Kousalya Nandana Rama Kamalaptakula Rama In Telugu – కౌసల్యానందనరామ కమలాప్తకులరామ

కౌసల్యానందనరామ కమలాప్తకులరామ – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో కౌసల్యానందనరామ కమలాప్తకులరామ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కౌసల్యానందనరామ కమలాప్తకులరామ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : కౌసల్యానందనరామ కమలాప్తకులరామ
సంఖ్య : 275
పుట: 185
రాగం: సాళంగనాట

సాళంగనాట

54 కౌసల్యానందనరామ కమలాప్తకులరామ
భాసురవరద జయపరిపూర్ణ రామ

||పల్లవి||

మునుప దశరథరాముఁడవై తమ్ములు నీవు
జనించి తాటకఁ జంపి జన్నము గాచి
వెనుకొని హరువిల్లు విరిచి సీతఁ బెండ్లాడి
అనుమతి పరశురామునిచేఁ గైకొంటిని

॥కౌస॥

సుప్పనాతి శిక్షించి సొరిది రుషులఁ గాచి
అప్పుడే ఖరదూషణాదులఁ గొట్టి
చొప్పుతో మాయామృగము సోదించి హరియించి
కప్పి హనుమంతు బంటుఁగా నేలుకొంటిని

॥కౌస॥

సొలసి వాలి నడఁచి సుగ్రీవుఁ గూడుక
జలధి బంధించి లంక సాధించి
వెలయ రావణు గెల్చి విభీషణుని మన్నించీ
చెలఁగితి వయోధ్యలో శ్రీవేంకటేశుఁడా

॥కౌస॥275

అవతారిక:

కౌసల్యానందనుడైన శ్రీరాముని కీర్తిస్తున్నారు అన్నమాచార్యులవారు. సూర్యవంశతిలకుడైన ఈయన శోభాయమానమైన వరములనిస్తాడట. పరిపూర్ణమైన జయమునిస్తాడట. ఇదివరలో చెప్పినట్లే ఇది కీర్తనే కాక రామాయణ పునశ్చరణ కూడా. అన్నమయ్యకు రామకథ ఆదినుంచి చెప్పటమే అలవాటు. ఈ రాముడు అనుమతి పరశురామునిచేగైకొనెనట. అంటే.. దుష్టశిక్షణకు అనుమతిని పొందాడన్నమాట. నాయనా! నా అవతార లక్ష్యం పరిసమాప్తమయింది, దుష్ట క్షత్రం నశించి ధర్మరక్షణ క్షాత్రానికి తెరలేచింది, ఇక ధర్మరక్షణ భారం నీదే అని అనుమతినిచ్చాడట రామునికి పరశురాముడు.

భావ వివరణ:

కౌసల్యానందనుడవైన (కౌసల్యాదేవికుమారుడవైన) రామా! నీవు కమలాప్తకుల (సూర్యవంశమున జన్మించిన) రామచంద్రుడవు భాసురవరదుడవు (శోభాయమానమైన వరములనను గ్రహించువాడవు). పరిపూర్ణమైన జయమునిచ్చు రామయ్యవు.

మునుపు (ఇదివరలో) నీవు దశరథరాముడవై తమ్ముల మువ్వురితో జన్మించావు. తాటకను సంహరించి విశ్వామిత్రుని జన్నము (యజ్ఞమును) గాచినావు (రక్షించినావు) వెనుకొని (తదనంతరము) శివధనస్సును విరిచి సీతాదేవిని పెండ్లాడినావు. పరశురామునిచే అనుమతిగైకొని దుష్టశిక్షణకు శ్రీకారం చుట్టితివి. అవతారావిష్కరణకు పూనుకొన్నావు.

చుప్పనాతి అని పేరుగాంచిన శూర్పనఖను శిక్షించి స్త్రీయని వదలినావు. సొరిది (ఆక్రమములో) అనేక మంది ఋషులను రక్షించినావు. ఆవెనుక ఖరదూషణాదులను సంహరించితివి. చొప్పుతో (ఆవిధముగా) మాయామృగమును (మాయలేడిని) సోదించి హరించితివి (వెదకి సంహరించితివి. హనుమంతునికప్పి (బ్రాహ్మణునివలె వచ్చిన హనుమంతుని గుర్తించి బంటుగా నేలుకొంటివి.

సొలసి (పరిక్రమించి) వాలిని అడచితివి (సంహరించితివి) సుగ్రీవుని గూడుక (కూడుకొని) జలధిని బంధించి సేతువును నిర్మించి, లంకను జయించితివి. వెలయ (అతిశయించి) రావణాసురుని గెలిచి విభీషణునికి మన్నింపుతో లంకారాజ్యప్రదానము చేసితివి. ఆపై అయోధ్యలో పట్టాభిషిక్తుడవైనావు. ఓ శ్రీవేంకటేశ్వరా! అదయ్య నీరామ గాధ. ఇది విని తరించామయ్యా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sadanandamu Sarveshwara Ni In Telugu – సదానందము సర్వేశ్వర నీ

సదానందము సర్వేశ్వర నీ – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో సదానందము సర్వేశ్వర నీ- కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

సదానందము సర్వేశ్వర నీ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : సదానందము సర్వేశ్వర నీ-
సంఖ్య : 369
పుట: 248
రాగం: దేవగాంధారి

దేవగాంధారి

53 సదానందము సర్వేశ్వర నీ-
పదారవిందముపై భక్తి

||పల్లవి||

నయనానందము నరులకు సురలకు
జయమగు హరి నీసాకారము
నయమగుశ్రవణానందము వినినను
క్రియగలిగిననీకీర్తనము

||సదా||

చెలఁగి యందరికి జిహ్వానందము
పలుమరుఁ గొనునీప్రసాదము
నలుగడ దేహానందము బుధులకు
బలునీపాద ప్రణామములు

||సదా||

ధరఁ బరమానందము నీదాస్యము
గరిమల శ్రీవేంకటవిభుఁడా
నరహరి నిత్యానందము నినుఁ దగ-
నరవిరిఁ జేయసమారాధనము

||సదా||369

అవతారిక:

ప్రతిజీవీ సంతోషం కోసమే జీవిస్తాడు. సంతోషంకోసమే వెంపర్లాడతాడు. అయితే రేయింబవళ్ళలాగా, సంతోషమూ దు:ఖమూ రెండూ సదా (కలకాలంవుండేవి కావు) వస్తుంటాయి పోతుంటాయి. మరి సదానందము (యెప్పుడూ ఆనందాన్నిచ్చే దేమిటి? ఆ సర్వేశ్వరుడి పాదారవిందములపై భక్తి అని అంటున్నారు అన్నమాచార్యులవారు. నయనాందము, శ్రవణానందము, జిహ్వానందము, దేమానందము, పరమానందము, నిత్యానందము – యేమిటేమిటో వివరిస్తున్నారు విని తరించండి. జ్ఞానము అంటే ఇదే సుమా!

భావ వివరణ:

ఓ సర్వేశ్వరా! నా పదారవిందములపై భక్తి (నీపాదపత్మములపై అచంచలమైన భక్తిప్రపత్తి) సదానందము (సర్వకాల సర్వావస్థలయందు ఆనందమునొసగునది).

నరులకు సురులకు నయనానందమయుయేది? (కన్నులకు ఆనందము నొసగునదేమిటి?) శ్రీహరీ! సర్వులకు జయము నొసగే నీసాకార (ఆకారముతో కూడిన) రూపముకంటే నయనానందకరము మరొకటి లేదు. ఇక వినినను (వినుటకు) నయముగ (స్వాంతనము కలిగించే శ్రవణానందము (చెవులకు ఆనందకరమైనది యేది? క్రియగలిగిన (పూనిక గలిగిన) నీ నామసంకీర్తనము మాత్రమే ఆ శ్రవణానందము నీయగలదు.

జిహ్వా (నాలుక) కలిగించే ఆనందమువల్ల నేనరులు దేనినైనా భుజించగలుగుతున్నారు. చెలగి (అతిశయించి) అందరికీ అట్టి జిహ్వానందము కలిగించునది యేదీ? యెన్నోసార్లు స్వీకరించే ఆస్వామి ప్రసాదమే జిహ్వానందకరము. ఇక లుధులకు (బుద్ధిమంతులకు) దేహమునకు ఆనందము కలిగించునదేది? నలుగడ (అనిచోట్లలో) బలమైన నీపాదములకు జేయు ప్రణామములు (సాష్టాంగవందనములే) దేహానందము గరిమల (మహిమగల శ్రీవేంకటేశ్వరుడా! ధరలో (భూలోకంలో) పరమానందమునొసగునదేది? నీకు చేసే దాస్యమే (భృత్యునిగా జీవించుటే) ఓనరహరీ! నిత్యానందము (ప్రతిరోజూ ఆనందము) నొసగునదేది? తగునట్లు అరవిరి (వినమృలై ముకుళిత హస్తములతో) జేయు నీసమారాధనమే నిత్యానందములు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Devani Paksapatamo Tirigelokulavelto In Telugu – దేవనీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో

దేవనీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో దేవనీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

దేవనీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన: దేవనీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో
సంఖ్య : 422
పుట: 284
రాగం: నారాయణి

నారాయణి

41 దేవ నీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో
శ్రీవిభుఁడ నీవేకాదా చిత్తములోనయ్యా.

||పల్లవి||

దివములు సరియే దినరాత్రులును సరే
యివల సుఖదు:ఖాలు హెచ్చుకుందులేలయ్యా
భవములు సరియే ప్రాణములు సరియే
భువిఁ బుణ్యపాపముల భోగము వేరేలయ్యా.

||దేవ||

విని కిందరి కొకటే విషయాలు నొకరీతే
మునిఁగేటిజాతిభేదములివేలయ్యా
అనయముఁ జూపొక్కటే ఆఁకలియు నొకటే
పెనఁగేటిగుణముల పెక్కు జాడ లేలయ్యా.

||దేవ||

అంతరాత్మ నీవొక్కడ వన్నిటా శ్రీవేంకటేశ
చింతలు వేవేలైన సిలుగేలయ్యా
యింక సేసీ నీమాయ లిందుకే నీశరణంటే
కాంతుఁడ న న్నిందుకే కాచితివి నేఁడయ్యా.

||దేవ||422

అవతారిక:

అన్నమాచార్యులవారి కీర్తనలలో పల్లవి చాల చిక్కులు తెచ్చిపెడుతుంటుంది. “ఓ దేవదేవా! శ్రీకాంతుడా! పైకి చూడటానికి జరిగేవన్నీ నీకు పక్షపాత బుద్ధి వున్నదా అనే భ్రమ కలిగిస్తాయి. లేకపోతే అనుక్షణం భ్రమల లోనే వుండే ఈ లోకులలోని ‘వెల్తి’ (తక్కువ భాగ్యమో, యెక్కువ భాగ్యమో) యెందుకు కలుగుతున్నాయి? మరి మా అందరి చిత్తములో అంతర్యామివి నీవొక్కడివే అయితే ఈ హెచ్చుతగ్గులెందుకు వస్తున్నాయి?” మా శారీరక ధర్మాలు ఒక్కటే శారీర దారుఢ్యాలు వేరు, వినేది ఒకటే అర్థమయ్యేది వేర్వేరు, ఆకలి వొకటే అరుగుదల వేర్వేరు. ఒకడిది మంచి గుణం ఒకడిది చెడ్డగుణం యెందుకిలా? యేమిటి నీ మాయ?

భావ వివరణ:

ఓ దేవదేవా! నీ పక్షపాత వైఖరియో లేక తిరిగేలోకుల వెల్తియో (భ్రమలకు లోనయ్యే లోకుల యొక్క భాగ్యప్రాప్తిలోని విభేదమో) తెలియకుండా వున్నది. మా అందరి చిత్తములో అంతర్యామిగా నీవే వుండగా ఓ శ్రీవిభుడా! ఇలా యెందుకు ఒకరు గొప్ప ఒకరు తక్కువ అవుతున్నారు?

దేవా! ప్రపంచంలో మానవులందరికీ రేయింబవళ్ళు ఒక్కలాగే వుంటాయి కదా? మరి వారి సుఖదు:ఖాలు ఒకేలా యెందుకుండటంలేదు? హెచ్చుతగ్గులెందుకు? అన్ని జీవుల భవము (పుట్టుక) ప్రాణములు ఒక్కటే కదా? మరి లోకంలో పాపపుణ్యములనుభవించడంలో తేడా యెందుకు వస్తున్నది?

ప్రభూ! అందరి వినికి (వినేశక్తి) ఒక్కటే… విషయాలు (విషయములపై ఆసక్తీ) ఒక్కటే, మరి, మునిగేటి (అంతులేని) జాతిభేదము యెందుకు కలుగుతున్నది. అనయము (నిరంతరం) మన చూచే శక్తి ఒక్కటే… ఆకలిదప్పులూ ఒక్కటే కాని మనలో పెనవేసుకొన్న గుణాలలో తేడాలన్నీ యెందుకు వుంటున్నవి?

ఓ శ్రీవేంకటేశ్వరా! మా అందరిలోనూ అంతర్యామిగా చరించేది. నీవొక్కడివే, మరి మాకు వేర్వేరు చింతలు, వేర్వేరు చిలుగులు (ఉపద్రవములు) యెందుకు కలుగుతున్నాయి? ఏమిటి నామాయ? ఏమిటీ విచిత్రం? అందుకే నీకు శరణు అంటున్నాను. ఓ అయ్యా! అందుకే నీవు నన్ను నిరంతరం కాపాడుతున్నావు తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Anganaku Virahame Singaramaya In Telugu – అంగనకు విరహమే సింగారమాయ

అంగనకు విరహమే సింగారమాయ – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో అంగనకు విరహమే సింగారమాయ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అంగనకు విరహమే సింగారమాయ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 21
కీర్తన: అంగనకు విరహమే సింగారమాయ
సంఖ్య : 415
పుట: 277
రాగం: చారుకేశి

చారుకేశి

65 అంగనకు విరహమే సింగారమాయ
చెంగట నీవేయిది చిత్తగించవయ్యా

||పల్లవి||

కలికి నిన్ను తలచి గక్కున లోలో కరగి
జలజల చెమరించి జలకమాడే
బలు తమకాన నీకు పక్కన నెదురువచ్చి
నిలువున కొప్పు వీడి నీలి చీర గప్పెను.

||అంగన||

సుదతి నిన్ను చూచి సోయగపు సిగ్గులను
పొదలి చెక్కుల దాకా పూసె గంధము
మదన మంత్రములైన మాటల మర్మము సోకి
ముదురు పులకలను ముత్యాలు గట్టెను.

||అంగన||

గక్కన కాగిట నిన్ను కలసి ఈ మానిని
చొక్కి చంద్రాభరణపు సొమ్ములు వెట్టే
అక్కున శ్రీ వేంకటేశ అలిమేలుమంగ నీకు
దక్కి సరసములను తలబాలు వోసెను.

||అంగన||

అవతారిక:

నీ అగ (అలిమేల్మంగ)కు విరహతాపమే గొప్ప సింగారమయ్యిందయ్యా శ్రీనివాసా! ఆమెను సమీపించి నీవే యిది గమనించవయ్యా! అని నచ్చచెబుతున్నారు అన్నమాచార్యులవారు. అమలిన శృంగారంతో జగతికి ఆదిదంపతులను కీర్తించటం మధురభక్తి క్రింద పెద్దలు తార్కాణించారు. వారు యౌవన ప్రాంగణంలోని ప్రేయసీ ప్రియులు కాదు, శృంగార సామ్రాజ్యాన్ని యేలే సామ్రాట్టు, సామ్రాజ్ఞి.
అమ్మవారికి ముదురు పులకల ముత్యాల సరాలు పేర్చిన పదకవితాపితామహునికి జోహారు అనకుండా యెలవుండగలము చెప్పండి. శృంగారాన్ని గోప్యత కొంతకప్పాలనే నా ఉద్దేశ్యము కూడా.

భావ వివరణ:

ఆహా! ఈ అంగనకు (యువతికి) తను పొందే విరహమే సింగారమై (గొప్ప అలంకరణ వలె) భాసించుచున్నది. ఓ ప్రభూ! చెంగట (ఆమెను చేరి) నీకు నీవే ఇది చిత్తగించవయ్యా (అర్థం చేసికొనుమయ్యా!)

ఈ కలికి (యువతి) లోలో నిన్ను దలచి గక్కున (వెంటనే) కరగి (పరవశించి) జలజల చెమటతో జలకమాడినట్లయినది. నీకు యెదురువచ్చినప్పుడు బలవత్తరమైన తమకాన, నిలువున కొప్పు (నిట్టనిలువుగానున్న సిగకొప్పు) ముడివీడి, నీలిచీరె గప్పెను (నల్లని వస్త్రము వంటికి కప్పినట్లుండెను).

ఈ సుదతి (యువతి) నిన్ను చూచినదే తడవుగా ఎరుపెక్కిన చెక్కిళ్ళను తెలియకుండా దట్టముగా గంధమును పూసినది. మదనమంత్రములవంటి నీ నర్మగర్భమైన మాటల భావము భామ మనస్సును తాకి శరీరము పులకలుదేరినది ఆ పులకల విస్తరింపు ముత్యాల వానవలె దట్టముగా నాక్రమించెను.

అంతలో నీవా మానినిని కౌగిట జేర్చితివి. అలసిన ఆమె నీ మెడలోని చంద్రహారమువలె భాసించినది. ఓ శ్రీవేంకటేశ్వరా! ఈ దేవి అలమేలుమంగ ఆపై నీ అక్కున దక్కి (సందిట జిక్కి) తన సరస సల్లాపములను తలంబ్రాలు పోసి నిన్ను మురిపించి తానునూ మురిసినది.

ఓ జగజ్జననీ జనకులారా! మిమ్మట్లు భావించగల ఆచార్యులవారిదే భాగ్యము. వారి కృపవలన మేమూ ధన్యులమైతిమి కదా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Yenni Marulu Yitte Nee Panulu In Telugu – యెన్ని మారులు యిట్టె నీపనులు

యెన్ని మారులు యిట్టె నీపనులు - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో యెన్ని మారులు యిట్టె నీపనులు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

యెన్ని మారులు యిట్టె నీపనులు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 6
కీర్తన : యెన్ని మారులు యిట్టె నీపనులు
సంఖ్య : 58
పుట : 43
రాగం : సామంతం

సామంతం

30 యెన్ని మారులు యిట్టె నీపనులు
ఇన్ని మాయలు నన్ను నేఁచనేఁటికిరా.

||పల్లవి||

నీళ్లే నమలేవు నీలోనె సన్నల
వేళ్లే చూపేవు వెలుపలికి
పేళ్లె తప్పేవు బిరుసుగ, నింతేసి
గోళ్ల రాచేవు కోపమేఁటికిరా.

॥యెన్ని॥

మేనె దాఁచేవు మెస్తిర గొడ్డలి
నానం బెట్టేవు నయముననే
పోని తెరువుల పోకులఁ బోయేవు
కానిరా యేటివంకలు తిద్దవశమా.

॥యెన్ని॥

చేరి కపటాలె చేసేవు యిఁకనైనా
సారెం బరువులు చాలించరా
ధీరుండవుగాన తిరువేంకటపతి
కూరి మెఱిఁగి నన్నుఁ గూడితి విపుడూ.

॥యెన్ని॥ 58

అవతారిక:

ఇదికూడా జానపదుల శైలిలో కొనసాగే దశావతార కీర్తన. నా అభిప్రాయంలో ఇది బహుక్లిష్టమైనది. ఎందుకంటే కొన్ని మాటలకు యే నిఘంటువులోనూ అర్ధ వివరణ సూచన ప్రాయంగా కూడా లభించలేదు. అది ఏ అవతార వివరణో వూహించగలుగుట వలన భావసమన్వయం ఆవశ్యకమైనది. అంటే. ఉదాహరణకి “పెళ్లె తప్పేవు బిరుసుగ” అంటే వరాహవతారంతో సమన్వయపరచుటెట్లు సాధ్యం. యేటివంకలు తిద్దవశమా? అంటే కృష్ణావతారంతో యెట్లా ముడిపెట్టాలి? దీని అర్థం ఏమిటో ఎలా తెలుస్తుంది? ఓ దేవదేవా! అన్నమయ్య ఈ కీర్తన పల్లవిలో అన్నమాట నిజం చేస్తున్నావు కదటయ్యా! “ఇన్ని మాయల నన్ను నేచనేటికిరా”. అంటే ఏమిటో తెలియాలంటే ఏమిటి చేయాలి? మీకు తెలుసునని నాకు తెలుసు.

భావ వివరణ:

నీ పనులు (నీవు చేసే లీలలు యెన్ని మారులు? (ఎన్ని విధములో) చెప్పుట యెట్లు సాధ్యము? నన్ను ఇన్ని మాయలతోన్ చేయనేటికిరా? (అతిశయించుట యెందులకయ్యా? )

ఒకసారి నీలోనే నీళ్ళు నములుతుంటావు (మత్స్యావతారము); ఇంకొకసారి వెలుపలికి వచ్చి సన్నల (సైగలతో) వేళ్ళను చూపింతువు (కూర్మావతారము); ఇంకొకసారి, బిరుసుగ పేళ్లె తప్పేవు (కాఠిన్యంతో వేగిపోతూ తపించిపోయేవు)… అనగా (వరాహావతారం). ఇంకొకసారి, ఇంతేసి గోళ్ళ రాచేవు (ఇంతింత పొడుగువున్న గోళ్ళతో చీరివేసెదవు. కోపమేటికిరా? కోపమెందులకయ్యా? (నరసింహావతారం).

ఒకసారి, మేనెదాచేవు (చూడటానికి పొట్టి పిల్లవాడిలావున్నా, భూనభాంతరములు నిండిపోగల శరీరాన్ని దాచివుంచినావు)… అనగా (వామనావతారం).; మెస్తిర గొడ్డలి నయముననే నానం బెట్టేవు (బాగా పదునైన పరశువును బాగా రక్తంలో నానబెట్టినావు)… అనగా (పరశురామావతారము); పోని తెరువుల పోకల బోయేవు (చొరరాని కీకారణ్యములబట్టి పోయేవు)… అనగా (శ్రీరామవతారం); కానిరా, యేటివంకలు తిన్దవశమా (కానీయవయ్యా! వంకరటింకరగా పోయే ఏరుయొక్క మార్గాన్ని కట్టడి చెయ్యగలమా? … అనగా (శ్రీకృష్ణావతారపు గోపీలోలత్వం).

ఒకసారి, చేరి కపటాలే చేసేవు (పురసతులను మోసగించినావు)… అనగా (బుద్ధావతారము). ఇకనైనా సారెం పరువులు చాలించరా (ఇప్పటికైనా, మాటిమాటికీ పరుగులు తీసే అలవాటు మానుకోవయ్యా!)… అనగా (కల్కి అవతారము); ధీరోదాత్తుడవు కావున ఓ తిరువేంకటేశ్వరా! కూరిమి యెరిగి నన్ను కూడితివి. ఇప్పుడు నీమాయలను మెచ్చక యెలా వుండగలను ప్రభూ!.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Vimdivo Lakshmipati Vimdivo Sarvesumdu In Telugu – వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు

వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 3
కీర్తన : వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు
సంఖ్య : 402
పుట : 271
రాగం : రామక్రియ

రామక్రియ

23 వీఁడివో లక్ష్మీపతి వీఁడివో సర్వేశుఁడు
వీఁడివో కోనేటిదండవిహరించేదేవుఁడు.

||పల్లవి||

కొండ గొడగుగ నెత్తి గోవులఁ గాచె నాఁడు
కొండవంటిదానవునిఁ గోరి చించెను
కొండ శ్రీవేంకట మెక్కి కొలు వున్నాఁ డప్పటిని
కొండవంటి దేవుఁ డిదే కోనేటికఱుతను.

||వీఁడ||

మాఁకులమద్దులు దొబ్బి మరి కల్పభూజమనే-
మాఁకు వెరికి తెచ్చెను మహిమీఁదికి
మాఁకుమీఁద నెక్కి గొల్లమగువలచీర లిచ్చి
మాఁకులకోనేటిదండ మరిగినాఁ డిదివో.

||వీఁడ||

శేషునిపడగెనీడఁ జేరి యశోదయింటికి
శేషజాతి కాళింగుఁ జిక్కించి కాచె
శేషాచలమనేటి శ్రీవేంకటాద్రిపై
శేషమై కోనేటిదండఁ జెలఁగీని దేవుఁడు.

||వీఁడ|| 402

అవతారిక:

తాళ్ళపాకలో వెలసిన ‘కోనేటిరాయనిపై’ చక్కటి కీర్తన వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. వీడివో (వీడే) లక్ష్మీపతి, వీడే సర్వేశ్వరుడు అని కీర్తిస్తున్నారు. భావ వివరణనంతా చదివాక మీకు అంతులేని ఆనందం కలుగుతుందని నాకు ప్రగాఢ విశ్వాసము. శేషాచలమనేటి శ్రీవేంకటాద్రిపై శేషమై కోనేటిదండ చెలగీని దేవుడు అంటే యెన్నైనా అర్థములు చెప్పవచ్చును. ఈ స్వామి తీయటి నీటి బావి. తోడుకున్న వారికి తోడుకొన్నన్ని నీళ్ళు. అవునా?

భావ వివరణ:

ఓ ప్రజలారా! వీడివో (ఈతడే లక్ష్మీపతి, వీడివో సర్వేశుడు (సర్వమునకు ప్రభువు), ఈతడే ఈ కోనేటి ఒడ్డున విహరించే దేవదేవుడు. ఈయన ఘన కార్యములనాకర్ణించండి.

పూర్వం ఈయన కొండను గొడుగుగనెత్తి (నంద వ్రజమున గోవర్ధన పర్వతమును తన చిటికిన వ్రేలి పై గొడుగువలె యెత్తి గోకులమును రక్షించినాడు). కోరి, కొండవంటి దానవుని (శకటాసురుని) చించెను (ముక్కలు ముక్కలు చేశాడు). అప్పటిని (మరల ఈ కలియుగంలో శ్రీవేంకటగిరి అనే కొండనెక్కి కొలువు దీరియున్నాడు. నిజముగా ఈ స్వామి ఇదే ఈ కోనేటి కఱుతను (ఒడ్డున… అని… భావిస్తున్నాను) కొండవంటి అండయైయున్నాడు.

పూర్వం ఈయన మద్దిమాకులను (రేపల్లెలో నందుని ప్రాంగణమున వున్న రెండు మద్ది చెట్లను) దొబ్బి (త్రోసివేసి) కూల్చినాడు (మద్దిచెట్లవలెనున్న గంధర్వులకు శాపవిమోచనం కలిగించాడు). ఈ శ్రీకృష్ణుడే స్వర్గలోకంనుండి కల్పవృక్షము అను మాకును (దేవవృక్షమును) వారికి (పెకలించి) మహిమీదకు (భూలోకానికి) తెచ్చెను. ఈయనే గొల్లమగువల చీరెలెత్తుకొనిపోయి మాకుమీదనెక్కి (యమునానది ఒడ్డునవున్న చెట్టునెక్కి వారు శరణన్న తరువాత తిరిగి ఇచ్చినాడు. ఇదిగో నేడు ఈ కోనేటి ఒడ్డున మాకుల మధ్య మరిగినాడు (పరిచితమవుచున్నాడు).

వసుదేవుడు బాలకృష్ణుని యమునానది దాటిస్తుంటే కుండపోతగా వానవచ్చింది. అప్పుడు శేషుడు తన పడిగెలను గొడుగులాకప్పినాడు. స్వామి ఆ పడిగెల నీడలో యశోద ఇంటికి చేరినాడు. శేషజాతి సర్పమైన కాళింగు శిరసుల ద్రొక్కి రక్తం కక్కించి అతను శరణన్నాక కరుణించి విడిచిపెట్టాడు. ఇదే దేవుడు శేషాచలము అనే శ్రీవేంకటాద్రిపైనున్న కోనేటిదండ (కోనేటి ఒడ్డున) చెలగీనీ దేవుడు (శ్రీవేంకటేశ్వరుడై శోభిల్లుతున్నాడు).

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Chekoni Koluvaro Sri Narasinhamu In Telugu – చేకొని కొలువరో శ్రీనరసింహము

చేకొని కొలువరో శ్రీనరసింహము - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో చేకొని కొలువరో శ్రీనరసింహము కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

చేకొని కొలువరో శ్రీనరసింహము – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 3
కీర్తన : చేకొని కొలువరో శ్రీనరసింహము
సంఖ్య : 567
పుట : 381
రాగం : సాళంగనాట

సాళంగనాట

19 చేకొని కొలువరో శ్రీనరసింహము
శ్రీకరమగు నిదె శ్రీనరసింహము

||పల్లవి||

వెడలేటివూర్పుల వేఁడిమి చల్లీ
చిడుముడికోపపు శ్రీనరసింహము
గడగడవడఁకేటిగండస్థలములు
జెడలు గదలిచీ శ్రీనరసింహము

||చేకొ||

వంకరగోళ్లవైపులు వెదకీ
చింకచూపులను శ్రీనరసింహము
హుంకారంబుల నుదధులు గలఁచీ-
నంకెల శ్రీపతియగు నరసింహము

||చేకొ||

వదనము దిప్పుచు వడి నసురమేను
చిద్రుపలు చేసెను శ్రీనరసింహము
అదివో శ్రీవేంకటాద్రి యెక్కి యిటు
చెదరక నిలిచెను శ్రీనరసింహము,

||చేకొ|| 567

అవతారిక:

అన్నమాచార్యులవారికి భజన అంటే ప్రత్యేకమైన ప్రీతి అని నా నమ్మకం. ఉగ్రనరసింహునిపై వారు చెప్పిన ఈ భజన మీ మనస్సులను ప్రక్షాళన చేస్తుంది. నిశితమైన వర్ణన అంటే (మైన్యూట్ డిస్క్రిప్షన్) అది యెలావుంటుందో ఇది వింటే తెలుస్తుంది. తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుని చిత్రహింసలు పెట్టి ఈ స్తంభములో వాడిని (శ్రీహరిని) చూపించకపోతే స్వయంగా, తనే ప్రహ్లాదుని చంపేస్తానన్నాడు హిరణ్యకశిపుడు. ఆవేశం కట్టలు తెంచుకొని, పగిలిన స్తంభంలోంచి వెడలివచ్చిన శ్రీనరసింహుడు యెలావున్నాడయ్యా! అంటే… “శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు) శ్రీసతివల్లభా”! అని ప్రార్థించండి.

భావ వివరణ:

ఓ భక్తులారా! ఇదే శ్రీనరసింహము. ఈ దేవదేవుని చేకొని (పూనుకొని) కొలువరే (మ్రొక్కి సేవించండి). ఈ నరసింహము మనకు శ్రీకరుడు (శు భములనొసగు మహానుభావుడు).

ఈ శ్రీనరసింహము చిడుముడి కోపమువాడు (తొట్రుపాటు కలుగజేసే కోపధారి). చూడండి తన కోపము చేత వెడలేటివూర్పులు (బయల్వెడలు ఉచ్ఛ్వాస నిస్వాసములతో) వేడిసెగల నెట్లా వెదజల్లుతున్నాడో గమనించండి. ఆయన గండస్థలము (రెండు చెక్కిళ్ళూ) ఉద్రేకంతో గడగడమని వణుకుతున్నాయి. అందుచేత ఈ శ్రీనరసింహము యొక్క జడలు (జూలు) పైకి క్రిందికి కదలుచున్నది.

ఈ శ్రీనరసింహము వంకరలు తిరిగిన పంజాగోళ్ళతో వాటివైపు చూసుకొంటూ (రక్తం అంటినదోలేదోనని) చింక చూపులు (భీతహరిణేక్షణములతో) చూస్తున్నాడు. ఈ శ్రీనరసింహము యొక్క హూంకారమునకు, వుదధులు (సాగరములు అన్నియును కలచీ (కల్లోలమైపోతున్నాయి.) ఈ స్వామి అంకెల శ్రీపతి (తన ప్రియసతి శ్రీలక్ష్మిని తన తొడపైననే కూర్చుండబెట్టిన శ్రీనాథుడు.

ఈస్వామి తనతొడపైనున్న హిరణ్యకశిపుని మేను (శరీరాన్ని) తన వదనము వడి తిప్పుచూ (తన మొగమును వేగంగా అటూ ఇటూ కదలించుచూ) చిద్రుపలు చేసెను. (చిన్న చిన్న ఖండములుగా చేసినాడు). ఇంత ఘోర భీభత్సం చేసిన ఈ శ్రీనరసింహము చెదరక (ఏమాత్రమూ చలించక) అదివో శ్రీవేంకటాద్రినెక్కి యిటు (ఈవిధముగా) శ్రీవేంకటేశ్వరుడై నిలిచియుండి, మనబోంట్లను అనుగ్రహిస్తున్నాడు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Chuchi Mohincha kunduraa Suralina Narulina In Telugu – చూచి మోహించకుందురా సురలైన నరులైన

చూచి మోహించకుందురా సురలైన నరులైన – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో చూచి మోహించకుందురా సురలైన నరులైన కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

చూచి మోహించకుందురా సురలైన నరులైన – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన: చూచి మోహించకుందురా సురలైన నరులైన
సంఖ్య : 403
పుట: 272
రాగం: తెలుగు కాంబోది

తెలుఁగు కాంబోది

60 చూచి మోహించకుందురా సురలైన నరులైన
తాచి నీవు ముందరఁ బ్రత్యక్షమైనను

|| పల్లవి||

భాగీరథి పుట్టినపాదపద్మములు
భోగపు మరునిజన్మభూమి నీతొడలు
యోగపు నవబ్రహ్మలుండిన నీనాభి
సాగరకన్యకలక్ష్మి సతమైనవురము

||చూచి||

అందరి రక్షించేటి అభయహస్తము
కంద నసురలఁజంపే గదాహస్తము
సందడిలోకముల యాజ్ఞాచక్రహస్తము
చెంది ధ్రువు నుతియించఁజేయుశంఖహస్తము

||చూచి||

సకలవేదములుండే చక్కనినీమోము
వొకటై తులసిదేవివుండేటిశిరసు
ప్రకటనపు మహిమలఁ బాయనినీరూపము
వెకలిశ్రీవేంకటాద్రివిభుఁడ నీభావము

||చూచి||

అవతారిక:

జగన్మోహనుడైన ఈ వేంకటేశ్వరుడే కళ్ళముందు ప్రత్యక్షమైతే మోహించని వాడెవడన్నావుంటాడా? వాడు నరుడాసురుడా అనే తేడానేవుండదు. అందరూ చేష్టలుడిగి అలా చూస్తూనే వుండిపోతారు… నఖశిఖ పర్యంతం, ఇదిగో ఈ భావమునే అన్నమాచార్యులవారు మధురమైన కీర్తనవలె నావిష్కరిస్తున్నారు. “ప్రకటపు మహిమల బాయని నీరూపము వెకలి శ్రీవేంకటాద్రి విభుడ నీ భావము” అని అంటున్నారు. ఆయన భావము ఆయన రూపంలోనే పాయని మహిమలను ప్రకటిస్తున్నదని అర్థం. భావాలను వివరించటానికి మాటలక్కరలేదు చూపులు చాలు కదా! జాగ్రత్తగా చదవండి మరి.

భావ వివరణ:

ఓ దేవదేవా! తాచి (పూనుకొని నీవు యెవరికన్నులముందైన ప్రత్యక్షమైతే, నిన్ను చూచి సురులైనా, నరులైన మోహించి తీరుతారు. జగన్మోహనుడవైన నిన్ను చూచి మోహించకుండుట యెట్లు సాధ్యము?

నిన్ను ఆపాదమస్తకం వొకసారి చూచే భాగ్యం దక్కితే ఆ జన్మ తరించదా? అదిగో నీ పాదపద్మాలు… పవిత్రమైన భాగీరధి (గంగాదేవి) పుట్టినిల్లు అదేకదా! అవిగో నీతొడలు.. జీవులకు భోగాసక్తిని కలిగించే మరునికి (మన్మధునికి) జన్మభూమి నీవూరువులే. అదిగో నీ నాభి, చతుర్ముఖుడే కాక యోగమున నిష్ణాతులైన నవబ్రహ్మలకు (భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగీరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వశిష్ఠుడు, మరీచి – తొమ్మిదిమందిని నవబ్రహ్మలు అంటారు. వీరినుంచి రకరకాల జీవులు సృష్టించబడ్డాయి). ఇక జగద్విఖ్యాతమైన సాగరపుత్రిక లక్ష్మికి సతమైన (శాశ్వతమైన స్థానము నీ వురము (వక్షస్థలము).

ఇక నేడు మా దగ్గరకు వస్తే… అదిగో ఆ నడుముపైనున్న అభయహస్తము నీ శరణాగతులకు భయపడకండి మీకు నేనున్నాను అని అభయమిస్తున్నది. అందరినీ రక్షిస్తున్నది. అసురులను కందునట్లు (తపించునట్లు) చేయు నీగద (కౌమోదకము) నీహస్తములలో కానవచ్చుచున్నది. నీ ఆజ్ఞాచక్రము, నీ ఆజ్ఞపైలోకములను సందడించగల (తత్తరబెట్టగల నైపుణ్యమున్న దివ్యాయుధము. అది అదిగో నీ కుడిచేతిలోనున్నది. ధ్రువునికి నీ దారి చూపుటకు నినదించిన పాంచజన్య శంఖము, అదే నీ యెడమ చేతనున్నది.

ప్రభూ! సకల వేదములకు నెలవైన నీ ముద్దులొలుకు చక్కని వదనము అదిగో. తులసీదేవికి ఒకేఒక స్థిరనివాసమైన నీ శిరస్సు అదే కన్నులకు విందుజేయుచున్నది. ఆవిధంగా అనేక మహిమలను ప్రకటించుచున్న పాయని (విడువలేని) నీ దివ్యమంగళ విగ్రహము ఏ భావముతో చూస్తే ఆ భావముతో కనబడుతున్నది. వెకలి శ్రీవేంకటేశా! (ఆసక్తిని కలిగించు ఏడుకొండలవాడా!) శరణాగతులకు చల్లనిచూపులే, కుత్సితులకు క్రూరంగా కనుపిస్తాయి. అదే అత్యద్భుతం తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sankama Nivu Sakhshi Chakrama Nivu Sakhshi In Telugu – శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి

శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 15
కీర్తన: శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి
సంఖ్య : 169
పుట : 112
రాగం: బౌళి

బౌళి

49 శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి
వంకలాడ భుజముల వ్రాసుకొంటి మిమ్మును

॥పల్లవి||

నారాయణా యని యిట్టె నరకములు తరించితి
శ్రీరామా అని పొందితి జీవన్ముక్తి
దూరించి గోవిందా యని తోలితి పాపము లెల్ల
ధీరుఁడనై వళుకెల్ల తిద్దుకొంటి నిదిగో

||శంకమ||

దామోదరా అని తొల్లి దాటితి దు:ఖము లెల్ల
వామనా అని కర్మములు వంగఁ దొక్కితి
భూమిరమణా యని పుట్టుగులు గెలిచితి
వేమరు నితరులకు వెరవ నే నింకను

||శంకమ||

హరి యచ్చుతా యని ఆపదల నణఁచితి
పురుషోత్తమా యని పుణ్యము లెల్లా మీఱితి
అరుదైనా శ్రీవేంకటేశ యని లోకముల మించితి
తొరలి సంసారపుదూరు చక్కఁబెట్టితి

||శంకమ||

అవతారిక:

“వంకలాడ” అంటే వంకరలు దిద్దగా అని అర్థం. అన్నమాచార్యులవారు ఈ కీర్తనలో తన భుజములపై వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ముద్రింపజేసికొన్న శంఖ చక్రముద్రలతో “మిమ్మల్ని సాక్షులుగా నాభుజములపై వ్రాయించుకొంటిని” అంటున్నారు. ఎట్లా వ్రాయించుకొన్నారంటే “వంకలాడ” వ్రాయించుకొన్నారట. ఆపైన, విష్ణునామ సంకీర్తన మధురాతి మధురంగా చేస్తున్నారు. ఆశ్రీహరి నామ సంకీర్తన “తొరలి సంసారపు దూరు చక్కబెడుతుందట. కీర్తన పాడినవారికి విష్ణునామ పారాయణ పుణ్యం దక్కుతుందని విడిగా చెప్పనక్కరలేదు కదా! అన్నట్లు వళుకు – అంటే తగవు అని అర్థం.

భావ వివరణ:

ఓ శంకమా (పాంచజన్య శంఖమా!) నీవే మాకు సాఓఇ. ఓ చక్రమా! (సుదర్శన చక్రమా!) నీవే మాకు సాక్షి. నేను విష్ణువునకు చెందిన వాడనని మిమ్మును (మిమ్మల్ని) నా భుజములపై వంకలాడ (వంకరలు దిద్దగా) వ్రాయించుకొంటి (కాల్చి వాతలవలె ముద్రింపజేయించుకొంటిని). కనుక మీరే నాకు చెఱపలేని సాక్ష్యము.

నేను మా ఆచార్యుల కృప జేత వైష్ణవుడనై ఎట్లా తరించానో చెప్తాను వినండి. నేను “నారాయణ” అని యెలుగెత్తి అనగానే నరకద్వారములను దాటి నాను. శ్రీరామా అని చెప్పగానే జీవన్ముక్తిని పొందాను. దూరించి (ఉద్యుక్తుడనై గోవిందా గోవిందా అని గొంతెత్తి యని నేను చేసి కొనిన అశేష పాపాలను తోలివేశాను. ఇదివో నేను ఆ విధంగా ధీరుడనై (విద్వాంసుడనై) వళుకెల్లా (మత్సరమునంతా) దిద్దుకొంటి సవరించుకొంటిని.

దామోదరా అని తనివిదీరా పలికి, నా తొల్లిటి (ఇదివరకు నాకున్న) దు:ఖములను తొలగించుకొంటిని. వేమనా అనే విష్ణు నామమును పలికి నేను చేసిన కర్మల వంగదొక్కితి (అణగద్రొక్కితిని). భూరమణా అనే నామము చెప్పి పురుగులు (జన్మల చక్రవ్యూహమును) గెలిచితిని. నేను ఇక ఇతరములకు (మానవమాత్రులైన అధిపులకు) వేమరు వెరవను (ప్రతిదానికీ భయపడను).

“హరి అచ్యుతా” అనే నామోచ్ఛరణతో నేను నా ఆపదలనన్నింటినీ అణచివేశాను. పురుషోత్తమా అ పుణ్యముల నెల్లా మీఱితి (అతిశయించితిని). శ్రీహరి నామాలలో అరుదైన నామము శ్రీ వేంకటేశ. ఆ నామము నిరంతరం నా నాలికపై నుండగా లోకముల మించితి (సర్వశ్రేష్ఠుడనైతిని) తొరలి (ఈమారు) సంసారపు దూఱు (ప్రాపంచిక లంపటములను) చక్కబెట్టితి (సరిజేసుకొంటిని). ఇది నా ఘనత కాదు తండ్రీ! నీ అపారమైన కరుణయే కారణము.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Sitasameta Rama Sri Rama In Telugu – సీతాసమేత రామ శ్రీరామ

సీతాసమేత రామ శ్రీరామ - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో సీతాసమేత రామ శ్రీరామ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

సీతాసమేత రామ శ్రీరామ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన: సీతాసమేత రామ శ్రీరామ
సంఖ్య : 516
పుట: 347
రాగం: సాళంగనాట

సాళంగనాట

39 సీతాసమేత రామ శ్రీరామ
రాతి నాతిఁజేసిన శ్రీరామ రామ.

||పల్లవి||

ఆదిత్యకులమునందు నవతరించినరామ
కోదండభంజన రఘుకులరామ
ఆదరించి విశ్వామిత్రుయాగము గాచినరామ
వేదవేదాంతములలో వెలసినరామ.

||సీతా||

బలిమి సుగ్రీవునిపాలినిధానమ రామ
యిల మునుల కభయమిచ్చినరామ
జలధి నమ్ము మొనను సాధించినరామ
అలరు రావణదర్పహరణ రామ.

||సీతా||

లాలించి విభీషణుని లంకయేలించినరామ
చాలి శరణాగతరక్షక రామ
మేలిమి శ్రీవేంకటాద్రిమీఁద వెలసినరామ
తాలిమితో వెలయు ప్రతాపపురామ.

||సీతా||516

అవతారిక:

శ్రీరామచంద్రమూర్తిపై చక్కటి భజననందిస్తున్న అన్నమాచార్యులవారి ఈ కీర్తన నాస్వాదించండి. బహు సులభమైన దీనిలో ఒకే ఒక్క మెలిక ‘ఆదరించి విశ్వామిత్రుయాగము గాచిన రామా’ అనే చోట వున్నది. ఇక్కడ ఆదరించడం అంటే సమున్నతమైన గౌరవం అన్నమాట. శ్రీరాముడు పరమాత్మే కదా! ఆయనకి తెలియనిదొక్కటీ వుండదు. అయినా ఏమీ తెలియని అమాయకుడిలా విశ్వామిత్రునికి గురుస్థానం ఇచ్చి ఆయన చెప్పినదంతా విని ఆయన యాగరక్షణ చేసి ‘రాముడు మంచి బాలుడు’ అనిపించుకొన్నాడు. ఇది బహుశా వావిలిపాడు వీరరాఘవునిపై చెప్పిన కీర్తన కావచ్చును.

భావ వివరణ:

సీతాసమేతుడవు (సీతాదేవితో ఒకే సింహాసనమును అధిష్టించియున్న) రాముడవు అయిన శ్రీరామా! శిలవలె అచేతనస్థితిలోవున్న నాతి అహల్యకు చేతనత్వము ప్రసాదించిన రామచంద్రమూర్తివి నీవే.

ఓ శ్రీరామా? నీవు ఆదిత్య కులమున (సూర్యవంశమున) అవతరించినవాడవు; కోదండ భంజనుడవు (శివ ధనస్సును విరిచిన రఘురాముడవు). విశ్వామిత్రునకు నీ గురుస్థానమును ప్రసాదించి, వినయశీలివైన శిష్యుడవై అనేక అస్త్రములను విద్యలను స్వీకరించి ఆయన యాగరక్షణ నెపమున దానవ దమనకు పునాది వేసితివి. వేదవేదాంతముల మూలపురుషుడవైన తారకరాముడవుగా వెలసిన శ్రీరామబ్రహ్మం నీవే.

ఓ శ్రీరామా! అలనాడు నీ బలమేమిటో సుగ్రీవుని కన్నులకు కట్టించి వానిని తిరిగి నిలబెట్టినవానిపాలి నిధానమవు (ఐశ్వర్యమైతివి); రాక్షసులచే వేధించబడుచున్న మునులకు జనస్థానమున అభయమిచ్చి రాక్షసులు పీడ తొలగించితివి. సేతువును నిర్మించదలచి నయమున నీకు లొంగని సాగరుని అమ్ము మొనకుదెచ్చి వానిని సాధించితివి. దర్పముతో (గర్వముతో) కన్నుమిన్ను గానని రావణుని గర్వమును హరించిన రామభద్రుడవైతివి.

అన్న మరణమునకు తానే కారణమని రోదించుచున్న విభీషణుని ఓదార్చి లంకకు యేలికను చేసితివి. కావలసినవారికి కావలసినంత శరణ్యమునొసగి రక్షించితివి. నేడు బంగారు శిఖరముల బోలిన తిరుమల శిఖరములపై శ్రీవేంకటేశ్వరుడవై చేరితివి. నీవే తాలిమితో (అనుపమ క్షమను ప్రదర్శించు) ప్రతాపపు రాముడవై (వీరరాఘవుడవై వెలసితివి. నీవే రాజారాముడవు తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు: