మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ అష్టత్రింశః సర్గః: రామాయణంలోని బాలకాండలో అష్టత్రింశః సర్గః ఒక ప్రధాన భాగం. ఈ సర్గలో రాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్రుడితో కలిసి జనక మహారాజు యజ్ఞానికి చేరుతారు. అక్కడ వారు శివుని ధనుస్సును (ధనుర్బాణాన్ని) దర్శిస్తారు. జనకుడు, శివుని వును ఎవరైతే విరిచివేస్తారో, ఆ వ్యక్తికి తన కుమార్తె సీతను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు.
” ఓ రామా! ఇప్పుడు నీకు సగరుడి కధ చెబుతాను విను. పూర్వము అయోధ్యా నగరమును సగరుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు.ఆయనకు పుత్ర సంతానము లేదు. విదర్భ రాజు కుమారి కేశిని అతని మొదటి భార్య.. సుమతి ఆయన రెండవ భార్య..
పుత్ర సంతానము కొరకు సగరుడు ఇద్దరు భార్యలతో సహా హిమవత్పర్వతమునకు పోయి అక్కడ భృగుప్రస్రవణము అనే పర్వతము మీద నూరు సంవత్సరముల పాటు తపస్సు చేసారు. వారి తపస్సునకు మెచ్చిన భృగు మహర్షి వారికి పుత్ర సంతానము ప్రసాదించాడు.
“ఓ సగర చక్రవర్తీ! నీకు ఒక భార్య యందు ఒక కుమారుడు, మరొక భార్య యందు అరవైవేల మంది కుమారులు జన్మిస్తారు.” అని వరము ఇచ్చాడు. వారు ఎంతో సంతోషించారు.
కాని వారికి ఒక సందేహము కలిగింది. ” ఓ మహర్షీ! మాలో ఎవరికి ఒక పుత్రుడు కలుగుతాడు.” అని అడిగారు.
“ఆ విషయం మీలో మీరే తేల్చుకోండి.” అని అన్నాడు.
భృగుమహర్షి
అప్పుడు కేశిని ” ఓ మహర్షి! నాకు వంశము నిలిపే ఒక కుమారుని ప్రసాదించండి.” అని కోరుకుంది.
రెండవ భార్య సుమతి “నాకు 60,000 వేల మంది కుమారులను ప్రసాదించండి.” అని కోరుకుంది.
భృగుమహర్షి వారిని ఆ ప్రకారము అనుగ్రహించాడు. భృగుమహర్షికి నమస్కరించి అయోధ్యకు తిరిగి వచ్చారు. కాలక్రమేణా ఇరువురు గర్భములు ధరించారు. పెద్ద భార్య కేశిని అసమంజుడు అనే కుమారుని ప్రసవించింది. రెండవ భార్య ఒక పెద్ద పిండమును ప్రసవించింది. అది పగిలి అందులో నుండి 60,000 మంది పుత్రులు జన్మించారు. వారందరూ పెరిగి పెద్ద వారు అయ్యారు.
వారందరూ ఆటలు ఆడుతు ఉండగా పెద్దవాడు మిగిలిన వారిని నీటిలో ముంచి, వారు అరిచి కేకలు పెడుతుంటే, ఆనందించేవాడు. అనేక రకములైన పాప కార్యములను చేయుతూ జనులను బాధ పెడుతూ ఉండేవాడు. వాడి బాధ పడలేక సగరుడు అసమంజుని రాజ్యమునుండి వెళ్లగొట్టాడు. ఆ అసమంజుని పుత్రుడు అంశు మంతుడు. అతడు తండ్రి మాదిరి కాకుండా ఎంతో ధార్మికుడు. సజ్జనుడు. అందరూ అతను అంటే ఇష్టపడేవారు.
కొంత కాలము తరువాత సగరుడు ఒక యజ్ఞమే చేయ సంకల్పించాడు. పురోహితులను, ఋత్తిక్కులను సంప్రదించాడు. యజ్ఞమునకు కావలసిన సంభారములు సమకూర్చుకున్నాడు. యజ్ఞము చేయ పూనుకున్నాడు.
శ్రీమద్రామాయణము
బాల కాండ ముప్పది ఎనిమిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని సప్తవింశః సర్గలో, పెద్దల ఆదేశాలను పాటించి, తనకు అప్పగించిన పనిని చేయడంలో రాముడి ప్రవర్తనతో విశ్వామిత్ర మహర్షి సంతృప్తి చెందాడు, రాముడికి శాస్త్రం, అస్త్రాలు అని అనేక ఆయుధాలను ఇచ్చాడు . ఆయుధాలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించారు. ఒకటి శాస్త్రం – కత్తి, లాన్స్ లేదా గద్ద వంటి చేతితో పట్టుకునే ఆయుధం.
మరునాడు అందరూ నిద్ర లేచారు. ప్రాతఃకాలము లో ఆచ రించ వలసిన సంధ్యావందనము మొదలగు కార్యక్రమములు నిర్వర్తించారు.
విశ్వామిత్రుడు రామునితో “రామా! నీకు దివ్యాస్త్రములు అన్ని ఇస్తాను. వాటితో నీవు దేవతలను, అసురులను, గంధర్వులను యుద్ధములో జయింపగలవు.
రామా! నీకు దివ్యమైన దండ చక్రమును, ధర్మ చక్రమును, కాల చక్రమును, విష్ణు చక్రమును, అతి ఉగ్రమైన ఇంద్రాస్త్రమును, వజ్రాస్త్రమును, శివుని శూలముతో సమానమైన శూలాస్త్రమును, బ్రహ్మశిరోనామకాస్త్రమును, అన్నిటి కంటే ఉత్తమము, శ్రేష్ఠము అయిన బ్రహ్మాస్త్రమును నీకు ప్రసాదించెదను. ఇవి కాకుండా నీకు మోదకి, శిఖరి అనే రెండు గదాయుధములను కూడా ఇస్తాను.
రామా! నీకు ధర్మపాశము, కాలపాశము, వారుణాస్త్రము ఇస్తాను. ఇవే కాకుండా నీకు రెండు పిడుపాటులను అనగా తడిగా ఉన్న పిడుగు, పొడిగాఉన్న పిడుగు ఇచ్చెదను. నీకు పినాక అస్త్రమును, నారాయణాస్త్రమును ఇచ్చెదను.
రామా! నీకు ఆగ్నేయాస్త్రమును, వాయవ్యాస్త్రమును ఇచ్చెదను.
ఓ రామా! నీకు హయశిరము, క్రౌంచ అస్త్రము అనే రెండు శక్తులను ప్రసాదిస్తున్నాను. రాక్షసులు వాడేటటు వంటి అస్త్రములు, అనగా కంకాళము, ముసలము, కపాలము, కంకణము నీకు ఇస్తున్నాను.
ఓ రామా! నీకు విద్యాధరముఅనే మహాస్త్రమును, నందనము అనే ఖడ్గమును ఇస్తున్నాను. నీకు గాంధర్వ అస్త్రమును, సౌర అస్త్రమును ఇస్తున్నాను. ఇవి నిద్రావస్థను కలుగ చేస్తాయి. నిద్రావస్థనుండి విముక్తులను చేస్తాయి. వీటికి ఆ ప్రభావము ఉంది.
ఓ రామా! నీకు దర్పణ, శోషణ, సంతాపన, విలాపన, మొదలగు అస్త్రములు, మన్మధుడు ఉపయోగించే మదనాస్త్రమును, పిశాచములు వాడే మోహనాస్త్రమును ప్రసాదిస్తున్నాను.
ఓ రామా! ఇంకా నీకు తామసాస్త్రము, సౌమనాస్త్రము, సంవర్ధాస్త్రము, ముసలము, సత్యము అనే అస్త్రము, పరమ శ్రేష్టమైన మాయాధరాస్త్రము, అత్యంత శక్తి వంతము, భయంకరము అయిన త్వష్టురాస్త్రము, మొదలగు అస్త్రములను నీకు ఇస్తున్నాను.
ఓ రామా! ఈ అస్త్రములు అన్నీ కామ రూపులు. తమకు ఇష్టం వచ్చిన రూపములు ధరింపగలవు. అత్యంత బలము కలవి. వీటిని నానుండి వెంటనే గ్రహించు.” అని అన్నాడు విశ్వామిత్రుడు.
రాముడు వాటిని భక్తి శ్రద్ధలతో గ్రహించాడు. ఆ అస్త్రములు అన్నీ దేవతలకు కూడా ప్రయోగ ఉపసంహారములతో గ్రహించడం దుర్లబము. అటువంటిది రాముడు ఆ అస్త్రసముదాయమును అవలీలగా అధ్యయనం చేసాడు.
విశ్వామిత్రుడు మంత్రములను ఉచ్ఛరిస్తూ ఒకటి వెంట ఒక అస్త్రమును రామునికి ఇస్తూ ఉంటే, ఆ అస్త్రమునకు అధి దేవతలు వచ్చిరాముని ముందు నిలబడి “రామా! ఇకనుండి మేమందరమూ నీకు దాసులము” అని పలికారు. విశ్వామిత్రుడు ఉపదేశించిన అస్త్రములు అన్నింటినీ రాముడు భక్తితో స్వీకరించాడు. ఆ అస్త్రములకు అధిదేవతలను చూచి “మీరంతా నా మనసులో ఉంటూ నేను మిమ్ములను స్మరించి నపుడు నా వద్దకు రండి” అనిపలికాడు.
తరువాత రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట ప్రయాణమయ్యారు
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై ఏడవ సర్గ సంపూర్ణము.
అయోధ్యాకాండము చతుస్త్రింశః సర్గము (34వ సర్గ) రామాయణంలో ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో, కౌసల్య, సుమిత్ర, సీతలతో కలిసి అరణ్యానికి వెళ్ళడానికి రాముడు సిద్ధమవుతాడు. అటువంటి సమయంలో, కౌసల్య రాముని నిరోధిస్తుంది, తల్లి భర్తవ్రతాన్ని గురించి మాట్లాడుతుంది. రాముడు ధర్మం, పితృవాక్యపాలనం గురించి సమాధానమిస్తాడు. సీత, లక్ష్మణులు రాముని వెనుక నడుస్తారు. చివరికి, రాముడు తన తల్లి కౌసల్యకు, తనను అనుమతించమని అభ్యర్థిస్తూ దీవెనలు కోరుతాడు. ఈ సర్గ రాముని ధర్మ నిష్ఠ, పితృవాక్య పాలనం, సీత, లక్ష్మణుల భక్తిని, కౌసల్యాదేవి ప్రేమను ప్రదర్శిస్తుంది.
రాముడు ఆదేశానుసారము సుమంత్రుడు రామ, లక్ష్మణ, సీతల రాకను దశరథునికి ఎరింగించుటకు అంతఃపురములోకి వెళ్లాడు. అంత:పురములో దశరథుడు గ్రహణం పట్టిన చంద్రుడి మాదిరి కళావిహీనంగా కూర్చుని ఉన్నాడు. సుమంత్రుడు దశరథుని వద్దకుపోయి “మహారాజులకు జయము. తమరి కుమారుడు రామలక్ష్మణులు, తమరి కోడలు సీత తమరి దర్శనార్ధము వచ్చి ఉన్నారు.” అని అన్నాడు.
ఆ మాటలువిన్న దశరథుడు ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. సుమంత్రుని వంక బేలగా చూచాడు. మరలా సుమంత్రుడు ఇలా అన్నాడు. “మహారాజా! వారు అరణ్యములకు పోయే ముందు తమరి దర్శనార్థము ద్వారము వద్ద నిలబడి ఉన్నారు. వారికి తమరి దర్శన భాగ్యము కలిగించండి. అంతేకాదు అడవులకు పోయే ముందు మీరు కూడా రాముని ఒక సారి కనులారా చూడండి. తరువాత మీకు ఆ భాగ్యం కలుగుతుందో లేదో.” అని అన్నాడు సుమంత్రుడు.
అప్పుడు దశరథుడు సుమంత్రునితో ఇలా అన్నాడు. “సుమంత్రా! అంత:పురములో ఉన్న నా భార్యలను అందరినీ తీసుకొని రమ్ము. వారితో కలిసి నేను రాముని చూడదలచాను.” అని అన్నాడు.
వెంటనే సుమంత్రుడు అంత:పురములోనికి వెళ్లి దశరథుని భార్యలనందరినీ పిలుచుకొని వచ్చాడు. దశరథునికి 350 మంది భార్యలు. వారి అందరిలోకి పెద్దభార్య కౌసల్య కౌసల్య ముందురాగా, 350 మంది అక్కడకు వచ్చారు. అందరూ వచ్చారు అని సరి చూసుకొని తృప్తిపడిన తరువాత దశరధుడు సుమంత్రుని చూచి “సుమంత్రా! ఇప్పుడు రాముని లోపలకు తీసుకొని రా!” అని ఆదేశించాడు.
సుమంత్రుడు బయటకు వెళ్లి రాముడు, లక్ష్మణుడు, సీతను లోపలకు తీసుకొని వెళ్లాడు. లోపల దశరథుడు తన 350మంది భార్యలు చుట్టు ఉండగా ఒక ఆసనము మీద కూర్చుని ఉన్నాడు. రాముని చూడగానే దశరథునకు దు:ఖము ఆగలేదు. వెంటనే ఆసనము మీదినుండి లేచాడు. రాముని వద్దకు గబా గబా నడుచుకుంటూ వెళ్లాడు. కాని మధ్యలోనే దుఃఖము ఆపుకోలేక కిందపడిపోయాడు. స్పృహ తప్పాడు.
తండ్రి గారు కిందపడటం చూచిన రామలక్ష్మణులు ఆయన వద్దకు పరుగెత్తుకొని వెళ్లారు. రాముని చూడగానే అంతఃపుర స్త్రీలందరూ దుఃఖము ఆపుకోలేక హా హా కారాలు చేసారు. వారి దు:ఖమును చూచి రామలక్ష్మణులకు కూడా దు:ఖము ఆగలేదు. వారు తమ తండ్రి దశరథుని పైకి లేపి ఒక పాన్పు మీద పడుకోబెట్టారు. దశరథుడు స్పృహలోకి వచ్చాడు. దుఃఖించుచున్న తండ్రిని చూచి రాముడు ఇలా అన్నాడు.
“మహారాజా! మీరు మాకందరికీ అధిపతులు. తమరి వద్దనుండి నేను దండకారణ్యములకు పోవుటకు అనుమతి కోరుచున్నాను. కాస్త తల ఎత్తి నన్ను చూడండి. నాతో పాటు నా భార్య సీత, నా తమ్ముడు లక్ష్మణుడు కూడా వనవాసమునకు వచ్చుటకు అనుమతి ఇవ్వండి. నేను ఎన్నోసార్లు చెప్పి చూచాను. వీరిద్దరూ నా మాట వినలేదు. నాతోపాటు అరణ్యములకు వస్తానని పట్టుబట్టారు. ఆకారణంగా వీరు కూడా నా వెంట అడవులకు వస్తున్నారు. కాబట్టి మా ముగ్గురికీ అనుమతి ప్రసాదించండి.” అని పలికి రాముడు చేతులు కట్టుకొని తండ్రి ఎదురుగా నిలబడ్డాడు. తండ్రిమాటలు విని రాముడు ఇలా అన్నాడు. “మహారాజా! తమరు అయోధ్యను ఎన్నో సంవత్సరముల నుండి పరిపాలిస్తున్నారు. అందుకని తమరు అయోధ్యలోనే ఉండండి. నేను అడవులలో ఉంటాను. నా గురించి మీరు ఆడినమాట తప్పకండి. తమరు విధించిన పదునాలుగు సంవత్సరముల వనవాసము తృటిలో పూర్తిచేసుకొని మీ పాదముల చెంత వాలుతాను. నాకు అనుమతి ఇవ్వండి.” అని పలికాడు రాముడు.
దశరథుని పక్కనే ఉన్న కైక “ఏమిటా మంతనాలు. తొందరగా అడవులకు వెళ్లమనండి. మరలా భరతుడు వచ్చేస్తాడు. ఇంకా ఆలస్యం చెయ్యడం మంచిది కాదు” అని రహస్యంగా దశరథునితో చెప్పింది. రామునితో తనివితీరా మాట్లాడుకోడానికి కూడా అనుమతించని కైకను చూచి దుఃఖిస్తూ దశరథుడు రామునితో ఇలాఅన్నాడు. “రామా! నీకు, నీ భార్యకు, తమ్ముడికి మంగళమగు గాక! నీవు అన్నట్టు ఈ వనవాసము తృటిలో ముగించుకొని రమ్ము. నీ రాకకోసం ఎదురు చూస్తూ ఉంటాను. రామా! నీవు ధర్మము పాటిస్తావు. అందుకని నిన్ను వెళవద్దు అన్నా వెళ్లడం మానవు. నీ బుద్ధి మరల్చడం నాకు చేతకాదు. కాని ఒక కోరిక. ఈ రాత్రికి ఇక్కడే ఉండి పొద్దుటే వెళ్లు. ఈ ఒక్కరోజు నిన్ను కనులారా చూస్తూ కాలం గడిపేస్తాను. నాకు నీ తల్లి కౌసల్యకు కనువిందు చేస్తూ ఈ రాత్రికి ఉండు. రేపు ఉదయమే వెళ్లు.
ఓరామా! నేను అన్న మాటను నిలబెట్టడానికి నువ్వు అరణ్యములకు వెళుతున్నావు. ఇంతవరకూ ఎవరూ చేయలేని పని నువ్వు చేస్తున్నావు. రామా! నువ్వు అరణ్యములకు పోవడం నాకు ఏమాత్రం ఇష్టంలేదు. ఇదుగో ఈ దుష్టురాలు కైక నన్ను మోసం చేసింది. నా దగ్గర నుండి ముందు మాట తీసుకొని తరువాత ఈ వనవాస విషయం విషం కక్కినట్టు కక్కింది. ఇది సత్యము. నువ్వు నా జ్యేష్ట పుత్రుడవు కాబట్టి, తండ్రిమాట నిలబెట్టడానికి, ఆ వంచకి మాటలను నువ్వు నిజం చేస్తున్నావు. నీరాజ్యం నీవు తీసుకోమని చెప్పినా నీవు వినడం లేదు. ఏం చేసేది.”అని దుఃఖిస్తున్నాడు దశరథుడు.
ఆమాటలు విన్న రాముడు ఇలా అన్నాడు. “తండ్రీ! ఈ రాజభోగములు శాశ్వతములు కావు కదా! ఈనాడు ఉంటాయి రేపుపోతాయి. శాశ్వతముగా నిలిచిపోయేది, సత్యము పలకడం, ఆడిన మాట తప్పకుండా ఉండటం. నీవు ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉన్నాను. అయోధ్యమీద నాకు ఉన్న రాజ్యాధికారమును నేను వదులుకొంటున్నాను. ఈ రాజ్యమును భరతునికి ఇమ్ము. తల్లి కైకకు ఇచ్చిన రెండు వరములు పూర్తిగా నెరవేర్చుము. భరతుని రాజ్యాభిషిక్తుని చేయుము.
మీరు అన్న మాట నేను ఎలా నిలబెట్టుకుంటున్నానో తమరు కూడా తల్లి కైకకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీమాట ప్రకారము నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యములలో ఉంటాను. మీరు కూడా భరతునికి రాజ్యాభిషేకము చేయండి. నాకు ఈ రాజ్యము మీద గానీ, రాజభోగముల మీద గానీ ఎలాంటి వ్యామోహము లేదు. తమరి ఆదేశము నెరవేర్చడమే నా కర్తవ్యము. నా గురించి మీరు దు:ఖపడ వద్దు. మీరు అన్న మాటను నిలబెట్టుకోండి.
నేనుకూడా సత్యము మీద ఒట్టుపెట్టుకొని చెబుతున్నాను. నానిర్ణయము నేను మార్చుకోను. నేను ఇక్కడ ఒక్కక్షణం కూడా ఉండలేను. ఈ ఒక్కరాత్రి ఉన్నంత మాత్రాన ఒరిగేదేముంది. నా తల్లి కైక నన్ను అడవులకు వెళ్లమంది. నేను వెళతాను అని అన్నాను. ఆమాట నిలబెట్టుకుంటాను.” అని అన్నాడు రాముడు.
రాముడు ఎన్ని విధముల అనునయించిననూ దశరథుడు దు:ఖము మానలేదు. రాముడు మరలా ఇలా అన్నాడు. “రాజా! తమరు మా గురించి దిగులు పెట్టుకోకండి. మీరు నాకు పితృదేవులు. దైవసమానులైన మీ మాట నాకు శిరోధార్యము. ఓ రాజా! మరలా చెప్పుచున్నాను. ఈ పదునాలుగు సంవత్సరములు నిమేషమాత్రములో గడిపి మరలా మీపాదముల చెంతకు వస్తాను. అప్పుడు నేను శాశ్వతంగా మీ వద్దనే ఉంటాను. ఇప్పుడు మాకు వెళ్లడానికి అనుమతి ఇవ్వండి.
తండ్రిగారూ! అటు చూడండి. అయోధ్యా వాసులు ఎంతో దు:ఖపడుతున్నారు. మీరు మహారాజులు. వారిని మీరు ఓదార్చాలి. అటువంటి మీరే ఇలా దుఃఖిస్తే వారిని ఎవరూ ఓదారుస్తారు. కాబట్టి వెంటనే మాకు అడవులకు పోవుటకు అనుమతి ఇవ్వండి. మీరు వెంటనే భరతునికి పట్టాభిషేకము చేయించండి. అన్నమాట నిలబెట్టుకోండి.”అనిపలికాడు రాముడు.
రాముని మాటలకు దశరథునికి దుఃఖము పొంగుకొని వచ్చింది. ఏడుస్తూ కిందపడిపోయాడు. ఒక్క కైక తప్ప మిగిలిన రాణులందరూ హాహాకారాలు చేసారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ షట్త్రింశః సర్గః: రామాయణంలోని బాలకాండలో షట్త్రింశః సర్గః కీలకమైన భాగం. ఈ సర్గలో, రాముడు విశ్వామిత్రుని ఆధ్వర్యంలో యజ్ఞాలను రక్షించడానికి సిద్ధమవుతాడు. తన భుజబలం, ధైర్యంతో తాటకను సంహరిస్తాడు. తాటక వధతో రాముడు తన వీరత్వాన్ని ప్రదర్శించి, ఋషులు, మునులు ఆనందంతో ఉప్పొంగుతారు. ఈ సర్గలో విశ్వామిత్రుడు రాముడికి అస్త్రశాస్త్రాలను నేర్పుతాడు, దీని వలన రాముడు మరింత శక్తివంతుడవుతాడు.
అంత వరకువిన్న రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.
ఓ మహర్షీ! హిమవంతుని పెద్ద కుమార్తె గంగ ఎందుకని మూడు మార్గములలో ప్రవహిస్తూ ఉంది. ఎందుకని గంగానదీ ముల్లోకములలో పవిత్రమైన నదిగా ప్రసిద్ధి చెందింది. వివరించండి.” అని అడిగాడు. విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు.
“మహాశివుడు తన భార్య ఉమాదేవితో సురత సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు. కానీ ఉమా దేవికి మహాశివునికి ఎంత కాలానికి పుత్ర సంతానము కలగ లేదు. దేవతలందరికీ ఒక అనుమానం కలిగింది. మహాశివునికి, ఉమాదేవికి పుట్టబోయే పుత్రుని భరించే శక్తి ఈ లోకాలకు ఉందా అని. దేవతలందరు బ్రహ్మదేవుని తీసుకొని మహా శివుని వద్దకు వెళ్లారు.
బ్రహ్మ దేవుడు మహాశివునితో ఇలా అన్నాడు. ” ఓ మహాదేవా! మీకు ఉమాదేవికి పుట్టబోయే తేజోవంతుడయిన పుత్రుని ముల్లోకములు భరించలేవు. కాబట్టి మీరు ఉమాదేవి తపస్సు చేయండి. మీ తేజస్సును మీ యందే నిక్షిప్తం చేసుకోండి.” అని ప్రార్థించారు.
వారి ప్రార్థనను మన్నించాడు మహాదేవుడు. “దేవతలారా! మీరు చెప్పినట్టే చేసిదను. కాని నా వీర్యమును ఎవరు ధరిస్తారో తెలియజేయండి.” అని అన్నాడు.
దేవతలందరూ ముక్త కంఠంతో “మీ వీర్యమును భూదేవి ధరిస్తుంది” అని పలికారు. ఆ ప్రకారమే మహాశివుడు తన వీర్యమును భూదేవి యందు నిక్షిప్తం చేసాడు. ఆ వీర్యము భూమి అంతా వ్యాపించింది.
అప్పుడు దేవతలు అగ్ని దేవుని చూచి ” ఓ అగ్నిదేవా ! నీవు వాయు దేవుని సాయంతో మహాదేవుని వీర్యమును నీలో నిక్షిప్తము చేసుకో” అని ప్రార్థించారు. అప్పుడు అగ్నిదేవుడు మహాశివుని వీర్యమును తనలో ధరింపజేసుకొన్నాడు.
మహాదేవుని వీర్యము ప్రభావము వలన అగ్ని దేవుని లో నుండి మహా వీరుడు కుమారస్వామి జన్మించాడు. అప్పుడు దేవతలు అందరూ మహా శివుని ఉమాదేవిని భక్తితో పూజించారు. ఇదంతా చూచి ఉ మాదేవికి పట్టరాని కోపం వచ్చింది.
” ఓ దేవతలారా! నేను నా భర్తయందు పుత్రుని కనవలెనని కోరికతో ఉన్నాను. దానికి మీరు అడ్డు తగిలారు. నా భర్త వీర్యమును భూమిలో అగ్నిలో నిక్షిప్తం చేసారు. కాబట్టి మీరందరికీ మీ భార్యలవలన సంతానము కలుగకుండు గాక!” అని తీవ్రంగా శపించింది.
తన భర్త వీర్యమును ధరించిన భూదేవిని కూడా ఉమాదేవి శపించింది.
“ఓ భూదేవీ! నీవు అనేక రూపములతో అనేక మంది భర్తలకు భార్యగా ప్రవర్తించు. నావలెనే నీకు కూడా పుత్రుల వలన ఆనందము కలుగ కుండు గాక!” అని శపించింది.
తరువాత మహా శివుడు ఉమా దేవితో సహా పశ్చిమదిక్కుగా పోయి హిమవత్పర్వతము మీద ఉత్తర దిక్కుగా ఉన్న కైలాస గిరి మీద తపస్సు చేసాడు.
ఓరామా! ఇప్పుడు నీకు గంగాదేవి కథ చెబుతాను విను. అని విశ్వామిత్రుడు గంగాదేవి యొక్క కథ చెప్పసాగాడు.
శ్రీమద్రామాయణము
బాల కాండ ముప్పది ఆరవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచవింశః సర్గలో, విశ్వామిత్ర మహర్షి తాటాకా అనే రాక్షసుడి పుట్టుక, వివాహం మరియు శాపాన్ని వివరిస్తాడు మరియు ఆమె సమాజం పట్ల క్రూరంగా ప్రవర్తించే స్త్రీని చంపడానికి ఎటువంటి సంకోచం లేకుండా ఆమె ముప్పును తొలగించమని రాముడిని కోరింది.
విశ్వామిత్రుని మాటలు శ్రద్ధగా విన్న రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.
” ఓ మునిపుంగవా! సాధారణంగా యక్షులు తక్కువ బలం కలవారు అంటారు కదా. యక్షిణి అయిన తాటకకు అంత బలం, వీరత్వము ఎలా వచ్చింది.” అని అడిగాడు.
దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. “ఓ రామా! పూర్వము సుకేతుడు అనే బలవంతుడు అయిన యక్షుడు ఉండేవాడు. అతనికి సంతానము లేదు. సంతానము కొరకు అతడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసాడు. సుకేతుడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏమి వరము కావాలో కోరుకో అని అడిగాడు. ఆ యక్షుడు సంతానము కావాలి అని అడిగాడు. బ్రహ్మదేవుడు వేయి ఏనుగుల బలవంతురాలైన కుమార్తెను ప్రసాదించాడు కాని పుత్ర సంతానము మాత్రము ఇవ్వలేదు. ఆమె పేరు తాటక.
తాటక పెరిగి పెద్దది అయింది. సుకేతుడు తన కుమార్తె తాటకను సుందుడు అనే వాడికి ఇచ్చి వివాహం చేసాడు. సుందుడికి, తాటకకు మహా బలవంతుడు అయిన మారీచుడు అనే కుమారుడు జన్మించాడు.
అగస్త్యుని శాపము వలన సుందుడు మరణించాడు. అప్పుడు తాటక, మారీచుడు ఇద్దరూ కలిసి అగస్త్యుని చంపి తినడానికి అతని మీదికి వెళ్లారు.అప్పుడు అగస్త్యుడు మారీచుని “నీవు రాక్షసుడివి కా!” అని శపించాడు. తాటకను “నీవు వికృత రూపంతో, భయంకరంగా మనుష్యులను చంపి తింటూ, జీవించు” అని శపించాడు. అప్పటి నుండి తాటక అగస్యుడు సంచరించిన ఈ వనమును నాశనం చేయసాగింది.
ఓ రామా! తాటక స్త్రీ అని సంకోచించ వద్దు. ఆమె దుర్మార్గురాలు. లోకకంటకు రాలు. మునులను, బ్రాహ్మణులను రక్షించుటకు ఆమె సంహరించు. ఈమెకు ఉన్న వరములు, శాపములు వలన ఈమెను నీవు తప్ప వేరెవ్వరూ సంహరించలేరు.
లోకము యొక్క హితము కోరి రాజు స్త్రీ, పురుష బేధము లేకుండా ఎవరినైనా సంహరించవచ్చును. రాజు ప్రజలను రక్షించ డానికి చేసే పని పాపము అయినా సరే రాజుకు ఆపాపము అంటదు. ఇది రాజ్యపాలనలో ముఖ్యసూత్రము. ధర్మానికి విరుద్ధంగా, ప్రజలకు కంటకంగా పరిణమించిన తాటకను సంహరించడం పాపము కాదు.
పూర్వము విరోచనుని కుమార్తె, భూదేవిని చంపబోయింది. అప్పుడు దేవేంద్రుడు ఆమెను చంపాడు. పూర్వము శుక్రాచార్యుని తల్లి, లోకములో ఇంద్రుడు ఉండకూడదు, అనే కోరికతో తీవ్రంగా తపస్సుచేసింది. ధర్మ విరుద్ధమైన ఆమె తపస్సును భగ్నం చేసి ఆమెను చంపాడు విష్ణువు.
ఓ రామా! వీరే కాదు. ధర్మవిరుద్ధంగా ప్రవర్తించిన స్త్రీలను ఎందరినో చంపారు. కాబట్టి నీవు కూడా స్త్రీ అని సంకోచించక తాటకను సంహరించు.” అని అన్నాడు విశ్వామిత్రుడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై ఐదవ సర్గ సంపూర్ణము.
అయోధ్యాకాండము త్రయస్త్రింశః సర్గము (32వ సర్గ) రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. ఈ సర్గలో, లక్ష్మణుడు రాముని మాటలు విని బాధపడతాడు. రాముని అనుసరించాలని నిర్ణయిస్తాడు. సీత కూడా అరణ్యవాసానికి రాముడితో పాటు వెళ్లాలని కోరుతుంది. చివరికి రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. అటు, ప్రజలు రాముని వెనక వెళ్లాలని నిర్ణయిస్తారు. ఈ సర్గ రాముని త్యాగం, సీత లక్ష్మణుల భక్తిని మరియు ప్రజల ప్రేమను చూపిస్తుంది. అరణ్యవాసానికి బయలుదేరిన రాముడు, సీత, లక్ష్మణుల ప్రయాణం ఈ సర్గలో ప్రధానాంశంగా ఉంటుంది.
పౌరవాక్యమ్
దత్త్వా తు సహ వైదేహ్యా బ్రాహ్మణేభ్యో ధనం బహు |
జగ్మతుః పితరం ద్రష్టుం సీతయా సహ రాఘవౌ || ౧ ||
రాముడు, లక్ష్మణుడు, సీత తమకు ఉన్నదంతా బ్రాహ్మణు లకు దానము చేసిన తరువాత, వారు ముగ్గురూ దశరథుని వద్ద సెలవు తీసుకొనడానికి ఆయన మందిరమునకు వెళ్లారు. అప్పటికే రామపట్టాభిషేకము నిలిచి పోయినది అను వార్త దావానలము మాదిరి అయోధ్య అంతా పాకిపోయింది. దశరథుని మందిరమునకు వెళ్లు సీతారామలక్ష్మణులను చూచుటకు జనము వీధులలో బారులు తీరి నిలబడ్డారు. అందరి ముఖాలలో దైన్యము కనబడుతూ ఉంది. రాజలాంఛనములైన ఛత్రచామరములు లేకుండా కాలినడకన వెళు తున్న రాముని చూచి అయోధ్య ప్రజలు దు:ఖము ఆపుకోలేక పోయారు.
కేవలము తండ్రి మాటను మన్నించడానికి రాజ్యమును వదులుకొన్నాడు రాముడు అని అందరూ చెప్పుకుంటున్నారు. అప్పటిదాకా వారు సీతను ముఖాముఖి చూడలేదు. ఎండ అంటే అసలు తెలియని సీత ఈనాడు భర్త వెంట నడిచి వెళుతుంటే అందరూ ఆశ్చర్యం చూస్తున్నారు.
కొందరు ఆశావాదులు మాత్రము “రాజు రాజ్యమును ఇవ్వక పోతే మానె, రాముని ఊరువెళ్ల గొట్టడం ఎందుకు. ఏదో ఊరికే అని ఉంటాడు. రాముడు ఎక్కడకూ వెళ్లడు.” అని తమలో తాము సర్దిచెప్పుకుంటున్నారు.
మరి కొంతమంది “ఆ… ఈరోజుల్లో చెడ్డవాడైన కొడుకును కూడా మమకారంతో ఇంటి నుండి బయటకు పొమ్మనడం లేదు. అలాంటిది రాముని వంటి సుగుణాల రాసిని ఇంటినుండి ఎందుకు పొమ్మంటాడు. అదేమీ కాదు. మనం పొరపాటు వినిఉంటాము.”అని తమలో తాము అనుకుంటున్నారు.
కాని అందరూ రాముడు తమను విడిచి అడవులకు వెళు తున్నాడు అనే మాటను కూడా జీర్ణం చేసుకోలేక పోతున్నారు. ఇన్నాళ్లు తమ కష్టసుఖాలలో పాలుపంచుకున్న రాముడు ఇలా అర్థాంతరంగా అడవులకు వెళ్లడంలోని ఆంతర్యం వారికి అవగతం కావడం లేదు. ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు.
ఇంతలో కొంతమందికి ఒక ఆలోచన వచ్చింది. “రాముడు లేని అయోధ్యలో మనం మాత్రం ఎందుకు. మనం కూడా రాముని వెంట అరణ్యములకు వెళుదాము. రాముడు ఎక్కడ ఉంటే అదే మనకు అయోధ్య” అని రాముని వెంట వెళ్లడానికి సిద్ధం అయ్యారు.
ఆ మాట ఆనోటా ఆనోటా పాకి అందరూ రాముని వెంట అడవులకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలో కైకేయీ వల్లనే ఇదంతా జరిగింది అని అందరికీ తెలిసిపోయింది. దాంతో వారి ఆలోచన బలపడింది.
“మనం అంతా అయోధ్యను విడిచి వెళ్లిపోతే ఇక్కడెవరుం టారు. ఇండ్లు అన్నీ పాడుపడిపోతాయి. అగ్నిహోత్రములు వెలగవు. పంటలు పండించే వాళ్లు ఉండరు. వీళ్లకు పనిపాటలు చేసేవాళ్లు ఉండరు. ఈ పాడుబడ్డ శ్మశానములాంటి అయోధ్యను కైక ఒక్కతే ఏలుకుంటుంది” అని కసిదీరా అనుకొన్నారు.
మరికొందరు “రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య. అరణ్యమే అయోధ్య. ఈ అయోధ్య అరణ్యము అవుతుంది.” అని శపిస్తున్నారు. ఇంకొంత మంది అయితే “ఒరేయ్! మనం అంతా రాముని వెంట అడవులకు వెళితే, మనలను చూచి, అడవులలో ఉన్న క్రూరమృగములు, ఏనుగులు, పాములు, తేళ్లు అన్నీ అడవులు వదిలి అయోధ్యలోకి వస్తాయి. అప్పుడు కైకకు మంచి శాస్త్రిఅవుతుంది. మనం అంతా రాముని పాలనలో అడవిలో సుఖంగా ఉంటే ఇక్కడ అయోధ్యలో కైక క్రూరమృగముల బారిన పడి నానా బాధలు పడుతుంది” అని కసిదీరా తిడుతున్నారు.
ఈ మాటలన్నీ రాముడు, సీత లక్ష్మణుడు వింటూ ముందుకు నడుస్తున్నారు. ముగ్గురూ దశరథమహారాజు మందిరమునకు సమీపించారు. మందిరము లోపల సుమంత్రుడు దీనంగా మొహం పెట్టుకొని కూర్చుని ఉన్నాడు. అతని చుట్టు కొంతమంది పౌరులు గుమిగూడి ఉన్నారు.
వారందరినీ చూచి రాముడు చిరునవ్వు నవ్వి వారిని పలకరించాడు. “సుమంత్రా! నేను, సీత, లక్ష్మణుడు వచ్చామని మహారాజు గారికి మనవి చెయ్యి.” అని అన్నాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ చతుస్త్రింశః సర్గః: రామాయణంలోని బాలకాండలో చతుస్త్రింశః సర్గం ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో విష్ణుమూర్తి వామనావతారాన్ని ధరించి, సుగ్రీవుడి సహాయంతో మహాబలివనితిని మోసగించి, ఆవిడలో హరికృష్ణుడు అవతరించాడని వివరిస్తుంది. సీతా హరణం గురించి విన్న రాముడు, లక్ష్మణుడు హనుమంతుని సహాయం తీసుకోవాలని నిర్ణయిస్తారు. రాముడి ధైర్యం, లక్ష్మణుడి నిబద్ధత హనుమంతుడిని ఆకర్షిస్తాయి.
ఆ ప్రకారంగా కుమార్తెల వివాహము వైభవంగా జరిపించాడు. కుశనాభుడు. కుమార్తెలు అత్తవారి ఇంటికి వెళ్లారు. అప్పుడు తనకు పుత్రసంతానము కావాలని అనుకున్నాడు కుశనాభుడు. పుత్రసంతానము కోసరము పుత్రకామేష్టి యాగము చేసాడు.
ఆయాగము జరుగుతున్న సమయములో కుశుడు తన కుమారుడైన కుశనాభునితో ఇలా అన్నాడు. “కుమారా! నీకు సకల సద్గుణ సంపన్నుడు ధార్మికుడు అయిన కుమారుడు జన్మించగలడు.” అనిపలికి తాను బ్రహ్మ లోకమునకు వెళ్లిపోయాడు.
కొంత కాలము జరిగింది. కుశనాభునకు గాధి అనే కుమారుడు జన్మించాడు. ఓ రామా! ఆ గాధి నా తండ్రి. శుకుని వంశమున పుట్టడం చేత నేను కౌశికుడు అనే పేరుతో కూడా పిలువబడు తున్నాను. నాకు ఒక జ్యేష్ట సోదరి (అక్కగారు) ఉండేది. ఆమెను నా తండ్రి గాధి ఋచకుడు అను వానికి ఇచ్చి వివాహము చేసాడు. ఆమె తన భర్తతో పాటు సశరీరంగా స్వర్గమునకు వెళ్లింది.
ఆమె ఈ భూమి మీద కౌశికి అనే పేరుతో ఒక మహానదిగా ప్రహిస్తూ ఉంది. దివ్యమైన పుణ్యోదకములతో కూడిన ఆ కౌశికీ నది సకల లోకములకు హితము కలిగించడం కోసరం హిమవత్పర్వతము మీద ప్రవహిస్తూ ఉంది. నేను నా సోదరి మీద ఉన్న ప్రేమతో ఆ మహానదీ తీరమున ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాను.
రామా! ఈ యాగము చేయుట కొరకు సిద్ధాశ్రమమునకు వచ్చాను. నీవలన యాగమును నిర్విఘ్నముగా పూర్తిచేయ గలిగాను. నా కార్యము సిద్ధించింది. ఓరామా! నీవు అడిగినట్టు నా గురించి, నా జన్మ గురించి నీకు చెప్పాను. రామా! ఇప్పటికే అర్ధ రాత్రి దాటినది. ఇంక మీరు నిద్రకు ఉపక్రమించండి. మరలా రేపు ఉదయమే మనము ప్రయాణము సాగించాలి కదా!” అని అన్నాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని వృత్తాంతమును విన్న రామ లక్ష్మణులు, మహా మునులుఅందరూ ఆయనను అభినందించారు.
“ఓ విశ్వామిత్ర మహర్షీ! మీ వలనకుశ వంశము పూజ్యమైనది. మీరు బ్రహ్మ దేవునితో సమానమైన వారు. మీ అక్కగారు పేరుతో ప్రవహించు కౌశికీ నది మీ వంశమునకు కీర్తి తెచ్చింది.” అని కౌశికీ నదిని పొగిడారు. తరువాత అందరూ తమ తమ నివాసములలో నిద్రకు ఉపక్రమించారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రయోవింశః సర్గలో, రాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్రునితో కలిసి గంగా నది మరియు సరయు నది సంగమించే ప్రదేశంలో ఒక ఆశ్రమంలో నివసిస్తున్నారు. ఒకసారి శివుడు తన మూడవ కన్నుతో ఈ ప్రదేశంలో ప్రేమ దేవుడైన మన్మథుని భౌతిక స్వరూపాన్ని కాల్చివేసాడు.
మరునాడు సూర్యోదయం కాబోతున్నది. సూర్యోదయానికి ముందు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను తన మృదుమధురమైన మాటలతో నిద్రలేపాడు.
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సన్ధ్య ప్రవర్తతే।
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్॥
కౌసల్య గర్భవాసాన జన్మించిన ఉత్తమ పుత్రుడవైన ఓ రామా! ప్రాత: కాల సంధ్యకు సమయము ఆసన్నమైనది. ఓ రామా! నిద్ర లే! ప్రాత:కాల 3! కృత్యములు. సంధ్యావందనాది కార్యక్రములు నీవు చేయవలసి ఉన్నది.
(పైశ్లోకము అందరికీ శ్రీ వేంకటేశ్వర సుప్రభాతములో మొదటి శ్లోకంగానే తెలుసు. ఆ శ్లోకము మూలం వాల్మీకి రామాయణంలో ఉందని కొద్దిమందికి మాత్రమేతెలుసు. అందుకే ఈ శ్లోకమును ఇక్క యధాతథంగా రాసాను).
విశ్వామిత్రుని మాటలు విన్న రామ లక్ష్మణులు వెంటనే నిద్ర లేచారు. కాలకృత్యములు తీర్చుకొన్నారు. స్నానము, సంధ్యావందనము ఆచరించారు. సూర్యునికి అర్ఘ్యము ఇచ్చారు. గాయత్రీ మంత్రము పఠించారు. తరువాత ముగ్గురూ తమ ప్రయాణము కొనసాగించారు.
వారు సరయూనదీ గంగానదిలో కలిసే సంగమస్థానము చేరుకున్నారు. ఆ ప్రదేశంలో ఉన్న పురాతనమైన ముని ఆశ్రమములను చూచారు. ఆ ఆశ్రమములను చూచిన రామలక్ష్మణులు “ఓ మహర్షీ! ఈ ఆశ్రమములు ఎవరివి?’ ఈ ఆశ్రమములలో ఎవరు ఉంటారు?”. అని అడిగారు.
దానికి విశ్వామిత్రుడు ఇలా సమాధానము చెప్పాడు. “ఓ రామా! ప్రస్తుతము మన్మధుడు దేహము లేకుండా అనంగుడిగా ఉన్నాడు కానీ, పూర్వము మన్మధుడు దేహము కలవాడు. మన్మధునికి కాముడు అని పేరు. పూర్వము శివుడు ఈ ప్రదేశములో తపస్సు చేసుకునేవాడు. తరువాత శివుడు వివాహం చేసుకొని వెళ్లిపోయాడు. . అటువంటి శివుని మన్మథుడు ఎదిరించాడు. అప్పుడు శివుడు హంకరించి, మన్మధుని వంక కోపంగా చూచాడు. శివుని కోపాగ్నికి మన్మధుడు భస్మము అయిపోయాడు. మన్మధుని శరీర అవయవములు అన్ని చోట్లా చెల్లాచెదరుగా పడిపోయాయి. అప్పుడు మన్మధుడు శరీరం లేనివాడు అయ్యాడు.
పూర్వము పరమశివుడు తపస్సు చేసిన ఆశ్రమము ఇదే. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఋషులు అందరూ పూర్వము పరమశివునికి శిష్యులుగాఉండేవారు. వారే ఇప్పటికీ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వీరు ధర్మపరులు. వీరికి పాపం అటే ఏమిటో తెలియదు. మనము ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపుఉదయము మన ప్రయాణము కొనసాగిద్దాము. మనము ఇప్పుడు స్నానము, సంధ్య ఆచరించి, శుచులై ఈ ఆశ్రమములలోని ప్రవేశిద్దాము” అని అన్నాడు విశ్వామిత్రుడు.
వీరు ఈ ప్రకారము మాట్లాడుకుంటూ ఉండగా, ఆ ఆశ్రమములలో ఉన్న ఋషులు వీరి రాకను చూచి ఎంతో ఆనందించారు. రామలక్ష్మణులను విశ్వామిత్రుని సాదరంగా ఆహ్వానిచి సత్కరించారు. తరువాత ఆ ఋషులు సాయంసంధ్యాసమయంలో చేయ వలసిన సంధ్యావందనము, గాయత్రీజపము కార్యములు ఏకాగ్రచిత్తంతో చేసారు.
ఆ రాత్రికి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు ఆ ఆశ్రమములో నిద్రించారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మార్గాయాసము తెలియకుండా అనేక పుణ్య కథలను చెప్పి ఆనందింపచేస్తూ ఉన్నాడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై మూడవ సర్గ సంపూర్ణము.
అయోధ్యా కాండ, సర్గ 23లో, కథ నాటకీయ మలుపు తిరుగుతుంది, రాజా దశరథుడు ఇచ్చిన రెండు వరాలను కైకేయి ప్రయత్నిం చేయడం వల్ల. ఈ కీలక అధ్యాయం కైకేయి రాముడిని పద్దెనిమిదేళ్లు అడవికి నడి ఇవ్వడం మరియు ఆమె కుమారుడు భరతుడిని అయోధ్య రాజుగా పట్టాభిషేకం చేయడం కోసం… ఈ వార్త రాజా దశరథుడిని దెబ్బతీస్తుంది, ఎందుకంటే అతను రాముడిపై ప్రేమ మరియు తన వాగ్దానాలను నిలబెట్టుకోవాలనే కట్టుబాటు మధ్య కొట్టుమిట్టాడుతాడు. ఈ సర్గలో చూపించిన భావోద్వేగాలు మరియు కలకలం కర్తవ్య, ప్రేమ మరియు విధి యొక్క సంక్లిష్ట ఆటలని హైలైట్ చేస్తుంది, ఈ మహాకావ్యంలో ఉన్న తదుపరి సంఘటనలకు పునాదిని వేస్తుంది.
రాముడు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా బుద్ధిగా విన్నాడు లక్ష్మణుడు. కాని లక్ష్మణుని మనసులో కోపం అగ్ని వలె మండుతూ ఉంది. నుదురు ముడుతలు పడింది. దీర్ఘంగా శ్వాస తీస్తున్నాడు. అప్పుడు లక్ష్మణుని మొహం కోపంతో ఉన్న సింహంలా ఉంది. రాముని మొహంలోకి సూటిగా చూడలేక క్రీగంటితో చూస్తూ ఇలా అన్నాడు.
“అన్నయ్యా! ! కేవలము తండ్రిమాటను పాటించడం కోసం ఏమైనా చెయ్యాలనో, తండ్రి మాటను ధిక్కరిస్తే లోకము ఏమను కుంటుందో అనే భయంతోనూ నీవు అరణ్యములకుపోవడం అంత బాగాలేదు. పైగా దైవనిర్ణయము అంటున్నావు. దైవము ఇలా చేస్తుందా. దైవానికి ఒకరి మీద కోపము మరొకరి మీద ద్వేషము ఎందుకుం టుంది. కాబట్టి దీనిని దైవనిర్ణయము అనడానికి వీలులేదు. ఇదంతా కుయుక్తితో కైక, ఆమె మాటలకు తలూపిన దశరథుడు, చేసిన కుతంత్రము. ముందు వారిద్దరినీ అనుమానించాలి.
కైక దశరథుడు పైకి ధర్మములు బోధిస్తూ, లోలోపల నీకు అపకారము చేస్తున్నారు. ‘ఆడిన మాట తప్పకూడదు’ అనే ధర్మాన్ని అడ్డుపెట్టుకొని నీ రాజ్యము అపహరిస్తున్నారు. ఇది అధర్మము. ఇది నీకు అర్ధం కావడం లేదు.
నా ఉద్దేశంలో కైక, దశరథుడు కలిసి ఆడిన నాటకము. లేకపోతే ఎన్నడో ఇస్తాను అన్న వరములు ఇప్పుడు కోరడం ఏమిటి? అసలు దశరథుడు వరాలు ఇస్తాను అని కైకకు మాట ఇచ్చాడు అని ఎవరికి తెలుసు. ఒకవేళ వరాలు ఇచ్చిఉంటే ఇన్నాళ్లు ఎందుకు ఊరుకుంటాడు. ఎప్పుడో తీర్చి ఉండేవాడు కదా! కాబట్టి కైక ఈ వరాలు కోరడం, వాటిని ఈ సమయంలో అడగడం, రాజు ఇవ్వడం, అంతా బూటకం. నిన్ను అడ్డు తొలగించుకోడానికి దశరథుడు, కైక కలిసి ఆడుతున్న నాటకము.
నీవు జ్యేష్టుడవు. రాజ్యము జ్యేష్టునికే చెందుతుంది. అది లోక ధర్మము. కాబట్టి నీవు అరణ్యములకు వెళ్లడం నేను సహించను. నన్ను మన్నించు. నీ బుద్ధిని పెడతోవ పట్టిస్తున్న ఈ ధర్మాచరణమును నేను ఖండిస్తున్నాను. నీకు శక్తి యుక్తులు ఉండి కూడా, నీ తండ్రి దశరథుడు, నీ తల్లికైక మాటలకు ఎందుకు తలూపుతున్నావో అర్థం కావడం లేదు. కైక చేస్తున్నది కపటోపాయము అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాని దానిని నీవు కపటము అని గ్రహించలేకపోవడం దురదృష్టము.
ధర్మంగా నడిచే వారిపట్ల మనం కూడా ధర్మంగా ప్రవర్తించాలి. కాని కైక, దశరథుడు లాంటి అధర్మ వర్తనులపట్ల ధర్మాచరణము యోగ్యము కాదు. పైగా అది నిందింపతగినది. రామా! నీ తండ్రి దశరథుడు, నీ తల్లి కైక నీ క్షేమమును కోరేవారు కాదు. వారు నీకు శత్రువులు. అటువంటి వారి కోరికను తీర్చాలని నీవు మనసులో కూడా తలచడం మహాపాపము.
నీవు అన్నట్టే వారి చేయు పనులు దైవనిర్ణయములు అని అనుకొందాము. దైవనిర్ణయమైనా, అది అధర్మము అయినపుడు దానిని పాటించకపోవడమే ధర్మము.
చేతకాని వాళ్లు, పిరికివాళ్లు, దైవము మీద ఆధారపడతారు. మన లాంటి వీరులు, దైర్యవంతులు దైవము మీద ఆధారపడరు. దైవనిర్ణయములను లెక్క చెయ్యరు. నీ స్వశక్తితో, వీరత్వముతో నీవు దైవనిర్ణయమును ఎదిరించినా, దైవము నిన్ను ఏమీ చెయ్యదు, చెయ్యలేదు. ఎందుకంటే నీవు ధర్మము ప్రకారము నడుచుకుంటు నావు కాబట్టి.
అయినా చూద్దాము. మానవునికి ఉండే శక్తి ఎంతో, దైవమునకు ఉండే శక్తి ఎంతో నేడు తేలిపోతుంది. ఎవరు గెలుస్తారో చూద్దాం. నీవు చెప్పినట్టు నీ పట్టాభిషేకమును ఏ దైవమైనా అడ్డు కుంటూ ఉంటే, ఆ దైవమును నేను నా స్వశక్తితో ఎదిరిస్తాను. నీ పట్టాభిషేకమును నేను జరిపిస్తాను. ఏ దైవము అడ్డుకుంటుందో చూస్తాను.
రామా! ఆ దైవమే కాదు, దిక్పాలకులు, ముల్లోకములు ఒకటై వచ్చినా సరే నీ పట్టాభిషేకమును ఆపలేరు. ఇంక ఆ దశరథుడు ఒక లెక్కా! ఎవరైతే రహస్యంగా నీకు పదునాలుగేళ్లు వనవాసము విధించారో, వారినే అరణ్యాలకు పంపుతాను. కైక ఆశలు ఈ జన్మలో నెరవేరకుండా చేస్తాను. నన్ను ఎదిరించిన వాడిని ఆ దైవము కూడా రక్షించలేదు.
రామా! నేను అంటున్నాను. నీవు అయోధ్యను వెయ్యి సంవత్స రాలు పాలిస్తావు. తరువాత నీ కుమారులు పాలిస్తారు. భరతుడు కలలో కూడా రాజు కాడు, కాలేడు. నీ తండ్రి రాజ్యము నీకు సంక్రమించినట్టే, నీ రాజ్యము నీ కుమారులకు సంక్రమిస్తుంది. అదే ధర్మము.
రామా! దశరధుడు కామాతురుడై ఉన్నాడు, ఆయన మనసు సరిగా పనిచెయ్యడంలేదు. అందుకని రాజు మాటలు పాటించ నవసరము లేదు. నీవు పట్టాభిషేకము చేసుకోడానికి సిద్ధంగా ఉండు. నీకు రక్షణగా నేను ఉంటాను. ఎవరైనా అడ్డం వస్తే వారి అంతు తేలుస్తాను.
రామా! నా చేతులు, నా చేతుల్లో ఉన్న ఈ ధనుర్బాణములు కేవలం అలంకారము కొరకే కాదు. శత్రువులను ఎదిరించడానికి కూడా పనికి వస్తాయి. నాతో శత్రుత్వము వహించి నాకు ఎదురు నిలిచిన వాడిని నేను బతకనివ్వను. ఆ దేవేంద్రుడు వచ్చి నా ఎదుట నిలిచినా సరే వాడి తలతెగి కిందపడటం తథ్యం.
ఓ శ్రీరామచంద్ర మహారాజా! నన్ను ఆజ్ఞాపించండి. ఈ మాదిరి అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకుంటున్న దశరథుని మహారాజ పదవి నుండి తొలగించి నిన్ను అయోధ్యకు మహారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను. ఎవరడ్డు వస్తారో చూస్తాను. ఈ దాసుడు తమరి ఆజ్ఞ కోసరము ఎదురుచూస్తున్నాడు.” అని ఆవేశంతో అంటున్న లక్ష్మణుని తన సౌమ్యమైన మాటలతో ఓదార్చి
“లక్ష్మణా! నన్ను ఆజ్ఞాపించమన్నావు. అందుకని ఆజ్ఞాపిస్తున్నాను.
నీకూ నాకూ తండ్రిమాటను పాటించడమే ధర్మము. ఇదే నా నిర్ణయము.” అని స్థిరంగా పలికాడు రాముడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండంలో అష్టమః సర్గ ఒక ప్రధానమైన అధ్యాయం. ఈ భాగంలో అయోధ్య నగరంలో జరిగే కీలకమైన సంఘటనలను, ముఖ్యంగా పాత్రలు ఎదుర్కొనే భావోద్వేగ మరియు నైతిక సంక్షోభాలను వివరించబడింది. ఈ అధ్యాయంలో రాజకుటుంబంలోని సున్నితమైన సంబంధాలను పరిశీలించి, కర్తవ్య, ధర్మం మరియు నిర్ణయాల ప్రభావం వంటి అంశాలను స్పష్టంగా చూపిస్తుంది. అష్టమః సర్గ మనిషి అనుభవాల సారాన్ని అందించడంలో ముఖ్య పాత్ర వహించి, రామాయణం యొక్క సమగ్ర నైతిక కథనాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ అధ్యాయం భవిష్యత్తులో పాత్రలు ఎదుర్కొనే సవాళ్లు మరియు కష్టాలను సూచిస్తూ, రామాయణం బోధించే సానాతన విలువలను పాఠకులకు తెలియజేస్తుంది.
కైక తనకు బహుమానముగా ఇచ్చిన ఆభరణమును విసిరి కొట్టింది మంధర.
“అయ్యో ఎంత తెలివి తక్కువదానివమ్మా నువ్వు. దుఃఖించ తగ్గ సమయంలో సంతోషంతో కేరింతలు కొడుతున్నావు. ముంచు కొస్తున్న ఆపదను గుర్తింలేకున్నావు. నిన్ను, నీ అమాయకత్వాన్ని చూచి నాకు నవ్వు వస్తోంది.
అది కాదమ్మా! నాకు తెలియక అడుగుతాను. సవతి కొడుక్కు పట్టాభిషేకం జరుగుతుంటే సంతోషించే దానివి నువ్వు ఒక్కదానివే కనపడుతున్నావు. నీ చావును నువ్వే కొనితెచ్చుకుంటున్నావు. ఈ రాజ్యము ఎవరిది? దశరథునిది. ఆయనకు రాముడొక్కడే కాదు కదా! భరతుడు కూడా కుమారుడే కదా! భరతునికి కూడా రాజ్యాధి కారము ఉన్నది కాబట్టి రామునికి భరతుని చూస్తే భయము. అందుకే భరతుడు ఇంటలేని సమయములో పట్టాభిషేకము చేసుకుం టున్నాడు. ఈ విషయం ఆలోచించే కొద్దీ నాకు దుఃఖము ఆగటం లేదు తల్లీ నీకు ఎలా ఉందో గాని.
ఇంకో విషయం గమనించావా! రాముడు లక్ష్మణుడు ఒకటి. భరతుడు శత్రుఘ్నుడు ఒకటి. రాముని తరువాత భరతుడు పుట్టాడు. అందుకనీ, రాముని తరువాత రాజ్యాధికారము భరతునికే చెందాలి. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు చిన్నవాళ్లు. రాముడు విద్వాంసుడు. రాజనీతి కోవిదుడు. ధనుర్విద్యాపారంగతుడు. అందుకే, నీ కొడుకు భరతుని అమాయకుడిని చేసి రాజ్యం మొత్తం కాజెయ్యాలని చూస్తున్నాడు. రాముడు. ఆ విషయం నువ్వు గ్రహించలేకున్నావు. నాకు మాత్రం వణుకు పుడుతూ ఉంది.
అయినా ఏమనుకొని ఏమి లాభం. అదృష్టం అంతా ఆ కౌసల్యది. ఆమె కొడుకు యువరాజు కాబోతున్నాడు. నువ్వు ఆమెకు దాసిగా ఉండాల్సిందే. ఆమె ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. నువ్వు కౌసల్యకు దాసివి అయితే నీ కొడుకు భరతుడు రామునికి దాసుడు అవుతాడు. నీ కోడలు రాముని భార్యకు దాసి అవుతుంది. మీ కుటుంబానికి దాస్యవృత్తి తప్పదు. …” అని ఇంకా ఏమో అనబోతుంటే మంథరను వారించింది కైక.
మంథరా! ఇంకచాలు ఆపు. రాముడు అంటే ఎవరనుకున్నావు? అన్ని ధర్మములు తెలిసినవాడు. గురు ముఖతా విద్య నేర్చుకున్నవాడు. పరుల ఎడల కృతజ్ఞతా భావము కలవాడు. ఎల్లప్పుడూ సత్యమునే పలికెడివాడు. అన్నిటి మించి రాముడు జ్యేష్టుడు. రాజ్య సంప్రదాయ ప్రకారము జ్యేష్టుడే రాజ్యమునకు యువరాజు. ఇందులో తప్పేముంది. దు:ఖించడానికి కేముంది. అసలు నీకు రాముని గురించి నీచ భావము ఎలా కలిగింది. రాముడు యువరాజు అయినా తన తమ్ములను తనతో సమానంగా గౌరవిస్తాడు. ఆదరిస్తాడు. రామ పట్టాభి షేక వార్త వినగానే సంతోషించక ఇలా దుఃఖిస్తావెందుకు? నువ్వు చెప్పినట్టు రాముని తరువాత భరతునిదే కదా రాజ్యాధికారము. రాముడు పరిపాలించిన తరువాత భరతుడే తదుపరి రాజు అవుతాడు. ఇందులో సందేహమేమున్నది. ఈ సంతోష సమయంలో సంతోషిం చాలి గానీ దుఃఖించడం అవివేకుల లక్షణం.
మంథరా! ఇంకో మాట చెబుతున్నాను విను. నాకు భరతుడు ఎంతో రాముడూ అంతే. రాముడు నన్ను తన తల్లి కౌసల్య కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అభిమానిస్తాడు. గౌరవిస్తాడు. అటువంటి రాముని గురించి నా ఎదుట నిందిస్తావా! రాముడు రాజు అయితే ఒకటీ భరతుడు రాజు అయితే ఒకటీనా! రాముడు రాజు అయితే నా కుమారుడు భరతుడు కూడా రాజు అయినట్టే! అందుకే ఆ చెడ్డ ఆలోచనలుమాని రాముని రాజ్యాభిషేకమును చూచి ఆనందించు.” అని చీవాట్లు పెట్టింది కైక.
కాని మంథర మారలేదు. దీర్ఘంగా నిట్టూర్చింది. కైక వంక జాలిగా చూసింది. “ఒక పక్క నువ్వు ఎక్కిన పడవను నీ శత్రువు ముంచుతుంటే. నువ్వు ఆ శత్రువునే పొగుడుతున్నావా! ఎంత అమాయకురాలివమ్మా! నువ్వు చెప్పినట్టు రాముడు రాజు అవుతాడు. రాముని తరువాత రాముని కొడుకు రాజు అవుతాడు కానీ భరతుడు ఎలా రాజు అవుతాడు? అసలు అప్పుడు నీ పేరు, నీ కొడుకు భరతుని పేరు ఎవరు తల్చుకుంటారు? అందరూ ‘యువరాజా’ ‘యువరాజా’ అంటూ రాముని కొడుకు వెంట పడతారు. నీ కొడుకు మొహం ఎవరు చూస్తారు.
ఒక రాజుకు నలుగురు కుమారులు ఉంటే అందరూ రాజులు కారు కదా! అందులో జ్యేష్టునికి కానీ, జ్యేష్టుడు పనికి రాని పక్షంలో గుణవంతుడైన తరువాత వాడికి కానీ, రాజ్యాభిషేకము చేస్తారు. ఇది వంశాచారము. అందుకే నా మాటవిను. రాముడు అడ్డు తొలగితే నీ కొడుకే రాజు అవుతాడు. లేకపోతే నీ కొడుకు అనాధ అవుతాడు. రాచమర్యాదలకు సుఖాలకు దూరం అవుతాడు. ఇదంతా నీ మేలుకోరి చెబుతున్నాను. నువ్వేమో రామ పట్టాభిషేక వార్త తెలిసి నాకు కానుకలు ఇస్తున్నావు. ఏంటో!
నీకు ఇంకో రహస్యం తెలుసా! రాముడు రాజు కాగానే, భరతుడు తనకు పోటీ రాకుండా భరతుని దేశాంతరం పంపేస్తాడు. లేకపోతే చంపిస్తాడు. తన మార్గ నిష్కంటకం చేసుకుంటాడు. అసలు నీ కొడును మేనమామతో కూడా పంపడానికి ఇదే కారణము. నీ కొడుకు ఎదురుగా లేడు కనుక నీ భర్తకు నీ కొడుకుమీద ప్రేమ తగ్గిపోయింది. రాముడు ఎదురుగా ఉన్నాడు కనుక రాముని యువరాజును చేస్తున్నాడు. అందుకనే, ఈ పట్టాభిషేక విషయం కనీసం నీకు గానీ, నీ కుమారుడు భరతునికి కానీ తెలియనీయలేదు. ఇదంతా నీ మీద జరుగుతున్న కుట్ర. అది నీవు తెలుసుకోలేకున్నావు. నేనేం చెయ్యను.
భరతుడు ఇక్కడ ఉంటే ఎక్కడ తన యౌవరాజ్య పట్టాభిషేకానికి అడ్డు పడతాడో అని ముందుగానే పథకం ప్రకారం మేనమామ ఇంటి పంపించారు. అసలు భరతుడు కూడా తన కళ్లెదుట ఉంటే నీ భర్త దశరథుడు నీ మీద ఉన్న ప్రేమతో నీ కుమారుడు భరతునికే పట్టాభిషేకము చేసేవాడు కదా! ఇదంతా రాముడు లక్ష్మణుడు కలిసి చేసిన కుట్ర.
రాముని లక్ష్మణుడు ఏమీ చెయ్యడు. రామునికి లక్ష్మణుడు అడ్డురాడు. కాని భరతుడు తనకు పోటీ వస్తాడని చంపించడానికైనా వెనకాడడు రాముడు. అది తెలుసుకో! ఇక్కడకు వచ్చి రాముని చేతిలో చచ్చే కంటే నీ కుమారుడు అటునుండి అటే ఏ అరణ్యములకో పోవడం
మంచిది.
కాబట్టి నా మాటవిను. ధర్మం ప్రకారము భరతుడు కూడా యువరాజు పదవికి అర్హుడు. అయోధ్యకు ఉత్తరాధికారి. అప్పుడు నీకు, నీ బంధువులకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అయోధ్యాధీశుని తల్లిగా నిన్ను అందరూ గౌరవిస్తారు. లేకపోతే నీకు దాస్యము నీ కొడుక్కు చావు రాసి పెట్టి ఉంది. నీ కొడుకును బాలుడిని అమాయకుడిని చేసి ఆడిస్తున్నారు. నీ కొడుకు కూడా రాజ్యమునకు అర్హుడు కాబట్టి, రామునికి భరతుడు సహజ శత్రువు. ఏనుగును సింహము కబళించినట్టు నీ కొడును రాముడు కబళిస్తాడు. నా మాటవిని నీ కొడుకును రక్షించుకో!
నీకు గుర్తుందా! నువ్వు నీ భర్తకు ముద్దుల భార్యవు. అందుకని నువ్వు కౌసల్యను ఎన్నోసార్లు హేళన చేసావు. అంతకు అంతా ఇప్పుడు నీ మీద పగ తీర్చుకుంటుంది. సందేహము లేదు. ఇంతెందుకమ్మా! రేపు ఆ కాస్త పట్టాభిషేకము కానీ. ఎల్లుండినుండి నీ గతి, నీ కొడుకు గతి ఏమవుతుందో చూడు! నేనుచెప్పడం ఎందుకు. మీ రిద్దరూ అత్యంత దయనీయ స్థితిలో అవమానాలపాలవుతారు. ఇంతెందుకమ్మా! ఒకసారి రాముడు రాజైతే నీ కుమారునికి నాశనము తప్పదు. ఇది యదార్థము. కాబట్టి రాముని పట్టాభిషేకము జరగకుండా ఉండే ఉపాయము ఆలోచించు.” అని పలికింది మంథర.