అరణ్యకాండ రామాయణంలో మూడవ భాగం, ఈ కాండంలో రాముడు, సీత, లక్ష్మణులు అడవిలో గడిపిన 14 సంవత్సరాల కథను వివరిస్తుంది. ఈ కథాంశంలో చాలా ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి, వాటిలో కొన్ని దండకారణ్యానికి ప్రయాణం, విరాధుని వధ, జాబాలి, శరభంగుల ఆశ్రమాలు, పంచవటి, శూర్పణఖ వధ, రావణుని ప్రతీకారం, జటాయువు వధ, కబంధుని వధ, గుహలో హనుమానుని కలయిక.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ తృతీయః సర్గం రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యంలో ప్రవేశించి, ఋషులతో భేటి అవుతారు మరియు వారి ఆశీర్వాదాలు పొందుతారు. తరువాత, వారు పంచవటికి చేరి అక్కడ నివసించడం ప్రారంభిస్తారు. పంచవటిలో ఉండే సమయంలో రాముడు తన ధర్మానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ, అరణ్యంలో రాక్షసులను అణచి వేస్తాడు.
తాను రామలక్ష్మణులను వివరాలు అడుగుతుంటే వాళ్లిద్దరూ ఏవేవో మాట్లాడుకోవడం చూచి సహించలేకపోయాడు విరాధుడు.
“నేను మీ ఇద్దరి గురించి అడుగుతుంటే మీలో మీరే ఏం మాట్లాడుకుంటున్నారు. చెప్పండి మీరు ఎవరు? ఈ అరణ్యములకు ఎందుకు వచ్చారు? ఎక్కడికి వెళుతున్నారు?” అని అడిగాడు.
అప్పుడు రాముడు విరాధునితో ఇలా అన్నాడు. “ఓ రాక్షసుడా! మేము క్షత్రియులము. మునులము కాము. నా పేరు రాముడు. ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు. ఆమె నా భార్య సీత. కాల వశమున ఈ అరణ్యములో తిరుగుతున్నాము. ఇంతకూ నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు?” అని అడిగాడు రాముడు.
“ఓ రామా! నేను రాక్షసుడను. నాపేరు విరాధుడు. నా తండ్రి పేరు జవుడు. నా తల్లి పేరు శతహ్రద. నేను బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసాను. ఆయన వలన ఎవరిచేతా గాయపడకుండా, చావకుండా వరము పొందాను. నాకు ఈమె మీద మోహము కలిగింది. కాబట్టి మీరు ఇద్దరూ ఈమెను నాకు విడిచి పెట్టి ఇక్కడ నుండి పారిపొండి. లేకపోతే మీ ఇద్దరిని చంపి తింటాను. వెంటనే వెళ్లిపొండి.” అనిఅన్నాడు విరాధుడు.
ఆ మాటలకు రామునికి కోపం వచ్చింది. కళ్లు ఎర్రబడ్డాయి. కోపంతో విరాధునితో ఇలా అన్నాడు. “ఓ రాక్షసుడా! నీకు నా చేతిలో చావు మూడింది. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నిన్ను ప్రాణాలతో వదలను.”అని ధనుస్సు ఎక్కుపెట్టి ఒక బాణాన్ని సంధించి విరాధుని మీదికి వదిలాడు.
వరసగా విరాధుని మీద బాణాలు ప్రయోగించాడు రాముడు. రాముడు వదిలిన బాణాలు విరాధుని శరీరం నిండా గుచ్చుకున్నాయి. విరాధుని శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. ఆ బాణాల బాధకు తట్టుకోలేక విరాధుడు తన తొడమీద ఉన్న సీతను కిందికి దించాడు. శూలాన్ని పట్టుకొని పెద్దగా అరుస్తూ రామలక్ష్మణుల మీదికి దూకాడు.
రామునికి లక్షణుడు కూడా తోడైనాడు. రామలక్ష్మణులు విరాధుని మీద బాణములను వర్షంలా కురిపించారు. ఆ రాక్షసుడు ఒక్కసారి ఆవులించి ఒళ్లు విదిలించగానే అతని శరీరమునకు గుచ్చుకున్న బాణములు అన్నీ జలజలా కింద రాలిపోయాయి. బ్రహ్మ వరప్రభావము వలన రామ లక్ష్మణులు వదిలిన బాణములు విరాధుని ఏమీ చేయలేకపోయాయి.
విరాధుడు మరలా శూలమును పైకెత్తి రామలక్ష్మణుల మీదికి దూకాడు. తన శూలమును రాముని మీదికి విసిరాడు. రాముడు రెండు బాణములతో ఆ శూలమును మధ్యలోనే ఖండించాడు. విరాధుని శూలము రెండు ముక్కలై కిందపడిపోయింది. రామలక్ష్మణులు రెండు కత్తులను తీసుకున్నారు. విరాధునిమీదికి దూకారు. ఆ కత్తులతో విరాధుని బలంగా కొట్టారు. ఇలా కాదని.
విరాధుడు రామలక్ష్మణులను తన చేతుల మధ్య బంధించాలని అనుకొన్నాడు. విరాధుని ఊహను పసికట్టాడు రాముడు. అక్ష్మణునితో ఇలా అన్నాడు.
“లక్షణా! వీడు మన ఇద్దరినీ చేతులతో ఎత్తుకొని మోసుకొని పోవాలని చూస్తున్నాడు. వాడి ఇష్టం వచ్చినట్టు మనలను మోసుకుంటూ పోనిద్దాము. ఎందుకంటే మనం కూడా ఇదే దారిలో వెళ్లాలి కదా!” అని అన్నాడు.
ఇంతలో విరాధుడు రామలక్ష్మణులను తన చేతులతో ఎత్తుకొని తన బుజాల మీద కూర్చోపెట్టుకున్నాడు. అరణ్యంలోకి పరుగెత్తాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” ద్వితీయ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యంలో మరింత లోతుగా ప్రవేశిస్తారు. వారు అటవీ జీవులతో మమేకమై, సురక్షితంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అటవీ సహజ సౌందర్యం వారికి అద్భుత అనుభూతిని కలిగిస్తుంది. ఈ సమయంలో, సీత తన భక్తి మరియు ప్రేమతో రాముడిని నడిపిస్తుంది, లక్ష్మణుడు రాముడి ఆజ్ఞలను అనుసరిస్తూ రక్షణను కల్పిస్తాడు.
|| విరాధసంరోధః ||
కృతాతిథ్యోఽథ రామస్తు సూర్యస్యోదయనం ప్రతి |
ఆమంత్ర్య స మునీన్సర్వాన్వనమేవాన్వగాహత ||
రామలక్షణులు, సీత ఆ రాత్రికి ఆ పర్ణశాలలోనే విశ్రమించారు. మరునాడు ఉదయము ఆ మునుల వద్ద అనుజ్ఞ తీసుకొని రాముడు, లక్ష్మణుడు, సీతతో సహా అరణ్యములోకి వెళ్లాడు. వారు అడవిలో ప్రయాణము చేస్తూ ఎన్నో వన్యమృగములను చూచారు.
హటాత్తుగా వారి ఎదురుగా ఒక రాక్షసుడు ప్రత్యక్షం అయ్యాడు. వాడి శరీరం ఒక కొండ మాదిరి ఉంది. వాడు నరమాంసభక్షకుడు అని రాముడు గ్రహించాడు. రామలక్ష్మణులు వాడి వంక నిశితంగా చూచారు.
వాడు నల్లగా కొండ మాదిరి ఉన్నాడు. కళ్లు ఎర్రగా ఉన్నాయి. వికృతాకారంతో ఉన్నాడు. వాడి శరీరం అంతా రక్తంతో తడిసి ఉంది. వాడి బుజం మీద ఒక శూలం ఉంది. దానికి మూడు సింహాలను, నాలుగు పెద్దపులులను, రెండు తోడేళ్లను, పది జింకలను, గుచ్చి తీసుకొని వెళుతున్నాడు.
ఆ రాక్షసుడు రామ లక్ష్మణులను చూచాడు. గట్టిగా అరిచాడు. వారిని చంపడానికి వారి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. వాడి కళ్లక అందమైన సీత కనిపిపించింది. రావడం రావడం సీతను పట్టుకొన్నాడు. సీతను తీసుకొని పక్కకు వెళ్లాడు. రామలక్ష్మణులను చూచి ఇలా అన్నాడు.
“జటలు ధరించిన మీరు ఎవరు? ఇక్కడకు ఎందుకు వచ్చారు? మీరు ఎవరైనా ఈ రోజు నా చేతిలో చావడం ఖాయం. మీరు ఇద్దరూ ముని కుమారుల వేషాలలో ఉన్నారు కదా! మీ వెంట ఈ స్త్రీ ఎందుకు ఉంది? ఈమె ఎవరు? ఈమెతో మీకు ఏమి సంబంధం? మునులు జితేంద్రియులు, సన్యాసులు కదా! మరి ముని ధర్మమునకు విరుద్ధంగా ప్రవర్తించి మీరు ఎందుకు పాపం చేస్తున్నారు?” అని అన్నాడు ఆ రాక్షసుడు.
దానికి రాముడు ఆ రాక్షసుని చూచి ఇలా అన్నాడు. “నీవు మమ్ములను ఇలా అడుగుతున్నావే. ఇంతకూ నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు?” అని అడిగాడు.
“నేను ఒక రాక్షసుడను. నా పేరు విరాధుడు. నేను ఈ అరణ్యములో ఉన్న మునులను చంపి ఆహారంగా తింటూ ఉంటాను. మీ వెంట ఉన్న ఈ స్త్రీ నాకు కావాలి. ఈమెను నేను పెళ్లి చేసుకుంటాను. ముని వేషములలో ఉండి కూడా ఈ స్త్రీని వెంటబెట్టుకొని తిరుగుతూ పాపం చేస్తున్న మిమ్ములను చంపి తింటాను.” అని అన్నాడు విరాధుడు.
ఆ మాటలు విన్న సీత చాలా భయపడింది. సీత శరీరం అంతా భయంతో వణికిపోయింది. విరాధుని ఒడిలో చిగురుటాకులా వణికిపోతున్న సీతను చూచి రాముడు చలించి పోయాడు. రాముడి మొహం పాలిపోయింది. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.
లక్ష్మణా! ఆ దుర్మార్గుడు విరాధుడు సీతను తన ఒడిలోకి ఎలా లాక్కున్నాడో చూచావా! కైక మనకు ఏమి జరగాలని మనసులో అనుకున్నదో అదే జరుగుతూ ఉంది. లక్ష్మణా! కైక తన కుమారుడు భరతునికి రాజ్యం ఇప్పించుకోవచ్చు. మనలను అడవులకు పంపి ఇన్ని కష్టాలకు గురిచెయ్యడం ఎందుకు? కైక మనకు ఏమి జరగాలని కోరుకుంటూ అడవులకు పంపిందో అదే జరుగుతూ ఉంది. నాకు వనవాస ప్రాప్తి, నా తండ్రి మరణము, ఇదుగో ఇప్పుడు నా భార్యను పరపురుషుడు తాకడం, ఒడిలోకి లాక్కోవడం… ఇంతకన్నా కష్టాలు ఏముంటాయి?” అని వాపోయాడు రాముడు.
ఆ మాటలు విన్న అక్ష్మణుడు కోపంతో రగిలిపోయాడు.
“రామా! ఏమిటీ వెర్రి? నీవు దేవేంద్రునితో సమానమైన పరాక్రమము కలవాడవు. ఇలా బేలగా మాట్లాడటం నీకు తగునా? అసలు ఇలా ఎందుకు పరితపిస్తున్నావు? రామా! నువ్వు చూస్తూ ఉండు. ఒకే బాణంతో వీడిని మట్టి కరిపిస్తాను. వీడి రక్తంతో నేలను తడిపేస్తాను. దేవేంద్రుడు పర్వతముల మీద వజ్రాయుధమును ప్రయోగించినట్టు విరాధుని మీద నేను బాణప్రయోగము చేస్తాను. వీడు కొండ కూలినట్టు కూలిపోతాడు. వీడి వక్షస్థలమును చీలుస్తాను. వీడి ప్రాణాలు హరిస్తాను.” అని కోపంతో ఊగిపోతూ అన్నాడు.
లక్ష్మణుడు. (ఒక్కమాట. విరాధుడురాక్షసుడు. నరమాంసము తినేవాడు. వాడు అన్న మాటలు చదివారు కదా. సన్యాసులు జితేంద్రియులు. వారి వెంట స్త్రీ ఉండకూడదు. వారికి స్త్రీ సాంగత్యము పనికిరాదు. ఇదీ ఆ రాక్షసునికి తెలిసిన నీతి. కాని ఈ నాడు మన మధ్యఉన్న స్వామీజీలు, సన్యాసుల చుట్టు ఉండేది ఆడవాళ్లే. సిల్కుజుబ్బాలు, చుట్టు ఆడవాళ్లు. తాము ఉండే గదుల్లో కిలోల కొద్దీ వెండి బంగారాలు, అక్రమ ఆస్తులు, పోలీసుకేసులు, అరెస్టులు ఇవి నిత్యకృత్యం అయ్యాయి. మరి ఆ రాక్షసుడికి ఉన్న జ్ఞానం కూడా మన స్వామీజీలకు లేదా! ఏమో! మీరే ఆలోచించండి)
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” రామాయణంలోని అయిదు కాండల్లో మూడవది. ఇది రాముడు, సీత, లక్ష్మణులు దండకారణ్యంలో 14 ఏళ్ళ వనవాసం గడుపుతూ చేసిన అనుభవాలను వివరిస్తుంది. ప్రథమ సర్గలో, వారు అరణ్యంలో ప్రవేశించి, అటవీ జీవులను కలుస్తారు మరియు శరభంగ, సుతీక్ష్ణ మునులతో సమావేశమవుతారు.
రాముడు సీత, లక్ష్మణుడు వెంటరాగా దండకారణ్యములోనికి ప్రవేశించాడు. ఆ దండకారణ్యములో ఎంతో మంది మహా మునులు ఆశ్రమములు కట్టుకొని తపస్సు చేసుకుంటూ ఉండటం చూచాడు రాముడు. ఆ మునుల ఆశ్రమముల దగ్గర వన్య మృగములు పరస్పర వైరము, భయమూ లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. పక్షుల కిల కిలారావములతో, వన్యప్రాణుల విహారములతో ఆ వనసీమలో ఉన్న ముని ఆశ్రమములు ఎంతో శోభాయమానంగా ఉన్నాయి.
ఆ మునుల ఆశ్రమములు విశాలమైన అగ్ని గృహములతోనూ, యజ్ఞమునకు కావలసిన సంభారములతోనూ, వేలాడుతున్న జింక చర్మములతోనూ, దర్భలతోనూ, అగ్నికార్యమునకు కావలసిన సమిధలతోనూ, నీళ్లతో నిండి ఉన్న పాత్రలతోనూ, తినడానికి కావలసిన ఫలములతోనూ నిండి ఉన్నాయి. ఒక పక్కనుండి వేదమంత్రములు చదువుతున్న ధ్వనులు, మరొక పక్క నుండి పూజా కార్యక్రమముల మంత్ర ధ్వనులు వీనుల విందుగా వినపడుతున్నాయి. ఆ ఆశ్రమములలో కేవలము తపస్సుచేసుకొనే మునులు మాత్రమే నివసిస్తున్నారు. రామలక్ష్మణులకు ఆ ప్రాంతము బ్రహ్మలోకము వలె కనిపించింది.
రాముడు, సీత, లక్ష్మణుడు తమ ఆశ్రమముల వంక రావడం ఆ మునులు చూచారు. వారంతా రామ లక్ష్మణులకు ఎదురు వెళ్లి స్వాగతము పలికారు. వారికి అర్ఘ్యము పాద్యము సమర్పించారు. కొందరు మునులు రామ లక్ష్మణుల దేహధారుఢ్యము, అంగసౌష్టవము చూచి ఆశ్చర్యపోయారు. వారిని రెప్ప వెయ్యకుండా చూస్తున్నారు.
ఆ మునులందరూ రామ లక్ష్మణులకు, సీతకు ఒక పర్ణశాలను చూపించారు. వారు అందులో నివాసము ఉండవచ్చునని తెలిపారు. కొందరు రామలక్ష్మణులకు నీళ్లు తెచ్చి ఇచ్చారు. మరి కొందరు తినడానికి మధురమైన ఫలములను తీసుకొని వచ్చి ఇచ్చారు. అందులో ముఖ్యులు, పెద్దవారు అయిన మునులు రాముని చూచి
“రామా! నీవు అయోధ్యకు మహారాజువు. రాజు లోక పూజ్యుడు. రాజు ప్రజలను ధర్మమార్గంలో నడిపిస్తాడు. రాజు దుష్టులను శిక్షిస్తాడు. ప్రజలను రక్షిస్తాడు. అందుకే రాజును అందరూ గౌరవించాలి, పూజించాలి. ప్రజారక్షకుడైన రాజు ఇంద్రునిలో నాలుగవ అంశ అని అంటారు. అందు చేతనే రాజు ప్రజల మన్ననలు పొందుతూ, రాజభోగములు ఇంద్రుని వలె అనుభవిస్తుంటాడు. ఈ ప్రదేశము అయోధ్యారాజ్యములో ఉంది. కాబట్టి నీవే మాకు రాజువు. నీవే మమ్ములను రక్షించాలి. నీవు ప్రస్తుతము వనములో ఉన్నావని రాజువు కాకపోవు. రాజు అయోధ్యలో ఉన్నా, అడవిలో ఉన్నా, రాజు రాజే.
రామా! మా సంగతి నీకు తెలుసు కదా! మేమే అన్ని సంగములను విడిచి పెట్టి జితేంద్రియులమై, ఆ అడవిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాము. మాకు ఎవరైనా అపకారము చేసినా, వారి మీద కోపగించకోడానికి కూడా మేము ఇష్టపడము. కాబట్టి మా అందరినీ రాజువైన నీవే మా అందరినీ రక్షించాలి.” అని పలికారు.
తరువాత ఆ మునులు రామలక్ష్మణులకు, సీతకు అనేక ఫలములు, కంద మూలములు, ఇతరములైన ఆహార పదార్థములు తెచ్చి ఇచ్చారు. రాముడు వారు చెప్పిన మాటలను ఆలకించాడు. వారు ఇచ్చిన పదార్థములను, ఫలములను భక్తితో స్వీకరించాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రిసప్తతితమః సర్గలో, మేము ఏ ఆహ్వానం లేదా వివాహ కార్డు కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు లేదా ఈ వివాహం కోసం కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికీ సమానంగా మరియు వ్యక్తిగతంగా స్వాగతం. ఎలాంటి ఉపోద్ఘాతాలు లేకుండా నేరుగా అక్కడికి వెళ్దాం.
దశరథుడు తన కుమారులచేత గోదానములు ఇప్పించు చున్న సమయంలో భరతుని మేనమామ యుధాజిత్తు అక్కడకు వచ్చాడు.
(భరతుని మేనమామ అంటే దశరథుని మూడవ భార్య, భరతుని తల్లి అయిన కైకేయి సోదరుడు అనగా కేకయ రాజు కుమారుడు).
కేకయ రాజ కుమారుడు, భరతునికి మేనమామ అయిన యుధాజిత్తును చూచి దశరథుడుఎంతో సంతోషించాడు. యుధాజిత్తు దశరథునితో ఇలా అన్నాడు.
“బావగారూ! మా తండ్రికేకయ రాజుగారు తమరిని కుశలము అడగమని అన్నాడు. ఇక్కడ మీరందరూ క్షేమమే కదా! మా తండ్రిగారు తన మేనల్లుడు అయిన భరతుని చూడవలెనని ముచ్చట పడు తున్నాడు. భరతుని నా వెంట తీసుకొని రమ్మని నన్ను పంపాడు. అందుకని నేను అయోధ్యానగరమునకు వెళ్లాను. మీరందరూ మీ కుమారుల వివాహమలు జరిపించుటకు విదేహ కు వెళ్లారని తెలిసి ఇక్కడకు వచ్చాను.” అని అన్నాడు యుధాజిత్తు.
దశరథుడు ఎంతో సంతోషంగా యుధాజిత్తుకు అతిథి సత్కారములు చేసాడు. అందరూ సంతోషంగా ఆ రాత్రి గడిపారు. మరునాడు ఉదయము అందరూ పెందలకడనే నిద్రలేచి ప్రాత:కాల సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించుకొన్నారు. తరువాత వారందరూ విశ్వామిత్రుడు, వసిష్ఠుడు మొదలగు ఋషులు ముందు నడువగా యజ్ఞవాటికకు చేరుకున్నారు.
పెళ్లి కుమారులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుభ ముహూర్తంలో తోరము కట్టడం మొదలగు మంగళ కార్యములు ఆచరించారు. తరువాత నలుగురు సోదరులు, పురోహితులు, అందరూ దశరథుని వద్దకు వెళ్లారు. దశరథుని అనుమతితో వసిష్ఠుడు జనక మహారాజు వద్దకు పోయి ఇలాఅన్నాడు.
“ఓ జనక మహారాజా! దశరథమహారాజు తన కుమారులకు కౌతుక మంగళకార్యములనుపూర్తిచేసుకొని తమరి కొరకు ఎదురు చూస్తున్నారు. కన్యాదాన కార్యక్రమము కన్యాదాతలైన మీ అనుమతితో జరగాలికదా! ” అని అన్నాడు.
“అదేమిటి మహర్షీ! మిథిల కూడా వారిదేకదా! వారికి అడ్డేమున్నది. వారునా అనుమతి కోసరం ఎదురు చూడ్డం ఏమిటి? అవశ్యం వారిని రమ్మనండి. ఇక్కడ నా కుమార్తెలు కూడా కౌతుక మంగళ కార్యములను పూర్తిచేసుకొని కల్యాణ వేదిక వద్దకు వచ్చి ఉన్నారు. నేను కూడా వేదిక వద్దకు వెళుతున్నాను. సుముహూర్తము సమీపించుచున్నది. ఇంక ఆలస్యము చేయకుండా దశరథుల వారిని వారి కుమారులను వివాహ వేదిక వద్దకు తోడ్కొని రెండు.” అని అన్నాడు జనకుడు.
జనకుని మాట మేరకు దశరథుడు, తనకుమారులతో సహా పురోహితులు ముందు నడువగా వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. జనకుడు వారి నందరినీ వివాహ వేదిక వద్దకు సాదరంగా ఆహ్వానించాడు. జనకుడు వసిష్ఠుని చూచి ఇలా అన్నాడు.
“ ఓ వసిష్ఠ మహర్షీ! తమరు ఈ వివాహమునకు పౌరోహిత్యము వహించాలి. నా కుమార్తెల వివాహములను దశరథపుత్రులతో వేదోక్తంగా జరిపించమని ప్రార్థిస్తున్నాను.” అని అన్నాడు.
ఆ మాటలకు వసిష్ఠుడు తన అంగీకారము తెలిపాడు. తరువాత వసిష్ఠుడు విశ్వామిత్రుని, శతానందుని చెరి ఒక పక్క ఉంచుకొని వివాహ కార్యక్రమమును నిర్వర్తించడానికి ఉపక్రమించాడు.
వివాహ మండపము మధ్యలో ఉన్న అగ్ని కుండములో అగ్నిహోత్రమును ఉంచాడు. హెమ కుండము చుట్టు గంధము, పుష్పములు, సువర్ణ కలశములలో పాలికలు, అంకురార్పణ చేసిన కుంభములు, మూకుళ్లు, ధూప పాత్రలు, శంఖ పాత్రలు, హోమము చేయు సాధనములు, నేతితో నిండినపాత్రలు, లాజలతో నిండిన పాత్రలు, అక్షతలు అన్నీ సిద్ధంగా ఉంచుకున్నాడు. వసిష్ఠుడు శాస్త్రోక్తముగా అగ్నిని వేల్చాడు. దర్భలు అగ్నిహోత్రము చుట్టూ పరిచాడు. వేద మంత్రములను పఠిస్తూ హోమ కార్యక్రమమును నిర్వర్తించాడు.
తరువాత జనక మహారాజు సర్వాలంకార భూషిత అయిన తన కుమార్తె సీతను తీసుకొని వచ్చి అగ్ని హోత్రము వద్ద నిలబడి ఉన్న రాముని ఎదురుగా నిలబెట్టాడు. రాముని చూచి ఇలా అన్నాడు.
“ఓ రామా! ఈమె నా కుమార్తె సీత. నీకు సహధర్మచారిణి కావడానికి సిద్ధంగా ఉంది. ఈమెను నీ సహధర్మచారిణిగా స్వీకరించు. నీ హస్తముతో నా కుమార్తె సీత హస్తమును గ్రహింపుము. పాణిగ్రహణము చేయుము. ఓరామా! ఈమె పతివ్రతయై నిన్ను ఎల్లప్పుడూ నీడవలె వెన్నంటి ఉండగలదు.” అని పలుకుతూ జనక మహారాజు సీత చేతిని రామునికి అందించి జలమును వదిలాడు. కన్యాదానం చేసాడు.
ఆ సమయంలో ఆకాశం నుండి దేవతలు దుందుభులు మోగించారు. పూలవర్షము కురిపించారు. ఆ ప్రకారంగా సీతారాముల కల్యాణము వైభవంగా జరిపించాడు జనకుడు.
తరువాత జనకుడు లక్ష్మణుని పిలిచాడు. “లక్ష్మణా! ఈమె నా కుమార్తె ఊర్మిళ. ఈమెను నీ సహధర్మచారిణిగా స్వీకరింపుము. ఇంక ఆలస్యము చేయకుండా ఈమెను పాణిగ్రహణము గావించు.” అని తన కుమార్తె ఊర్మిళ చేతిని లక్ష్మణుని చేతికి అందించాడు.
తరువాత జనకుడు భరతుని చూచి ” ఓ భరతా! ఈమె నా కుమార్తె మాండవి. ఈమెను పాణిగ్రహణము గావించు.
ఓ శత్రుఘ్నా! ఈమె నా కుమార్తె శ్రుత కీర్తి. నీవు ఈమె పాణిని గ్రహించు.
ఓ రామ,లక్ష్మణ,భరత,శత్రుఘ్నులారా! మీరందరూ సౌమ్యులు. గుణవంతులు. మంచి ప్రవర్తన కలవారు. నాకుమార్తెలను మీ మీ భార్యలుగా స్వీకరించండి.” అని అన్నాడు.
అప్పుడు రాముడు సీత చేతిని, లక్ష్మణుడు ఊర్మిళ చేతిని, భరతుడు మాండవి చేతిని, శత్రుఘ్నుడు శ్రుతకీర్తి చేతిని పట్టుకొన్నారు. పాణిగ్రహణ మహోత్సవము జరిగిపోయింది. దశరథుని కుమారులు నలుగురు తమ తమ భార్యల చేతులను పట్టుకొని అగ్నికి నమ స్కారము చేసారు. తరువాత మామగారు జనకునికి నమస్కారము చేసారు. తరువాత పురోహితులు వసిష్ఠమహర్షికి నమస్కారము చేసారు. తరువాత వసిష్ఠుడు దశరథ కుమారుల వివాహ కార్యక్రమ మును వైభవోపేతంగా జరిపించాడు.
తరువాత రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు తమ తమ భార్యల చేతులు పట్టుకొని అగ్నిహోత్రము చుట్టు మూడు సార్లు ప్రదక్షిణము చేసారు. ఆ ప్రకారంగా సీతా రాములు, ఊర్మిళా లక్ష్మణులు, మాండవీ భరతులు, శ్రుతకీర్తి శత్రుఘ్నులు దంపతులు అయ్యారు.
వివాహ కార్యక్రమము తరువాత రామ లక్ష్మణ, భరత శత్రుఘ్నులు తమ తమ భార్యలతో విడిది గృహములకు వెళ్లారు. వారి వెంట ఋషులు, పురోహితులు, బ్రాహ్మణులు కూడా వెళ్లారు. కుమారులను కోడళ్లను తృప్తిగా చూసుకుంటూ దశరథుడు కూడా వారి వెంట విడిదిగృహమునకు వెళ్లాడు.
అయోధ్యాకాండ ద్విసప్తతితమః సర్గలో, రాముడు అరణ్యవాసం చేస్తుండగా, అయోధ్యలో ఆయన తండ్రి దశరథ మహారాజు ప్రాణాలు విడుస్తాడు. దశరథుడు రాముని వలన విడిపోయిన క్షోభలో ఉండి, రాముడు నగరాన్ని విడిచిపోవడం వల్ల బాధతో మరణించాడు. కైకేయి చిత్తవికారంతో ఉండగా, భరతుడు తన తల్లి చర్యలను దుఃఖించి, రాముని తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. భరతుడు తన సహోదరుడు శత్రుఘ్నునితో కలిసి రాముని అరణ్యంలో కలుసుకోవడానికి బయలుదేరుతాడు. ఈ సర్గలో దశరథుడి మరణం, భరతుడి ప్రతిజ్ఞ, మరియు రాముని తిరిగి పట్టణానికి ఆహ్వానించే యత్నం ప్రధానాంశాలు.
భరతుడు అలా ఆలోచిస్తూ తన తండ్రి దశరథుని మందిరములో ప్రవేశించాడు. అక్కడ దశరథుడు కనిపించలేదు. వెంటనే తన తల్లి కైక మందిరమునకు వెళ్లాడు. కొడుకును చూడగానే కైక మనస్సు సంతోషంతో నిండిపోయింది. కొడుకుకు ఎదురువెళ్లింది. భరతుడు తల్లి కైక పాదములకు నమస్కరించాడు. కైక భరతుని లేవదీసి నుదుటిన ముద్దు పెట్టుకొని తన పక్కన కూర్చుండబెట్టుకొంది.
“నాయనా భరతా! నీ ప్రయాణము బాగా సాగిందా! తాతగారి ఇంట్లో ఎప్పుడు బయలుదేరావు. మార్గములో ఆయాసము కలగలేదు కదా! మీ తాతగారు, మేనమామ అంతా క్షేమంగా ఉన్నారా! ఇంకా కేకయ దేశపు విశేషములు ఏమిటి వివరంగా చెప్పు.” అని ఆతురతగా అడిగింది కైక చెప్పాడు. భరతుడు తల్లి అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ సమాధానాలు “అమ్మా! నేను తాతగారి ఇంటి నుండి బయలుదేరి ఏడుదినములు అయింది. అక్కడ తాతగారూ, మామయ్య అంతా క్షేమంగా ఉన్నారు. వారు మీకు, తండ్రి గారికి, పంపిన కానుకలు వెనుక తీసుకొని వస్తున్నారు. అమ్మా! అయోధ్యలో ప్రవేశించినప్పటి నుండి నా మనస్సులో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. వాటికి సమాధానాలు చెబుతావా అమ్మా!” అని అడిగాడు భరతుడు. కైక మాట్లాడలేదు. మౌనంగా ఉంది. భరతుడు ఇలాఅడిగాడు.
అమ్మా! నాన్న గారు ప్రతిరోజూ పడుకొనే బంగారు శయ్యమీద నాన్న గారు లేరు. కారణమేమి? ఈ మందిరములో పరిజనులందరి మొహంలో చింత, శోకము, ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంది. కారణమేమి? దశరథ మహారాజు గారు ఎక్కుడ సమయము నీ అంత:పురములోనే గడుపుతారు కదా! మరి ఇప్పుడు ఆయన నీ అంత:పురములో కనిపించడం లేదు. ఎందుకనీ? నేను చాలా రోజుల తరువాత వచ్చాను. నాన్న గారికి పాదాభి వందనము చేసి ఆయన ఆశీర్వాదము తీసుకొనవలెనని చాలా ఆతురతగా ఉన్నాను. ఆయన ఎక్కడ ఉన్నారు. నీ మందిరములో లేరు. కౌసల్య మందిరములో ఉన్నారా! చెప్పమ్మా! నేను నాన్నగారు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లాలి.” అని గుచ్చి గుచ్చి అడిగాడు.
ఇంక కైక తప్పించుకోలేక పోయింది. కాని నర్మగర్భంగా చెప్పసాగింది. “కుమారా భరతా! నీ తండ్రిగారు సాధారణంగా అన్ని జీవులు ఏ గతి పొందుతాయో అదే గతిని పొందారు.” అని చెప్పింది. భరతునికి అర్థం అయింది. తండ్రి మరణవార్త విని అలాగే కుప్పకూలిపోయాడు భరతుడు. అతనికి నోటమాట రాలేదు. దు:ఖంతో కుమిలిపోతున్నాడు. కైక భరతుని వద్దకు వచ్చి అతనిని లేపి పక్కన ఉన్న ఆసనము మీద కూర్చోపెట్టింది.
“భరతా! అదేమిటి అలా పడిపోయావు. నీ వంటి రాకుమారులు, కాబోయే మహారాజులు ఇలా దిగులు చెందవచ్చునా! నీ శోకము మాను.” అని ఊరడించింది కైక. కాని భరతునికి శోకము ఆగలేదు. పెద్దగా ఏడుస్తున్నాడు. “అమ్మా! వసిష్ఠులవారు శీఘ్రముగా రమ్మన్నారు అంటే రామునికి పట్టాభిషేకమునకు సుముహూర్తము నిశ్చయించినారేమో అనుకున్నాను. కాని ఇంతటి దుర్వార్త వినవలసి వస్తుందని అనుకోలేదు. అమ్మా! ఇంత హటాత్తుగా తండ్రిగారు చనిపోవుటకు కారణమేమి! ఏమైనా వ్యాధి సోకినదా! తండ్రిగారి అవసాన కాలములో దగ్గర ఉండి ఆయన అంత్యక్రియము జరిపించిన రాముడు ధన్యుడు. ఆ భాగ్యమునకు నేను నోచుకోలేదు. నేను వచ్చాను అని తెలియగానే నాకు ఎదురు వచ్చి నా శరీరమును అంతా నిమిరి, నా శిరమును ఆఘ్రాణించు తండ్రిగారు కనపడనప్పుడే అనుకున్నాను. ఇలాంటిది ఏదో జరిగి ఉంటుందని. నా తండ్రిగారి చేతి స్పర్శ అనుభవించు భాగ్యము ఈ జన్మకు లేదు కదా!
అమ్మా తండ్రి గారి తరువాత తండ్రి అంతటివాడు రాముడు. ఆయన నాకు అన్నగారే కాదు, తల్లి, తండ్రి, గురువు, దైవము. రామునికి నా రాక గురించి తెలపండి. నా తండ్రికి బదులు నా అన్నగారి పాదాలు పట్టుకొని ఆశీర్వాదము తీసుకుంటాను. రాముడు నన్ను ఆశీర్వదిస్తే నా తండ్రి ఆశీర్వదించినట్టే! అమ్మా! తండ్రిగారి మరణసమయములో నేను దగ్గర లేను కదా! నాతో చెప్పమని ఏమైనా చెప్పాడా అమ్మా! చెప్పమ్మా! నా తండ్రి గారి మాటలు యధాతథంగా చెప్పమ్మా!” అని కైకను ప్రార్థించాడు భరతుడు.
కైక జరిగింది చెప్పసాగింది. “కుమారా! నీ తండ్రి దశరథ మహారాజు తన ఆఖరి ఘడియలలో హా రామా! హా లక్ష్మణా! హా సీతా! అని వారిని తల్చుకుంటూ ప్రాణాలు వదిలాడు. ఇంకా ఇలా అన్నాడు. “రాముడు సీతతో లక్ష్మణునితో అయోధ్యకు తిరిగి వచ్చినపుడు చూచిన వారు ధన్యులు కదా!” అని అన్నాడు.
భరతునికి అనుమానం కలిగింది. “అమ్మా! రాముడు, లక్ష్మణుడు, సీత ఎక్కడకు వెళ్లారు. ఎందుకు వెళ్లారు? ఎప్పుడు వస్తారు.” అని అడిగాడు భరతుడు. తాను చెప్పబోవు సంగతులు భరతునికి సంతోషము కలిగిస్తాయి అనే భ్రమలో జరిగింది జరిగినట్టు చెప్పసాగింది కైక.
“కుమారా భరతా! నీ అన్న రాముడు నార చీరలు ధరించి భార్యాసమేతుడై, లక్ష్మణుని వెంటదీసుకొని అరణ్యములకు వెళ్లాడు.” అని చెప్పింది. భరతుడు ఆశ్చర్యపోయాడు. ధర్మము తప్ప మరొకటి తెలియని రాముడు ఏ తప్పుచేసాడని రాజ్యము నుండి వెడలి పోయాడు అని ఆలోచించాడు. తల్లి కైకను ఇలా అడిగాడు.
“అమ్మా! రాముడు ఏమి తప్పు చేసాడని రాజ్యమునుండి వెడలగొట్టబడ్డాడు. రాముడు బ్రాహ్మణుల సొత్తును దొంగిలించాడా! రాముడు ఎవరి నైనా నిరపరాధిని దండించాడా! లేక రాముడు ఇతర స్త్రీలను, ఇతరుల భార్యలను కామవాంఛతో కోరుకున్నాడా. లేక ఏమైనా భ్రూణ హత్య లాంటిది చేసాడా! రాముడు ఏ అపరాధమూ చెయ్యకుండా రాజ్యమునుండి ఎందుకు అరణ్యములకు పంపబడ్డాడు.” అని నిలదీసాడు భరతుడు. ఇంక చెప్పక తప్పదని అసలు విషయాన్ని చెప్పసాగింది కైక. “రాకుమారా! రాముడు నీవు చెప్పిన ఏ పాపమూ చెయ్యలేదు. నీ తండ్రి దశరథుడు రామునికి పట్టాభిషేకము చేయుటకు ముహూర్తము నిశ్చయించాడు. ఆ విషయమును విన్న నేను ఆందోళనపడ్డాను. వెంటనే నీ తండ్రి వద్దకు పోయి, నీకు యౌవరాజ్యము పట్టాభిషేకము చేయమనీ, రాముని పదునాలుగేళ్లు అరణ్యములకు పంపమని కోరాను. నీ తండ్రి నాకు ఇదివరలో ఇచ్చిన వరములను సఫలము చేయుటకు రాముని అరణ్యములకు పంపాడు. రాముని వెంట సీత, లక్ష్మణుడు కూడా వెళ్లారు. రాముడు అరణ్యములకు పోవడంతో నీ తండ్రి దిగులుతో రాముని ఇంక చూడలేనేమోనని చింతతో మరణించాడు.
నాయనా భరతా! ఇదంతా నేను నీ కోసమే, నీ మేలు కోరి, నీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేసాను. కాబట్టి వెంటనే నీవు రాజ్యాభిషిక్తుడివికా! ఈ తల్లి కోర్కె నెరవేర్చు. నీ తండ్రి మాట ప్రకారము రాముడు అడవులకు వెళ్లాడు. నా మాట ప్రకారము నీవు పట్టాభిషిక్తుడివి కా! కాబోయే మహారాజువు. నీవు దిగులు పడకూడదు. ధైర్యంగా ఉండు. ఇప్పుడు నీకు దాయాదుల బాధ లేదు. నీ ఇష్టం వచ్చినట్టు అయోధ్యను పాలించు. నీవు వెంటనే వసిష్ఠుని కలిసి, నీ తండ్రికి శాస్త్రోక్తంగా అంత్య క్రియలు నిర్వర్తించి, తరువాత రాజ్యాభిషిక్తుడివి కా! అని పలికింది కైక.
అయోధ్యాకాండ ఏకసప్తతితమః సర్గంలో రాముడు, సీత మరియు లక్ష్మణులు అరణ్యంలో వాసం చేస్తున్నారు. ఈ సర్గలో రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యవాసం చేస్తూ ఆ ప్రాంతంలోని వివిధ అటవీ ప్రాంతాలు మరియు అటవీ జీవులను చూశారు. వారు మునుల ఆశ్రమాలను సందర్శించి, వారి నుండి ఆశీర్వాదాలు తీసుకున్నారు. లక్ష్మణుడు రాముడి కోసం పర్ణశాల నిర్మించాడు. ఈ సర్గలో వారు తమ వాసస్థలం గురించి చర్చిస్తారు మరియు సుఖముగా అరణ్యవాసం కొనసాగిస్తారు. దురితములు అనుభవిస్తున్నప్పటికీ, రాముడు తన ధర్మాన్ని పాటిస్తాడు మరియు సీత, లక్ష్మణులు ఆయనతో కలిసి ఉంటారు.
భరత శత్రుఘ్నులు ఎక్కిన రథము అయోధ్య వైపు వేగంగా వెళుతూ ఉంది. శతద్రూనదిని దాటారు. శిలావహనదిని దాటారు. త్రివేణీ సంగమమును సమీపించారు. వీరమత్స్యదేశమును దాటి భారుండ వనమును ప్రవేశించారు. కులింగనదిని, యమునా నదిని దాటారు. అక్కడ కొంచెం సేపు విశ్రమించారు. ప్రాగ్వట పురమును దాటి గంగానదిని సమీపించారు. గంగానదిని దాటి ధర్మవర్థనము అనే గ్రామమును సమీపించారు. జంబూప్రస్థమును దాటి వరూధమనే గ్రామము చేరుకున్నారు. తరువాత ఉజ్జహాసనగరమును, సర్వతీర్థమును, ఉత్తానికా నదిని, కుటికానదిని, కపీవతి నదిని, స్థాణుమతీ నదిని, గోమతీ నదిని దాటారు. కళింగ నగరములో కొంచెము సేపు విశ్రమించారు. తరువాత సాలవనమును దాటారు. ఆ ప్రకారము ఏడు రోజులు అవిశ్రాంతంగా ప్రయాణము చేసి అయోధ్యానగరము చేరుకున్నారు.
ఎల్లప్పుడూ సందడిగా కళ కళ లాడుతూ ఉండే అయోధ్యానగరము కళాహీనంగా ఉంది. భరతునికి ఏం జరిగిందో కాలేదు. భరతుడు తన సారథిని చూచి అయోధ్యా నగరము అలా ఎందుకు ఉంది అని అడిగాడు. “సారధీ! ఎల్లప్పుడూ స్త్రీపురుషుల సంచారముతో సందడిగా ఉండే అయోధ్యానగరము ఇప్పుడు నిశ్వబ్దముగా ఉందేమి? ఎక్కడా రధములు వాహనములు కనపడటం లేదు. ఏమి కారణము? అయోధ్యానగరములోని గృహముల నుండి వాద్యముల గోష్టి మృదు మధురంగా వినపడటం లేదేమి? నాకు చాలా చెడ్డ శకునములు కనపడుతున్నాయి. కాని ఏం జరిగిందో అర్థం కావడం లేదు. నాకు కావలసిన వారికి ఏదో కీడు జరిగి ఉంటుంది అని నా మనసుకు తడుతూ ఉంది. నీ కేమైనా తెలుసా!” అని అడిగాడు భరతుడు. సారధి మాట్లాడలేదు. భరత శత్రుఘ్నులు అయోధ్యలోకి ప్రవేశించారు. మరలా సారథిని చూచి భరతుడు ఇలా అన్నాడు.
“ఓ సారధీ! అసలు నన్ను ఇంత తొందరగా ఎందుకు పిలిపించారు. నా మనస్సు ఏదో కీడు శంకిస్తూ ఉంది. ఎందుకంటే పూర్వము రాజులు మరణించినపుడు ఎలాంటి శకునములు, గుర్తులు కనపడతాయో అవన్నీ నాకు గోచరమవుతున్నాయి. అదీ కాకుండా అయోధ్యలో వీధులు దుమ్ముకొట్టుకొని ఉన్నాయి. ఎవరూ శుభ్రం చేస్తున్నట్టులేదు. దేవాలయములలో పూజలు వేదఘోషలు వినపడటం లేదు. ఎక్కడా పూలు అమ్ముతున్న ఛాయలు లేవు. యజ్ఞములు చేస్తున్నట్టు అగ్నిధూమములు కనిపించడం లేదు. వ్యాపార సంస్థలు అన్నీ మూసి ఉన్నాయి. ఏమి కారణము. నీకేమైనా తెలుసా!” అని అడిగాడు. సారధి మౌనంగా ఉన్నాడు. భరతుడు రాజభవనంలోకి ప్రవేశించాడు. రాజభవనం కూడా నిర్మానుష్యంగా ఉంది. పరిచారకుల సందడి కూడా లేదు. భరతుడు లోపలకు వెళుతున్నాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకసప్తతితమః సర్గలో, జనకుడు తన కుమార్తెలను రాముడు మరియు లక్ష్మణులకు వధువులుగా అర్పిస్తూ తన వంశాన్ని వివరిస్తాడు. అలా చేయడం ద్వారా, అతను తన సోదరుడు కుశధ్వజ గురించి మరింత వివరంగా చెప్పాడు, అతని కుమార్తెలు భరతుడు మరియు శత్రుఘ్నులకు కాబోయే భార్యలు. పెళ్లికి టైమింగ్స్ కూడా ఫిక్స్ చేస్తారు.
ఫల్గున్యాముత్తరే రాజంస్తస్మిన్వైవాహికం కురు |
రామలక్ష్మణయో రాజన్దానం కార్యం సుఖోదయమ్ ||
24
Balakanda Sarga 71 In Telugu Pdf With Meaning
ఆ ప్రకారంగా వసిష్ఠుడు దశరథుని వంశము గురించి చెప్పిన తరువాత, జనకుడు చేతులు జోడించి ఇలా అన్నాడు.
“ఓ దశరథ మహారాజా! తమరి వంశక్రమమును గూర్చి విని చాలా ఆనందించాను. కన్యాదాన సమయములో వధువు యొక్క వంశమును గూర్చి కూడా వివరించడం సాంప్రదాయము. కాబట్టి మా వంశ చరిత్రను వివరిస్తాను. అవధరించండి.
మాది మిథిలా నగరము. ఈ మిథిలా నగరమును నిర్మించిన వాడు మిథి అనే చక్రవర్తి. మిది, నిమి చక్రవర్తి కుమారుడు. ఆయనే మా వంశమునకు మూలపురుషుడు. మిథిని జనకుడు అని కూడా పిలుస్తారు. ఆయనే మా వంశములో మొట్ట మొదటి జనకుడు.
మిథి కుమారుడు ఉదావసువు. ఉదావసుని కుమారుడు నందివర్థనుడు. నంది వర్ధనుని కుమారుడు సుకేతువు. సుకేతుని కుమారుడు దేవరాతుడు. దేవరాతుని కుమారుడు బృహద్రథుడు. బృహద్రథుని కుమారుడు మహావీరుడు. మహావీరుని కుమారుడు సుధృతి. సుధృతి కుమారుడు దుష్టకేతువు. ఆయన రాజర్షి.
రాజర్షిఅయిన దుష్టకేతువు కుమారుడు హర్యశ్వుడు. హర్యశ్వుని కుమారుడు మరుడు. మరుని కుమారుడు ప్రతింధకుడు. ప్రతింధకుని కుమారుడు కీర్తిరథుడు. కీర్తిరథుని కుమారుడు దేవమీఢుడు. దేవమీఢుని కుమారుడు విబుధుడు. విబుధుని కుమారుడు మహీధ్రకుడు. మహీధ్రకుని కుమారుడు కీర్తిరాతుడు. ఆయన కూడా రాజర్షి.
రాజర్షి అయిన కీర్తిరాతునికి మహారోముడు జన్మించాడు. మహారోముని కుమారుడు స్వర్ణరోముడు. స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు. ఆ హ్రస్వరోమునికి ఇరువురు కుమారులు పుట్టారు. అందులో పెద్దవాడను నేను. రెండవ వాడు నా తమ్ముడు కుశధ్వజుడు.
మా తండ్రిగారైన హ్రస్వరోమ మహారాజు నన్ను ఈ మిథిలా నగరమునకు రాజుగా చేసాడు. నా తమ్ముని బాధ్యతను నాకు అప్పగించి ఆయన వనములకు వెళ్లాడు. కాలవశాత్తు నా తండ్రిగారు స్వర్గస్థులయ్యారు. నేను నా తమ్ముని పోషణభారము వహించి రాజ్యము చేస్తున్నాను.
కొంత కాలము తరువాత సాంకాశ మహారాజు సుధన్వుడు నా రాజ్యము మీదికి దండెత్తి వచ్చాడు. నా వద్ద ఉన్న శివధనుస్సును, నా కుమార్తె సీతను తనకు ఇవ్వమని నాకు వర్తమానము పంపాడు. నేను నా కుమార్తెను గానీ శివధనుస్సును గానీ సుధన్వునికి ఇవ్వడానికి అంగీకరించలేదు. మా ఇరువురికి యుద్ధము జరిగింది.
నేను సుధన్వుని యుద్ధములో ఓడించి వధించాను. సాంకాశ పురమును ఆక్రమించుకున్నాను. తరువాత నా తమ్ముడు కుశధ్వజుని సాంకాశ పురమునకు రాజుగా పట్టాభిషిక్తుని చేసాను.
ఓ వసిష్ట మునీంద్రా! మా సోదరులలో నేను పెద్ద వాడను. నా కుమార్తె పేరు సీత. నా తమ్ముడు కుశధ్వజుని కుమార్తె పేరు ఊర్మిళ. సీతను రామునికి, ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహము జరిపించడానికి సంకల్పించాను. ఈ విషయమును ఏ మాత్రము సందేహమునకు తావు లేకుండా మూడు మారులు నొక్కి చెప్పుచున్నాను. నా కుమార్తెలైన సీత, ఊర్మిళ లను దశరథమహారాజు కుమారులైన రామునికి లక్ష్మణునికి ఇచ్చి వివాహం జరిపించుటకు ఎంతో ఆనందించుచున్నాను.
ఓ దశరథ మహారాజా! రామ లక్ష్మణులతో గోదానము మొదలగు శుభకార్యములను చేయించండి. పితృకార్యము జరిపించిన తదుపరి వివాహమహోత్సవమును జరిపించెదను.
ఓ దశరథ మహారాజా! నేడు మఘా నక్షత్రము. నేటికి మూడవ రోజున అనగా ఉత్తరఫల్గునీ నక్షత్రములో వివాహము జరిపించెదము. ఈ రెండు రోజులలో రామ లక్ష్మణుల చేత గోదానము మొదలగు దానములు ఇచ్చు కార్యక్రములు నిర్వర్తింపుడు.” అని వినయంతో పలికాడు జనకుడు.
అయోధ్యా కాండ సర్గ 54 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. సీతా,రామ,లక్ష్మణులు మరునాడు ఉదయమే నిద్రలేచారు. సంధ్యావందనాది కార్యక్రమములు ముగించుకొని ఆ ప్రదేశము విడిచి వెళ్లిపోయారు. వారు అలా నడుస్తూ గంగానదీ యమునా నదీ కలిసే ప్రయాగ క్షేత్రమునకు చేరుకున్నారు. అప్పటికి చీకటి పడింది. “లక్ష్మణా! మనము గంగా యమునా సంగమ స్థానమునకు చేరుకున్నట్టున్నాము… అని రాముడు అన్నా సందర్భం లోనిది…
సీతా,రామ,లక్ష్మణులు మరునాడు ఉదయమే నిద్రలేచారు. సంధ్యావందనాది కార్యక్రమములు ముగించుకొని ఆ ప్రదేశము విడిచి వెళ్లిపోయారు. వారు అలా నడుస్తూ గంగానదీ యమునా నదీ కలిసే ప్రయాగ క్షేత్రమునకు చేరుకున్నారు. అప్పటికి చీకటి పడింది. “లక్ష్మణా! మనము గంగా యమునా సంగమ స్థానమునకు చేరుకున్నట్టున్నాము.
ఒక నదీజలాలతో మరొక నదీజలాలు కొట్టుకుంటున్న శబ్దము వినపడుతూ ఉంది. ఇక్కడే ఏదో ఒక ముని ఆశ్రమము ఉండాలి. ఎందు కంటే ఇక్కడ వంట చేసుకోడానికి కట్టెలు కొట్టి కొన్ని ఇక్కడే పడవేసినట్టున్నట్టు కనపడుతూ ఉంది.” అని అన్నాడు.
రామలక్ష్మణులు అలా నడుస్తూ భరద్వాజముని ఆశ్రమము చేరుకున్నారు. భరద్వాజముని ఉన్న కుటీరము బయట రామలక్ష్మణులు, సీత నిలబడ్డారు. ఎవరూ బయటకు రాలేదు. అందుకని రాముడు కుటీరములోకి వెళ్లాడు. కుటీరము లోపల అగ్నిహోత్రము ముందు, శిష్యుల మధ్య అగ్ని మాదిరివెలుగుతున్న భరద్వాజమహర్షిని చూచాడు రాముడు. రాముడు, లక్ష్మణుడు, సీత ఆయనకు నమస్కరించారు. రాముడు తమ్ముతాము పరిచయం చేసుకున్నాడు.
“ ఓ భగవాన్ భరద్వాజ మహర్షీ! ప్రణామాలు. మేము అయోధ్యాధిపతి దశరథుని కుమారులకు. రామలక్ష్మణులకు. ఈమె నా అర్ధాంగి సీత. జనక మహారాజు కుమార్తె. నా తండ్రి తన భార్య కైకకు ఇచ్చిన మాట ప్రకారము, నేను వనవాసమునకు వచ్చాను. నా తమ్ముడు, నా మిత్రుడు అయిన లక్ష్మణుడు కూడా నా వెంట వచ్చాడు.
సీత కూడా నన్ను అనుసరించి అడవులకు వచ్చింది. మా తండ్రి మాట ప్రకారము వనవాసము చేస్తూ అడవులలో దొరికే పండ్లు ఫలములు దుంపలు తింటూ, నేల మీద పడుకుంటూ వనవాసము పూర్చిచేయాలని అనుకుంటున్నాము.”అని వినయంగా అన్నాడు రాముడు.
రాముని మాటలువిన్న భరద్వాజుడు వారికి అర్ఘ్యమును, పాద్యమును ఇచ్చాడు. మధుపర్కమును ఇచ్చాడు. అడవిలో దొరికే పండ్లు వారికి తినడానికి ఇచ్చాడు. ఆ ప్రకారంగా భరద్వాజుడు రామునికి స్వాగత సత్కారాలు చేసాడు.
“ఓ రామా! చాలా కాలం తరువాత నిన్ను చూస్తున్నాను. నిన్ను మహారాజు అడవులకు పంపాడు అన్న విషయం కూడా విన్నాను.
ఈ గంగా యమున సంగమము వద్ద జనములు ఎక్కువగా ఉండరు. ప్రశాంతంగా ఉంటుంది. ఫలములు, పుష్పములు సమృద్ధిగా దొరుకుతాయి. కాబట్టి, నీవు ఇక్కడ ఆశ్రమము నిర్మించుకొని సుఖముగా ఉండవచ్చును.” అని అన్నాడు భరద్వాజుడు. ఆ మాటలు వినిన రాముడు ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! ఈ ప్రదేశమునకు సమీపములో జనపదాలు ఉన్నాయి. నేను, సీతా
లక్ష్మణులతో సహా ఇక్కడ ఉన్నాను అని తెలిసి, ఆ జనపదాలలో ఉన్న ప్రజలు నన్ను చూడ్డానికి ఇక్కడకు వస్తారు. అది నాకు ఇష్టం లేదు. నేను ఇక్కడ నివసించలేను. కాబట్టి నాకు ఏకాంతముగా ఉన్న ప్రదేశము ఎక్కడ ఉందో చెప్పండి. అక్కడ ఉంటాము.” అని అన్నాడు రాముడు.
ఆమాటలు విన్న భరద్వాజుడు ఇలాఅన్నాడు. “ఓ రామా! ఇక్కడి నుండి పది క్రోసుల దూరములో చిత్రకూటము అనే పర్వతము ఉంది. ఆ పర్వతము గంధమాధన పర్వతముతో సమానమైన ఖ్యాతి చెందినది. అక్కడ వానరములు మొదలగు చిన్న చిన్న జంతువులు విరివిగా సంచరిస్తుంటాయి.
ఆ పర్వతము మీద ఎందరో మహాఋషులు తపస్సుచేసుకుంటున్నారు. అదిమీరు ఉండటానికి తగిన ప్రదేశము. అక్కడ క్రూరమృగములకు, వికృతమైన ఆలోచనలకు తావు లేదు. అంతా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ నీవు నివాసము ఏర్పాటు చేసుకొని నీ వనవాసము పూర్తిచేయుము. లేని ఎడల, ఇక్కడే నా ఆశ్రమ ప్రాంతంలో ఒక కుటీరము నిర్మించుకొని ఇక్కడే ఉండి నీ వనవాస కాలము గడుపుము.” అని అన్నాడు భరద్వాజుడు.
ఇంతలో రాత్రి అయింది. ఆ రాత్రికి సీతారామలక్ష్మణులు భరద్వాజ ఆశ్రమములోనే గడిపారు. మరునాడు ఉదయము రాముడు భరద్వాజుని వద్దకుపోయి ఇలా అన్నాడు. “ఓ మునీంద్రా! నిన్న రాత్రి మాకు ఆశ్రయము ఇచ్చినందుకు కృతజ్ఞులము. మేము ఇక్కడి నుండి వెళ్లుటకు అనుమతి ఇవ్వండి.” అని ప్రార్థించాడు రాముడు.
“రామా! నీవు చిత్రకూటమునకు పొమ్ము. అక్కడ మీకు ఫలములు, తేనె, దుంపలు సమృద్ధిగా లభిస్తాయి. అక్కడి సెలయేళ్లలో మీకు స్వచ్ఛమైన నీళ్లు లభిస్తాయి. నీవు, సీత, విహరించడానికి ఎన్నో సుందర ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ మీరు సుఖంగా వనవాసము చేయవచ్చును. మీరు ఉండటానికి అదియే యుక్తమైన ప్రదేశము.” అని అన్నాడు భరద్వాజుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ ఏకోనపంచాశః సర్గ, “జానపదాక్రోశః”, రామాయణంలోని ఒక భావోద్వేగభరితమైన భాగం. ఈ సర్గలో, రాముడు వనవాసం కోసం బయలుదేరిన తర్వాత గ్రామస్తులు అతని లేమితో తీవ్ర దుఃఖంలో మునిగిపోతారు. రాముడి పట్ల వారి ప్రేమను, విశ్వాసాన్ని, మరియు అతడి లేమి వల్ల కలిగిన బాధను గ్రామస్తులు వ్యక్తం చేస్తారు. రాముడు తన ధర్మాన్ని, వినయాన్ని, మరియు ప్రజల పట్ల ఉన్న ప్రేమను గుర్తు చేసుకుంటూ వారు ఆవేదనతో విలపిస్తారు. ఈ సర్గ గ్రామస్తుల ఆక్రందన, రాముడి పట్ల వారి అభిమానం, మరియు అతని వాంఛను ప్రతిబింబిస్తుంది.
తనతో వచ్చిన అయోధ్యావాసులు నిద్ర లేవకముందే లేచిన రాముడు తన ప్రయాణం కొనసాగించాడు. సూర్యోదయము అయేటప్పటికి చాలా దూరం వచ్చేసారు. రామ లక్ష్మణులు ప్రాతఃసంధ్యను పూర్తి చేసుకొని మరలా ప్రయాణం అయ్యారు. అనేక గ్రామాల గుండా ప్రయాణిస్తున్నారు. ఆ గ్రామ ప్రజలు రాముని వనవాసము గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
“ఆ దశరథుడు కామానికి వశుడై తన భార్య కైక మాటలు విని కన్నకుమారుని అడవులకు వెళ్లగొట్టాడు. ధర్మాత్ముడైన రాముడు తండ్రి మాట కాదనలేక అడవులకు వెళ్లాడు ఏమి ఆశ్చర్యము. అయినా రాముడు అడవులకు వెళ్లాడు. ఆయనతో పాటు సీత ఎందుకు వెళ్లాలి? సుకుమారి అయిన సీత అడవులలో ఎలా ఉండగలదు? రామునితోపాటు సీత కూడా అన్ని కష్టాలు పడవలసిన దేనా! ఎంత దారుణము.” అని రక రకాలుగా అనుకుంటున్నారు.
వారి మాటలు వింటూ రాముడు అరణ్యముల వంక సాగుతున్నాడు. వారు వేదశ్రుతి అనే నదిని దాటారు. దక్షిణ దిక్కుగా ఉన్న అగస్త్య ఆశ్రమము వైపు ప్రయాణం చేస్తున్నారు. అలా ప్రయాణం చేస్తూ వారు గోమతీ నదీ తీరానికి చేరుకున్నారు. గోమతీ నదిని దాటిన తరువాత వారు స్యందికా నదిని చేరుకున్నారు. ఆ నదిని కూడా దాటి వారు పూర్వము మను చక్రవర్తి రాముని మూల పురుషుడైన ఇక్షాకువునకు ఇచ్చిన విశాలమైన భూములలోకి ప్రవేశించారు. ఆ భూమి నంతనూ రాముడు సీతకు చూపించి దాని గురించిన వృత్తాంతమును సీతకు వివరించాడు. సారవంతమైన ఆ భూముల గుండా వారు ప్రయాణం చేస్తున్నారు. అనేక వన్యప్రాణులతో నిండిన అడవులలో గుండా వారు వెళుతున్నారు. అప్పుడు సుమంత్రుని చూచి రాముడు ఇలా అన్నాడు.
“సుమంత్రా! నేను వనవాసము ముగించుకొని తిరిగివచ్చి తల్లితండ్రుల దర్శనము చేసుకొని ఈ వనసీమలలో ఎప్పుడు తనివిదీరా వేటాడెదనో కదా! వేట క్షత్రియులకు ఉచితమే కానీ నాకు ఎందుకో సరయూనదీతీరములో ఉన్న ఈవనములలో వేటాడవలెనని కోరిక అంతగా లేదు. అసలు నాకు వేట మీద అంత మక్కువ లేదు. అరణ్యములలో వాటి మానాన అవి బతుకుతున్న అమాయకమైన ఆ ప్రాణులను, కేవలం మన ఆనందం కోసరం, వేట మిషతో చంపడం పాపం కదా! అందుకనే నాకు వేట మీద అంతగా కోరిక లేదు. కాని క్రూర మృగములు విజృంభించినపుడు వేటాడక తప్పదు.” అని వేట గురించి ముచ్చటించుకుంటూ రాముడు సుమంత్రుడు నడిపే రథం మీద ప్రయాణిస్తున్నాడు.