Neethikathalu – నీతి కథలు

Neethikathalu

నీతికథలు మానవత్వంలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తాయి . వివేకం, సహనం, ధైర్యం, సంపత్తి, ముక్కువ, ప్రేమ, సహానుభూతి, ధర్మం మరియు సంయమనం వంటి గుణాలు నీతికథలు అభివృద్ధి చేస్తాయి. అవి మన జీవనాన్ని ఆధరపరచి, మానవత్వాన్ని ఉన్నతముగా చేస్తాయి. నీతికథలు నేరుగా చాలా మంది మనుషులు మీదుగా ప్రభావితం అవుతున్నారు. నీతికథలు అనేవి సమాజాన్ని సమృద్ధం చేస్తాయి, అంతర్ముఖతను అభివృద్ధి చేస్తాయి మరియు సామాజిక సంగతులను ప్రేమ, సహనం, సహానభూతి, మరియు సంక్షేమంతో ప్రభావితం చేస్తాయి. నీతికథలు, మానవాళికి ఎలా నడుచుకోవాలి అనే మార్గాన్ని నిర్దేశిస్తుంటాయి. నీతి కథలలోని సారాంశాన్ని అర్ధం చేసుకొని వాటిని ఆచరింపబడడం వలన జీవితంలో సుఖసంతోషాలు వెళ్లి విరుస్తాయి. మొదలగు నీతి కథలు కోసం ఈ క్రింది లింకులు ద్వారా తెలుసుకుందాం…

Neethikathalu – నీతి కథలు

శ్రీమద్రామాయణం లోని కథ

శ్రీమద్భాగవతము లోని కథ

శ్రీమహాభారతం లోని కథ

శ్రీ గర్గభాగవతం లోని కథ

విక్రమార్కుని సాహసగాధలలోని కథ

పెద్దలు చెప్పిన నీతికథ

స్వాతంత్ర్య సమరయోధులనాటి కథ

శ్రీ స్కాంద పురాణము లోని కథ

శివాజీ వీరగాధలలోని కథ

శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర లోని కథ

శ్రీకాళిదాసకృత రఘువంశం లోని కథ

శ్రీకృష్ణదేవరాయ కృత ఆముక్తమాల్యద లోని కథ

భరద్వాజ సంహిత లోని కథ

కఠోపనిషత్తు లోని కథ

శ్రీతులసీదాస కృత రామచరితమానసము లోని కథ

శ్రీ పద్మ పురాణం లోని కథ

వివిధ పురాణాల లోని కథ

శ్రీరామచరిత మానసము లోని కథ

శకటాసుర భంజనమ్ – Sakatasura Bhanjanam | శ్రీ గర్గభాగవతం లోని కథ

Srikrishna Leelalu - Sakatasura Bhanjanam Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ గర్గభాగవతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శ్రీకృష్ణ లీలలు – శకటాసుర భంజనమ్ కథ. 

శ్రీకృష్ణ లీలలు – శకటాసుర భంజనమ్

“ఏమి నోము ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటిమబలలారా వీనులలర
మన యశోద చిన్ని మగవాని గనెనట చూచివత్తమమ్మ సుదతులారా”

అంటూ ఒకరినొకరు పిలుచుకుంటూ వ్రజభామలందఱూ చిన్ని కృష్ణుని చూడ వచ్చారు. బాలకృష్ణుని కురులు ముడిచి పరిమళ పుష్పములతో అలంకరించారు. ఆ చిన్ని శిశువు నుదుట కస్తూరి దిద్ది కాటుక పెట్టారు. చెవి పోగులు పులిగోరు చంద్రహారము బాలునికి ధరింపచేశారు. బోసి నవ్వులొకిస్తున్న జగన్నాథుని బుగ్గన గడ్డముపై చుక్కలు పెట్టారు. చేతులకు కడియాలు ముంజేతులకు మురుగులు మొలకు బంగారుత్రాడు కట్టారు. బాలుని రూపములో ఉన్న శేషశాయికి నీరాజనాలిచ్చి “ఉయ్యాలా బాలునూచెదరు” అంటూ బాలుని బండీ క్రిందనున్న పసిడి తొట్టిలో పడుకోబెట్టి లాలి పాటలు పాడారు. వ్రజభామలు ఎన్నో కానుకలు పిండివంటలు మొదలగునవి ఇచ్చారు.

ఈ కోలాహలంలో కంసప్రేరితుడైన శకటాసురుడు వాయు రూపములో వచ్చి పరమాత్మపై బండిని పడద్రోశాడు. ముద్దులొలికిస్తూ చిన్నికృష్ణుడు ఆ శకటమును (బండిని) తన్నాడు. రివ్వున బండీ ఎగిరి శకటునిపై పడి ఆతని తల వ్రక్కలయ్యెను. బండిపైనున్న క్షీర దధి భాండములు క్రింద పడి పగిలెను.

అలికిడి వినిన వ్రజభామలు కలవరుముతో చూడగా బాలకృష్ణుడు కేరింతలుకొట్టుచూ ఆడుకుంటున్నాడు. ఈ లీలను చూచిన గోపబాలురు జరిగిన సంగతి వ్రజభామలకు చెప్పిరి. ఆశ్చర్యపడి నందనందునకు ఎఱ్ఱని నీటితో దిష్టితీసి భూసురులచేత వేదాశీర్వచనములు చేయించి లోకరక్షకునకు రక్షకట్టిరి.

శకటాసురుని వృత్తాంతము:

హిరణ్యలోచనుని పుత్రుడైన ఉత్కచుడు చాలా క్రూరుడు. ఒకసారి అతడు తన స్వాభావికమైన క్రూరత్వముచే లోమశ మహర్షి ఆశ్రములోనున్న వృక్షలతాదులను పెఱికివేశాడు! ఆతని క్రూరబుద్ధిని చూసి ఆ మహర్షి “ఓరీ! పాము కుసుసము విడిచినట్టు నీవు ఈ దేహము విడువుము” అని శపించినాడు. పశ్చాత్తాపముతో మహర్షి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు ఉత్కచుడు. “పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదు. అయిననూ నీవు చేసిన కర్మకు శిక్ష తప్పదు. ద్వాపరమున శ్రీకృష్ణ పరమాత్మ నిన్ను విధించును. ఆ పురుషోత్తముని పాద స్పర్శతో నీకు శాపవిముక్తి కలుగుతుంది” అని శాపావశానం చెప్పాడు లోమశ మహర్షి. ఆ ఉత్కచుడే శకటాసురుడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

క్రూరత్వం కడు దుష్టస్వభావము అసురలక్షనము. తోటి మానవులు జంతువులతోనే కాక వృక్షములతో కూడా మైత్రీభావముతో ఉండవలెనని మనకు ఈ కథ ద్వారా తెలిసినది. మన శాస్త్రాల ప్రకారం ఒక చెట్టును ఊరికే నఱకడం మహాపాపమ్. అవసరార్థం ఒక వృక్షమును నఱికితే దానికి బదులు నాలుగు వృక్షములు నాటమని మన ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఉత్కచుడు ఊరికే ఎన్నో వృక్షములను పెఱికివేసి ఆ తప్పుకు శిక్ష అనుభవించాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Harihari Ni Mayamahima In Telugu – హరిహరి నీ మాయామహిమ

హరిహరి నీ మాయామహిమ - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో హరిహరి నీ మాయామహిమ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

హరిహరి నీ మాయామహిమ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : హరిహరి నీ మాయామహిమ
సంఖ్య : 293
పుట: 196
రాగం: నారాయణి

నారాయణి

100 హరి హరి నీ మాయామహిమ
సరవి దెలియ ననుఁ గరుణించఁగదే

||పల్లవి||

తలఁతును నా పాలిదైవమవని నిను
తలఁతును తల్లివిఁ దండ్రివని
మలసి యంతలో మఱతును తెలుతును
కలవలె నున్నది కడ గనరాదు

||హరి||

మొక్కుదు నొకపరి మొగి నేలికవని
మొక్కుదు నీ వాదిమూలమని
వుక్కున గర్వించి యుబ్బుదు సగ్గుదు
కక్క సమైనది కడ గనరాదు

||హరి||

చూతును నీమూర్తి సులభుఁడవనుచును
చూతు జగములకు సోద్యమని
యీతల శ్రీ వేంకటేశ నన్నేలితివి
కౌతుకమొదవెను కడ గనరాదు

||హరి||293

అవతారిక:

హరిహరీ! నీమాయామహిమ క్రమంగా తెలిసికొనునట్లు నన్ను కరుణించితివి, గదే! నేను ధన్యుడనయ్యాను తండ్రీ! నీవే నాపాలి దైవము, నా తల్లివి, తండ్రివి, గురుడవు. నీవే నా ప్రాణానివి. అందుకని నీవే కౌతుకమున నన్నేలితివి. ఈ జీవితానికి ఇది చాలు స్వామి. నేను కళ్ళు తెరిచినా కళ్ళుమూసినా నీ మూర్తే కనబడుతున్నది ఇక ఈ బ్రతుకునకింతకంటే కావలసిందేమి వున్నది ప్రభూ!

భావ వివరణ:

ఓ శ్రీహరీ! నీమాయామహిమల యొక్క తీరుతెన్నులు యెలావుంటాయో | వాటిని సరవి (క్రమముగ) తెలియునట్లు నన్ను అనుగ్రహింపుము ప్రభూ!

దేవా! నేను నిన్నే దేవునిగా తలచెదను. నిన్నే నా తల్లిగాను తండ్రిగాను తలచెదను. మలసి (తిరిగి) అంతలోనే ఆ విషయం మరచిపోతాను. ఏమిటి ప్రభూ! నీమాయ? ఇంతలోనే కలవలె అన్నీ మరచిపోయి యేదో పోగొట్టుకున్నవాడిలా బాధపడి నలిగిపోతాను. ఈ భ్రాంతికి కడగనరాదు (అంతము కనబడదు).

ఒకపరి (ఒకసారి) వూరకనే నీకు మ్రొక్కెదను. ఒకపరి నీవు నా | ప్రభువువని కీర్తిస్తూ మొక్కుతాను. ఒకపరి సృష్ఠి కంతటికి ఆదిమూలము | నీవేనని నమ్ముతాను. నీవు నా పక్షాన వున్నావని ఉక్కున (స్థైర్యము గలవాడనై) గర్వించి ఉబ్బుదును (సంతోషిస్తాను). అటుపై సగ్గుదును (తగ్గిపోతాను). కక్కసమైనది (యెంతో బాధ కలుగుతుంది). కడకనరాదు (దీనికి అంతూ పొంతూ తెలియదు).

ఓ దేవా! నీ దివ్య సుందరమూర్తిని జూచి నీవు మమ్ము సులభముగా అనుగ్రహింతువని తలచెదను. జగములన్నిటికి ఇది సోద్యము (సంభ్రమకరము) అని చూతును. ఓ శ్రీవేంకటేశ్వరా! ఈ విధముగా | నన్ననుగ్రహించితివి. నాకు యెంతో కౌతుకము (ఆనందము) కలుగుచున్నది. దానికి కడ కనరాదు (అంతు తెలియకుండా వున్నది). నేను ధన్యుడను తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Ettare Aratulu Yiyyare Kanukalu In Telugu – ఎత్తరే ఆరతులు యియ్యరే కానుకలు

ఎత్తరే ఆరతులు యియ్యరే కానుకలు - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో ఎత్తరే ఆరతులు యియ్యరే కానుకలు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఎత్తరే ఆరతులు యియ్యరే కానుకలు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : ఎత్తరే ఆరతులు యియ్యరే కానుకలు
సంఖ్య: 31
పుట: 21
రాగం: బౌళి

బౌళి

101 ఎత్తరే ఆరతులు యియ్యరే కానుకలు
యిత్తల నేఁగివచ్చీని యిందిరానాథుఁడు

||పల్లవి||

గరుడధ్వజపు తేరు కనకమయపు తేరు
సిరులతో వేదములచేరుల తేరు
సురలు మునులుఁ బట్టి సొంపుతోడఁ దియ్యంగాను
యిరవుగ నేఁగివచ్చీ నిందిరానాథుఁడు

||ఎత్త||

జీవకోట్లున్న తేరు శేషుఁడే రూపైన తేరు
వేవేలు సింగారముల వెలయు తేరు
మావరుస నిత్యులును ముక్తులును గొలువఁగా
యీవల నేఁగివచ్చీ నిందిరానాథుఁడు

||ఎత్త||

పంచభూతముల తేరు బ్రహ్మాండమైన తేరు
మించిన శ్రీవేంకటాద్రిమీఁదటి తేరు
కొంచక యలమేల్మంగఁ గూడి వచ్చీ నదె తేరు
యెంచరాని మహిమలు నిందిరానాథుఁడు

||ఎత్త|| 31

అవతారిక:

శ్రీవేంకటేశ్వరుని రథము తిరువీధులగుండా సాగుతున్నది. ఇందిరానాథుడు ఇటువైపు వచ్చేస్తున్నాడు, ఓ ప్రజలారా! రండి… హారతులీయండి… కానుకలనీయండి… మీ జన్మ తరింపజేసికోండి అని మంగళం పాడుతున్నారు. అన్నమాచార్యులవారు. ఈ తేరు, పంచభూతముల మూలరూపమైన పరమాత్ముని | బ్రహ్మాండమైన తేరు అని కీర్తిస్తున్నారు. జీవకోట్లన్నీ ఇందులోనే అదృశ్యరూపంలో వున్నాయట. సురులు మునులు ఈ తేరుని పట్టుకొని సొంపుగా లాగుతున్నారట. ఏరీ కనుపించరేమి? అని జుట్టు పీక్కోకండి. మనకు వారినిచూచే శక్తీ, అర్హతా, భక్తీ యేవీ లేవు. స్వామి సశరీరుడై తన దేవేరులతో వారికి కనుపిస్తాడు. కాని మనకు | అంత అదృష్టం లేదు.

భావ వివరణ:

ఓ ప్రజలారా! ఇందిరానాథుడు ఇటు వూరేగి యిత్తల వస్తున్నాడు (ఇటువైపు వచ్చుచున్నాడు). ఎత్తరో ఆరతులు (హారతులను యెత్తిచూపండి). మీ శక్తి కొలది కానుకలు స్వామికి సమర్పించుకోండి.

ఈ స్వామి యెన్ని రకములైన రథములనెక్కాడో చూడండి. | గరుడధ్వజముతో నొప్పిన తేరు బంగారము రాసులైన తేరు. నాలుగు వేదములు దీనికి చేరులు (పట్టుకొని గుంజుటకు వుపయోగించిన నాలుగు త్రాళ్ళు). దేవతలు మునులు అదృశ్యరూపులై దీనిని లాగి తరిస్తున్నారు. ఈవిధంగా ఇరవుగా (సొంపుగా) ఇందిరానాథుడు వూరేగివస్తున్నాడు.

సృష్ఠిలోని జీవకోట్లన్నీ సూక్షరూపంలో వున్నాయి, ఈ రథంలో ఉన్నాయి. ఇది మనకు రథములా కనిపిస్తున్నది కానీ ఆదిశేషుడు చుట్టలు చుట్టుకొని తన | పడగలను స్వామికి గొడుగులాపట్టినాడు. వేవేల సింగారములు (అనేకమైన అలంకరణలతో) ఈ తేరు కన్నులపండువగా వున్నది. నారదాది నిత్యులూ, సనక సనందనాది ఋషులు, వ్యాసాంబరీషులవంటి ముక్తులు (ముక్తిపొందినవారు)… మూడు వరుసలలో నిలిచి సేవిస్తున్నారు. ఈవిధముగా ఇందిరానాథుడు వూరేగివస్తున్నాడు.

బ్రహ్మాండమైన ఈ తేరులో పరమాత్మ పంచభూతముల రూపములో విలసిల్లుతున్నాడు. ఈ తేరు మించిన (వృత్కృష్టమైన శ్రీవేంకటాద్రిపై సాగిపోతున్నది. అదిగో ఈ ఇందిరానాథుడు కొంచక (తగ్గక) తన దేవేరి అలమేల్మంగతో గూడి ఈ తేరుపై వస్తున్నాడు. ఈ మహానుభావుడు యెంచరాని మహిమలు కలవాడు. ఈయనయొక్క అనుగ్రహం పొంది మీజన్మ చరితార్థం చేసికొనండి. ఒక్కసారి ముక్తకంఠంతో అనండి

శ్లో॥ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే।
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం||

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Yudhisthiruni Dharmabuddhi In Telugu – యుధిష్ఠిరుని ధర్మబుద్ధి

Yudhisthiruni Dharmabuddhi

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే…యుధిష్ఠిరుని ధర్మబుద్ధి నీతికథ.

యుధిష్ఠిరుని ధర్మబుద్ధి

చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి వద్ద పుణ్యకథలు వినిన తరువాత ధర్మాత్ములైన పాండవులు పరమసాధ్వి అయిన ద్రౌపదీదేవి పురోహితుడైన ధౌమ్యుల వారు ద్వైతవనానికి చేరారు. అక్కడ ఉండగా ఒక రోజు ఒకానొక భూసురోత్తముడు పఱుగులిడుతూ వచ్చి “ఓ ధర్మనందనా! యజ్ఞార్థము నేను అరణి (నిప్పు పుట్టించెడు కొయ్య) అరణ్యమునుండి కొనివచ్చి వాటిని ఒక తరుశాఖ మీద పెట్టి మిగిలిన ఏర్పాట్లు చేయుచుండగా ఒక జింక ఎక్కడి నుంచో పఱుగు పఱుగున వచ్చి ఆ వృక్షము ప్రక్కగా వెళ్ళినంత దాని కొమ్ములకు నా అరణి చిక్కుకుంది. అలా నా అరణి తీసుకుని ఆ జింక మళ్ళీ అడవిలోకి పారిపోయింది. నా నిత్యకర్మకు అంతరాయం కలుగ కుండా నా అరిణి తెచ్చి కాపాడు” అని వేడుకున్నాడు.

ఆర్తరక్షణే ప్రథమ కర్తవ్యం అని భావించే ధర్మజుడు వెంటనే తన విల్లందుకుని తన తమ్ములతో పాటు ఆ జింక వెళ్ళిన వైపున పఱుగు తీశాడు. అద్భుత వేగంతో పోతున్న ఆ జింక ఎంత ప్రయత్నించినా వారికి చిక్కలేదు. అలా ఎంతో దూరం ఆ జింక వెనకాల పఱుగెట్టారు పాండవులు. తీవ్రమైన అలసట దప్పిక వారిని బాధించాయి అయినా కర్తవ్య పాలనార్థం జింకను వెంబడిస్తూనేవున్నారు. చివరికి వారు దట్టమైన కాఱడవి లోపలికి చేరుకున్నారు. అక్కడ ఆ జింక కనుమఱుగైపోయింది. మానవ ప్రయత్నం విఫలంకాగా ఎంతో శ్రమతో ఆయాసపడుతున్న పాండవులు ఒక పెద్ద మఱిచెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు “నిరంతరము సత్యమార్గమును అనుసరించుచూ ధర్మముతప్పకుండా చెరించే మనకు ఈ దుర్గతి ఎందుకు పట్టినదో? ఒక జింకను పట్టి ఆ బ్రాహ్మణుని అరణి తిరిగి ఇవ్వలేక పోతున్నామే. హతవిధి”! అది విని ప్రాజ్ఞుడైన యుధిష్ఠిరుడు ఇలా బదులిచ్చాడు.

“నాయనా! సుఖము దుఃఖము మనము పూర్వం చేసిన కర్మ బట్టే ఉంటాయి. సత్కర్మలకు సత్ఫలము దుష్కర్మలకు దుఃఖము తప్పదు. చేసిన కర్మ చెడని పదార్థం. కర్మ వశముగా కాక ఏదీ జరుగదు”. భీమనేడు ఆ సత్యవాక్కులు విని “అయితే పరసతి పరమపతివ్రత పైగా ఏకవస్త్ర (రజస్వల) గా ఉన్న పాంచాలీ దేవిని కురుసభకు జుట్టుపట్టుకుని ఈడ్చుకువచ్చిన అతిదురాత్ముడైన దుశ్శాశనుని అక్కడే వధించకుండా ఊరక ఉన్నందుకే మనకి ఈ దుర్గతి పట్టి ఉండ వచ్చు” అని అన్నాడు. అది విని శ్రీ కృష్ణ ప్రియ సఖుడైన అర్జునుడిలా అన్నాడు “ధర్మాధర్మ విచక్షణ లేకుండా ఇష్టంవచ్చినట్టు కురువృద్ధుల ముందర నోటికి వచ్చినట్టు మాట్లాడిన ఆ కర్ణుని నోరుమూయించక ఓర్చుకున్నందుకే మనకీ దుఃఖములు”. అప్పుడు సహదేవుడు “దుష్టశీలుడైన దుర్యోధనుడు అధర్మ జూదం ఆడి మనలను మోసగించినపుడే దుష్టశిక్షణ చేయనందులకే మనకీ దుర్గతి పట్టినది” అని అన్నాడు (జ్యూదంలో పందెం కాసేవాడే ఆడాలన్నది నియమం. అలా కాకుండా తను ధనంవొడ్డి శకునిచే ఆడించి గెలుచుట అధర్మం అని సహదేవుని ఆంతర్యం).

ఇలా వేయివిధాల మాటలాడు తున్న సోదరులను చూచి అజాతశత్రుడైన పాండవాగ్రజుడు అందఱికంటే చిన్న అయిన సహదేవునితో ఇలా అన్నాడు “నాయనా! నీ సోదరులందరూ తీవ్ర దాహముతో ప్రాణాలు కడపట్టుకు ఉన్నారు. ఈ వృక్షం ఎక్కి దగ్గరలో ఏదైనా జలధార ఉన్నదే మో చూడు”. వెంటనే సహదేవుడు ఆ చెట్టెక్కి నలువైపులా చూశాడు. దగ్గరలోనే అతి మనోహరమైన తటాకమున్నదని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు “నీవు వెళ్ళి నీరు త్రాగి దప్పిక తీర్చుకొని మాకు కూడా కొంత జలం పట్టుకు రా” అని సహదేవునితో అన్నాడు. సహదేవుడు వెళ్ళి తటాకములోని నీరు త్రాగబోతుండగా ఒక అశరీరవాణి ఇలా పలికింది “ఓ మాద్రీ నందన! ఈ జలములు నా ఆధీనములో ఉన్నాయి. నీవు ఇవి త్రాగదలుచు కుంటే ముందు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పు”. దాహముతో తపిస్తున్న సహదేవుడు ఆ మాటలు పట్టించుకోకుండా నీళ్ళు త్రాగినాడు. మఱుక్షణం నిశ్చేష్టుడై పడిపోయాడు.

ఆ తరువాత నకుల అర్జున భీములు ఒక్కొక్కరుగా ధర్మరాజు ఆనతిమీద తమ్ములను వెదుకుటకు వచ్చి సాహసించి ఆ తటాకములో నుండీ నీరు త్రాగి మృతుల వలె ఆ తీరమువద్ద పడిపోయినారు. ఎంతకీ తిరిగి రాని సోదరులను వెతుకుతూ చివరికి ధర్మనందనుడు కూడా ఆ తటాకానికి చేరుకున్నాడు. యుధిష్ఠిరుడు తీరమువద్ద పడివున్న తన ప్రియ సోదరులను చూచి ఆశ్చర్యపోయాడు. వారికేమైనదో అని దుఃఖించాడు. అసమానశూరులు వీరాధివీరులైన ఆ నలుగురు ఏ కారణంబుగా ఈ స్థితిలో ఉన్నారో అని బాధపడ్డాడు. పుణ్యచరిత అయిన కుంతీ దేవికి ఈ విషయము తెలిసిన ఎంత దుఃఖించునో అని తలచినాడు. “భీష్మ విదురాది పెద్దలు అడిగితే ఏమి సమాధానము చెప్పాలి?” అని ఇట్లు పరిపరి విధముల వగచి దాహముతో ప్రాణాలుపోతున్న ఆ ధర్మజుడు తటాకములోని జలములు త్రాగుటకు ఉపక్రమించెను. మఱల ఆ

అశరీరవాణి ఇట్లనియె “నీ సోదరులు సాహసించి ఈ నీరు త్రాగి మరణించిరి. నీవీ నీరు త్రాగవలెనన్న నా ప్రశ్నలకు విమల బుద్ధితో సమాధానములు ఇవ్వవలెను”. “అయ్యా! నీవు శివుడవో అగ్నిదేవుడవో వాయుదేవుడవో ఇంద్రుడవో? ఇట్టి అజేయులకు ఈ స్థితిని ఇంకెవరు కల్పించగలరు? నాయందు దయ ఉంచి మీ నిజరూపంబు చూపి నా భయము తొలగించండి” అని వేడుకొనిన అతి ఘోరాకృతిలో ఉన్న యక్షుడు యుధిష్ఠిరుని ఎదుట నిల్చి నా ప్రశ్నలకు ఉత్తరములు ఇయ్యమని అడిగెను. సహజ వినయ సౌశీల్యుడైన ధర్మనందనుడు అతనికి ప్రణమిల్లి “దేవా మీ చిత్తము. కానీ నాబోటి వానికి మీ ప్రశ్నలకు జవాబులిచ్చుట సాధ్యమా? అయినా నాకు తెలిసినంతలో చెప్తాను” అని అన్నాడు.

ఆ యక్షుని ప్రశ్నలకు ధర్మజుడు అద్భుతరీతలో ఉత్తరములను ఇచ్చినాడు. సంతృప్తుడైన యక్షుడు “మహాత్మా! నా ప్రశ్నలన్నిటికీ నీవు సదుత్తరములు ఇచ్చి నన్ను మెప్పించినావు. నీ తమ్ములలో ఒకని ప్రాణంబులిచ్చెద. కోరుకొనుము” అని వరమొసంగినాడు. శ్యామాంగుడైన నకులుని బ్రతికించ మని ధర్మరాజు కోరగా యక్షుడు ఆశ్చర్యముగా ఇలా ప్రశ్నించాడు “భీమార్జునులు అతిభీమబలులు. భీమసేనుడు అతని భుజబలముచే నిన్ను నీ సోదరులను అనేక మాఱులు మత్సరముచే చంపాలనుకొన్న దుర్యోధనుని కుయుక్తుల బాఱినుండి కాపాడినాడు. ఇక అర్జునునికి సాటి రాగల వీరుడు ఈ లోకంలో లేడు. ఆతడే మఱల నీ రాజ్యము నీకు అప్పించగలడు. వీరిలో ఒక్కరిని కోరక నకులుని ఎందులకు కోరినావు”? సమవర్తి అయిన యుధిష్ఠిరుడు ఇలా ధర్మము మాట్లాడినాడు “కుంతీదేవి కుమారులైన ముగ్గురిలో నేను మిగిలినాను.

అలాగే మాత యగు మాద్రీదేవి ఇద్దరు పుత్రులలో ఒకడైనా బ్రతకాలి కదా! అందుకే నకులుని బ్రతికించమని కోరినాను. ఇట్లు కాక అన్యుల బ్రతికించమని కోరి అధర్మము చేయలేను”. ధర్మజుని ధర్మబుద్ధికి మెచ్చి ఆ యక్షుడు “నీ తమ్ములందఱిని బ్రతికించెదను” అని కరుణించినాడు. వెంటనే ఆ నలుగురు లేచి కూర్చున్నారు. వారందరి దాహమూ తీరిపోయినది. ఆ యక్షుడి శక్తి చూచి ఆశ్చర్యపోయి “దేవా! నీవు సామాన్య యక్షుడవు కావు. ఇంద్రుడవో వరుణుడవో అగ్ని వాయుదేవుడవో లేక ధర్మప్రభువైన నా తండ్రి యముడవో చెప్పుము” అని ప్రార్థింప ధర్ముడు కరుణించి తన నిజ స్వరూపము చూపి వారికి ఆనందము కలిగించినాడు.

“ఓ రాజా! నేను యమధర్మరాజును. సత్యము శౌచము దయ దానం తపం శమము దాంతి యశము జ్ఞానము యుక్తి నా మూర్తులు. నీ ధర్మబుద్ధి పరీక్షించుటకు వచ్చినాను. నీ ధర్మవర్తనమునకు మెచ్చినాను. ఏమి వరము కావలయునో కోరుకొనుము” అని కాలుడు అడిగినాడు. అప్పుడు పాండవాగ్రజుడు ఆ ధర్ముని స్తుతించి “అయ్యా! నా ఆశ్రమము వద్ద ఉండే విప్రోత్తముడి అరణి ఒక హరిణము ఎత్తుకుపోయింది. ఆ మహనీయుని నిత్యకర్మకు లోపము రాకుండా అతనికి ఆ అరణి ఇప్పించు స్వామి”! అని కోరినాడు. అంతట ఆ ధర్ముడు తానే మృగ రూపమున వచ్చెనని ధర్మరాజుకు ఎఱింగించి అతనికి విపుని అరణి ఇచ్చెను.

“నాయనా! రానున్న అజ్ఞాతవాసములో మీకు కావలిసిన రూపములు నా అనుగ్రహం వల్ల కలుగుతాయి. ఇందువల్ల అసత్య దోషం కలుగకుండా మీరు అజ్ఞాతవాస కాలము పూర్తిచేయగలుగుతారు. నాయనా ధర్మరాజా! నీ కర్తవ్య దీక్షకు మెచ్చి ఇంకొక వరమిస్తాను కోరుకో” అని కాలుడన్నాడు. అప్పుడు ధర్మనందనుడు “స్వామీ! నీ అనుగ్రహము కన్న నాకు కావలసిన దేమున్నది. నా మనసులో అప్పుడూ క్రోధమోహాలు రాకుండా ఎల్లప్పుడూ ధర్మమార్గాన ఉండేటట్లు ఆశీర్వదించండి” అని కోరినాడు. అటులనే దీవించించి యముడు అదృశ్యమయ్యాక పాండవులు ఆశ్రమము చేరి భూసురునకు అరణి ఇచ్చి ఆనందముగ ఉండసాగిరి.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. సజ్జనులు ఎన్నడూ ధర్మమార్గమును వీడరు. ధర్మరాజు నకులుని కోరి ధర్మవర్తనము ఎంత సూక్ష్మమైనదో మనకు వివరించినాడు. వరం కోరుకో మనినప్పుడు ధర్మజుడు తనకై ఏదీ కోరకుండా విపుని అరణి ఇప్పించమని కోరినాడు!
  2. ధర్మశాస్త్రానుసారము తమ్ముని వెదుకుటకు అన్న వెళ్ళాలి కానీ అన్నను వెదుకుటకు తమ్ముడు పోరాదు. అన్నను వెదుక వలసిన పరిస్థితి తమ్మునికి వస్తే గురువువెళ్ళి వెదకాలి. ఈ ధర్మసూక్ష్మం తెలిసిన యుధిష్ఠిరుడు ముందు సహదేవుని పంపి అతని వెదుకుటకు నకులుని ఆ తరువాత అర్జునుని ఆపైన భీమసేనుని పంపెను.

మరిన్ని నీతికథలు మీకోసం:

Mayuradhvajuni Katha In Telugu – మయూరధ్వజుని కథ

mayuradhvajuni-katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే…మయూరధ్వజుని కథ.

మయూరధ్వజుని కథ

ధర్మరాజు చేసే అశ్వమేధయాగం లోని యాగాశ్వాన్ని వీరధర్మం పాటిస్తూ పట్టుకున్నాడు మయూరధ్వజుడనే రాజు. అతడు ధర్మాత్ముడు అమితపరాక్రమవంతుడు శ్రీ కృష్ణుని పరమ భక్తుడు. యాగాశ్వం విడిపించుటకై మయూరధ్వజునితో యుద్ధం చేయటానికి పచ్చారు శ్రీ కృష్ణార్జునులు. శ్రీ కృష్ణుడు కూడా అర్జునుని ప్రార్థనపై యుద్ధం చేశాడు. భగవంతునితో యుద్ధం చేయకూడదని ఉన్నా యుద్ధనీతి పాటించి ప్రతి బాణాం వేసే ముందు శ్రీ కృష్ణ నామ స్మరణ చేస్తూ యుద్ధం చేశాడు మయూరధ్వజుడు. భక్తులచేతిలో ఓడిపోవటం భగవంతునికి పరిపాటి. అందుకే శ్రీకృష్ణార్జునులు మయూరధ్వజుని గెలవలేకపోయారు. “ఈతని సంహరించి యాగాశ్వం సంపాదించకూడదా” అని అడిగిన అర్జునునితో శ్రీ కృష్ణుడు “ఫల్గుణా! నీ గాండీవం కాని నా సుదర్శన చక్రం కాని ఈ పరమభక్తుని మీద పని చేయవు. ఈతని ధర్మబుద్ధి నీకెఱిగించెద” అని అన్నాడు.

మఱునాడు శ్రీ కృష్ణార్జునులు విప్రవేషం ధరించి మయూరధ్వజుని మందిరానికి అతిథులై వెళ్ళారు. అతిథులకు తగు మర్యాద చేసి మయూరధ్వజుడు తన ఇంట ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించాడు. అది విని మాఱువేషంలో ఉన్న పరంధాముడిలా అన్నాడు “రాజా! నీ ఇంట భుజించుటకు వ్యవధి లేదు. మాకొక చిక్కు వచ్చినది. అది తీరిన తరువాతే మేము ఇతరములు ఆలోచిస్తాము”. “అయ్యా! మీ కష్టమేమిటో చెప్పండి. నా చేతనైన సహాయం చేస్తాను” అని మయూరధ్వజుడు వేడినాడు. “రాజా! మేము అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నా కుమారుని ఓ పెద్దపులి పట్టుకుంది. ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తరువాత ఒక అశరీరవాణి ఇలా పలికింది “మయూరధ్వజుని శరీరంలో సగభాగం ఈ పులికి అర్పిస్తే నీ పుత్రుడు సజీవుడు అవుతాడు”. నాకు పుత్రభిక్ష పెట్టమని నిన్ను ప్రార్థిస్తున్నాను” అని శౌరి బదులిచ్చాడు.

“ఆహా! ఈనాటికి కదా ఈ దేహానికి సార్థకత ఏర్పడింది. ఒక పసివాడి ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడుతోంది. దీని కన్నా నేను కోరు తగ్గది ఏమీ లేదు. నిస్సందేహంగా నా శరీరములోని అర్ధభాగమును తీసుకుని ఆ వ్యాఘేశ్వరునికి సమర్పించండి” అని అర్థించాడు మయూరధ్వజుడు. వెంటనే తన భార్యాబిడ్డలను పిలిచి తన శరీరాన్ని రెండుగా చేసి అతిథులకు ఇచ్చి వేయమన్నాడు. ఏ పరమధర్మ సంరక్షణార్థమో ఏ మహత్తర కార్యానికో మయూరధ్వజుడిలా చేయమని వుంటాడని గ్రహించి ఎంతో బాధను దిగమ్రింగుకోని మయారధ్వజుని శరీరాన్ని ఛేదించడం మెదలుపెట్టారు. మహాశ్చర్యకరమైన ఈ త్యాగాన్ని అనిమిషులై చూస్తున్న శ్రీ కృష్ణార్జునులకు ఓ వింత కనబడింది.

మయూరధ్వజుని ఎడమ కన్ను నుండి కన్నీళ్ళు కారుతున్నాయి. సర్వజ్ఞుడైన స్వామి అది చూసి కేవలం ఆ భక్తుని గొప్పతనం ప్రపంచానికి చాటడానికి ఇలా అన్నాడు “రాజా! బాధపడుతూ దానం ఇవ్వకూడదు. సంతోషముగా మనస్ఫూర్తిగా చాస్తేనే అది త్యాగమవుతుంది. ఎదుటి వాడి కష్టాలు చూసి బాధపడటం దివ్యత్వం. మనని చూసి మనమే కన్నీరు కార్చడం నైచ్యమ్”.

“అయ్యా! నా శరీరం మనస్ఫూర్తిగానే మీకు సమర్పించాను. కాని నా శరీరము యొక్క కుడి భాగమే పరోపకారార్థం నివియోగ పడుతోంది. ఎడ మ భాగ శరీరం “నాకా అదృష్టం లేదే” అని విచారిస్తూ కన్నీరు కారుస్తోంది. మిగిలిన శరీరం దేనికీ ఉపయోగపడకుండానే నాశనమవుతున్నదనే నా బాధ” అని అమృతవాక్కులు పలికాడు మయూరధ్వజుడు. ఆ రాజు పరోపకార బుద్ధికి సంతోషించి శ్రీ కృష్ణుడు తన నిజరూపం చూపించి మయూరధ్వజునికి యథా రూపం కల్పించి దీవించాడు. మయూరధ్వజుడు నరనారాయణులకు మ్రొక్కి యాగాశ్వాన్ని సమర్పించి కృతార్థుడైనాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

మయూరధ్వజుని పరోపకారబుద్ధి అనన్యం అసామాన్యం. శ్రీ కృష్ణుడు అడిగినదే తడవుగా సంతోషముగా బాలుని ప్రాణ రక్షణ కోసం తన శరీరాన్ని త్యాగంచేయటానికి సిద్ధపడ్డాడు. అంతేకాక అర్ధ శరీరమే ఉపకరిస్తున్నది మిగిలిన శరీరం వ్యర్థమవుతున్నదని చింతించాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

విద్యార్థులకు నీతి సూక్తులు

విద్యార్థులకు నీతి సూక్తులు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు, మన పెద్దవాళ్ళు తెలుగులో నేటి తరానికి అందించిన సూక్తులు మీ అందరికోసం… ఈ బ్లాగ్ లో వున్నా సూక్తులు మీ భవిష్యత్తుకి ఉపయోగపడతాయని ఆసిస్తూ… మీ భక్తివేద్.కం.

సూక్తులు

  • సమాజంలో మంచి మార్పు తేవాలని పాపమాతడు ఎంత ప్రయత్నిస్తున్నాడో కానీ చుట్టూవున్న కోతులు కొండ ముచ్చులు అతని చిలుక పలుకులు వింటాయా.
  • జీవించినంతకాలం నాపై రాళ్ళు వేసిన యీ ప్రపంచం కళ్ళ కద్దుకుంటున్నది నా మృతదేహాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్నది నా శవాన్ని!
  • వచ్చేటప్పుడు గోచీ లేకుండా వచ్చి పోయేటపుడు అడ్రసు లేకుండా పోయే మనిషి మధ్యకాలంలో ఎంత హంగామా చేస్తున్నాడు ఎంతమందికి ఎన్ని సమస్యలు సృష్టి స్తున్నాడు!
  • భార్యకు కొన్ని విషయాలు చెప్పాలి పిల్లలకు కొన్ని విషయాలు చెప్పాలి స్నేహితులకు మరికొన్ని చెప్పాలి అందరికీ అన్నీ చెప్పాద్దు.
  • అద్దాల మేడలు – రంగు రంగుల గోడలు దేశాభివృద్ధికి కావు గీటు రాళ్ళు మనిషిలో నైతిక విలువలు, సమాజంలో సుఖశాంతులే అసలు సిసలైన గీటు రాళ్లు.
  • జీవితమనే పరుగు పందెంలో బోల్తాపదేలా పరుగెత్తకు ఎంత దూరం పరిగెత్తినా చివరి పరుగు సమాధివరకే !
  • నీవొక మొద్దు సన్నాసివి నీకు చస్తే చదువురాదని నిరుత్సాహపరిచే అధ్యాపకుడు ఎంత బుద్దిమంతుడో చెప్పండి.
  • ప్రభుత్వ యంత్రాంగంలో పని చేసే ప్రతి సోదరుడు చెట్టుకు వేరులాంటి వాడు ఇంటికి పునాది లొంటి వాడు.
  • బండ రాయిని పగలగొట్టే వాణ్ణి చూడండి ఎంత నిబ్బరంతో ఎన్ని దెబ్బలు కొడ్తున్నాడు నూరు దెబ్బలకు పగలని రాయినీ నూట ఒక్క దెబ్బకు పగులగొట్టి చూపిస్తాడు.

నీతి సూక్తులు

  • కండలు కరిగేలా కష్టించు కొండలను పిండి కొట్టే శక్తి సంపాదించు కాలం ఎదురు తిరిగినా కండలను కొండలుగా పెంచి నీ కార్యం సాధించు.
  • తలచిన పని తలచినట్టుగా కాలేదని తలపట్టుకొని కూర్చుంటే అవుతుందా? తల తాకట్టు పెట్టో తలనీలాలిచ్చో సాధించాలి నీ ధ్యేయం.
  • కష్టాలెన్ని వచ్చినా క పా నష్టాలెన్నో భరించినా కన్నీళ్ళు తుడ్చే ఆప్తుడు కనీసం ఒకడుంటే చాలు.
  • పదిమంది నడచిన రహదారిలో నడిస్తే నీ ప్రత్యేకతేమున్నది నీదైన ఒక దారిలో నడిచి నీ దారిని రహదారిగా మార్చు.
  • ప్రజలకు కావల్సింది నీ తెలివితేటలు కాదు నీ సిరిసపందలు కావు నీలోని మంచితనం.
  • ఆడుతూ ప్రారంభించిన పని పాడుతూ పూర్తిచేశాడు అన్నిటికీ అనుమానపడే పక్షి ఏమీ సాధించలేక పోయాడు.
  • పనిలో ప్రతికూలత వచ్చిందని ఆ పనికి తిలోదకాలిస్తే ఎలా? గాలి ప్రతికూలంగా వున్నపుడే కదా గాలిపటం ఎగిరేది అలా అలా !
  • ఏ దిశకు అంధకారం ఆపరిస్తుందో ఆ దిశనుండే ఆశాకిరణం ఉదయిస్తున్నది ఎక్కడ తారలు అస్తమిస్తున్నవో అక్కడి నుండే సూర్యుడుదయిస్తున్నాడు.
  • తీర్పు చెప్పేవాడికి నేర్పు అవసరం పాఠం చెప్పేవాడికి ఓర్పు అవసరం.
  • శారీరక బడలిక వల్ల రాదు జబ్బు మానసిక రుగ్మతవల్ల వస్తుంది ఎన్ని మైళ్ళు నడిచినా ఎన్ని గంటలు పని చేసినా అనుకున్న పని అయితే అలసటెక్కడిది?
  • లక్షలు సంపాదించే లక్షాధికారీ జీవితంలో ఏదో కొరవడిందని బాధపడుతున్నావా నీవు కోరుకునే తృప్తి కిళ్ళీకొట్టు వాడి కళ్లలో కనిపిస్తుంది చూడు!
  • జైలు జీవితమనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలలో ఒకడు కటకటాల వెనుక కఠిన బాధలు తలుచుకొని కన్నీరు కారుస్తుంటే మరొకడు అనంతాకాశంలోని తారలను చూసి ఆనందించాడట!
  • ఎదుటివాడి బాగుచూసి అసూయపడకు నీకూ అవకాశమొస్తుంది నిరాశపడకు.
  • కష్టాల కడలిలో కన్నీళ్ళు త్రాగడం నేర్పుకో నిరాశా నిస్పృహల నివారణకు ఆత్మధైర్యం పెంచుకో యీ ప్రపంచంలో నీవనుకున్నది సాధించాలనుకుంటే ప్రాణభీతిని విడిచి పరిస్థితులతో పోరాడటం నేర్చుకో.
  • నీ జీవితాన్ని తూచి చూడు నీవు పనిచేసే త్రాసులో ఎంతకాలం పని చేశావనేది కాదు ఎంత సాధించావనేది ముఖ్యం !
  • నీవు నాటిన కొమ్మ వటవృక్షంగా మారి వందమందికి నీడనిస్తుంది నీవు నిర్మించిన ఆకాశహర్మ్యం పంద కుటుంబాలకు ఆశ్రయమిస్తుంది నీవు నాటిన విషబీజం సమాజంలో చిచ్చుపెట్టి వందలమంది ప్రాణాలు తీస్తుంది.

మరిన్ని సూక్తులు మీకోసం:

Kushika Maharaju Katha In Telugu – కుశిక మహారాజు కథ

kushika-maharaja-katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే…కుశిక మహారాజు కథ.

కుశిక మహారాజు కథ

ఒకసారి మహాతోజోమయుడైన చ్యవన మహర్షి కుశిక మహారాజును పరీక్షించుటకు ఆయన కడకు వచ్చెను. వచ్చుచున్న చ్యవన మహర్షిని చూచి కుశికుడు ఎదురేగి ఆర్ఘ్యపాద్యాదులిచ్చి “మహాత్మా! మీ రాకతో మా నగరము పావనమైనది. ఏదో బలీయమైన కారణముంటేగాని మీ వంటి తపోధనులు రారు. మీ అభీష్టమేమో సెలవియ్యండి. మీకు సేవచేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి” అని అర్థించాడు. చ్యవనుడు “రాజా! నీ వినయవిధేయతలకు మెచ్చితిని. నీకడ కొన్నాళ్ళు ఉండవలెనని వచ్చితిని. నాకేలోటు రాకుండా నీవు నీ భార్య నాకు పరిచర్యలు చేయాలి. నా కోరిక తీర్చగలవా?” అని అన్నాడు. సాధు సజ్జన సేవే మహాభాగ్యమని కుశికుడు చ్యవనుడుండడానికి హృద్యమైన మందిరం చూపించాడు.

రాజదంపతులు చ్యవనుడు ఆ సాయంకాలం ఆహ్నికాలు దేవతార్చన చేసుకొన్నారు. తరువాత మునీశ్వరునకు మృష్టాన్నమిచ్చి సంతృప్తి పఱచినాడు కుశికుడు. భోజనానంతరము చ్యవనుడు “రాజా! నేనిక నిద్రిస్తాను. నీవు నీ భార్య నిద్రాహారాలు మాని నా పాదసేవ చేయండి. నా అంతటనేను లేవనంతవరకు నన్ను లేపకండి” అని యోగనిద్రలోకి వెళ్ళిపోయాడు చ్యవనుడు. మహర్షి పాదసేవే మహాభాగ్యం అని కుశికుడు అతని అర్ధాంగి ఏకాగ్రచిత్తంతో పాదసేవ చేయసాగారు.

ఇలా 21 దివసములు గడిచాయి. మఱునాడు చ్యవనుడు మేల్కొని ఏమీ మాట్లాడకుండా అంతఃపురం వదలి నడువసాగాడు. ముని వెంటపోయిన రాజదంపతులను తన మాయతో భయభ్రాంతుల్ని చేశాడు. మరల నిదుర పోయాడు. కుశిక దంపతులు యథావిధిగా పాదసేవ చేశారు. మళ్ళీ 21 దినములు కడచెను. ఆ తరువాత “రాజా! నేను రథమెక్కి యాచకులకు సువర్ణము రత్నములు గోవులు అశ్వములు దానమిచ్చుచుందును. మీరిద్దరు నా రథమును గుఱ్ఱములకు బదులుగా లాగవలెను” అన్నాడు. కుశికుడు ముందర రాణి వెనుక ఉండి రథములాగినారు. చ్యవనుడు మునికోలతో రక్తం వచ్చేటట్టు వారిని కొట్టుచు యాచకులకు వస్తువులిచ్చుచూ రథంమీద వెళ్ళాడు. రథం ఊరి చివరికి వెళ్ళాక ముని రథము దిగి ఏమాత్రమూ చలించని రాజదంపతులని చూశాడు. కుశికుడు అతని భార్య మనస్సులలో కొంచెంకూడా కోపంగానీ వినుకుగానీ మరి ఏ వికారము కానీ లేవు. వారి నిర్మల హృదయం ఆశ్చర్యంతో చూసి ముని వారి శరీములు తాకి ఇలా అన్నాడు “రాజా మీరింక వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. జీపు గంగాతీరం వద్దనున్న వనానికి రండి”.

వారి శరీరముల పైని గాయాలు అన్ని మాసిపోయాయి! కుశికుడు “మహాత్మా! నీ చర్యలు అద్భుతాలు. మాకే శ్రమ లేదు. మీబోటి మహనీయుల మహిమ ఎఱుగుట ఎవరి తరము”? అని అన్నాడు. మఱునాడు చ్యవనుడు చెప్పిన ప్రదేశానికి కుశికుడు అతని భార్య వచ్చారు. అక్కడ స్వర్గమును బోలు దివ్య భవనమున్నది. రాజు రాణి ఆ దివ్య భవమును చూచి మిక్కిలి ఆనందమునొందిరి. చ్యవన మహర్షి వారిని దగ్గరికి పిలిచి “రాజా! మీ శాంత స్వభావము లోకోత్తరం. మీ సాధుజన సేవాభావం అద్వితీయం. ఇంత ఇంద్రియ నిగ్రహము కలమీకు వరమిచ్చెద కోరుకొనుము” అని అన్నాడు.

కుశికుడు “మౌనివరేణ్య! నీ సేవా భాగ్యము దొఱకుటే మాకు వరము. మీ దయే చాలు. మాకింకే కోరికా లేదు” అన్నాడు. రాజదంపతుల వైరాగ్యబుద్ధికి మెచ్చి చ్యవనుడిలా అన్నాడు “ఓ రాజా! మీ వంశమునేకాక ఈ విశ్వాన్నే తరింపచేసే మునిమనుమడు పుడతాడు. అతడు బ్రహ్మర్షి అయ్యి పరమాత్మ అయిన శ్రీ రామునకు గురుస్థానమున ఉండగలడు. అతడు విశ్వామిత్రుడు. నీ వలన కౌశికుడే నామధేయంతో ప్రసిద్ధికెక్కుతాడు” (కుశికుని కొడుకు కుశనాభుడు. అతని కొడుకు గాధీరాజు. ఆయన పుత్రుడే విశ్వామిత్రుడు).

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

సాధుసేవ యొక్క ప్రాధాన్యత శాంత స్వభావము యొక్క ఔన్నత్యం మనకు కుశిక దంపతులు బోధించారు. వారు 21 దినములు నిద్రాహారాలు మాని ఏకాగ్రచిత్తంతో మునీశ్వరునికి పాదసేవ చేశారు. మహర్షి మునికోలతో కొట్టి వారిచేత రథం లాగించినా వారికే మాత్రము కోపము రాలేదు. విరాగులైన కుశిక దంపతులు ధన్యులు.

మరిన్ని నీతికథలు మీకోసం:

అద్భుతమైన తెలుగు సూక్తులు

అద్భుతమైన తెలుగు సూక్తులు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు, మన పెద్దవాళ్ళు తెలుగులో నేటి తరానికి అందించిన సూక్తులు మీ అందరికోసం… ఈ బ్లాగ్ లో వున్నా సూక్తులు మీ భవిష్యత్తుకి ఉపయోగపడతాయని ఆసిస్తూ… మీ భక్తివేద్.కం.

సూక్తులు

  • తనకోసం బ్రతికేవాడు స్వార్ధపూరిత మనిషి భార్యా పిల్లల కొరకు బ్రతికేవాడు సాదాసీదా మనిషి పది మంది శ్రేయస్సు కోరేవాడు మంచిమనిషి సర్వజనుల శ్రేయస్సు కోరేవాడు మహా మనీషి.
  • గతమంతా నాస్తికాదు అది నీ అనుభవాల ఆస్తి వర్తమానం ఒక వరం భవిష్యత్ ఓ కల-వరం.
  • అసత్యం నుండి సత్యమార్గంలో పయనించు చీకటి నుండి వెలుగులోకి వెళ్ళు మృత్యుభయం విడిచి ముందుకునడు అప్పుడు నీకు అపజయమనేది వుండదు.
  • పనిలో నిమగ్నమై పట్టుదలతో పనులు చేసేవారికి ఆరోగ్యం చెడిపోదు ముసలితనం రాదు.
  • లోకం నన్ను గుర్తించలేదని వూరికే బాధపడేకన్నా లోకాన్ని నేను అర్థం చేసుకున్నానా అని ఆలోచించడం మిన్న !
  • దష్టులు భయానికి లొంగుతారు శిష్టులు ప్రియానికి లొంగుతారు లోభులు డబ్బుకు లొంగుతారు ప్రశంసలకు అందరూ లొంగుతారు.
  • సిరులు వెదజల్లు ఒక చిరునవ్వు తేనెలొలుకు ఒక చిన్న పలుకు మురిపించు నెంత ముభావినైనా కరిగించునెంత కఠినాత్మునైనా !
  • కాకీ పక్షే – కోయిలా పక్షే నోరువిప్పితే తెలుస్తుంది ఏది ఏదో! రాముడూ మనిషే – రంగడూ మనిషే మాట్లాడితే తెలుస్తుంది ఎవరేమిటో!
  • విద్యాలయాల్లో విద్య నేర్చుకోవాలని లేదు కార్యాలయాల్లో పని చేయాలని లేదు సంసార జీవితంలో సఖ్యత కోరుకోడం లేదు అన్నీ తెలుసుననే అహంభావంతో ఏదీ నేర్చుకోడం లేదు.
  • భయభక్తుల్లేకుండా త్రాగి జజారులో నాట్యంచేసే బ్రదర్ కారునడిపే మరో సోదరుడు నీలాగే త్రాగిన మైకంలో వుంటే నీ ఎముకలు పిండి కాగలవు నీ భార్యా పిల్లల బ్రతుకులు బండలు కాగలవు.

అద్భుతమైన సూక్తులు

  • మనిషి మనస్తత్వం మహా విచిత్రమైనది కార్యం సాధిస్తే తన కార్యదీక్షే కారణ మంటాడు అందులో అపజయం కలిగితే ఆ దయామయుడి దయ మాత్రం లేదంటాడు.
  • తప్పొకరు చేస్తున్నారు – శిక్ష మరొకరు అనుభవిస్తున్నారు యీ ప్రపంచ రీతి అర్ధం కాదు తప్పు చేసిన వాడు తప్పించు కుంటున్నాడు అమాయకుడేమో బలి అయిపోతున్నాడు!
  • భూమికన్నా ఓర్పుగలది తల్లి ఆకాశం కన్నా ఉన్నతుడు తండ్రి తండ్రి కన్నా ఉన్నతుడు గురువు అన్నిటికన్నా గొప్పది ఆత్మశక్తి.
  • ఒక చెంప మీద కొట్టినపుడు మరో చెంప చూపమన్నారు పెద్దలు ఆ సూత్రం పనిచేయనపుడు కొట్టినవాడి రెండు చెంపలు వాయగొట్టడమే న్యాయం !
  • నీ విద్యుక్తధర్మాన్ని నిర్యక్ష్యం చేస్తే నీ పనివారే నిన్ను లెక్కబెట్టరు నీ బంధుమిత్రులే నిన్ను ఖాతరుచేయరు నీ భార్యా బిడ్డలే చిన్నచూపు చూస్తారు!
  • నేను వీరుణ్ణి శూరుణ్ణి అని విర్రవీగకు కరెంటులేని రాత్రి నాల్గు దోమలు చాలు తెల్లవారే సరికి నీ భరతంపట్టి నీ అవతారాన్నే మార్చివేయడానికి !
  • సగం కడుపుకు తినాలి కంటి నిండా నిద్రపోవాలి రెట్టింపు నీరు త్రాగాలి నాలుగు రెట్లు నవ్వాలి.
  • కడుపుబ్బునటుల లడ్డూలు తిని కడుపు నొప్పితో బాధపడుతున్న భోజన ప్రియుడికి డాక్టరుగారొక మందు గోలివ్వగా గోలిపట్టే ఖాళీవుంటే మరో లడ్డు పట్టించే వాణ్ని అన్నాడట!
  • డబ్బుంటే పవర్ కావాలి పవర్ కావాలంటే పాలిటిక్స్ లో చేరాలి డబ్బుండి పవర్ లేకపోతే అన్నం రుచిండదు పవరుండి డబ్బు రాకపోతే నిద్రపట్టడు.
  • బీదవాడి గుడిసె గాలివానకు ఎగిరి పోతుందేమోననే భయం ధనవంతుడి భవనం ఇన్కంటాక్సు బాకీలకింద పోతుందేమోననే భయం.

మరిన్ని సూక్తులు మీకోసం:

తెలుగు సూక్తులు మీ అందరికోసం…

సూక్తులు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు, మన పెద్దవాళ్ళు తెలుగులో నేటి తరానికి అందించిన సూక్తులు మీ అందరికోసం… ఈ బ్లాగ్ లో వున్నా సూక్తులు మీ భవిష్యత్తుకి ఉపయోగపడతాయని ఆసిస్తూ… మీ భక్తివేద్.కం.

సూక్తులు

  • ఒక మేధావితో ఓ గంట కాలక్షేపం వంద పుస్తకాలు చదివిన దానితో సమానం ఒక సత్పురుషుడితో ఓ గంట కాలక్షేపం వంద పుణ్యక్షేత్రాల సందర్శనంతో సమానం.
  • కుంభ వర్షం కురిసినా బోర్లించిన కుండలో నీరు నిలవనట్లే, ఆత్మ విశ్వాసం లేని వాడు విశ్వమంతా తిరిగినా వీసమెత్తు సాధించలేడు.
  • నీ మనసు ఒక అద్దంలాంటిది నీ అంతరాత్మ ఒక జ్యోతిలాంటిది, ఆ అద్దంలో చూసి నీ తప్పులు దిద్దుకో, ఆ జ్యోతి వెలుగులో నీ మార్గం తెలుసుకో.
  • అదే పనిగా చింతించవలదు మిత్రమా చితి – చనిపోయిన మనిషిని కాల్చి వేస్తే, చింత – బ్రతికున్న మనిషినే కాల్చి వేస్తుంది.
  • రేపు అనేది ఒక ప్రామిసరీ నోటు, నిన్న అనేది ఒక చెల్లని చెక్కు, నేడు అనేదే నీ జేబులోని రెడీ క్యాష్ సద్వినియోగం చేస్తే లభిస్తుంది శభాష్!
  • ఓ మనిషీ! పృథివి గర్వించదగిన అవతారానివి నీవు, తెలివితేటలు, శక్తియుక్తులు పుణికి పుచ్చు కొని పుట్టావు, కొండలను పిండికొట్టగలవు, నదీజలాల దారులు మళ్ళించగలవు, స్వయంకృషితో నీ జన్మభూమిని స్వర్గ – సీమగ మలచుకోలేవా?
  • దీపం మాట్లాడదు వెలుగునిస్తుంది. లైట్ హౌస్ కేక పెట్టదు దారి చూపిస్తుంది. మనసున్న మనిషి ప్రగల్భాలు పలుకడు పున్నమి వెన్నెలలా ప్రేమానురాగాలు పంచుతాడు.
  • మంచీ చెడుల కలయికయే మనిషి జీవితం మంచిని తీసుకో చెడును వదులుకో, అరటి తొక్కను తీసి లోపలి పండు తిన్నట్లు వడ్లమీది పొట్టు తీసి బియ్యం వండుకున్నట్లు.
  • సమాజంలోని మాలిన్యాన్నినిర్మూలించడానికి, నీకున్నసామర్ధ్యం చాలదని నిరాశచెందకు, కొవ్వొత్తి ఒకటి చాలు కొండంత చీకటిని పారద్రోలి, కొంత వెలుగును ప్రసాదించడానికి!
  • కాస్త స్వార్థమే లేకపోతే మనిషికి మనుగడే లేదు స్వార్థమే జీవిత పరమార్ధమైతే మనిషి లేడు – మనుగడ లేదు!
  • ఎండకు కండువా కప్పుకో, వర్షంవస్తే ఛత్రం విప్పుకో, దుష్టుడు కనిపిస్తే ప్రక్కకు తప్పుకో చివరకు నీ గమ్యం చేరుకో.
  • పొగిడేవాడిని జాగ్రత్తగా కనిపెట్టు అరనిమిషంలో అందలం ఎక్కిస్తాడు అరచేతిలో వైకుంఠం జూపిస్తాడు ఖాళీ విస్తరి మాత్రమే వడ్డిస్తాడు.

తెలుగు సూక్తులు

  • అందమైన ఆకర్షణ లెన్నో వున్న యీ ప్రపంచంలో మనకు నియమావళి అనే ఓ కళ్ళెం వుంటేనే మన జీవితం సరైన దారిలో నడుస్తుంది కళ్ళకు గంతలు కట్టిన గుఱ్రంలా.
  • క్షేత్ర మెరిగి విత్తనం వేయాలి పాత్రనెరిగి దానం చేయాలి జీతమెరిగి కోత బెట్టాలి మనిషి నెరిగి వాతపెట్టాలి.
  • పరిస్థితులు అనుకూలిస్తే పనులు అవుతాయని ఎదురు చూస్తే యీ జన్మ సరిపోదు, చుట్టూ వున్న పరిస్థితులను అనుకూలించేలా మలుచుకోగలిగితేనే నీ గొప్పతనం.
  • అధికారం, ఐశ్వర్యం అన్నీ వున్నవాడు ఏం చేసినా చెల్లుతుందనే అహంతో గుఱ్రం బదులు గాడిదనెక్కితే నడి వీధిలో నడ్డి విరిగేలా పడ్డాడట.
  • హృదయ పూర్వకంగా చేయని దానం అధికార దర్పంతో చేసిన దానం పేరు ప్రతిష్టలు ఆశించి చేసే దానం దానం కాదు – లంచంతో సమానం.
  • నీవు పెట్టిన అన్నం మూడు గంటల్లో జీర్ణమైపోతుంది నీవు చేసిన మేలు మాత్రం మూడు తరాల వరకు నిలుస్తుంది.
  • కవితకందని వస్తువు లేదు, గాయకుని కందని రాగం లేదు, మనసుకందని భావం లేదు మేధస్సుకందనిదేదీ లేదు.
  • చెప్పుల్లేవని ఏడ్చేవాడికి, కాళ్ళులేని వాడు కనిపించేవరకు, అర్ధంకాలేదట తానెంతటి అదృష్టవంతుడో!
  • మనిషికి మంచీ చెడూ అనే ఆలోచన లేకపోతే నీతి నియమం పాటించాలనే వివేకం లేకపోతే కనిపించినదంతా కావాలనే ఆశ చావకపోతే మనిషికీ – గొడ్డుకు తేడా ఏముంది?
  • చెప్పడం తేలిక – చేయడం కష్టం తప్పుల్లేకుండా చేయడం మహా కష్టం ఏమీ చేయనివాడు ఏదో ఒకటి చేసేవాణ్ణి విమర్శించడం మహా తేలిక.
  • మట్టిలో కలిసిపోయే ముందు మంచి పనులు కొన్ని చేయండి, ఒక ఇంటిలో దీపం పెట్టండి, ఒక అభాగ్యుడి జీవితంలో ఆహ్లాదం నింపండి!
  • తనకోసం బ్రతికేవాడు స్వార్ధపూరిత మనిషి భార్యా పిల్లల కొరకు బ్రతికేవాడు సాదాసీదా మనిషి పది మంది శ్రేయస్సు కోరేవాడు మంచిమనిషి సర్వజనుల శ్రేయస్సు కోరేవాడు మహా మనీషి.
  • వేయి మందిలో ఓ వీరుడు పుట్టవచ్చు, పది వేల పామరులకు ఓ పండితుడు పుట్టవచ్చు పది లక్షల మందిని పట్టి పట్టి వెదికినా, ఓ దాత దొర్కడం చాల కష్టం.

మరిన్ని సూక్తులు మీకోసం: