Sri Venkateswara Sri Alamelmanga Thoda In Telugu – శ్రీ వేంకటేశ్వరుడు శ్రీయలమేల్మంగతోడ

శ్రీ వేంకటేశ్వరుడు శ్రీయలమేల్మంగతోడ - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ.కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో శ్రీ వేంకటేశ్వరుడు శ్రీయలమేల్మంగతోడ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

శ్రీ వేంకటేశ్వరుడు శ్రీయలమేల్మంగతోడ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 14
కీర్తన : శ్రీ వేంకటేశ్వరుడు శ్రీయలమేల్మంగతోడ
సంఖ్య : 240
పుట 150
రాగం: సాళంగనాట

సాళంగనాట

11 శ్రీవేంకటేశ్వరుఁడు శ్రీయలమేల్మంగతోడ
కోవిదుఁడై విహరించీ కోడతిరుణాళ్లు

॥పల్లవి||

వెల్లవిరిగా వీధుల వెన్నెలలు గాయఁగా
చల్లని పూవులవాన జడి మించఁగా
వొల్లనే సతులు దన్ను వుగ్గళించి పొగడఁగా
కొల్లలాడీ వలపులు కోడతిరుణాళ్లు

||శ్రీవేం||

ఆటల పాటలవాఁడు అండనే వినిపించఁగా
పాటించి యారగింపులు పైపైఁ జేయఁగా
గాఁటముగ వీడెములు గందములు నందుకొంటా
కోటిభోగాలు భోగించీ కోడతిరుణాళ్లు

||శ్రీవేం||

చేరి పన్నీరు కప్రము శిరసునఁ గులుకఁగా
వూరక యిందరు కొలువులు సేయఁగా
యీరీతి శ్రీవేంకటేశుఁ డిందరుసతులఁ గూడి
కోరికలు వెదచల్లీ కోడలిరుణాళ్లు.

||శ్రీవేం||240

అవతారిక:

‘కోడతిరుణాళ్ళు’ అంటే వసంతోత్సవ అని అర్థం. శ్రీవేంకటేశ్వరుడూ ఆయన దేవేరి అలమేల్మంగ వసంతోత్సవంలో పాలుపంచుకొంటున్నారట. ఆ దృశ్యాన్ని కళ్ళకు కట్టిస్తున్నారు అన్నమాచార్యులవారు. స్వామి వసంతాలు చల్లుటయేకాదు శృంగారవనంలో కోవిదుడై విహరిస్తున్నాడట. అంటే ఆరితేరినవాడై వసంతాలాడుతూ విహరిస్తున్నాడన్నమాట. అసంఖ్యాకమైన సుందరాంగులతో ఆ శ్రీవేంకటేశ్వరుడు కోరికలు వెదచల్లే కోడతిరునాళ్ళు ఆడుతున్నాడట. ‘కప్రము’ అంటే కర్పూరము అని అర్థం. పన్నీరు కర్పూరము బాగా కలిపి తలమీద పోసేవారట ఆ రోజుల్లో.

భావ వివరణ:

శ్రీవేంకటేశ్వరుడు శృంగారపురుషుడు. తన దేవేరి అలమేల్మంగతో ఆయన కోవిదుడై (ఆరితేరిన నేర్పరివలె) కోడతిరుణాళ్ళు (వసంతోత్సవము) జరుపుకొంటూ విహరించీ (విహరించుచున్నాడు.). ఆ వైనం తిలకించండి.

ఆ తిరువీధులలో వెన్నెల వెల్లివిరిసి కాస్తున్నది. ఎవ్వరూ చల్లకనే పూవులవాన జడి (జల్లు) లాగా కురుస్తున్నది. ఆ వసంతోత్సవంలో పాల్గొంటున్న స్త్రీలందరూ తనను వుగ్గిళించి పొగడగా (తన పక్షాన ఉత్తేజ పరుస్తూ పొగుడుతుంటే) ఆ దేవదేవుడు ఆమె వలపులను కొల్లలాడీ (అపహరించాడు). స్వామి కోడతిరుణాళ్ళు అంత చూడ ముచ్చటగా వున్నది.

కొంతమంది అక్కడ ఆడుతున్నారు (నృత్యం చేస్తున్నారు). కొంతమంది మధురంగా గానం ఆలపిస్తున్నారు. వారు అండనే (ఇంటిలోనే) వున్నారు, మరి అంత జోరుగా వసంతాలాడితే ఆలిసిపోయి ఆకలివేస్తుంది కదా! స్వామి అప్పుడు పాటించి (ఆదర పూర్వకంగా కాసేపు విశ్రాంతినిచ్చి పైపై ఆరగింపులు (తేలికపాటి ఆహారం) తీసికొనినాడు. గాటముగా (అధికముగా) వీడెములు తాంబూలములను స్వీకరించాడు. గంధము పూతలు గ్రహించాడు. కోటి భోగాలు (అసంఖ్యాకమైన భోగములను) భోగించాడు. ఆ వసంతోత్సవం కన్నుల పండువగా వున్నది.

ఆహా!! ఎంత అద్భుతమైన దృశ్యమది!! వారి (స్వామివారు ఆయన దేవేరి) శిరసున (తలలమీద) చేరి (స్త్రీలందరూ కలిసి) పన్నీటిలో కలిపిన కప్రము (కర్పూరమును) గులకగా (కుమ్మరించగా వీరంతా స్వామివారి కొలువుకూటమిలో చేరారు. ఈ విధంగా శ్రీవేంకటేశ్వరుడు ఇంతమంది సతులగూడి (సుందరాంగులతో కూడి) వసంతాలాడుతుంటే స్వామిపై కోరిక కలుగనిదెవరికి చెప్పండి. ఆ విధంగా ఆ మనోహరుడు కోరికలు వెదచల్లుతుండే కోడతిరుణాళ్లు ఆడుతున్నాడు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Nalam Va Tava Naya Vachanam In Telugu – నాలం వా తవ నయవచనం

నాలం వా తవ నయవచనం - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో నాలం వా తవ నయవచనం కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

నాలం వా తవ నయవచనం – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 6
కీర్తన : నాలం వా తవ నయవచనం
సంఖ్య : 157
పుట : 113
రాగం : రీతిగౌళ

రీతిగౌళ

27 నాలం వా తవ నయవచనం
చేలం త్యజ తే చేటీ భవామి

||పల్లవి||

చల చల మమ సంసర్ఘటనే కిం
కులిశహృదయ బహుగుణవిభవ
పులకిత తనుసంభృత వేదనయా
మలినం వహామి మదం త్యజామి.

||నాలం||

భజ భజ తే ప్రియాభామాం సతతం
సుజన స్త్వం నిజసుఖ నిలయ
భుజ రేఖా రతి భోగిభవసికిం
విజయీభవ మద్విధిం వదామి.

||నాలం||

నయ నయ మా మనునయనవిధం తే
ప్రియకాంతాయాం ప్రేమభవమ్
భయహార వేంకటపతే త్వం మ-
త్రియో భవసి శోభితా భవామి.

||నాలం||

అవతారిక:

జయదేవకవి స్ఫూర్తితో చాలామంది గీర్వాణలో శృంగార కీర్తనలు రచించారు. అన్నమాచార్యులవారు సాళ్వ నరసింహరాయలు కొలువులో వున్నప్పుడూ అసంఖ్యాకమైన సరసశృంగార కీర్తనలు చెప్పారు వేంకట మకుటంతో రాజుగారి ఆస్థానంలో విద్వత్ గోష్ఠులు జరిగే తరుణంలో పాండితీ ప్రదర్శనకు కవులు సంస్కృతంలో కవిత్వం చెప్పేవారేమో అనిపిస్తుంది. ఈ కీర్తనలో నిందాస్తుతిని ఇతివృత్తంగా యెన్నుకొన్నారు. నాయిక విర హెూత్కంఠితయై స్వామిని నిందిస్తున్నది. దెప్పి పొడుస్తున్నది. చివరికి రాజీకి రాక తప్పలేదు. నీవు నా ప్రియుడివైతే నేనూ శోభిస్తాను కదయ్యా! అంటున్నది.

భావ వివరణ:

నీయొక్క నయవంచనతో కూడిన మాటలు ఇక చాలించవయ్యా! ముందు నా పైట కొంగును విడిచిపెట్టు. నీదాసినౌదునులే. నన్ను వదలిపెట్టు.

ఓ కులిశహృదయా! (కఠినహృదయుడా! నీకు నాతో పొత్తు యెందులకు? చాలు చాలు. పో పొమ్ము. ఓ బహుగుణ విభవా! (అనేక గుణములు పుణికి పుచ్చుకున్నవాడా!) చాలు చాలు పో పో. నేను పులకించిన గాత్రము (శరీరం) వలన పొందిన వేదన యొక్క మాలిన్యమును ధరించియున్నాను. ఇక నా అహమును విడనాడి నీకు వశమైతిని.

నీవు యెల్లప్పుడూ నీ వలపుకత్తెనే స్మరిస్తుంటావు. నీవు గొప్పవాడివి కదా! గొప్పవాళ్ళకి స్త్రీ వ్యసనం సహజమేలే. పైగా నీవు బ్రహ్మానందానికి నిలయుడవట కదా! నీ భుజములపై రతికూటముల చిహ్నములు కొట్టవచ్చినట్లు కనబడుతూనే వున్నాయి కదా! పోనీలే. నీకు అంతా విజయమేలే. నా తిప్పలు నీకెందుకు పట్టాయి గనుకా!

నన్ను బుజ్జగించే విధానమును కూడా కాస్త నీవు తెలుసుకోకూడదటయ్యా! నీ ప్రియకాంతకే నీవలపులనందించుకో. మధ్యలో నిన్ను కాదన్న వాళ్ళెవరు? నాకేమి పట్టింది? భయహరుడవైన ఓ శ్రీవేంకటేశ్వరా! నీవు నా ప్రియుడవైనచో నేను కూడా శోభించెదను కదా! స్వామీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Vovo Raakaasulaala Voddu Sundi Vairamu In Telugu – వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము

వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 15
కీర్తన: వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము
సంఖ్య : 140
పుట: 93
రాగం: గౌళ

గౌళ

69 వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము
దేవుని శరణనరో తెలుసుకోరో

||పల్లవి||

జగములో రాముఁడై జనియించే విష్ణుఁ డిదె
అగపడి లక్ష్మి సీత యయి పుట్టెను
తగు శేషశంకచక్ర దైవసాధనము లెల్ల
తగిలి లక్ష్మణ భరత శత్రుఘ్నులయిరి

||వోవో||

సురలు వానరు లైరి సూర్యుఁడు సుగ్రీవుఁడు
మరిగి రుద్రుఁడు హనుమంతుఁడాయెను
సరుస బ్రహ్మదేవుఁడు జాంబవంతుఁడైనాఁడు
వెరవరి నలుఁడే విశ్వకర్మ నుండి

||వోవో||

కట్టిరి సేతు వప్పుడే ఘను లెల్లా దాఁటిరి
ముట్టిరి లంకా నగరమును దళము
అట్టి శ్రీవేంకటేశుఁ డాతఁడే యీతఁడై
వొట్టుచు వరము లిచ్చె వొనర దాసులకు

||వోవో||

అవతారిక:

పెదతిరుమలాచార్యులవారు చెప్పిన ఈ కీర్తనలో రాక్షస స్వభావం కలిగినవారిని హెచ్చరిస్తున్నారు. ఒరే రాకాసుల్లారా! మీకు మాతో వైరము వద్దురా. మేము ఈ ఏడుకొండలవాడిని శరణని హాయిగా వున్నవాళ్ళం. మీరూ అదేపని చేయండి. ఆ నాడు త్రేతాయుగంలో మీ రావణాసురుని చంపటానికి ఆ విష్ణువు తన పరివారంతో సహా భూమ్మీద అవతరించి మిమ్మల్నందరినీ మట్టికరిపించాడు. దుష్ట శిక్షణాకార్యక్రమం పూర్తిచేసికొని నేడు తన శరణాగతులకు అంతులేని వరములనిస్తున్నాడు. మీరంతా మీ ప్రవర్తన మార్చుకోండిరా! అంటున్నారు.

భావ వివరణ:

ఓరోరీ! రాక్షసులారా! సన్మార్గులతో వైరము (శతృత్వం) వద్దు సుండీ (సుమా!) ఈ శ్రీవేంకటేశ్వరుడే దేవుడు (భగవంతుడు). ఈ సంగతి తెలుసుకోండిరా! ఈ దేవదేవుని శరణు అనండిరా!

(ఈయనే ఆదిదేవుడైన శ్రీమహావిష్ణువు. రావణుడు నరులను వానరులను తన కాలిగోటికి సరిరారని భావించి, బ్రహ్మను వరములడిగేటప్పుడు దేవ, దానవ, యక్ష, కిన్నెర, కింపురుష మొదలైన వారితో తనకు మృత్యువు రాకూడదన్నాడు. వాడిని చంపటానికి విష్ణువు తన పరివారంతో సహా భూమిపై నర వానరులుగా తల్లి కడుపులద్వారా పుట్టి వాడిని నిర్జించాడు. వాళ్ళంతా యెవరెవరు యెలా పుట్టారో తెలుసుకొని ఆనందించండి.)

ఆ శ్రీమహావిష్ణువు భూమిపై రామునిగా జన్మించాడు. అగపడి (తానూ సిద్ధమై) లక్ష్మీదేవి సీతయై పుట్టింది. ఆయన పరివారమైన ఆదిశేషుడు, సుదర్శన చక్రము, పాంచజన్య శంఖమూ ఆ రాముని సోదరులు లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నులవలె జన్మించారు.

ఆ శ్రీహరి పరివారమంతా రాముని పరివారంగా యెలా వానరజన్మలెత్తారో తెలిసి ఆనందించండి. సూర్యుడే సుగ్రీవునిగా అవతరించాడు. రుద్రుడు (శంకరుడు) మహా బుద్ధిమంతుడైన హనుమతుడయ్యాడు. బ్రహ్మదేవుడు భల్లూకపతియైన జాంబవంతునివలె అవతరించాడు. వారధిని నిర్మించిన నలుడే దేవశిల్పి విశ్వకర్మ సుమా!

ఆ తరువాత కథ మీ అందరికీ తెలిసిందే కదా! వారంతా రావణ వధ కోసం ఘనులై అప్పుడే సేతువును కట్టి, దాటి, లంకానగరమును ముట్టిరి (ముట్టడించిరి). ఆ తిరుమల శ్రీవేంకటేశ్వరుడె ఈనాడు, ఇక్కడ శ్రీరామచంద్ర మూర్తిగా వెలసి ఒనర (ఒప్పునట్లుగా) తనదాసులకు ఒట్టుచు (శపధముతో) అనేక వరములిస్తున్నాడు. రాండర్రా! మీరు వచ్చి ఈయనను ఆశ్రయించండి.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Anjani Devi Koduku Hanumantudu In Telugu – అంజినీదేవి కొడుకు హనుమంతుడు

అంజినీదేవి కొడుకు హనుమంతుడు - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో అంజినీదేవి కొడుకు హనుమంతుడు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అంజినీదేవి కొడుకు హనుమంతుడు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 4
కీర్తన : అంజినీదేవి కొడుకు హనుమంతుడు
సంఖ్య : 272
పుట : 182
రాగం : మాళవి

మాళవి

16 అంజినీదేవికొడుకు హనుమంతుఁడు
సంజీవినిదెచ్చినాఁడు సారె హనుమంతుఁడు

॥పల్లవి||

కలశాపురముకాడ కదలీవనాల నీఁడ
అలవాఁడె వున్నవాఁడు హనుమంతుఁడు
అలరుఁ గొండలకోనలందలిగుహలలోన
కొలువు సేయించుకొనీఁ గోరి హనుమంతుఁడు

|| అంజి||

పసలుగా జంగవెట్టి పండ్లగుత్తి చేతఁబట్టి
అసురలనెల్లఁ గొట్టీ హనుమంతుఁడు
వసుధఁ బ్రతాపించి వడిఁ దోఁక గదలించి
దెసలెల్లాఁ బాలించీ దివ్యహనుమంతుఁడు

|| అంజి||

వుద్దవిడి లంకచొచ్చి వుంగరము సీతకిచ్చి
అద్దివో రాము మెప్పించె హనుమంతుఁడు
అద్దుక శ్రీవేంకటేశు కటుబంటై వరమిచ్చి
కొద్ది మీర సంతోసాలే గుప్పీ హనుమంతుఁడు

|| అంజి|| 272

అవతారిక:

కలశాపురంలో వెలసిన హనుమంతునిపైచక్కటి కీర్తన వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. అంజినీదేవి కుమారుడైన ఈ రామబంటు సారెగా సంజీవని పర్వతం తీసికొని వచ్చాడు, అంటున్నారు. సారెగా అంటే పెట్టుబడిగా అని అర్థం చెప్పుకోవాలి. ఉద్ద విడి అంటే చాలా గొప్పగా అని భావించవచ్చును. ఈయన ఆయుధం ఏమిటో తెలుసా? ‘పండ్లగుత్తి’ అంటే ముళ్ళలాంటి పొలుసులున్న గద అన్నమాట. ఆయనతోక కదులుతున్నట్లు భావించగలిగిన ఈ పదకవితాపితామహుడు నిజంగా ధన్యజీవి

భావ వివరణ:

ఓ ప్రజలారా! అంజినీదేవి కుమారుడైన ఈ హనుమంతుడు, రామలక్ష్మణులను రక్షించుటకు సారెగా (పెట్టుబడిగా.. లేక… అర్పణగా) సంజీవినీ పర్వతము తీసికొని వచ్చినాడు.

అల (అదిగో) కలశాపురం అనే ఈ వూరిలో కదలీవనాల నీడ (అరటి తోటల చల్లని నీడలలో) వున్న వాడే హనుమంతుడు. ఈ మహానుభావుడు యెక్కడో కొండల కోనలలో వున్న గుహలో వెలసి, కోరి తన భక్తుల ద్వారా కొలువు చేయించుకొనినాడు. ఈ హనుమంతుడు ఈ రీతిని అలరుచున్నాడు.

పసలుగా (మృదువుగా) జంగవెట్టి (కాళ్ళఅంగజాచి), పండ్లగుత్తి (ముళ్ళవంటి పండ్లు వున్న గదను) చేతిలో పట్టుకొని రాక్షసులనందరినీ ఈ హనుమంతుడు చావబాదినాడు. దివ్యత్వముగల ఈ హనుమంతుడు, ప్రతాపించి (ప్రతాపమును చూపి) తనతోకను వడిన్ కదలించి (వేగముగా వూపి) పాలించీ, దెసలెల్లా (దిక్కులన్నీ ఏలుచున్నాడు).

ఆనాడు త్రేతాయుగంలో ఈయన యేమి చేశాడో తెలుసా? వుద్దవిడి (చాలా గొప్పగా) లంకలోకి చొచ్చి (దూరి) శ్రీరామముద్రికయైన వుంగరమును సీతాదేవికిచ్చి అద్దివో (అదిగో ఆయన శ్రీరామచంద్రుని మెప్పించినాడు. ఈనాడు కలియుగంలో, అటు (ఆ తిరుమల శిఖరాలపై) శ్రీవేంకటేశ్వరునకు బంటై తన భక్తులకు వరమిచ్చి కొద్దిమీర (అశేషముగా) సంతోషములను గుప్పించుచున్నాడు. ఈ స్వామిని సేవించి తరించండి.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sarveswara Nito Sariyevvaru In Telugu – సర్వేశ్వరా నీతో సరియెవ్వరు

సర్వేశ్వరా నీతో సరియెవ్వరు – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో సర్వేశ్వరా నీతో సరియెవ్వరు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

సర్వేశ్వరా నీతో సరియెవ్వరు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : సర్వేశ్వరా నీతో సరియెవ్వరు
సంఖ్య : 303
పుట: 203
రాగం: ముఖారి

ముఖారి

56 సర్వేశ్వరా నీతో సరి యెవ్వరు
పూర్వపువారు చెప్పఁగాఁ బూఁచి కొలిచిఏఁగాని

||పల్లవి||

చేరి వేదములు నిన్నుఁ జెప్పఁగా వినుటేకాని
నీరూపము దర్శించేవార లెవ్వరు
ధారుణిలో నీ యవతారాలే చూచుట
ధీరత నీమహిమలు తెలిపేవారెవ్వరు

||సర్వే||

భూమివాకరిఁ జూచి నిన్నుఁ బూజలు సేయుటగాని
కామించి నీతో మాటాడే ఘను లెవ్వరు
దీమసాన నీదాసుల ద్రిష్ట మెరుఁగుటగాని
యీమేర నీదైవిక మెరిఁగేనా రెవ్వరు

||సర్వే||

వరములు నీవియ్యఁగా వచ్చి సేవించుటగాని
కెరలి నీమూర్తి వెదకేవా రెవ్వరు
హరి శ్రీవేంకటేశా నీకరుణవారౌటగాని
ఆరసి నిన్ను సుద్దులడిగేవా రెవ్వరు

||సర్వే||

అవతారిక:

భూమి మీద ఇంతమంది ‘దేవుడు’ అని కొలిచే వాడిని చూసిందెవరు? పోనీ ఆ దేవుడి మాటలను విన్నదెవరు? పూర్వము వారు చెప్పగా ఔనేమో అనుకోవడమే కాని ఆయన అనుభవం పొందినవాడెవడు? సర్వేశ్వరుడైన ఆయనతో సరియైనవారు లేరు. ఆయననుంచి ఏవో వరాలు ఆశించి సేవించే వారేగాని వారేగాని ఆయనను తెలుసుకోవాలని తెలుసుకోవాలని వెదకేవారేలేరు అంటున్నారు అన్నమాచార్యులవారు. ఇదికూడా తేలిక అనిపించే అతి క్లిష్టమైన కీర్తన. ఈ కీర్తన పాడినప్పుడు ఆచార్యులవారి మనోభావాలు సులభగ్రాహ్యం అనిపించుటలేదు. జాగ్రత్తగా పరిశీలిద్దాం.

భావ వివరణ:

ఓ సర్వేశ్వరా! నీతో సరియైన వారలెవ్వరు? పూర్వపువారు (మా పెద్దలు) చెప్పగా ఔనేమో నని పూచి (ప్రయత్నపూర్వకంగా) కొలుస్తున్నాను. కానీ నిన్ను తెలుసుకోలేకున్నాను.

ప్రభూ! వేదము నీగురించి వర్ణించగా వినుటయే కాని నీ రూపమును దర్శించినవారలెవ్వరు? ధారుణి (భూలోకంలో) నీయవతారాలను చూచిన వారు ఆయా యుగాలలో వున్నారేమో గాని ధీరతతో (గాఢమైన నమ్మకంతో) నీ మహిమను తెలిసినవారెవ్వరు?

దేవా! ఈ భూమి మీద వున్న మాతోడి మానవులనుచూచి వారుచేసినట్లే నిన్ను పూజిస్తున్నాను. నిజానికి కావాలని ప్రయత్నించి నీతో మాట్లాడిన మానవమాత్రుడెవడు? అంతటి ఘనులెవ్వరైనా ఉన్నారా? దీమసాన (నేర్పుతో) నీదాసులయొక్క ద్రిష్టము (అదృష్టము) యెంతగొప్పదో తెలుసుకోవటమేకాని, యీమేర (వైపున నీ దైవికము (దివ్యశక్తిని) యెరిగే వారెవరున్నారు? అనుభవేక వేద్యమైన నీ మహిమ తెలియుటెట్లు సాధ్యము?

దేవా! నీవు కోరిన వరములిస్తావనే ఆశతో దూరభారమునెంచక నీవద్దకు వచ్చి సేవించేవారేగాని, కెరలి (అతిశయించి) నీ మూర్తిని (దివ్యమంగళ రూపాన్ని) వెదకే వారెవ్వరున్నారు? ఓ శ్రీహరీ! ఓ శ్రీవేంకటేశ్వరా! అంతా నీ కరుణ పొందాలనుకొనేవారే కాని, నిన్ను అరసి (నీపై దృష్టి సారించి) నీ సుద్దులు (నీపుణ్యకథలు) అడిగేవారెవ్వరు? (వినాలని తహతహలాడేదెవరు?) హతవిధీ! నేటి పరిస్థితి ఇంకా ఘోరంగా వున్నది తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Kalasaa Puramukada Gachkunnadu In Telugu – కలశాపురముకాడ గాచుకున్నాడు

కలశాపురముకాడ గాచుకున్నాడు – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో కలశాపురముకాడ గాచుకున్నాడు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కలశాపురముకాడ గాచుకున్నాడు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : కలశాపురముకాడ గాచుకున్నాడు
సంఖ్య : 216
పుట: 145
రాగం: మాళవి

మాళవి

55 కలశాపురముకాడఁ గాచుకున్నాఁడు
వలసినవరాలిచ్చీ వాయునందనుఁడు

||పల్లవి||

మాయాబిలముచొచ్చి మగుడి యంబుధిలోని-
చాయాగ్రహముఁ జంపి చయ్యన దాఁటి
ఆయెడ లంకిణిఁ గొట్టి యంతలో జానకిఁగని
వాయువేగానవచ్చిన వాయునందనుఁడు

||కల||

కడలిదరినుండిన కపులతోఁ గూడుకొని
వడదీరఁగా మధువనము చొచ్చి
బడి రామునికి సీతాపరిణామమెల్లాఁ జెప్పె
వడిగలవాఁ డితఁడు వాయునందనుఁడు

||కల||

రావణాదిరాక్షసుల రామునిచే సాధింపించి
ఆ విభుని సీతఁ గూర్చి అయోధ్యనుంచె
శ్రీవేంకటేశుఁ గొల్చి శిష్టరక్షణమునకై
వావిరి నిలుచున్నాఁడు వాయునందనుఁడు

||కల|| 216

అవతారిక:

కలశాపురములో వెలసిన హనుమంతునిపై చక్కటి కీర్తన చెబుతున్నారు అన్నమాచార్యులవారు. వాయుసుతుడైన ఈ హనుమంతుడు తన భక్తులకు కావలసిన వరములనిస్తున్నాడు. ఆయన అందుకోసమే కాచుకొనివున్నాడు అంటున్నారు. ఆ హనుమంతుడు సీతను రామచంద్రుని కలిపి అయోధ్యనుంచే శ్రీవేంకటేశుని గొల్చి శిష్టరక్షణకై వావిరి నిలుచున్నాడట. అంటే ‘అధికుడై” నిలుచున్నాడట. పనిలోపనిగా హనుమంతుని ప్రతాపాన్ని వివరించే రామాయణ అంతర్గత కథలను వుటంకిస్తున్నారు.

భావ వివరణ:

ఈ వాయునందనుడైన హనుమంతుడు, కలశాపురము వద్ద కాచుకొని యున్నాడు. (నిరీక్షించుచున్నాడు). శ్రీరామ భక్తులకు, తనను నమ్మిన భక్తులకు ఆయన లెక్కకు మించిన వరములను అనుగ్రహించుచున్నాడు.

సీతాన్వేషణ సమయంలో మాయాబిలం (గుహ)లో ప్రవేశించిన వానరులు దిక్కుతోచక అల్లాడుతుంటే, ఆపద్భాంధవుడై ఆదుకొన్నదీ హనుమంతుడే. మగుడి (తదనంతరం) అంబుధి దాటే సమయంలో ‘సింహిక’ నీడ వలె తననాక్రమించి రామకార్య విఘాతమునకు వొడిగడితే దానిని చంపివేశాడు. లంకలో లంకిణిని ఒక్క గుద్దుతో మట్టి కరిపించాడు. అంతలో జగన్మాత జానకీదేవిని అశోకవనంలో చూచి రామకార్యం నెరవేర్చి వాయువేగాన తిరిగివచ్చి కపివర్యుల ప్రాణాలు నిలబెట్టాడు. ఈ వాయునందనుడు జగజ్జెట్టి.

ఆపైన కడలి దరి నుండిన కపులతో (సముద్రం ఒడ్డున తనకోసం నిరీక్షిస్తున్న వానరులతో) గూడుకొని (కలసి) వడదీరగ (అలసటనుపశమించుటకు) మధువనము ప్రవేశించి నానా అల్లరి చేశాడు. అటు పిమ్మట సత్వరమే రామునికి సీతాదేవి పరిణామము (వర్తమానము) నెల్లా వివరించాడు. ఈ వాయునందనుడు వడిగలవాడు (చాలా వేగము కలవాడు).

ఆ వెనుక జరిగిన రామరావణ యుద్ధంలో ఈయన పాత్ర మరువలేనిది. రావణాది రాక్షసులనందరిని రామునిచేత సాధింపించినవాడు (నెగ్గుటకు దోహదపడినవాడు) ఈయనే. ఆ విభునికి (శ్రీరామచంద్రునకు) సీతను గూర్చి (కలిపి) అయోధ్యలోవుంచి (పునః ప్రతిష్ఠించినాడు). నేడు ఈ కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడై నిలిచిన తన రాముని గొల్చుచున్నవాడై ఈనాటి ఆవశ్యకతననుసరించి శిష్ట రక్షణకై (సన్మార్గులను సంరక్షించుచూ ఈ వాయునందనుడు కలశాపురములో వావిరి (అధికుడై) నిలుచునియున్నాడు. ఈ స్వామిని సేవించి తరించండి.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Kodekadu Gadavamma Govindaraju In Telugu – కోడెకాడు గదవమ్మ గోవిందరాజు

కోడెకాడు గదవమ్మ గోవిందరాజు – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో కోడెకాడు గదవమ్మ గోవిందరాజు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కోడెకాడు గదవమ్మ గోవిందరాజు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 14
కీర్తన : కోడెకాడు గదవమ్మ గోవిందరాజు
సంఖ్య : 95
పుట:57
రాగం: దేశాక్షి

దేశాక్షి

8 కోడెకాఁడు గదవమ్మ గోవిందరాజు
వేడుక మోవులతేనె విందారగించీని

||పల్లవి||

కొలువు కూటములోన గోవిందరాజు వాఁడే
పలుమారుఁ జెలులతోఁ బందేలాడీని
నిలువుల మేడమీఁద నిలిచి గోవిందరాజు
వలపులు చల్లుచును వసంతాలాడీని

||కోడె||

కోరి కేళాకూళిలోన గోవిందరాజు వాఁడే
సారె నింతులతో నీరు చల్లులాడీని
తూరుచు సింగారపుఁ దోటలో గోవిందరాజు
సైరణ లేకందరితో జాజరలాడీని

||కోడె||

గోముల శ్రీవేంకటాద్రి గోవిందరాజు వాఁడె
రామలతోడుతను సరసమాడీని
గామిడై పాన్పుపైఁ గూడి కందువ గోవిందరాజు
మోములు చూచందరితో ముచ్చటలాడీని.

||కోడె||

అవతారిక:

నిఘంటువు సాయం లేకపోతే ఈ కీర్తన వివరించడం దాదాపు అసాధ్యమే. కోడె వయసుగాడైన గోవిందరాజు వేడుకతో అధరామృతాల నాస్వాదిస్తుంటాడట. నిలువులు మేడమీద నిలిచివుంటాడట. కేళాకూళి అంటే జలక్రీడలని అర్థం. అవంటే మహా ఇష్టంట ఆయనకి. సైరణలేక జాజరచల్లుతాడట. రామలతో సరసాలాడతాడట. మోములు చూచి అందరితో ముచ్చట్లాడతాడట. పాన్పుపై గామిడై కూడినాడట. ఒకటారెండా? దాదాపు అన్నీ తెలియని తెలుగుమాటలే. తెలివిగా భావవివరణ చదివేద్దాం. పదండి ముందుకు. ఇంతకీ ఈ కీర్తన తిరుపతిలోని గోవిందరాజ స్వామిపైననే సుమండీ.

భావ వివరణ:

ఓ భామలారా! ఈ గోవిందరాజస్వామివున్నాడే, ఈయన కోడెగాడు గదమ్మా (కోడెవయసువాడు కదుటమ్మా!) ఈయన వేడుకతో భామల మోవితేనెలు (అధరామృతములను) విందారగించీని (విందువలె నాస్వాదిస్తాడు).

ఈ గోవిందరాజస్వామి తన కొలువుదీర్చియున్నాడు. కానీ తన చెలులతో (ఇద్దరు భామలు భూదేవి శ్రీదేవిలతో) పందేలాడీని (పందెములు కాస్తున్నాడు). ఆయన నిలువులు మేడల మీద (ఎత్తయిన మేడలమీద) నిలిచి అందరినీ పరికిస్తుంటాడు. తన చెలియలతో వలపులు చల్లుతూ వసంతోత్సవం చేసికొంటాడు (హెూలీ ఆడుతుంటాడన్నమాట).

ఆ గోవిందరాజస్వామికి ఇంకొక ఇష్టమైన ఆట వున్నది. అదే కేళాకూళి (జలక్రీడ). బహు కోరికతో ఆయన జలక్రీడను ఇంతులతో (స్త్రీలతో) నీరు చిమ్ముతూ చల్లులాడీ (చల్లుతూనే వుంటాడు). ఆయన శృంగార వనములో తూరుచు (దూరిపోయి) సైరణ లేక (ఆపటం అనేదే లేకుండా) జాజరలాడీని (వున్నట్టుండి వెనుక నుండి నీళ్ళు చిమ్మటం లాంటి కొంటె పనులు చేస్తుంటాడు).

ఈ గోవిందరాజస్వామే, గోముల (సౌకుమార్యంతో) శ్రీవేంకటాద్రిపై రామలతో (స్త్రీలతో) సరసములాడీని (సరసములాడుతున్న) శ్రీవేంకటేశ్వరుడు కూడా అయివున్నాడు. గామిడై (సర్వశ్రేష్ఠుడై) ఈ గోవిందరాజస్వామి తన శయ్యపై, కందువ గూడి (సమర్ధుడై కూడి) మోములు చూచి (వారి అందమైన మొగములను తదేకంగా చూస్తూ) ముచ్చటలాడుతుంటాడు. (ఇన్ని చేస్తూ కూడా శరణాగతులను ఒక కంట కనిపెడుతూనే వుంటాడు సుమా!)

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Naruda Yitadu Adinarayanudu Gaka In Telugu – నరుడా యీతడు ఆదినారాయణుడు గాక

నరుడా యీతడు ఆదినారాయణుడు గాక – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో నరుడా యీతడు ఆదినారాయణుడు గాక కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

నరుడా యీతడు ఆదినారాయణుడు గాక – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : నరుడా యీతడు ఆదినారాయణుడు గాక
సంఖ్య : 497
పుట: 336
రాగం: సాళంగనాట

సాళంగనాట

4 నరుఁడా యీతఁడు ఆదినారాయణుఁడు గాక
ధరణిఁ గీరితి కెక్కె దశరథసుతుఁడు

||పల్లవి||

యీతఁడా తాటకిఁ జంపె నీ మారీచసుబాహుల
నీతఁడా మదమణఁచె నిందరుఁ జూడ
యేతులకు హరువిల్లు యీతఁడా విరిచి యట్టె
సీతఁ బెడ్లియాడెను యీ చిన్న రాముఁడా

||నరుఁ||

చుప్పనాతి ముక్కుగోసి సోదించి దైత్యులఁ జంపి
అప్పుడిట్టె వాలినేసినాతఁ డీతఁడా
గుప్పించి కోఁతుల నేలి కొండల జలధిగట్టి
కప్పి లంక సాధించె నీ కౌసల్యానందనుఁడా

||నరుఁ||

రావణాదులను జంపి రక్షించి విభీషణుని
భావించయోధ్య నీతఁడు పట్ట మేలెను
శ్రీవేంకటేశుఁ డితఁడే సృష్టి రక్షించె నితఁడే
యీవల మాపాలనున్న యీ రామచంద్రుఁడా

||నరుఁ||

అవతారిక:

విశిష్టా ద్వైతమత ప్రచారకుడై అన్నమాచార్యులవారు వూరూరా తిరిగి తన కీర్తనలను వినిపించి మరీ విష్ణుతత్త్వం ప్రబోధించారు. ఆ రోజుల్లో రామాలయంలేని వూరు వుండేదికాదు. ఏవూరికెళ్తే ఆవూరి శ్రీరామునిపై కీర్తన చెప్పేవారు. ప్రతి కీర్తనలోనూ రామకథను ఆద్యంతం గానం చేయడం ఆయన ప్రత్యేకత. బహుశా ఆ వూరిలో సంస్కృత పండితులెక్కువమంది వుంటే కీర్తన గీర్వాణిలో చెప్పేవారేమో. అందుకనే అన్నమయ్య సంస్కృత కీర్తనలు యెక్కువగా శ్రీరామునిపైనా నృశింహునిపైనా వున్నాయని నాకు అనిపిస్తుంది. అందుకే… ఓ నరులారా! ఈతడు ఆదినారాయణుడు దశరథసుతునిగా ధరణిలో కీర్తిని పొందాడు… అంటున్నారు.

భావ వివరణ:

ఓ నరులారా! ఈతడెవరనుకొన్నారు? ఆదిదేవుడైన ఆదినారాయణుడు. గాక (అయితే) ధరణిన్ కీరితికెక్కె (భూలోకంలో పేరుపొందినది మాత్రం) దశరథ సుతుడైన శ్రీరామచంద్రమూర్తి అనే సుమా! (మరి ఆయన చేసిన ఘనకార్యాలు అట్లున్నవి).

ఈయన తాటకి అనే రాక్షసిని సంహరించాడు. ఇందరుజూడ (విశ్వామిత్రుని యాగమును చూచుటకు వచ్చిన ఇంత మంది చూస్తుండగా) ఈయన దాని కొడుకులైన మారీచ సుబాహుల మదమును అణచినాడు. ఈచిన్నారి రాముడు, ఏతులకు (ఉద్ధతితో) శివధనస్సును విరిచి అట్టే (అవలీలగా) సీతను పెండ్లాడినాడు.

ఈయన లక్ష్మణుని ప్రేరేపించి ‘చుప్పనాతి’ అని పేరువడ్డ శూర్పనఖ ముక్కు చెవులను కోయించినాడు. సోదించి (వెదకి సోదించి (వెదకి వెదకి) రాక్షసులను సంహరించినాడు. ఆ తరువాత రావణాసురునివంటి వాని మదమణచిన వాలిని ఒక్క అమ్ము వేసి మట్టుబెట్టాడు. ఆ మహానుభావుడే ఈ చిన్నారి రాముడా!! కుప్పించి యెగిరే కోతులను ఒక సేనగా నడిపించిన నాయకుడా!! అవునయ్యా! ఈ కౌసల్యానందనుడే జలధిగట్టి (సముద్రముపై సేతువును నిర్మించి రావణునిపై దండెత్తి స్వర్ణలంకను సాధించినాడు.

ఆనాడావిధంగా రావణుని సంహరించాక ఆ లంకను రావణుని తమ్ముడైన విభీషణునికే పట్టము గట్టిన ధర్మమూర్తి ఈయన. తమ కోసల రాజధాని అయోధ్యా నగరానికి పట్టాభిషిక్తుడై పరిపాలించాడు. ఆనాటి త్రేతాయుగానంతరం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడై తదనంతరం ఈ కలియుగంలో ఇతడే కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడై ఈ సృష్టిని రక్షిస్తున్నాడు. ఈ శ్రీరామచంద్రడే మా పాలనున్నాడు (మా పాల దైవమై వున్నాడు).

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

  1. శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును
  2. వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము
  3. దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ
  4. ఘనుడాతడా యితడు కలశాపురముకాడ
  5. బోధింపరే యెరిగిన బుధులాల పెద్దలాల
  6. దాసోహమనుబుద్ధిదలచరు దానవులు
  7. నారాయణుడ నీనామమె మంత్రించివేసి

Okarigaanaga Nodabadadu Manasu In Telugu – ఒకరిగానగ నొడబడదు మనసు

ఒకరిగానగ నొడబడదు మనసు – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో ఒకరిగానగ నొడబడదు మనసు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఒకరిగానగ నొడబడదు మనసు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన: ఒకరిగానగ నొడబడదు మనసు
సంఖ్య : 534
పుట: 359
రాగం: సాళంగనాట

సాళంగనాట

42 ఒకరిఁ గానఁగ నొడఁబడదు మనసు
సకలముహరియని సరిఁదోఁచీని.

||పల్లవి||

అంతరాత్మ శ్రీహరి యతఁ డొకఁడే
జంతువులన్నియు సమములే
బంతులఁ బాత్రాపాత్రము వెదకిన
అంతట హరిదాస్యమేపో ఘనము.

||ఒక||

జగమును నొకటే చైతన్య మొకటే
తగినపంచభూతము లొకటే
నగుతా నెదిరిని నన్నును నెంచిన
మొగి నాపై హరిముద్రలె ఘనము.

||ఒక||

కారు స్వతంత్రులు కడపట నొకరును
యీరీతి నౌఁగాము లిఁక నేలా
శ్రీరమణీపతి శ్రీవేంకటేశుఁడే
కారణము శరణాగతియే ఘనము.

||ఒక||534

అవతారిక:

హరిహరుల మధ్య అంతరం యెలా సాధ్యం? రెండూ పరమాత్మ రూపాలే. రక్షణ భారం హరిదైతే లయం చేసే బాధ్యత హరుడిది. ఇది పురాణాలు నొక్కి వక్కాణిస్తున్నా, కొందరు అజ్ఞానులు హరిహరదూషణ చేసి పాపం మూట కట్టుకుంటున్నారు. జగమున నున్నది చైతన్యమొక్కటే అని హితబోధ జేస్తున్న అన్నమాచార్యులవారిని ఆలకించండి. ‘సకలము హరిమయమని సరిదోచీని’ అంటున్నారు. ఈసృష్టిలో ఆపరాత్పరుడు తప్ప యెవ్వరూ స్వతంత్రులు కారు. అందరూ ఆయన ఆజ్ఞానువర్తనులే. ఇక ఔగాములేల అంటున్నారు. అంటే మేలుచేసేదెవడు? కీడుచేసేదెవడు అన్నీ ఆ నామాలవాడే, మనిషి మానవత్వంలేకపోతే జంతువే కదా! రెండుకాళ్ళ జంతువు.

భావ వివరణ:

ఓ ప్రజలారా! నా మనస్సు ఒకరిన్ (వేరే ఇంకొకరిని కానగ (దర్శించుటకు) ఒడబడదు (అంగీకరించదు). నాకు సకలము హరియని సరిదోచీని (సరిగా అనిపిస్తున్నది). అయినా సత్యమేమిటో వినండి.

మన అందరిలో అంతరాత్మ రూపంలో వున్న శ్రీహరి ఒక్కడే. జంతువులు అన్నియూ సమానమే. మనస్సు అనేది ఒకటి వుండుటచేత మనిషి మేలైన జంతువయ్యాడు. తన మనస్సులో శ్రీహరిని నిలపగలిగితే పాత్రత (యోగ్యత) కలుగుతుంది. లేకపోతే వాడూ యోగ్యతలేని ద్విపాదపశువే కదా! వంతుల (పంతముతో) వెదకితే అపాత్రుడైన ద్విపాదపశువును పాత్రుడైన ఘనుని చేయగలిగిన దేమిటి? హరిదాస్యమే..పో. (కేవలం శ్రీహరిదాసునిగా జీవించటమే).

ఈ జగత్తంతా ఒక్కటే. ఇందులో వుండే చైతన్యము (కదిలేశక్తి) కూడా ఒక్కటే. పంచభూతములు (భూమి, నీరు, కాంతి, గాలి మరియు ఆకాశము) ఏదో ఒక రూపంలో ప్రతిదాంట్లో వున్నాయి. వుండాలి కూడా. కాబట్టి అవి కూడా ఒక్కటే. మరి అటువంటి పాంచభౌతిక శరీరధారినైన నన్ను ఘనుని చేసిందెవరు? నా పైన వున్న ఈ హరిముద్రలే (శంఖ చక్ర ముద్రలు, తిరునామము). నగుతా (నవ్వుతూ) యెదురుగా అవి లేకుంటే నాలో లెక్కించుటకు ఇంకా యేమున్నది?

ఒకసారి ఆలోచించండి. మనం కావాలనుకొని పుట్టామా? కావలసినప్పుడు కావలసినచోట కావలసిన విధంగా చావగలమా? కడపట (చివరికి) ఒక్కడికైనా ఆ స్వాతంత్రం (ఛాయిస్) వున్నదా? మరి ఇంతోటి దానికి “ఔగాము” లేల? మేలైనదేమిటి కీడైనదేమిటి?) మనకి మేలు జరిగినా హరివల్లనే, కీడు జరిగినా హరివల్లనే. అన్నిటికీ కారణం శ్రీపతియైన వేంకటేశ్వరుడే. మరి అలాంటప్పుడు ఈ పగయెందుకు? ద్వేషమెందుకు? ఆయనను శరణంటే అదే ఘనము కదా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Bodhimpare Yerigina Budhulaala Peddalala In Telugu – బోధింపరే యెరిగిన బుధులాల పెద్దలాల

బోధింపరే యెరిగిన బుధులాల పెద్దలాల - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో బోధింపరే యెరిగిన బుధులాల పెద్దలాల కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

బోధింపరే యెరిగిన బుధులాల పెద్దలాల – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన: బోధింపరే యెరిగిన బుధులాల పెద్దలాల
సంఖ్య : 58
పుట: 39
రాగం: బౌళి

బౌళి

73 బోధింపరే యెరిఁగినబుధులాల పెద్దలాల
శ్రీధరునిమాయలలోఁ జిక్కితిమి నేము.

||పల్లవి||

దైవమును నొల్లము ధర్మమును నొల్లము
దావతిసంసారముతో తగులేకాని
భావపుభవబంధాలభయమూ నెరఁగము
వేవేలు విధులే కాని వేగిలేచి నేము.

||బోధిం||

ముందు విచారించము మొదలు విచారించము
పొందేటిసతులతోడిభోగమేకాని
చెందినమనసులోనిచింతలను బాయము
మందపుమదమే కాని మాపుదాఁకా నేము.

||బోధిం||

పరమూఁ దడవము భక్తీఁ దడవము
అరిది ధనముమీఁది ఆసలేకాని
ఇరవై శ్రీవేంకటేశుఁ డేలుకొనెఁ దానే నన్ను
నిరతి నెరఁగనైతి నే నించుకంతాను.

||బోధిం||

అవతారిక:

“ఓ పెద్దలారా! మేము శ్రీధరుని మాయలో చిక్కుకుపోయామయ్యా! దిక్కు తెలీటంలేదు. మాకు యేమి చెయ్యాలో చెప్పండయ్యా!” అంటున్నారు జాలిగా అన్నమాచార్యులవారు. దేవుణ్ణి నమ్మం, ధర్మం ఒప్పుకోము, భవబంధాలలో అల్లాడిపోతున్నాం. ముందు విచారించము, మొదల విచారించము యెంతసేపూ వనితాభోగమే. మందపుమదమే మాపుదాకా, పరము వద్దంటాము. భక్తిసున్నా. ఏమిటీ దౌర్భాగ్యం!! తేలికగా కనుపించే క్లిష్టమైన కీర్తన ఇది. జాగ్రత్తగా చదవండి.

భావ వివరణ:

ఓ పెద్దలారా! బుధులారా! (పండితులారా!) మీరు అన్నీ యెరిగినవారు కదా! నాకు బోధింపరో (బోధపరచండయ్యా!) నేము (మేము) శ్రీధరుని మాయలలో చిక్కుకుపోయాం.

మేము దేవుని వొల్లము (అంగీకరించము). ధర్మమునంగీకరించము. దావతి సంసారముతో (దుఃఖభాజన ప్రపంచపు తగులే (అనుబంధములే) కాని, భవబంధాల భయంలేనేలేదాయెను. అనేక మార్గాలనవలంభిస్తాము కాని, వేగిలేచేము (ప్రతిదానికీ తొందరే). మాకేమి చేయాలో తెలియుటలేదు.

మాకున్న ఇంకొక దురలవాటు ముందుగా విచారించము (కార్యము ప్రారంభమునకు ముందుగ ఆలోచన చేయము). మొదలు విచారించము (కార్య ప్రారంభమునందును ఆలోచించము). మాకు లభించిన భామలతో భోగాసక్తే కాని ఇంకొక ఆలోచనేవుండదాయెను. ఈ వ్యవహారాలవల్ల మనస్సులో యెప్పుడూ దిగుళ్ళే, ఆలోచనలే. వాటిని బాయము (వదలము). మాపుదాకా (ముసలివాళ్ళమై జవసత్వాలు వుడిగేదాక ) మందపు మదమే (దట్టమైన గర్వమే…) కాని మరొకటి లేదు. మేము భ్రష్టులమైపోయాము.

అవన్నీ అటుంచి, పరము మోక్షము) అంటే యేమిటో తడవము (చలించము) భక్తి గురించిన ఆలోచనేలేదు. అరిది ధనముపై ఆసలే (అరుదుగా లభిస్తుందని ధనముపై వ్యామోహమే)… కాని భగవంతుని మాటే తలవము. ఇట్లా చాలాకాలం గడిచింది. ఒకనాడు శ్రీవేంకటేశునికి ఈ జీవిపై దయపుట్టింది. ఆయన ఇరవై (నా తలపులలో నెలకొని) తానే నన్ను యేలుకొనె. నేను ఇంచుకంతా, నిరతినెరుగనైతి (కొంచెము కూడా అత్యాశ లేక) జీవించుట ప్రారంభిచితిని. ఆ విధంగా ధన్యుడనైతిని.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు: