Satsangatyamu In Telugu – సత్సాంగత్యము

Satsangatyamu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

పెద్దలు చెప్పిన నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… సత్సాంగత్యము నీతికథ.

సత్సాంగత్యము

దేవర్షి అయిన నారదడు సాక్షాత్ శ్రీమహావిష్ణువు యొక్క అవతారరూపుడు. అందుకనే యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు “దే పర్షీణాంచ నారదః” అని అన్నాడు. అట్టి మహనీయుడైన నారదుడు ఒకసారి శ్రీకృష్ణుని దర్శించుటకై వచ్చి దండప్రణామములు చేసి “భగవాన్! సత్సాంగత్యము యొక్క ఫలము దయచేసి వివరముగా చెప్పండి” అని కోరినాడు. జగద్గురువైన శ్రీకృష్ణుడు సత్సాంగత్య మహిమ అనుభవపూర్వకముగా నే నారదునికి తెలియచేయాలని సంకల్పించి “నీవు తూర్పువైపుగా వెళితే ఒక వెంటకుప్ప కనిపిస్తుంది. అందులో ఉన్న పేడపురుగును సత్సాంగత్య మహిమేమని ప్రశ్నించు” అని చెప్పి జగన్మోహనముగా చిరునవ్వునవ్వాడు.

పరమాత్మ ఆదేశానుసారమే చేశాడు నారదుడు. నరద మహర్షి ప్రశ్న అడిగాడోలేదో గిలగిలలాడూతూ ప్రాణాలు విడిచింది ఆ పేడపురుగు. ఇలా జరిగిందేమని దుఃఖిస్తూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి జరిగినదంతా విన్నవించుకొన్నాడు నారదుడు. జరిగినది విని జగన్నాటక సూత్రధారి ఇలా అన్నాడు. “ఇప్పుడు పశ్చిమదిశగా వెళ్ళు. ఒక పాడుపడిన దేవాలయము అందులో నివసిస్తున్న పావురము కనిపిస్తాయి. నీ సందేహమును అది తీర్చగలదేమో చూడు”. వెంటనే బయలుదేరి పావురమును కలుసుకొని తన ప్రశ్నవేశాడు నారదుడు.

అదేమి చిత్రమో ఆ కపోతము నారద మహర్షి పాదలమీద పడి ప్రాణాలు విడిచింది. “ఇది ఏమి వింత? ఇంకా ఎన్ని విధాల ఆ భగవంతుడు నన్ను పరీక్షించదలచాడో?” అని చింతిస్తూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి జరిగినది విన్నవించుకొన్నాడు. “అలా జరిగిందా నారదా? అయితే ఈ సారి ఉత్తర దిక్కుగా వెళ్ళు. అక్కడి సంస్థానములోని మహారాజుకు చక్కని మగశిశువును పుట్టాడు. నీ సందేహమును ఆ శిశువు తీర్చగలదు” అని చెప్పి చిరునవ్వులొలకబోసాడు లీలామానుషవిగ్రహుడైన నందనందనుడు.

మొదటి రెండు మార్లు జరిగినది తలచుకొని కొంచెం సంకోచించాడు నారదుడు. సర్వజ్ఞుడైన స్వామి అది గమనించి “నారదా! నిర్భయముగా వెళ్ళు. ఈ సారి అంతా శుభమే జరుగుతుంది” అని ఆశీర్వదించాడు. వెంటనే నారదుడు బయలుదేరి ఆ శిశువు వద్దకు వచ్చి “ఓ పాపాయి! మహాత్ముల సాంగత్యము వలన కలిగే ప్రయోజనమేమిటి?” అని ప్రశ్నించాడు. నారదుడు ప్రశ్నించిన మరుక్షణం ఆ పసిపాప ఒక దేవత గా మారిపోయి భగవత్స్వరూపుడైన నారదునికి యథావిధిగా ప్రణమిల్లి ఆశ్చర్యముగా చూస్తున్న నారదునితో “దేవర్షి! అలా ఆశ్చర్య పోతున్నారేమిటి ? పెంటకుప్పలోనున్న పేడపురుగును నేనే.

అప్పుడు నా జన్మజన్మాంతరాల పుణ్యఫలము వలన అమోఘమైన మీ దర్శన భాగ్యము నాకు కలిగినది. మీవంటి దివ్యపురుషుల సందర్శన మాత్రముచే నాకు పావురము యొక్క జన్మ లభించినది. ఆ జన్మలో కూడా మీ దర్శనభాగ్యము లభించుటచే రాజపుత్రునిగా జన్మించినాను. మరల ఈ జన్మలో మీ దుర్లభ దర్శనము కలిగినందు వలన నాకు దైవత్వము లభించినది. మహాత్ముల సాంగత్యము యొక్క మహిమ ఇంతటిది!” అని అంటూ దేవలోకానికి వెళ్ళిపోయాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

జగద్గురువులైన ఆదిశంకరులు

“సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలితత్వం నిశ్చలితత్వే జీవన్ముక్తిః ॥”

అని ఉపదేశించినారు. అంటే జీవన్ముక్తికి ప్రథమ సోపానము సత్సంగత్యము. రాజకుమారుడు చెప్పినట్టు ఆ సత్సంగత్యము పురాకృతపుణ్యము వలన కలుగును. కాబట్టి మనకు మంచిపనులు చేస్తేనే సత్పురుషుల సాంగత్యము తద్వారా జీవన్ముక్తి కలుగుతాయి. ఈ కారణముగానే ఇంద్రునిచే శాపగ్రస్తుడైన యయాతి (యయాతి కథ చూడండి) కూడా కనీసం తనను సత్పురుషుల సాంగత్యములో ఉండనివ్వమని ప్రార్థించి సద్భువనములో ఉండుటకు దేవేంద్రుని వద్ద వరం పొంది తరించాడు. కనుక మనము ఎల్లప్పుడూ మంచివారితో ఉండి వారినుండి మంచిని గ్రహించి తరించాలి. దుష్టులకు ఎల్లప్పుడూ దూరముగా ఉండాలి.

మరిన్ని నీతికథలు మీకోసం:

Ardhanareeswara Stotram In Telugu – అర్థనారీశ్వర స్తోత్రమ్

Ardhanareeswara Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు అర్థనారీశ్వర స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Ardhanareeswara Stotram Telugu Lyrics

అర్థనారీశ్వర స్తోత్రమ్ 

శ్రీ శంకర భగవత్పాద విరచితమ్

చాంపేయ గౌరార్థ శరీరకాయై
కర్పూర గౌరార్థ శరీరకాయ।
ధమ్మిల్లకాయై చ జటాధరాయ
నమః శివాయై చ నమశ్శివాయ ॥

1

కస్తూరికా కుంకుమ చర్చితాయై
చితారజః పుంజ విచర్చితాయ।
కృతస్మరాయై వికృతస్మరాయ

||నమశ్శివాయై|| 2

ఝణత్క్వణత్కంకణ నూపురాయై
పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ।
హేమాంగదాయై భుజగాంగదాయ

||నమశ్శివాయై|| 3

విశాల నీలోత్పల లోచనాయై
వికాసిపంకేరుహ లోచనాయ।
సమేక్షణాయై విషమేక్షణాయ

||నమశ్శివాయై|| 4

మందారమాలా కలితాలకాయై
కపాలమాలాంకిత కంధరాయ।
దివ్యాంబరాయై చ దిగంబరాయ

||నమశ్శివాయై|| 5

అంభోధరశ్యామల కుంతలాయై
తటిత్ప్రభా తామ్ర జటాధరాయ।
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ

||నమశ్శివాయై|| 6

ప్రపంచసృష్ట్యున్ముఖ లాస్యకాయై
సమస్తసంహారక తాండవాయ।
జగజ్జనన్యై జగదేక పిత్రే

||నమశ్శివాయై|| 7

ప్రదీప్తరత్నోజ్జ్వల కుండలాయై
స్ఫురన్మహాపన్నగ భూషణాయ।
శివాన్వితాయై చ శివాన్వితాయ

||నమశ్శివాయై|| 8

ఏతత్పఠే దష్టక మిష్టదం యే
భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ।
ప్రాప్నోతి సౌభాగ్య మన్తకాలం
భూయా త్సదా చాస్య సమస్త సిద్ధిః ||

||నమశ్శివాయై|| 9

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం అర్ధనారీశ్వర స్తోత్రమ్

మరిన్ని స్తోత్రములు

Lampugubba Gollethala Lanja Kamda Ni In Telugu – లంపుగుబ్బ గొల్లెతల లంజకాఁడ నీ

లంపుగుబ్బ గొల్లెతల లంజకాఁడ నీ - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో లంపుగుబ్బ గొల్లెతల లంజకాఁడ నీ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

లంపుగుబ్బ గొల్లెతల లంజకాఁడ నీ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 6
కీర్తన : లంపుగుబ్బ గొల్లెతల లంజకాఁడ నీ
సంఖ్య : 127
పుట : 92
రాగం : ఆహిరి

ఆహిరి

29 లంపుగుబ్బ గొల్లెతల లంజకాఁడ నీ
యింపులే వెదకంబట్టీ నెట్లరా వోరి!

||పల్లవి||

చెప్పరానివేడుకల సిగ్గులనే నిన్నాళ్లు
ఉప్పతిల్లుం గోరికల నుంటిం గాని
ఇప్పు డింతనిలువలే నేమిసేతు నీచిత్త
మెప్పుడు గాని రాదో యెట్లరా వోరి

||లంపు||

చిల్లర సింగారాలు చెలులు సేయఁగ నేను
వొల్లనని యిన్నాళ్లు నుంటిం గాని
మల్లెపూవువంటి నన్ను మాసినచీరతోడ
నిల్లు వెళ్లకుండఁ జేసి తెట్లరా వోరి!

||లంపు||

కమ్మనిపానుపున నీకౌఁగిటిలో నిన్నాళ్లు
ఉమ్మగింపుమేనితో నుంటిం గాని
దిమ్మరిసేఁతలతోడి తిరువేంకటేశ! నీ
యెమ్మె లింకా మానలే వెట్లరా వోరి.

||లంపు||

అవతారిక:

జానపద బాణీలో సాగే గొల్లెతల సరస శృంగార కీర్తన వినిపిస్తున్నారు. అన్నమాచార్యులవారు. అతిశయించిన మమకారంతో నాయిక నిందిస్తుంటుంది, చనువుగా. అన్నమయ్య కాలంలో జానపదులు వాడిన కొన్ని మాటలు నేటి నిఘంటువులలో లభించుటలేదు. ఉదాహరణకి “లంపు గుబ్బ గొల్లెత” “లంపు” అంటే “దొంగమేత”, “గుబ్బలు” అంటే స్తనములు. దీనికి సమన్వయమెట్లా సాధ్యం. 600 ఏళ్ళక్రితం జానపదుల వాడుక భాషలో “లంబము” అనే మాటను “లంపు” అనేవారేమో. ఆ మాటకు దీర్ఘమైన లేక పొడవాటి అని అర్థం. అదండీ సంగతి ‘లంజకాడు’ అంటే ‘విటుడు’ అని ప్రతిపదార్థ వివరణ కావాలనే త్యజించుట క్షంతవ్యము.

భావ వివరణ:

ఓరీ!! (ఔరా!) లంపు గుబ్బ గొల్లెతల (ఉన్నత స్తన గిరులున్న గొల్ల భామల) లంజకాడ! (విటుడా!) నీ ఇంపులెల్లా (నీకు వేటిమీద మోజుయెక్కువో) వెదకంబట్టె (తెలిసిపోయింది) యెట్టరా? (ఇట్లా అయితే ఎట్లాగునరా!)

ఓరీ!! చెప్పశక్యంకాని కోరికలు ఉప్పతిల్లినా (చెలరేగినా) నేను సిగ్గుచే చితికియున్నాను. కాని ఇప్పుడింక నిలువరింపనసాధ్యమై పోవుచున్నది. నేనేమి సేయ గలనురా? నీకు నాపై మనస్సెప్పుడు పుడుతుందో చెప్పలేం. ఇట్లా అయితే యెట్టారా? (యెలాగునరా!)

ఓరీ!! నా చెలికత్తెలు ఇంతకాలమూ నేను నీ కంటికి నదురుగా వుండాలని యేవేవో చిల్లర సింగారాలు (సామాన్యమైన అలంకరణులు) చేసేవారు. నేను కూడా వాటిని వొల్లనని (వద్దని) తిరస్కరించేదాన్ని. కానీ నీకోసం పడిగాపులు కాసీ కాసీ, మల్లెపూవువంటి నన్ను మాసిన చీరెతో ఇంటికి అంటిపెట్టుకొని పోయేట్లు చేశావు కదరా! ఇట్లా అయితే యెరా?

ఓరీ! నీ కమ్మని పాన్పుపై (మధురమైన శయ్యపై) నీ సందిట, వుమ్మగింపుమేనితో (తెళ్ళు దేహంతో వున్నాను. కానీ ఓ తిరుమల నాయకా! నీ దిమ్మర సేతల (మత్తులో ముంచే నీ చిలిపి సేతలతో) నీ యెమ్మెలు మానవు (విలాసవంతమైన సయ్యాటలను వదలవు). నీతో యెట్టారా?

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Santruptini Minchina Sampada Ledu – సంతృప్తిని మించిన సంపద లేదు

Santruptini Minchina Sampada Ledu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్భాగవతము నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… సంతృప్తిని మించిన సంపద లేదు.

సంతృప్తిని మించిన సంపద లేదు

సుదాముడు శ్రీ కృష్ణ పరమాత్మకు బాల్యస్నేహితుడు సహాధ్యాయి. ఈతడు భూసురోత్తముడు విరాగి బ్రహ్మవేత్త జితేంద్రియుడు ఉత్తముడు అన్నిటినీ మించి శ్రీ కృష్ణునికి ఆప్తుడు. కాని సుదాముడు చాలా బీదవాడు. చినిగిన బట్టలు కట్టుటచే ఈతనికి కుచేలుడన్న పేరువచ్చెను. అయిననూ కుచేలుడెన్నడూ తనకు ధనములేదని విచారించలేదు. దీనునివలె యాచనచేయలేదు. దైవప్రేరణచే తనకు కలిగినదానితో సుఖముగా జీవించుచుండెను. సదా బ్రహ్మనిష్ఠ యందుండెడివాడు. సంతృప్తి లేని యెంత ధనవంతుడైననూ దరిద్రుడని సంతృప్తి ఉన్న ఎంత బీదవాడైననూ ధనవంతుడే అనిన సత్యమెఱిగినవాడు.

సుదాముని సతి వామాక్షి. ఈమె పతివ్రతాశిరోమణి. అర్థాంగి అన్న పేరు సార్థకం చేసుకొన్నది. ఒకనాడు సుదామునితో ఇట్లాఅన్నది “నాథా! అవంతీపురమున పరమాత్మ మీరు సాందీప మహర్షి వద్ద సహాధ్యాయులు. శ్రీ కృష్ణస్వామి మీకు ఆప్తులు కూడా. పరమాత్ముని దర్శించిన వారికి సకల క్లేశములు తొలగును కాదా. ఒక పర్యాయము ఆయన కడకు వెళ్ళిరాకూడదా?” అని ఆవేదనను వ్యక్తపఱచినది. తన అర్థాంగి చెప్పిన హితవాక్యాలు విని సుదాముడు “వామాక్షీ! ఆ పరంధాముని దర్శనము నాకు లభించునా? అయిననూ ఫలాపేక్షరహిత చిత్తముతో ఆ భగవానుని దర్శనమునకు పోయెదను. మన హితము ఆ సర్వజ్ఞుడే చూసుకొంటాడు. నేనును నా స్నేహితున్ని చూడాలని చాలా రోజులగా అనుకొంటున్నాను. దైవసన్నిధికి ఏగునపుడు రిక్తహస్తాలతో పోరాదు. నాలుగుగుప్పెళ్లు అటుకులు దొరకునేమో చూచి రమ్ము”. వామాక్షి భర్త అంగవస్త్రంలో అటుకులు కట్టి పంపింది.

పరమాత్మ దర్శనానికి ఉవ్విళులూరుతూ సుదాముడు త్వర త్వరగా నడచి ద్వారకను చేరెను. శ్రీ కృష్ణుడే మందిరములో నున్నాడ ని ద్వారపాలకులను ప్రశ్నించెను. వారు అన్ని మందిరములలో నుండునని చెప్పిరి. పదహారు వేలయెమినిది మంది భార్యలున్నాకూడా ప్రతి ఇల్లాలి మందిరంలో తానే ఉండి శ్రీ రామావతారంలోని ఏకపత్నీవ్రతం అనే ఆదర్శాన్ని నిజం చేసిన శ్రీ కృష్ణస్వామి లీలకు వందనం చేసి సుదాముడు ఒక అంతఃపురం వద్దకొచ్చాడు. అది రుక్మిణీ దేవి మందిరం. సుదాముడు వచ్చాడని తెలియగానే శ్రీ కృష్ణుడు పరుగెత్తి సింహద్వారము కడకేగి ఆనందపారవశ్యంతో సుదాముని కౌగిలించుకొనెను. ఇరువురి కన్నులనిండా ఆనందభాష్పాలు జాలువారాయి. శ్రీ కృష్ణుడు సుదాముని హస్తం పుచ్చుకుని స్వయంగా అంతఃపురం లోనికి తీసుకు వెళ్ళాడు.

రుక్మిణీ దేవి స్వర్ణకలశముతో పవిత్రోదకం తెచ్చింది. శ్రీ కృష్ణుడు తన హస్తములతో సుదాముని పాదములు కడిగి ఆ నీళ్ళు తన శిరమున చల్లుకొన్నాడు. “అతిథి దేవోభవ” అని లోకానికి చాటడానికి శ్రీకృష్ణుడలా చేసెను. అది చూచినవారంతా ఆ జలమును తమ శిరముల పై చల్లుకొన్నారు. ఆ తరువాత శ్రీ కృష్ణుడు తన పర్యంకంపై సుదాముని కూర్చుండబెట్టి యథావిధి అతిథి సత్కారము చేసెను. మృష్టాన్నములతో భోజనము పెట్టెను. పరమాత్మ తనకు సేవ చేయుట చూడలేక సుదాముడు శ్రీ కృష్ణ స్తుతి చేసెను. తరువాత ఎంతోసేపు వారు ప్రియభాషణములాడిరి. శ్రీకృష్ణుడు సుదాముడు తెచ్చిన అటుకులు తిని “ఇట్టి అటుకులు నా చిన్నతనమున మా అమ్మ నాకు తినిపించేది. మరల ఇప్పుడే తినుట” అని అన్నాడు. మఱునాడు సుదాముడు తన గృహమునకు మఱలెను. శ్రీ కృష్ణుడు సుదామునికి ఘనముగా వీడ్కోలిచ్చెను.

సుదాముడు ఎంత కష్టాలలో ఉన్నా తనను ఏమీ అడుగకుండా వెళిపోవటం చూసి శ్రీ కృష్ణుడు సుదాముని సంతృప్తికి భక్తికి మెచ్చి సుదామునికి అనంత సంపదనిచ్చెను. సుదాముడు దారి అంతా శ్రీ కృష్ణుని తలచుకుంటూ తన ఇల్లు చేరెను. శ్రీ కృష్ణుని దయవల్ల తనకు సకల సంపదలు వచ్చెనని తెలుసుకొనెను. సుదాముడు వామాక్షి ఆ సంపద తమదికాదని తలచి బీదసాదలకు దానములు చేసిరి. ఎన్నెన్ని దానములు చేసినా ఆ అనంతనిధి కరఁగలేదు. అలా అనంత పుణ్యాన్ని ఆర్జించి ఆ దంపతులు కడకు కైవల్యమును పొందిరి.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. సంతృప్తి లేనివాని జీవనం దుఃఖమయం. సంతృప్తి ఉన్న ఎంత బీదవాడైనా ధవవంతుడే. అడిగే అవకాశమున్నా తనకున్నదానితో తృప్తిగా ఉన్న సుదాముని మెచ్చి శ్రీ కృష్ణపరమాత్మ సుదామదంపతులకి మోక్షాన్ని ప్రసాదించాడు.
  2. స్నేహం యొక్క ఔన్నత్యం ఈ కథలో మనకు బాగా తెలిసింది. ఒక సత్పురుషుని స్నేహం కన్నా ఎక్కువైన ధనం ఏదీలేదు. సుదాముడు శ్రీ కృష్ణుల స్నేహం అద్వితీయం. శ్రీకృష్ణుని చెలిమి సాటిలేని కలిమి.
  3. ఒక అతిథి పైగా పండితుడు వచ్చినప్పుడు వానిని ఎలా సేవించాలో శ్రీ కృష్ణుడు ఈ కథలో మనకు చూపినాడు. సకల జీవరాశికి మోక్షప్రదాత అయిన శ్రీ కృష్ణుడు సుదాముని కాళ్ళుకడిగి ఆ నీళ్ళు తన నెత్తిన చల్లుకొన్నాడు.
  4. నిష్కల్మష భక్తి ఎలావుండాలో సుదాముడు మనకు చూపినాడు. నాకే కోరికాలేదు. నాకేది మంచిదో నీకే తెలుసు అనే నమ్మకం భగవంతుని మీద ఉండాలని సుదాముడు చెప్పినాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Ma Duritamulu Vapi Mammu Gachu Taruda In Telugu – మా దురితములు వాపి మమ్ము గాచు టరుదా

మా దురితములు వాపి మమ్ము గాచు టరుదా – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో మా దురితములు వాపి మమ్ము గాచు టరుదా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

మా దురితములు వాపి మమ్ము గాచు టరుదా – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన : మా దురితములు వాపి మమ్ము గాచు టరుదా
సంఖ్య : 434
పుట: 292
రాగం: బౌళి

బౌళి

63 మా దురితములు వాపి మమ్ము గాచు టరుదా
శ్రీదేవిరమణుడ శ్రీ వేంకటేశ

||పల్లవి||

అంబరీషు పైకొన్న ఆపదలన్నియు బాపి
వెంబడి గాచే నీచే పెనుచక్రము
అంబరాననున్న ధ్రువు నజ్ఞానమెల్ల బాపి
పంబి నీచేతనుండిన పాంచజన్యము

||మా దురిత||

పక్కన జరాసంధు బలమెల్ల నుగ్గాడి
నిక్కము మధురనిల్పే నీచే గద
తొక్కి హిరణ్యకశిపు దునిమి ప్రహ్లాదు గాచే
నిక్కి నిక్కి మెరిసేటి నీ ఖడకగము

||మా దురిత||

వెడ రావణుని జంపి విభీషణుని గాచే
చిడుముడి పడక నీచే శాస్త్రము
యెడమీక శ్రీ వేంకటేశ నేడు నన్ను గాచె
బడిబడి నీ నామపఠన నేడిదిగో

||మా దురిత||434

అవతారిక:

ఓ శ్రీదేవివల్లభా! శ్రీవేంకటేశ్వరా! నీకు అన్ని ఆయుధాలు వున్నాయి కదా! ప్రభూ! మా పాపములను బద్దలుకొట్టి మమ్మల్ని కాపాడవయ్యా! అంటున్నారు అన్నమాచార్యులవారు. శ్రీహరి సుదర్శన చక్రము, పాంచజన్య శంఖమూ, కౌమోదకి గద నందకము అనే ఖడ్గము, శార్జము అనే ధనస్సు యెన్నెన్నో ఘనకార్యాలు చేశాయి ఇదివరలో. ఇప్పుడు ఈ కలియుగంలో మా పాపాలే మా పాలిటి రాక్షసులు. వీళ్ళని నిర్మూలించటానికి నీ ఆయుధాలతో పనిలేదు, నీ నామపఠనం చాలు. అదే బడిబడి (దృఢమైన) దై మమ్మల్ని రక్షిస్తుంది అంటున్నారు. పంబి అంటే అతిశయించి అని అర్థం.

భావ వివరణ:

శ్రీదేవీ వల్లభుడవైన ఓ శ్రీవేంకటేశ్వరా! మా దురితములు (పాపములు) వాపి (నిర్మూలించి) మమ్మున్ కాచుట (రక్షించుట) అరుదా? (అంత అపూర్వమైన విషయమా తండ్రీ!)

ఇదిగో నీచే (నీచేతిలోనున్న) ఈ పెనుచక్రము (గొప్ప సుదర్శన చక్రము) నీ భక్తుడు అంబరీష మహారాజుపై ఆగ్రహించిన దుర్వాసనికి బుద్ధిచెప్పి, పైకొన్న ఆపదలను బాపి వెంటనే రక్షించింది కదా! మరి, నీ వామహస్తముననున్న శంఖము కనిపిస్తున్నదే… దానిపేరు పాంచజన్యము. దానిధ్వని పామరుల అజ్ఞానం మాన్పి నీవైపు త్రోవచూపిస్తుంది. అదిగో అంబరాన (ఆకాశంలో) ధ్రువతారయై కాంతులు జిమ్ముతున్న నీ బాలభక్తుడు ధ్రువుని అజ్ఞానం తొలగించి, నీచేత పంబి (అతిశయించి) వున్నది.

అదిగో నీచేతిలోనున్న “గద” దానిపేరు కౌమోదకము. అది నీ శత్రువులను దంచి నుగ్గాడుతుంది (తుత్తునియలు చేస్తుంది). ఆనాడు నీపక్కలో బల్లెమువలె మాటిమాటికి మధురపై దండెత్తి నీకు చీకాకు కలిగించుచున్న కంసుని మామగారు… జరాసంధుని అనేకసార్లు బలహీనుని చేసిన పిమ్మట నీచేతిలో నిక్కము (స్ఫుటంగా) మెరయుచున్నది. అదిగో నీచేతిలో నిక్కి నిక్కి (తొంగిచూస్తూ) మెరిసే ఖడకగము (ఖడ్గము). దానిపేరు నందకము. ఆనాడు నీవు నృసింహుడవై హిరణ్యకశిపుని చీల్చి సంహరించి ప్రహ్లాదుని కాచినప్పుడు వాని అనుచరులు మూకుమ్మడిగా నీపై బడితే నీనందకం వారిని చీల్చి చెండాడినది. నేడు నీ చేతిలో మెరుస్తున్నది.

అదిగో సమీపమున నీచేత మెరయు నీ ధనస్సు. దానిపేరు శార్హము (సారంగము) అదే త్రేతాయుగంలో నీవు శ్రీరామచంద్రమూర్తివైనప్పుడు వెద (వేదించు) రావణాసురుని నిర్జించి నీ భక్తుడు విభీషణుని రక్షించి, చిడుముడి పడక (కలతపడకుండా) చేసినది. ఓ శ్రీవేంకటేశ్వరా! నేడు కలియుగంలో ఇదిగో, యెడమీ క (విశ్రాంతికూడా తీసికొనకుండా) నన్ను (నాబోటి ఆర్తులను…) బడిబడి (దృఢముగా) కాపాడుతున్న గొప్ప ఆయుధం. దానిపేరు “ఓం నమో వేంకటేశాయ” – ఆ నామపఠనమే నన్ను అనుక్షణం రక్షిస్తున్నది.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Intata Harinekani Yendunanu Gana Nannu In Telugu – ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను

ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన: ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను
సంఖ్య : 463
పుట: 312
రాగం: శ్రీరాగం

శ్రీరాగం

62 ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను
కొంత నాకుఁ తదెలుపరో గురువులాల

||పల్లవి||

తనువూ హరియే తలఁపూ హరియే
వినికి మనికియును విష్ణుడే
కనుఁగొనుచూపులు కమలనాభుఁడే
యెనసి జీవునిశక్తి యేడనేడ నున్నదో

||ఇంత||

లోకమెల్ల మాధవుఁడే లోనెల్లఁ గేశవుఁడే
వాకును కర్మము శ్రీవైకుంఠుఁడే
చేకొని చైతన్యమెల్ల శ్రీనారాయణుఁడే
యీకడ నే ననువాఁడ నేడ నుండువాఁడనో

||ఇంత||

వెనకను కృష్ణుఁడే వెస ముం దచ్చుతుఁడే
కొనమొదలు నడుము గోవిందుఁడే
యెనయఁగ శ్రీవేంకటేశుమయ మింతాను
అనుగు నాస్వతంత్ర మది యేడనున్నదో

||ఇంత||463

అవతారిక:

“అంతయు నీవేహరి పుండరీకాక్ష” అని అన్నమాచార్యులవారు హరి శరణాగతి తెలిపారు. ఇప్పుడీ కీర్తనలోనూ “ఇంతటా హరినే (శ్రీహరియే)… కాని (అంతేకాని) నన్ను యెందుననుగాన” అంటున్నారు. “గురుతుల్యులైన పెద్దలారా! ఇప్పుడు కొంత నాకు దెలుపరో (నాక్కొంచెం వివరంగా చెప్పండయ్యా!) అంటున్నారు. పుట్టిన దేహానికి పెరుగుట తరుగుట మరణించుట యే శక్తివలన జరుగుతున్నది? ఆ శక్తి యెక్కడుంది? “నేను” అని పిలుచుకుంటున్నవాడు యెక్కడవున్నాడు? మొదలు, నడుము, కొన – అన్నీ గోవిందుడే. వెనుకా వాడే, ముందునా వాడే అచ్చుతుడు. ఇంతాను (ఇదంతా శ్రీవేంకటేశుని మయము. ఇక నా స్వతంత్రం యెక్కడుందయ్యా! అంటున్నారు.

భావ వివరణ:

ఓ గురువులాల! (గురు పుంగవులారా!) కొంత నాకు దెలుపరో (నాకు కొంచెము వివరించండయ్యా!) ఇంతటా హరినే (ఈ సృష్ఠిలోని ఇదంతా శ్రీహరియే వున్నాడు). కాని (అంతేకాని నన్ను యెందునను గానను.

తనువు పుట్టినదాది పెరిగి, ముసలిదై నశిస్తున్నది. దీంట్లో శ్రీహరి వుండకపోతే అది సాధ్యమా? కనుక తనువు హరియే ఒక క్షణంలో లెక్కించలేనన్ని ఆలోచనలలో హరిలేడనగలమా? కనుక తలమపులోనూ హరియే. వినికి (శ్రవణశక్తి), మనికి (జీవనాధారము) విష్ణువే. కనుగొనుచూపులలో కూడా కమలనాభుడైన హరివుండబట్టే అంతగొప్ప దృష్టిజ్ఞానం కలుగుతున్నది. ఎనసి (వ్యాపించు స్వభావముగల) జీవుని శక్తి ఏయేరూపాలలో వుంటుందో యెవరికి తెలుసు?

ఈలోకమంతా మాధవుడే. లోనెల్లా (నాలో అంతా) మాథవుడే, వాకును కర్మము (చేయించిన కర్మయు) వైకుంఠుడే (విష్ణువే). చేకొని (నిర్వహించి) మా చైతన్యము (చేతనాశక్తి) అంతా శ్రీనారాయణ మూర్తియే. ఈకడ (ఇదిట్లయిన) ‘నేను’ అనేవాడు నాలో యెక్కడున్నాడో కదా! ఎందుకంటే చేతనలేని సుషుప్తి (గాఢనిద్ర)లో నాగురించిన జ్ఞానమే నాకులేదే. మరి అప్పుడు ఆ ‘నేను’ ఏడీ. ఎవరన్నా తట్టి లేపగానే, నన్నెందుకు లేపావు అంటున్నానే… ఎవడా “నేను”?

నా వెనుకనున్నదీ కృష్ణుడే. ముందరవున్నదీ కేశవుడే. నామొదలు, మధ్య, తుది గోవిందుడే. ఆ విధంగా నన్నంతా ఆవరించి అచ్యుతుడే అయి వున్నాడు అతిశయించగా, ఇదంతా శ్రీవేంకటేశుని మయమే. ఇటువంటి పరిస్థితుల్లో నేనేం చేసినా, నేనేం ఆలోచించినా, నేనేం మాట్లాడినా నేను కర్తనా? కానే కాదు. నా అనుగు స్వతంత్రము (నాకు ప్రియమైన స్వేచ్ఛ) యేదీ? లేనే లేదు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sri Sainatha Ashtakam In Telugu – శ్రీ సాయినాథ అష్టకం

Sri Sainatha Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సాయినాథ అష్టకం గురించి తెలుసుకుందాం.

శ్రీ సాయినాథాయ నమః

షిర్డిక్షేత్ర నివాసాయ, సిరిసంపదదాయినే,
సిద్ధి మంత్రస్వరూపాయం సాయినాథాయ మంగళం.
రఘుపతి రాఘవ రాజారాం, పతితపావన సాయీరాం,
ఈశ్వర్ అల్లా తేరానాం, సబ్కో సమ్మతే భగవాన్.

శ్రీ సాయినాథ అష్టకం

పత్రి గ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం
భక్తా బీష్టప్రదం దేవం సాయినాధం నమామ్యహం.

మహోన్నత కులేజాతం క్షీరాంబుధి సమేశుభే
ద్విజరాజం తమోఘాతం సాయినాధం నమామ్యహం.

జగదుద్ధారణార్ధంయోనర రూప ధరోవిభుః
యోగినంచ మహాత్మానం సాయినాధం నమామ్యహం.

సాక్షాత్కారంచయోలభేస్వాత్మా రామోగురోర్ముఖాత్
నిర్మలంచ మమతాఘాతం సాయినాధం నమామ్యహం.

యస్య దర్శన మాత్రేణ నశ్యంతి వ్యాధికోటయః
సర్వే పాపాః ప్రణశ్యంతి సాయినాధం నమామ్యహం.

నరసింహాది శిష్యాణాం దదే యోనుగ్రహం గురుః
భవ బంధాపహర్తారం సాయినాధం నమామ్యహం.

ధనహీన దరిద్రాన్యః సమదృక్షైవ వశ్యతి
కరుణాసాగరం దేవం సాయినాధం నమామ్యహం.

సమాధిస్థా2 పియో భక్త్యాసమభీష్టార్థ దానతః
అచింత్య మహిమానంతం సాయినాథం నమామ్యహం.

మరిన్ని అష్టకములు

Vishnudokkade Vishwatmakudu In Telugu – విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు

విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు సరియా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు
సంఖ్య : 345
పుట: 232
రాగం: నాట

నాట

59 విష్ణుఁ డొక్కఁడే విశ్వాత్మకుఁడు
వైష్ణవమే సర్వంబును

||పల్లవి||

పరమేష్ఠి సేయు బ్రహ్మాండసృష్టియు
హరునిలోని సంహారశక్తి
పరగఁగ నింద్రుని పరిపాలనమును
అరిసిచూడ శ్రీహరిమహిమ

||విష్ణుఁ||

యిలఁబంచభూతములలో గుణములు
అల నవగ్రహవిహారములు
తలకొను కాలత్రయధర్మంబును
అలరఁగ నారాయణుని మహిమలే

||విష్ణుఁ||

అంతటఁ గలమాయావిలాసములు
పొంతఁ బరమపదభోగములు
మంతుకునెక్కి నమరిసమస్తమును
యింతయు శ్రీవేంకటేశుమహిమలే

||విష్ణుఁ||

అవతారిక:

ఈ విశ్వమే తన ఆత్మవలె వున్న సర్వేశ్వరుడు విష్ణువు ఒక్కడే. సృష్ఠిలో సమస్తమూ ఆయనచే, ఆయన కొఱకు ఆయనదే అయివున్నది. అందుకనే సర్వమూ వైష్ణవమే అంటున్నారు అన్నమాచార్యులవారు. హరుడు, విరించి, సురపతీ… వారివారి బాధ్యతలను శ్రీహరిమహిమవల్లనే నెరవేరుస్తున్నారు. పంచభూతాలు, నవగ్రహాలు, త్రికాలములూ, నారాయణుని మహిమవల్లనే తమ ధర్మం నెరవేరుస్తున్నాయి. ఆఖరికి పరమపదప్రాప్తి దక్కాలన్నా తిరుమలేశుని దీవెన వుండాల్సిందే. ఇంతయూ శ్రీవేంకటేశుమహిమ అంటున్నారు.

భావ వివరణ:

అనంతమైన ఈ విశ్వమంతా, అణురూపుడై ఆత్మరూపుడై విలసిల్లుతున్నది విష్ణువు మాత్రమే. స్థావరజంగములన్నింటిలో అనగా కదలికవున్న వాటిల్లోను కదలిక లేనివాటిల్లోనూ కూడా ఆ విశ్వాత్మకుడే. సర్వమూ వైష్ణవమే (విష్ణువునకు సంబంధించినదే).

పరమేష్ఠి (బ్రహ్మదేవుడు) బ్రహ్మాండమున సృష్ఠి వ్యాపారము చేయుచున్నాడు. హరునిలోని సంహారశక్తి చేత జీవకోటి నశించుచున్నది. పరగగా (ఒప్పుగా) ఇంద్రుడు జగత్పరిపాలనా బాధ్యత చేపట్టినాడు. ఆయన క్రింద వివిధ దేవతలు వివిధ శాఖలను నిర్వహింతురు. హరునికి కూడ కాలుడు, యముడు, నవగ్రహములు, భూతపిశాచగణములు ఇత్యాదివి లయకార్యమున సహకరించును. అరసి చూడ (పరికించి చూడగా) ఈ నియమబద్ధపాలనమెల్లా శ్రీహరి మహిమయే అనుననది సుస్పష్టము.

విశ్వరచనా నిర్వహణములలో పంచభూతములదే (భూమి, గాలి, నీరు, కాంతి, ఆకాశము) ప్రధానపాత్ర. ఆ పంచభూతముల గుణములన్నియు నిబద్ధతతోవున్న కారణము విష్ణువే. నవగ్రహముల విహారము (గమనకు) నియంత్రింపజేయుచున్నదీ విష్ణువే. భూత, వర్తమాన భవిష్యత్కాలములను కాలత్రయమందురు. తలకొను (పూనుకొను) ఆ కాలధర్మములను నియంత్రించుచున్నదీ ఈ నారాయణుని దివ్య మహిమయే.

అంతటగల (ఈజగమునందంతా నెలకొన్న) మాయ విష్ణుమాయ. దాని విలాసము (తీరు) తెలియుట యెవరికీ సాధ్యముకాదు. పరమపదభోగము యెవరికి, యెప్పుడు, యెలా దక్కుతుందో, యే పొఒత (యెక్కడైనా) తెలియలేరు. మంతుకునెక్కిన (ప్రసిద్ధికెక్కిన) సమస్తమూ శ్రీవేంకటేశ్వరుని మహిమవల్లనే ఆస్థితిలో వున్నవని తెలుసుకోండి. దాన్ని తెలుసుకోటానికే ఒక జీవితకాలం చాలదు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Vishwanath Ashtakam In Telugu – విశ్వనాథాష్టకమ్

విశ్వనాథాష్టకమ్ - Vishwanathashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు విశ్వనాథాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Vishwanath Ashtakam Lyrics

విశ్వనాథాష్టకమ్

గంగాతరంగ కమనీయజటాకలాపం
గౌరీనిరంతర విభూషిత వామభాగమ్
నారాయణప్రియ మనంగ మదాపహారం
వారాణసీపురపతింభజవిశ్వనాథమ్

1

వాచామగోచర మనేక గుణస్వరూపం
వాగీశవిష్ణుసుర సేవిత పాదపీఠమ్
వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్.

2

భూతాధిపం భుజగభూషణభూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రమ్।
పాశాంకుశాభయవర ప్రదశూలపాణిం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్.

3

శీతాంశుశోభిత కిరీట విరాజమానం
ఫాలేక్షణానలవిశోషిత పంచబాణమ్|
నాగాధిపద్రచితభాసుర కర్ణపూరం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్.

4

పంచాననం దురితమత్తమతంగజానాం
నాగాంతకం దనుజపుఙ్గవపన్నగానామ్|
దావాలనం మరణశోకజరాటవీనాం
వారాణసీపురపతిం భజవిశ్వనాథమ్.

5

తేజోమయం సగుణనిర్గుణ మద్వితీయం
ఆనందకందమపరాజితమప్రమేయమ్
నాగాత్మకం సకలనిష్కళ మాత్మరూపం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్

6

ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం
పాపేరతించ సునివార్య మనస్సమాధౌ
ఆదాయ హృత్కమలమధ్యగతం ప్రవేశం
వారాణసీపురపతిం భజవిశ్వనాథమ్.

7

రాగాదిరోషరమితం స్వజనానురాగం
వైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయం
మాధుర్యధైర్యసుభగం గరళాభిరామం
వారాణసీపురపతిం భజవిశ్వనాథమ్.

8

వారణసీపురపతేః స్తవనం శివస్య
వ్యాసోక్త మష్టక మిదం పఠితా మనుష్య
విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం
సంప్రాప్యదేహవిలయే లభతే చ మోక్షమ్.

విశ్వనాథాష్టక మిదం యఃపఠే చ్ఛివసన్నిధౌ శివలోక మవాప్నోతి శివేనసహమోదతే.॥

మరిన్ని అష్టకములు

Itani Kitadaekaaka Yitarulu Sariyaa In Telugu – ఇతని కితడేకాక యితరులు సరియా

ఇతని కితడేకాక యితరులు సరియా – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో ఇతని కితడేకాక యితరులు సరియా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఇతని కితడేకాక యితరులు సరియా – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : ఇతని కితడేకాక యితరులు సరియా
సంఖ్య : 405
పుట: 273
రాగం: నాట

నాట

58 ఇతని కితఁడేకాక యితరులు సరియా
మితి లోకా లితనిమేనిలోనేకావా

||పల్లవి||

కమలనాభుని భయంకర కోపముతోడ
రమణ వేరొకరివరంబులు సరియా
తమితోడఁ దల దుంచి తగినవరము లిచ్చె
అమరఁగ నరకాసురాదులకు నితఁడు

||ఇత||

కరివరదుని పేరుగలసిన తిట్లతో
పరదేవతలమంత్రపఠనలు సరియా
నిరతి శిశుపాలునినిందకు శిక్షించి
పరలోక మిచ్చినట్టిభావము వినరా

||ఇత||

చలిమి శ్రీవేంకటేశు శరణాగతితోడ
బలిమి మించిన బ్రహ్మపట్టము సరియా
నొలిసిన ధ్రువునకు వున్నతలోక మిచ్చె
అలబ్రహ్మలోకమున కదె మీఁ దెఱఁగరా

||ఇత||

అవతారిక:

అనుగ్రహించుటలో ఇతనికితడే సాటి. లోకాలన్నీ ఈయనలోనే వున్నాయి కనుక ఇతనికి మరొకరు సరియెట్లగుదురు? అంటున్నారు అన్నమాచార్యులవారు. ఈయన కోపగించిన అన్యదేవతల అనుగ్రహంకంటే నయమే; ఈయనకు నిందకూడా పరదేవతల మంత్రపఠనకన్నామేలు చేస్తుంది; ఈయన శరణాగతి బ్రహ్మపట్టముకంటే బలమైనది. ఈ నా మాటలు నోటిమూటలు కావు సాక్ష్యంకూడా వున్నది. నరకాసురుడు, శిశుపాలుడు, ధ్రువుడు… వీళ్ళంతా సాక్షులే అని తన వాదనను వినిపిస్తున్నారు. అన్నమయ్య వైష్ణవ పక్షపాతి అనిపించినా ఆయనవాదన అమోఘం. హరి మురిసెడి కీర్తనములు అమ్మకు చెల్లా!!

భావ వివరణ:

ఓ భక్తులారా! ఇతనికితడే సాటి. ఇతరులు ఈతని సరియౌదురా? పరిమితిలేని లోకములన్నియును ఇతని మేనిలోనివే (దేహంలో వున్నాయి) కావా? (వున్నవి కదా! అని అర్థం)

ఆ పద్మనాభుని భయంకరమైన కోపముతో, అన్యదేవతల వరదానములకంటే మంగళమే జరుగుతుంది. వారి వరములు ఈయన ఆగ్రహంతో సమానం కాదు. ఎందుకంటే నరకాసురుడి విషయంలో యేం జరిగిందో చూడండి. తమితో (ఆసక్తితో) శ్రీకృష్ణుడు నరకుని తల తెగనరికినా ఆయన వరప్రభావముచే నరకచతుర్దశి ఒక పండుగై జత్ప్రసిద్ధమైనది. కాబట్టి ఈ శ్రీహరి అమరిన ఆగ్రహమే గొప్ప మేలు చేస్తుంది.

కరివరదుడు (గజేంద్రరక్షకుడు) అయిన శ్రీహరి పేరుతో జతకలిసిన వారినిందలే మనకు అధికమైన మేలు కలుగజేస్తాయి. పరదేవతల మంత్ర పఠనం హరినింద చేసే పాటి మేలు కూడా చేయదు. నిరతి (విశేషంగా) శిశుపాలుడు శ్రీకృష్ణుని తిట్టీ తిట్టీ చివరికి మేలే పొందాడు కదా! శిశుపాలుని శిరస్సు సుదర్శన చక్రంతో తెగిక్రిందపడ్డా వాడికి హరిద్వార – పాలకపదవీ వైకుంఠ ప్రాప్తి దక్కాయి కదా!

చలిమి (చల్లని) శ్రీవేంకటేశ్వరుని శరణాగతితో, మించిన (శ్రేష్ఠమైన) బ్రహ్మపట్టము (బ్రహ్మపదవి) కూడా సరిపోదు. ఒలిసిన ధ్రువునకు (తనకు కావలసిన ధ్రువునకు) శ్రీహరి ఉన్నత లోకాలిచ్చాడు. ఎందుకంటే బ్రహ్మలోకముపైనున్న ధ్రువమండలాన్ని స్థిరలోకంగా తన భక్తునికిచ్చాడు ఆ నారాయణుడు. నేటికీ పలువురికి మార్గదర్శకమయ్యాడు ఆ చిన్నారి బాలుడు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు: