Chirunavvu Merumgaru Siggula Momu Thoda In Telugu – చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ

చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 6
కీర్తన : చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ
సంఖ్య : 54
పుట : 46
రాగం : శ్రీరాగం

శ్రీరాగం

25 చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ
మరగె నిన్నలమే ్మంగ నాచారి.

॥పల్లవి||

నిలువుఁదురుము మీఁది నెమలిపాదపుడాలు
తొలి మెఱంగుల మించి దొలఁకఁగాను
అలరుచు నినుఁ జూచి అప్పుడె వెరగువడి
మలయుచు నలమేలుమంగ నాచారి.

॥చిఱు||

పరగునీమెడ సరపణులవుయ్యాలలో
ఉరుటు మురిపమున నూఁగుచును
గిరికొన్న తమకాన కిందుమీఁదెఱుఁగక
మరచె మే నలమేలు మంగనాచారి.

||చిఱు||

కంచము గని మోవి కమ్మఁదేనే లారగించి
లంచముగఁగస్తూరి లప్పలు రాల
యెంచఁగఁ దిరువేంకటేశుఁడు నీ పాఁపసజ్జ
మంచమెక్కె నలమేల్మంగనాచారి.

||చిఱు||

అవతారిక:

అలమేల్మంగ నాంచారి మీద అన్నమాచార్యులవారు చెప్పిన సరస శృంగార కీర్తన నాస్వాదించండి. వైష్ణవుల పరిభాషలో దేవిని నాంచారి అంటారు. నాచారి అని కూడా అంటారు. అందులో అమ్మవారి కొన్ని ఆభరణాల పేర్లను గానంచేస్తున్నారు. నెమలిపాదపుడాలు, సరపణలవుయ్యాలలు, మంచమున కలంకరించిన పాపసజ్జలు – ఇత్యాదివి నేటి కాలంలో లేనందువల్ల కొన్ని మన వూహాతీతం. ఊంజలేసేవ సందర్భంగా పాడిన కీర్తన అయివుంటుంది. “సిగ్గులు చిందించే చిరునవ్వు మెఱుపులొలికే మోముగల, ఈ అలమేల్మంగనాచారి నిన్ను మరగెనయ్యా తిరుమలేశా!” అంటున్నారు. నేటితరం వారికి ఈ భాషే ఒక తమాషా జాగ్రత్తగా చదవండి.

భావ వివరణ:

ఓదేవదేవా! నీ దేవేరి అలమేల్మంగ నాచారి నిన్ను మరగె (ఆశించుచున్నది). మనోహరమైన ఆ నాచారి (దేవి) సిగ్గుల చిరునవ్వు మెఱుగార (మెరపులు కురిపిస్తున్న) మోముతో (వదనముతో) శోభలీనుచున్నది.

ఆమె, నిట్టనిలువుగానున్న తురుము (సిగకొప్పు) మీద “నెమలి పాదపుడాలు” ధరించినది. అది తళతళ మెరుగులను మించి (అధికముగా) దొలకె (చిందించుచున్నది). ఆ దేవి వెరగువడి (అత్యధికమైన ఆశ్చర్యముతో మలయుచున్నది (నీకొరకు ఆరాటపడుచున్నది). ఆమె జగజ్జననియైన అలమేల్మంగనాచారి.

ప్రభూ! నీ మెడలో “సరపణులు” వుయ్యాలలూగుచున్నవి. ఉదటు మురిపెమున (గొప్ప మురిపెముతో) వూగుచున్న వాటిని, గిరికొన్న తమకాన (తారా స్థాయికి చేరిన పారవశ్యముతో) కింద మీదెరుగక (ఆశగా చూడవచ్చునో చూడ కూడదో తేల్చుకోలేక) ఆ అలమేల్మంగ నాచారి, మేను మరచె (తన తనువును తానే మరచినది స్వామీ!)

దేవా! కంచము మోవిగని (తేనెలూరు మధురాధరమును) గాంచి లంచముగా కమ్మని తేనెలారగించితివి. అప్పుడు దేవి అలదుకున్న కస్తూరిలప్పెలుగా రాలిపడినది. ఆపైన ఓ శృంగారరాయా! యెంచగా తిరువేంకటేశుడైన నీవు అలమేల్మంగ నాచారితో నీ “పాపసజ్జ మంచమునెక్కి” ఆదేవిని నీ సరసశృంగారముల నలరించితివి. (ఓ జగద్రక్షకా! భావాతీతమైన మిమ్ముభావించుట బావిలో కప్పవంటి నా తరమా!! నా అశక్తతకు అజ్ఞానానికి మన్నించి నీవు అలా నవ్వుతూనే వుండు ప్రభూ!)

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Melukonave In Telugu – మేలుకొనవే

మేలుకొనవే - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో మేలుకొనవే కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

మేలుకొనవే – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 4
కీర్తన : మేలుకొనవే
సంఖ్య : 21
పుట : 375
రాగం : భూపాలం

భూపాలం

31 మేలుకొనవే
భూలలనాధిప భోగిశయన

||పల్లవి||

లేదు వేదవిధి లేశమును
మేదిని భరమై మించినది
పాదుపడదు చూపరకు భువి
గాదిలిసుతుపై గనలె జనకుఁడు

||మేలు||

కనకము చవి చెడెఁ గడుఁగడును
ఘననృపబాధలు గదిమినవి
దనుజుల కతివలు దలఁకెదరు
ఎనయ బలాధికులెవ్వరు లేరు

||మేలు||

అసుర సతుల పుణ్యము ఘనము
కస (సి?) మసఁగెడి కలికాలమహిమ
పసగల వేంకటపతి యిఁకను
వసుధలోని నెవ్వగలుడుపఁగను

||మేలు||21

అవతారిక:

అన్నమాచార్యులవారు చెప్పిన ఒక మేలుకొలుపు కీర్తననాస్వాదించండి. 600 సంవత్సరాల క్రితం పరిస్థితి ఇంత ఘోరంగావుంటే నేడు యెవరికివారే యమునాతీరే అనే రోజుల సంగతి చెప్పేదేముంది? కన్నకొడుకులపై తండ్రి కక్షకడుతున్నాడు. బంగారం బంధువైపోయింది. ఆడది అసురులవంటి వారి చేతిలో అల్లాడిపోతుంది. “కసిమసగెడి కలికాలం” మహిమ యేం చెప్పగలం? ఒక్క శ్రీవేంకటేశుడే వసుధలోని పగను నెవ్వగలడు అంటున్నారు. భావవివరణతో పరిస్థితి ఇంకా బాగా అర్థమవుతుంది. అవునా?

భావ వివరణ:

ఓ భూలలనాధిప! (భూసతీరమణా!) భోగిశయనా! (శేషతల్పశాయీ!) మేలుకొనవే. (నీవు సృష్టించిన ఈలోకం యెంత ఘోరంగా వున్నదో ఒకసారి పరికింపుము).

వేదువిధి లేశమును లేదు (ఎవ్వడూ వేద విధానములను పాటించుట లేదు). భూమి మీద భరమై మించినది (అతిశయము యెక్కువైపోయింది). చూపరులకు భువిపాదుపడదు (కాళ్ళకింద భూమి కనపడదు. అంటే అంత పొగరుబట్టి వుంటారు). ప్రేమించవలసిన కన్నకొడుకుపైన తండ్రే కనలె (మండిపడుతుంటాడు).

కనకము చవిచెడెన్ కడునేకడున్ (బంగారమునకు వుండవలసిన నిబద్ధతతో కూడిన మక్కువ వుండదు. అనగా ప్రతివాడూ బంగారం కోసం వెంపర్లాడుతుంటాడు). గొప్పవాళ్ళయిన నృపుల (పరిపాలకుల) బాధలు గదిమినవి (భయపెడుతునవి). దనుజులకు (రాక్షసులవంటి మగవారి దౌర్జన్యాలకు) అతివలు (స్త్రీలు) తలకెదరు (భయపడుతుంటారు). లోకంలో ఈ పరిస్థితిని ఎనయు బలాఢ్యులు (సవరించగల దిట్టలు) యెవ్వరూ లేరు.

కాని అసురసతులు (దుర్మార్గుల భార్యలు) ఘనమైన పుణ్యములు చేస్తుంటారు. కలికాల మహిమ (కలియుగ ప్రభావముచేత) కసమసగెడి (పాపము విజృంభిస్తుంటుంది). హతవిధీ!! ఇక గత్యంతరం యేమిటి? పసగలవేంకటపతి (సర్వ సమర్ధుడైన శ్రీవేంకటేశ్వరుడు) ఇకను (ఇకపై) వసుధలోని పగను, నెవ్వగలడు (ఆపద తప్పించగలడు.)

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Abhaya Dayakuda Vade Neeve Gati In Telugu – అభయదాయకుడ వదెనీవే గతి

అభయదాయకుడ వదెనీవే గతి - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో అభయదాయకుడ వదెనీవే గతి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అభయదాయకుడ వదెనీవే గతి – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 2
కీర్తన : అభయదాయకుడ వదెనీవే గతి
సంఖ్య : 420
పుట : 283
రాగం : బౌళిరామక్రియ

బౌళిరామక్రియ

37 అభయదాయకుఁడ వదె నీవే గతి
యిభరక్షక నను నిపుడు గావవే

||పల్లవి||

భయహర దైతేయభంజన కేశవ
జయ జయ నృసింహ సర్వేశ్వరా
నియతము మాకిదె నీపాదములే గతి
క్రియగా మమ్మేలి కింక లుడుపవే.

||అభ||

బంధవిమోచన పాపవినాశన
సింధురవరదా శ్రితరక్ష
కంధరవర్ణుఁడ గతి నీనామమె
అంధకారముల నణఁచి మనుపవే.

||అభ||

దైవశిఖామణి తతచక్రాయుధ
శ్రీవేంకటగిరి శ్రీరమణా
సావధాన నీశరణ్యమే గతి
వేవేలకు నావిన్నప మిదియే.

||అభ॥ 420

అవతారిక:

శ్రీమన్నారాయణుని పై శ్రావ్యమైన కీర్తన వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. సర్వులకు అభయప్రదాతవైన ఓ గజేంద్రవరదా! నీవే నాకు దిక్కు ఇప్పుడు నన్ను రక్షించరాదా స్వామీ! అని వేడుకొంటున్నారు. “కింకలుడపవే” – అంటే కినుకదూరం చేయవయ్యా అని అర్థం. కోపము అనే వ్యాధిని పోగొట్టమని భావన. కంధరవర్ణడు అంటే నీలమేఘశ్యాముడని అర్థం. తతచక్రాయుధము అంటే వ్యాపించే స్వభావంగల సుదర్శన చక్రం ఆయుధముగాగలవాడని అర్థం. ఇట్లా అడుగడుగునా అర్ధాలు తెలియని మధురమైన కీర్తన ఇది. సావధానుడు – అంటే యేమిటో వూహించండి.

భావ వివరణ:

ఓ ఇభరక్షకా! (గజేంద్రవరదా!) ఇపుడు నన్ను రక్షించగా నీవే దిక్కు నీవు అభయప్రదాతవు. దీనజనోద్ధారకుడవు. నన్ను కాపాడుము తండ్రీ! ఓ భయహరా! నీవు దైతేయభంజనుడవు (అసురాంతకుడవు); కేశియను రాక్షసాంతకుడవు. సర్వేశ్వరుడవైన ఓ నృసింహా! జయము జయము. మీకు ఇదే నియతము (నియమము). నీచరణములే గతి. క్రియగా (అదేపనిగా) మమ్ము పరిపాలించి మా కింకలుడపవే (మానవులమైన మాకుండే దుర్గుణమైన కోపమును నిర్మూలింపుము ప్రభూ! తన కోపమె తన శత్రువన్నారు కదా!

భవ బంధములను సడలించు పాపవినాశనా! నీవు సింధురవరదుడవు (గజేంద్రవరదుడవు) శ్రీతరక్షకుడవు (ఆశ్రయించినవారిని రక్షించే వాడవు). కంధరవర్ణుడవు (నీమేఘశ్యాముడవు). ఓదేవదేవా! అట్టి నీనామమే మాగతి మా అజ్ఞానాంధకారమును అణచి మనుపవే (రక్షించవయ్యా!)

ఓ దైవశిఖామణీ! తతచక్రాయుధ (వ్యాపించు శక్తిగల చక్రాయుథా!) శ్రీవేంకటేశ్వరా! సావధానుడవైన (హెచ్చరికతోవుండె నీ శరణ్యమే మాగతి. వేవేల విధములైన నా విన్నపములు ఇవియే ప్రభూ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Rara Chinnanna Rarori Chinnavada In Telugu – రారా చిన్నన్నా రారోరి చిన్నవాఁడ

రారా చిన్నన్నా రారోరి చిన్నవాఁడ - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో రారా చిన్నన్నా రారోరి చిన్నవాఁడ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

రారా చిన్నన్నా రారోరి చిన్నవాఁడ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 10-2
కీర్తన: రారా చిన్నన్నా రారోరి చిన్నవాఁడ
సంఖ్య : 82
పుట: 00
రాగం: ఝుంఝూటి

ఝుంఝూటి

68 రారా చిన్నన్నా రారోరి చిన్నవాఁడ
రార ముద్దులాఁడ రారోరి బాలకృష్ణ

||పల్లవి||

కిందిచూపుల గిలిగించి ఆల-
మంద గొల్లెతల మరిగించి
సందడి వలపించి జవరాండ్లవూర
వింద వైనయట్టి వేడుకకాఁడ

||రారా||

కొదలుమాఁటలనె గొణఁగుచు భూమి
సుదతుల శిగ్గులు చూరాడి
చిదుగుచేఁతలనె చెనకుచుముద్దుఁ
బెదవిచవులు చూపిన జాణకాఁడ

||రారా||

కలికితనముననె కరఁగించి కాచె
చెలుల కాఁగిటనె చెలఁగి
లలనామణియైన లకిమమ్మఁ
గలసుక శ్రీవేంకటనాథుఁడైనవాఁడ

||రారా||

అవతారిక:

అన్నమయ్య మనుమడు, చినతిరుమలాచార్యులవారు చెప్పిన బాలకృష్ణునిపై మధుర కీర్తన వినండి. ఈయన కీర్తనలు జానపదుల శైలిలో జనప్రియంగా వుంటాయి. గిలిగించి అంటే చక్కిలిగింత పెట్టటం. అయితే, కింద చూపులు చూచే ఆవులమందకు గిలగించడమేమటి? అంటే మనం గిలిగింతలు పెడితే పాపాయిలెలా సంతోషిస్తారో రేపల్లెలో ఆవులు కూడా కృష్ణను చూచి సంతోషంతో పరవశించాయన్నమాట. ఆ పిల్లాడు కొదలుమాటలు రహస్యంగా గొణుగుతాడట. దానికి ఆడాళ్ళంతా సిగ్గుతో చితికిపోతారట. ఈ చినతిరుమలయ్య అచ్చం తాతగారే. కవిత్వంలోనూ అదే చలాకీతనం. భావ వివరణ చదివి పరవశించండి.

భావ వివరణ:

మా చిన్నన్నా!! రారా! ఓ చిన్నవాడా! రారా! ఓరి బాలకృష్ణా! నిన్ను ముద్దాడెదను రారా!

నీ లీలలను యేమని వర్ణించమయ్యా! నువ్వు, కిందిచూపుల ఆలమంద (అలవాటుప్రకారం క్రిందికి చూస్తూవెళ్ళే ఆవులమందకు గిలిగించేవు (పులకరింపు కలుగచేస్తావు… అంటే… సంతోషపెడతావు). గొల్లెతల మరగించేవు (గోపికలను విరహంతో వేపుతావు). వూర జవరాండ్రను (జవ్వనులైన మీవూరి ప్రియురాండ్రను బాహాటంగానే వలపు ముగ్గులోకి దింపుతావు. కృష్ణా! నీవు విందవైనయట్టి (సంతోషపరచు) వేడుకాడవు (భోగివి).

కృష్ణా! నీవు కొదలు మాటలనే (లోపభూయిష్టమైన మాటలను) గొణుగుచు (రహస్యంగా పలుకుచూ) సుదతుల శిగ్గులు (స్త్రీల సిగ్గును) చూరాడేవు (చితుకునట్లు చేసెదవు), కొంటె వేషాలు వేస్తూ మధురాధరముల రుచి చూపిన జాణకాడవు (రసిక శేఖరుడవు).

ప్రభూ! నీవు చెలుల కౌగిళ్ళలో చెలగి (అతిశయించి) నీ కలికితనముల (నేర్పరితనమున) పరవశింపజేసెదవు. నేడు ఈ తిరుమల శిఖరాలపై లలనామణియైన లకిమమ్మ (లక్ష్మిదేవి)ని కలిసినవాడవై మా ఆరాధ్యదైవమైన శ్రీవేంకటేశ్వరుడవైనావు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Niddirinchi Pala Jalanidhivalene In Telugu – నిద్దిరించి పాల జలనిధివలెనే

నిద్దిరించి పాల జలనిధివలెనే – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో నిద్దిరించి పాల జలనిధివలెనే కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

నిద్దిరించి పాల జలనిధివలెనే – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 5
కీర్తన: నిద్దిరించి పాల జలనిధివలెనే
సంఖ్య : 343
పుట: 233
రాగం: మధ్యమావతి

మధ్యమావతి

67 నిద్దిరించి పాల జలనిధివలెనే
వొద్దిక శ్రీరమణునికి వొత్తరే పాదములు

||పల్లవి||

వేగుదాఁకా చిత్తగించి విద్యలెల్ల నాదరించి
బాగుగా కృపారసము పంచి పంచి
యేగతిఁ బవ్వలించెనో యెట్ల భోగించెనో
యోగీంద్రవరదుని పూఁచ వుయ్యాలను

||నిద్ది||

వాలుఁకన్నుల రెప్పల వడదాఁకి తనుతావి
చాలుకొన్న వూర్పులు చల్లి చల్లి
నీలవర్ణపుగుణము నెరపుచు నొకయింత-
కాలము కన్నులఁ దిప్పక (ప్పీఁగ?) ప్పరే దోమతెర

||నిద్ది||

సరుగన యోగనిద్ర చాలించి లోకమెల్లఁ
కరుణించ తలచి వేంకటగిరిపై
అరుదుగ సకలలోకారాధ్యుడయి మించి (చీ?)
విరివి నాలవట్టాలు విసరరే సతులు

||నిద్ది||

అవతారిక:

పరమాత్ముడైన శ్రీమన్నారాయణునికి వుయ్యాలలూపుతూ మధురమైన కీర్తనతో నిద్రబుచ్చుతున్నారు అన్నమాచార్యులవారు. ఉప్పునీటి సముద్రాలు ఉవ్వెత్తు తరంగాలతో భీకరంగా వుంటే క్షీరసాగరం అలలు లేకుండా ప్రశాంతంగా వుంటుందట. ఈ దేవదేవుడు పాలజలనిధి వలెనే నిద్దిరించీ… ఈయనకి ఒద్దికతో పాదాలు ఒత్తండమ్మా! అని శ్రీదేవికి భూదేవికి చెబుతున్నారు. “సకల లోకములచే ఆరాధ్యుడై అతిశయించుచున్న ఈ శ్రీరమణుని ఓ సతులారా ఆలవట్టములు విసరండమ్మా!” అంటున్నారు.
“స్వామి మధ్య మధ్య కళ్ళు తిప్పుతున్నాడు, దోమతెర సరిగా కప్పండి” అంటున్నారు. తినబోతూ రుచియెందుకు? ఆస్వాదించండి.

భావ వివరణ:

ఓ తల్లులారా! (శ్రీదేవి, భూదేవి) ఈ శ్రీరమణుడు పాలజలనిధివలెనే (క్షీరసాగరము మాదిరి) ప్రశాంతంగా (వువ్వెత్తు తరంగాలు లేక వున్నట్లు, నిశ్చలంగా నిద్రిస్తున్నాడు). ఈయనకు ఒద్దికతో (అణుకువతో) పాదములను వొత్తండమ్మా!

వేగుచుక్క కనుపించేదాకా ఈయన నిద్రపోడు. మాబోటివారి విద్యలెల్లా ఒకపక్క ఆలకిస్తూనే మమ్మల్ని తరింపజేస్తుంటాడు. మాలోవున్న శరణార్థులపై అమితదయాళువై కృపారసమును పంచిపంచీ ఇంకా అలిసిపోతాడు. పాపం ఎట్లా పడుకొన్నాడో చూడండమ్మా! ఈ యోగీంద్రవరదుడు ఎట్లు భోగించేనోకాని ఆయన వుయ్యాల నెమ్మదిగా వూచరే (వూపండమ్మా!) అప్పుడుగాని ఆయన నిద్రించడు.

స్వామి, వాలు కన్నులరెప్పలు అరమోడ్చి నిద్రిస్తున్నాడు. మీ ఒంటి వేడిమి ఆయన ఒంటికి తాకి నిద్రాభంగం కావచ్చునమ్మా! చూడండి నిద్రలో కూడా చాలుకొన్న వూర్పులు చల్లిచల్లీ (అతిశయించిన నిట్టూర్పులు) యెలా విడుచుచున్నాడో! ఆయన భక్తుల బాధలు యెప్పుడూ వుండేవే. ఈ నీలవర్ణుని గుణం మీకు తెలుసుకదమ్మా!! ఆయనకు నిద్రపట్టదు. కొంచెంసేపు ఆ కళ్ళమీద వెలుతురు పడకుండా దోమతెరకప్పి కళ్ళు తిప్పకుండా జాగ్రత్తపడ్డారంటే నెమ్మదిగా నిద్రపడుతుందమ్మా!

ఇంకాసేపట్లో మళ్లీ సుప్రభాతం అంటూ తగులుకొంటారు. వీళ్ళు వచ్చేలోగా కాస్త నిద్రపట్టితే బాగుండును. ఈ వేంకటగిరిపై సరుగున (వెంటనే) యోగనిద్ర చాలించి లోకాన్నంతా కరుణించాలని ఆయనకెప్పుడూ ఆరాటమే. సకలలోకారాధ్యుడైన ఈ శ్రీవేంకటేశ్వరుడు అరుదుగ మించీ (అపూర్వమైన ఔన్నత్యంకలవాడు) ఓ సతులారా! ఈ స్వామి సుఖంగా నిద్రించుటకు ఆలవట్టుములు (వింజామరలు) విరివి విసరరే (కాస్తగట్టిగా వీయండమ్మా!)

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Narayanuda Ninamamai Mantrinchivesi In Telugu – నారాయణుడ నీనామమె మంత్రించివేసి

నారాయణుడ నీనామమె మంత్రించివేసి – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో నారాయణుడ నీనామమె మంత్రించివేసి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

నారాయణుడ నీనామమె మంత్రించివేసి – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన: నారాయణుడ నీనామమె మంత్రించివేసి
సంఖ్య : 494
పుట: 332
రాగం: సామంతం

సామంతం

75 నారాయణుఁడ నీ నామము మంత్రించివేసి
పారేటియీజంతువులభ్రమ విడిపించవే.

||పల్లవి||

మదనభూతము సోఁకి మగువలుఁ బురుషులు
అదన విరిదలలై యంగమొలలై
పెదవి నెత్తురు వీర్చి పెనుగోళ్ళఁ జించుకొంటా
కొదలు కుత్తికలనుఁ గూసేరు జీవులు.

||నారా||

పంచభూతములు సోఁకి భ్రమసి యజ్ఞానులై
పొంచి హేయములు మన్నుఁబూసుకొంటాను
అంచెల వీడెపురస మందు నిందు గురియుచు
యెంచి ధనముపిశాచాలిటైరి జీవులు.

||నారా||

తమితోడ మాయాభూతము సోఁకి బహుజాతి-
యెముకలుఁ దోలు నరా లిరవుచేసి
నెమకి శ్రీవేంకటేశ నిన్నుఁ జేర కెక్కడైన
తముఁ దా మెరఁగరింతటాఁ జూడు జీవులు.

||నారా||494

అవతారిక:

‘పారేటి’ జీవులు అంటే జీవనసంగ్రామంలో కకావికలై పరుగులు పెడుతున్న జీవకోటి (మనబోటివాళ్ళం) అన్నమాట. ఎందుకు వీళ్ళంతా పరుగులు పెడుతున్నారు? భ్రమకులోనైనందువల్ల. స్త్రీ మీద భ్రమ, ధనంమీద భ్రమతో, మాయ అనే భూతంపట్టి వాళ్ళు పరమాత్మ అంశ అనే జ్ఞానం లేక ‘నేను’ అంటే ఎముకలు నెత్తురు మాంసం నరాలు వున్న 60 కిలోల దేహం అనుకొంటున్నారు. మరి ఇక వాళ్ళు నారాయణుడైన శ్రీవేంకటేశ్వరుని చేరితే ఏమవుతుంది? తామెవరో తెలుసుకోగలుగుతారు.

భావ వివరణ:

ఓ శ్రీమన్నారాయణుడా! నీనామమును “మంత్రించి” ప్రయోగించినచో, పారేటి (జీవనయానంలో పరుగులు పెడుతున్న) యీ జంతువుల భ్రమలన్నీ విడిపించవే (తొలగించవయ్యా!)

ఈ జీవులకు ‘మదన భూతము’ సోకినది (మన్మథుడు అనే భూతం పట్టుకొన్నది). ఆడామగా అనే వివక్ష లేక విరిదలలై (తొలగిన విచక్షణ కలవారై) అంగమొలలై (దిగంబరులై) పెదవులు రక్తాలు చిమ్మేదాకా వీర్చి (చిమ్మించి) గోళ్ళతో గీరి, కొదలి (అతిశయించి) అవతలివారి పొందుకోసం గొంతుకలు కోసుకునే దాకా తెగిస్తారు. ఎంత దౌర్భాగ్యం!!

ఈ జీవులకి ప్రకృతిలో నున్న పంచభూతములు సోకి వశులను చేసికొని భ్రమలకు గుఱిచేసి అజ్ఞానులను చేస్తున్నవి. మన్ను పూసుకొనేవాడు ఒకడైతే తాంబూల రసాస్వాదనతో బ్రతికేవాడు ఇంకొకడు. ధనపిశాచి పట్టి జీవులు ఇటైరి. ఉచ్ఛము నీచమూ లేదు. ధనంకోసం చేయరాని పనులు చేస్తారు. ఎంత హేయమైన బ్రతుకులు!!

తమితోడ (అతి ఆసక్తిగల) ఈ జీవులకు భూతం పట్టింది. దానిపేరు “మాయా భూతము”. దానివల్ల ఈ జీవుడు వాడెవరో తెలుసుకోలేకున్నాడు. ఓ శ్రీవేంకటేశ్వరా వాడు ‘నేను’ అనుకొంటున్నది తన దేహాన్ని అనేభ్రమలో వున్నాడు. దేహంలోని తోలు, నరాలు, యెముకలు వాడి జాతి అని అనుకొంటున్నాడు. నేను అంటే జీవుడు. వాడు నిజానికి పరమాత్మ ప్రతిరూపమే. కానీ మాయవాడిని ఆవరించి, అజ్ఞానియై అనేక భ్రమలకులోనై అరిషడ్వర్గ పీడితుడై దాని పర్యవసానంగా జననమరణాల విషవలయంలో చిక్కాడు. వీడికి ఏడుకొండలవాడి దయకలిగేదాకా ఈ భ్రమలు తప్పవు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Dasohamanu Buddhi Dalacaru Danavulu In Telugu – దాసోహమనుబుద్ధిదలచరు దానవులు

దాసోహమనుబుద్ధిదలచరు దానవులు - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో దాసోహమనుబుద్ధిదలచరు దానవులు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

దాసోహమనుబుద్ధిదలచరు దానవులు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన: దాసోహమనుబుద్ధిదలచరు దానవులు
సంఖ్య : 5
పుట: 4
రాగం: నాట

నాట

74 దాసోహ మనుబుద్ధిఁ దలఁచరు దానవులు
యీసులకే పెనఁగేరు యిప్పుడూఁ గొందరు.

||పల్లవి||

హరిచక్రముదూషించేయట్టివారే యసురలు
అరయఁ దామేదైవమన్న వారు నసురలే
ధర నరకాసురుఁడు తానే దైవమని చెడె
యిరవై యిది మానరు యిప్పుడూఁ గొందరు.

||దాసో||

పురుషోత్తమునిపూజపొంతఁ బోరు అసురలు
సరవి విష్ణుని జపించనివారు నసురలే
హిరణ్యకశిపుఁడును యీతని నొల్లక చెడె
ఇరవై యీతని నొల్ల రిప్పుడూఁ గొందరు

||దాసో||

సురలును మునులును శుకాదియోగులును
పరమము శ్రీవేంకటపతి యనుచు
శరణని బ్రదికేరు సరి నేఁడు వైష్ణవులు
యెరపరికానఁ బొయ్యే రిప్పుడూఁ గొందరు.

||దాసో||

అవతారిక:

దానవులు దేవతలు అక్కచెల్లెళ్ళ పిల్లలే కాని వారి మధ్య ఎంత అంతరం వున్నదంటే ఒకరు చెడుకు వుదాహరణైతే, ఇంకొకరు మంచికి మారుపేరు. హరికి సురులు శరణాగతులైతే, అసురులు హరి విరసులు. ఈ కీర్తనలో అన్నమాచార్యులవారు దానవులకు హరికి దాసోహమనే బుద్ధివుండదని, వారు అసూయకే అలవాటుపడ్డవారని, అందుకనే చెడిపోయారని అంటున్నారు. తన వాదనని సోదాహరణంగా నిరూపిస్తున్నారు కూడా. అసురులు అట్లావుంటే, సురులు మునులు హరి శరణాగతులు.

భావ వివరణ:

దానవులు (రాక్షసలు) దాసోహమనుబుద్ధి (శరణాగతిని) దలచరు (ఒప్పుకోరు. ఇప్పుడు (ఈ కలియుగంలో) కొందరు మానవులు, ఈసులకే (అసూయతో) పెనగేరు (ఒకరితో నొకరు కొట్లాడుచున్నారు).

అసురులంటే వేరేవరో కాదు. విష్ణుదేవుని చక్రాన్ని దూషించేవారంతా అసురులే. అ (పరిశీలించి చూచిన) తామే దైవమని అహంకరించినవారెవరైనా అసురులే. విష్ణువు భూకాంతలపుత్రుడు నరకుడు. వాడు అసురుడై లోక కంటకుడైనాడు. హరి వానిని సంహరిస్తాడు కావున భూదేవి హరిని వాడినంతము చేయవద్దని వేడుకొంది. “నేను చంపను వీడిని నీవు చావు అని తిట్టే దాకా వాడు చావడు” అని వరమిచ్చాడు విష్ణువు. నరకాసురుడు తానే దైవమని లోకకంటకుడయ్యాడు. వాడికోసం భూదేవి అంశతో పుట్టిన సత్యభామతో కృష్ణుడైన హరి తమపుత్రునే చంపించాడు. ఈరోజుల్లో నరుల్లో కూడా నరకాసురులు కోకొల్లలు.

అసురులు పురుషోత్తముని పూజదగ్గరకే పోరు. విష్ణుని జపించనివారంతా అసురులే. కృతయుగమున హిరణ్యకశిపుడు కూడా హరి నొల్లక అంతమైనాడు. ఈ కలియుగంలో కూడా కొందరు యీతని (ఈ దేవదేవుని వొల్లరు (అంగీకరించరు).

దేవతలు, మునులు, శుకుడు మొదలైన యోగులు పరమము మోక్షప్రదాత శ్రీవేంకటేశ్వరుడే అని శరణాగతితో బ్రతుకుచున్నారు. సరి (అదట్టుండగా) నేడు వైష్ణవులు కూడా కొందరు “యెరపరికాన” (రోత కలిగి) పొయ్యేరు (ద్వేషముతో జీవించుచున్నారు).

గమనిక : ఆచార్యులవారి భావన ఇదేనేమోనని నా ఊహ. నా ఆశ.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Aevvarum Ganani Vamdu Yashoda Gane Natte In Telugu – ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె

ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 2
కీర్తన : ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె
సంఖ్య : 316
పుట : 213
రాగం : శంకరాభరణం

శంకరాభరణం

36 ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె
పవ్వళించే బ్రహ్మతండ్రి బాలుఁడయ్యె నట్టె

||పల్లవి||

ఘనయోగీంద్రులమతిఁ గట్టువడనట్టివాఁడు
పనిలేక రోలఁ గట్టువడినాఁడట్టె
తనియ సురలకు పాదము చూపనట్టివాఁడు
మొనసి బండిమీఁద మోపినాఁ డట్టె.

||ఎవ్వ||

అమృతము చేతఁ దచ్చి అందరికిచ్చినవాఁడు
తమితో వెన్న దొంగిలెఁ దానె యట్టె
గుమురై దేవదానవకోటికిఁ జిక్కనివాఁడు
భ్రమసి గోపికలపాలఁ జిక్కినాఁ డట్టె.

॥ఎవ్వ||

యిందుఁ గలఁ డిందులేఁడనెంచి చూపరానివాఁడు
అందమై రేపల్లెవాడ నాడీనట్టే
అంది కృష్ణావతారముయినట్టిదేవుఁడే
యిందున శ్రీవేంకటాద్రి యెక్కి నిలిచె నట్టె.

||ఎవ్వ|| 316

అవతారిక:

ఒకరోజు యశోదకు కృష్ణయ్య అల్లరి వినిపించడం లేదేమిటబ్బా! అని కొడుకును రహస్యంగా చూద్దామని మెల్లిగా నక్కి చూసిందట. అక్కడ పడుకొన్నది ఆవిడ కొడుకా? ఆయన, పరమేష్ఠితండ్రి, ఆదినారాయణుడు. కొంచెం తెరుచుకొనియున్న ఆస్వామినోట్లోంచి లోకాలన్నీ కనిపిస్తున్నాయట. దిమ్మతిరిగి పోయిందావిడకి. ఆయన ఎవ్వరూచూడలేని శ్రీమన్నారాయణుడు. భయంతో చేతులు జోడించిందా గొల్లది. చటుక్కున లేచి “అమ్మా”! అన్నాడు. అంతా కలలాగా మరచిపోయింది ఆ వెట్టితల్లి. అన్నమాచార్యులవారి ఈ అద్వితీయ కీర్తనకి ఈ పిట్టకధే మూలభూతి. దీనిని భావించి తరించండి.

భావ వివరణ:

ఆహా! ఏమి ఈ యశోద భాగ్యము! ఎవ్వరూ గాననివాడు (అగోచరుడై యెవ్వరికీ కనుపించని పరమాత్మ) ఈమె పొత్తిళ్ళలో పవ్వళించినాడే!! ఈ దేవదేవుడే, పితామహుడైన బ్రహ్మకే కన్నతండ్రియా? అట్టె (అతిసులువుగా) బాలుడయ్యెను. ఏమి ఆశ్చర్యము.

ఘనులైన యోగీశ్వరుల మదిలోకూడా కట్టుబడనివాడు, ఓహెూ! ఈనాడు రేపల్లెలో ఒక పనిలేని రోటికి కట్టబడినాడే!! సుకుమారమైన ఆయన పాదములెలావుంటాయో చూడాలని తహతహలాడే దేవతలకు తన అరిపాదములను చూపనట్టిదేవుడు ఈరోజు రేపల్లెలో ఒక కొయ్య బండికి చూపించి సూటిగా తన్నాడే!! ఏమి ఆ శకటాసురుని అదృష్టము!!

అమృతము కొరకై క్షీరసాగరమును చిలికించి, నిస్వార్ధంగా దేవతలందరికీ పంచిపెట్టించిన పురుషోత్తముడు, తానే తమితో (ఆసక్తితో) గోపికల ఇండ్లలో వెన్నదొంగిలించుచున్నాడే!! గుమురై (గుమిగూడిన) దేవదానవ కోట్లకు కూడా చిక్కని శ్రీమన్నారాయణుడు, నేడు బృందావనమున గొల్లభామలకు భ్రమకలిగినవానిలా చిక్కినాడే!! ఏమివింత!

ఇందుగలడు, ఇందులేడు అని ఇదమిద్ధంగా యెంచి చూపశక్యముకాని సర్వాతర్యామి ఈ రేపల్లెవాడలలో యెంత అందముగా ఆడుచున్నాడో చూడండి. ఆనాడు (ద్వాపరయుగమున) కృష్ణావతారమునంది పైలీలలన్నీ చేసినట్లే నేటి కలియుగంలో, యిందున (ఈ తిరుమలలో) శ్రీవేంకటాద్రి నెక్కి శ్రీవేంకటేశ్వరుడై నిలిచియున్నాడే!! ధన్యోస్మి తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Ramakrishna Nivu Nande Rajyameluchundudhuvu In Telugu – రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు

రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 3
కీర్తన : రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు
సంఖ్య : 432
పుట : 291
రాగం : లలిత

లలిత

20 రామకృష్ణ నీవు నందే రాజ్య మేలుచుండుదువు
యేమిసేసే విక్కడ నీ యిరవుకే పదవే

||పల్లవి||

లంక విభీషణు నుంచ లక్ష్మణుని నంపినట్టు
అంకె సుగ్రీవుఁ గిష్కింధ కంపినయట్టు
వంకకు సంజీవి దేను వాయుజుని నంపినట్టు
వేంకటాద్రిపొంతనుండ వేగ మమ్ము నంపవే

||రామ||

ఘనకిరీటము దేను గరుడని నంపినట్టు
అనుఁగుఁగపుల నిండ్ల కంపినట్టు
వొనర గోపికలొద్ది కుద్ధవుని నంపినట్టు
నునుపు శేషాద్రినుండ నన్ను నంపవే.

||రామ||

పెండిలికిఁ బరుషలఁ బిలువఁగ నంపినట్టు
అండనే ముందరఁ గంత కంపినయట్టు
వెండియు శ్రీవేంకటేశ వేఁట వచ్చి మరలితి-
వుండ(డు?) చోటనుండి నన్ను వూడిగాన కంపవే.

॥రామ॥ 432

అవతారిక:

ఓ శ్రీరామా! శ్రీకృష్ణా! నీవూ నీవు అక్కడ క్షేమంగా ప్రజలనేలుకోండయ్యా! ఇక్కడ ఈ కలియుగంలో మీరేం చేస్తారు? మీ మీ చోట్లకి (అయోధ్య, ద్వారకకీ) పదవే… అని చమత్కరిస్తున్నారు అన్నమయ్య. మీరు అక్కడకు పోయి, నన్ను మాత్రం వేంకటాద్రికీ, శేషాద్రికీ శ్రీవేంకటేశ్వరుని వూడిగం చేయమని కాస్త అనుగ్రహంతో పంపండయ్యా! విభీషణుణ్ణి, సుగ్రీవునీ, హనుమంతుని, గరుత్మంతుని, ఉద్ధవుని, వానరసేనను యెక్కడికెక్కడికో పంపారు కదా! అట్లాగే నన్నూ తిరుమలలో వుండరా అని పంపించండి అంటున్నారు. “అండనే ముందర కంత కంపినయట్లు” – అంటే యేమిటి? చదవక తప్పదు… భావవివరణ.

భావ వివరణ:

ఓ శ్రీరామా! శ్రీకృష్ణా! నీవున్ అందే రాజ్యమేలుచుండుదువు (నీవూ నీవూ అక్కడే ప్రజారంకముగా రాజ్యమేలుచుందువు). ఇక్కడ యేమిసేసేవు? నీ ఇరవుకు (మీమీ స్థానాలకు) నీవు అయోధ్యకు నీవు ద్వారకకు, పదవే (వెడలుడయ్యా!)

లంకలో విభీషణుని వద్దకు లక్ష్మణుని పంపి పట్టాభిషిక్తుని చేయించినట్లున్నూ, సుగ్రీవునికి కిష్కింద నేలుటకు పంపినట్లున్నూ, వాయునందనుడైన హనుమంతుని సంజీవని తెచ్చుటకు పంపినట్లున్నూ, మమ్మల్ని కూడా వేంకటాద్రి పొంతనుండి (దాపున నుండుటకు) నియోగించరాదా ప్రభూ!

నీ కిరీటమును తెమ్మని ఆనాడు గరుత్మంతుని పంపినట్లున్నూ, పట్టాభిషేకానంతరము అయోధ్య నుండి వానరసేనను తిరిగి కిష్కింధకు పంపివేసినట్లున్నూ, వేదన చెందుచున్న గోపికలవద్దకు ఓదార్చి హితబోధ చేసిరమ్మని నందవ్రజమునకు ఉద్ధవుని పంపించినట్లున్నూ, అనుపు శేషాద్రి నుండి (శేషాద్రినుండమని ఆనతీయుచూ నన్ను కూడా పంపించరాదా తండ్రీ!

నీ పెండ్లి పద్మావతితో జరుగుతుంది చూచుటకు విచ్చేయుడని పరుషలను (నీ భక్తులను) పిలువనంపినట్లున్నూ, అండనే కంతకు అంపినట్లు ముందరే నన్ను కూడా పంపించు స్వామీ! (పెండ్లిలో ఉప్పు పప్పు బియ్యమూ ఒక పెట్టెలో పెట్టి తీసికొనిపోయి మగ పెండ్లివారికి అందిస్తారు. ఆ పనికి ఆంతరంగికులను నియోగిస్తారు. దాన్ని కంతకు పంపడం అంటారు.) వెండియు (మరియు) ఓ శ్రీవేంకటేశ్వరా! నీవు వేటకు వెళ్తే తిరుమలను చూసుకోవటానికి నీవూడిగపువాడిగా నన్ను వుంచుకోరాదా తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Karena Kim Mam Gruhitum Te In Telugu – కరేణ కిం మాం గృహీతుం తే

కరేణ కిం మాం గృహీతుం తే - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో కరేణ కిం మాం గృహీతుం తే కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కరేణ కిం మాం గృహీతుం తే – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 6
కీర్తన : కరేణ కిం మాం గృహీతుం తే
సంఖ్య : 171
పుట : 123
రాగం : ఆహిరి

ఆహిరి

24 కరేణ కిం మాం గృహీతుం తే
హరే ఫణిశయ్యా సంభోగ

||పల్లవి||

జలే తవ సంచరణ మిహాధస్
స్థలే భవనం తవ సంతతం
బలే రూప ప్రకటన మతులా
చలే స్థానం చల చల రమణా

||కరేణ||

పదే భువన ప్రామాణ్యం తవ
హ్రదే ప్రచురణవిహరణ మిదం
ముదేమునీనాం మోహనం తనుం
మదే తవ నర్మ చ మాం విసృజ.

||కరేణ||

స్మరే విజయ స్తవ విమలతురగ
ఖురే రతిసంకుల రచన
పురే తవ విస్ఫురణం వేంకట
గిరే:పతే తే ఖేలాఘటిత.

||కరేణ|| 171

అవతారిక:

సరస శృంగార కీర్తన గీర్వాణిలో వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. నా అదృష్టం కొద్దీ ఇది శ్రీమన్నారాయణుని దశావతార కీర్తన. అక్కడక్కడా ప్రతిపదార్థమునకు గాక భావార్ధమునకు ప్రాముఖ్యతనివ్వడం జరిగింది. నేను తెలుగు దశావతార కీర్తన వివరిస్తే ప్రతిపదార్ధ వివరణకే ప్రాముఖ్యతనిస్తాను. కానీ సంస్కృతంలో ప్రతి పదార్ధ వివరణ నా శక్తికి మించినపని. ఎందుకంటే గీర్వాణిలో నా పాండిత్యం అమావాస్యనాటి చంద్రుడు. అదండీ సంగతి. “ఓ శ్రీహరీ! ఫణీంద్రశయ్యపై సంభోగానందమందుకొనే నీ కరములు నన్ను అనుగ్రహించకుండుట యెందులకు?” – ఇది పల్లవి మరిదింతే…

భావ వివరణ:

ఓ శ్రీహరీ! ఫణిశయ్యా సంభోగా! (ఫణీశుడైన ఆదిశేషుడు శయ్య (పడక) అయి వుండగా, ఆ శయ్యపై సంభోగించుటకు ఆయత్తమైనవాడా!) నీ కరములు నన్ను అనుగ్రహించకుండా యుండుటెందులకు ప్రభూ!

సముద్రమునందు నీయొక్క సంచలన మిట్టిది (మత్స్యావతారము); నీవు అడుగున నీపైన భువనములు వున్నవి (కూర్మావతారము); ఉన్నతమైన బలప్రకటన జరపురూపమొప్పినది (వరాహావతారము); కొండగుహలలో చరించు సింహముఖరూపివి (నరసింహావతరాము);

నీపదములతో భువన ప్రమాణములను కొలిచితివి (వామనావతరాము); గొప్ప మడుగులో (తీర్ధములలో) నీయొక్క ప్రసిద్ధమైన విహారములు (యాత్రలు) జేసితివి (పరుశురామావతారం); ఆనందమునిచ్చు మోహన రూపుడైతివి మునులకు సైతం (శ్రీరామావతారము); నీయొక్క ఔన్నత్యమునకు నన్ను విడనాడితివి (బుద్ధుని అవతారము).

నీయొక్క విజయ చిహ్నమైన తెల్లని గుఱ్ఱపు గిట్టల నడక రతి సల్లాప సంకేతములైనవి (కల్కి అవతారము); ఓ శ్రీవేంకటగిరినాథా! సృష్టిలో నీ ప్రకాశముతో నీయొక్క ఆట నాడించు నీ కరములతో నన్నేల పరిగ్రహించవు తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు: