ని యధావిధిగా జరిపించాడు. దశరథ మహారాజు శరీరమును తైలద్రోణిలో నుండి బయటకు తీసి నేల మీద ఉంచారు. తైల ద్రోణిలో ఉంచడం వల్ల మహారాజు శరీరములో ఏ మార్పూ రాలేదు. నిద్రపోతున్నట్టు ఉన్నడు దశరథుడు. తరువాత మహారాజును రత్నములు పొదిగిన శయ్యమీద పడుకోబెట్టారు. తన తండ్రి శవమును చూచి భరతుడు ఎంతో దు:ఖించాడు.
“మహారాజా! నేను ఇంట్లో లేని సమయం చూచి రాముని అడవులకు ఎందుకు పంపావు? అటువంటి నిర్ణయము ఎందుకు తీసుకున్నావు? నీకేం హాయిగా స్వర్గానికి వెళ్లావు. రాముడు లక్ష్మణునితో కలిసి అరణ్యములకు వెళ్లాడు. నేను జీవచ్ఛవము లాగా ఇక్కడ ఉన్నాను. ఇంక ఈ అయోధ్య యోగక్షేమములు ఎవరు చూస్తారు? మహారాజా! నీవులేని అయోధ్య చంద్రుడు లేని ఆకాశము వలె కళావిహీనంగా ఉంది.” అని విలపిస్తున్నాడు భరతుడు. ఆ ప్రకారంగా శోకిస్తున్న భరతుని చూచి వసిష్ఠుడు ఇలా అన్నాడు.
“భరతా! పోయినవారి గురించి చింతించి ప్రయోజనములేదు. జరుగవలసిన కార్యము గురించి ఆలోచించు. మహారాజుకు ప్రేతకర్మలు నిర్వర్తించు. మహారాజును ప్రేతత్వము నుండి విముక్తి కలిగించు.” అని అన్నాడు. అగ్ని గృహమునుండి ఋత్విక్కులు అగ్నిని తీసుకొని వచ్చారు. దశరథుని పార్థివశరీరమును బయటకుతీసుకొని వచ్చారు. ఆయన శరీరమును పల్లకీలో పరుండబెట్టారు. ఆ పల్లకిని ఊరేగింపుగా శ్మశానమునకు తీసుకొని వెళ్లారు. దారిలో పురజనులు ఆయన శరీరము మీద వెండి, బంగారము, పూలు చల్లారు. చందనము కర్రలతో చితిని పేర్చారు. సుగంధ ద్రవ్యములను చితిలో వేసారు. దశరథుని శరీరమును చితిమీద ఉంచారు. ఋత్విక్కులు హెమం చేసారు. వేదములు పఠించారు. దశరథుని భార్యలందరూ తమ తమ వాహనములలో శ్మశానమునకు చేరుకున్నారు.