మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీ గర్గభాగవతము లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శ్రీకృష్ణలీలలు – బకాసుర వధ నీతికథ.
శ్రీకృష్ణలీలలు – బకాసుర వధ
యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు బాలునివలె గోపాలురతో యమునాతీరమున తిరుగుతూ ఆడుచూ ఉండెను. అప్పుడు కైలాస పర్వత మంత ఎత్తుగా ఉన్న ఒక పెద్ద కొంగ అక్కడికి వచ్చెను. మేఘగర్జన వలెనున్న దాని అరుపు విని గోపబాలురు భయభ్రాంతులైరి. ఆ మహాబకము తన ముక్కుతో పరమాత్మను నోటిలోకి వేసుకొని మ్రింగెను.
లోకరక్షకుని రక్షించుటకై దేవేంద్రుడు వజ్రప్రయోగము చేసెను. విధాతదండమును విసరెను. ఆ బకాసురునికి ఏ హానీ జరగలేదు! పరమేశ్వరుడు త్రిశూలముచే దాని రెక్క విఱుగగొట్టెను. వాయుదేవుని వాయవ్యాస్త్రము యముని దండము సూర్యుని వేయిబాణములు చంద్రుని నీహారాష్త్రము ఆ బకాసురునిపై పనిచేయలేదు! ఆగ్నేయాస్త్రముతో అగ్నిదేవుడు ఆ బకుని రొమ్ములను కాల్చెను. వరుణదేవుడు పాశముతో భద్రకాళి గదతో కొట్టగా ఆ బకాసురుడు మూర్ఛనొందెను. కొంతసేపటికి తేరుకున్న బకుని కాలు విఱుగగొట్టెను తన శక్త్యాస్త్రముతో కుమారస్వామి. ఒంటికాలితోనే మింటికెగసి ఆ బకాసురుడు దేవతలను తరిమికొట్టెను!
మహర్షులు వేదవేద్యుడైన శ్రీకృష్ణస్వామిని ధ్యానించగా బకాసురుని ఉదరములోనున్న స్వామి వాడి పొట్ట ఉబ్బునట్లు చేసెను. ఊపిరాడక బకుడు పరమాత్మను బయటకు ఉమ్మివేసెను. తరువాత బకుడు ముక్కుతో పొడవగా నందకిశోరుడు బకుని ముక్కుపుటములను చీల్చెను. మరణించిన బకాసురుని చూచి దేవతలు పరమాత్మపై పుష్పవృష్టి కురిపించిరి. బకునిలోని తేజస్సు కృష్ణపరమాత్మలో కలసెను.
బకాసురుని వృత్తాంతము
హయగ్రీవుడనే రాక్షసుని కుమారుడు ఉత్కలుడు. వాడు తన బలపరాక్రమాలతో దేవేంద్రుని జయించి స్వర్గాధిపతి అయ్యెను. ఇట్లు నూరేండ్లు త్రిలోకాధిపతియై శోభిల్లెను. అన్ని ఏండ్లు దేవేంద్రపదవిని పొందియూ బుద్ధిమాంద్యముచే ఆతడు మహాతెజస్వి అయిన జాజిలి మహర్షి ఆశ్రమము వద్దనున్న సింధూ మహాసాగరమునకు పోయి అక్కడ చేపలను పట్టుచుండెను. అప్పుడు జాజిలి మహర్షి ఉత్కలుని చూచి “ఓయి! నీకిట్టి జీవహింస చేయ తగునా? వంశానుక్రమమున నీకు లభించిన సంస్కారమేమి? నీవు చేయుచున్న పని ఏమి? జీవ హింస మహాపాపమని ఎఱుగవా”? అని మందలించెను. మూర్ఖుడైన ఉత్కలుడు మహర్షి మాటలను విశ్వసించక జీవహింస కొనసాగించుచుండెను. అంతట జాజిలి మహర్షి “కొంగవలె చేపలు పట్టుచుంటివి కావున బకుడవు కమ్ము” అని శపించెను. పశ్చాత్తాపముతో మహర్షిని శరణువేడినాడు ఉత్కలుడు. అప్పుడు మహర్షి “వత్సా! కర్మ ఫలితమును అనుభవింపక తప్పు కదా! పశ్చాత్తాముతో పునీతుడవైన నీకు శ్రీకృష్ణ సందర్శనము కలుగును. ముక్తిని పొందెదవు” అని అనుగ్రహించినాడు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:
అహింసా పరమో ధర్మః ।
ధర్మహింసా తథైవచ ||
ఈ సూక్తికి అద్దంపట్టే కథ బకాసుర వధ. ఇంద్రపదవిని చేపట్టి తన సంస్కారానికి విరుద్ధ్భముగా చేపలను పట్టుకుని ఉత్కలుడు జీవహింస చేసినాడు. అందులకు జాజిలి మహర్షి అతనిని శపించినాడు. కావున మనము జీవ హింస ఎన్నడూ చేయరాదు.
దుష్టుడు లోకహింసా పరాయణుడు అయిన ఉత్కలుని సంహరించి శ్రీకృష్ణపరమాత్మ ధర్మసంస్థాపన చేసినాడు. శ్రీకృష్ణుడు చేసినది ధర్మహింస అయినది. పైన చెప్పిన సూక్తి ప్రకారము అహింస పరమ ధర్మము. అహింస అంతే గొప్పది ధర్మహింస.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు గజేంద్రమోక్షము గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…
గజేంద్రమోక్షము పూర్వకథ
శ్రీరాముడు ధర్మమే పురుషరూపము దాల్చిన శ్రీమన్నారాయణ దివ్యావతారము. ఆ రామచంద్ర ప్రభువు కరుణతో గజేంద్రమోక్షము అనబడు ఈ భాగవతకథ బమ్మెరపోతనామాత్యుని దివ్యప్రసాదము. “ఎవ్వనిచే జనించు…” అని రోజూ ప్రార్థన చేసుకునే నేను ఆ మహానుభావుడి స్ఫూర్తితో మరల ఆయన స్పూర్తిగైకొని అతితేలికయైన తెలుగులో ఆ కథను అందిస్తున్నాను.
సూతమహర్షి శౌనికాది మునులకు భాగవతం వినిపించారు. ఈభాగవతగాధ మానవుని దిగజారుడు తనం ‘కలి’ ప్రభావమే అని సూచించింది.
ధర్మరాజంతటి ధర్మమూర్తికి మనుమడై అభిమన్యువంటి శూరుని కుమారుడై, తల్లిగర్భంలోనే అశ్వత్థామచే బ్రహ్మశిరోనామకాస్త్రంతో చంపబడి, శ్రీమన్నారాయణుడైన కృష్ణునిచే మృత్యుముఖం నుంచి బైటపడి పుట్టిపెరిగి తనపాలనలో ధర్మప్రభు వనిపించుకున్న పరీక్షిన్మహారాజుకు కలిపురుషుడి ప్రభావం సోకింది. మునులను దైవసమంగా చూచే అతను వేట కెళ్ళి దాహం వల్ల తపించి, ఒక మునిని దాహం అడిగి సమాధానం రాక ఒక చచ్చిన పామును ఆయన మెడలో వేసి, కోపంతో వెడలిపోయాడు ఆముని కొడుకు తండ్రి అవమానం తనదని భావించి ఆవని చేసిన అధముడు ఏడవ రోజున పాముకాటుతో మరణించు గాక! అని శపిస్తాడు. విషయం తెలిసి తండ్రి మందలించి ధర్మమూర్తియైన రాజుకీ సంగతి నెరింగించాడు. చేతులు కాలాక ఆకులు పట్టి లాభమేమి? అయినా రాజుకు పాపనివృత్తి జరిగి మరణానంతరం సద్గతులు కలగాలని భాగవతం వినమని బోధిస్తాడు ఆముని.
భాగవతం చెప్పగల సమర్ధుడు వ్యాస మహర్షి పుత్రుడైన శ్రీ శుకమహర్షి అని తలచి శుకుని ప్రార్థించి అర్థించమంటాడు, నారధుడు. ఆవిధంగా శుకమహర్షి పరీక్షిత్తునకు భాగవతం వినిపించి, శాపానంతరం మోక్షం ప్రాప్తింప జేశాడు.
ఆ క్రమంలో గజేంద్రమోక్షము అనే ఈదివ్యగాధ వెలుగులో కొచ్చింది. శ్రీశుకమహర్షి పరీక్షిత్తుతో ఇలా అన్నాడు. “ఓరాజా! నాలుగవ మనువు పేరు తామసుడు. ఆయన మూడవ మనువైన ఉత్తముని తమ్ముడు. ఉత్తముని సుతులు కేతువు, పృధువు, నరుడు మొదలైన వారు పదిమంది కలరు. భూమిని పంచుకొని వారు ధర్మపాలన చేశారు. వారి వంశములోని హరిమేధుడను మహారాజు భార్య హరిణి. వారి పూర్వపుణ్య వశమున శ్రీమన్నారాయణుడు విష్ణువై పుత్రునిగ అవతరించెను.
ఆ విష్ణువు లోకముల పాలనము జేయుచూ దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయుచుండెను. పరమ దయాళువైన ఆశ్రీహరి కొలనులో మొసలికి జిక్కి ప్రాణ భీతితో తనను పాహి పాహి అని వేడుకొనిన గజేంద్రుని సంరక్షించుటకు తన చక్రాయుధంతో ఆ మొసలి శిరస్సును ఖండించాడు అట్లా రక్షించబడిన ఆ గజేంద్రుడు మోక్షం పొందాడు!”
అప్పుడు పరీక్షిత్తు “మునిశ్రేష్ఠ! నీటనుండు మొసలికి కారడవుల దిరిగెడి గజేంద్రునకు వైరమెట్లు జరిగెను? ఆ గజేంద్రుని బాధ విష్ణువెట్లు తీర్చెను? నాకు దయచేసి వినిపించండి. నాశ్రవణేంద్రియములకు ఆనందం చేకూర్చండి శ్రద్ధగా వింటాను. భగవన్నామ సంకీర్తనలు పుణ్యప్రదములనిగదా జ్ఞానులు మిక్కిలి మక్కువతో విష్ణు కథలు వింటారు” అన్నాడు.
గజేంద్రమోక్షము
అప్పుడు శుకమహర్షి “ఓ మహారాజా! క్షీరసాగరమున త్రికూటమను గొప్ప పర్వతము కలదు. దాని వెడల్పు పదివేల యోజనములు (ఎనుబదివేల మైళ్ళు) ఎత్తుకూడా అంతే. దానికి మూడు శిఖరాలున్నాయి. అవి బంగారు, వెండి ఇనుములవై యున్నాయి. వాటిలో అనేకమైన దివ్యమణులున్నాయి. అవి దిక్కులను భూమ్యాకాశములను వెలిగించునట్లుంటాయి.
అనేకములైన చెట్లు, పాదులు తీగెలు అల్లుకున్న వనాలు, వాటిలో ఉంటాయి. గొప్పధ్వనితో సెలయేళ్ళు పారుతుంటాయి. దేవతలు ఆపర్వతాలపైకి తమ విమానాలతో విహారానికి వస్తారు. ఆ కొండ చరియలలో కిన్నెర దంపతులు స్వేచ్ఛగా విహరిస్తుంటారు. ఆ పర్వతములలో అనేకమైన వృక్షములు ఋతుభేదంబు లేక సదా వసంత ఋతువునందు వలె వివిధ జాతులకు చెందిన మొలకలతో చిగుళ్ళతో, పుష్పములతో, కాయలతో పండ్లతో శోభించుచుండును. రత్నములు విశేషముగా గల యిసుక మిక్కుటముగా నున్న యిసుక తిన్నెలు గల నదులతీరములందలి వింతైన పగడపుతీగలు గల ఉద్యానవనంబులందు విహరించు, చిలుకల వంటి పక్షులు తమ ధృడమైన ముక్కుపుటుములతో బొడుచుట చేత చెట్టు కొమ్మ సందుల నుండి మ్రోగిన పండ్ల నుండి కాఱు రసముతో ఆ ప్రదేశము నిండియుండెను.
ఆనేకములైన తామరకొలనులలోని తామర తూండ్లను ఆహారముగా భుజించి తమ ప్రియులతో విహరించెడి హంసలు మున్నగు పక్షులు శ్రావ్యముగా కూయుచుండగా, భూనభోంతరాళములు దద్దరిల్లు చుండును. ఆ పర్వతము లందు సిద్ధులను దేవజాతి తిరుగొడుచుండును ఆ దేవతలాలపించు సంగీతము మధురముగా నుండును. అచ్చటనుండు సింహశార్దూలములు పోరులో యమకింకరులనైన నోడించగలవు. అటువంటి పర్వతమున… బోయలు, బోయతలు, సింహశార్దూలముల వంటి మృగములు కూడా నివసిస్తుంటాయి.
ఆ అరణ్యంలో ఎల్లప్పుడూ భీతినిగరిగించునట్లు దిగ్గజములను కూడా గెలువగలిగిన బలమున్న అడవి ఏనుగుల గుంపు, పర్వత గుహలలో తిరిగి తిరిగి దప్పిక కలిగి, నీటిపై నుండి వచ్చు తడిగాలిని, గమనించి అచట నున్న కొలనులో విహరించవలెనని నిశ్చయించిన వయ్యెను. ఆ ఏనుగులు గుహల నుండి బయటకు వెడలుట సూర్యునికి వెఱచిన అంధకారము గుహలలో దాగి, యతడు క్రుంగిన పిదప విజృంభించి బయల్వెడలినట్లున్నది. రాజనీతి ప్రకారము రాజులు తమ శత్రువుల కన్న తాము దుర్బలులమని భావించినచో, అజ్ఞాతమునదాగి యుండి, తమ శత్రువులబలం తగ్గినంతనే, విజృంభించి దండెత్తి శత్రు నిర్మూలనం చేస్తుంటారు. అట్లే శత్రురాజు దినకరుడు క్రుంగగానే గజయూధము చీకటివలె విజృభించి చెలరేగినది.
అతి యౌవనగర్వంతో విర్రవీగుతున్న కరియూధము పర్వతములెదురైనను ఢీకొని ద్రోచికొని (తోసుకొని) పోవును. సింహము లెదురైనను ఎదిరించి పోరాడగలవు. ఆ ఏనుగులు పిడుగులు పడిననూ బెదరవు. అవి ఎటువంటి వనగా… సకలమృగంబులను వెఱపించు ఆ భద్రగజములు సంచరించుట జూచిన బెబ్బులులు బెదరుచున్నవై పొదలలో నక్కుచున్నవి. భీకరమైన ఎలుగుబంట్లు బెదరి గుహలలో దాగినవి. పందులు తమతమ కలుగులలో దూరినవి. జింకలు బిక్కచచ్చి దిక్కులందు పారిపోయినవి. చమరమృగంబులు యెటూ పారిపోవు సమయమూ ధైర్యమూలేక, తమ తోకలను ఎత్తిపట్టుకుని వినయముగా వింజామరలు విసురుచున్నవి.
ఏనుగులు మదించి యున్నప్పుడు వాని గండంబుల (చెక్కిళ్ళు) నుండి మదజలము స్రవించుచుండును ఆమదజలము మనోహరమైన వాసన కలిగియుండును. ఈ వనములోని మత్తేభముల మదజలంబాఘ్రాణించిన తుమ్మెదలు కోఱవయసులోనుండుట జేత చెలరేగి ఝంకారముల సేయుచూ మూగుచున్నవి. తన ప్రియురాలైన ఆడతుమ్మెద సిగ్గువిడిచి తన ఎదుటనే ఆ మదజల మాఘ్రాణించుట జూచి ఒక మొగతుమ్మెద ఓర్వలేక ఈ సుగంధము నాప్రియురాలైన ఈ తుమ్మెదకు నేనే ఇతర తుమ్మెదలు వారి వారి ప్రియురాళ్ళకిచ్చు దాని కంటే అధికంబుగా నిచ్చి నాప్రియురాలి కానందము సేసి దాని వలపులను సంపూర్తిగా అనుభవింతునని విజృంభించు చున్నవి. ఆహా! ఎంత మాయాసంసారము. ఈ కామవాంఛ జేతనే జీవులు (పరమాత్ముని ధ్యాసమఱచి) తమసుఖము తమవారి సుఖము కొరకే తనువున్నంత వరకు తనివి దీరక తపనజెంది తమినెరుంగక తహతహ లాడుచున్నారు.
తా॥ తన స్త్రీలపై వ్యామోహముతో పురుషుడు వారిని సంతోషపెట్టుటకు మంచి చెడు తెలుసుకోకుండా సన్మార్గము నొదలి గజేంద్రునివలె కష్టాల పాలవుచున్నాడు.
ఏనుగు గున్నలు, ఫలవృక్షంబులను ఒరిసి కొనుచు, చిగుళ్ళ గుబురులను వేగముగా కబళించుచు, తమ కంటబడిన అడవిదున్నలను, జింకలను, పులులను బెదిరించి గదమాయించుచు, నీటిగుంటలలో దిగి నీరంతా కెలికి బురదమయంచేసి పాడుచేస్తూ, కొండశిఖరములను గొబ్బిళ్ళు ఆడుచున్నట్లు దంతములతో పొడిచి పెల్లగించి దవ్వునకు విసిరి వేసి మట్టిరేపుచూ, ఎగజిమ్ముచూ యధేచ్ఛగా దిరుగుచుండినవి. ఆ ఏనుగుల గుంపు తమ తొండములతో గొట్టుచూ జెక్కిళ్ళతో నొరయుచూ, కుంభస్థలములతో బొడుచుచూ, పర్వతములను తలక్రిందులు జేయుచూ, దిక్కులను బలహీన పరచుచూ, ముల్లోక వాసులను భయ విహ్వలులను జేసినవి. (అతిశయోక్తి అలంకారం గమనించవలెను.)
ఈవిధంగా లెక్కలేకుండా సంచరించుచున్న ఆ ఏనుగుల గుంపులోని గజేంద్రుడు మిక్కిలి బలగర్వితుడై తన ప్రియురాండ్రయిన ఆడ ఏనుగులతో ఆ కూటమి నుండి విడివడి, దారి తప్పిన దాయెను. కానీ ఆడ ఏనుగులపై గల ఆశ దానికి రాబోవు ఆపదను గ్రహింప లేని దానిగా జేసెను.
ఆ గజేంద్రుడు తనముందు వెనుక నిరుప్రక్కల గల ఏనుగులను గమనించుచు, దారితప్పి ఏమియు తోచక దైవ వశంబున తనప్రియురాండ్రయిన ఆడేనుగులతో తాను మరొక్కదారి బట్టిబోయెను. మదోన్మత్తుడైన ఆ గజేంద్రుడు తన ప్రియురాండ్రతో ఆ గూడి సంచరిస్తూ వారిపైగల అమిత మోహముచే వాటికి పచ్చిక పడియలల్లో గలలేత పచ్చిక తనతొండముతో నందిస్తూ, చిగుళ్ళతోనిండిన రెమ్మలను తొండముతో విరిచి పక్షపాతము లేక తనప్రియురాండ్రకు సమంగా అందిస్తూ, వనమందు తిరుగుట చేత తడిసిన తనప్రియురాండ్ర చెమటను పెద్దవైన చెవులతో విసరుచూ, తనకాంతల అందమైన మెడలను నిమురుచూ, వాటిపై తనకుగల మోహమునెరిగించుచూ, తనతొండమును పైకెత్తి నీళ్ళు జిమ్మెను. తన చెలియుల ఋతుకాలం కనిపెట్టి వాటి మోహావేశానుగుణంగా నడుచుటలో గజరాజు నేర్పరి. తన యువతులను ఉత్సాహపరచుచూ అతను వారితో విహరించుచూ తన అలసట దీర్చుకొనుచుండెను.
ఇక ఆ గజేంద్రుని దేహసౌష్ఠవమును గజభామినుల అందములతో పోల్చిన సారూప్యమే లేదు. ఆగజేంద్రుని కుంభస్థలియొక్క గబ్బితనమును, ఆభామలే తమస్తన సంపదతో సరిపోల్చుకొని సిగ్గుపడునట్లుండెను. ఆ గజకాంతలు తమ స్తనములు కప్పుకొనుటకు పైట చెంగులేనందు వలన తమనడకల వేగం తగ్గించి తమ తమ కుంభస్థలములు అడ్డువచ్చి కనిపించకుండయుండునట్లు చేసికొనుచున్నవి. వాటినడక జూచిన కొత్తగా కాలి అందెలు దాల్చిన చిన్నదాని నడకకు పోల్చదగినట్లున్నది. అయిననూ తమ తొండముల కాంతి గజేంద్రుని తొండపు కాంతితో సరిపోల్చలే నందువలననూ, స్త్రీల తొడలకాంతి మిక్కుట మగుటకు ఒడ్డాణము ధరించిరో అన్నట్లుండియూ దంతముల కాంతిసరిపోలుటకు తమ చిరునవ్వు చంద్రకాంతిని జతపరచునట్లుండి, దంతములకాంతులు సరి పోల్చుకొదగినట్లున్నవి. ఈ పృధ్వీమండలమును అష్టదిగ్గజములు మోయుచుండును. వాటి భార్యలు ‘అంజన’ మున్నగు దిగ్గజాంగనలు ఈ గజేంద్రుని ఠీవి, సౌందర్యము ఆ దిగ్గజాంగనలను సైతము భ్రమింపజేయునేమో అన్నట్లుండెను.
ఆ గజేంద్రుడు తనకాంతలతో అడవి తర్వాత ఇంకకొ ఆడవిని దాటుచూ చాలదూరముపోయి అమితమైన దాహముచే పీడితుడై, నీరుండు మడుగులను వెదకుచూ తన ప్రియురాండ్రతో చాల దూరము పోయెను. అచ్చట అప్పుడే పూచిన తాముర పూలతో కూడియున్నది యును, ఆపూలపై తిరుగు భ్రమరములచే శోభిల్లునదియు, మొసళ్ళు మొదలగు జల జంతువులతో గూడినదియు, లోపలికి దిగుటకు దుస్సాధ్యంబైనదియు, నాలుగువైపులా దట్టమైన మర్రి, మామిడి మొదలగు వృక్షములతో కూడినది, హంస, సారస, కారండవ మొదలగు పక్షులకు నివాసమగు నదియునైన కొలను చూచి ఆ గజేంద్రుడు సంతసించెను. ఆ యరణ్యమునందు జనసంచారము లేనందువల్ల స్వచ్ఛమైన నీరు గల ఒక తామరకొలను చూచి గజేంద్రుడు అందు జలకమాడవలెనను కోర్కెను మిక్కుటముగా పొందెను.
ఆ తామరకొలనులోని తామరపూల వాసనతో గూడిన శైత్య, సౌరభ్య, మాంద్యములను మూడు గుణములు గల గాలి వీచుచుండగా తమదేహముల బడలిక తీరుట చేతను, ఆ కొలనులోని తామరతూండ్లను తిని, మనోహరముగా కూయుచున్న రాజహంసల రవములు తమ వీనులకు ఇంపు గలుగుటచేతను, ఆ పద్మములు తమ నాసికలకు కమ్మనివాసన నందించుటచేతను, తేటనీటి అలల తుంపరలు నోటికి రుచిగా అనిపించుట చేతను, ఆకొలను సౌందర్యము ముల్లోకములలోను అరుదైనదిగా దోచుటచే తను ఎంతకూ తనివి తీరకుండుట చేతను, ఆమదపుటేనుగులు గుంపు తమ పంచేద్రియములకు’ కావలసిన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ గుణములైదింటినీ ఆ కొలని యందే బడయుటచేత ఆ కొలను విడిచి పోవుటకు మనసురాక ఆ కొలనును విడువలేకుండెను.
ఆ ఏనుగుల నీటిని తమ తొండములతో బీల్చుకొనుచు, పెకెత్తి వాటిని తమ ముఖమునందలి చెక్కిళ్ళపై జల్లుకొనుచు, తలలు పెకెత్తి గళగళ ధ్వని కలుగునట్లు చేయుచూ, కడుపు నిండ నీరుద్రావినవై యుండిన తదనంతరంబున… ఆ ఏనుగులు ఆ కొలనులో చెలరేగి జలకము లాడుచుండెను. ఆ గజేంద్రునికున్న అపరిమితమైన బలముచేత తొండముతో నిండుగా నీటిని పీల్చగానే కొలనులోని చిరుచేపలు, ఎండ్రకాయలు నీటితోపాటు తొండమున దూరి, భీతిల్లి. ఆపదనున్నవారు తమ జాతివారిలో ఉన్నతులను ఆశ్రయించి రక్షణ బొందుటకు యత్నించునట్లు శింశుమార చక్రమునందు (జోడియక్ సైన్) గల మీన, కర్కాటక రాసులను తలచుకొని ప్రార్థించుచూ ఆశ్రయించెను. అదిచూచి దేవతలుకూడా నివ్వెరపోయిరి.
ఇక యీగజేంద్రుడు సంతోషముతో తొండమున పూరించిన నీటిని అమితవేగమున ఆకసము వరకు నెగజిమ్ముచు అతిశయించుచుండెను. ఇవ్విధంబుగా ఆ గజేంద్రుడు అడ్డు లేకుండ విహరించు చుండెను. ఇక ఆ జలక్రీడలలో పైకెగజిమ్మిన నీటి నుండి అతని ముఖముపై బడిన తుంపరలతో ఎత్తైన ఆనల్లని గజరాజు ఎట్లా ఉన్నాడంటే…..
నల్లని కాటుక కొండయో అన్నట్లున్నాడు. తమ తొండముతో తామరపూల రేకులను విడదీసి ఆ గజేంద్రునిపై ఆడ ఏనుగులు వేయుట చేత వేయి కన్నులున్న దేవేంద్రుడా ఏమి ఇతగాడు అన్నట్లున్నాడు. ఆ తామరపూల పుప్పొడిని కూడా చల్లుటచేత అది బంగారు రంగులో మెరయుచూ పసిడి కొండ అయిన మేరుపర్వతమా ఏమి అనునట్లున్నాడు. తెల్లని తామరపూతూడులు దేహమంతా కప్పగా, తెల్లని నాగులను దాల్చిన పరమేశ్వరుని వలెనున్నాడు. ఆ నల్లని ఏనుగుపై వేసిన ఆ తెల్లని తామరతూడులు. కారుమేఘమందలి విద్యుల్లతలవలె వెలిగిపోతున్నాయి. ఈ విధంగా వారి జలక్రీడ అద్భుతంగా ఉన్నది.
(కామినివలె ఆ కరేణువలను (ఆడేనుగులను వర్ణించుట ఉత్ప్రేక్షాలంకారచమత్కృతి, స్త్రీని ఏనుగుతో పోల్చుట పురాతన కవుల సంప్రదాయము. గజగమనలు, కుంభస్థలిని బోలిన స్తనద్వయం అనాది కవుల సంప్రదాయం). ఆకొలనులో గజేంద్రుడట్లు స్వైర విహారము సలుపుచుండగా ఆ కొలనులో నివసించుచున్న ఒక మకరేంద్రుడు వెఱచి నీటిపైకి వచ్చెడి వేగమునకు కొలనులో భుగభుగ, మనెడి గొప్ప ధ్వనితో బుడగలు వస్తుండగా, వెఱపు కలిగించు పూత్కారపు ధ్వని చేయుచు, దానికి మిగిలిన మొసళ్ళు, ఎండ్రికలు బెదరుచుండగా తన బలమైన తోకను విసరుట చేత అణచలేని గొప్పధ్వనితో గాలివీచగా, దానివలన నీటిలో సుడులు ఏర్పడగా, దానివలన గొప్ప అలలు వ్యాపించి సరస్సు ఒడ్డు కోయబడి అచ్చటనున్న చెట్లు కూకటి వ్రేళ్ళతో కూలిపోగా, కొలనిలో నుండి పైకివచ్చి తత్తరపాటును వెఱపును బొంది, తన ఊపిరి బిగియ బట్టి తెగతోప్పుచూ, ఆ గజేంద్రుని చెంత జేరి రాహువు సూర్యుణ్ణి కబళించుటకై బట్టినట్లు ఆ గజేంద్రుని కాలిని ఒడిసిబట్టెను.
ఆ మొసలి తేడుకు తన కాలు చిక్కినదని గ్రహించిన గజేంద్రుడు తన బలమైన తొండమునెత్తి శక్తికొలదీ మొసలిని గట్టిగా కొట్టిన దాయెను. ఆ దెబ్బకు మకరి చచ్చినదానివలె నీటి అడుగునకు జారిపోయి చటుక్కున బైకి వచ్చి ఆగజేంద్రుని రెండు కాళ్ళను గట్టిగా తన నోటితో పట్టుకొనెను.
రెంటినీ అట్లు మకర విభుడు తనముందు కాళ్ళను బట్టుకొన్ననూ వెఱువక ఆ కరీంద్రుడు తన దంతంబులతో ఆ మొసలి చర్మంబుపై బుడిపెలు ఊడిపోవునేమో అన్నంత బలమున ఆ మొసలి వీపుపై గుచ్చెను. ఆ కుమ్మునకు మొసలి పట్టు విడిచి వేగముగా గజము వెనుకకుబోయి దానితోకను తన నోటితో పట్టి కొరికి బాధించెను.
సందు చిక్కినంతనే మొసలి ఏనుగు కాళ్ళను పట్టుకుని కొలనులోని కీడ్వదొడంగెను. బలశాలియైన ఏనుగు మొసలిని కొలను బయటకు ఈడ్చి తొక్కుటకు ప్రయత్నించు చుండెను. కొలనులోని మొసళ్ళన్నియు తమ మొసలి గెలువగలదని ఆశ పడుచుండగా, కొలను వెలుపలనున్న గజము లన్నియూ తమనాధుడు గెలుచునను ఆశతో నుండెను.
ఇట్లు ఆ ఏనుగు, మొసలి రెండునూ క్రమముగా భరింపరాని బాధకలిగి నప్పటికీ తీవ్రముగా పోరుచూ చూచువారలకు భీతిని కలిగించుచూ, ఒండొరుల విజయలక్ష్మిని బలాత్కారముగా పరిగ్రహించుటకు యత్నించుచూ, తామరకొలనును గలత పెట్టుచూ, సింహముతో మరొక సింహము, కొండతో మరియొక కొండ ఢీ కొనుచున్నట్లు పోరాడుచూ, వెనుదిరుగక బెనగులాడుచు నీళ్ళలో జరుగు నట్టి జగడములో ఈ వైపుకూ ఆ వైపుకూ లాగుకొనుచూ, తొట్రుపాటు నొందక బుడబుడమను ధ్వనులతో బుగుల్ బుగుల్ అను విచిత్రమైన చప్పుళ్ళతోనూ నురగలు రప్పించుచూ, నోటిరంధ్రములతో బట్టిన నీటిని ఆ కరీంద్రుడు ఆకాశమునకు వెదజిమ్ముచూ, మిక్కిలి వాడియైన దంతంబులతో బల్లెములవలె పొడుచుచూ మొసలి యొక్క చిన్నచిన్న తునకలైపోతున్న ఎముకలు తలపుర్రెపగిలి తలపై రక్తము స్రవించుచుండగా ఒండొరలు నీడ్చుకొనుచుండిరి. కాని మొసలితనపట్టును సడలించదాయెను.
వాటి మధ్యపోరు వలన చిన్న చిన్న జంతువులైన తాబేళ్ళూ, ఎండ్రకాయలూ, కప్పలూ, గండకములూ (ఒకరకమైన చేపలు) మొదలైన వాటి ప్రాణములు క్షోభిల్లుచుండెను తామరపూవులను చిందరవందర జేయుచూ, నీటిపాచి యొక్కయు నత్తగుల్లల యొక్కయు చిఱుకప్పలయొక్కయు గుంపులను తమ ఒండొరులు దెబ్బల మధ్య నలిగిననూ లెక్కచేయక “నాజయమే నిశ్చయము” అనే మొండిపట్టుదలతో రాత్రింబగళ్ళ వలె ఒకదానిని ఇంకొకటి అనుసరించుచూ చెలరేగి చిరకాలము పోరాడినవి. నిద్రాహారంబులను మానివేసినవి. సాటిలేని మగటిమితో (మగతనంతో) పోరు సల్పినవి.
పోరులో గజేంద్రునిదిపై చెయ్యి అయినందున మకరికి రాబోవు దుస్థితికి భయమందిన భూలోకంలోని మకర, మీన, కర్కాటకములన్నియు మిత్రనిలయంబులను చేరినవో అనునట్లుండెను. (అనగా మకర, కర్కాటక, మీన రాశులు నింగిలో కలగలుపై ఒకే కూటమిగా జేరి రాశి చక్రములలో నిలిచియున్నట్లుండెనని భావము. ప్రకృతి సిద్ధముగా నాకాశములోనున్న మకరమీన, కర్కాటక రాశు ల కూటమి వన జంతువులకూటమిగా భావించబడుచున్నది. ఇది చక్కని ఉత్ప్రేక్షాలంకారము.)
ఆ మకరము కరీంద్రుని మాటి మాటికీ నీటిలోకి లాగుటకు ప్రయత్నించుచుండగా ఓర్వలేనిదై గజేంద్రము ఆ మకరినోడించుటకు దంభములాడుచూ భయంకరముగా వజ్రాయుధముతో సమానమైన తన దంతములతో ఆమకరి తొమ్ము చీలునట్లు ఎగురగొట్టి పడేసి, తొండముతో కొట్టు చుండెను ఈ విధముగా కరి మకరముల ద్వంద్య యుద్ధము జరుగుచున్నప్పుడు…
తా॥ ఏనుగు, మొసలి ఘోరముగా పోరుట జూచి తమ ప్రియుని వదలివైచి పోవుట ఆ ఆడు ఏనుగులకు చేతగాక గజేంద్రుని దురవస్థను జూచి పరితపించినవి. ఎక్కడనైనా తమ నాధుని వీడి తమ దారిన తాము బోయే ఆడువారిని చూడగలరా?
అంతట మొసలికి నీళ్ళే స్థావరమైనందున దాని బలము రానురాను హెచ్చుచుండెను. ఉత్సాహము పెరుగుచుండెను. కరికి నానాటికి బలము క్షీణించుచుండెను మొసలితో బోరాడుట కాక నానాటికీ కృష్ణపక్ష చంద్రునివలె క్షీణించుచుండెను. అంతటనా మొసలి కరి కుంభస్థలముపై నెగురు సింగంబువలె దుమికి హుంకారముతో గజేంద్రుని పాదములను బట్టుకొని నీటిలోపలికి లాగుచు మెడమీద, వీపు మీద గొట్టుచూ అలక్ష్యముతో నాకరిరాజు పై ఎగురుచూ ఏనుగును నీళ్ళలోముంచుచు, దానును మునుగుచు ఎముకలను, దంతములను విరుగగొట్టుచు, కరీంద్రుని నీటి బయటికి పోనీక కాళ్ళుపట్టి సరసులోనికి లాగుచు బాధించుచుండెను.
ఆ మకరము గజేంద్రునికి కనబడకుండ నీళ్ళలో దాగి ఆ ఏనుగు బయటకు వచ్చునపుడు దానికాళ్ళకడ్డుపడి కదలనీయక కాళ్ళను జుట్టుకుని హఠాత్తుగా లోపలికి లాగుచూ బాధించగా కరిరాజు భీతిల్లి చతికిలబడి నడచుచు, ఆకరి నీళ్ళ నుండి తొలగిపోవునప్పుడు ఆ మొసలి గజేంద్రుని కాళ్ళనొడిసి పట్టుకుని బాధించుచుండెను.
ఆ విధమున నామొసలి తక్కిన జలజంతువులన్నీ ఆశ్చర్యముపడునట్లు, అల్పుని జ్ఞాన జ్యోతిని ఆక్రమించు అజ్ఞాన తిమిరములవలె అంతకంతకూ అధికమవుతున్న ఉత్సాహము గలదై ఎక్కువ తెంపు చూపుచుండెను. ఆ మకరము గూడ పట్టు బిగించ దలచి తన రెండు పాదములు నేలకానించి బిగియబట్టి పంచేద్రియముల గర్వాన్ని అణచికొని బుద్ధిస్థైర్యంబుగలదై ఏనుగుయొక్క పాదములను అడ్డులేకుండ బట్టి, యోగిపుంగవుడు బ్రహ్మపదం కోసం దుఃఖవిముక్తుడై సమాధియందు తన యుచ్ఛ్వాస నిస్వాసలను బంధించి యుంచినట్లు నిశ్చలముగా నుండెను.
ఇక ఆ గజేంద్రుని దుస్థితిజూచి స్వజాత్యభిమానము పీడించగా ఇంద్రుని వాహనమైన ఐరావతము మన బంధున కిట్టి దుర్దశ వచ్చినదే అని తల్లడిల్లి, ఇంద్రుని దించివైచి ఆకసమువైపుకు పరుగుతీసెను. అది దేవతలకు సైతము జిక్కకుండెను. ఒక ప్రాణి అధికమైన అవివేకము చేత సంసార కూపంలో బడి బయటకు రాలేక బుద్ధి నిలకడ లేక చింత పడునట్లు గజేంద్రుడు మకరి పట్టు విడిపించుకొనలేక మిక్కిలి దిగులు పడుచుండెను ఈ విధముగా… ఆ గజేంద్రుడు బడలిక నొందక, మూర్ఛనొందక, విసుగుపుట్టక వేయిసంవత్సరముల కాలము రేయింబవళ్ళూ సంధ్యయూ నెరుంగక యెడతెగక ఆ మొసలితో పోరెను.
అవ్విధంబున గజేంద్రుడు పోరాడి మిక్కిలి అలిసిపోయి ఇక దీనితో సాటిగా తనుపోరాడలేనని తలచి తన పూర్వజన్మ పుణ్యము పరిపక్వమగుటచే దివ్యజ్ఞానము నొంది, దిగులును విడనాడి ఇవ్విధంబున చింతింప సాగెను…
ఉ॥ ఎవ్విధి దీనిగెల్వనగు ఎవ్వని బిల్తును తోడు నాకవన్
ఎవ్వరు అడ్డమయ్యెదరు ఈ జలజంతువునెట్లు వంచెదన్
ఎవ్వరు దిక్కులేని మొరనీయెడ విందురు నాకు దైవమై
ఎవ్వడొ యొక్కడైన ననుయేలుచు ఆదుకొనండె ఈశ్వరా!
(పోతనగారి ‘ఏరూపంబున దీనిగెల్తు…’ ఆధారంగా)
తా॥ ఓ ఈశ్వరా! దీనిని ఏవిధముగా గెలువగలను? నాకు తోడై యుండుటకు ఎవ్వనిని పిలిచెదను? ఎవరు అడ్డు పడి నన్ను కాపాడెదరు? ఈ మొసలిని ఏ విధముగా ఓడించగలను? నా దిక్కుమాలిన ఆవేదన ఎవరు వింటారు? నన్ను ఏ దైవమైనా రక్షించి పాలింపరాడేల?.
ఉ॥ కాననమందు మత్తకరి కన్యల గూడుచువారి నామదం
బైన జలంబులన్ దడిపి అద్భుత చందన వృక్ష ఛాయలన్
బూనిపరుండ లేక దిగిమోదక మందున మందబుద్ధినై
నేనిటు దీనిపాలబడి నీల్గుచు నుంటిని దిక్కుతెల్వకన్
(పోతనగారి ‘నానానేక పయోథము…’ ఆధారంగా)
తా॥ అడవిలో మదించిన ఆడు ఏనుగులతో కలిసి వానిని నా మదజలాలతో తడిపి, అద్భుతమైన చందన వృక్షములనీడలో హాయిగా నిదురించుచు ఉండలేక, ఈ కొలనులో దిగి నాగ్రహచారం కొద్ది ఈ దురవస్థను పొందాను. ఈ స్థితినెట్లు దాటెదనో తెలియుటలేదు.
ఈ జగములావిర్భవించుటకు కారకుడెవరు? సర్వము ఎవనిలో పుట్టి, ఉండి, చివరకు లీనమై ఈవిశ్వం కన్పించక అదృశ్యమవుతున్నది? అన్నిటికీ మూలకారణమైన ఆ ప్రభువెవ్వడు. ఆది మద్యాంతరహితుడైన ఆ సర్వేశ్వరుడెవడు? అట్టి ఆత్మయందావిర్భవించు వాడని ఆర్హుడనై శరణు జొచ్చెదను.
సకలలోకములను ఒక పర్యాయము తనలోనికి గొని నశింప చేయుచూ, ఒక సారి వెలుపలికి రప్పించుచూ, జీవకోటిని సృజించుచూ, రెండు బాధ్యతలను తన ఇష్టానుసారము నిర్వర్తించుచూ, సాక్షియై గమనించుచూ అకళంకుడూ, జ్ఞాన రూపియైన ఆ సర్వేశ్వరుని నా మనసునందు ధ్యానించెదను.
తా॥ ఈ లోకములు, లోకపాలకులు, లోకములందు నివసించువారు చనిపోయిన తరువాత గొప్ప గాఢాంధకారము దాటిన పిదప ఒక్క ఆకారముతో నుండు వాడెవడో ఆపరంధాముని ధ్యానించెదను. నాటకశాలయందు వేషగాడు పలువేషములు దాల్చును, అట్లే పలురూపములతోనెవడు జీవించునో, ఎవరు సకల భూతముల లోపల నుండి నటించుచున్నాడో, ఎవరి మహిమ మునీంద్రులకుగాని, దేవతలకు గాని గోచరము కాదో, ఆ భగవంతుని నేను ఇప్పుడు తలచుచున్నాను.
సంసార సుఖంబులను త్యజించిన మునులు బ్రహ్మసాక్షాత్కారము గోరువారయి సర్వభూతహితులు సత్పురుషలునై తామెంత సచ్ఛీలురైయున్ననూ, ఏభగవంతు నెరుంగ జాలరో అతనిని నేను స్తోత్రించెదను. అతడు నన్నుకాపాడు గాక!. స్వయముగా జన్మము, పాపము, నామ రూపములు, గుణక్రియలు లేనివాడును పరాత్పరుడును, తేజోరూపుడును, రూపరహితుడును, సృష్టి స్థితిలయల నిమిత్తమై నామ రూపక్రియాది గుణములు గలిగి మాయను తనవశము నందుంచుకొన్నవాడును, అపరిమిత బలము గలవాడునూ, వింతలగు అసమాన చరిత్రములు కలవాడునూ, అవాజ్మానసగోచరుడును, సాత్వికులైన, సంసార విముఖులకు మాత్రమే ప్రత్యక్షమగువాడునూ అయిన ఆ భగవంతునికి నేను మ్రొక్కెదను.
తా॥ తమరి కర్మలన్నీ యోగాగ్నిలో దగ్ధమైపోగా అన్యము నెరుగక యోగులు ఏ మహాత్ముని చక్కటి ధ్యానముచే వెలిగెడి మనస్సులలో బాగుగా వీక్షించగలరో అతనిని నేను భజింతును.
సకల వేదాగమములకు నిధియైన వాడును, మోక్షస్వరూపుడును, సజ్జన సేవితుడును, త్రిగుణాత్మకునిగా తోచినప్పటికీ లోపలి జ్ఞాన దీపముచే వెలుగు చుండువాడును, స్వయంప్రకాశ స్వరూపుడును, గుణాతీతుడగుటచే జ్వలించు మనస్సుకలవాడును, సకలకర్మానుష్ఠాన పరులచే బొందబడు వాడును, దిక్కులేని నాబోటి వారి మొరలాలించి కాపాడు వాడును, సర్వాంతర్యామియై వెలుగువాడును, సంసారతాపత్రయమున బడినవారికి అగోచరుడును, అయిన ఆ భగవంతునికి నమస్కరించుచున్నాను. మరియు… ధర్మార్థకామముల యందు ఆశ పరిత్యజించిన జ్ఞానులు ఎవ్వని గొల్చుచూ తమ కీప్సితమైన మోక్షమును సాధించుచున్నారో, అట్లు తనను భజించినవారికే భగవంతుడు నాశరహితమగు ఏమోక్షమునందించు చున్నాడో, ముముక్షువులు కోరి ఎవ్వనిచే తమ ఈప్సితములు బొంది ఆనందమున నోలలాడుచున్నారో, అట్టి మహేశ్వరుడును, త్రికరణములకును అగోచరుడైనవాడును, నిశ్చల భక్తిచేత పొందదగిన వాడును, సర్వత్రా నిండియున్నవాడును, బ్రహ్మస్వరూపుడును, స్థూలసూక్ష్మరూపములుగలవాడును, ఇంద్రియాలకు అగోచరుడును, పరాత్పరుడును అయిన భగవంతుని నేనిదే ధ్యానించుచున్నాను.
సూర్యుడును, అగ్నియును ఒకప్పుడుతమ కాంతులను బయటకు విరజిమ్ముచూ, ఒకప్పుడు తమ లోనికీడ్చుకొనుచున్నారు. అట్లు ఆ భగంతుడు శ్రీమన్నారాయణుడు భూమ్యాది లోకములను, బ్రహ్మాది దేవతలను చరాచరములగు సమస్త వస్తుజాలమును, సృజించి, వానికి నామరూపముల నొసంగి, ప్రళయ కాలమున తనలోనికి జేర్చుకొనుచున్నాడు. ఎవ్వడు మనోబుద్ధి చిత్తాహంకారములును జ్ఞానేంద్రియ కర్మేంద్రియములును తానుగానే అయియుండి త్రిగుణంబులు కార్యంబులు చేయుచుండి, పిమ్మట తనకే సంబంధము లేని వానిగానే యుండునో, త్రిలింగములూ తనేయై ఎవ్వరున్నాడో, సమస్త దేవ, మానవ, అసుర, జంతు పశుపక్ష్యాది రూపములై ఎవడున్నాడో, కర్మంబులు గుణంబులు మొదలగువానిచే |కలుగు భేదములనొందక, సత్స్వరూపుడునూ అసత్స్వ రూపుడునుగాక యుండియు, ప్రళయంబున అన్నింటినీ తనలోనికి జేర్చుకొను పరమాత్మ స్వరూపుండును, నిర్గుణ నిర్వికార నిరంజన స్వరూపుడును, సర్వ స్వరూపుడయిన ఆ భగవంతుని దలచుచున్నాను.
తా॥ గొప్ప శ్రేష్ఠులైన యోగులలో ఆ పరమాత్మకలడు అంటారు. కరుణ గొనుటచే దీనులలోకూడా ఆ భగవంతుడున్నాడని అందురు. అన్ని దిక్కులలోనూ ఉన్నాడంటారు. ఇంతమంది కలడు అంటున్నారు గాని ఆ కలడనే వాడు ఉన్నాడో! లేడో!.
జనన మరణములు లేని జగన్నాధుడు నాపాల నున్నవాడో లేడో ! దుష్టశిక్షణ శిష్టరక్షణచేస్తాడంటారే మరి ఆ పరాత్పరుడు నన్నీ మొసలి నుంచి రక్షించడేమి? నాకడ్డము ఎందుకురాడు? జితేంద్రియులైన జ్ఞానులను తన కడజేర్చుకొను ఆ భగంతుడు నా అవస్థను కన్నులార జూచి కూడా నన్ను పాలించకున్నాడే? కపట భక్తుల జిత్తులను గమనించి, వారికే నాటికీ ప్రత్యక్షముగాని భగంతుడు నా దీనాలాపముల నాలింపడేమి? ఇదంతా చూస్తుంటే నాకు సందేహం వస్తోంది. ప్రపంచమంతా తనరూపమే అయినవాడు సృష్టిస్థితిలయలు చేస్తూ సర్వకాల సర్వావస్థల యందు వెలుగు చుండువాడును, తనను కొలిచెడి భక్తులు వేదనతో కాపాడమని ధ్యానించినప్పుడు సత్వరమే వచ్చి కాపాడు ఆ పరమేశ్వరుడు నామొరలను వినడేమి? నా అవస్థనుచూడడేమి? అసలు ఇంత దురవస్థలో నున్న నన్ను తలచుకోడేమి? నన్ను కాపాడుటకు సత్వరంగా రాడేమి?
ఈ విశ్వ సృష్టికర్తను, విశ్వానికి బాహ్యముగా నుండు వానిని, విశ్వస్వరూపిని, విశ్వమంతటిచేత తెలియదగిన వానిని, విశ్వమే తానయినవానిని, విశ్వముతో ఏ సంబంధమూ లేనివానిని, శాశ్వతుడైన వానిని, పుట్టుకలేని బ్రహ్మకంటే శ్రేష్టుని, పరమపురుషుడైన ఈశ్వరుని నేనిదే సేవించు చున్నాను. ఇకపై గజేంద్రుడు తనెదుటనే ఆ పరాత్పరడున్నట్లు భావించుచు తనమొరలను నేరుగా ఆ స్వామికే విన్న వించుకుంటున్నాడు.
తా॥ హే జగద్విభో! నాకు ఇంక శక్తిలేదు. ధైర్యం పోయి ప్రాణములు వాటి వాటి స్థానములను విడిచిపెట్టాయి మూర్ఛవస్తున్నది. నీరసము కమ్మింది. ఎంతయో శ్రమను పొందుతున్నాను. అన్యమైన గతి నెరుగు కున్నాను. ఈశ్వరా! ఈదీనుని మన్నించు. ఓవరదా! నన్ను రక్షింపుము. నీకే అది సాధ్యము.
ఓ దయా సాగరా! నీవు ఆపన్నులమాటలను వినెదవనియు, బోవనసాధ్యమైన తావులకు పోదువనియు, శరణాగతులు పిలిస్తే “వస్తున్నాను” అని పలుకుతావనియు, పదే పదే జెప్పుచుండగా వినియున్నాను. అయితే నామొరలెంతసేపటికీ వినక పోవటంచేత నీవు రాకుండుటచేత ఈ మాటలు నిజమా అనిపిస్తున్నది.
సీ॥ ఓ కమలేక్షణ! ఓభక్తమందార!
వైరి భావము లేని వరద! నాధ!
ఓకవిమునివంద్య! ఓసుగుణోత్తమ!
విమలప్రభావ! ఓవేదవినుత!
ఓ కల్పవృక్షమా! ఉత్తమ శరణార్థి
త్రాతవై నిలిపెడి హితప్రదాత!
ఓ మునిశ్రేష్టుల ఉల్లంబులన్ నిల్చి
సద్దతినందించు సత్యవచన!
తా॥ కమలములవంటికన్నులు గల ఓభక్త కల్పవృక్షమా! మిత్రులు శత్రువులు అను భేద భావంలేని ప్రభూ! పండిత మునిజన సేవితా! సుగుణములు గలవారందరిలోకి ఉత్తముడా! స్వచ్ఛమైన ప్రభావం గలవాడా! వేదములచే కొని యాడబడువాడా! ఓ కల్పవృక్షము వంటి ప్రభూ! ఉత్తములైన శరణార్థులను కాపాడి హితముల నొసగువాడా, మునిశ్రేష్ఠుల మనస్సులలో తిష్ఠ వేసుకొని నిలిచి వారికి సద్గతి నందించే శ్రీహరీ! రావేమయ్యా? ఓ భూరమణా! నాకునీవె శరణు. పరమపురుష! నన్ను తలచవెందులకు? కాపాడుట కేలరావు?
ఆ గజేంద్రుడట్లు చాలసేపు చింతించి యనాధ రక్షకుడైన ఆ పరమాత్మ తన నేల రక్షించడని ఆకసము వైపు తన మోముద్రిప్పి తన తొండము నెత్తి ఆ పరమపురుషునికి నమస్కరించుచు ఒక వేళ ఆయన తనకు ప్రత్యుత్తరమిడుచున్నాడేమో నని తన చెవులను రిక్కరించి వినుచు తన ఆవేదన నెరిగించుచుండెను.
ఆ గజేంద్రుడు విశ్వవ్యాప్తుడైన పరమాత్ముని వేడుచున్నాడు కదా! మనకేమి లెమ్మని బ్రహ్మాది దేవతలు వానిని వినియు మిన్నకుండిరి. ఇక ఆ మహావిష్ణువు విశ్వరూపుడు, విశ్వవ్యాప్తుడు విశ్వ మయుడు ఆగుటంజేసి సర్వోత్కృష్టుడైనందున ఆకరిని రక్షించు బాధ్యత తనదేనని ఆ గజేంద్రుని కాపాడ నిశ్చయించినవాడాయెను.
తా॥ వైకుంఠపురములో, నగరియందు ముఖ్యమైన ఒక గొప్ప భవంతి ఉన్నది. దానిదగ్గరలో, కల్పవృక్షం ఉంది. దాని దగ్గర చక్కటి తోట ఉంది. అక్కడ తియ్యటి అమృతం వంటి నీరు గల సరస్సున్నది. దాని ఒడ్డున దివ్యమైన చంద్రకాంతమణులతో నగిషీలు చెక్కబడిన కలువపూల పాన్పు ఉన్నది. అందులో లక్ష్మీదేవితో విహరించు శ్రీహరి, శరణు వేడుచూ దీనుడై ఆర్తనాదం చేస్తున్న గజేంద్రుని మొర ఆలకించి వానిని కాపాడదలచి మనసంతా కరుణతో నిండిపోగా సిద్ధమయ్యెను.
ఉ॥ చెప్పడు శ్రీ రమామణికి, చేత ధరించడు శంఖు చక్రముల్
అప్పరి వారమున్ గొనడు అభ్రగనాధుని ప్రీతి నేడున్
కొప్పునుజుట్టడాయె హరి కోమలితో తన వాద మాపుచున్
అప్పుడె, ఆమెపైట విడనాడకయే కరిబ్రోవ నేతాన్
(పోతనగారి ‘సిరికింజెప్పుడు..’ ఆధారంగా)
తా॥ ఆ విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి తనెక్కడికి పోతున్నది చెప్పుటలేదు, శంఖచక్రాయుధములు చేత బట్టుకొనడు, ఏ పరివారమునూ తనవెంట కొనిపోడు, ఏ: తనవెంటవచ్చు గరుత్మంతుని ఆదరించడు. తన తలవెంట్రుకలు చెదిరిపోగా వాటిని చక్కబెట్టుకోడు చిన్న వాగ్వాదంవచ్చి లక్ష్మీదేవి పైట చెంగులాగినవాడు అదితన చేతితో పట్టుకొని వదలకుండానే ఆ గజేంద్రుని రక్షించుటకు సిద్ధపడెను.
ఈ విధముగా భక్తజనుల నాదుకొనుటయే దీక్షగా గల శ్రీమన్నారాయణుడు సర్వప్రాణులను శరణన్న రక్షించుటే వ్రతముగా గలవాడగుటచే, ప్రాణికోటి హృదయకమల నివాసియగుటచే, ఆకరిరాజుదీనాలాపన ఆలకించినవాడై లక్ష్మీదేవితో సరస సంభాషణకునూ స్వస్తి చెప్పి గంజేంద్రుని కాపాడుటకు మనస్సున నిశ్చయించుకొని గరుత్మంతుని కోసం నిరీక్షించేపాటి సమయం కూడా వృధా చేయక ఆకసమునకెగిరెను.
అప్పుడు శంఖచక్రాది ఆయుధములకు గరుత్మంతునికి, చివరికి శ్రీదేవికి కూడా ఏం చేయాలో తోచక వినువీధీలో శ్రీహరిని అనుసరిస్తూ వారు కూడా ఎగురుతూ అనుసరించారు. ఆదృశ్యం వినువీధిలో మున్నెన్నడూ జూడని అపురూప దృశ్యం. శ్రీహరివెంట లక్ష్మీ, ఆమెవెంట అంతఃపుర పరివారం, వారివెంట గరుత్మంతుడు, అతనివెంట శంఖ, చక్రగద, ధనస్సులు, వాటి వెంట నారదముని, ఆయనవెంట విష్వక్సేనుడూ, వైకుంఠపురంలోని పిల్లాపాప గోగణాలు కూడా ఆ దేవుని అనుసరిస్తూ వచ్చాయి. పదునాలుగు భువనాలలో ఎవరూ మునుపు ఈదృశ్యం చూడలేదు.
ఆ లక్ష్మీదేవి ముఖకమలము నుండి స్రవించు పూదేనెను త్రాగుటకై తుమ్మెదలు మోముపై వ్రాలగా తనపైట కొంగు విడిచి పెట్టక శ్రీహరి మఱపుచే గుంజుతూ పోవుచుండగా ఆతనిని వెంబడించి పోవుచూ శ్రీదేవి ఇట్లు తలచింది.
శ్రీమన్నారాయణుడు ఎక్కడికి పోవుచున్నాడో చెప్పడు. దిక్కునెరుగని ఏ స్త్రీలు నాధా మమ్ము రక్షించు అనిపిలిచిన వారి మాటలు వినెనేమో, సోమకుడు వంటి రాక్షసుడెవరన్నా మరల వేదాపరహరణం చేయుచున్నాడేమో అసురులు మరల అమరావతిని ముట్టడించి ఇంద్రుణ్ణి తిరిగి పదవీచ్యుతుని గావించిరేమో, దుర్జనులు భక్తులను బాధించుచూ, ఏడిరా మీ విష్ణువును చూపించు అని వేధిస్తున్నారేమో, అని తర్జనభర్జనలలను సలుపుచు… (ఆ లక్ష్మీదేవి) తన భర్త ఏల పోవు చున్నాడో? ఎక్కడికి పోవుచున్నాడో తెలియక పోవుటచేత ఆ వివరము తెలుసు కొనుటకు, స్థానభ్రంశము నొందిన తన పయ్యెదను కూడా సరిజేసుకొనుట మఱచినదాయెను. వీడి పోయిన కొప్పును సరిదిద్ద దాయెను. వదలుగా నుండి జారుచున్న మొలనూలును బిగించుకొనదాయెను. కోటి చంద్రకాంతులీను ముఖమున నొసటి బొట్టు చెదరిపోయి, పైట చెంగుగుంజుకుని పోతున్న ప్రాణనాధుని నిలువరించలేక స్తన భారంచే వంగిన నడుముగలదైయుండెను.
తా॥ వేగముగాబోవుచున్న పతిని (ఎక్కడికి పోవుచున్నదీ) అడుగుదునా అని ఆమె తడబడెను. ఆశ్రీదేవి యొక్కజడ ముడి ఊడిపోయింది. అతడు నడుస్తున్న తన అడుగులను ఆపడు. పోనీ తనెక్కడికి పోతున్నదీ చెప్పడు. సుడిగాలిలొ విడిపోయి తన భార్య : జంటను ఆశ్రీహరి విడిచిపెట్టాడు.
తన పయ్యెదను వీడక వేగముగా బోవుచున్న పతి ననుసరించు లక్ష్మీదేవి, కారుమేఘము వెంబడి ఆకాశవీధిలో పరుగులెత్తెడి మెరుపుతీగవలె తోచినది. ఆమె యొక్క ముంగురులను జూచి తుమ్మెదలు (వాటి కాంతికి భ్రమపడి) ఆదేవి మోము నిండా మూగినవి. ఎటులనోవానిని వదలించుకుంటే, ఆమె పెదవులని దొండపండ్లని భ్రమపడి చిలుకలు వాటిని తినుటకు యత్నించినవి. వాటిని ఎట్లో వదలించుకుంటే, మందాకినీ నదియందుండు గండుమీనములు ఆ రమాదేవి నేత్రములను చలించు చేపపిల్లలని తలంచి వానిని కబళించుటకు యత్నించినవి. వాటిని ఏదోవిధముగా తరిమివేస్తే ఆమె శరీరమును లతయని భ్రమించి దానితో పోటీపడుటకు మెఱుపులు ఆకాశమునందు వరుసలు దీరినవి. ఆ మెఱుపులను గెలుచుటకై చక్రవాకము లేతెంచి, ఆదేవి కుచములను తమ వంటి పిట్టలుగా భావించి తమ పరాక్రమమును వాటిపై చూపుటకు యత్నించ సాగినవి. (ఇచ్చట భ్రాంతిమదాలంకారము విశేషముగా ఉపయోగించబడినది. జరిగిన సంఘటన మెరిసే దేహచ్ఛాయ గల లక్ష్మీదేవి నల్లని మేఘ సదృశ శరీరుడైన విష్ణువుని వెంబడి పరువులెట్టింది అని అర్థం)
ఆ ఆకాశమార్గంలో శ్రీమహావిష్ణువు పరుగెడుతున్నాడు. రాక్షసులప్రాణములను కడతేర్చువాడును, దయాసాగరుడును, యోగీంద్రులహృదయ మందు స్థిరంగా నివసించువాడును, తనభక్తులకు గూడ మహిమలు గల్పించువాడును, తన ఆశ్రితుల తప్పిదములను మన్నించు వాడునూ, సర్వకాలములయందును నూతన వధువు వలె అలంకరించుకోనువాడును అయిన ఆ విష్ణుమూర్తి ఆకాశమార్గమున ఆ కరిని బ్రోచుటకు అరుదెంచుచుండెను.
ఈ విధముగా పోవుచున్న విష్ణుని జూచి ఆకాశమార్గమున వేల్పులందరూ మూకగా గుమ్మిగూడి “అదిగో విష్ణువు వచ్చుచున్నాడు. అదిగో! లక్ష్మీదేవి అతని వెంబడి వచ్చుచున్నది. అదిగో పాంచజన్యము యొక్క గంభీరమైన ధ్వని ఎంత గొప్పగా వినబడుచున్నది! అదిగో! సుదర్శన చక్రము ఎంత అద్భుతంగా కనబడుచున్నది. అదిగో! వాటి వెంట అతి వేగముగా అరుదెంచుచున్న గరుత్మంతుడు అని చెప్పుకొనుచు ఆ గజేంద్రుని కాపాడుటకు పోవుచున్న ఆ చక్రియైన ఆవిష్ణువునకు ‘ఓం నమో నారాయణాయ’ యని కీర్తించుచున్నారు.
అట్లు దేవతలు కీర్తించుచున్న వారైయుండగా గజరాజును రక్షించుటయే తన పనియని పరుగిడుచున్న విష్ణువు వేల్పుల నమస్కారములను సైతము స్వీకరింపక మనోవేగమునకు సాటియగు వేగము గలవాడై చాల దూరము పోయి, కొంత దవ్వున శింశుమార చక్రమును దలపించు ఒక కొలనును గాంచెను.
(ఆ కొలనులో గొప్ప మొసళ్ళు, ఎండ్రకాయలు, చేపల జంటలు కలవు. శింశుమార చక్రమున గురు, మకర, కర్కాటక, మీన, మిథున రాశులున్నవి అని భావము). ఆ కొలను కుబేరుని కోశగారమును తలపింపజేయుచున్నది. దానివలె స్వచ్ఛ వరకచ్ఛపములతో భాగ్యవంతుని కోశాగార భాగ్యధేయము వలె పరాగ జీవనంబై యున్నది. (ఆ కొలనులో తెల్లని తాబేళ్ళతో, విరజిమ్మబడిన పుప్పొడితోనూ ఉ న్నదనియు, కుబేరుని భాండాగారము వరకచ్ఛపములు అను పేరుగల నిధులతో ఉన్నది). ఆ కొలను వైకుంఠ పట్టణమువలె నున్నది. (వైకుంఠపురమున పాంచజన్యము అను శంఖము, సుదర్శనమనెడి చక్రము, కమల అనబడు లక్ష్మీదేవి ఉన్నాయి. కొలనులో శంకువులు, చక్రవాకపక్షులు, పద్మములు గలవు). పరస్పరము వైరిభావముగల కరి, మకరములు సంఘర్షణ జరుపుచు కరి దైవప్రార్థనము నందు, మొసలి శత్రు నిర్మూలనా వ్యూహమందు (సంసార తాపత్రయముతో) సతమత మగుచున్నారు. మకరి వలెనుండు వారికి నశించుట తిరుగులేని విధి. ఇట్టి ఆ తామరకొలనును విష్ణుమూర్తి తిలకించెను.
బాధజెందు వారి కష్టములను జూచి ఓర్వలేని దయాళు వైన నారాయణుడు ఆ మకరమును ఖండింప దలంచి, వేగముగా బోవునదియు, భూమండలమునంతయూ కదిలించ గలిగినదియు, సూర్యుని కంటే ఎక్కువ కాంతి గలిగిన మిణుగురులను రాల్చునదియు, పదునాలుగు భువనములలో గల బ్రహ్మాండమునందు అడ్డము లేక వ్యాపించునట్టిదియు, వేల్పుల నందరిని వారి శత్రువులనుండి రక్షించునదియునైన తన సుదర్శన చక్రాయుధమును బంపెను.
ఆ సుదర్శన చక్రము ఆ తామర కొలనులో నళినీ కాంతతో గూడి, కౌగిలించి, జలక్రీడలాడుచు యధేచ్ఛగా ఆ పూబాలకు ప్రీతి సలుపుట కేతెంచిన వేడివెలుగుల సూర్యుడను పురుషుడా అన్నట్లున్నది. ఆ సుదర్శన చక్రము గుభిల్ుభిల్లను ధ్వనితో ఆ కొలనంతయూ క్రుంగిపోవునట్లు లోపలికి ప్రవేశించి, క్రూరమైన ఆ మగమొసలి యున్న చోటికి బోయి మనోవేగమును బోలు వేగము గలదై…
ఆ సుదర్శన చక్రము అతి భయంకరంగా, బంగారు కాంతులు ప్రదర్శిస్తూ, భీతిచేత మనస్సులో అనేక విధముల ప్రార్థించుచున్న గజేంద్రుని నిలిపిరక్షించగా, కామక్రోధములతో నిండినదై మంచియత్నము ఆచక్రము చేయగ రక్తములు చిందెను. ఆ విష్ణువు ఆ దుర్మార్గమొందిన మొసలి శిరస్సును ఖండించెను. ఈ విధముగా ఒక్క వేటున ఆ సుదర్శన చక్రము ఆమకరి యొక్క శిరచ్ఛేదనముగావించెను.
ఆ వెంటనే ఒక మకరము రాశిచక్రమును జేరెను. (మకరరాశి) ఒకమకరము కుబేరుని బొక్కసమునదాగెను. ఆమకరాలయంబున (కొలనుయందు) సంచరించు తక్కిన మకరములు ఆదికూర్మము యొక్క మరుగున జొచ్చెను. అనగా విష్ణువునే శరణువేడెననవి భావము. (చమత్కారము గమనించిన ఇది అతిశయోక్తి, సూర్యుని వద్దను, కుబేరుని వద్దను, కూర్మముల వద్దను ఉన్న రాశి, ధన, సహచర రూపమకరములన్నియూ, ఇచ్చటివేనని అభిప్రాయము)
రాహువు మ్రింగబడి విడిచిపెట్టబడిన చంద్రుని వలె, సంసారమున జిక్కియల్లాడి విముక్తుడయిన విరాగివలె ఆ గజేంద్రుడు మొసలి బారి నుంచి తప్పించుకుని, కాళ్ళు విదిలించి దిగ్గజేంద్రముల రాణులయిన ఆశకరిణి మొదలయిన వారు తమ తొండములతో జిమ్మిన చల్లని జలములయందు సేదదీరి మిక్కిలి అందముతో ప్రకాశించెను.
అప్పుడు విష్ణుమూర్తి క్షీరసాగరమున బుట్టినదియు, తన గొప్పధ్వనిచే భూతములనన్నింటినీ కదలించు నదియునూ, తెల్లనైన తన తేజస్సుతో ఇంద్రాదులను సైతము భయపెట్టగలిగినదియు, భక్తుల ఆపదలు బాపు నట్టిదియు, శత్రుసేనలనుదిక్కులందు దరిమిగొట్ట గలదియు యైన తన పాంచజన్య శంఖమును పూరించెను. శ్రీమహావిష్ణువు శంఖము పూరించు నప్పుడు దేవదుందుంభులు మ్రోగెను. మంద మారుతము తామరపూల వాసనతో మిళితమై వీచెను. ముసురు పట్టి పుష్పవర్షము కురిసెను. వేడుకతో అప్సరసలు నృత్యములను సలిపిరి. అన్నివైపులా జయజయ ధ్వానములు మారు మ్రోగెను.
సముద్రుడనెడి పురుషుడు తన అలలు అనెడి చేతులతో ఆకాశగంగ అనెడి లలనా రత్నము యొక్క ముఖమును ముద్దాడ నాసించుచున్నాడా అన్నట్లు సముద్రుడు మిన్ను ముట్టు అలలను పైకి విస్తరింప జేసెను. (శుకమహర్షి ఇట్లునుచున్నాడు) ఓ పరీక్షిన్మహారాజా! విష్ణువు తన పొడవైన చేతితో నా కరిరాజును మడుగునుండి మెల్లగా బయటకు తీసి, దానిమదజల మరకలను శుభ్రపడునట్లు తుడిచి, వీపునమెల్లగా చరచి దాని భయమును తొలగించెను.
అట్లు విష్ణువు గజేంద్రుని భయమును నిర్మూలించగానే ఆ కరిరాజు దేహము యొక్క బడలిక విడిచిపెట్టి ఆడ ఏనుగులతో జేరి ఎక్కువ మక్కువతో శ్రోతల వీనులకు విందుగా ఘీంకారము చేసెను. గజేంద్రుడు ఆ విధముగా శ్రీహరి దయచే బ్రతికి వచ్చుట జూచి ఆడ ఏనుగులన్నియు మహానురాగము గలవై దానిని జుట్టుకొని తమ తొండములతో దొండములను బెనవైచికొనినవి.
ఓ పరీక్షిన్మహారాజా! తొల్లి దేవల మహర్షి శాపముచే మొసలి రూపంబునొందిన ‘హూహూ’ అని పిలవుబడు గంధర్వుడు నేడు విష్ణు చక్రంబుచే సంహరించబడి శాపవిముక్తుడై పూర్వరూపము దాల్చి నాశరహితుడగు నారాయణుని అధికమైన భక్తితో మ్రొక్కి పట్టుదలతో విష్ణుని బాగుగా కీర్తించి భగవన్నామ సంకీర్తనము జేయుచు తన పాపంబుల నెల్ల ప్రక్షాళనము గావించుకొని తన గంధర్వరూపమును తిరిగి బొందుటచే గంధర్వలోకము జేరెను. అప్పుడా గజేంద్రుని శ్రీహరి తన చేతితో తాకి, ఆ కరి అవిద్యనశించి విష్ణురూపియై వెలుగొందుచుండెను. ఆ విధంగా కరిమోక్షమెందెను.
ఓ పరీక్షిన్మహారాజా! మకరముతో బోరు సలిపి పలు ఇక్కట్లు పాలయిన గజేంద్రుని పూర్వజన్మ వృత్తాంతమును తెలిపెదను వినుము. అతను గత జన్మంబున ఇంద్రద్యుమ్నుడను రాజు. గొప్ప విష్ణుభక్తుడూ అతడొక్క కొండకొనపై కూర్చుండి మౌనవ్రతుండై సర్వేశ్వరుడగు నారాయణమూర్తి ధ్యానములో ఆతని పూజయందు నిమగ్నుడైయుండెను.
మౌనవ్రతుడై నిశ్చల చిత్తుడైయున్న ఆ ఇంద్రద్యుమ్నుని జూచి ఆగస్త్యమహాముని అతని సమీపంబున కొచ్చి, తనను చూచి వందన పూర్వకముగా నిలువబడని అతనిపై ఆగ్రహించి మునులకు అతిథి సత్కారముగాని, మన్ననగాని చేయకమదపుటేనుగు వలె ప్రవర్తించిన నీవు అడవిలో ఏనుగువై బలగర్వముతో అజ్ఞానిపై జీవింపుము అని శపించెను. స్వతహా బుద్ధిమంతుడైనప్పటికీ, ఆగస్త్యుని వంటి బ్రాహ్మణుని అవమానించిన ఫలితంగా అడవిమృగమైన కరిజన్మనొందెను. ఓరాజా! తపస్సే జీవనంగా జీవించే బ్రాహ్మణులను ఏనాడు అవమానపరచరాదు. అట్లుచేసిన ఫలితములు ప్రమాదకరముగా నుండునని గ్రహింపుము.
ఆతని విష్ణుభక్తి విశేషముచే ఏనుగులకు రాజై గొప్పబలవంతు డాయెను. ఆరాజ పరివారంకూడా ఏనుగు జన్మలనే బొందిరి. ఈ విధముగా కరిజన్మమునకూడ విష్ణు ధ్యానము మానక ఆయన కటాక్షము చేత శాశ్వత మోక్షప్రాప్తినొందెను.
నేల విడిచి కత్తిసాము చేయుట యెంత ప్రమాదమో నరులకు తమ కర్తవ్యము వదలి అన్యధర్మముల నాశ్రయించుటయూ అంత అపాయకరమే. ఇహపరములను రెంటినీ దలచుచు సమముగా వర్తించవలెను. అదియే భగవంతుని సంతోషపెట్టును. ఒక చిన్న తప్పిదమువల్ల ఇంద్రద్యుమ్నుడంతటి ఉత్తముడు మృగజన్మము నెత్తిననూ ఆ పరమాత్మకృప అతని వెంట సదా నీడలా ఉన్నది. కనుకనే భగవంతుని ప్రార్థించ గలిగి ముక్తుడైనాడు. ఇంద్రద్యుమ్నునిగా సాధించలేనిది కరీంద్రునిగా సాధించగలిగాడు. కర్మఫలం క్షీణించవలెనంటే విష్ణు భక్తి అత్యావశ్యకము. గర్వము మొదలైన చెడు గుణములను తొలగించి ఆ భక్తి సన్మార్గంలో నడుపుతుంది. చిన్న విత్తనంగా నాటబడిన విష్ణుప్రియత్వం భక్తి అనే గొప్ప వటవృక్షమై కాపాడుతుంది.
భగవద్భక్తి లేని అల్పబుద్ధులకు ఏనుగులు, గుర్రములు, ధనములు, వంటి భోగములు నశించిపోవును. తన సతీ సుతులు చెడిపాడై పోయెదరు. సుగుణవంతులైన వారికి పై జెప్పిన భోగములన్నీ జీవితకాలమున కలుగుటయే గాక చెడని వస్తువైన విష్ణు భక్తి కలిగి, అధికమై ముక్తి అప్పుడు జగన్నాయకుడైన ఆ పరమేశ్వరుడు (శ్రీమహావిష్ణువు) గజేంద్రుని శాప విమోచనా వృత్తాంతమంతయు పద్మముఖియైన లక్ష్మీదేవి కెరింగించి, ఆమెతో ఇట్లనెను. ఓ పద్మముఖీ! నీవు నావెంబడివచ్చు నప్పుడు నీ పైట కూడా నా చేత బట్టుకొని వదలకుండా ఈడ్చుకొని పోవుచున్న నన్ను జూచి ఏమనుకొంటివి? దేవి!
ఆ॥ మఱతు వారి నేను మఱచిన నను వారు
మఱువబోను నన్ను మఱువకున్న
మొఱలు బాపి కాతు మొఱలెరుంగక గొల్వ
పరిగణించి నన్ను పరమ గతిగ
(పోతన గారి ‘ఏఱుగుదు దెఱువా…’ ఆధారంగా)
తా॥ ఓదేవీ! నన్ను మఱచిన వారిని నేను మఱతును. నన్ను మఱువని వారిని నేను మఱువను. కపటములేక నన్నే పరమగతిగ యెంచిన వారి దుఃఖములను తొలగించి రక్షించెదను.
అట్లు విష్ణుమూర్తి పలికిన పలుకుల నాలకించి కమల నివాసినియైన లక్ష్మీదేవి చిరునవ్వుతో నిట్లనియె. సకలలోక నాయకుడవైన ఓ ప్రాణేశ్వరా! తమరి దివ్యపాదారవిందములను నామనంబున నిలుపుకొని ధ్యానించుటకంటే నాకు వేరేపని ఏముండును? కావున అసంకల్పితముగా నిన్ననుసరించితిని గాని వేరేమి కాదు.
స్వామి! దు:ఖితుల ఆర్తిని దీర్చుటకు వారికి లోబడి వారి మొరలనువిని వారి ఆపదలను దొలగించి వారిని కాపాడి. వారిచే కీర్తించబడెదవు. నీకు తప్ప అన్యులకు, దీనులను కాపాడుట సాధ్యము కాదు.
ఆ శ్రీ లక్ష్మీదేవి ముందు చెప్పిన మాటలే గాక యింకను ఎన్నియో తగు మాటలు మాట్లాడి ప్రేమ తొణికిస లాడు చూపులతో పతిని వీక్షించగా ఆమెను కౌగిలించి శ్రీహరి, నారద, విష్వక్సేన సహితమౌ పరివారము వెంట రాగా సతితో గరుత్మంతు నధిరోహించి వైకుంఠమున కేగెను. ఈప్రకారంబు గజేంద్రుని వృత్తాంతము నెరింగించి, ఇంకను ఇట్లననెను. ఓ పరీక్షిన్మహారాజా! నీకు నేను వినిపించిన శ్రీకృష్ణుని మహిమను దెలిపెడి గజేంద్ర మోక్షము కథ వినువారికి నెక్కువ కీర్తికలుగును. ఈ గజేంద్ర మోక్షము పాపంబుల నన్నింటిని పోగొట్టి మేలుజేయును. ఈ కథను విన్నవారికి దుస్స్వప్నములు రావు. దిగులు, ఆరాటములు నశించును.
ప్రతిదినము వేకువ జామున మేల్కొని పరిశుద్ధ మనస్కులై దీనిని పఠించిన విప్రులకు, పండితులకు సకలైశ్వర్యములు కలుగును. సకలవ్యాధులును నెమ్మళించును. సకల సౌఖ్యములు కలుగును. మేలుపొందును. ఇక తనువు చాలించిన పిదప మోక్షసిద్ధి తధ్యము. సకలానందములు కలుగును, అని శ్రీమహావిష్ణువు సంతోష పూర్వకముగా నానతిచ్చెను. గజేంద్రునిబోలిన నాభక్తులకు నాలుగు విధములైన మోక్షముల నిచ్చెదను.
ఆపైన హృషీకేశుడయిన శ్రీహరి గజేంద్రునికి మోక్షము నిప్పించిన ఈ కొలను అనిన నాకెంతో ప్రీతి. త్రిమూర్తుల మయిన బ్రహ్మ, శంకరుడు, నేనునూ విహరించెదము. అనిచెప్పి పక్షిణేడు గరుత్మంతునిపై శ్రీలక్ష్మి నారాయణుడు వైకుంఠము జేరెను, అని శుకమహార్షి పరీక్షిన్మహారాజు కిట్లనియె ఈ గజేంద్ర మోక్షమును శ్రద్ధగా పఠించినా, వినినా ఇహలోకంబున శ్రీహరి గజ, తురగ, రథములు మొదలైన వాహన సౌఖ్యము కలుగు జేయును. అంత్యకాలమున నారాయణుని నామము బలుకు శక్తినొసంగును.
ఇది మహాకవి బమ్మెర పోతనామాత్యునిచే రచించబడిన శ్రీమత్ భాగవతములోని నవమస్కందమున నున్న గజేంద్రమోక్షమను ఉపాఖ్యానము ననుసరించి సరళ తెలుగు వచనములో కీ॥శే॥ అలమరవాది రామకృష్ణయ్య, సుబ్బమ్మ గార్ల పుత్రుడైన సుబ్రహ్మణ్య దీక్షితులచే శ్రీమన్నారాయణుని కృపా భాగ్యప్రాప్తిచే వ్రాయబడిన కృతి.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
పెద్దలు చెప్పిన నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… సత్సాంగత్యము నీతికథ.
సత్సాంగత్యము
దేవర్షి అయిన నారదడు సాక్షాత్ శ్రీమహావిష్ణువు యొక్క అవతారరూపుడు. అందుకనే యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు “దే పర్షీణాంచ నారదః” అని అన్నాడు. అట్టి మహనీయుడైన నారదుడు ఒకసారి శ్రీకృష్ణుని దర్శించుటకై వచ్చి దండప్రణామములు చేసి “భగవాన్! సత్సాంగత్యము యొక్క ఫలము దయచేసి వివరముగా చెప్పండి” అని కోరినాడు. జగద్గురువైన శ్రీకృష్ణుడు సత్సాంగత్య మహిమ అనుభవపూర్వకముగా నే నారదునికి తెలియచేయాలని సంకల్పించి “నీవు తూర్పువైపుగా వెళితే ఒక వెంటకుప్ప కనిపిస్తుంది. అందులో ఉన్న పేడపురుగును సత్సాంగత్య మహిమేమని ప్రశ్నించు” అని చెప్పి జగన్మోహనముగా చిరునవ్వునవ్వాడు.
పరమాత్మ ఆదేశానుసారమే చేశాడు నారదుడు. నరద మహర్షి ప్రశ్న అడిగాడోలేదో గిలగిలలాడూతూ ప్రాణాలు విడిచింది ఆ పేడపురుగు. ఇలా జరిగిందేమని దుఃఖిస్తూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి జరిగినదంతా విన్నవించుకొన్నాడు నారదుడు. జరిగినది విని జగన్నాటక సూత్రధారి ఇలా అన్నాడు. “ఇప్పుడు పశ్చిమదిశగా వెళ్ళు. ఒక పాడుపడిన దేవాలయము అందులో నివసిస్తున్న పావురము కనిపిస్తాయి. నీ సందేహమును అది తీర్చగలదేమో చూడు”. వెంటనే బయలుదేరి పావురమును కలుసుకొని తన ప్రశ్నవేశాడు నారదుడు.
అదేమి చిత్రమో ఆ కపోతము నారద మహర్షి పాదలమీద పడి ప్రాణాలు విడిచింది. “ఇది ఏమి వింత? ఇంకా ఎన్ని విధాల ఆ భగవంతుడు నన్ను పరీక్షించదలచాడో?” అని చింతిస్తూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి జరిగినది విన్నవించుకొన్నాడు. “అలా జరిగిందా నారదా? అయితే ఈ సారి ఉత్తర దిక్కుగా వెళ్ళు. అక్కడి సంస్థానములోని మహారాజుకు చక్కని మగశిశువును పుట్టాడు. నీ సందేహమును ఆ శిశువు తీర్చగలదు” అని చెప్పి చిరునవ్వులొలకబోసాడు లీలామానుషవిగ్రహుడైన నందనందనుడు.
మొదటి రెండు మార్లు జరిగినది తలచుకొని కొంచెం సంకోచించాడు నారదుడు. సర్వజ్ఞుడైన స్వామి అది గమనించి “నారదా! నిర్భయముగా వెళ్ళు. ఈ సారి అంతా శుభమే జరుగుతుంది” అని ఆశీర్వదించాడు. వెంటనే నారదుడు బయలుదేరి ఆ శిశువు వద్దకు వచ్చి “ఓ పాపాయి! మహాత్ముల సాంగత్యము వలన కలిగే ప్రయోజనమేమిటి?” అని ప్రశ్నించాడు. నారదుడు ప్రశ్నించిన మరుక్షణం ఆ పసిపాప ఒక దేవత గా మారిపోయి భగవత్స్వరూపుడైన నారదునికి యథావిధిగా ప్రణమిల్లి ఆశ్చర్యముగా చూస్తున్న నారదునితో “దేవర్షి! అలా ఆశ్చర్య పోతున్నారేమిటి ? పెంటకుప్పలోనున్న పేడపురుగును నేనే.
అప్పుడు నా జన్మజన్మాంతరాల పుణ్యఫలము వలన అమోఘమైన మీ దర్శన భాగ్యము నాకు కలిగినది. మీవంటి దివ్యపురుషుల సందర్శన మాత్రముచే నాకు పావురము యొక్క జన్మ లభించినది. ఆ జన్మలో కూడా మీ దర్శనభాగ్యము లభించుటచే రాజపుత్రునిగా జన్మించినాను. మరల ఈ జన్మలో మీ దుర్లభ దర్శనము కలిగినందు వలన నాకు దైవత్వము లభించినది. మహాత్ముల సాంగత్యము యొక్క మహిమ ఇంతటిది!” అని అంటూ దేవలోకానికి వెళ్ళిపోయాడు.
అని ఉపదేశించినారు. అంటే జీవన్ముక్తికి ప్రథమ సోపానము సత్సంగత్యము. రాజకుమారుడు చెప్పినట్టు ఆ సత్సంగత్యము పురాకృతపుణ్యము వలన కలుగును. కాబట్టి మనకు మంచిపనులు చేస్తేనే సత్పురుషుల సాంగత్యము తద్వారా జీవన్ముక్తి కలుగుతాయి. ఈ కారణముగానే ఇంద్రునిచే శాపగ్రస్తుడైన యయాతి (యయాతి కథ చూడండి) కూడా కనీసం తనను సత్పురుషుల సాంగత్యములో ఉండనివ్వమని ప్రార్థించి సద్భువనములో ఉండుటకు దేవేంద్రుని వద్ద వరం పొంది తరించాడు. కనుక మనము ఎల్లప్పుడూ మంచివారితో ఉండి వారినుండి మంచిని గ్రహించి తరించాలి. దుష్టులకు ఎల్లప్పుడూ దూరముగా ఉండాలి.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు అర్థనారీశ్వర స్తోత్రమ్గురించి తెలుసుకుందాం…
కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో లంపుగుబ్బ గొల్లెతల లంజకాఁడ నీ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
లంపుగుబ్బ గొల్లెతల లంజకాఁడ నీ – అన్నమయ్య కీర్తనలు
సంపుటి : 6
కీర్తన : లంపుగుబ్బ గొల్లెతల లంజకాఁడ నీ
సంఖ్య : 127
పుట : 92
రాగం : ఆహిరి
ఆహిరి
29 లంపుగుబ్బ గొల్లెతల లంజకాఁడ నీ
యింపులే వెదకంబట్టీ నెట్లరా వోరి!
||పల్లవి||
చెప్పరానివేడుకల సిగ్గులనే నిన్నాళ్లు
ఉప్పతిల్లుం గోరికల నుంటిం గాని
ఇప్పు డింతనిలువలే నేమిసేతు నీచిత్త
మెప్పుడు గాని రాదో యెట్లరా వోరి
||లంపు||
చిల్లర సింగారాలు చెలులు సేయఁగ నేను
వొల్లనని యిన్నాళ్లు నుంటిం గాని
మల్లెపూవువంటి నన్ను మాసినచీరతోడ
నిల్లు వెళ్లకుండఁ జేసి తెట్లరా వోరి!
||లంపు||
కమ్మనిపానుపున నీకౌఁగిటిలో నిన్నాళ్లు
ఉమ్మగింపుమేనితో నుంటిం గాని
దిమ్మరిసేఁతలతోడి తిరువేంకటేశ! నీ
యెమ్మె లింకా మానలే వెట్లరా వోరి.
||లంపు||
అవతారిక:
జానపద బాణీలో సాగే గొల్లెతల సరస శృంగార కీర్తన వినిపిస్తున్నారు. అన్నమాచార్యులవారు. అతిశయించిన మమకారంతో నాయిక నిందిస్తుంటుంది, చనువుగా. అన్నమయ్య కాలంలో జానపదులు వాడిన కొన్ని మాటలు నేటి నిఘంటువులలో లభించుటలేదు. ఉదాహరణకి “లంపు గుబ్బ గొల్లెత” “లంపు” అంటే “దొంగమేత”, “గుబ్బలు” అంటే స్తనములు. దీనికి సమన్వయమెట్లా సాధ్యం. 600 ఏళ్ళక్రితం జానపదుల వాడుక భాషలో “లంబము” అనే మాటను “లంపు” అనేవారేమో. ఆ మాటకు దీర్ఘమైన లేక పొడవాటి అని అర్థం. అదండీ సంగతి ‘లంజకాడు’ అంటే ‘విటుడు’ అని ప్రతిపదార్థ వివరణ కావాలనే త్యజించుట క్షంతవ్యము.
ఓరీ!! చెప్పశక్యంకాని కోరికలు ఉప్పతిల్లినా (చెలరేగినా) నేను సిగ్గుచే చితికియున్నాను. కాని ఇప్పుడింక నిలువరింపనసాధ్యమై పోవుచున్నది. నేనేమి సేయ గలనురా? నీకు నాపై మనస్సెప్పుడు పుడుతుందో చెప్పలేం. ఇట్లా అయితే యెట్టారా? (యెలాగునరా!)
ఓరీ!! నా చెలికత్తెలు ఇంతకాలమూ నేను నీ కంటికి నదురుగా వుండాలని యేవేవో చిల్లర సింగారాలు (సామాన్యమైన అలంకరణులు) చేసేవారు. నేను కూడా వాటిని వొల్లనని (వద్దని) తిరస్కరించేదాన్ని. కానీ నీకోసం పడిగాపులు కాసీ కాసీ, మల్లెపూవువంటి నన్ను మాసిన చీరెతో ఇంటికి అంటిపెట్టుకొని పోయేట్లు చేశావు కదరా! ఇట్లా అయితే యెరా?
ఓరీ! నీ కమ్మని పాన్పుపై (మధురమైన శయ్యపై) నీ సందిట, వుమ్మగింపుమేనితో (తెళ్ళు దేహంతో వున్నాను. కానీ ఓ తిరుమల నాయకా! నీ దిమ్మర సేతల (మత్తులో ముంచే నీ చిలిపి సేతలతో) నీ యెమ్మెలు మానవు (విలాసవంతమైన సయ్యాటలను వదలవు). నీతో యెట్టారా?
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమద్భాగవతము నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… సంతృప్తిని మించిన సంపద లేదు.
సంతృప్తిని మించిన సంపద లేదు
సుదాముడు శ్రీ కృష్ణ పరమాత్మకు బాల్యస్నేహితుడు సహాధ్యాయి. ఈతడు భూసురోత్తముడు విరాగి బ్రహ్మవేత్త జితేంద్రియుడు ఉత్తముడు అన్నిటినీ మించి శ్రీ కృష్ణునికి ఆప్తుడు. కాని సుదాముడు చాలా బీదవాడు. చినిగిన బట్టలు కట్టుటచే ఈతనికి కుచేలుడన్న పేరువచ్చెను. అయిననూ కుచేలుడెన్నడూ తనకు ధనములేదని విచారించలేదు. దీనునివలె యాచనచేయలేదు. దైవప్రేరణచే తనకు కలిగినదానితో సుఖముగా జీవించుచుండెను. సదా బ్రహ్మనిష్ఠ యందుండెడివాడు. సంతృప్తి లేని యెంత ధనవంతుడైననూ దరిద్రుడని సంతృప్తి ఉన్న ఎంత బీదవాడైననూ ధనవంతుడే అనిన సత్యమెఱిగినవాడు.
సుదాముని సతి వామాక్షి. ఈమె పతివ్రతాశిరోమణి. అర్థాంగి అన్న పేరు సార్థకం చేసుకొన్నది. ఒకనాడు సుదామునితో ఇట్లాఅన్నది “నాథా! అవంతీపురమున పరమాత్మ మీరు సాందీప మహర్షి వద్ద సహాధ్యాయులు. శ్రీ కృష్ణస్వామి మీకు ఆప్తులు కూడా. పరమాత్ముని దర్శించిన వారికి సకల క్లేశములు తొలగును కాదా. ఒక పర్యాయము ఆయన కడకు వెళ్ళిరాకూడదా?” అని ఆవేదనను వ్యక్తపఱచినది. తన అర్థాంగి చెప్పిన హితవాక్యాలు విని సుదాముడు “వామాక్షీ! ఆ పరంధాముని దర్శనము నాకు లభించునా? అయిననూ ఫలాపేక్షరహిత చిత్తముతో ఆ భగవానుని దర్శనమునకు పోయెదను. మన హితము ఆ సర్వజ్ఞుడే చూసుకొంటాడు. నేనును నా స్నేహితున్ని చూడాలని చాలా రోజులగా అనుకొంటున్నాను. దైవసన్నిధికి ఏగునపుడు రిక్తహస్తాలతో పోరాదు. నాలుగుగుప్పెళ్లు అటుకులు దొరకునేమో చూచి రమ్ము”. వామాక్షి భర్త అంగవస్త్రంలో అటుకులు కట్టి పంపింది.
పరమాత్మ దర్శనానికి ఉవ్విళులూరుతూ సుదాముడు త్వర త్వరగా నడచి ద్వారకను చేరెను. శ్రీ కృష్ణుడే మందిరములో నున్నాడ ని ద్వారపాలకులను ప్రశ్నించెను. వారు అన్ని మందిరములలో నుండునని చెప్పిరి. పదహారు వేలయెమినిది మంది భార్యలున్నాకూడా ప్రతి ఇల్లాలి మందిరంలో తానే ఉండి శ్రీ రామావతారంలోని ఏకపత్నీవ్రతం అనే ఆదర్శాన్ని నిజం చేసిన శ్రీ కృష్ణస్వామి లీలకు వందనం చేసి సుదాముడు ఒక అంతఃపురం వద్దకొచ్చాడు. అది రుక్మిణీ దేవి మందిరం. సుదాముడు వచ్చాడని తెలియగానే శ్రీ కృష్ణుడు పరుగెత్తి సింహద్వారము కడకేగి ఆనందపారవశ్యంతో సుదాముని కౌగిలించుకొనెను. ఇరువురి కన్నులనిండా ఆనందభాష్పాలు జాలువారాయి. శ్రీ కృష్ణుడు సుదాముని హస్తం పుచ్చుకుని స్వయంగా అంతఃపురం లోనికి తీసుకు వెళ్ళాడు.
రుక్మిణీ దేవి స్వర్ణకలశముతో పవిత్రోదకం తెచ్చింది. శ్రీ కృష్ణుడు తన హస్తములతో సుదాముని పాదములు కడిగి ఆ నీళ్ళు తన శిరమున చల్లుకొన్నాడు. “అతిథి దేవోభవ” అని లోకానికి చాటడానికి శ్రీకృష్ణుడలా చేసెను. అది చూచినవారంతా ఆ జలమును తమ శిరముల పై చల్లుకొన్నారు. ఆ తరువాత శ్రీ కృష్ణుడు తన పర్యంకంపై సుదాముని కూర్చుండబెట్టి యథావిధి అతిథి సత్కారము చేసెను. మృష్టాన్నములతో భోజనము పెట్టెను. పరమాత్మ తనకు సేవ చేయుట చూడలేక సుదాముడు శ్రీ కృష్ణ స్తుతి చేసెను. తరువాత ఎంతోసేపు వారు ప్రియభాషణములాడిరి. శ్రీకృష్ణుడు సుదాముడు తెచ్చిన అటుకులు తిని “ఇట్టి అటుకులు నా చిన్నతనమున మా అమ్మ నాకు తినిపించేది. మరల ఇప్పుడే తినుట” అని అన్నాడు. మఱునాడు సుదాముడు తన గృహమునకు మఱలెను. శ్రీ కృష్ణుడు సుదామునికి ఘనముగా వీడ్కోలిచ్చెను.
సుదాముడు ఎంత కష్టాలలో ఉన్నా తనను ఏమీ అడుగకుండా వెళిపోవటం చూసి శ్రీ కృష్ణుడు సుదాముని సంతృప్తికి భక్తికి మెచ్చి సుదామునికి అనంత సంపదనిచ్చెను. సుదాముడు దారి అంతా శ్రీ కృష్ణుని తలచుకుంటూ తన ఇల్లు చేరెను. శ్రీ కృష్ణుని దయవల్ల తనకు సకల సంపదలు వచ్చెనని తెలుసుకొనెను. సుదాముడు వామాక్షి ఆ సంపద తమదికాదని తలచి బీదసాదలకు దానములు చేసిరి. ఎన్నెన్ని దానములు చేసినా ఆ అనంతనిధి కరఁగలేదు. అలా అనంత పుణ్యాన్ని ఆర్జించి ఆ దంపతులు కడకు కైవల్యమును పొందిరి.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:
సంతృప్తి లేనివాని జీవనం దుఃఖమయం. సంతృప్తి ఉన్న ఎంత బీదవాడైనా ధవవంతుడే. అడిగే అవకాశమున్నా తనకున్నదానితో తృప్తిగా ఉన్న సుదాముని మెచ్చి శ్రీ కృష్ణపరమాత్మ సుదామదంపతులకి మోక్షాన్ని ప్రసాదించాడు.
స్నేహం యొక్క ఔన్నత్యం ఈ కథలో మనకు బాగా తెలిసింది. ఒక సత్పురుషుని స్నేహం కన్నా ఎక్కువైన ధనం ఏదీలేదు. సుదాముడు శ్రీ కృష్ణుల స్నేహం అద్వితీయం. శ్రీకృష్ణుని చెలిమి సాటిలేని కలిమి.
ఒక అతిథి పైగా పండితుడు వచ్చినప్పుడు వానిని ఎలా సేవించాలో శ్రీ కృష్ణుడు ఈ కథలో మనకు చూపినాడు. సకల జీవరాశికి మోక్షప్రదాత అయిన శ్రీ కృష్ణుడు సుదాముని కాళ్ళుకడిగి ఆ నీళ్ళు తన నెత్తిన చల్లుకొన్నాడు.
నిష్కల్మష భక్తి ఎలావుండాలో సుదాముడు మనకు చూపినాడు. నాకే కోరికాలేదు. నాకేది మంచిదో నీకే తెలుసు అనే నమ్మకం భగవంతుని మీద ఉండాలని సుదాముడు చెప్పినాడు.
పక్కన జరాసంధు బలమెల్ల నుగ్గాడి
నిక్కము మధురనిల్పే నీచే గద
తొక్కి హిరణ్యకశిపు దునిమి ప్రహ్లాదు గాచే
నిక్కి నిక్కి మెరిసేటి నీ ఖడకగము
||మా దురిత||
వెడ రావణుని జంపి విభీషణుని గాచే
చిడుముడి పడక నీచే శాస్త్రము
యెడమీక శ్రీ వేంకటేశ నేడు నన్ను గాచె
బడిబడి నీ నామపఠన నేడిదిగో
||మా దురిత||434
అవతారిక:
ఓ శ్రీదేవివల్లభా! శ్రీవేంకటేశ్వరా! నీకు అన్ని ఆయుధాలు వున్నాయి కదా! ప్రభూ! మా పాపములను బద్దలుకొట్టి మమ్మల్ని కాపాడవయ్యా! అంటున్నారు అన్నమాచార్యులవారు. శ్రీహరి సుదర్శన చక్రము, పాంచజన్య శంఖమూ, కౌమోదకి గద నందకము అనే ఖడ్గము, శార్జము అనే ధనస్సు యెన్నెన్నో ఘనకార్యాలు చేశాయి ఇదివరలో. ఇప్పుడు ఈ కలియుగంలో మా పాపాలే మా పాలిటి రాక్షసులు. వీళ్ళని నిర్మూలించటానికి నీ ఆయుధాలతో పనిలేదు, నీ నామపఠనం చాలు. అదే బడిబడి (దృఢమైన) దై మమ్మల్ని రక్షిస్తుంది అంటున్నారు. పంబి అంటే అతిశయించి అని అర్థం.
భావ వివరణ:
శ్రీదేవీ వల్లభుడవైన ఓ శ్రీవేంకటేశ్వరా! మా దురితములు (పాపములు) వాపి (నిర్మూలించి) మమ్మున్ కాచుట (రక్షించుట) అరుదా? (అంత అపూర్వమైన విషయమా తండ్రీ!)
ఇదిగో నీచే (నీచేతిలోనున్న) ఈ పెనుచక్రము (గొప్ప సుదర్శన చక్రము) నీ భక్తుడు అంబరీష మహారాజుపై ఆగ్రహించిన దుర్వాసనికి బుద్ధిచెప్పి, పైకొన్న ఆపదలను బాపి వెంటనే రక్షించింది కదా! మరి, నీ వామహస్తముననున్న శంఖము కనిపిస్తున్నదే… దానిపేరు పాంచజన్యము. దానిధ్వని పామరుల అజ్ఞానం మాన్పి నీవైపు త్రోవచూపిస్తుంది. అదిగో అంబరాన (ఆకాశంలో) ధ్రువతారయై కాంతులు జిమ్ముతున్న నీ బాలభక్తుడు ధ్రువుని అజ్ఞానం తొలగించి, నీచేత పంబి (అతిశయించి) వున్నది.
అదిగో నీచేతిలోనున్న “గద” దానిపేరు కౌమోదకము. అది నీ శత్రువులను దంచి నుగ్గాడుతుంది (తుత్తునియలు చేస్తుంది). ఆనాడు నీపక్కలో బల్లెమువలె మాటిమాటికి మధురపై దండెత్తి నీకు చీకాకు కలిగించుచున్న కంసుని మామగారు… జరాసంధుని అనేకసార్లు బలహీనుని చేసిన పిమ్మట నీచేతిలో నిక్కము (స్ఫుటంగా) మెరయుచున్నది. అదిగో నీచేతిలో నిక్కి నిక్కి (తొంగిచూస్తూ) మెరిసే ఖడకగము (ఖడ్గము). దానిపేరు నందకము. ఆనాడు నీవు నృసింహుడవై హిరణ్యకశిపుని చీల్చి సంహరించి ప్రహ్లాదుని కాచినప్పుడు వాని అనుచరులు మూకుమ్మడిగా నీపై బడితే నీనందకం వారిని చీల్చి చెండాడినది. నేడు నీ చేతిలో మెరుస్తున్నది.
అదిగో సమీపమున నీచేత మెరయు నీ ధనస్సు. దానిపేరు శార్హము (సారంగము) అదే త్రేతాయుగంలో నీవు శ్రీరామచంద్రమూర్తివైనప్పుడు వెద (వేదించు) రావణాసురుని నిర్జించి నీ భక్తుడు విభీషణుని రక్షించి, చిడుముడి పడక (కలతపడకుండా) చేసినది. ఓ శ్రీవేంకటేశ్వరా! నేడు కలియుగంలో ఇదిగో, యెడమీ క (విశ్రాంతికూడా తీసికొనకుండా) నన్ను (నాబోటి ఆర్తులను…) బడిబడి (దృఢముగా) కాపాడుతున్న గొప్ప ఆయుధం. దానిపేరు “ఓం నమో వేంకటేశాయ” – ఆ నామపఠనమే నన్ను అనుక్షణం రక్షిస్తున్నది.
“అంతయు నీవేహరి పుండరీకాక్ష” అని అన్నమాచార్యులవారు హరి శరణాగతి తెలిపారు. ఇప్పుడీ కీర్తనలోనూ “ఇంతటా హరినే (శ్రీహరియే)… కాని (అంతేకాని) నన్ను యెందుననుగాన” అంటున్నారు. “గురుతుల్యులైన పెద్దలారా! ఇప్పుడు కొంత నాకు దెలుపరో (నాక్కొంచెం వివరంగా చెప్పండయ్యా!) అంటున్నారు. పుట్టిన దేహానికి పెరుగుట తరుగుట మరణించుట యే శక్తివలన జరుగుతున్నది? ఆ శక్తి యెక్కడుంది? “నేను” అని పిలుచుకుంటున్నవాడు యెక్కడవున్నాడు? మొదలు, నడుము, కొన – అన్నీ గోవిందుడే. వెనుకా వాడే, ముందునా వాడే అచ్చుతుడు. ఇంతాను (ఇదంతా శ్రీవేంకటేశుని మయము. ఇక నా స్వతంత్రం యెక్కడుందయ్యా! అంటున్నారు.
భావ వివరణ:
ఓ గురువులాల! (గురు పుంగవులారా!) కొంత నాకు దెలుపరో (నాకు కొంచెము వివరించండయ్యా!) ఇంతటా హరినే (ఈ సృష్ఠిలోని ఇదంతా శ్రీహరియే వున్నాడు). కాని (అంతేకాని నన్ను యెందునను గానను.
తనువు పుట్టినదాది పెరిగి, ముసలిదై నశిస్తున్నది. దీంట్లో శ్రీహరి వుండకపోతే అది సాధ్యమా? కనుక తనువు హరియే ఒక క్షణంలో లెక్కించలేనన్ని ఆలోచనలలో హరిలేడనగలమా? కనుక తలమపులోనూ హరియే. వినికి (శ్రవణశక్తి), మనికి (జీవనాధారము) విష్ణువే. కనుగొనుచూపులలో కూడా కమలనాభుడైన హరివుండబట్టే అంతగొప్ప దృష్టిజ్ఞానం కలుగుతున్నది. ఎనసి (వ్యాపించు స్వభావముగల) జీవుని శక్తి ఏయేరూపాలలో వుంటుందో యెవరికి తెలుసు?
ఈలోకమంతా మాధవుడే. లోనెల్లా (నాలో అంతా) మాథవుడే, వాకును కర్మము (చేయించిన కర్మయు) వైకుంఠుడే (విష్ణువే). చేకొని (నిర్వహించి) మా చైతన్యము (చేతనాశక్తి) అంతా శ్రీనారాయణ మూర్తియే. ఈకడ (ఇదిట్లయిన) ‘నేను’ అనేవాడు నాలో యెక్కడున్నాడో కదా! ఎందుకంటే చేతనలేని సుషుప్తి (గాఢనిద్ర)లో నాగురించిన జ్ఞానమే నాకులేదే. మరి అప్పుడు ఆ ‘నేను’ ఏడీ. ఎవరన్నా తట్టి లేపగానే, నన్నెందుకు లేపావు అంటున్నానే… ఎవడా “నేను”?
నా వెనుకనున్నదీ కృష్ణుడే. ముందరవున్నదీ కేశవుడే. నామొదలు, మధ్య, తుది గోవిందుడే. ఆ విధంగా నన్నంతా ఆవరించి అచ్యుతుడే అయి వున్నాడు అతిశయించగా, ఇదంతా శ్రీవేంకటేశుని మయమే. ఇటువంటి పరిస్థితుల్లో నేనేం చేసినా, నేనేం ఆలోచించినా, నేనేం మాట్లాడినా నేను కర్తనా? కానే కాదు. నా అనుగు స్వతంత్రము (నాకు ప్రియమైన స్వేచ్ఛ) యేదీ? లేనే లేదు.
ఈ విశ్వమే తన ఆత్మవలె వున్న సర్వేశ్వరుడు విష్ణువు ఒక్కడే. సృష్ఠిలో సమస్తమూ ఆయనచే, ఆయన కొఱకు ఆయనదే అయివున్నది. అందుకనే సర్వమూ వైష్ణవమే అంటున్నారు అన్నమాచార్యులవారు. హరుడు, విరించి, సురపతీ… వారివారి బాధ్యతలను శ్రీహరిమహిమవల్లనే నెరవేరుస్తున్నారు. పంచభూతాలు, నవగ్రహాలు, త్రికాలములూ, నారాయణుని మహిమవల్లనే తమ ధర్మం నెరవేరుస్తున్నాయి. ఆఖరికి పరమపదప్రాప్తి దక్కాలన్నా తిరుమలేశుని దీవెన వుండాల్సిందే. ఇంతయూ శ్రీవేంకటేశుమహిమ అంటున్నారు.
భావ వివరణ:
అనంతమైన ఈ విశ్వమంతా, అణురూపుడై ఆత్మరూపుడై విలసిల్లుతున్నది విష్ణువు మాత్రమే. స్థావరజంగములన్నింటిలో అనగా కదలికవున్న వాటిల్లోను కదలిక లేనివాటిల్లోనూ కూడా ఆ విశ్వాత్మకుడే. సర్వమూ వైష్ణవమే (విష్ణువునకు సంబంధించినదే).
పరమేష్ఠి (బ్రహ్మదేవుడు) బ్రహ్మాండమున సృష్ఠి వ్యాపారము చేయుచున్నాడు. హరునిలోని సంహారశక్తి చేత జీవకోటి నశించుచున్నది. పరగగా (ఒప్పుగా) ఇంద్రుడు జగత్పరిపాలనా బాధ్యత చేపట్టినాడు. ఆయన క్రింద వివిధ దేవతలు వివిధ శాఖలను నిర్వహింతురు. హరునికి కూడ కాలుడు, యముడు, నవగ్రహములు, భూతపిశాచగణములు ఇత్యాదివి లయకార్యమున సహకరించును. అరసి చూడ (పరికించి చూడగా) ఈ నియమబద్ధపాలనమెల్లా శ్రీహరి మహిమయే అనుననది సుస్పష్టము.
విశ్వరచనా నిర్వహణములలో పంచభూతములదే (భూమి, గాలి, నీరు, కాంతి, ఆకాశము) ప్రధానపాత్ర. ఆ పంచభూతముల గుణములన్నియు నిబద్ధతతోవున్న కారణము విష్ణువే. నవగ్రహముల విహారము (గమనకు) నియంత్రింపజేయుచున్నదీ విష్ణువే. భూత, వర్తమాన భవిష్యత్కాలములను కాలత్రయమందురు. తలకొను (పూనుకొను) ఆ కాలధర్మములను నియంత్రించుచున్నదీ ఈ నారాయణుని దివ్య మహిమయే.