Vedavatti Yika Nemi Vedakeru Chadiveru In Telugu – వేదవట్టి యిక నేమి వెదకేరు చదివేరు

వేదవట్టి యిక నేమి వెదకేరు చదివేరు – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో వేదవట్టి యిక నేమి వెదకేరు చదివేరు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వేదవట్టి యిక నేమి వెదకేరు చదివేరు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన: వేదవట్టి యిక నేమి వెదకేరు చదివేరు
సంఖ్య : 535
పుట: 359
రాగం: సాళంగనాట

సాళంగనాట

40 వేదవట్టి యిఁక నేమి వెదకేరు చదివేరు
వేదాంతవేద్యుఁడైన విష్ణుని నెఱఁగరా.

||పల్లవి||

తోలె నదె గరుడనిఁ దొడఁగి బాణునిమీఁద
వాలెను కంసునిమీఁద వడి నెగసి
కేలుచాఁచి చక్రమునఁ గెడపె శిశుపాలు
వేలుపుల రాయఁడైన విష్ణుని నెఱఁగరా.

||వేద||

తొక్కెను బలీంద్రునిఁ దొల్లి పాతాళానఁ గుంగ
మొక్కలాన జల ధమ్ము మొనకుఁ దెచ్చె
పక్కన బ్రహ్మాండము పగులించెఁ బెనువేల
వెక్కనపుదైవమైన విష్ణుని నెఱఁగరా.

||వేద||

భేదించె రావణాదిభీకరదైత్యులనెల్ల
నాదించె శంఖమున నున్నతజయము
సేదదేర నిపుడును శ్రీవేంకటాద్రిమీఁద
వీది వీది మెరసేటి విష్ణుని నెఱఁగరా.

||వేద||535

అవతారిక:

“వేదవట్టు” అంటే వేద ప్రవచనము చేయటం. ఈ కీర్తనలో అన్నమాచార్యులవారు వేదము తెలిసిన పండితులతో అంటున్నారు ‘ఇంకా యేమి వేదప్రవచనాలు చేస్తారు? యేమి వెదుకుతారు? యేమేమి చదువుతారయ్యా! మీకీ మాత్రం తెలియదా? వేదాంత వేద్యుడు విష్ణువుగాక వేరెవరున్నారు?’. ఈ కీర్తనలో జలధమ్ము అంటే ‘జలధియమ్ము’ అని భావించాలి. పెనువేలు అంటే బొటనవ్రేలని అర్థం. అనంతకోటి బ్రహ్మాండాలను తన బొటన వేలికింద నొక్కివేయగలడట ఈ విశ్వరూపుడు మరేమనుకొన్నారు?

భావ వివరణ:

ఓ అయ్యలారా! యిక వేదవట్టి (వేద ప్రవచనములు చేసి) యేమి వెదకెదరయ్యా! యేమి చదివేరు? వేదాంతము వేదాంతము ద్వారా, వేద్యుడు (తెలియదగినవాడు) యెవరు? విష్ణువే కదా! ఈ సంగతినెరుగరా? ఏమి వింత!!

మీరు ఆయన కృష్ణావతారం గురించి వినలేదా? ఆ శ్రీకృష్ణుడు అదె గరుత్మంతునిపైనెక్కి తోలె (వెడలినాడు). బాణాసురనెదుర్కొని చిత్తుచేశాడు. వడి (వేగముగా) కంసునిపై నెగసి (దండెత్తి) వాలెను (మీదపడ్డాడు). కేలుచాచి (చేయిచాచి) చక్రాయుధాన్ని అందుకొని శిశుపాలుని కెడపె (పడవేసెను). అట్టి లీలలు చేసిన వేలుపులరాయుడు (దైవశిఖామణి) యైన విష్ణువునెరుగరా? ఏమి ఆశ్చర్యము!

ఈయన తొల్లి (కృతయుగంలో) బలీంద్రుని (బలి అను దానవేంద్రుని) పాతాళమునకు క్రుంగునట్లు తలపై కాలుంచి త్రొక్కెను. ఈయన త్రేతాయుగములో మొక్కలా (శౌర్యముతో) జలధిని (సాగరమును) అమ్ముమొనకు దెచ్చే (బాణముయొక్క మొనకు తెచ్చి శరణాగతుని చేసెను. పక్కన భవిష్యత్తులో ఈయన తన పెనువేల (బ్రొటనవేలితో) బ్రహ్మాండమునే పగులించె బ్రద్దలు కొడతాడు. ఓ అయ్యలారా! వెక్కసపు దైవమైన (సర్వాధికుడైన దేవుడు) విష్ణువునెరుగరా?

ఈయనే శ్రీరాముడై రావణుడు మొదలైన భయంకర దైత్యులను సంహరించాడు. తన పాంచజన్యశంఖమును వున్నతముగ పూరించి జయధ్వానములు చేసెను. యుగయుగాలలో ఇవన్నీ చేసి అలసిన శ్రీమహావిష్ణువు ఈ కలియుగంలో సేదతీరుటకు (విశ్రాతికి) శ్రీవేంకటాద్రిమీద శ్రీ వేంకటేశ్వరుడై నిలిచినాడు. అదిగో తిరు వీధులలో మెరసేటి (కాంతులు వెదజల్లుతున్న) ఈ విష్ణుదేవుని ఎరుగరా? ఏమి విచిత్రం!!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Molanuli Golleta Muriyucunu In Telugu – మొలనూలి గొల్లెత మురియుచును

మొలనూలి గొల్లెత మురియుచును – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో మొలనూలి గొల్లెత మురియుచును కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

మొలనూలి గొల్లెత మురియుచును – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 5
కీర్తన: మొలనూలి గొల్లెత మురియుచును
సంఖ్య : 372
పుట: 252
రాగం: శుద్ధదేశి

శుద్ధదేశి

82 మొలనూలి గొల్లెత మురియుచును
వలవంతఁ దిరిగీని వాడవాడలను

||పల్లవి||

సంపెఁగలతురుముతో చల్లలమ్మీనిదివొ
వంపుమోము గొల్లెత వాడలను
యింపులకోరికె తో నిందిరాపతి యెదుట
జంపుల నటనలతో సాళగింపుచును

||మొలనూ||

నొసలికస్తూరితోఁ గన్నుల నవ్వీనిదివో
వసివాడు గొల్లెత వాడలను
కసరుచు హరిమీఁదికాఁకల కోపముతో
యెసరుఁజెమట గోర యెమ్మెలఁ జిమ్ముచును

||మొలనూ||

చెలవంపుటుంగరాల చెయి వీచీనిదివో
వలపుల గొల్లెత వాడలను
కలికియై తిరువేంకటవిభుకౌఁగిట
అలసిన నటనల నల్లంతనేఁగుచును.

||లలల||

అవతారిక:

ఆ గొల్లెత మొలనులు (స్త్రీలు ప్రత్యేకముగా ధరించు మొలత్రాడు) ధరించినదై మురిపెముతోనున్నదట. ద్విగుణీకృతమైన అందంతో ఆమె వాడవాడలా విరహవేదనతో తిరుగుతున్నదట. ఆమె సంపెంగపూలు కొప్పులో తురిమింది. నొసటిమీద కస్తూరీ తిలకం ధరించింది. ఉంగరాల చేతిని విలాసంగా వూపిందట. తరువాత వేంకటపతి సందిట నర్తించి అలసినదట. ఇది సరస శృంగార కీర్తన. అన్నమాచార్యులవారి శృంగార భక్తి నభూతో నభవిష్యతి.

భావ వివరణ:

మొలనూలు (స్త్రీలు ధరించునట్టి మొలత్రాడు) ధరించిన ఆ గొల్లెత (గొల్లభామ) మురియుచును (సంతోషంతో మురిసిపోతూ) వాడవాడలా (పల్లెలోని తన పేటంతా) వలవంత దిరిగీని (మదనవేదనతో తిరుగుచున్నది).

ఆ గొల్లెతవంపు మోము గొల్లెత (గుండ్రని ముఖముగల గొల్ల భామ). ఆమె చల్లలమ్ముతుంది. ఆమె తలలో సంపెంగపూలు ధరించినది. ఆమె ఇందిరాపతియైన శ్రీకృష్ణుని వలచినది. మధురమైన కోరికలతో రగులుచున్న ఆమె కదలాడుచున్న ‘చెంపసరాలు’ ధరించి కలివిడిగా ఆ గొల్లవాడంతా తిరుగుచున్నది.

ఆమె తన నొసట (నుదురుపై) కస్తూరి తిలకమును ధరించినది. తన కన్నులతోనే ఆమె మనోహరంగా నవ్వుతున్నది. వాడ అంతా కలియతిరుగటచే వసివాడిన (అలసిన). ఆమె ముఖము నీరసముగానున్నది. హరిమీద (కృష్ణునిపై కసరుచు (విసుగుకొనుచు) కాకకోపముతో (మండించే క్రోధముతో) ఆ గొల్లెత, యెసరుజెమట (వేడిచెమటను) చిమ్ముచున్నది.

వలపులను చిందిచుచున్న ఆ గొల్లెత వాడ అంతా కలయతిరుగుచున్నది. చెలువంపుటుంగరములను (సొగసైన అంగుళీయకములను) వేళ్ళకు ధరించిన ఆమె తన చేయి (చేతిని) ఇదిగో ఎలా వీచుచున్నదో చూడండి. ఆమె కలికియై (అందాలరాసియై) శ్రీవేంకటేశ్వరుని కౌగిట కరిగి నర్తించుచు అటూఇటూ యేగుచు (నడచుచు) మిక్కిలి అలసినది.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sutuni Narakuni Jampa Jucinadavu Summi In Telugu – సుతుని నరకుని జంప జూచినాడవు సుమ్మీ

సుతుని నరకుని జంప జూచినాడవు సుమ్మీ – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో సుతుని నరకుని జంప జూచినాడవు సుమ్మీ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

సుతుని నరకుని జంప జూచినాడవు సుమ్మీ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 5
కీర్తన: సుతుని నరకుని జంప జూచినాడవు సుమ్మీ
సంఖ్య : 66
పుట: 45
రాగం: పాడి

పాడి

81 సుతుని నరకునిఁ జంపఁ జూచినాఁడవు సుమ్మీ
మతి నన్నుఁ దలఁచక మానిన నీకాన

||పల్లవి||

ఎత్తుక నీతోడఁబట్టు హిరణ్యకశిపుని
నెత్తురు దాగితి సుమ్మీ నేఁడే రాకుంటే
ఉత్తలాన నేడనైనా నుండుదువో యని భీతి
బిత్తరముగాఁ బెట్టితి పెట్టరాని యాన

||సుతుని||

కప్పుక మేనమామ కంసుని ప్రాణానకు
తప్పినవాఁడవు సుమ్మీ తడసితేను
ఇప్పుడిట్టే నీవు రాని యీరసానఁ బ్రియములు
చెప్పలేక పొడిచితి చెడుగైన యాన

||సుతుని||

సిరుల మేన మరఁది శిశుపాలు నీ విట్టే
పొరిగొంటివి సుమ్మీ పోయితే నీవు
తిరువేంకటేశ నిన్నుఁ దివిరి కూడి (డే?) వని
కరుణఁ బెట్టితి నీకుఁ గపటాన నాన

||సుతుని||

అవతారిక:

పరంధాముని నిందాస్తుతితో ప్రార్థించిన భక్తాగ్రేసరులు కోకొల్లలు. బాధతాళలేక నిందించినా అది స్తుతితోనే ముగుస్తుంది. ఈ కీర్తన ప్రత్యేకత యేమంటే అన్నమయ్య. వ్యావహారిక దృష్టిలో ‘కొడుకు’ను చంపిన క్రూరుడు, ‘అన్నను’ చంపిన అతి జిత్తులమారి, మేనమరిదిని చంపిన కఠినుడు నన్ను కాపాడతాడో లేదోనని యేవేవో ఒట్లు పెట్టి నన్ను కాపాడమని వేడుతున్నాను ఇవన్నీ ‘కపటపు ఆనలే’ ప్రభూ! ఎలాగైనా నీదయ పొందాలనే నా ‘ప్రయత్నం’ అంటున్నారు పరమాత్మతో. ఇటువంటి కీర్తన మనసును కరిగిస్తుంది.

భావ వివరణ:

ఓ దేవదేవా! నీవు కఠినాత్ముడవు. నీసుతుడైన నరకుని (వాడు శ్రీహరికీ భూదేవికి, హిరణ్యాసుర వధానంతరం పుట్టిన కొడుకు) చంపజూచి, వాడిచావు వాడి తల్లి అంశతో జన్మించిన సత్యభామ చేతితో జరిపించావు). నన్ను దయతలచక మానితే నీకు ‘ఆన’ (ఒట్టే సుమా!)

నీవు నరసింహుడవై హిరణ్యకశిపుని చీల్చి చంపి వాడినెత్తురు నేలరాలరాదని వాడి నెత్తురు త్రాగినావు. ఇంతాజేసి వాడు నీతోడబుట్టిన అన్నయే కదా! వాడు చెల్లెలుదితి కొడుకైతే, నీవు అక్క అదితి కొడుకువి. ఉత్తలాన (తొందరపాటుతో) యెక్కడైనా నాకోసం పొంచివున్నావేమోనని భీతిచే బిత్తరజెంది పెట్టరాని ‘ఆన’ బెట్టితినయ్యా! నన్ను క్షమించు. నీవు నన్ను చంపితే అంతకంటే నేకోరునదేమున్నది తండ్రీ!

నీవు మేనమామను చంపిన గొప్ప మేనల్లుడవని అందరూ యెరిగినదే కదా! మామూలుగా చంపవచ్చును కదా! వాడిని (కంసుని) ఆకాశవాణిద్వారా హెచ్చరికపంపి మేనల్లుళ్ళని చంపిన క్రూరుడన్న పాపం అంటగట్టి, వాడిని ప్రాణానకు తప్పినవాడవు (ప్రాణాలు తీసినవాడవు). ఈరసార (కొద్దిగా ఈర్ష్యతో) ప్రియములు చెప్పలేక, తొందరపడి ఇప్పుడు నేను యేవేవో ‘ఆన’లు (ఒట్లు) పెట్టేను. అంతే స్వామీ! వాటిని లెక్కజేయకు.

స్వయముగ నీ మేనమరిది శిశుపాలుని సుదర్శన చక్రంతో పొరిగొంటివి (తలనరికేవు). సభలో తరిమితరిమి చంపినావు. అందుకు నూరుతిట్లు నిన్ను తిట్టినపాపము వాడి చేత చేయించావు. పోయితే నీవు (ఇకపోతే నీవు) తిరువేంకటేశ్వరుడవై తివిరి (ప్రయత్నముతో నన్ను కూడేవని (అనుగ్రహింతువని) నీకు కపటపు ఆనలు పెట్టాను స్వామీ! నన్ను కరుణతో చూస్తే చాలు తండ్రీ! నీకు ఆనలు పెట్టే ధైర్యం నాకెక్కడిది ప్రభూ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Atani Nammale Ralpamatulu Bhuvi In Telugu – అతని నమ్మలే రల్పమతులు భువి

అతని నమ్మలే రల్పమతులు భువి – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో అతని నమ్మలే రల్పమతులు భువి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అతని నమ్మలే రల్పమతులు భువి – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన: అతని నమ్మలే రల్పమతులు భువి
సంఖ్య : 533
పుట: 358
రాగం: వసంతవరాళి

వసంతవరాళి

79 అతని నమ్మలే రల్పమతులు భువి
నతఁ డాద్యుఁడు పరమాత్ముఁడు

||పల్లవి||

సకలలోకపతి సర్వేశ్వరుఁడట
వొకఁడిఁక దొర మరి వున్నాఁడా
ప్రకటించఁగ శ్రీపతియే దాతట
వెకలి నియ్యఁ గొన వేరేకలరా.

||అత||

దివిజవందితుఁడు దిక్కుల హరియట
యివల మొక్క సురలిఁక వేరీ
కవ నంతర్యామి కరుణాకరుఁడట
వివిధభంగులను వెదకఁగనేలా.

||అత||

వేదాంగుఁడు శ్రీవేంకటపతియట
ఆదిమతము లిఁక నరసేదా
యేదెస నెవ్వరి కెప్పుడుఁ గలఁ డితఁ-
డీదేవుఁడె మన కిహపర మొసఁగ.

||అత||533

అవతారిక:

శ్రీహరి పరమాత్మ, ఆదిదేవుడు. కొందరు అల్పమతులు. ఈ సత్యమును నమ్మలేక చెడిపోతున్నారు. సర్వలోకపతి శ్రీపతియేనని తెలియకున్నారు. అందరి దిక్కూ ఆ దివిజవంద్యుడేనని అరయలెకున్నారు. వేదాంగములచే నేర్చి భావించవలసిన శ్రీవేంకటేశ్వరుని శరణని ఇహపరములను సాధించలేకున్నారు. కనుక మొదటి మెట్టు నమ్మం, చివరిమెట్టు శరణాగతి మధ్యలో అన్నీ నమ్మకాన్ని సడలించే జారుడుమెట్లే. కానీ భయపడకండి… కరివరదుని శరణని పరమునెరిగే దారి నరయండి.

భావ వివరణ:

భువిని (ఈభూమిమీద) అల్పమతులు (తెలివితక్కువవారు) ఆతని (ఆ శ్రీహరిని) నమ్మలేరు, (లేనేలేడంటారు). నిజమేమిటంటే అతడు ఆద్యుడు (అన్నిటికి ఆదియైనవాడు), పరమాత్ముడు.

ఆయన సకలలోకపతి, సర్వేశ్వరుడూ అతడేనట. ప్రకటించగ (వెల్లడిజేయగా) మరి దొర (మరివేరొక అధిపతి) వొకడిక (ఇంకావొకడు) వున్నాడా? శ్రీపతి యొక్కడే దాతట. వెకవినియ్యగా (ప్రత్యక్షమీయగ వేరొకరు కొనన్ (చిట్టచివర) కలరా?

అన్ని దిక్కులయందును మొక్కుటకు ఆదిక్పాలకులుంటారు. ఆ దివిజులందరికీ వంద్యుడు (పూజింపదగినవాడు) శ్రీహరియే. ఇవల (ఇటువైపున) ఇంకా అన్యులైన సురలేరీ? ఆక్రమించిన అంతర్యామి యెల్లరకు హరియే. ఆయన కరుణాకరుడట. మనలోనేవుండు వానిని, వివిధ భంగులను (రకరకములైన మార్గములలో) వెదకగనేలా (వెదుకుటెందులకు?)

శ్రీవేంకటేశ్వరుడు వేదాంగుడు (వేదములే అంగములుగా గలవాడు). ఆయన శరణాగతితో నేను ఆయన నాశ్రయించితిని (విశిష్టాద్వైతినైతిని). అటువంటప్పుడు “ఆది మతములికనరసేదా? (తొల్లిటి మతములను గురించి ఆలోచించుటెందులకు?) ఏదెస నెవ్వరి కెవ్వడుగలడు? (ఏ దిక్కుయైనా ఈ లోకంలో యెవ్వరికెవరున్నారు? అందరూ మధ్యలోవచ్చి మధ్యలో పోయేవారే కదా!) మనకు ఇహము, పరమునొసగెడివాడు ఈ దేవుడే. ఇంకెవ్వరూ లేరు, వుండరు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Idanindariki Nelikaivunnadu In Telugu – ఈడనిందరికి నేలికైవున్నాడు

ఈడనిందరికి నేలికైవున్నాడు – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో ఈడనిందరికి నేలికైవున్నాడు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఈడనిందరికి నేలికైవున్నాడు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన: ఈడనిందరికి నేలికైవున్నాడు
సంఖ్య : 289
పుట: 194
రాగం: శుద్ధవసంతం

శుద్ధవసంతం

43 ఈడ నిందరికి నేలికై వున్నాఁడు
వాడల రేపల్లె వాఁడా వీఁడు

||పల్లవి||

భారపువుట్లపాలుఁ బెరుగులు
వారలు వట్టినవాఁడా వీఁడు
కోరి గొల్లెతల కొలనిలోపల
చీరలు దీసిన శిశువా వీఁడు

||ఈడు||

ఆవులఁ బేయల నందరియిండ్ల
వావిరిఁ గాచిన వాఁడా వీఁడు
వావు లొక్కటిగా వనితలఁ గూడి
వేవేలు నేర్చిన విటుఁడా వీఁడు

||ఈడు||

అరుదై శ్రీవేంకటాద్రిమీఁద నుండి
వరము లిచ్చేటి వాఁడా వీఁడు
మరిగెనలమేల్మంగతో మమ్మేలె
సరసుఁడై వుండే జాణా వీఁడు

||ఈడు||

అవతారిక:

ఈ తిరుమలలో అందరికీ యేలికయైవున్న ఈ భగవానుడూ అలనాడు రేపల్లె వాడలలో అల్లరి కిట్టయ్య ఒక్కరేనా? వాడా వీడు!! అని ఆశ్చర్యపోతున్నారు అన్నమాచార్యులవారు. అలవాటు ప్రకారం (రామకథ కృష్ణ కథ- దశావతారాల కథ చెప్పటం ఆయన మానుకోలేని అలవాటు) కృష్ణ లీలలు గానం చేస్తున్నారు. ఆ రేపల్లె చిత్త్చోరుడే ఈ అలమేల్మంగపతి కూడా. అవునా? ఆ జాణా వీడు… అంటున్నారు. ఎన్నిసార్లు పాడినా తనివి తీరని కృష్ణగానామృతం వినండి.

భావ వివరణ:

ఈడు ఇందరికి యేలిక (ప్రభువై వున్నాడే. ఆనాడు వాడల రేపల్లె వీధులలో తిరిగిన వాడే (ఆ గొల్లపిల్లవాడే), వీడా? అదెలా సాధ్యం?

భారపువుట్ల మీద (బరువైన వుట్లలో వున్న) పాలు పెరుగులు వారలు వట్టినవాడు (ధారలుగా కార్పించి యేడిపించిన ఆ కొంటె కోణంగియేనా) వీడు (ఈ శ్రీవేంకటేశ్వరడు), ఏమిచిత్రం!! కోరి కావలెనని (పొరబాటున కాదు) గోపికల చీరెలను కొలను గట్టున దీసి దాచి వాళ్ళ మానం మంట గలిపిన శిశువు గుర్తున్నాడా? వాడా వీడు!!

బ్రహ్మదేవుడు రేపల్లెలోని ఆవులను పెయ్యలను గోపాలురను మాయంచేస్తే తానే అవన్నీ అయిపోయి రేపల్లెలో ఒక్కరికీ తెలియకుండా నడిపి బ్రహ్మకు బుద్ధివచ్చేట్లు చేసినది ఇతడేనా? ఆ తరువాత ఆ పరమేష్టిని మన్నించి వావిరిగాచిన (ఉత్కృష్టుడై రక్షించిన వాడా, వీడు (ఈ శ్రీనివాసుడు). వావులొక్కటిగా (వావివరుసా లేకుండా) తల్లీకూతుళ్ళిద్దరినీ తన ప్రియురాండ్రను చేసికొన్న, వేవేలు నేర్చిన (అనేక రతిమర్మాలు నేర్చిన) ఆ విటుడా, వీడు (ఈ వేంకటరమణుడు) ఆహా!!

అరుదైన శ్రీవేంకటాద్రిమీద కొలువై వుండి అనేక వరములొసగే ఆ శ్రీవేంకటేశ్వరుడు వీడా (ఈ శ్రీకృష్ణుడా), వీడేనా? మరిగే (అనురాగంతో తలమునకలయ్యే) అలమేల్మంగతో మమ్ము యేలునట్టి సరసుడై వుండే ఆ జాణా (జగజ్జెట్టియా) వీడు (ఈ శ్రీకృష్ణుడు)?

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Hari Neeve Sarvatmakudavu In Telugu – హరి నీవే సర్వాత్మకుడవు

హరి నీవే సర్వాత్మకుడవు - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో హరి నీవే సర్వాత్మకుడవు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

హరి నీవే సర్వాత్మకుడవు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 4
కీర్తన : హరి నీవే సర్వాత్మకుడవు
సంఖ్య : 441
పుట : 297
రాగం : దేశి

దేశి

32 హరి నీవే సర్వాత్మకుడవు
యిరవగు భావన యియ్యగదే ॥

||పల్లవి||

చూడక మానవు చూచేటి కన్నులు
యేడనేవైనా యితరములు
నీడల నింతా నీ రూపములని
యీడువడని తెలి వియ్యగదే ॥

||హరి||

పారక మానదు పాపపు మనసిది
యీరసములతో నెందైనా
నీరజాక్షయిది నీమయమేయని
యీ రీతుల తల పియ్యగదే ॥

||హరి||

కలుగక మానవు కాయపు సుఖములు
యిలలోపలగల వెన్నైనా
అలరిన శ్రీవేంకటాధిప నీకే
యిలనర్పితమను యిహమియ్యగదే ॥

||హరి|| 441

అవతారిక:

మనం వేరు, పరులు వేరు అనే భావనవుండటం వల్లనే మనం కొందరిని ప్రేమిస్తాం, కొందరిని ద్వేషిస్తాము. కానీ శరీరాలు వేర్వేరైనా ఆత్మలన్నిటికి మూలకారణం పరమాత్మ అనే తత్త్వం తెలిసనవాడు సర్వాత్మకుడైనవాడు శ్రీహరి ఒక్కడే అని తెలిసికొని ఎవ్వరినీ ద్వేషించడు. ఓ దేవదేవా నాకు కూడా అటువంటి భావనే ఇయ్యవయ్యా! అంటున్నారు అన్నమాచార్యులవారు. ఈ ప్రపంచంలోవున్నవన్నీ నీ అర్పణ కొరకే స్వామీ! అంటున్నారు. ఈ భావవివరణ వ్రాసేటప్పుడు నాకు కలిగిన తృప్తి నేను మాటలలో వర్ణించలేను.

భావ వివరణ:

ఓ శ్రీహరీ! నీవే సర్వాత్మకుడవు (అన్ని ఆత్మలకు మూలమైనవాడవు). నాకునూ అట్టి నీవే అన్ని ఆత్మలలోగలవనె ఇరవగు భావన (సుస్థిరమైన అభిప్రాయమును) ఇయ్యగదే (ఈయవయ్యా!)

నాకు చూడాలనే కోరిక కలిగితే చాలు నా కన్నులు దేన్ని పడితే దాన్ని చూస్తాయి. ఇతరములు (అనవసరమైన ఇతర విషయములన్నింటినీ, యేడ నేవైన (యెక్కడైనా యేమైనా) చూస్తాయి. అవి చూడటం మానవు. నీడలన్ (నీ ఆశ్రయంలో) అన్నీ నీ ప్రతిరూపాలే అనునట్టి, ఈడువడని (చెడిపోని) తెలివి (జ్ఞానమును) ఈయగదే (ఇమ్ము ప్రభూ!).

నేను నాకళ్లుమూసుకున్నా నన్ను చెడగొట్టే ఇంకొకటుంది. అదే నా మనస్సు. పాపచింతనతో కూడిన నా మనస్సు అనవసరమైన వాటిమీద పారక మానదు (ప్రసరించక వదలదు). ఈ రసములతో యెందైనా యెవరికైనా యెన్నో పాపపు ఆలోచనలే వస్తాయి. ఓ నీరజాక్షా! ఈ రసములు కూడా నీమాయలే (నీవలననే కలిగినవి) అనునట్టి తలపును ఇయ్యగదే (ఈయరాదటయ్యా!)

ప్రభూ! నా కళ్ళూ మనస్సు ఒక్కసారి విజృంభించాయంటే, నా కాయము (దేహము) వున్నదే అది తగులుకొంటుంది. దానికెప్పుడూ సుఖం కావాలి. దానికి ఒక సుఖం చాలదు. ఎన్నయినా కావాలి కావాలి అనే అంటుంటుంది. దానికి ఈ ప్రపంచమంతా ఇచ్చినా చాలదు. అలరిన శ్రీవేంకటాధిప (ఏడు కొండలపై శోభించుచున్న) ఓ శ్రీవేంకటేశ్వరా! ఈ ప్రపంచంలో వున్నవన్నీ నీకు అర్పితమైనవే అనే ఇహము (ఈ ప్రాపంచిక జ్ఞానమును) ఇయ్యవయ్యా తండ్రీ!.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Harikrishna Melukonu Adhipurusha In Telugu – హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా

హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 3
కీర్తన : హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా
సంఖ్య : 543
పుట : 365
రాగం : భూపాళం

భూపాళం

38 హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా
తరవాత నా మోము తప్పకిటు చూడు.

||పల్లవి||

మేలుకొను నాయన్న మెల్లనే నీతోడి
బాలులదె పిలిచేరు బడి నాడను
చాలు నిఁక నిద్దురలు చద్దికూళ్ళపొద్దు –
వేళాయ నాతండ్రి వేగ లేవే,

॥హరి||

కను దెరవు నాతండ్రి కమలాప్తుఁ డుదయించె కమలాప్తు
వనిత మొకమజ్జనము వడిఁ దెచ్చెను
మొనసి మీతండ్రి యిదె ముద్దాడఁ జెలఁగీని
దనుజాంతకుండ యిఁకఁ దగ మేలుకోవే.

॥హరి||

లేవె నాతండ్రి నీలీలలటు వొగడేరు
శ్రీ వేంకటాద్రిపతి శ్రీరమణుఁడా
దేవతలు మునులుఁ జెందిననారదాదులు
ఆవలనుఁ బాడేరు ఆకసమునందు.

||హరి|| 543

అవతారిక:

మధురాతి మధురమైన మేలుకొలుపు కీర్తన నాస్వాదించి తరించండి. అన్నమాచార్యులవారి ఋణం తీరదని అనిపిస్తున్నది కదా! నా తండ్రి మేలుకోరా నా అన్న మేలుకో అని యెన్నిసార్లు బ్రతిమిలాడుతున్నారో చూడండి. జన్మకి ఇట్లాంటికీర్తన ఒక్కటి చాలదా? కొసమెఱుపు యేమిటంటే “వనిత మొకమజ్జనము వడిదెచ్చెను” అనే చరణం నందగోపుడు రేపల్లె గొల్లవారికి యేలిక కదా! వాళ్ళ పనిమనిషి వాళ్ళ అబ్బాయి పళ్ళుతోముకోవడానికి గోరువెచ్చని నీళ్ళు తెచ్చి సిద్ధంగా వున్నదట. మొకమజ్జనము అంటే ముఖమును నీళ్ళతో కడుగుకొనుట.

భావ వివరణ:

ఓ ఆదిపురుషా! హరీ! కృష్ణా ‘మేలుకో నాన్నా! తరువాత తప్పకుండా నా మోము (ముఖమును) ఇటుచూడు. (నా మాట విను తండ్రీ!)

నా యన్న మేలుకొనరా! బడినాడను (నీతో కూడి ఆడుకొందామని) అదే నీతోడి బాలలు మెల్లనే (మన వసారాలో) నిలుచుని నిన్ను పిలిచేరు. లే తండ్రీ! ఇక నిద్దురలు చాలును కన్నా! చద్దికూళ్ళ పొద్దువేళాయె (చద్ది యన్నం తినే వేళయింది నాన్నా!) నా తండ్రీ! వేగ లేవే (తొందరగా
లేచిరావయ్యా!)

అదిగోచూడు… కమలాప్తుడుదయించె (కమలబాంధవుడైన సూర్యభగవానుడు ఉదయించినాడు) నా తండ్రీ! కన్నులు తెరువమయ్యా! మొకమజ్జనకు (నీ ముఖము కడుగుకొనుటకు నీళ్ళను) వనిత (పనిపిల్ల) వడి దెచ్చెను (శ్రీఘ్రముగా తీసికొచ్చింది). ఇవే నీతండ్రి నందగోపుడు, మొనసి (పూనుకొని) ముద్దాడ (గబగబా ముద్దులు పెట్టుకొందామని) యెదురు చూస్తున్నాడయ్యా! ఓ దనుజాంతకా! (పూతన వంటి రాక్షసులను అంతమొందించినవాడా!) ఇక మేలుకోవయ్యా!

నా తండ్రీ! నీవు చేసిన నీ లీలలన్నింటినీ వొగడేరు (పొగడుచున్నారయ్యా!) లేవె (లేచిరావయ్యా!) ఇప్పుడు నీవు ఈ తిరుమల వేంకటకృష్ణయ్యవు, శ్రీదేవీ వల్లభుడవు. అదిగో చూడవయ్యా! ఆవలను (నీవాకిటి బయట) దేవతలు, మునులు, నారదాది భక్తులు సుప్రభాతమును పాడుచున్నారు. ఆకాశములో యెంత గుంపువున్నదో చూడు తండ్రీ! ఇంతమందికి నీ దర్శనం కావాలంటే యెంత సమయం పడుతుంది? లే నాన్నా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Uppavadamu Gavayya Uyyala Mancham Meeda In Telugu – ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద

ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 6
కీర్తన : ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద
సంఖ్య : 102
పుట : 74
రాగం : కాంబోధి

కాంబోధి

26 ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీఁద
గొప్ప గొప్ప కన్నుల గోవిందరాజా.

||పల్లవి||

పవ్వళించే వీడ వచ్చి పాయనినీయలపెల్ల
మువ్వంకమేనితోడ ముచ్చట దీఱ
నవ్వేటి శ్రీసతిచూపు నాటినచిత్తపుమేన
క్రువ్వనికలువదండై గోవిందరాజా.

॥ఉప్ప||

నిద్దిరించే వీడ వచ్చి నిలుచున్నయలపెల్ల
ప్రొద్దు వొద్దునకుఁ దీర భోగీంద్రుపై
యిద్దరుసతులు నీకు నేచినతాళగతుల
గుద్దేటిపాదములతో గోవిందరాజా.

॥ఉప్ప||

మెండుగ మేలికొంటివి మించిన కౌఁగిటిలోన
కొండుకపాయపుసిరి కోపించంగా
ఉండవయ్యా సుఖలీల నుడివోనిప్రియముతో
కొండలకోనేటిరాయ గోవిందరాజా.

॥లలల||

అవతారిక:

‘ఉప్పవడము’ అవటం అంటే రాజీకి రావడం అన్నమాట. ఉయ్యాలమంచం మీద నీకు నీ దేవేరుల మాట వినక తప్పదు. గొప్ప గొప్ప కన్నులున్న గోవిందరాజువి నీవు. అయినా సరే, అంటున్నారు అన్నమాచార్యులవారు. ఈ కీర్తనలో వేంకట మకుటం లేకపోవటం విశేషమే.

ఇటువంటి శృంగార కీర్తనల భావవివరణలో చిక్కేమిటంటే “యద్భావం తద్భవతి” – అంటే నీ భావన నీ భావానుగుణ్యంగానే వుంటుంది. కొండల కోనేటిరాయుడే ఈ గోవిందరాజు అంటున్నారు. కొండుకపాయపుసిరి అంటే చిన్నపిల్లవంటి శ్రీదేవి, కోపించిందట స్వామిపైన… యెందుకో? జాగ్రత్తగా చదివి భావించి పరవశించండి.

భావ వివరణ:

ఓ గోవిందరాజా! నీ విప్పారిన గొప్ప గొప్ప నయనాలు నీ భావములను తెలుపుతూనే వున్నాయి. నీవు ఈ ఉయ్యాలమంచము మీద భూదేవి, శ్రీదేవి సమేతుడవై వూగుచున్నావు. ఇప్పుడైనా, ఉప్పవడము గావయ్య (రాజీ మార్గానికి రావయ్యా!)

ఓ గోవిందరాజా! ఈ వైపునకు వచ్చి నీ అలసట దీరునట్లు ముచ్చట దీరగా, మువ్వంకమేనితో (మూడు అవస్థలను పొందుతున్న దేహముతో) నిదురించవయ్యా! చిరునవ్వులొలుకు శ్రీసతి చూపులు నీ చిత్తము పై నీ నాటుకొంటుండగా నీ వామె మెడలో క్రువ్వని కలువదండైనావు (వాడని కలువపూలహారమైనావు స్వామీ!)

ఈడ వచ్చి ప్రొద్దు వొద్దునకు (పూట పూటకు) నిలుచున్న అలు పెల్లదీర (అలసట యంతయు దీరునట్లు) భోగీంద్రునిపై (ఆదిశేషునిపై) విశ్రాంతిగా నిదురించవయ్యా! నీకు భూదేవి, శ్రీదేవి అను ఇద్దరు భార్యలు, యేచిన తాళగతుల (అతిశయించిన తాళానుగుణముగా) గుద్దేటి పాదములతో తన సతులను తనపాదములతో తేలికపాటి తాడనములిచ్చుచున్నాడు. ఈ గోవిందరాజస్వామి చిలిపి చేష్టలేమని వర్ణింతుము?

ప్రభూ! నీవు మెండుగా (మేలుగా) మేలుకొనినది కూడా, కొండొక ప్రాయపుసిరి కౌగిటిలోననే (లేబ్రాయపు చిన్నదైన శ్రీదేవిని గాఢాలింగనముననే) ఆమె నిదుర చెడి ఆమె నీపై కోపించినదాయెను. అయినదేమో అయినదని ఆమెను వూరడించి ఉడివోని ప్రియమున (తరగని అనురాగముతో) సుఖలీల (సుఖముగా) వుండవయ్యా! ఓ గోవిందరాజా! నీవే కొండలకోనేటిరాయుడవు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Chirunavvu Merumgaru Siggula Momu Thoda In Telugu – చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ

చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 6
కీర్తన : చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ
సంఖ్య : 54
పుట : 46
రాగం : శ్రీరాగం

శ్రీరాగం

25 చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ
మరగె నిన్నలమే ్మంగ నాచారి.

॥పల్లవి||

నిలువుఁదురుము మీఁది నెమలిపాదపుడాలు
తొలి మెఱంగుల మించి దొలఁకఁగాను
అలరుచు నినుఁ జూచి అప్పుడె వెరగువడి
మలయుచు నలమేలుమంగ నాచారి.

॥చిఱు||

పరగునీమెడ సరపణులవుయ్యాలలో
ఉరుటు మురిపమున నూఁగుచును
గిరికొన్న తమకాన కిందుమీఁదెఱుఁగక
మరచె మే నలమేలు మంగనాచారి.

||చిఱు||

కంచము గని మోవి కమ్మఁదేనే లారగించి
లంచముగఁగస్తూరి లప్పలు రాల
యెంచఁగఁ దిరువేంకటేశుఁడు నీ పాఁపసజ్జ
మంచమెక్కె నలమేల్మంగనాచారి.

||చిఱు||

అవతారిక:

అలమేల్మంగ నాంచారి మీద అన్నమాచార్యులవారు చెప్పిన సరస శృంగార కీర్తన నాస్వాదించండి. వైష్ణవుల పరిభాషలో దేవిని నాంచారి అంటారు. నాచారి అని కూడా అంటారు. అందులో అమ్మవారి కొన్ని ఆభరణాల పేర్లను గానంచేస్తున్నారు. నెమలిపాదపుడాలు, సరపణలవుయ్యాలలు, మంచమున కలంకరించిన పాపసజ్జలు – ఇత్యాదివి నేటి కాలంలో లేనందువల్ల కొన్ని మన వూహాతీతం. ఊంజలేసేవ సందర్భంగా పాడిన కీర్తన అయివుంటుంది. “సిగ్గులు చిందించే చిరునవ్వు మెఱుపులొలికే మోముగల, ఈ అలమేల్మంగనాచారి నిన్ను మరగెనయ్యా తిరుమలేశా!” అంటున్నారు. నేటితరం వారికి ఈ భాషే ఒక తమాషా జాగ్రత్తగా చదవండి.

భావ వివరణ:

ఓదేవదేవా! నీ దేవేరి అలమేల్మంగ నాచారి నిన్ను మరగె (ఆశించుచున్నది). మనోహరమైన ఆ నాచారి (దేవి) సిగ్గుల చిరునవ్వు మెఱుగార (మెరపులు కురిపిస్తున్న) మోముతో (వదనముతో) శోభలీనుచున్నది.

ఆమె, నిట్టనిలువుగానున్న తురుము (సిగకొప్పు) మీద “నెమలి పాదపుడాలు” ధరించినది. అది తళతళ మెరుగులను మించి (అధికముగా) దొలకె (చిందించుచున్నది). ఆ దేవి వెరగువడి (అత్యధికమైన ఆశ్చర్యముతో మలయుచున్నది (నీకొరకు ఆరాటపడుచున్నది). ఆమె జగజ్జననియైన అలమేల్మంగనాచారి.

ప్రభూ! నీ మెడలో “సరపణులు” వుయ్యాలలూగుచున్నవి. ఉదటు మురిపెమున (గొప్ప మురిపెముతో) వూగుచున్న వాటిని, గిరికొన్న తమకాన (తారా స్థాయికి చేరిన పారవశ్యముతో) కింద మీదెరుగక (ఆశగా చూడవచ్చునో చూడ కూడదో తేల్చుకోలేక) ఆ అలమేల్మంగ నాచారి, మేను మరచె (తన తనువును తానే మరచినది స్వామీ!)

దేవా! కంచము మోవిగని (తేనెలూరు మధురాధరమును) గాంచి లంచముగా కమ్మని తేనెలారగించితివి. అప్పుడు దేవి అలదుకున్న కస్తూరిలప్పెలుగా రాలిపడినది. ఆపైన ఓ శృంగారరాయా! యెంచగా తిరువేంకటేశుడైన నీవు అలమేల్మంగ నాచారితో నీ “పాపసజ్జ మంచమునెక్కి” ఆదేవిని నీ సరసశృంగారముల నలరించితివి. (ఓ జగద్రక్షకా! భావాతీతమైన మిమ్ముభావించుట బావిలో కప్పవంటి నా తరమా!! నా అశక్తతకు అజ్ఞానానికి మన్నించి నీవు అలా నవ్వుతూనే వుండు ప్రభూ!)

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Melukonave In Telugu – మేలుకొనవే

మేలుకొనవే - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో మేలుకొనవే కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

మేలుకొనవే – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 4
కీర్తన : మేలుకొనవే
సంఖ్య : 21
పుట : 375
రాగం : భూపాలం

భూపాలం

31 మేలుకొనవే
భూలలనాధిప భోగిశయన

||పల్లవి||

లేదు వేదవిధి లేశమును
మేదిని భరమై మించినది
పాదుపడదు చూపరకు భువి
గాదిలిసుతుపై గనలె జనకుఁడు

||మేలు||

కనకము చవి చెడెఁ గడుఁగడును
ఘననృపబాధలు గదిమినవి
దనుజుల కతివలు దలఁకెదరు
ఎనయ బలాధికులెవ్వరు లేరు

||మేలు||

అసుర సతుల పుణ్యము ఘనము
కస (సి?) మసఁగెడి కలికాలమహిమ
పసగల వేంకటపతి యిఁకను
వసుధలోని నెవ్వగలుడుపఁగను

||మేలు||21

అవతారిక:

అన్నమాచార్యులవారు చెప్పిన ఒక మేలుకొలుపు కీర్తననాస్వాదించండి. 600 సంవత్సరాల క్రితం పరిస్థితి ఇంత ఘోరంగావుంటే నేడు యెవరికివారే యమునాతీరే అనే రోజుల సంగతి చెప్పేదేముంది? కన్నకొడుకులపై తండ్రి కక్షకడుతున్నాడు. బంగారం బంధువైపోయింది. ఆడది అసురులవంటి వారి చేతిలో అల్లాడిపోతుంది. “కసిమసగెడి కలికాలం” మహిమ యేం చెప్పగలం? ఒక్క శ్రీవేంకటేశుడే వసుధలోని పగను నెవ్వగలడు అంటున్నారు. భావవివరణతో పరిస్థితి ఇంకా బాగా అర్థమవుతుంది. అవునా?

భావ వివరణ:

ఓ భూలలనాధిప! (భూసతీరమణా!) భోగిశయనా! (శేషతల్పశాయీ!) మేలుకొనవే. (నీవు సృష్టించిన ఈలోకం యెంత ఘోరంగా వున్నదో ఒకసారి పరికింపుము).

వేదువిధి లేశమును లేదు (ఎవ్వడూ వేద విధానములను పాటించుట లేదు). భూమి మీద భరమై మించినది (అతిశయము యెక్కువైపోయింది). చూపరులకు భువిపాదుపడదు (కాళ్ళకింద భూమి కనపడదు. అంటే అంత పొగరుబట్టి వుంటారు). ప్రేమించవలసిన కన్నకొడుకుపైన తండ్రే కనలె (మండిపడుతుంటాడు).

కనకము చవిచెడెన్ కడునేకడున్ (బంగారమునకు వుండవలసిన నిబద్ధతతో కూడిన మక్కువ వుండదు. అనగా ప్రతివాడూ బంగారం కోసం వెంపర్లాడుతుంటాడు). గొప్పవాళ్ళయిన నృపుల (పరిపాలకుల) బాధలు గదిమినవి (భయపెడుతునవి). దనుజులకు (రాక్షసులవంటి మగవారి దౌర్జన్యాలకు) అతివలు (స్త్రీలు) తలకెదరు (భయపడుతుంటారు). లోకంలో ఈ పరిస్థితిని ఎనయు బలాఢ్యులు (సవరించగల దిట్టలు) యెవ్వరూ లేరు.

కాని అసురసతులు (దుర్మార్గుల భార్యలు) ఘనమైన పుణ్యములు చేస్తుంటారు. కలికాల మహిమ (కలియుగ ప్రభావముచేత) కసమసగెడి (పాపము విజృంభిస్తుంటుంది). హతవిధీ!! ఇక గత్యంతరం యేమిటి? పసగలవేంకటపతి (సర్వ సమర్ధుడైన శ్రీవేంకటేశ్వరుడు) ఇకను (ఇకపై) వసుధలోని పగను, నెవ్వగలడు (ఆపద తప్పించగలడు.)

మరిన్ని అన్నమయ్య కీర్తనలు: