Ettare Aratulu Yiyyare Kanukalu In Telugu – ఎత్తరే ఆరతులు యియ్యరే కానుకలు

ఎత్తరే ఆరతులు యియ్యరే కానుకలు - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో ఎత్తరే ఆరతులు యియ్యరే కానుకలు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఎత్తరే ఆరతులు యియ్యరే కానుకలు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : ఎత్తరే ఆరతులు యియ్యరే కానుకలు
సంఖ్య: 31
పుట: 21
రాగం: బౌళి

బౌళి

101 ఎత్తరే ఆరతులు యియ్యరే కానుకలు
యిత్తల నేఁగివచ్చీని యిందిరానాథుఁడు

||పల్లవి||

గరుడధ్వజపు తేరు కనకమయపు తేరు
సిరులతో వేదములచేరుల తేరు
సురలు మునులుఁ బట్టి సొంపుతోడఁ దియ్యంగాను
యిరవుగ నేఁగివచ్చీ నిందిరానాథుఁడు

||ఎత్త||

జీవకోట్లున్న తేరు శేషుఁడే రూపైన తేరు
వేవేలు సింగారముల వెలయు తేరు
మావరుస నిత్యులును ముక్తులును గొలువఁగా
యీవల నేఁగివచ్చీ నిందిరానాథుఁడు

||ఎత్త||

పంచభూతముల తేరు బ్రహ్మాండమైన తేరు
మించిన శ్రీవేంకటాద్రిమీఁదటి తేరు
కొంచక యలమేల్మంగఁ గూడి వచ్చీ నదె తేరు
యెంచరాని మహిమలు నిందిరానాథుఁడు

||ఎత్త|| 31

అవతారిక:

శ్రీవేంకటేశ్వరుని రథము తిరువీధులగుండా సాగుతున్నది. ఇందిరానాథుడు ఇటువైపు వచ్చేస్తున్నాడు, ఓ ప్రజలారా! రండి… హారతులీయండి… కానుకలనీయండి… మీ జన్మ తరింపజేసికోండి అని మంగళం పాడుతున్నారు. అన్నమాచార్యులవారు. ఈ తేరు, పంచభూతముల మూలరూపమైన పరమాత్ముని | బ్రహ్మాండమైన తేరు అని కీర్తిస్తున్నారు. జీవకోట్లన్నీ ఇందులోనే అదృశ్యరూపంలో వున్నాయట. సురులు మునులు ఈ తేరుని పట్టుకొని సొంపుగా లాగుతున్నారట. ఏరీ కనుపించరేమి? అని జుట్టు పీక్కోకండి. మనకు వారినిచూచే శక్తీ, అర్హతా, భక్తీ యేవీ లేవు. స్వామి సశరీరుడై తన దేవేరులతో వారికి కనుపిస్తాడు. కాని మనకు | అంత అదృష్టం లేదు.

భావ వివరణ:

ఓ ప్రజలారా! ఇందిరానాథుడు ఇటు వూరేగి యిత్తల వస్తున్నాడు (ఇటువైపు వచ్చుచున్నాడు). ఎత్తరో ఆరతులు (హారతులను యెత్తిచూపండి). మీ శక్తి కొలది కానుకలు స్వామికి సమర్పించుకోండి.

ఈ స్వామి యెన్ని రకములైన రథములనెక్కాడో చూడండి. | గరుడధ్వజముతో నొప్పిన తేరు బంగారము రాసులైన తేరు. నాలుగు వేదములు దీనికి చేరులు (పట్టుకొని గుంజుటకు వుపయోగించిన నాలుగు త్రాళ్ళు). దేవతలు మునులు అదృశ్యరూపులై దీనిని లాగి తరిస్తున్నారు. ఈవిధంగా ఇరవుగా (సొంపుగా) ఇందిరానాథుడు వూరేగివస్తున్నాడు.

సృష్ఠిలోని జీవకోట్లన్నీ సూక్షరూపంలో వున్నాయి, ఈ రథంలో ఉన్నాయి. ఇది మనకు రథములా కనిపిస్తున్నది కానీ ఆదిశేషుడు చుట్టలు చుట్టుకొని తన | పడగలను స్వామికి గొడుగులాపట్టినాడు. వేవేల సింగారములు (అనేకమైన అలంకరణలతో) ఈ తేరు కన్నులపండువగా వున్నది. నారదాది నిత్యులూ, సనక సనందనాది ఋషులు, వ్యాసాంబరీషులవంటి ముక్తులు (ముక్తిపొందినవారు)… మూడు వరుసలలో నిలిచి సేవిస్తున్నారు. ఈవిధముగా ఇందిరానాథుడు వూరేగివస్తున్నాడు.

బ్రహ్మాండమైన ఈ తేరులో పరమాత్మ పంచభూతముల రూపములో విలసిల్లుతున్నాడు. ఈ తేరు మించిన (వృత్కృష్టమైన శ్రీవేంకటాద్రిపై సాగిపోతున్నది. అదిగో ఈ ఇందిరానాథుడు కొంచక (తగ్గక) తన దేవేరి అలమేల్మంగతో గూడి ఈ తేరుపై వస్తున్నాడు. ఈ మహానుభావుడు యెంచరాని మహిమలు కలవాడు. ఈయనయొక్క అనుగ్రహం పొంది మీజన్మ చరితార్థం చేసికొనండి. ఒక్కసారి ముక్తకంఠంతో అనండి

శ్లో॥ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే।
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం||

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Keerthanalu – కీర్తనలు

Keerthanalu

కీర్తనలు భక్తి, ఆధ్యాత్మికత మరియు సంగీత సాహిత్య రంగాల్లో అత్యంత ప్రముఖమైన రూపంలో ఉంటాయి. ఇవి సామాజిక, ఆధ్యాత్మిక సంగతులను సమీపిస్తాయి, మనసును శుద్ధి చేస్తాయి, భక్తిని పెంచుకోవడంలో సహాయపడుతాయి. కీర్తనలు భక్తుల అంతరాళాల్లో అందిన ఆనందంలను విస్తరిస్తాయి, అవి దేవుని కీర్తనాలను గానం చేయడంలో ఉపయోగపడుతాయి.

కీర్తనలు సాహిత్య, సంగీత, నృత్యం వంటి విభిన్న కళల సముదాయాలు సమ్మేళనం చేసుకోవడానికి ఒక సాధన సహాయకంగా నిలుస్తాయి. ఇవి జనాలను ధర్మప్రచారమైనా, అధ్యాత్మిక ఆలోచనలను ప్రచారం చేయడమైనా, మానవ సమస్యలకు పరిష్కారం కల్పించడమైనా, మనసును శుద్ధి చేయడమైనా, భక్తి మరియు ఆనందాన్ని విస్తరిస్తాయి. కీర్తనలు మనసులను స్ఫూర్తిగా చేస్తాయి, మనసులను ప్రశాంతతో భక్తి భావాలని పెంపొందించుకోవడంలో సహాయపడుతాయి. మొదలగు కీర్తనల విషయముల గురించి ఈ క్రింద ఇచ్చిన లింకులు ద్వారా తెలుసుకుందాం…

Keerthanalu – కీర్తనలు

Ehametto Parametto Ika Naku In Telugu – ఇహమెట్టో పరమెట్టో ఇక నాకు

ఇహమెట్టో పరమెట్టో ఇక నాకు – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో ఇహమెట్టో పరమెట్టో ఇక నాకు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఇహమెట్టో పరమెట్టో ఇక నాకు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : ఇహమెట్టో పరమెట్టో ఇక నాకు
సంఖ్య : 461
పుట: 311
రాగం: సాళంగనాట

సాళంగనాట

61 ఇహమెట్టో పరమబెట్టో ఇంక నాకు
సహజమై హరియే శరణము నాకు

||పల్లవి||

చిత్తమిది యొకటే చింత వేనేలసంఖ్య
పొత్తుల హరిఁదలఁచఁ బొద్దులేదు
జొత్తుల కన్నులు రెండు చూపులైతే ననంతాలు
తత్తరించి హరిరూపు దగ్గరి చూడలేదు

||ఇహ||

చేతు లివియు రెండే చేష్టలు లక్షోపలక్ష
యీతల హరిఁ బూజించ నిచ్చ లేదు
జాతి నాలిక వొకటే చవులు కోటానఁగోటి
రీతి హరినామ ముచ్చరించ వేళ లేదు

||ఇహ||

వీను లివి రెండే వినికి కొలఁదిలేదు
పూని హరిభక్తి విన బుద్ధి లేదు
యీనటన శ్రీవేంకటేశుఁ డిటు చూచినను
తానే యేలె నిఁకఁ దడఁబాటు లేదు.

||ఇహ||461

అవతారిక:

నాకు ఇహలోకంతోకాని, పరలోకంతోకాని పనిలేదయ్యా! నా సహజగుణం ఒక్కటే. అది హరియే దిక్కని శరణాగతితో జీవితాంతం గడుపుట, అంటున్నారు అన్నమాచార్యులవారు. మానవజీవితం అన్నాక… మనస్సులో చింతలు తప్పవు, అనవసరమైన వాటినుంచి చూపులను మరల్చలేము, చేతులతో ఏవేవో వ్యర్థమైన పనులు చేస్తూనేవుంటాము, దేన్నిపడితే దాన్ని లొట్టలేసుకొని తింటాననే దౌర్భాగ్యపు నా నాలుకవున్నది, ఉన్నవి రెండే అయినా అంతేలేకుండా అన్నీ వినే చెవులున్నాయి. ఇవన్నీ భ్రష్టు పట్టిస్తూనేవున్నాయి. హరిభక్తి మీద బుద్ధినిలవటం లేదు. ఓ శ్రీవేంకటేశ్వరా! శరణు మహాప్రభో శరణు… అంటున్నారు.

భావ వివరణ:

ఓ మానవులారా! ఇక నాకు ఇహమెట్టో (ఇహలోకంలో ఏమవుతుందో) పరమెట్టో (ఊర్ధ్వలోకాలలో ఏమవుతుందో) పనిలేదు. నాకు సహజమైన (సహజసిద్ధంగా నిజాయితీగల) శరణాగతి హరియే (శ్రీహరి మాత్రమే).

నాది యెంత విచిత్రమైన పరిస్థితి అంటే… నాకున్న చిత్తము (మనస్సు) ఒక్కటే కాని దానికున్న చింతలు మాత్రం వేవేలు (వేలసంఖ్యలో వున్నాయి). నేను పెట్టుకొన్న పొత్తులతో (సంగత్వంతో) హరిని తలచుటకు పొద్దులేదు (తీరికేలేదు), జొత్తులకన్నులు (ఎఱ్ఱబారిన కళ్ళు) రెండే, కాని అవి చూచే చూపులకు అనవసరమైన వ్యాపకాలు మాత్రం అనంతం. కాని తత్తరించి (ఆరాటపడి) హరిని దగ్గరనుంచి చూడాలని మాత్రం వాటికుండదు.

నా ఈ చేతులు చూశారా! నాకున్నవి రెండే చేతులు. కాని ఇవి చేసే చేష్టలున్నాయే, అవి లక్షోపలక్ష (అనేక లక్షలు). కాని ఈతల (ఇటుచూస్తే) శ్రీహరిని పూజించాలంటేమాత్రం ఈ చేతులకి ఇచ్చలేదు (కోరిక పుట్టదు). ఇక, జాతి నాలిక (అతిసామాన్య ఔన్నత్యంగల నాలిక) నాకూ ఒక్కటే వున్నది. కాని దానికి కావలసిన చవులు (రుచులు) మాత్రం కోటానుకోట్లు. కాని రీతి (విధాయకంగా) హరినామాన్ని వుచ్చరించటానికి (అనుటకు) వేళలేదు (సమయం దొరకడంలేదు).

వీనులివి రెండే (నాకున్న చెవులు రెండు మాత్రమే). కాని ఇవి వినాలనుకొనే మాటలకి అంతుపొంతులేదు. వాటికి పూనికతో హరిభక్తి గురించి వినండి అంటే వాటికి బుద్ధిలేదు. ఇట్లాంటి నటన (నడవడితో) వున్న నన్ను శ్రీవేంకటేశుడు, ఇటుచూచి, తానే పోనీలే వీడు అర్భకుడు అని జాలిపడి యేలె నన్ను (స్వీకరించి పాలించాడు). అమ్మయ్య! ఇక తడబాటు (తత్తరబాటు) లేదు. ఆయన రక్షణలో బ్రతికేస్తున్నాను. భయం వదిలేశాను.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Anganalala Manache Nadinchukonegani In telugu – అంగనలాల మనచే నాడించుకొనెగాని

అంగనలాల మనచే నాడించుకొనెగాని - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో అంగనలాల మనచే నాడించుకొనెగాని కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అంగనలాల మనచే నాడించుకొనెగాని – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 1
కీర్తన : అంగనలాల మనచే నాడించుకొనెగాని
సంఖ్య : 454
పుట: 304
రాగం: శంకరాభరణం

శంకరాభరణం

44 అంగనలాల మనచే నాడించుకొనెఁ గాని
సంగతెఱిఁగిన నెరజాణఁ డితఁడే

||పల్లవి||

వొడలులేనివాని కొక్కఁడే తండ్రాయఁ గాని
తడయక పురుషోత్తముఁ డితఁడే
బడబాగ్నిజలధికిఁ బాయ కల్లుఁడాయఁ గాని
వెడలించె నమృతము విష్ణుఁ డితఁడే

॥ అంగ||

పులిగూడు దిన్నవాని పొందొక్కటే సేసెఁగాని
నలువంక లక్ష్మీనాథుఁ డితఁడే
చలికిఁ గోవరివానిసరుస బావాయఁ గాని
పలుదేవతల కెల్ల ప్రాణబంధుఁ డితఁడే

॥ అంగ||

యెక్కడో గొల్లసతుల కింటిమగఁ డాయఁ గాని
తక్కక వెదకే పరతత్వ మితఁడే
మిక్కిలి శ్రీవేంకటాద్రిమీఁద మమ్ము నేలెఁ గాని
తక్కక వేదముచెప్పే దైవ మీతఁడే.

॥ అంగ||

అవతారిక:

“ఓ అంగనలారా! ఈ పిల్లాడు ఇట్లా మనచేత ఆడింపబడుతున్నాడు కాని అసలు సంగతి తెలుసుకొంటే ఇతడే గొప్ప నెరజాణమ్మా!” అని ఆలాపిస్తున్నారు మన అన్నమాచార్యులవారు. ఇందులో వున్న ప్రహేళికలు (చిక్కు ప్రశ్నలు) జాగ్రత్తగా సమాధానాలు ఆలోచించి భావవివరణతో సరిజూసుకోండి. ఇదొక ‘క్విజ్ ప్రోగ్రాం’ అన్నమాట. తినబోయేముందు ఇది రుచి చూడండి… పులిగూడు దిన్నవాడెవడు? వాని పొందొక్కటే సేనుగాని. అంటే యేమిటి? ఆలోచించండి. ఎక్కడో గొల్లసతులకు ఇంటిమగడయ్యిం దెవరు? చలికిఁ గోవరివాడెవడు? అనుకున్నంత తేలికకాదు అని తెలుసుకోండి, మరి.

భావ వివరణ:

ఓ అంగనలారా (రమణుల్లారా!) ఈనాడు ఈయన మన చేత ఆడించబడుతున్నాడు. కాని, సంగతెరిగిన (అసలు విషయం తెలుసుకొంటే) ఇతడే గొప్ప నెరజాణ (అన్నీ తెలిసిన చతురుడు).

ఒడలు లేనివానికి (శరీరం లేనివాడికి) ఒక్కడే, తండ్రియైన వాడు (ఎవరు? (మన్మథుని తండ్రియైన శ్రీహరి). తడయక ఆలస్యములేక రక్షించే పురుషోత్తముడు కూడా ఇతడే. బడబాగ్నిని తనలో దాచుకున్న సముద్రునికి, పాయక (కోరి) అల్లుడైన వాడే, కాని అమృతాన్ని అందించినవాడు. ఈయనే | విష్ణువు.

ఈయన పులిగూడుతిన్నవాని పొందొక్కటే చేశాడు (భిక్షాటన చేసి ఆ భిక్ష భుజించేవాని స్నేహం చేసేవాడు)… అంటే (పరమశివుని మిత్రుడైన శ్రీహరి). అయినా ఈయన భిక్ష యెత్తడండీ. ఎందుకంటే అప్లైశ్వర్యములున్న లక్ష్మీదేవికి మగడండీ ఈయన. ఈయన చలికిన్ కోవరి వాని బావ. అంటే చల్లదనాన్నిచ్చే చంద్రునికి బావగారు అయిన శ్రీకాంతుడు. అంతేకాదు దేవతలందరికీ ప్రాణబంధువు.

ఎక్కడో రేపల్లెలో వున్న గొల్లపడుచులకి “ఇంటి మగడు” ఒకే ఇంటిపేరుండేట్లు చేసిన మగడు. యోగులందరూ తక్కక (వెనుదీయక) వెదకే పరతత్వము (పరబ్రహ్మ) ఇతడే. ఇవన్నీ అటుంచి శ్రీవేంకటాద్రి మీద వెలసి మమ్మల్ని యేలే దేవుడు ఈయనే. కానీ వేదాలన్నీ శ్లాఘించే పరాత్మరుడు కూడా ఈ దేవుడే.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Itani Neragakuntenila In Telugu – ఈతని నెఱగకుంటేనిల

ఈతని నెఱగకుంటేనిల - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో ఈతని నెఱగకుంటేనిల కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఈతని నెఱగకుంటేనిల – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన : ఈతని నెఱగకుంటేనిల
సంఖ్య : 536
పుట: 360
రాగం: లలిత

లలిత

45 ఈతని నెఱఁగకుంటే నిల స్వామిద్రోహము
ఘాతల నేఱు గుడిచి కాలువ పొగడుట.

||పల్లవి||

హరిపాదముననే యడఁగె లోకములెల్ల
హరినాభినే పౌడమి రదివో బ్రహ్మాదులు
హరినామము వేదాల కాదియు నంత్యము నాయ
హరిదాసులే వశిష్ఠాదు లిందరును.

||ఈత||

విష్ణుఁడే యమృత మిచ్చె
విష్ణుఁడే ధరణి మోఁచె విశ్వమంతాను
విష్ణుచక్రమున దైత్యవీరులెల్లా నడఁగిరి
విష్ణువుముఖమునందే విప్రులు జనించిరి.

||ఈత||

పరమపుశ్రీపతివే భారతరామాయణాలు
పరమాత్ముఁ డితఁడే పలుజీవులయందెల్లా
పరము చేచేతఁ జూపె పట్టి శ్రీవేంకటేశుఁడు
పరమానంద మొసఁగు భక్తులకు నితఁడు.

||ఈత||536

అవతారిక:

జగద్భర్త నారాయణుడు. మనకు భోజనమిచ్చి అది అరిగేశక్తినిచ్చి పుట్టినదాది తుది శ్వాసదాకా రక్షించేది పురుషోత్తముడే. ఆయన గురించి తెలియకపోవటం కన్న స్వామి ద్రోహం వుంటుందా. లౌకికంగా చూచినా మనకు వుద్యోగం ఇచ్చి, నెలనెలా జీతం ఇచ్చి పోషిస్తున్న మన యజమాని గురించి తెలుసుకోనివాడు ద్రోహియే కదా! అన్నమాచార్యులవారిలో కవి దీనిని నిరసిస్తూ ఏటినీరు తాగి కాలువనీళ్ళను పొగడటం అంటే ఇదే… అని దెప్పిపొడుస్తున్నారు. ప్రతి జీవిలోనూ అంతర్యామిగా వున్న ఈ శ్రీవేంకటేశుడే పరము చేచేత పట్టి జూపె అంటున్నారు.

భావ వివరణ:

ఓ భక్తులారా! ఈతని (ఈ నారాయణుని యెరుగకుంటే (తెలియకపోతే) ఇల (భూమిపై) ఇంతకంటే స్వామిద్రోహం మరియొకటుంటుందా? ఘాతల దెబ్బతిన్నవాడు దీనావస్థలో) నీటినీల్ళ తాగి ప్రాణం నిలబెట్టుకొని, కాలువలో నీళ్ళు బాగుంటాయి అని పొగడటంలాంటిదే… ఇది కూడా అవునా?

విశ్వంలోని పదునాలుగు భువనాలూ ఈ శ్రీహరిపాదం కిందనే వున్నాయి. | ఒక్క తొక్కుడుతో అన్నీ చితక్కొట్టగలడు. అంతెందుకు సృష్టికర్త బ్రహ్మ మొదలైన వారంతా ఆయన నాభి (బొడ్డు) లోంచి పుట్టినవారేకదా! అసలు జ్ఞానానికి మూలమైన వేదముపుట్టిందే శ్రీహరి నామములోనుంచి వేదాంతము కూడా ఆయనే కదా! వశిష్ఠుడు మొదలైన సప్తఋషలు యెవ్వరనుకున్నారు? వారంతా హరిదాసులే.

ఆయన మహిమనెంతని పొగడగలం చెప్పండి? దేవతలు అమరులవటానికి కారణమైన అమృతం తెప్పించింది ఆయనే కదా! ఆదివరాహమై ఈ భూమిని మోసినవాడు శ్రీహరే కదా! రోజుకి 24 గంటలు, | సంవత్సరానికి 365 రోజులు 6 గంటలు (దాదాపుగా) సమయంపట్టేట్లు ఈ | భూమి ఒక గొప్ప సమయపాలన గతి నిర్దేవంతో నడుస్తున్నదే అదెవరివల్ల జరుగుతున్నది? రాక్షసులనందరినీ సుదర్శన చక్రంతో అడ్డగించినదెవరు? నేటికీ వేదవిజ్ఞానం విస్తరింపచేస్తున్న విప్రులు జన్మించింది కూడా ఆయన ముఖంలోనుంచే కదా!

భారత రామాయణాది పురాణవాఙ్మయం పుట్టిందే శ్రీహరి కథామృమును విస్తరింపజేయుటకు కదా! సర్వ జీవులయందున్న పరమాత్ముడు అంతర్యామీ ఈ దేవదేవుడే కదా! నేడు శ్రీవేంకటేశుడై పరము (మోక్షమును) చేనేతపట్టి (అభయవరద హస్తాలతో పట్టి) చూపుతూ భక్తులకు పరమానందమునిస్తున్న ఏడుకొండల యేలికయై భక్తులని అనుగ్రహిస్తున్నది ఈతడే కదా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

అన్నమయ్య కీర్తనలు – Annamayya Keerthanalu

అన్నమయ్య కీర్తనలు – Annamayya Keerthanalu

అన్నమయ్య కీర్తనలు – Annamayya Keerthanalu

 

  1. అచ్చుతుఁ డనియెడి నామము గలిగినయట్టి
  2. ఆతడేపో మాయేలిక ఆతడే జగన్మూల
  3. కదిసి యాతఁడు మమ్ముఁగాచుఁగాక
  4. నరుడా యీతడు ఆదినారాయణుడు గాక
  5. అతడితడా వెన్నలంతట దొంగిలినాడు
  6. నరులార నేఁడువో నారసింహజయంతి
  7. మంచివాడవంతేపో మాధవరాయా
  8. కోడెకాడు గదవమ్మ గోవిందరాజు
  9. వేడుక కాడితడు విట్టలేశుడు
  10. కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా
  11. శ్రీవేంకటేశ్వరుఁడు శ్రీయలమేల్మంగతోడ
  12. సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా
  13. వారిధిశయన వో వటపత్రపరియంక
  14. వైష్ణవులసొమ్ము నేను వారు నీసొమ్ములింతే
  15. తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము
  16. అంజినీదేవి కొడుకు హనుమంతుడు
  17. అప్పడైన హరియెక్కె నదివో తేరు
  18. అడియా నడియనయ్య యఖిలలోకైకనాథ
  19. చేకొని కొలువరో శ్రీనరసింహము
  20. రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు
  21. ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా
  22. జగములేలేవాడవు జనార్దనుడవు
  23. వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు
  24. కరేణ కిం మాం గృహీతుం తే
  25. చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ
  26. ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద
  27. నాలం వా తవ నయవచనం
  28. చక్కని సరసపు శిశువు
  29. లంపుగుబ్బ గొల్లెతల లంజకాఁడ నీ
  30. యెన్ని మారులు యిట్టె నీపనులు
  31. మేలుకొనవే
  32. హరి నీవే సర్వాత్మకుడవు
  33. కేశవదాసి నతి గెలిచితి నన్నిటాను
  34. నాపాలి ఘన నిధానమవు నీవే నన్ను
  35. తగు మునులు ఋషులు తపముల సేయగ
  36. ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె
  37. అభయదాయకుడ వదెనీవే గతి
  38. హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా
  39. సీతాసమేత రామ శ్రీరామ
  40. వేదవట్టి యిక నేమి వెదకేరు చదివేరు
  41. దేవనీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో
  42. ఒకరిగానగ నొడబడదు మనసు
  43. ఈడనిందరికి నేలికైవున్నాడు
  44. అంగనలాల మనచే నాడించుకొనెగాని
  45. ఈతని నెఱగకుంటేనిల
  46. ఎన్నిమహిమలవాడె యీ దేవుడు
  47. మియునెఱగని పామరులను మమ్ము
  48. అన్నిటిపైనున్నట్లు హరిపై నుండదు మతి
  49. శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి
  50. నీవు జగన్నాథుఁడవు నే నొక జీవుఁడ నింతే
  51. వినవమ్మ జానకి నీవిభుడింతేసేసినాడు
  52. వారివారి భాగ్యములు వ్రాసివున్నవి నొసళ్ల
  53. సదానందము సర్వేశ్వర నీ-
  54. కౌసల్యానందనరామ కమలాప్తకులరామ
  55. కలశాపురముకాడ గాచుకున్నాడు
  56. సర్వేశ్వరా నీతో సరియెవ్వరు
  57. పేరు నారాయణుడవు బెంబాడిచేతలు నీవి
  58. ఇతని కితడేకాక యితరులు సరియా
  59. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు
  60. చూచి మోహించకుందురా సురలైన నరులైన
  61. ఇహమెట్టో పరమెట్టో ఇక నాకు
  62. ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను
  63. మా దురితములు వాపి మమ్ము గాచు టరుదా
  64. ఎవ్వరి భాగ్యంబెట్టున్నదో
  65. అంగనకు విరహమే సింగారమాయ
  66. మలసీ చూడరో మగ సింహము
  67. నిద్దిరించి పాల జలనిధివలెనే
  68. రారా చిన్నన్నా రారోరి చిన్నవాఁడ
  69. వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము
  70. శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును
  71. దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ
  72. ఘనుడాతడా యితడు కలశాపురముకాడ
  73. బోధింపరే యెరిగిన బుధులాల పెద్దలాల
  74. దాసోహమనుబుద్దిదలచరు దానవులు
  75. నారాయణుడ నీనామమె మంత్రించివేసి
  76. భక్తి నీపై దొకటె పరమసుఖము
  77. భూమిలోన గొత్తలాయ బుత్రోత్సవ మిదివో
  78. ఇందులోననే నెవ్వరిబోలుదు
  79. అతని నమ్మలే రల్పమతులు భువి
  80. హరియవతారమితడు అన్నమయ్య
  81. సుతుని నరకుని జంప జూచినాడవు సుమ్మీ
  82. మొలనూలి గొల్లెత మురియుచును
  83. శిన్నెక తేవే శెలువుని తా
  84. పసులు గాచేటి కోల పసపుజేల
  85. కుందణంపుమై గొల్లెత తా
  86. నెయ్యములల్లో నేరేళ్ళో
  87. అంజలిరంజలిరయం తే
  88. సిన్నవాడవని నమ్మసెల్లదునిన్ను
  89. ప్రలపనవచనై: ఫలమిహకిం
  90. తలలేదు తోకలేదు దైవమానీ మాయలకు
  91. నమో నమో దశరథనందన మమ్ము రక్షించు
  92. ఇవియే పో ప్రద్యుమ్నా యిహపరసాధనము
  93. పరమవివేకులాల బంధువులాల
  94. చెల్లె నీచేతలు నీకే చేరి మేడెగుడిదిన్న
  95. సమమతినని నీవే చాటుదువు
  96. నారాయణుని శ్రీనామమిది
  97. స్వతంత్రుఁడవు నీవు సరిలేని దొరవు నే
  98. కలిగె మాకిదె కైవల్యసారము
  99. హరిహరి యిందరికి నబ్బురముగాని యిది
  100. హరిహరి నీ మాయామహిమ
  101. ఎత్తరే ఆరతులు యియ్యరేకానుకలు

Timmireddy Makuniche Distamaina Polamu In Telugu – తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము

తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ.కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 4
కీర్తన : తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము
సంఖ్య : 52
పుట : 35
రాగం : సామంతం

సామంతం

15 తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైనపొలము
బొమ్మిరెడ్డి కప్పగించి పోదిసేసెఁ బొలము

॥పల్లవి||

నిండినట్టిమడుగులనీరువంకపొలము
కొండలు మోఁచిన పెద్దగొబ్బరపుఁబొలము
అండనే పొలమురాజులుండేటిపొలము
చెండివేసి మాకులెల్లా సెలగినపొలము

||తిమ్మి||

ఆసపడి వరదానమడిగినపొలము
బాసలతోఁ గడు నెత్రుపట్టమైనపొలము
రాసికెక్కే మునులకు రచ్చైనపొలము
వేసరక నాఁగేట వేగిలైన పొలము

||తిమ్మి||

మంచి గురుతైన రావిమానిచేనిపొలము
వంచిన గుఱ్ఱముఁ దోలే వయ్యాళిపొలము
యెంచఁగ శ్రీవేంకటేశు నిరవైనపొలము
పంచుకొని లోకులెల్లా బ్రదికేటిపొలము

||తిమ్మి|| 52

అవతారిక:

ఇది అత్యద్భుతమైన దశావతారవర్ణన కీర్తించే అన్నమాచార్య కీర్తన. ఎంతో మేధాశక్తి వుంటేనే కాని ఈ కీర్తన అర్థంకాదు. తిమ్మన్న అంటే వేంకటేశ్వరుడు తిమ్మిరెడ్డి అంటే పరమాత్మ అయిన శ్రీవేంకటేశ్వరుడు. బొమ్మిరెడ్డి అంటే జీవాత్మయైన అంతర్యామి అంటే క్షేత్రజ్ఞుడు. దిష్టమైన పొలము అంటే (భాగ్యముకొద్దీ సంప్రాప్తించిన సాగుచేయదగిన మాగాణి వంటి క్షేత్రము లేక శరీరము). మా భాగ్యము కొద్దీ ఆ శ్రీవేంకటేశ్వరుడు మాకు ఈ దేహాన్నిచ్చి మాజీవాత్మకు ఒప్పగించి “వొరే దీనిని సక్రమంగా సాగుచేసుకోండిరా” అన్నాడు… ఇదీ ఈ కీర్తన పల్లవి. ఇకపై ఓపికగా చదివి భావ వివరణ నాస్వాదించండి.

భావ వివరణ:

తిమ్మిరెడ్డి (పరమాత్మ) మాకు దిష్టమైన (మా భాగ్యముననుసరించి) ఒక పొలము (క్షేత్రము) సాగుచేసికొనమని, బొమ్మిరెడ్డికి (అంతర్యామియైన క్షేత్రజ్ఞునికి) ఒప్పగించినాడు. ఇక చూసుకోండి ఎన్నిరకాల పొలములు సాగులోకి వచ్చాయో.

“నిండినట్టి మడుగుల నీరువంక పొలము” ఎప్పుడూ నిండుగా నీరువుండే చోట నీట్లో వుండేదేహము.. – (అంటే మత్స్యావతారము.) “కొండలు మోచిన పెద్దగొబ్బరపు పొలము” నిస్వార్థముగా పరులకోసం పెద్ద కొండను మోసిన దేహం… – (అంటే తాబేలు లేక కూర్మావతారం.) “అండనే పొలము రాజులు వుండేటి పొలము” సూకరములుండే దేహము – (అంటే వరాహావతారము). “చెండివేసి మాకులెల్లా చెలగిన పొలము”. మాలిన్యమును లేక పాపమును చెండాడి విజృంభించిన దేహము – (అంటే నరసింహావతారము).

“ఆస పడి వరదానము అడిగిన పొలము” యాచించి వరమును పొందిన దేహము – (అంటే వామనావతారము). “బాసలతో కడునెత్రుపట్టమైన పొలము” ప్రతిజ్ఞ పట్టి ఎంతో నెత్తురు పారించిన దేహము – (అంటే పరశురాముడు). “మునులకు రచ్చై రాసికెక్కిన పొలము” మునులకు రక్షణయై విఖ్యాతిగాంచిన దేహము – (అంటే శ్రీరామావతారము). “వేసరక నాగేట వేగిలైన పొలము” విసుగులేక నాగలి ధరించు ఉద్రేకియైన దేహము – (అంటే బలరామావతారము).

“మంచి గురుతైన రావిమాని చేని పొలము” అశ్వత్థవృక్షం క్రింద మంచి ప్రసిద్ధినొందిన దేహము – (అంటే బుద్ధావతారము). “వంచిన గుఱ్ఱము దోలే వయ్యాళిపొలము” అణుకువ గలిగిన గుఱ్ఱమునెక్కి విహారముచేసిన దేహము – (అంటే కల్కి అవతారము). “యెంచగ శ్రీవేంకటేశు నిరవైన పొలము” ప్రసిద్ధికెక్కిన శ్రీవేంకటేశ్వరుడై నెలకొనిన దేహము. మరి ఆ అద్భుతమైన పొలము యెట్లాంటిదంటే లోకులందరూ దానిని పంచుకొని, శరణని బ్రతుకుతున్నారు. అవును కదా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Vaishnavula Sommu Nenu Varu Nisommulinte In Telugu – వైష్ణవుల సొమ్ము నేను వారు నీసొమ్ములింతే

వైష్ణవుల సొమ్ము నేను వారు నీసొమ్ములింతే - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ.కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో వైష్ణవుల సొమ్ము నేను వారు నీసొమ్ములింతే కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వైష్ణవుల సొమ్ము నేను వారు నీసొమ్ములింతే – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 4
కీర్తన : వైష్ణవుల సొమ్ము నేను వారు నీసొమ్ములింతే
సంఖ్య : 185
పుట : 124
రాగం : సాళంగనాట

సాళంగనాట

14 వైష్ణవులసొమ్ము నేను వారు నాసొమ్ములింతే
విష్ణుఁడ నీవెట్టైన వివరించుకోవయ్యా

॥పల్లవి||

నెఱి నీబంటనా హరి నీకంటే బలువులైన-
తఱి నీదాసులకే నే దాసుఁడగాక
గుఱుతెరుఁగుదునా నేఁ గోరి యింతకతొల్లి
గుఱుతు చూపిన మాగురువునేకాక

||వైష్ణ||

ముంచి నీకు మొక్కేఁగాక ముందే నీశరణులు
పెంచి పాదాలు నా నెత్తిఁబెట్టిరయ్య
పొంచి నీవేడ నేనేడ బుజముల ముద్రవెట్టి
సంచితమై సేసినట్టిసంబంధమేకాక

||వైష్ణ||

శ్రీవేంకటేశ నీసేవే సేసేఁగాక నేడీ-
సేవకుఁ దెచ్చెను వారిసేవేకాదా
భావమొక్కటిగా నాకుఁ బట్టిచ్చిరి నిన్ను వారు
ఆవలీవలికిఁ బరమార్థమేకాక

||వైష్ణ|| 185

అవతారిక:

విశిష్టాద్వైత మత దీక్ష స్వీకరించిన అన్నమాచార్యులవారు, బుజములపై శంఖచక్రముల ముద్రలు ధరించారు. తిరునామం నుదుటిపై ధరించారు. వైష్ణవ సిద్ధాంత ప్రచారకులై రోజుకి, కనీసం ఒక్క కీర్తన శ్రీవేంకటేశ్వరునిపై చెప్పారు. ఈ నాటికీ నాబోటి అనామకులను సైతం ఆ నామం అనుమానం లేకుండా రక్షిస్తున్నది. ఎందుకంటే.. వైష్ణవులంతా స్వామివారి సొమ్ము. అందుకే అన్నమయ్య “ఓ విష్ణుడా! నీవు యెట్లా అన్వయించుకొనినా పర్వాలేదు, నేను వైష్ణవుల సొత్తును. వారు నీసొత్తు” అని తేల్చిపారేశారు. స్వామీ! నిన్ను నాకు ఆ వైష్ణవులు పట్టిచ్చారయ్యా! అంటున్నారు.

భావ వివరణ:

ఓ విష్ణుదేవా! నేను వైష్ణవదీక్షను స్వీకరించినందున వైష్ణవుల సొమ్మునైతిని. మరి ఆ వైష్ణవులు నీసొమ్ము. అనగా నీదాసులైన వైష్ణవులకు నేను దాసుడను. ఆ విధంగా నేను నీకు చెందినవాడినే. దీనిని నీవెట్లు వివరించుకొనినా నీఇష్టమే.

ఓ హరీ! నెఱి (న్యాయంగా) నీబంటునయ్యేవాడినే కాని, నీదాసులువున్నారే వారికి వారి బలంతోపాటు నీ బలంకూడా తోడవటం వల్ల, వారు నీకంటే బలవంతులు. అటువంటప్పుడు నాకెప్పుడూ యెదురుగా వుండేవారి దాస్యం చేయుట నాకు మంచిది కదా! నేను ఇంతకు పూర్వం నిన్నెరుగను. తొల్లి (మొట్టమొదట) మా గురువులే నీ గుర్తులు చూపించితే నిన్ను గుర్తుపట్టగలిగాను. లేకపోతే నీవెవవరవో నాకేమి తెలుసు?

ఓ విష్ణుదేవా! నేను వేరే నీకు మొక్కవలసిన పనిలేదు. ఎందుకంటే, ఇంతకు ముందే నీశరణము పొందిన మా గురువులు నీపాదాలను మానెత్తినయెప్పుడో పెట్టేశారయ్యా! మాకు వైష్ణవ దీక్షనిచ్చింది అట్లాగే కదా! ఆ దీక్షే లేకపోతే నీవు యెక్కడ మేము యెక్కడ? మా రెండు భుజముల మీద నీ శంఖ చక్రముల ముద్రలు వేశారు. మాగురువులావిధంగా మన సంబంధాన్ని సంచితము చేశారు (కూడబెట్టారు) గానీ (లేకపోతే) నీవు నాకెట్లు తెలిసేవాడివి?

ఓ శ్రీవేంకటేశ్వరా! ఈ నాడు నేను నీ సేవచేస్తున్నమాట నిజమే. కానీ నేను మొదట వారిని సేవించినందువల్లనే, నేను నిన్ను సేవించటం అన్నది జరిగింది. నాకు వారు భావమొక్కటిగా (అన్యధా శరణం నాస్తి అను ఒకే ఒక భావనతో) నిన్ను నాకు మాగురువులు పట్టిచ్చారు. అందువల్లనే మాకు ఆవలీవల పరమార్థము (ఇహపరములు రెండిటి పరమార్ధము దక్కినది). కాక నేను నిన్నెట్లెరుంగుదునయ్యా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Varidhi Shayana Vo Vatapatra Pariyanka In Telugu- వారిధిశయన వో వటపత్రపరియంక

వారిధిశయన వో వటపత్రపరియంక - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ.కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో వారిధిశయన వో వటపత్రపరియంక కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వారిధిశయన వో వటపత్రపరియంక – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : వారిధిశయన వో వటపత్రపరియంక
సంఖ్య : 465
పుట: 314
రాగం: దేవగాంధారి

దేవగాంధారి

13 వారిధిశయన వో వటపత్రపరియంక
గారవాన మేలుకొని కన్నులు దెరవవే

॥పల్లవి||

ఘనయోగిహృదయపుకమలాలు వికసించె
వొనర విజ్ఞానసూర్యోదయమాయ
మును జీవపరమాత్మములజక్కవలు గూసె
వనజాక్ష మేలుకొని వాకిలి దెరవవే

॥వారిధి॥

కలుషములనేటిచీఁకట్లెల్లఁ బెడఁబాసె
నలువంక వేదకీరనాదము మ్రోసె
అలరి యితరధర్మాలనేటిచుక్కలు మాసె
జలజాక్ష మేలుకొని సతిమోము చూడవే

॥వారిధి||

కపటరాక్షసనేత్రకలుహారములు మోడ్చె
యిపుడే సుకర్మముల యెండలు గాసె
అపురూప శ్రీవేంకటాద్రీశ మేలుకొని
నిపుణుఁడ యిందిరయు నీవు మమ్ముఁ గానవే

॥వారిధి|| 465

అవతారిక:

“వటపత్రపరియంక” అంటే మఱియాకు తల్పముగా శయనించువాడని అర్థం. జక్కువలు అంటే చక్రవాక పక్షులు. కల్హారము అంటే తెలుపు రంగు మిళితమైన ఎఱ్ఱనికలువపూవు. తేలిక అని భ్రమ కలిగించే క్లిష్టమైన కీర్తన ఇది. వటపత్రశాయియైన జలధిశయన ఆదినారాయణునిపై అన్నమాచార్యులవారు చెప్పిన అద్భుతమైన కీర్తన ఇది ఆయన యోగీశ్వరుల హృదయకమలాలలో వుంటాడు. అన్య మతధర్మములను నక్షత్రాలు మాసిపోవునట్లు చేసే పూర్యోదయం అవుతుంది ఈయన నిదుర మేలుకొంటే. కపటులైన రాక్షసుల కన్నులనే కల్హారములు మ్రోడువారిపోతాయట. అంటే రాక్షసులు నశిస్తారని అర్థం.

భావ వివరణ:

ఓ వటపత్రపరియంకా! (మఱియాకు శయ్యగా పరుండిన వాడా!) వారిధిశయనా! (క్షీరసాగరముపై శయనించు దేవా!) గారవాన (మంగళప్రదుడవై) మేలుకొని కన్నులు తెరవవయ్యా!

ఓ ప్రభూ! నిన్ను జూచి ఘనులైన యోగేశ్వరుల హృదయ కమలములు వికసించినవి, యెందుకంటే వారిలో నిన్ను గూర్చిన విజ్ఞాన సూర్యోదయమైనది కదా! ఆ విజ్ఞాన సూర్యోదయమున జీవాత్మ పరమాత్మ అనే జక్కువలు (చక్రవాక పక్షులజంట) ఆనందముగ కూసినవి. (అంటే ఆ జంట నిజానికి తామొక్కటే అని కూస్తూన్నాయి అని భావము). ఓ వనజాక్షా! (పద్మనయనా!) నీ వైకుంఠద్వారపు వాకిలి తలుపులు తెరిపించి నిదురమేలుకొనవయ్యా!

ఓ జలజాక్షా! నీవు మేలుకొంటే దుర్మార్గము అనే చీకట్లన్నీ తొలగిపోతాయి నలుదెసలా చతుర్వేదములనెడి కీరములు (చిలుకలు) నాదముతో రవళిస్తాయి. ఈ లోకంలోవున్న వేద విహిత ధర్మములన్నియు నింగిలోని చుక్కలవలె (నక్షత్రముల తీరుగా) అదృశ్యమవుతాయి. ఓ దేవా! నిదురమేల్కొని ఒకపరి నీసతి మోమును పరికించుము.

ఓ దేవదేవా! నీవు మేలుకొంటే, కపటులైన రాక్షసుల నేత్రకలుహారములు (కన్నులనే లేత ఎఱుపురంగు కలువపూలు) మోడ్చె (ముడుచుకుపోతాయి). సుకర్మములు (వేదయుక్తమైన పనులు) అనే ఎండలుకాస్తాయి. అపురూపుడవైన శ్రీవేంకటేశ్వరా! నీవు నిదుర మేల్కొని ఇందిరాదేవితో కూడి నిపుణుడవై మమ్ము రక్షించి పరిపాలింపుము తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Satithoda Sare Sareku Sarasamuladukonta In Telugu – సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా

సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ.కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 14
కీర్తన : సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా
సంఖ్య : 376
పుట : 218
రాగం : కాంబోది

కాంబోది

12 సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా
తతితోడనారగించీ తగునె యీదేవుఁడు

॥పల్లవి||

ఒక్కమాటె వంటలెల్లా నొద్దనుండి వడ్డించి
మిక్కిలినలసె నలమేలుమంగ
చెక్కులఁ జెమటగారఁ జేరి యీపె వడ్డించఁగా
చొక్కి చొక్కి యారగించీఁ జూడరె యీదేవుఁడు

||సతితో||

పాఱి పాఱి బంగారుపళ్ళెములు వెట్టించి
మీఱి బుసకొట్టె నలమేలుమంగ
జాఱిన తురుముతోడఁ జవులాకె యడుగఁగ
ఆఱడి గూరలు మెచ్చీనంతలో నీదేవుఁడు

||సతితో||

వాలిన రాజసముతో వంటసాలలోననే
మేలిమిఁ గూచున్న దలమేలుమంగ
యీలోనె శ్రీవేంకటేశుఁడీపెఁ దానునారగించి
తాలమిఁ గాఁగిటఁగూడె దక్కక యీదేవుండు

॥సతితో॥ 376

అవతారిక:

అన్నమాచార్యులవారి వొక్కొక్క కీర్తనకు వొక్కొక్క ప్రత్యేకత వుంటుంది. ఇందులో చూడండి తన ముద్దుల సతితో ముచ్చట్లాడుకుంటూ మాటి మాటికీ సరసాలాడుతూ చాలా ఇష్టంగా భోజనం చేస్తున్నాడట ఆ దేవదేవుడు. తన చెక్కిళ్ళపై చెమటలు కారిపోతుంటే, సడలిన తనకొప్పును సవరించుకోలేక అలమేల్మంగమ్మ, తిప్పలు పడుతుంటే ఆహా! ఓహెూ! అని మెచ్చుకొంటూ ఆరగిస్తున్నాడట స్వామి. ఈలోనే అమ్మవారు కూడా ఆరగించి తాలిమితో యీదేవుని కౌగిట కరిగిపోయిందట. ధన్యోస్మి. ఏమి ఆ పదకవితాసౌరభం!! ఏమి ఆ కల్పనా చాతుర్యం!! ఏమని పొగడుదునయ్యా! అన్నమయ్యా!

భావ వివరణ:

సారెసారెకు (మాటిమాటికీ) సతితోడ (తన భార్యతో) సరసములాడుకొంటూ (చలోక్తులు విసురుతూ) ఈ దేవదేవుడు తగు తతితోడన్ (తగినంత ప్రీతితో) | ఆరగించీ (భుజించుచున్నాడు). ఆ వైనం వినండి.

జగముల తల్లి అలమేలుమంగ తను ఆయనకిష్టమని చేయించిన వంటకాలన్నింటిని ఒక్కటీ వదలకుండా వడ్డించింది. అందుచే ఆ తల్లి మిక్కిలి అలిసిపోయినది. ఆమె చెక్కుల జెమట (చెక్కిళ్ళపై శ్రమవలన చెమట) కారిపోతున్నది. ఆమె చేరి స్వయముగా వడ్డించుచునేయున్నది. ఈ దేవుడు చొక్కి చొక్కి (పారవశ్యముతో) ఆరగించుచున్నాడు. ఈ అద్భుత దృశ్యం మీ మనోనేత్రాలతో చూచి తరించండి.

ఈ తల్లి, పాఱిపాటి (తడవ తడవకూ) వంటకాలన్నీ బంగారు పళ్ళెరములలో పెట్టించి, అలసటతో మీఱి బుసకొట్టీ (పెద్దగా నిట్టూర్చింది) అలమేల్మంగమ్మకు ఆ పరిశ్రమవలన తురుము (సిగకొప్పు) సడలి పోయింది (వదులై విడిపోబోతున్నది). అయినా ఆమె కొప్పు సవరించుకొంటూనే, చవులడుగగా (వంటలెలావున్నాయండీ… అని అడుగుతుంటే) ఈ దేవుడు ఆఱడి (మించి) అంతలో (పూర్తిగా తినకుండానే) కూరలు మెచ్చీ (కూరలు యెంత బాగున్నాయి. ఆహా!! యేమి రుచి అని మెచ్చుకొన్నాడు).

ఆ తల్లి అటుపిమ్మట, వాలిన రాజసముతో (మిక్కిలి అతిశయించిన రాచఠీవితో) మేలిమి వంటసాలలో (స్వర్ణమయమైన ఆ వంటశాలోనే) తానూ భుజించుటకు కూర్చున్నది. ఈలోనె (ఈరీతిగా) శ్రీవేంకటేశ్వరుడు మరియు అలమేల్మంగ, ఆరగించిరి. ఆపై, తక్కక (తప్పకుండా) ఈ దేవదేవుడు తాలిమి (ఉత్సాహముతో) ఆ దేవిని కౌగిట కూడెన్.

శ్లో॥ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం

మరిన్ని అన్నమయ్య కీర్తనలు: