బాలకాండ, రామాయణంలో మొదటి భాగం, శ్రీరాముడు మరియు అతని సోదరుల బాల్య జీవితం, అయోధ్య రాజ్యం మరియు దశరథుడు రాజు గురించి చెప్పబడింది. బాలకాండంలోని ముఖ్యమైన అంశాలు శ్రీరాముడు మరియు అతని సోదరుల జననం, విద్య, ఋష్యశృంగ యాగం మరియు పట్టాభిషేకం గురించి తెలుపుతాయి.
అయోధ్యా కాండ సర్గ 55 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. ఆ రాత్రి అడవిలో గడిపిన తరువాత రామలక్ష్మణులు, సీత, మరునాడు అక్కడి నుండి బయలుదేరి చిత్రకూట పర్వతమునకు పోవడానికి సిద్ధం అయ్యారు. భరద్వాజుని వద్దకు పోయి ఆయనకు నమస్కారం చేసారు. భరద్వాజుడు సీతారామలక్ష్మణులకు మంగళాచరణము చేసి వీడ్కోలు పలికాడు. వారితో పాటు కొంతదూరము వెళ్లాడు. అక్కడ నిలబడి రామునితో భరద్వాజుడు ఇలా అన్నాడు.
యమునాతరణమ్
ఉషిత్వా రజనీం తత్ర రాజపుత్రావరిందమౌ |
మహర్షిమభివాద్యాథ జగ్మతుస్తం గిరిం ప్రతి ||
ఆ రాత్రి అడవిలో గడిపిన తరువాత రామలక్ష్మణులు, సీత, మరునాడు అక్కడి నుండి బయలుదేరి చిత్రకూట పర్వతమునకు పోవడానికి సిద్ధం అయ్యారు. భరద్వాజుని వద్దకు పోయి ఆయనకు నమస్కారం చేసారు. భరద్వాజుడు సీతారామలక్ష్మణులకు మంగళాచరణము చేసి వీడ్కోలు పలికాడు. వారితో పాటు కొంతదూరము వెళ్లాడు. అక్కడ నిలబడి రామునితో భరద్వాజుడు ఇలా అన్నాడు.
“ఓ రామా! మీరు గంగా యమునా సంగమ స్థానము చేరిన తరువాత యమునా నది ఒడ్డునే పడమటి వైపుగా వెళ్లండి. అక్కడ మీరు ఒక తెప్పను కట్టుకొని యమునను దాటండి. మీరు యమునను దాటిన తరువాత మీకు ఒక పెద్ద మర్రిచెట్టు కనపడుతుంది. ఆ చెట్టు పేరు శ్యామము. అక్కడ ఎంతో మంది సిద్ధులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. సీత ఆ చెట్టుకు నమస్కారము ఏ కోరికలు కోరుకుంటే అవి తీరుతాయి.
మీరు ఆ చెట్టు కింద ఆగి కొంచెం సేపు విశ్రాంతి తీసుకొన వచ్చును. లేని ఎడల మీరు ప్రయాణము కొనసాగించవచ్చును. అలా ఒక క్రోసెడు దూరము వెళ్లగానే మోదుగ చెట్లతోనూ, రేగు చెట్లతోనూ వెదురు పొదలతోనూ నిండి ఉన్న ఒక అరణ్యము కనిపిస్తుంది. అది యమునా నది ఒడ్డున ఉంటుంది. అదే చిత్రకూటమునకు పోవు దారి. నేను ఆమార్గములో ఎన్నోసార్లు ప్రయాణము చేసాను. అది ఎంతో సురక్షితమైన మార్గము. ఏ ప్రమాదమూ ఉండదు.” అని అన్నాడు భరద్వాజుడు.
ఆ మాటలు విన్న రాముడు భరద్వాజుని చూచి నమస్కరించి “మీరు చేసిన సాయమునకు కృతజ్ఞతలు. ఇంక మీరు ఆశ్రమమునకు వెళ్లండి. మాకు ముందుకు వెళ్లడానికి అనుజ్ఞ ఇవ్వండి.” అని ప్రార్థించాడు. ఆమాటలు విన్న భరద్వాజుడు వారిని ఆశీర్వదించి వెనుకకు వెళ్లిపోయాడు. రామలక్ష్మణులు సీత ముందుకు సాగారు.
వారు యమునా నదిని సమీపించారు. రాముడు లక్ష్మణుడు అక్కడక్కడా వెతికి కొన్ని కర్రలను తీసుకొని వచ్చారు. వాటిని తీగలతో కట్టి ఒక తెప్పను తయారు చేసారు. దాని మీద ఆకులతో మెత్తగా ఆసనములను ఏర్పాటు చేసారు. ముందు సీతను తెప్పలోకి ఎక్కించారు. తరువాత సీత వెంట దశరథుడు పంపిన వస్త్రములను, ఆభరణములను, రామ లక్ష్మణులు తమ వెంట తెచ్చుకున్న ఆయుధము లను, తెప్పలో పెట్టారు. తరువాత రామ లక్ష్మణులు ఎక్కారు. అందరూ ఆ తెప్పలో యమునను దాటుతున్నారు.
తెప్ప యమునానదీ మధ్యకు రాగానే సీత యమునకు నమస్కరించింది. “అమ్మా యమునా నదీమతల్లీ! మమ్ములను చల్లగా కాపాడు. మా అరణ్య వాసము నిర్విఘ్నంగా జరిగేటట్టు చూడు. మేము సురక్షితముగా అయోధ్యకు తిరిగి వస్తే నీకు వేయి గోవులను, వంద ఘటముల మద్యమును సమర్పించుకుంటాను.” అని మొక్కుకుంది.
తరువాత అందరూ యమునా నది దక్షిణతీరము చేరుకున్నారు. అందరూ తెప్పను దిగారు. భరద్వాజుడు చెప్పిన శ్యామ అనే వటవృక్షమును సమీపించారు. సీత ఆ వటవృక్షమునకు నమస్కరించింది. తమను చల్లగా చూడమని ప్రార్థించింది.
తరువాత వారు ముందుకు సాగారు. ముందు లక్ష్మణుడు నడుస్తున్నాడు, మధ్యలో సీత వెనక రాముడు నడుస్తున్నారు. ఆ వనములోని అందాలు చూస్తూ నడుస్తున్నారు.
సీత తాను అంతకు ముందు చూడని వృక్షముల గూర్చి మొక్కలు, లతల గూర్చీ రాముని అడిగి తెలుసుకుంటూ ఉంది. లక్ష్మణుడు వెళ్లి ఆయా చెట్లయొక్క ఆకులను పూలను తీసుకొని వచ్చి సీతకు ఇచ్చాడు. ఆ ప్రకారంగా వారు ఒక త్రోసెడు దూరము నడిచారు. అక్కడ రామలక్ష్మణులు తినడానికి యోగ్యమైన జంతువులను చంపి తీసుకొని వచ్చారు. వాటిని తిని ఆకలి తీర్చుకున్నారు. అంతలో చీకటి పడింది. వారు ఒక సమతల ప్రదేశములో ఆ రాత్రికి ఉండటానికి వసతి ఏర్పాటుచేసుకున్నారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ పంచాశః సర్గ, “గుహసంగతమ్”, రామాయణంలోని ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, రాముడు, సీత, మరియు లక్ష్మణులు వనవాసం కోసం ప్రయాణిస్తారు మరియు వారి మార్గంలో గుహ అనే అనుచరుడు మరియు స్నేహితుడు కలుసుకుంటారు. గుహ, కేవట్ కులానికి చెందినవాడు, రాముడి పట్ల ఎంతో భక్తి మరియు ప్రేమ చూపిస్తూ, అతడిని ఆదరించే విధంగా ప్రవర్తిస్తాడు. రాముడు మరియు అతని కుటుంబం గుహతో గడిపిన సమయం, అతని ఆతిథ్యం, మరియు స్నేహం ఈ సర్గలో హృద్యంగా వర్ణించబడ్డాయి. ఈ సర్గ రాముడు తన నిస్వార్థత మరియు వినయంతో గుహను సంతృప్తి పరచడం, అలాగే స్నేహం మరియు విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.
రాముడు సీతాలక్ష్మణ సమేతుడై రథము మీద కోసల దేశపు సరిహద్దుల వద్దకు వచ్చాడు. అయోధ్య ఉన్న వంక తిరిగాడు. రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ “కాకుత్థ్స వంశస్థులచే పరిపాలింప బడుతున్న ఓ అయోధ్యా నగరమా! పుట్టినప్పటి నుండి నీ ఒడిలో
పెరిగాను. ఇప్పుడు విధి వశాత్తు నిన్ను విడిచి వెళుతున్నాను. నిన్ను, నీలో నివసించు ప్రజలను విడిచిపోవుటకు మీ అనుమతి కోరుతున్నాను. అచిరకాలములోనే నేను వనవాసము పూర్తి చేసుకొని తిరిగి వస్తాను. అయోధ్యానగర ప్రవేశము చేస్తాను.”అని అయోధ్యాపురికి నమస్కరించాడు.
అప్పటికే రాముడు వచ్చాడని వార్త తెలిసి సమీప గ్రామ ప్రజలు రాముని చూడటానికి అక్కడకు చేరుకున్నారు. వారిని చూచి రాముడు ఇలా అన్నాడు. “మీరు నా మీద జాలి చూపించారు. కాని మీ మీ పనులు మానుకొని నాకోసం దుఃఖించడం మంచిది కాదు. మీ పనులు చూచుకొనుడు.” అని వారికి నమస్కరించి చెప్పాడు. వారుకూడా రామునికి పట్టిన దుర్దశకు దుఃఖిస్తున్నారు. తరువాత రాముడు కోసల దేశమును దాటి వెళ్లిపోయాడు.
రాముడు ప్రయాణించు రథము పరమ పవిత్రమైన గంగాతీరము చేరుకొంది. గంగానదీ తీరమున గల మున్యాశ్రమ ములు గంగానదికి అలంకారముగా శోభిల్లుతున్నాయి. దేవలోకమునుండి అప్సరసలు గంగా స్నానము కొరకు అక్కడకు వస్తూ ఉంటారు. పవిత్రమైన ఆ గంగను దేవతలు, దానవులు, గంధర్వులు సదా సేవిస్తూ ఉంటారూ. గంగ కొన్ని ప్రదేశములలో వేగంగానూ కొన్ని ప్రదేశములలో నెమ్మదిగానూ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గంగానదిలో హంసలు, సారస పక్షులుయధేచ్ఛగా విహరిస్తుంటాయి. గంగానదికి ఆ ఒడ్డున ఈ ఒడ్డున ఉన్న పచ్చని చెట్లు గంగానదికి అలంకరించిన పూలమాలల వలె ప్రకాశిస్తున్నాయి. గంగానదీజలములు నిర్మలంగా స్వచ్ఛంగా పారుతున్నాయి. కాని అక్కడక్కడ మదగజములు గంగానదిలో దిగి స్నానము చేయడం వల్ల నీరు కలుషితము అవుతూ మరలా నిర్మలంగా మారుతూ ఉంది. గంగానదీ తీర ప్రాంతము అంతా మధురమైన ఫల వృక్షములతోనూ, పూల మొక్కలతోనూ నిండి సర్వాలంకార శోభిత అయిన మంగళకరమైన స్త్రీ వలె శోభిల్లుతూ ఉంది. అటువంటి గంగాతీరము వెంట ప్రయాణించి రాముడు శృంగిబేరపురమునకు చేరుకున్నాడు.
“సుమంత్రా! రథమును ఆపుము. ఇక్కడ ఒక ఇల్గుదీ వృక్షము ఉన్నది. ఈ వృక్షము ఫలములతో నిండి ఉంది. ఈ రాత్రికి మనము ఇక్కడే ఉండెదము. పవిత్ర గంగానదిలో స్నానము చేసి, ఈ చెట్టు కిందనే నిద్రించెదము.” అని అన్నాడు రాముడు.
రాముని ఆదేశము ప్రకారము సుమంత్రుడు రథమును ఆవృక్షము కింద నిలిపాడు. రాముడు, లక్ష్మణుడు, సీత రథము దిగారు. సుమంత్రుడు కూడా రథము దిగి రథమునకు కట్టిన గుర్రములను మేతకు విడిచి పెట్టి, రాముని వద్దకు వచ్చాడు.
ఆ శృంగిబేరపురంలో బోయజాతికి చెందిన వాడు, అక్కడ ఉన్న బోయలకు నాయకుడు, రామునికి మిత్రుడు అయిన గుహుడు అనే బోయవాడు నివసిస్తున్నాడు. రాముడు తన రాజ్యమునకు వస్తున్నాడని వార్త ముందే తెలిసిన గుహుడు కుల పెద్దలతోనూ, సేవకులతోనూ రాముని వద్దకు వచ్చాడు. గుహుని రాక విని రాముడు అతనికి ఎదురుపోయి అతనిని కౌగలించుకున్నాడు. గుహుని క్షేమసమాచారములు అడిగి తెలుసుకున్నాడు.
“రామా! ఇది నీకు పరాయి ఇల్లు కాదు. నీకు అయోధ్య ఎలాగో ఇదీ అలాగే. నీ ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చును. నీ వంటి మిత్రుడు అతిథిగా రావడం నేను చేసుకున్న అదృష్టం. నీకు ఏమి కావాలో ఆజ్ఞాపించు. క్షణంలో సమకూరుస్తాను.” అని అన్నాడు గుహుడు. రామునికి, సీత, లక్ష్మణుడు,సుమంత్రునికి రకరకాలైన భోజనములు, పానీయములు సమకూర్చాడు.
“రామా! భోజన పదార్థములు సిద్ధంగాఉన్నాయి. మీరందరూ భోజనం చేయండి.” అని అన్నాడు. అప్పుడు రాముడు గుహునితో ఇలా అన్నాడు. “నీవు నా వద్దకు వచ్చి నన్ను ఆదరించడమే నీవు మాకు ఇచ్చే ఆతిధ్యము. నేను ప్రస్తుతము వనవాసములో మునివృత్తిలో ఉన్నాను. ఎవరు ఏమి ఇచ్చినా తీసుకొనను. ఫలములు తప్ప వేరే ఆహారము తీసుకొనను. కాని నా రథమునకు కట్టిన అశ్వములు మా తండ్రిగారికి ఎంతో ప్రియమైనవి. వాటికి కావలసిన ఆహారము సమకూర్చుము. అదే నాకుమహదానందము.” అని అన్నాడు రాముడు.
వెంటనే గుహుడు అశ్వములకు కావలసిన ఆహార ఏర్పాట్లు చేసాడు. ఆ రాత్రికి రాముడు కేవలము నీరు ఆహారంగా తీసుకొని నిద్రించాడు. గుహుడు ఆ రాత్రికి అక్కడే ఉన్నాడు. లక్ష్మణునితోనూ, సుమంత్రునితోనూ మాట్లాడుతూ మేలుకొని ఉన్నాడు.
రామునికి ఓ పట్టాన కటిక నేలమీద నిద్రపట్టలేదు. ఆ రాత్రి చాలా దీర్ఘంగా ఉన్నట్టు అనిపించింది రామునికి.
అయోధ్యాకాండ త్రిసప్తతితమః సర్గలో, భరతుడు, శత్రుఘ్నుడు మరియు వారి సహచరులు అరణ్యానికి చేరుకుని రాముడిని కలుసుకుంటారు. భరతుడు రాముని పాదాలకు నమస్కరిస్తూ అయోధ్యకు తిరిగి రావాలని వేడుకుంటాడు. రాముడు తన ధర్మాన్ని పాటిస్తూ, తండ్రి ఆజ్ఞను అవహేళన చేయలేమని స్పష్టం చేస్తాడు. భరతుడు రాముడికి పాదుకలను తీసుకువచ్చి, తన స్థానంలో రాజ్యం పాలించాలని కోరుతాడు. రాముడు తన పాదుకలను భరతుడికి అప్పగించి, భరతుడిని అంగీకరిస్తాడు. ఈ సర్గలో రాముడు తన వ్రతాన్ని కొనసాగిస్తూ, భరతుడు తన తమ్ముడి కర్తవ్యాన్ని గౌరవిస్తూ, పాదుకలను తీసుకుని తిరిగి వెళతాడు.
తన తల్లి కైక ఎంతో సంతోషంతో చెప్పిన మాటలు విన్న భరతుడు కోపంతో ఊగిపోయాడు. కాని ఎదురుగా ఉన్నది కన్నతల్లి. అందుకని తనకోపాన్ని బలవంతాన అణుచుకున్నాడు. కైకతో ఇలా అన్నాడు.
“అమ్మా! నా తండ్రి అకాల మరణం చెందాడు. నా సోదరులు అడవుల పాలయ్యారు. ఇంకా నాకు ఎందుకమ్మా ఈ రాజ్యము. అమ్మా! నా అన్న రాముడు అరణ్యానికి పోవుటకు, రాముని మీద ప్రేమతో నా తండ్రి మరణించుటకు నీవా కారణము? మా వంశమునకు అగ్నిలాగా దాపురించి కాల్చివేసావు కదమ్మా! ఈ విషయం తెలియక నా తండ్రి నిన్ను ఎంతో ఆదరించాడు కదా అమ్మా! నీ పాపముతో కూడిన ఆలోచనలకు నా తండ్రిని బలితీసుకున్నావు. నీ వలన మా ఇక్ష్వాకు వంశమే అపవిత్రమయింది. మా అందరికీ సుఖసంతోషాలు దూరం చేసావు. నీవు చేసిన అనాలోచితపు పని వలన నా తండ్రి మరణించాడు. చెప్పమ్మా! ఇదంతా ఎందుకు చేసావు? రాముని ఎందుకు అడవులకు పంపావు? నా తండ్రిని ఎందుకు చంపావు? ఇంతా చేసిన దానివి కౌసల్యను సుమిత్రను బతుకనిస్తావా! వాళ్లకు కూడా నీ చేతిలో మరణం తథ్యం. అమ్మా! రాముడు నిన్ను తన కన్నతల్లి కౌసల్య కంటే ఎక్కువగా గౌరవించాడు కదమ్మా! మా పెద్దమ్మ కౌసల్య కూడా నిన్ను తన సహోదరి కంటే ఎక్కువగా ఆదరించింది కదమ్మా! అటువంటి రామునికి నారచీరలు కట్టి అడవులకు ఎలా పంపగలిగావు. కౌసల్యకు పుత్రశోకము ఎందుకు కలుగజేసావు? ఎవరి కోసం చేసావు ఇదంతా? ఇంత చేసికూడా సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు? నీవు మనిషివేనా లేక బండరాయివా!
అమ్మా! నేను, నీ కుమారుడు భరతుని, అడుగుతున్నాను. రాముని అరణ్యములకు పంపుటకు కారణమేమి? నాకురాజ్యము కట్టబెట్టడానికేనా! నాకు రాముని మీద ఉన్న భక్తి గౌరవము తెలిసే ఈ పని చేసావా? రాముడు లేకుండా ఈ రాజ్యభారం వహించే శక్తి నాకు ఉందనుకుంటున్నావా! నీకు తెలుసో లేదో! నా తండ్రి దశరథుడు కూడా తన వృద్ధాప్యంలో రాముని సహాయంతోనే ఈ రాజ్యాన్ని పరిపాలిం చాడు. అటువంటిది, రాముడు లేకుండా, నేను ఈ రాజ్యభారమును ఎలా మోయగలను అనుకున్నావు? ఒక వేళ నేను నా శాయశక్తులా ప్రయత్నించి ఈ రాజ్యభారమును మోయగలనేమో గానీ, నీ కోరిక మాత్రము తీర్చను. నీ కొడుకు మీద ఉన్న అతి ప్రేమతో ఇదంతా చేసావు కాబట్టి నీ కోరిక ఎంత మాత్రమూ తీరదు.
అసలు నీవు నా తల్లివే కాదు. నిన్ను ఈక్షణముననే విడిచిపెడదామనుకుంటున్నాను. కానీ, రాముడు నిన్ను తన కన్న తల్లి కంటే ఎక్కవ ప్రేమతో చూచుకొనే వాడు. అందుకని ఆ పని చేయలేకపోతున్నాను.
అమ్మా! నాకు తెలియక అడుగుతాను! నీవు ఈ పని చేసేటప్పుడు కొంచెం ఆలోచించావా! దీని వలననీకు ఎంత అపకీర్తి వస్తుందో, మన వంశప్రతిష్ఠకు ఎంత భంగం వాటిల్లుతుందో ఒక్క క్షణమైనా ఆలోచించావా! అసలు నీకు ఈ బుద్ధి ఎలా పుట్టింది. నీకే పుట్టిందా లేక ఎవరి ప్రోద్బలముతోనన్నా ఇంతటి ఘోరానికి ఒడిగట్టావా! నీకు రాజధర్మము, మా వంశాచారము తెలిసే ఈ పని చేసావా!
మా వంశాచారము ప్రకారము కొడుకులు అందరిలోకీ పెద్దవాడు రాజ్యభారము వహిస్తే, మిగిలిన వారు అన్నగారిని భక్తితో సేవిస్తారు. ఈ మాత్రం నీకు తెలియదా లేక నీకు మా వంశాచారము మీద, రాజ ధర్మము మీద గౌరవము లేదా! అమ్మా! ఇప్పుడు చెబుతున్నాను విను. మా ఇక్ష్వాకు వంశంలో, అందరిలోకీ పెద్దవాడు రాజ్యాభిషిక్తుడు అవుతాడు. ఇది మా కుల ధర్మము. మా ఇక్ష్వాకు వంశరాజులందరూ పాటిస్తున్న ఆచారము. ధర్మాచరణములో మా ఇక్ష్వాకు వంశీయులు ఎల్లప్పుడూ ముందుం టారు. ఈ నాడు నీవు మా రాజధర్మానికి చేటుతెచ్చావు. నీ పుత్ర వ్యామోహంతో మా వంశములోని రాజులందరికీ అపకీర్తి తెచ్చావు. అందుకని నేను మా ఇక్ష్వాకురాజధర్మము తప్పి ప్రవర్తించను. ఈ రాజ్యము నాకు అక్కరలేదు. ప్రాణత్యాగము అయినా చేస్తాను కానీ నీ కోరిక నెరవేర్చను. నేను ఇప్పుడే రాముని వద్దకు పోయి ఆయనను ప్రార్థించి వెనుకకు తీసుకొని వస్తాను. రాజ్యాభిషిక్తుని చేస్తాను. నేను రామునికి దాసునిగా ఉంటాను. నీకు ఇష్టంఉన్నా, లేకపోయినా ఇదే నా నిశ్చయము.”అని ఆవేశంతో అన్నాడు భరతుడు. భరతుని ఆవేశం చల్లారింది. తండ్రి మరణం గుర్తుకు వచ్చింది. ఆ దు:ఖము తట్టుకోలేక బిగ్గరగా ఏడవడం మొదలెట్టాడు భరతుడు.
అరణ్యకాండ రామాయణంలో మూడవ భాగం, ఈ కాండంలో రాముడు, సీత, లక్ష్మణులు అడవిలో గడిపిన 14 సంవత్సరాల కథను వివరిస్తుంది. ఈ కథాంశంలో చాలా ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి, వాటిలో కొన్ని దండకారణ్యానికి ప్రయాణం, విరాధుని వధ, జాబాలి, శరభంగుల ఆశ్రమాలు, పంచవటి, శూర్పణఖ వధ, రావణుని ప్రతీకారం, జటాయువు వధ, కబంధుని వధ, గుహలో హనుమానుని కలయిక.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ తృతీయః సర్గం రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యంలో ప్రవేశించి, ఋషులతో భేటి అవుతారు మరియు వారి ఆశీర్వాదాలు పొందుతారు. తరువాత, వారు పంచవటికి చేరి అక్కడ నివసించడం ప్రారంభిస్తారు. పంచవటిలో ఉండే సమయంలో రాముడు తన ధర్మానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ, అరణ్యంలో రాక్షసులను అణచి వేస్తాడు.
తాను రామలక్ష్మణులను వివరాలు అడుగుతుంటే వాళ్లిద్దరూ ఏవేవో మాట్లాడుకోవడం చూచి సహించలేకపోయాడు విరాధుడు.
“నేను మీ ఇద్దరి గురించి అడుగుతుంటే మీలో మీరే ఏం మాట్లాడుకుంటున్నారు. చెప్పండి మీరు ఎవరు? ఈ అరణ్యములకు ఎందుకు వచ్చారు? ఎక్కడికి వెళుతున్నారు?” అని అడిగాడు.
అప్పుడు రాముడు విరాధునితో ఇలా అన్నాడు. “ఓ రాక్షసుడా! మేము క్షత్రియులము. మునులము కాము. నా పేరు రాముడు. ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు. ఆమె నా భార్య సీత. కాల వశమున ఈ అరణ్యములో తిరుగుతున్నాము. ఇంతకూ నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు?” అని అడిగాడు రాముడు.
“ఓ రామా! నేను రాక్షసుడను. నాపేరు విరాధుడు. నా తండ్రి పేరు జవుడు. నా తల్లి పేరు శతహ్రద. నేను బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసాను. ఆయన వలన ఎవరిచేతా గాయపడకుండా, చావకుండా వరము పొందాను. నాకు ఈమె మీద మోహము కలిగింది. కాబట్టి మీరు ఇద్దరూ ఈమెను నాకు విడిచి పెట్టి ఇక్కడ నుండి పారిపొండి. లేకపోతే మీ ఇద్దరిని చంపి తింటాను. వెంటనే వెళ్లిపొండి.” అనిఅన్నాడు విరాధుడు.
ఆ మాటలకు రామునికి కోపం వచ్చింది. కళ్లు ఎర్రబడ్డాయి. కోపంతో విరాధునితో ఇలా అన్నాడు. “ఓ రాక్షసుడా! నీకు నా చేతిలో చావు మూడింది. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నిన్ను ప్రాణాలతో వదలను.”అని ధనుస్సు ఎక్కుపెట్టి ఒక బాణాన్ని సంధించి విరాధుని మీదికి వదిలాడు.
వరసగా విరాధుని మీద బాణాలు ప్రయోగించాడు రాముడు. రాముడు వదిలిన బాణాలు విరాధుని శరీరం నిండా గుచ్చుకున్నాయి. విరాధుని శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. ఆ బాణాల బాధకు తట్టుకోలేక విరాధుడు తన తొడమీద ఉన్న సీతను కిందికి దించాడు. శూలాన్ని పట్టుకొని పెద్దగా అరుస్తూ రామలక్ష్మణుల మీదికి దూకాడు.
రామునికి లక్షణుడు కూడా తోడైనాడు. రామలక్ష్మణులు విరాధుని మీద బాణములను వర్షంలా కురిపించారు. ఆ రాక్షసుడు ఒక్కసారి ఆవులించి ఒళ్లు విదిలించగానే అతని శరీరమునకు గుచ్చుకున్న బాణములు అన్నీ జలజలా కింద రాలిపోయాయి. బ్రహ్మ వరప్రభావము వలన రామ లక్ష్మణులు వదిలిన బాణములు విరాధుని ఏమీ చేయలేకపోయాయి.
విరాధుడు మరలా శూలమును పైకెత్తి రామలక్ష్మణుల మీదికి దూకాడు. తన శూలమును రాముని మీదికి విసిరాడు. రాముడు రెండు బాణములతో ఆ శూలమును మధ్యలోనే ఖండించాడు. విరాధుని శూలము రెండు ముక్కలై కిందపడిపోయింది. రామలక్ష్మణులు రెండు కత్తులను తీసుకున్నారు. విరాధునిమీదికి దూకారు. ఆ కత్తులతో విరాధుని బలంగా కొట్టారు. ఇలా కాదని.
విరాధుడు రామలక్ష్మణులను తన చేతుల మధ్య బంధించాలని అనుకొన్నాడు. విరాధుని ఊహను పసికట్టాడు రాముడు. అక్ష్మణునితో ఇలా అన్నాడు.
“లక్షణా! వీడు మన ఇద్దరినీ చేతులతో ఎత్తుకొని మోసుకొని పోవాలని చూస్తున్నాడు. వాడి ఇష్టం వచ్చినట్టు మనలను మోసుకుంటూ పోనిద్దాము. ఎందుకంటే మనం కూడా ఇదే దారిలో వెళ్లాలి కదా!” అని అన్నాడు.
ఇంతలో విరాధుడు రామలక్ష్మణులను తన చేతులతో ఎత్తుకొని తన బుజాల మీద కూర్చోపెట్టుకున్నాడు. అరణ్యంలోకి పరుగెత్తాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” ద్వితీయ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యంలో మరింత లోతుగా ప్రవేశిస్తారు. వారు అటవీ జీవులతో మమేకమై, సురక్షితంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అటవీ సహజ సౌందర్యం వారికి అద్భుత అనుభూతిని కలిగిస్తుంది. ఈ సమయంలో, సీత తన భక్తి మరియు ప్రేమతో రాముడిని నడిపిస్తుంది, లక్ష్మణుడు రాముడి ఆజ్ఞలను అనుసరిస్తూ రక్షణను కల్పిస్తాడు.
|| విరాధసంరోధః ||
కృతాతిథ్యోఽథ రామస్తు సూర్యస్యోదయనం ప్రతి |
ఆమంత్ర్య స మునీన్సర్వాన్వనమేవాన్వగాహత ||
రామలక్షణులు, సీత ఆ రాత్రికి ఆ పర్ణశాలలోనే విశ్రమించారు. మరునాడు ఉదయము ఆ మునుల వద్ద అనుజ్ఞ తీసుకొని రాముడు, లక్ష్మణుడు, సీతతో సహా అరణ్యములోకి వెళ్లాడు. వారు అడవిలో ప్రయాణము చేస్తూ ఎన్నో వన్యమృగములను చూచారు.
హటాత్తుగా వారి ఎదురుగా ఒక రాక్షసుడు ప్రత్యక్షం అయ్యాడు. వాడి శరీరం ఒక కొండ మాదిరి ఉంది. వాడు నరమాంసభక్షకుడు అని రాముడు గ్రహించాడు. రామలక్ష్మణులు వాడి వంక నిశితంగా చూచారు.
వాడు నల్లగా కొండ మాదిరి ఉన్నాడు. కళ్లు ఎర్రగా ఉన్నాయి. వికృతాకారంతో ఉన్నాడు. వాడి శరీరం అంతా రక్తంతో తడిసి ఉంది. వాడి బుజం మీద ఒక శూలం ఉంది. దానికి మూడు సింహాలను, నాలుగు పెద్దపులులను, రెండు తోడేళ్లను, పది జింకలను, గుచ్చి తీసుకొని వెళుతున్నాడు.
ఆ రాక్షసుడు రామ లక్ష్మణులను చూచాడు. గట్టిగా అరిచాడు. వారిని చంపడానికి వారి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. వాడి కళ్లక అందమైన సీత కనిపిపించింది. రావడం రావడం సీతను పట్టుకొన్నాడు. సీతను తీసుకొని పక్కకు వెళ్లాడు. రామలక్ష్మణులను చూచి ఇలా అన్నాడు.
“జటలు ధరించిన మీరు ఎవరు? ఇక్కడకు ఎందుకు వచ్చారు? మీరు ఎవరైనా ఈ రోజు నా చేతిలో చావడం ఖాయం. మీరు ఇద్దరూ ముని కుమారుల వేషాలలో ఉన్నారు కదా! మీ వెంట ఈ స్త్రీ ఎందుకు ఉంది? ఈమె ఎవరు? ఈమెతో మీకు ఏమి సంబంధం? మునులు జితేంద్రియులు, సన్యాసులు కదా! మరి ముని ధర్మమునకు విరుద్ధంగా ప్రవర్తించి మీరు ఎందుకు పాపం చేస్తున్నారు?” అని అన్నాడు ఆ రాక్షసుడు.
దానికి రాముడు ఆ రాక్షసుని చూచి ఇలా అన్నాడు. “నీవు మమ్ములను ఇలా అడుగుతున్నావే. ఇంతకూ నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు?” అని అడిగాడు.
“నేను ఒక రాక్షసుడను. నా పేరు విరాధుడు. నేను ఈ అరణ్యములో ఉన్న మునులను చంపి ఆహారంగా తింటూ ఉంటాను. మీ వెంట ఉన్న ఈ స్త్రీ నాకు కావాలి. ఈమెను నేను పెళ్లి చేసుకుంటాను. ముని వేషములలో ఉండి కూడా ఈ స్త్రీని వెంటబెట్టుకొని తిరుగుతూ పాపం చేస్తున్న మిమ్ములను చంపి తింటాను.” అని అన్నాడు విరాధుడు.
ఆ మాటలు విన్న సీత చాలా భయపడింది. సీత శరీరం అంతా భయంతో వణికిపోయింది. విరాధుని ఒడిలో చిగురుటాకులా వణికిపోతున్న సీతను చూచి రాముడు చలించి పోయాడు. రాముడి మొహం పాలిపోయింది. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.
లక్ష్మణా! ఆ దుర్మార్గుడు విరాధుడు సీతను తన ఒడిలోకి ఎలా లాక్కున్నాడో చూచావా! కైక మనకు ఏమి జరగాలని మనసులో అనుకున్నదో అదే జరుగుతూ ఉంది. లక్ష్మణా! కైక తన కుమారుడు భరతునికి రాజ్యం ఇప్పించుకోవచ్చు. మనలను అడవులకు పంపి ఇన్ని కష్టాలకు గురిచెయ్యడం ఎందుకు? కైక మనకు ఏమి జరగాలని కోరుకుంటూ అడవులకు పంపిందో అదే జరుగుతూ ఉంది. నాకు వనవాస ప్రాప్తి, నా తండ్రి మరణము, ఇదుగో ఇప్పుడు నా భార్యను పరపురుషుడు తాకడం, ఒడిలోకి లాక్కోవడం… ఇంతకన్నా కష్టాలు ఏముంటాయి?” అని వాపోయాడు రాముడు.
ఆ మాటలు విన్న అక్ష్మణుడు కోపంతో రగిలిపోయాడు.
“రామా! ఏమిటీ వెర్రి? నీవు దేవేంద్రునితో సమానమైన పరాక్రమము కలవాడవు. ఇలా బేలగా మాట్లాడటం నీకు తగునా? అసలు ఇలా ఎందుకు పరితపిస్తున్నావు? రామా! నువ్వు చూస్తూ ఉండు. ఒకే బాణంతో వీడిని మట్టి కరిపిస్తాను. వీడి రక్తంతో నేలను తడిపేస్తాను. దేవేంద్రుడు పర్వతముల మీద వజ్రాయుధమును ప్రయోగించినట్టు విరాధుని మీద నేను బాణప్రయోగము చేస్తాను. వీడు కొండ కూలినట్టు కూలిపోతాడు. వీడి వక్షస్థలమును చీలుస్తాను. వీడి ప్రాణాలు హరిస్తాను.” అని కోపంతో ఊగిపోతూ అన్నాడు.
లక్ష్మణుడు. (ఒక్కమాట. విరాధుడురాక్షసుడు. నరమాంసము తినేవాడు. వాడు అన్న మాటలు చదివారు కదా. సన్యాసులు జితేంద్రియులు. వారి వెంట స్త్రీ ఉండకూడదు. వారికి స్త్రీ సాంగత్యము పనికిరాదు. ఇదీ ఆ రాక్షసునికి తెలిసిన నీతి. కాని ఈ నాడు మన మధ్యఉన్న స్వామీజీలు, సన్యాసుల చుట్టు ఉండేది ఆడవాళ్లే. సిల్కుజుబ్బాలు, చుట్టు ఆడవాళ్లు. తాము ఉండే గదుల్లో కిలోల కొద్దీ వెండి బంగారాలు, అక్రమ ఆస్తులు, పోలీసుకేసులు, అరెస్టులు ఇవి నిత్యకృత్యం అయ్యాయి. మరి ఆ రాక్షసుడికి ఉన్న జ్ఞానం కూడా మన స్వామీజీలకు లేదా! ఏమో! మీరే ఆలోచించండి)
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” రామాయణంలోని అయిదు కాండల్లో మూడవది. ఇది రాముడు, సీత, లక్ష్మణులు దండకారణ్యంలో 14 ఏళ్ళ వనవాసం గడుపుతూ చేసిన అనుభవాలను వివరిస్తుంది. ప్రథమ సర్గలో, వారు అరణ్యంలో ప్రవేశించి, అటవీ జీవులను కలుస్తారు మరియు శరభంగ, సుతీక్ష్ణ మునులతో సమావేశమవుతారు.
రాముడు సీత, లక్ష్మణుడు వెంటరాగా దండకారణ్యములోనికి ప్రవేశించాడు. ఆ దండకారణ్యములో ఎంతో మంది మహా మునులు ఆశ్రమములు కట్టుకొని తపస్సు చేసుకుంటూ ఉండటం చూచాడు రాముడు. ఆ మునుల ఆశ్రమముల దగ్గర వన్య మృగములు పరస్పర వైరము, భయమూ లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. పక్షుల కిల కిలారావములతో, వన్యప్రాణుల విహారములతో ఆ వనసీమలో ఉన్న ముని ఆశ్రమములు ఎంతో శోభాయమానంగా ఉన్నాయి.
ఆ మునుల ఆశ్రమములు విశాలమైన అగ్ని గృహములతోనూ, యజ్ఞమునకు కావలసిన సంభారములతోనూ, వేలాడుతున్న జింక చర్మములతోనూ, దర్భలతోనూ, అగ్నికార్యమునకు కావలసిన సమిధలతోనూ, నీళ్లతో నిండి ఉన్న పాత్రలతోనూ, తినడానికి కావలసిన ఫలములతోనూ నిండి ఉన్నాయి. ఒక పక్కనుండి వేదమంత్రములు చదువుతున్న ధ్వనులు, మరొక పక్క నుండి పూజా కార్యక్రమముల మంత్ర ధ్వనులు వీనుల విందుగా వినపడుతున్నాయి. ఆ ఆశ్రమములలో కేవలము తపస్సుచేసుకొనే మునులు మాత్రమే నివసిస్తున్నారు. రామలక్ష్మణులకు ఆ ప్రాంతము బ్రహ్మలోకము వలె కనిపించింది.
రాముడు, సీత, లక్ష్మణుడు తమ ఆశ్రమముల వంక రావడం ఆ మునులు చూచారు. వారంతా రామ లక్ష్మణులకు ఎదురు వెళ్లి స్వాగతము పలికారు. వారికి అర్ఘ్యము పాద్యము సమర్పించారు. కొందరు మునులు రామ లక్ష్మణుల దేహధారుఢ్యము, అంగసౌష్టవము చూచి ఆశ్చర్యపోయారు. వారిని రెప్ప వెయ్యకుండా చూస్తున్నారు.
ఆ మునులందరూ రామ లక్ష్మణులకు, సీతకు ఒక పర్ణశాలను చూపించారు. వారు అందులో నివాసము ఉండవచ్చునని తెలిపారు. కొందరు రామలక్ష్మణులకు నీళ్లు తెచ్చి ఇచ్చారు. మరి కొందరు తినడానికి మధురమైన ఫలములను తీసుకొని వచ్చి ఇచ్చారు. అందులో ముఖ్యులు, పెద్దవారు అయిన మునులు రాముని చూచి
“రామా! నీవు అయోధ్యకు మహారాజువు. రాజు లోక పూజ్యుడు. రాజు ప్రజలను ధర్మమార్గంలో నడిపిస్తాడు. రాజు దుష్టులను శిక్షిస్తాడు. ప్రజలను రక్షిస్తాడు. అందుకే రాజును అందరూ గౌరవించాలి, పూజించాలి. ప్రజారక్షకుడైన రాజు ఇంద్రునిలో నాలుగవ అంశ అని అంటారు. అందు చేతనే రాజు ప్రజల మన్ననలు పొందుతూ, రాజభోగములు ఇంద్రుని వలె అనుభవిస్తుంటాడు. ఈ ప్రదేశము అయోధ్యారాజ్యములో ఉంది. కాబట్టి నీవే మాకు రాజువు. నీవే మమ్ములను రక్షించాలి. నీవు ప్రస్తుతము వనములో ఉన్నావని రాజువు కాకపోవు. రాజు అయోధ్యలో ఉన్నా, అడవిలో ఉన్నా, రాజు రాజే.
రామా! మా సంగతి నీకు తెలుసు కదా! మేమే అన్ని సంగములను విడిచి పెట్టి జితేంద్రియులమై, ఆ అడవిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాము. మాకు ఎవరైనా అపకారము చేసినా, వారి మీద కోపగించకోడానికి కూడా మేము ఇష్టపడము. కాబట్టి మా అందరినీ రాజువైన నీవే మా అందరినీ రక్షించాలి.” అని పలికారు.
తరువాత ఆ మునులు రామలక్ష్మణులకు, సీతకు అనేక ఫలములు, కంద మూలములు, ఇతరములైన ఆహార పదార్థములు తెచ్చి ఇచ్చారు. రాముడు వారు చెప్పిన మాటలను ఆలకించాడు. వారు ఇచ్చిన పదార్థములను, ఫలములను భక్తితో స్వీకరించాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రిసప్తతితమః సర్గలో, మేము ఏ ఆహ్వానం లేదా వివాహ కార్డు కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు లేదా ఈ వివాహం కోసం కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికీ సమానంగా మరియు వ్యక్తిగతంగా స్వాగతం. ఎలాంటి ఉపోద్ఘాతాలు లేకుండా నేరుగా అక్కడికి వెళ్దాం.
దశరథుడు తన కుమారులచేత గోదానములు ఇప్పించు చున్న సమయంలో భరతుని మేనమామ యుధాజిత్తు అక్కడకు వచ్చాడు.
(భరతుని మేనమామ అంటే దశరథుని మూడవ భార్య, భరతుని తల్లి అయిన కైకేయి సోదరుడు అనగా కేకయ రాజు కుమారుడు).
కేకయ రాజ కుమారుడు, భరతునికి మేనమామ అయిన యుధాజిత్తును చూచి దశరథుడుఎంతో సంతోషించాడు. యుధాజిత్తు దశరథునితో ఇలా అన్నాడు.
“బావగారూ! మా తండ్రికేకయ రాజుగారు తమరిని కుశలము అడగమని అన్నాడు. ఇక్కడ మీరందరూ క్షేమమే కదా! మా తండ్రిగారు తన మేనల్లుడు అయిన భరతుని చూడవలెనని ముచ్చట పడు తున్నాడు. భరతుని నా వెంట తీసుకొని రమ్మని నన్ను పంపాడు. అందుకని నేను అయోధ్యానగరమునకు వెళ్లాను. మీరందరూ మీ కుమారుల వివాహమలు జరిపించుటకు విదేహ కు వెళ్లారని తెలిసి ఇక్కడకు వచ్చాను.” అని అన్నాడు యుధాజిత్తు.
దశరథుడు ఎంతో సంతోషంగా యుధాజిత్తుకు అతిథి సత్కారములు చేసాడు. అందరూ సంతోషంగా ఆ రాత్రి గడిపారు. మరునాడు ఉదయము అందరూ పెందలకడనే నిద్రలేచి ప్రాత:కాల సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించుకొన్నారు. తరువాత వారందరూ విశ్వామిత్రుడు, వసిష్ఠుడు మొదలగు ఋషులు ముందు నడువగా యజ్ఞవాటికకు చేరుకున్నారు.
పెళ్లి కుమారులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుభ ముహూర్తంలో తోరము కట్టడం మొదలగు మంగళ కార్యములు ఆచరించారు. తరువాత నలుగురు సోదరులు, పురోహితులు, అందరూ దశరథుని వద్దకు వెళ్లారు. దశరథుని అనుమతితో వసిష్ఠుడు జనక మహారాజు వద్దకు పోయి ఇలాఅన్నాడు.
“ఓ జనక మహారాజా! దశరథమహారాజు తన కుమారులకు కౌతుక మంగళకార్యములనుపూర్తిచేసుకొని తమరి కొరకు ఎదురు చూస్తున్నారు. కన్యాదాన కార్యక్రమము కన్యాదాతలైన మీ అనుమతితో జరగాలికదా! ” అని అన్నాడు.
“అదేమిటి మహర్షీ! మిథిల కూడా వారిదేకదా! వారికి అడ్డేమున్నది. వారునా అనుమతి కోసరం ఎదురు చూడ్డం ఏమిటి? అవశ్యం వారిని రమ్మనండి. ఇక్కడ నా కుమార్తెలు కూడా కౌతుక మంగళ కార్యములను పూర్తిచేసుకొని కల్యాణ వేదిక వద్దకు వచ్చి ఉన్నారు. నేను కూడా వేదిక వద్దకు వెళుతున్నాను. సుముహూర్తము సమీపించుచున్నది. ఇంక ఆలస్యము చేయకుండా దశరథుల వారిని వారి కుమారులను వివాహ వేదిక వద్దకు తోడ్కొని రెండు.” అని అన్నాడు జనకుడు.
జనకుని మాట మేరకు దశరథుడు, తనకుమారులతో సహా పురోహితులు ముందు నడువగా వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. జనకుడు వారి నందరినీ వివాహ వేదిక వద్దకు సాదరంగా ఆహ్వానించాడు. జనకుడు వసిష్ఠుని చూచి ఇలా అన్నాడు.
“ ఓ వసిష్ఠ మహర్షీ! తమరు ఈ వివాహమునకు పౌరోహిత్యము వహించాలి. నా కుమార్తెల వివాహములను దశరథపుత్రులతో వేదోక్తంగా జరిపించమని ప్రార్థిస్తున్నాను.” అని అన్నాడు.
ఆ మాటలకు వసిష్ఠుడు తన అంగీకారము తెలిపాడు. తరువాత వసిష్ఠుడు విశ్వామిత్రుని, శతానందుని చెరి ఒక పక్క ఉంచుకొని వివాహ కార్యక్రమమును నిర్వర్తించడానికి ఉపక్రమించాడు.
వివాహ మండపము మధ్యలో ఉన్న అగ్ని కుండములో అగ్నిహోత్రమును ఉంచాడు. హెమ కుండము చుట్టు గంధము, పుష్పములు, సువర్ణ కలశములలో పాలికలు, అంకురార్పణ చేసిన కుంభములు, మూకుళ్లు, ధూప పాత్రలు, శంఖ పాత్రలు, హోమము చేయు సాధనములు, నేతితో నిండినపాత్రలు, లాజలతో నిండిన పాత్రలు, అక్షతలు అన్నీ సిద్ధంగా ఉంచుకున్నాడు. వసిష్ఠుడు శాస్త్రోక్తముగా అగ్నిని వేల్చాడు. దర్భలు అగ్నిహోత్రము చుట్టూ పరిచాడు. వేద మంత్రములను పఠిస్తూ హోమ కార్యక్రమమును నిర్వర్తించాడు.
తరువాత జనక మహారాజు సర్వాలంకార భూషిత అయిన తన కుమార్తె సీతను తీసుకొని వచ్చి అగ్ని హోత్రము వద్ద నిలబడి ఉన్న రాముని ఎదురుగా నిలబెట్టాడు. రాముని చూచి ఇలా అన్నాడు.
“ఓ రామా! ఈమె నా కుమార్తె సీత. నీకు సహధర్మచారిణి కావడానికి సిద్ధంగా ఉంది. ఈమెను నీ సహధర్మచారిణిగా స్వీకరించు. నీ హస్తముతో నా కుమార్తె సీత హస్తమును గ్రహింపుము. పాణిగ్రహణము చేయుము. ఓరామా! ఈమె పతివ్రతయై నిన్ను ఎల్లప్పుడూ నీడవలె వెన్నంటి ఉండగలదు.” అని పలుకుతూ జనక మహారాజు సీత చేతిని రామునికి అందించి జలమును వదిలాడు. కన్యాదానం చేసాడు.
ఆ సమయంలో ఆకాశం నుండి దేవతలు దుందుభులు మోగించారు. పూలవర్షము కురిపించారు. ఆ ప్రకారంగా సీతారాముల కల్యాణము వైభవంగా జరిపించాడు జనకుడు.
తరువాత జనకుడు లక్ష్మణుని పిలిచాడు. “లక్ష్మణా! ఈమె నా కుమార్తె ఊర్మిళ. ఈమెను నీ సహధర్మచారిణిగా స్వీకరింపుము. ఇంక ఆలస్యము చేయకుండా ఈమెను పాణిగ్రహణము గావించు.” అని తన కుమార్తె ఊర్మిళ చేతిని లక్ష్మణుని చేతికి అందించాడు.
తరువాత జనకుడు భరతుని చూచి ” ఓ భరతా! ఈమె నా కుమార్తె మాండవి. ఈమెను పాణిగ్రహణము గావించు.
ఓ శత్రుఘ్నా! ఈమె నా కుమార్తె శ్రుత కీర్తి. నీవు ఈమె పాణిని గ్రహించు.
ఓ రామ,లక్ష్మణ,భరత,శత్రుఘ్నులారా! మీరందరూ సౌమ్యులు. గుణవంతులు. మంచి ప్రవర్తన కలవారు. నాకుమార్తెలను మీ మీ భార్యలుగా స్వీకరించండి.” అని అన్నాడు.
అప్పుడు రాముడు సీత చేతిని, లక్ష్మణుడు ఊర్మిళ చేతిని, భరతుడు మాండవి చేతిని, శత్రుఘ్నుడు శ్రుతకీర్తి చేతిని పట్టుకొన్నారు. పాణిగ్రహణ మహోత్సవము జరిగిపోయింది. దశరథుని కుమారులు నలుగురు తమ తమ భార్యల చేతులను పట్టుకొని అగ్నికి నమ స్కారము చేసారు. తరువాత మామగారు జనకునికి నమస్కారము చేసారు. తరువాత పురోహితులు వసిష్ఠమహర్షికి నమస్కారము చేసారు. తరువాత వసిష్ఠుడు దశరథ కుమారుల వివాహ కార్యక్రమ మును వైభవోపేతంగా జరిపించాడు.
తరువాత రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు తమ తమ భార్యల చేతులు పట్టుకొని అగ్నిహోత్రము చుట్టు మూడు సార్లు ప్రదక్షిణము చేసారు. ఆ ప్రకారంగా సీతా రాములు, ఊర్మిళా లక్ష్మణులు, మాండవీ భరతులు, శ్రుతకీర్తి శత్రుఘ్నులు దంపతులు అయ్యారు.
వివాహ కార్యక్రమము తరువాత రామ లక్ష్మణ, భరత శత్రుఘ్నులు తమ తమ భార్యలతో విడిది గృహములకు వెళ్లారు. వారి వెంట ఋషులు, పురోహితులు, బ్రాహ్మణులు కూడా వెళ్లారు. కుమారులను కోడళ్లను తృప్తిగా చూసుకుంటూ దశరథుడు కూడా వారి వెంట విడిదిగృహమునకు వెళ్లాడు.
అయోధ్యాకాండ ద్విసప్తతితమః సర్గలో, రాముడు అరణ్యవాసం చేస్తుండగా, అయోధ్యలో ఆయన తండ్రి దశరథ మహారాజు ప్రాణాలు విడుస్తాడు. దశరథుడు రాముని వలన విడిపోయిన క్షోభలో ఉండి, రాముడు నగరాన్ని విడిచిపోవడం వల్ల బాధతో మరణించాడు. కైకేయి చిత్తవికారంతో ఉండగా, భరతుడు తన తల్లి చర్యలను దుఃఖించి, రాముని తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. భరతుడు తన సహోదరుడు శత్రుఘ్నునితో కలిసి రాముని అరణ్యంలో కలుసుకోవడానికి బయలుదేరుతాడు. ఈ సర్గలో దశరథుడి మరణం, భరతుడి ప్రతిజ్ఞ, మరియు రాముని తిరిగి పట్టణానికి ఆహ్వానించే యత్నం ప్రధానాంశాలు.
భరతుడు అలా ఆలోచిస్తూ తన తండ్రి దశరథుని మందిరములో ప్రవేశించాడు. అక్కడ దశరథుడు కనిపించలేదు. వెంటనే తన తల్లి కైక మందిరమునకు వెళ్లాడు. కొడుకును చూడగానే కైక మనస్సు సంతోషంతో నిండిపోయింది. కొడుకుకు ఎదురువెళ్లింది. భరతుడు తల్లి కైక పాదములకు నమస్కరించాడు. కైక భరతుని లేవదీసి నుదుటిన ముద్దు పెట్టుకొని తన పక్కన కూర్చుండబెట్టుకొంది.
“నాయనా భరతా! నీ ప్రయాణము బాగా సాగిందా! తాతగారి ఇంట్లో ఎప్పుడు బయలుదేరావు. మార్గములో ఆయాసము కలగలేదు కదా! మీ తాతగారు, మేనమామ అంతా క్షేమంగా ఉన్నారా! ఇంకా కేకయ దేశపు విశేషములు ఏమిటి వివరంగా చెప్పు.” అని ఆతురతగా అడిగింది కైక చెప్పాడు. భరతుడు తల్లి అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ సమాధానాలు “అమ్మా! నేను తాతగారి ఇంటి నుండి బయలుదేరి ఏడుదినములు అయింది. అక్కడ తాతగారూ, మామయ్య అంతా క్షేమంగా ఉన్నారు. వారు మీకు, తండ్రి గారికి, పంపిన కానుకలు వెనుక తీసుకొని వస్తున్నారు. అమ్మా! అయోధ్యలో ప్రవేశించినప్పటి నుండి నా మనస్సులో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. వాటికి సమాధానాలు చెబుతావా అమ్మా!” అని అడిగాడు భరతుడు. కైక మాట్లాడలేదు. మౌనంగా ఉంది. భరతుడు ఇలాఅడిగాడు.
అమ్మా! నాన్న గారు ప్రతిరోజూ పడుకొనే బంగారు శయ్యమీద నాన్న గారు లేరు. కారణమేమి? ఈ మందిరములో పరిజనులందరి మొహంలో చింత, శోకము, ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంది. కారణమేమి? దశరథ మహారాజు గారు ఎక్కుడ సమయము నీ అంత:పురములోనే గడుపుతారు కదా! మరి ఇప్పుడు ఆయన నీ అంత:పురములో కనిపించడం లేదు. ఎందుకనీ? నేను చాలా రోజుల తరువాత వచ్చాను. నాన్న గారికి పాదాభి వందనము చేసి ఆయన ఆశీర్వాదము తీసుకొనవలెనని చాలా ఆతురతగా ఉన్నాను. ఆయన ఎక్కడ ఉన్నారు. నీ మందిరములో లేరు. కౌసల్య మందిరములో ఉన్నారా! చెప్పమ్మా! నేను నాన్నగారు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లాలి.” అని గుచ్చి గుచ్చి అడిగాడు.
ఇంక కైక తప్పించుకోలేక పోయింది. కాని నర్మగర్భంగా చెప్పసాగింది. “కుమారా భరతా! నీ తండ్రిగారు సాధారణంగా అన్ని జీవులు ఏ గతి పొందుతాయో అదే గతిని పొందారు.” అని చెప్పింది. భరతునికి అర్థం అయింది. తండ్రి మరణవార్త విని అలాగే కుప్పకూలిపోయాడు భరతుడు. అతనికి నోటమాట రాలేదు. దు:ఖంతో కుమిలిపోతున్నాడు. కైక భరతుని వద్దకు వచ్చి అతనిని లేపి పక్కన ఉన్న ఆసనము మీద కూర్చోపెట్టింది.
“భరతా! అదేమిటి అలా పడిపోయావు. నీ వంటి రాకుమారులు, కాబోయే మహారాజులు ఇలా దిగులు చెందవచ్చునా! నీ శోకము మాను.” అని ఊరడించింది కైక. కాని భరతునికి శోకము ఆగలేదు. పెద్దగా ఏడుస్తున్నాడు. “అమ్మా! వసిష్ఠులవారు శీఘ్రముగా రమ్మన్నారు అంటే రామునికి పట్టాభిషేకమునకు సుముహూర్తము నిశ్చయించినారేమో అనుకున్నాను. కాని ఇంతటి దుర్వార్త వినవలసి వస్తుందని అనుకోలేదు. అమ్మా! ఇంత హటాత్తుగా తండ్రిగారు చనిపోవుటకు కారణమేమి! ఏమైనా వ్యాధి సోకినదా! తండ్రిగారి అవసాన కాలములో దగ్గర ఉండి ఆయన అంత్యక్రియము జరిపించిన రాముడు ధన్యుడు. ఆ భాగ్యమునకు నేను నోచుకోలేదు. నేను వచ్చాను అని తెలియగానే నాకు ఎదురు వచ్చి నా శరీరమును అంతా నిమిరి, నా శిరమును ఆఘ్రాణించు తండ్రిగారు కనపడనప్పుడే అనుకున్నాను. ఇలాంటిది ఏదో జరిగి ఉంటుందని. నా తండ్రిగారి చేతి స్పర్శ అనుభవించు భాగ్యము ఈ జన్మకు లేదు కదా!
అమ్మా తండ్రి గారి తరువాత తండ్రి అంతటివాడు రాముడు. ఆయన నాకు అన్నగారే కాదు, తల్లి, తండ్రి, గురువు, దైవము. రామునికి నా రాక గురించి తెలపండి. నా తండ్రికి బదులు నా అన్నగారి పాదాలు పట్టుకొని ఆశీర్వాదము తీసుకుంటాను. రాముడు నన్ను ఆశీర్వదిస్తే నా తండ్రి ఆశీర్వదించినట్టే! అమ్మా! తండ్రిగారి మరణసమయములో నేను దగ్గర లేను కదా! నాతో చెప్పమని ఏమైనా చెప్పాడా అమ్మా! చెప్పమ్మా! నా తండ్రి గారి మాటలు యధాతథంగా చెప్పమ్మా!” అని కైకను ప్రార్థించాడు భరతుడు.
కైక జరిగింది చెప్పసాగింది. “కుమారా! నీ తండ్రి దశరథ మహారాజు తన ఆఖరి ఘడియలలో హా రామా! హా లక్ష్మణా! హా సీతా! అని వారిని తల్చుకుంటూ ప్రాణాలు వదిలాడు. ఇంకా ఇలా అన్నాడు. “రాముడు సీతతో లక్ష్మణునితో అయోధ్యకు తిరిగి వచ్చినపుడు చూచిన వారు ధన్యులు కదా!” అని అన్నాడు.
భరతునికి అనుమానం కలిగింది. “అమ్మా! రాముడు, లక్ష్మణుడు, సీత ఎక్కడకు వెళ్లారు. ఎందుకు వెళ్లారు? ఎప్పుడు వస్తారు.” అని అడిగాడు భరతుడు. తాను చెప్పబోవు సంగతులు భరతునికి సంతోషము కలిగిస్తాయి అనే భ్రమలో జరిగింది జరిగినట్టు చెప్పసాగింది కైక.
“కుమారా భరతా! నీ అన్న రాముడు నార చీరలు ధరించి భార్యాసమేతుడై, లక్ష్మణుని వెంటదీసుకొని అరణ్యములకు వెళ్లాడు.” అని చెప్పింది. భరతుడు ఆశ్చర్యపోయాడు. ధర్మము తప్ప మరొకటి తెలియని రాముడు ఏ తప్పుచేసాడని రాజ్యము నుండి వెడలి పోయాడు అని ఆలోచించాడు. తల్లి కైకను ఇలా అడిగాడు.
“అమ్మా! రాముడు ఏమి తప్పు చేసాడని రాజ్యమునుండి వెడలగొట్టబడ్డాడు. రాముడు బ్రాహ్మణుల సొత్తును దొంగిలించాడా! రాముడు ఎవరి నైనా నిరపరాధిని దండించాడా! లేక రాముడు ఇతర స్త్రీలను, ఇతరుల భార్యలను కామవాంఛతో కోరుకున్నాడా. లేక ఏమైనా భ్రూణ హత్య లాంటిది చేసాడా! రాముడు ఏ అపరాధమూ చెయ్యకుండా రాజ్యమునుండి ఎందుకు అరణ్యములకు పంపబడ్డాడు.” అని నిలదీసాడు భరతుడు. ఇంక చెప్పక తప్పదని అసలు విషయాన్ని చెప్పసాగింది కైక. “రాకుమారా! రాముడు నీవు చెప్పిన ఏ పాపమూ చెయ్యలేదు. నీ తండ్రి దశరథుడు రామునికి పట్టాభిషేకము చేయుటకు ముహూర్తము నిశ్చయించాడు. ఆ విషయమును విన్న నేను ఆందోళనపడ్డాను. వెంటనే నీ తండ్రి వద్దకు పోయి, నీకు యౌవరాజ్యము పట్టాభిషేకము చేయమనీ, రాముని పదునాలుగేళ్లు అరణ్యములకు పంపమని కోరాను. నీ తండ్రి నాకు ఇదివరలో ఇచ్చిన వరములను సఫలము చేయుటకు రాముని అరణ్యములకు పంపాడు. రాముని వెంట సీత, లక్ష్మణుడు కూడా వెళ్లారు. రాముడు అరణ్యములకు పోవడంతో నీ తండ్రి దిగులుతో రాముని ఇంక చూడలేనేమోనని చింతతో మరణించాడు.
నాయనా భరతా! ఇదంతా నేను నీ కోసమే, నీ మేలు కోరి, నీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేసాను. కాబట్టి వెంటనే నీవు రాజ్యాభిషిక్తుడివికా! ఈ తల్లి కోర్కె నెరవేర్చు. నీ తండ్రి మాట ప్రకారము రాముడు అడవులకు వెళ్లాడు. నా మాట ప్రకారము నీవు పట్టాభిషిక్తుడివి కా! కాబోయే మహారాజువు. నీవు దిగులు పడకూడదు. ధైర్యంగా ఉండు. ఇప్పుడు నీకు దాయాదుల బాధ లేదు. నీ ఇష్టం వచ్చినట్టు అయోధ్యను పాలించు. నీవు వెంటనే వసిష్ఠుని కలిసి, నీ తండ్రికి శాస్త్రోక్తంగా అంత్య క్రియలు నిర్వర్తించి, తరువాత రాజ్యాభిషిక్తుడివి కా! అని పలికింది కైక.