మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండంలో మూడవ సర్గంలో, రాజ్యాభిషేకం సంబంధించిన వివరాలు వివరించబడుతున్నాయి. రాజు దశరథుడు అయోధ్యలో రాజ్యాభిషేకం చేసుకున్నాడు మరియు అది ఎలా జరిగిందో చెప్పబడుతుంది. అయోధ్యలో ఉన్నవారు విచారించి, సంతోషపడుతున్నారు. రాజరాజు దశరథుడు రాజాభిషేకం కొన్ని అద్భుత సమాచారాలతో ప్రారంభించారు. అయోధ్య నగరం సంపూర్ణం ఉల్లాసంగా అభివృద్ధి చేసుకుంది.
తనకు నారద మహర్షి చెప్పిన రామ కధ సమగ్రమైనదా లేక ఇంకా అధికంగా ఏమైనా ఉన్నదా అని వాల్మీకి మహర్షి ఆలోచిం చాడు. తరువాత వాల్మీకి మహర్షి ఆచమనం చేసాడు. తూర్పు దిక్కుగా ముఖం పెట్టి ధర్భాసనం మీద కూర్చున్నాడు. శ్రీరాముడిని మనసులో ధ్యానించాడు. నమస్కరించాడు. తన తపోబలంతో ఆలోచించాడు.
దశరథుడు, శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఏమేమి చేసారో, ఏమేమి మనసులో అనుకున్నారో, ఆలోచించారో, రాముడు సీత ఏకాంతంగా ఉన్నప్పుడు ఏమేమి చేసారో, ఏమేమి మాట్లాడుకున్నారో, ఎలా నవ్వుకున్నారో, ఏ ఏ దారుల వెంట నడిచారో, ఎక్కడెక్కడ నివసించారో, రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురూ అడవులలో ఎక్కడెక్కడ తిరిగారో ఎక్కడెక్కడ నివసించారో, ఆ విషయముల నన్నింటినీ ఆమూలాగ్రంగా, యధాతథంగా తన యోగదృష్టితో చూచాడు వాల్మీకి. అన్ని విషయములను స్పష్టంగా తెలుసుకున్నాడు.
మహాతపస్వి అయిన వాల్మీకికి రామ చరిత్ర అంతా కరతలామలకము అంటే చేతిలో ఉసిరిక కాయ మాదిరి స్పష్టంగా కనపడింది. ఆ ప్రకారంగా మహా తపస్వి అయిన వాల్మీకి రామ చరిత్రను దర్శించిన తరువాత, తాను చూచినది చూచినట్టు, నాలుగు పురుషార్థములు అయిన ధర్మార్థకామ మోక్షములలో, ధర్మము ఎక్కువ ప్రకాశించేటట్టు, మిగిలిన పురుషార్థములు కూడా కూడి ఉండే టట్టు, నారదుడు చెప్పిన విషయములు అన్నీ పొందుపరిచి, అందరికీ వినడానికి మనోహరంగా ఉండేటట్టు, రఘువంశ చరిత్ర అయిన రామాయణ మహా కావ్యమును రచించాడు.
ఆ రామాయణ మహా కావ్యములో రాముని జననము, ఆయన ధర్మనిరతి, పరాక్రమము, ఓర్పు గుణము, రాముని సౌందర్యము సత్యశీలత అన్నీ మధురంగా వర్ణించాడు వాల్మీకి. రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో అడవులలో వెళుతున్నప్పుడు చెప్పిన అనేక కధలు, గాధలు, శివధనుర్భంగము, సీతా స్వయంవరము మనోహరంగా కళ్లకు కట్టినట్టు రచించాడు. తరువాత పరశురామునితో రాముని వాగ్వివాదము, రాముని యౌవరాజ్య పట్టాభిషేక సన్నాహములు, కైకేయి వరములు కోరడం, రాముడు వనములకు పోవడం, దశరధుని నిర్మాణము, రాముడు అడవులకు పోతుంటే అయోధ్య ప్రజలు దు:ఖించడం, రాముడు వారిని ఓదార్చి పంపివేయడం;
గంగానదిని దాటడం, గుహునితో రాముడు మాట్లాడటం, తన సారధి అయిన సుమంతుని రథము తీసుకొని వెనుకకు మరలు మనడం, సీతారామ లక్ష్మణులు భరద్వాజ ఆశ్రమం చేరుకోడం, ఆయన ఆదేశాను సారం చిత్రకూటమునకు వెళ్లడం, చిత్రకూటములో పర్ణశాల నిర్మించుకొని ఉండటం, ఇంతలో భరతుడు వచ్చి రాముని తిరిగి రాజ్యము స్వీకరించమని ప్రార్థించడం, రాముడు నిరాకరించడం,
రాముడు తన తండ్రి మరణ వార్త విని దు:ఖించడం, తండ్రికి అంత్యక్రియలు జరిపించడం, తనపాదుకలను భరతునికి ఇవ్వడం, భరతుడు రాముని పాదుకలను తీసుకొని వెళ్లి నంది గ్రామములో నివసించడం, అక్కడే రామ పాదుకలకు పట్టాభిషేకం చేసి రాముని బదులు తాను రాజ్యపాలన సాగించడం,
తరువాత సీతారామలక్ష్మణులు దండకారణ్యము వెళ్లడం, అక్కడ విరాధుడు మొదలగు రాక్షసులను వధించడం, శరభంగుడు, సుతీక్షుడు మొదలగు మహాఋషుల దర్శనం చేసుకోవడం, సీత అనసూయ తో మాట్లాడటం, అనసూయ సీతకు ఒంటికి పూసుకొనే లేపనము ఇవ్వడం, తరువాత రామలక్ష్మణులు శూర్పణఖను చూడటం, ఆమెను విరూపిగా చెయ్యడం, ఖరుడు మొదలగురాక్షసులను సంహరించడం.
ఈ విషయాలన్నీ రావణునికి తెలియడం, రావణుడు మారీచుని సాయంకోరడం, మారీచుడు నిరాకరించడం, తుదకు ఆంగీక రించడం, రాముడు మారీచుని చంపడం, రావణుడు పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను అపహరించడం, రాముడు సీత కోసరం శోకించడం, కబంధుని చూడటం, పంపాసరస్సువద్దకు వెళ్లడం, శబరిని కలుసుకోవడం, అక్కడనుండి ఋష్యమూక పర్వత ప్రాంతమునకు వెళ్లడం, హనుమంతుడు రాముని కలవడం,
రామ సుగ్రీవుల మైత్రి, వాలి సుగ్రీవుల యుద్ధము, వాలి వధ, వాలి కోసరం తార విలపించడం, రాముడు సుగ్రీవునకు కిష్కింధా రాజ్యము ఇవ్వడం, సీతను వెదకడానికి సాయం చేస్తానని సుగ్రీవుడు అంగీకరించడం, కాని సుగ్రీవుడు మాట తప్పడంతో రామునికి కోపం రావడం, అది తెలిసి సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకు సీతను వెదకడానికి పంపడం, సుగ్రీవుడు భారతదేశమును గురించి వానరులకు వర్ణించడం, రాముడు హనుమంతునికి తన ఆనవాలుగా ఉంగరము ఇవ్వడం.
హనుమంతుడు సాగరమును లంఘించడం, మధ్యలో మైనాకుని చూడటం, సింహికను చంపడం, లంకా నగరము దగ్గర ఉన్న పర్వతమును చూడటం, రాత్రియందు హనుమంతుడు లంకానగరము ప్రవేశించడం, సీతను వెదుకుతూ పుష్పక విమానములో ప్రవేశించడం, రావణుని అంతఃపుర దర్శనం, తరువాత హనుమంతుడు అశోక వనములో ఉన్న సీతను చూడటం, ఆమెకు ఆనవాలుగా రాముడు ఇచ్చిన ఉంగరము ఇవ్వడం, సీతను రాక్షస స్త్రీలు భయపెట్టడం, త్రిజటకు వచ్చిన స్వప్నవృత్తాంతము, హనుమంతుడు రాక్షస స్త్రీలను భయపెట్టడం, అశోక వనమును నాశనం చెయ్యడం, ఇంద్రజిత్తుకు పట్టుబడటం, లంకాదహనము,
హనుమంతుడు సముద్రమును దాటి కిష్కింధకు రావడం, దారిలో మధువనమును నాశనం చేయడం, రామునికి సీతను చూచాను అనిచెప్పడం, సీత ఇచ్చిన చూడామణిని ఆనవాలుగా సమర్పించడం, రాముడు సుగ్రీవుడు వానర సేనతో సముద్రము వద్దకు చేరుకోవడం, నీలుని సాయంతో సేతువును నిర్మించడం, లంకా నగరం చేరుకోవడం,
లంకానగర ముట్టడి, రావణుని తమ్ముడు విభీషణునితో మైత్రి, విభీషణుడు రావణుని ఎలా వధించాలో చెప్పడం, యుద్ధములో కుంభకర్ణుడు, మేఘనాధుడు మరణించడం, రామరావణ యుద్ధము, రావణ వధ, సీతను స్వీకరిం చడం, విభీషణుని లంకకు పట్టాభిషిక్తుని చేయడం, సీతా సమేతుడై రాముడు పుష్పకవిమానములో అయోధ్యకు తిరిగి రావడం, రామ పట్టాభిషేకము, వానర సైన్యమును వారి వారి స్థావరములకు పంపివేయడం, రామరాజ్యవర్ణన, లోకాప నిందకు వెరిచి తిరిగి సీతను అడవులలో వదిలిపెట్టడం వరకూ వాల్మీకి రామాయణ మహాకావ్యంలో రచించాడు. తరువాత జరుగబోవు విషయములను వాల్మీకి ఉత్తర కావ్యములో రచించాడు.
ఇది వాల్మీకి విరచిత
శ్రీమద్రామాయణ మహాకావ్యములో
బాలకాండలో మూడవ సర్గ సంపూర్ణము.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ రామాయణ కావ్యంలో రెండవ విభాగము. ఇందులో 119 సర్గలు ఉన్నాయి. ఈ ప్రథమః సర్గఃలో రాముని గుణగణాలను, అయోధ్యలోని ప్రజల ఆనందం మరియు భవిష్యత్తులో రాముడు రాజ్యభిషేకం పొందబోతున్నదని ప్రజల ఆశలను వివరిస్తుంది. దశరథ మహారాజు తన పెద్ద కుమారుడైన రాముని యువరాజుగా అభిషేకించాలనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడు.
స లబ్ధమానైర్వినయాన్వితైర్నృపైః
పురాలయైర్జానపదైశ్చ మానవైః |
ఉపోపవిష్టైర్నృపతిర్వృతో బభౌ
సహస్రచక్షుర్భగవానివామరైః ||
51
Ayodhya Kanda Sarga 1 Meaning In Telugu
భరతుడు తన మేమతో కూడా తాత గారి ఇంటికి వెళ్లాడు. తనతో కూడా శత్రుఘ్నుని తీసుకొని వెళ్లాడు. భరత శత్రుఘ్నులు మేనమామ ఇంట్లో సుఖసంతోషాలతో ఉన్నప్పటికీ, అయోధ్యలో ఉన్న తల్లి తండ్రు లను మరిచిపోలేదు. ప్రతిరోజూ తమ తల్లి తండ్రులను మనసారా తల్చుకుంటూ ఉన్నారు.
అదే ప్రకారంగా దశరథుడు కూడా తన కుమారులు భరత శత్రుఘ్నులు ఏం చేస్తున్నారో ఏమో అని ప్రతి రోజూ తల్చుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే దశరథునికి తన నలుగురు కుమారులను సమానంగా ప్రేమించాడు, ఆదరించాడు. అందుకనీ భరత శత్రుఘ్నులు తన ఎదుట లేకపోయినా అనుదినమూ వారిని తల్చుకుంటూ ఉండేవాడు.
కాని తన నలుగురు కుమారులలోనూ పెద్ద కుమారుడు రాముడు అంటే దశరథునకు ప్రేమాభిమానాలు కొంచెం ఎక్కువగా ఉండేవి. కౌసల్యకు కూడా రాముడు అంటే పంచప్రాణాలు. రాముని విడిచి ఒక్క నిముషం కూడా ఉండేది కాదు. ఇంక రాముడు కూడా అందుకు తగ్గట్టుగానే ఉండేవాడు.
రాముడు మంచి రూపవంతుడు. శౌర్యవంతుడు. పైగా దశరథుని కుమారుడు. రాముడు ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనస్సుతో ఉండేవాడు. అందరితో మృదువుగా మాట్లాడేవాడు. తనతో ఎవరైనా కటువుగా మాట్లాడినా మౌనంగా ఉండేవాడే కాని వారితో పరుషంగా మాట్లాడేవాడు కాదు.
రాముడు అల్ప సంతోషి. ఎవరైనా తనకు చిన్న ఉపకారము చేసినా అమితంగా సంతోషించేవాడు. తనకు ఎవరు ఎన్ని అపకార ములు చేసినా వాటిని మనసులో పెట్టుకొనే వాడు కాదు. రాముడు అస్త్రవిద్య శస్త్ర విద్యలు సాధన చేసేవాడు. తీరిక సమయములలో వయోవృద్ధులు జ్ఞానవృద్ధుల వద్దకు పోయి మంచి విషయములు నేర్చుకొనే వాడు. అంతేగాని వినోద విలాసములతో సమయమును వృధాచేసేవాడు కాదు.
రాముడు అందరితోనూ చాలా కలుపుగోలుగా ఉండేవాడు. ముందు తనే అందరినీ పలుకరించి వారి యోగక్షేమములు అడిగి తెలుసుకొనేవాడు. తాను అమితమైన పరాక్రమ వంతుడైనను కొంచెం కూడా గర్వము లేకుండా అందరితో కలిసిపోయేవాడు.
రాముడికి ఉన్న మరొక మంచి లక్షణము రాముడు ఎన్నడూ అసత్యము పలికేవాడు కాదు. బ్రాహ్మణులను, పెద్దలను గౌరవించే వాడు. ప్రజలు తనను ఏ ప్రకారం గౌరవిస్తారో అదే ప్రకారము రాముడు కూడా శ్రీ గౌరవించేవాడు. రాముడికి కోపం అంటే ఏమిటో తెలియదు. అందరి మీద దయకలిగి ఉండేవాడు. దీనులను చూచి జాలిపడేవాడు. తోచిన సహాయము చేసేవాడు.
రాముడు ధర్మపరుడు. సకల ధర్మములను తెలిసినవాడు. కానీ ఏమీ తెలియనట్టు ఉండేవాడు. తనకు అన్నీ తెలుసు అని గర్వించేవాడు కాదు. రాముడు మచ్చలేని మానవుడు. ఇంద్రియము లను అదుపులో ఉంచుకొని ప్రవర్తించేవాడు. రాముడు క్షత్రియుడు. అందుకని తన స్వధర్మము అయిన క్షత్రియ ధర్మమును ఆచరించే వాడు. రాముడు తనకు కానీ, ఇతరులకు కానీ కీడు చేసే కార్యముల యందు ఏమాత్రం ఆసక్తి చూపేవాడు కాదు. ధర్మవిరుద్ధంగా ఏ పనీ చేసేవాడు కాదు. ఎదుటి వారి ఆంతర్యమును గ్రహించి తగు విధంగా నేర్పుగా మాట్లాడేవాడు.
రాముడు తన ఆరోగ్యమును చక్కగ కాపాడుకొనేవాడు. ఎలాంటి దురలవాట్లకు లోనయ్యేవాడు కాదు. ఏ కాలములో ఎలా ఉండాలో, ఏ పని చెయ్యాలో తెలుసుకొని అలా ఉండేవాడు, ఆ పనులే చేసేవాడు. సాటివారలలో సాధువర్తనుడు అని పేరుతెచ్చుకున్నాడు. అంతేకాదు అయోధ్యపుర ప్రజలలో కూడా రాముడు సాధు వర్తనుడు అని పేరు తెచ్చుకున్నాడు.
అటువంటి రాముడు విద్యాభ్యాసము పూర్తి చేసు కున్నాడు. వేద వేదాంగములలో ప్రావీణ్యము సంపాదించాడు. ధనుర్విద్యలో తండ్రి దశరథుని మించిపోయాడు. తాను జన్మించిన ఇక్ష్వాకు వంశమునకు తన సద్గుణములతో వన్నె తెచ్చే వాడయ్యాడు. పురుషార్థములైన ధర్మము, అర్థము, కామము, మోక్షము వీటి గురించి న తత్త్వమును బాగా ఆకళింపు చేసుకొని తదనుగుణంగా నడుచుకొనేవాడు. క్షత్రియోచితములైన ఆచార వ్యవహారములను చక్కగా అనుసరించేవాడు.
రాముడు తనలోని ఆలోచనలను పైకి కనపడనీయడు. పైకి నవ్వుతూనే ఉండేవాడు. మనసులోని భావములను ముఖంలో కనపడనిచ్చేవాడు కాదు. అనవసరంగా కోపగించుకోడం, సంతోషంతో పొంగిపోవడం చేసేవాడు కాదు. ఎల్లప్పుడూ సౌమ్యంగా ఒకే విధంగా ఉండేవాడు. ఏ విషయంలోనూ మొండిగా పట్టుబట్టడం మొండిగా వాదించడం చేసేవాడు కాదు. స్థిరమైన బుద్ధికలవాడు.
ఏ పరిస్థితులతో కూడా మనస్సును చలింపనీయడు రాముడు. రామునికి సోమరి తనము అంటే తెలియదు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడు. ఎదుటి వారిలో ఉన్న తప్పులు పట్టేముందు తనలో ఉన్న తప్పులు తెలుసుకొని వాటిని సరిదిద్దు కొనేవాడు. ఎవరైనా తనకు చిన్న మేలు చేసినా దానిని గుర్తు పెట్టుకొని తగిన సమయ ములో ప్రత్యుపకారము చేసేవాడు.
రాముడు న్యాయశాస్త్రములో కూడా ప్రావీణ్యము సంపాదించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో అత్యంత నేర్పును ప్రదర్శించేవాడు. రాముడు రాజ్యపాలనలలో కూడా నిష్ణాతుడు. మంచి వారిని చేరదీసి ఆదరించేవాడు. దుర్మార్గులను దగ్గరకు చేరనిచ్చేవాడు. కాదు. రాజ్యపాలన కు కావలసిన ధనమును నేర్పుగా ప్రజలనుండి రాబట్టేవాడు. ఆ ధనమును వ్యయం చేయడంలోకూడా సంయమనం పాటించేవాడు. అనవసరమైన ఖర్చులను నివారించేవాడు.
రాముడు వేద వేదాంగములనే కాదు, ఇంకా ఇతరత్రా ఉన్న శాస్త్రములను కూడా బాగా అధ్యయనం చేసాడు. అన్నింటిలోనూ ప్రావీణ్యం సంపాదించాడు. తగు మాత్రంగా సుఖములను అనుభవించేవాడు. సుఖములను అనుభవించేటప్పుడు కూడా ఎంతో జాగరూకతతో ఉండేవాడు. రాముడు సంగీత నృత్యములలో కూడా ప్రవేశము ఉన్నవాడు.
పైన చెప్పిన లక్షణములను బట్టి, రాముడు సాత్వికుడు భోగలాలసుడు అనుకుంటే పొరపాటే. ఆయనకు యుద్ధరీతులు అన్ని కూడా బాగా తెలుసు. గుర్రములను ఏనుగులను లొంగదీసుకొని మచ్చిక చేసుకొనేవాడు. ధనుర్విద్యలో ప్రావీణ్యము సంపాదించాడు. శత్రువుల ఎడల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించేవాడు. యుద్ధములో దేవతలు, రాక్షసులు ఎదురైనా జంకేవాడు కాదు. ధైర్యంతో ఎదిరించి గెలిచే సామర్థ్యము ఉన్నవాడు. అనిచెప్పి అందరి మీదా అనవసరంగా యుద్ధానికి కాలుదువ్వేవాడు కాదు.
రాముడు ఎవరిమీద కోపగించుకోడు. అవసరం అయినప్పుడు కోపం తెచ్చు కుంటాడు. అవసరం తీరగానే ఆ కోపాన్ని వదిలేస్తాడు. ఇన్ని సుగుణ ములు ఉన్నవాడు కాబట్టే రాముడు మూడులోకములలో కీర్తింప బడ్డాడు. రాముడు తన సుగుణములతో సూర్యుని వలె ప్రకాశించే వాడు.
ఇటువంటి సకలసద్గుణసంపన్నుడైన రాముడు తమకు రాజు కావాలని అయోధ్యా ప్రజలు కోరుకొనేవారు. ఇదే ఆలోచన దశరథునికి కూడా వచ్చింది. “తన జీవిత కాలంలో రాముడు రాజు అవుతాడా! రాముని రాజుగా నేను చూడగలనా!” అని అనుకున్నాడు. రాముడికి రాజు కాదగ్గ లక్షణములు ఉన్నాయా అని ఆలోచించాడు.
అయోధ్యావాసులందరూ రాముడు రాజు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే రాముడు ఎల్లప్పుడూ ప్రజల యొక్క వృద్ధిని కోరుకొనే వాడు. అయోధ్యా ప్రజలకు దశరథుని కంటే కూడా రాముడు అంటేనే ఎక్కువ గౌరవము అభిమానము. రాముడు బల పరాక్రమములలో యమునితోనూ ఇంద్రునితోనూ సమానమైనవాడు. బుద్ధిలో బృహస్పతి వంటి వాడు. ధైర్యములో మేరుపర్వతము వంటి వాడు. ఒక రాజుకు ఉండవలసిన మంచి లక్షణములు అన్నీ రామునికి ఉన్నాయి.
ఆ ఆలోచన వచ్చిందే తడవుగా దశరథుడు తనమంత్రులను పిలిపించాడు. వారితో ఆలోచించాడు. “అమాత్యులారా! నేను పెద్దవాడిని అయ్యాను. వయసు మీద పడింది. ఇంక రాజ్యపాలన చేయలేను. అయోధ్యప్రజలందరూ రాముడు రాజు కావాలని కోరుకుంటున్నారు. రాముడు రాజు అవడం అందరికీ సమ్మతమే. రాముడు రాజు అయితే నేను కూడా నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటాను. దీనికి మీరంతా అనుమతిస్తారని ఆశిస్తున్నాను.” అని అన్నాడు.
మంత్రులంతా దశరథుని మాటలకు సంతోషంగా తమ ఆమోదము తెలిపారు. వారి అనుమతితో రాముని యువరాజును చేయడానికి నిశ్చయించాడు దశరథుడు. తరువాత దశరథుడు సభను ఏర్పాటు చేసాడు. సామంత రాజులను, పురప్రముఖులను, అధికారులను, ఉద్యోగులను సభకు ఆహ్వానించాడు..
ఇన్ని చేసాడు కానీ కేకయ దేశంలో ఉన్న భరతునికి, శత్రుఘ్నునికి ఈ విషయం తెలియజేయలేదు. తరువాత వారే తెలుసుకుంటారులే అని నిర్లక్ష్యం చేసాడు.
(అలా కాకుండా భరతుని, శత్రుఘ్నుని పిలిపించి వారితో కూడా చెప్పి వారి సమ్మతి కూడా తీసుకొని ఉంటే రామాయణ మహాకావ్యము ఇంతటితో ఆగిపోయి ఉండేదేమో!)
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ ద్వితీయ సర్గలో, వాల్మీకి మహర్షి తన శిష్యుడు భారద్వాజుతో కలిసి ఆశ్రమంలో నివసిస్తున్నారు. ఒక రోజు, నారద ముని అక్కడికి వస్తారు. వాల్మీకి మహర్షి నారదునికి పాదాభివందనం చేసి, అతన్ని సన్మానించి, రాముడి మహిమలను వర్ణించమని కోరుతారు. వాల్మీకి మహర్షి రాముడి విశేషాలను తెలుసుకోవాలని అడుగుతారు – ధర్మవంతుడు, ధైర్యవంతుడు, వాక్కును నిలబెట్టేవాడు, ప్రజలకు ప్రీతిపాత్రుడు వంటి లక్షణాలను కలవాడు ఎవరో చెప్పమని.
నారదుడు చెప్పిన సంక్షిప్త రామాయణమును విని వాల్మీకి
మహర్షి, మరియు ఆయన శిష్యులు నారదుని ఎంతో భక్తితో పూజించారు. తరువాత నారదుడు దేవలోకము వెళ్లిపోయాడు.
తరువాత వాల్మీకి మహర్షి తమసానదీ తీరమునకు వెళ్లాడు. ఏ మాత్రం మలినము లేని ఒక రేవు వద్దకు వెళ్లాడు. తన శిష్యుని తనకు కావలసిన పాత్ర, నార బట్టలు తెమ్మన్నాడు వాల్మీకి. ఆ రేవులో స్నానం చేయడానికి సంకల్పించాడు. ఆ ప్రకారంగా శిష్యుడు వాల్మీకికి చెంబు, నార బట్టలు ఇచ్చాడు. వాటిని తీసుకొని వాల్మీకి ఆ వనమంతా ఒక సారి కలయ చూచాడు.
కొంచెం దూరంలో ఒక చెట్టు మీద నిర్భయంగా విహరిస్తున్న క్రౌంచ పక్షుల జంటను చూచాడు. అంతలో ఒక బోయవాడు ఆ క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని తన బాణముతో నిర్దయగా కొట్టి చంపాడు. ఆమగపక్షి రక్తం కారుతూ కింద పడిపోయింది. కింద పడిపోయిన మగపక్షిని చూచి ఆడ పక్షి ఎంతో దుఃఖించింది. కింద పడ్డ మగపక్షి చుట్టూ తిరుగుతూ దీనంగా ఏడుస్తూ ఉంది.
ఏడుస్తున్న ఆ ఆడ పక్షిని చూచాడు వాల్మీకి. ఆయన మనస్సు ద్రవించిపోయింది. వాల్మీకి ఆ బోయవానిని చూచి ఇలా అన్నాడు.
మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమ: శాశ్వతీ: సమా: |
యత్ క్రౌఞ్యమిథునాదేకమవధీ: కామమోహితమ్||
“ఓయీ బోయవాడా! నీవు మన్మధావస్థలో ఉన్న పక్షుల జంటలో ఒక దానిని చంపావు. కాబట్టి నీవు కూడా అల్పాయుష్కుడవు అవుదువు కాక!” అనే వాక్యము వాల్మీకి నోటి వెంటవచ్చింది.
అంతలో తనలో తాను ఇలా అనుకున్నాడు. “ఇదేమిటి! నేను ఈ పక్షుల జంటను చూచి ఇలా అనుకోవడం ఏమిటి! నానోటి నుండి ఇటువంటి వచనములు రావడం ఏమిటి!” అని అనుకున్నాడు. వెంటనే తన శిష్యుని పిలిచి ఇలా అన్నాడు. “ఆ క్రౌంచపక్షులలో ఒక దానిని బోయవాడు చంపగా, దానిని చూచి నేను చలించిపోయి పాదబద్ధంగా ఒక వాక్యము చెప్పాను. అది వృధా కారాదు. అది శ్లోకముగా ప్రసిద్ధి చెందుతుంది.” అని పలికాడు వాల్మీకి.
శిష్యుడు వెంటనే ఆ శ్లోకమును కంఠస్థము చేసాడు. తరువాత వాల్మీకి స్నానము చేయడానికి వెళ్లాడు. స్నానము చేసిన తరువాత తన ఆశ్రమమునకు పోతూ ఆ శ్లోకమునే మననం చేసుకుంటున్నాడు. ఆయన వెంట భరద్వాజుడు అనే ఆయన శిష్యుడు వెంట వెళుతున్నాడు. వాల్మీకి ఆశ్రమమునకు పోయి తన నోటి వెంట వచ్చిన శ్లోకమును మననం చేసుకుంటూ ధ్యానములో కూర్చున్నాడు. ఆ ధ్యానములో ఆయనకు ఇతర వాక్యాలు కథలు స్ఫురించాయి.
ఆసమయంలో బ్రహ్మదేవుడు వాల్మీకిని చూడటానికి ఆయన ఆశ్రమమునకు వచ్చాడు. బ్రహ్మగారిని చూచి వాల్మీకి సంభ్రమంతో లేచి చేతులు జోడించి నిలబడ్డాడు. బ్రహ్మదేవునికి అర్ఘ్యము, పాద్యము సమర్పించాడు. ఉచితాసనము మీద కూర్చోపెట్టాడు. బ్రహ్మదేవుని ఆదేశము మేరకు తాను కూడా ఒక ఆసనము మీదకూర్చున్నాడు. వాల్మీకి మనసులో మాత్రము ఆ క్రౌంచపక్షుల జంట గురించి ఆలోచిస్తున్నాడు. “ఆ హా! అందముగా విహరిస్తున్న ఆ క్రౌంచ పక్షుల జంటలో ఒక దానిని ఆ క్రూరుడు నిర్దయగా కొట్టాడు కదా!” అని ఆలోచిస్తున్నాడు. వాల్మీకి మనస్సు దుఃఖంతో నిండి పోయింది. ఆప్రయత్నంగా ఆ వాక్యము ఆయన నోటి వెంట వచ్చింది.
ఆ వాక్యములను విన్నాడు బ్రహ్మ. ” ఓ వాల్మీకి మహర్షి! నీ నోట వెంట వచ్చిన వాక్యము శ్లోకమే. అందుకు సందేహము లేదు. ఇది నా సంకల్పమే. నా సంకల్పము వల్లనే నీ నోటి వెంట ఆ వాక్యము వెలువడింది. అది శ్లోకము అయింది. నీవు పుణ్యప్రదమును, మనస్సులను రమింపచేయునదియును అగు రాముని యొక్క చరితమును శ్లోకరూపంలో కావ్యంగా రచించు. రాముడు ధర్మాత్ముడు. గుణవంతుడు. బుద్ధిమంతుడు. రాముని కధను నీకు నారదుడు చెప్పాడు కదా. అదే కధను సవిస్తరముగా చెప్పు. రాముడు, సీత, లక్ష్మణుడు, రాక్షసులు మొదలగు వారి గురించి నీకు తెలిసిన విషయములూ, తెలియని విషయములూ అన్నీ ఇప్పుడు నీకు స్పష్టంగా గోచరమవుతాయి.
ఈ రామాయణ కావ్యములో నీవు రాసిన ఏ ఒక్కమాట కూడా అసత్యము కాదు. కాబట్టి నీవు రామ కధను శ్లోకరూపంలో రచించు. ఈ చరాచర జగత్తు ఉన్నంత వరకూ రామ చరిత్ర ఈ లోకంలో నిలిచి ఉంటుంది. నీ చే రచింప బడిన రామాయణ కావ్యము ఎంత కాలము ప్రచారంలో ఉంటుందో అంత కాలమూ నేను సృష్టించిన సమస్తలోకములలో నీవు నివసిస్తావు.” అని పలికాడు బ్రహ్మదేవుడు. తరువాత బ్రహ్మదేవుడు అంతర్థానమయ్యాడు.
ఇది అంతా విన్న వాల్మీకి మహర్షి శిష్యులు ఆశ్చర్యపోయారు. రామాయణ కావ్యమునకు మూలమైన ఆ శ్లోకమును మరలా మరలా స్మరించుకుంటున్నారు. ఒకరితో ఒకరు చెప్పుకుంటూ మననం చేసుకుంటున్నారు. నాలుగు పాదములతో, సమసంఖ్యగల అక్షరములతో, మహర్షి నోటి నుండి వచ్చిన ఆ శ్లోకము శిష్యులు మాటిమాటి కీ గానం చేయడం వలన శ్లోకత్వము పొందింది.
ఇదంతా గమనించిన వాల్మీకి మహర్షి “రామాయణ మహా కావ్యమును అంతా ఇదే విధంగా శ్లోకరూపంలో రచిస్తాను” అని నిశ్చయించుకున్నాడు. వాల్మీకి మహర్షి రామ చరితమును ఉదారమైన పదములతో, మనోహరములైన అక్షరములతో కూర్చిన వందలాది శ్లోకములలో రచించాడు. ఆ మహా కావ్యము సమాసములతోనూ, సంధులతోనూ, వ్యుత్పత్తులతోనూ, సుమధురములు, అర్థవంతములు అయిన వాక్యములతోనూ అలరారింది.
ఇది వాల్మీకి విరచిత
శ్రీమద్రామాయణ మహాకావ్యములో
బాలకాండలో రెండవ సర్గ సంపూర్ణము.
భారతీయ వాఙ్మయములో రామాయణము, దానిని సంస్కృతములో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. చాలా భారతీయ భాషలలోను, ప్రాంతాలలోను ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. భారతీయుల సంస్కృతి, సాహిత్యము, ఆలోచనా సరళి, సంప్రదాయాలలో రామాయణం ఎంతో ప్రభావం కలిగి ఉంది. రామాయణంలోని విభాగాలను ‘’కాండములు’’ అంటారు. ఒకో కాండము మరల కొన్ని సర్గలుగా విభజింపబడింది. వీటిలో అయోధ్యా కాండ రెండవ కాండము. ఇందులో 119 సర్గలు ఉన్నాయి. ఈ కాండములోని ప్రధాన కథాంశాలు: శ్రీరాముని పట్టాభిషేక సన్నాహాలు, కైకేయి కోరిక, దశరధుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము..
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. వాల్మీకి మహర్షి బాలకాండంలో రాముని జీవిత చరిత్రను అద్భుతమైన రీతిలో చూపించారు. రాముని బాల్య కథనం, ఆత్మవిశ్వాసం, సహజ సమానులు, భర్యలకు ప్రేమ మరియు సహాయకుల మధ్య వివిధ సమానాలను వర్ణించారు. రాజు దశరథుడు అయోధ్యలో రాజ్యం సంపాదించిన విషయంలో చిత్రీకరించారు. ఈ ప్రసంగంలో రాముని జన్మకు సంబంధించిన అనేక అద్భుత ఘటనలు చేరుకున్నాయి.
“ఓ నారద మహర్షీ! ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు, పరాక్ర మవంతుడు, ధర్మాత్ముడు, ఎదుటి వారి ఎడల ఆదర భావము కలవాడు, చేసినమేలు మరువని వాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు, గట్టి సంకల్పము కలవాడు, అనుకున్న పని నెరవేర్చే గుణము కలవాడు, ఈ సద్గుణములు కలవాడు ఎవరైనా ఉన్నారా!
అంతేకాదు, మంచి నడవడి కలవాడు, సర్వభూతములయందు ప్రీతి కలవాడు, అన్ని విద్యలు నేర్చినవాడు, తనకు అసాధ్యము అంటూ లేదు అని నిరూపించినవాడు, ఎల్లప్పుడూ ఆనందంతో తొణికిస లాడేవాడు, అటువంటి వ్యక్తి ఎవరున్నారు?
ఓ మహర్షీ! మొక్కవోని ధైర్యము కలవాడు, కోపము అంటే ఎరుగని వాడు, మంచి తేజస్సుతో విరాజిల్లేవాడు, అసూయ, ద్వేషములను దగ్గరకు రానీయని వాడు, యుద్దరంగంలో దిగితే దేవతలకు కూడా భయపడని వాడు,. ఇటువంటి సద్గుణములు కల నరుడిని (మానవుడిని) గురించి వినవలెనని నాకు చాలా కుతూహలముగా ఉంది.
దయచేసి నాకు వివరించండి. ఎందుకంటే నీవు ముల్లోకములు సంచరిస్తూ ఉంటావు. అందువలన నీకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి లోకోత్తర పురుషుడిని గురించి నాకు తెలియజేయండి.” అని వాల్మీకి మహర్షి నారదుని అడిగాడు.
అప్పుడు నారదుడు వాల్మీకితో ఇలా అన్నాడు. “ ఓ మహర్షీ! నీవు చెప్పిన గుణములు సామాన్య మానవులలో సాధారణంగా కనిపించవు. ఎందుకంటే అవి అసాధారణము లైన దుర్లభములైన గుణములు. కాని అట్టి గుణములు కలిగిన ఒక మహాపురుషుడు ఉన్నాడు. ఆయన గురించి చెబుతాను. విను.
ఈ భూమండలంలో ఇక్ష్వాకు వంశము ప్రసిద్ధి చెందింది. ఆ వంశములో రాముడు అనే పేరు గల ఒక మహా పురుషుడు జన్మించాడు. ఆ రాముడు జనుల అందరి చేత కీర్తింపబడ్డాడు. ఆ రాముడు స్థిరమైన బుద్ధి కలవాడు. మహావీరుడు. మంచి ప్రకాశము కలవాడు. అసాధారణమైన ధైర్యము కలవాడు.
అంతేకాదు ఆ రాముడు బుద్ధిమంతుడు. నీతిమంతుడు. సకల శాస్త్ర పారంగతుడు. శ్రీమంతుడు. రాముడు శత్రు భయంకరుడు. ఆజానుబాహుడు. స్ఫురద్రూపి. అందగాడు. విశాలమైన వక్షస్థలము కలవాడు. రాముని ధనుస్సు చాలా గొప్పది. శత్రువులను నాశనం చేస్తుంది. రాముడు అంత పొట్టి కాదు, అని చెప్పి మరీ పొడుగు కాదు. రామునికి అన్ని అవయవములు సమపాళ్లలో ఉన్నాయి. సకల శుభ లక్షణ సమన్వితుడు రాముడు.
రాముడు సకల ధర్మములు తెలిసిన వాడు. సత్యమునే పలికెడు వాడు. ఎల్లప్పుడూ ప్రజల హితమును కోరేవాడు. మంచి యశస్వి. జ్ఞాన సంపన్నుడు. ఎల్లప్పుడూ శుచిగా ఉంటాడు. శరణు కోరిన వారిని రక్షించేవాడు. ఆ రాముడు ప్రజాపతితో సమానమైన వాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ పట్ల ఆసక్తి కలవాడు. ధర్మాన్ని ఎల్లప్పుడూ పరిరక్షించేవాడు.
రాముడు తనను తాను రక్షించుకుంటూ, తన వారిని కూడా రక్షించేవాడు. రాముడు వేదములు వేదాంగములు చదివిన వాడు. ధనుర్వేదములో దిట్ట. రాముడు సకల శాస్త్రముల అర్థములను తెలిసిన వాడు. మంచి జ్ఞాపక శక్తి కలవాడు. మంచి ప్రతిభావంతుడు. సర్వలోక ప్రియుడు. సాధుజనుల యందు, దీనుల యందు దయగలవాడు. నదులన్నీ సముద్రము చేరినట్టే, సత్పురుషులందరూ రాముని వద్దకు చేరుతారు. రాముడు అందరినీ సమానంగా ఆదరిస్తాడు. రాముడు సముద్రము వలె గంభీరంగా ఉంటాడు. హిమాచలము వలె ధైర్యంగా నిలబడతాడు.
ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కౌసల్యకు పుత్రుడిగా జన్మించాడు. ఆ రాముడు పరాక్రమములో విష్ణువుతో సమానుడు. చంద్రుడిని చూస్తే ఎంత ఆనందకరంగా ఉంటుందో రాముని చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది. కాని రాముడు కోపం వస్తే ప్రళయాగ్నిస్వరూపుడు. ఇంకా రాముడు ఓర్పులో భూదేవిని, దానములో కుబేరుని, సత్యము పలుకుటలో ధర్మదేవతను మించినవాడు.
అటువంటి రామునికి తండ్రి దశరధుడు. దశరధుడు సకలగుణాభిరాముడైన రామునికి యౌవరాజ్య పట్టాభిషేకం చేయాలని సంకల్పించాడు. ఇది దశరధుని భార్య అయిన కైకకు నచ్చలేదు. ఆ సమయంలో ఆమె దశరధుని తనకు పూర్వము ఇస్తానన్న రెండు వరములు ఇమ్మని కోరింది. ఆ రెండు వరములలో ఒకటి రాముడిని రాజ్యము నుండి వెళ్లగొట్టడం, రెండవది తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం జరగడం. మాట తప్పని, తప్పలేని దశరధుడు రాముని వనవాసమునకు వెళ్లమని చెప్పాడు. తల్లితండ్రుల మాటలను శిరసావహించి, రాముడు రాజ్యము విడిచి అరణ్యములకు వెళ్లాడు.
రాముని తమ్ముడు లక్ష్మణుడు. అన్న రాముని విడిచి క్షణం కూడా ఉండలేడు. అందుకని లక్ష్మణుడు కూడా రాముని వెంట అరణ్యము లకు వెళ్లాడు. రాముని భార్య సీత. రామునికి ప్రాణసమాను రాలు. ఆమె జనక మహారాజు కుమార్తె. సర్వలక్షణ సంపన్న. నారీలోకములో ఉ త్తమురాలు. చంద్రుని అనుసరించి రోహిణి ఉన్నట్టుగా, రాముని విడిచి ఉండలేక, సీత కూడా రాముని వెంట అడవులకు వెళ్లింది.
రాముడు, లక్ష్మణుడు సీత అడవులకు వెళుతుంటే అయోధ్య ప్రజలు రామునితో పాటు గంగానది దాకా వచ్చారు. తరువాత రాముని ఆదేశము మేరకు అయోధ్యకు మరలిపోయారు. రాముడు, సీత, లక్ష్మణుడు ఆ రాత్రికి శృంగిభేరపురములో ఉన్న గుహుడు అనే నిషాదుడిని కలుసుకున్నారు. తరువాత రాముడు తన సారధిని రధమును వెనక్కు తీసుకొని వెళ్ల మని పంపివేసాడు.
మరునాడు వారు గంగానదిని దాటారు. ఒక వనమునుండి మరొక వనమునకుపోతూ, భారద్వాజమహర్షి ఆదేశము మేరకు చిత్రకూటము అను ప్రదేశమునకు చేరుకున్నారు. అక్కడ ఒక పర్ణశాలను నిర్మించుకున్నారు. అక్కడ ఏ చీకూ చింతా లేకుండా హాయిగా నివసిస్తున్నారు.
ఇక్కడ అయోధ్యలో ఉన్న దశరధుడు పుత్రవియోగము తట్టుకోలేక స్వర్గస్థుడయ్యాడు. దశరధుని మరణం తరువాత భరతుని రాజ్యాభిషిక్తుని కమ్మని వసిష్టుడు మొదలగు వారుకోరారు. కాని భరతుడు ఒప్పుకొన లేదు. రాముని ఆజ్ఞ కొరకు భరతుడు రాముడు ఉన్న చోటికి వెళ్లాడు. రామునికి తండ్రి మరణ వార్త తెలిపి, తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యము స్వీకరించమని కోరాడు.
ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడం తన ధర్మమని, రాజ్యపాలనకు ఒప్పుకొనలేదు. రాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు. తనకు బదులుగా సింహాసనము మీద వాటిని ఉంచమన్నాడు. తగు మాటలు చెప్పి భరతుని వెనక్కు పంపివేసాడు. భరతుడు రామ పాదుకలను భక్తితో స్వీకరించి, అయోధ్య వెలుపల ఉన్న నంది గ్రామమునకు వెళ్లాడు. అక్కడు రాముని పాదుకలను ఉంచాడు. రాముని ఆగమనమును కోరుకుంటూ అక్కడి నుండి రాజ్యపాలన సాగించాడు.
తరువాత రాముడు దండకారణ్యము ప్రవేశించాడు. అక్కడ నివసిస్తున్న విరాధుడు అనే రాక్షసుని చంపాడు. శరభంగ మహర్షిని, సుతీక్ష మహర్షిని, అగస్త్య మహర్షిని, ఆయన భ్రాతను సందర్శించాడు. ఆ ప్రకారంగా అరణ్యములో నివసించుచున్న రాముని అక్కడ ఉన్న మునులు చూడడానికి వచ్చారు. తమకు రాక్షస బాధ ఎక్కువగా ఉ న్నదని, ఆరాక్షసులను సంహరించి తమకు రక్షణ కల్పించమని రాముని కోరారు. తాను రాక్షస సంహారము చేస్తాను అని రాముడు ఆ ఋషులకు మాట ఇచ్చాడు.
ఆ దండకారణ్యములో రావణుని సేనలు ఉన్నాయి. రావణుని చెల్లెలు పేరు శూర్పణఖ. ఆమె కామ రూపిణి. ఆమె రాముని కామించింది. రాముడు ఆమె ముక్కు చెవులు కోసి విరూపిగా చేసాడు. శూర్పణఖ వెళ్లి రావణుని సైన్యాధి పతులైన ఖర, దూషణ, త్రిశిరులకు తనకు జరిగిన అవమానము గురించి చెప్పింది.
వారందరూ రాముని మీదికి యుద్ధానికి వచ్చారు. రాముడు వారితో యుద్ధము చేసి వారినందరినీ సంహరించాడు. ఆ ప్రకారంగా రాముడు తాను దండకారణ్యము లో ఉన్నపుడు జనస్థానములో నివసించుచున్న రాక్షసులను 14,000 మందిని సంహరించాడు.
ఈ వార్త రావణాసురుడికి తెలిసింది. అతనికి కోపం వచ్చింది. తనకు సాయం చెయ్యమని మారీచుడు అనే రాక్షసుని కోరాడు. కాని మారీచుడు ఒప్పుకొనలేదు. ఖర, దూషణాది రాక్షసవీరులను సంహరించిన రాముడు వంటి మహావీరునితో వైరము పెట్టుకోవద్దని హితవు చెప్పాడు. కాని రావణుడు వినలేదు. మారీచుని బలవంతంగా ఒప్పించాడు.
మారీచుని వెంటబెట్టుకొని రావణుడు రాముడు ఉండే ఆశ్రమమునకు వెళ్లాడు. మారీచుని సాయముతో రాముని, లక్ష్మణుని దూరంగా పంపాడు. మాయోపాయంతో రావణుడు సీతను అపహరించాడు. అడ్డు వచ్చిన జటాయువును చంపాడు.
రామలక్ష్మణులు ఆశ్రమమునకు తిరిగి వచ్చారు. సీత కనపడలేదు. సీతను వెదుకుతుంటే జటాయువు కనిపించాడు. సీతను రావణుడు అపహరించాడు అని తెలుసుకున్నారు. జటాయువుకు దహన సంస్కారములు చేసారు. తరువాత సీతను వెదుకుతూ అడవిలో తిరుగుతున్నారు. కబంధుడు అనే రాక్షసుని చూచారు. తమకు అపకారము చేయబోయిన కబంధుని చంపి అతనికి శాపవిముక్తి కలిగించారు. కబంధుడు వారిని శబరి ఆశ్రమమునకు వెళ్లమని చెప్పాడు. కబంధుని శరీరమునకు అంత్యక్రియలు చేసారు రామలక్ష్మణులు.
తరువాత వారు శబరి ఆశ్రమమునకు వెళ్లారు. శబరి వారిని పూజించింది. తరువాత వారు పంపా తీరమునకు వెళ్లారు. అక్కడ హనుమంతుని చూచారు. వానర రాజైన సుగ్రీవునితో స్నేహము చేసారు. రాముడు తన గురించి సీతాపహరణము గురించి సుగ్రీవునికి చెప్పాడు. సుగ్రీవుడు తనకు, తన అన్న వాలికి ఉన్న వైరము గురించి రామునికి చెప్పాడు.
రాముడు వాలిని చంపుతానని ప్రతిజ్ఞచేసాడు. కాని రాముడు వాలిని చంపగలడా అని సుగ్రీవునికి అనుమానము కలిగింది. అంతకు పూర్వము వాలి చేతిలో చచ్చిన దుందుభి అనే రాక్షసుని శరీరమును రాముడికి చూపాడు. రాముడు ఆ రాక్షసుని శరీరమును తన కాలి గోటితో పది యోజనములు దూరంగా పడేటట్టు విసిరివేసాడు. ఒకే బాణంతో ఏడు మద్దిచెట్లను కూల్చాడు. అప్పుడు సుగ్రీవునికి రాముని మీద నమ్మకం కుదిరింది.
రాముని వెంటతీసుకొని వాలి ఉన్న గుహ వద్దకు వెళ్లాడు సుగ్రీవుడు. బయట ఉండి సుగ్రీవుడు గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని వాలిబయటకు వచ్చాడు. వాలి భార్య తార వాలిని యుద్ధమునకు వెళ్ల వద్దని వారించింది. కాని వాలి వినలేదు. వాలి సుగ్రీవునితో యుద్ధము చేసాడు. రాముడు ఒకే బాణంతో వాలిని చంపాడు. సుగ్రీవుని వానర రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేసాడు.
తరువాత సుగ్రీవుడు సీతాదేవిని వెదుకుటకు వానరులను నలుదిక్కులకు పంపాడు. హనుమంతుడు దక్షిణ దిక్కుగా వెళ్లాడు. సముద్రమును దాటి లంక చేరుకున్నాడు. అశోకవనంలో రాముని కొరకు శోకించుచున్న సీతను చూచాడు. హనుమంతుడు సీతను కలుసుకున్నాడు. రాముడు ఇచ్చిన ఉంగరమును గుర్తుగా చూపించాడు. రామ సుగ్రీవుల మైత్రి గురించి చెప్పాడు.
తరువాత హనుమంతుడు అశోకవనము యొక్క తోరణ ద్వారమును ధ్వంసము చేసాడు. తనను పట్టుకోబోయిన రావణుని సేనాపతులను ఐదుగురిని చంపాడు. అక్షకుమారుని చంపాడు. తుదకు బంధింప బడ్డాడు. తరువాత తనను తాను విడిపించుకొని లంకాదహనము చేసాడు.
హనుమంతుడు లంక నుండి రాముని వద్దకు వచ్చాడు. సీతన చూచాను అని రామునితో చెప్పాడు. తరువాత వానర సేనలతో సముద్ర తీరము చేరుకున్నారు రాముడు సుగ్రీవుడు. తనకు దారి ఇవ్వని సముద్రుని తన రామబాణముతో అల్లకల్లోలము చేసాడు. సముద్రుని మాట ప్రకారము రాముడు నీలునితో వారధి కట్టించాడు. ఆ సేతువుమీదుగా లంకకు చేరుకున్నాడు.
రావణునితో యుద్ధముచేసి రావణుని సంహరించాడు. కాని అన్నిరోజులు పరాయి వాడి వద్ద ఉన్న సీతను పరిగ్రహించడానికి సందేహ పడ్డాడు. ఆ మాటలు భరించలేక సీత అగ్నిప్రవేశము చేసింది. అగ్నిదేవుడు వచ్చి సీత కల్మషము లేనిది అని చెప్పాడు. అప్పుడు రాముడు సీతను స్వీకరించాడు.
రాముడి పాలనలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు. సకాలంలో వానలు కురిసి దుర్భిక్షము అంటూ లేకుండా పోయింది. తండ్రి జీవించి ఉండగా పుత్రులు మరణించడం లేదు. స్త్రీలకు వైధవ్యము లేదు. స్త్రీలందరూ పతివ్రతలుగా ఉన్నారు. రామ రాజ్యంలో అగ్ని భయం, చోర భయం, జలభయం, ఆకలి భయం గానీ, లేవు. రాజ్యములో ధనధాన్యములు సమృద్ధిగా ఉండేవి. ప్రజలందరూ సంతోషంగా జీవించారు.
రాముడు లెక్కలేనన్ని అశ్వమేధ యాగములు చేసాడు. లక్షల కొలదీ గోవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. రామ రాజ్యములో నాలుగు వర్ణముల వారు తమ తమ పనులను సక్రమంగా చేసుకుంటూ సంతోషంగా జీవించారు. ఆ ప్రకారంగా రాముడు 11,000 సంవత్సరములు రాజ్యపాలన చేసి తుదకు బ్రహ్మలోకము చేరుకున్నాడు.
ఈ రామ చరిత్ర అతి పవిత్రమైనది. సమస్త పాపములను నాశనం చేస్తుంది. పుణ్యములను కలుగజేస్తుంది. ఈ రామ కధ వేదసమ్మతము. ఈ రామ చరిత్రను చదివినవారికి సమస్త పాపములు తొలగిపోతాయి. వారికి ఆయువు వృద్ధి చెందుతుంది. పుత్రపౌత్రాదు లతో సకలసుఖములు అనుభవిస్తారు. తరువాత స్వర్గలోకము చేరు కుంటారు.
ఈరామాయణము చదివిన బ్రాహ్మణులు అన్ని విద్యలలో ప్రావీణ్యులవుతారు. క్షత్రియులకు రాజ్యప్రాప్తి కలుగుతుంది. వైశ్యులకు వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. శూద్రులు కీర్తివంతులవుతారు.
ఇది వాల్మీకి విరచిత
శ్రీమద్రామాయణ మహాకావ్యములో
బాలకాండలో మొదటి సర్గ సంపూర్ణము.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు గజేంద్రమోక్షము గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…
పరిచయం
శ్రీరాముడు శాపగ్రస్తురాలై రాయిగా మారిన అహల్యను తన కాలితో తాకగానే తిరిగి అహల్య స్త్రీగా మారినదని ఒక కట్టుకథ ఉంది. హిందువులు శ్రీరాముని దేవుని అవతారమని చెప్పుటకే ఈ కట్టుకథను కల్పించారు. శ్రీరాముని దేవుడంటే తప్పులేదు. కానీ ఈ చరాచర జగత్తునంతా చేసి పోషించి లయంచేసే సృష్టికర్త ధర్త హర్త అనుకుంటే మాత్రం పొరపాటు. శ్రీరాముడు ఏక పత్నీవ్రతుడు, పితృవాక్య పరిపాలకుడు, వేదవిదుడు. అందువలన ఆయనను దేవుడు – దివ్యగుణములు కలవాడు అంటే దోషమేమీ లేదు. మానవులలోనే విద్వాంసులు, దాన ధర్మములు చేయువారు, వేద విద్యలను నేర్పు ఆచార్యులు, ధర్మబద్ధంగా ప్రజాపాలన చేయు రాజులు మున్నగు వారు కూడా దేవతలనబడతారు. అందువలన శ్రీరాముడొక దేవుడు. సృష్టికర్తయైన పరమేశ్వరుడు మాత్రం కాడు.
మహాభారత యుద్ధానికి పూర్వమే వేద సిద్ధాంతాలు కనుమరుగైన కారణంగా మానవ సమాజంలో అనేక దురాచారాలు ప్రబలం కాసాగాయి. మన ప్రాచీన ఋషులను, మహాత్ములను నిందించటం, అవహేళన చేయటం కూడా అప్పటినుండే ఆరంభమైనది. ఋషులు, ఋషి పత్నులపై నిందలు వేస్తూ మన ప్రాచీన వైదిక సంస్కృతి – సభ్యతలను సర్వనాశనం చేసే ప్రయత్నంలో ఒక భాగమే ఈ అహల్య శాపం కట్టు కథ. బుద్ధిమంతులు ఆలోచించి ఇటువంటి నిందలను తిరస్కరించాలి.
– సంధ్యావందనం శ్రీనివాసరావు
అహల్య రాయిగా మారలేదు
తులసీరామాయణంలో గౌతమ ఋషిపత్నియైన అహల్యా గౌతమ ఋషి శాపంతో రాయిగా మారినట్లు ఒక కట్టు కథ ఉంది. శ్రీరాముడు రాతిని కాలితో తాకగానే ఆయన పాదధూళి అంటుకొని ఆ రాయి మళ్ళీ స్త్రీగా మారి స్వర్గానికి ఎగిరిపోయింది. చూడండి
ఓ రామా ! మీ రహస్యం నా కర్ధమైంది. మీ పాద పద్మముల ధూళి మానవులను తయారుచేసే ఔషధమని అంతా అంటుంటారు. మీ పాద ధూళిని తాకగానే రాయి సుందర స్త్రీగా మారింది. రాయి కంటే కర్ర గట్టిది కాదు. రాయే స్త్రీగా మారినపుడు నా కర్రనావ స్త్రీగా మారదా ! ? ఈ నావకూడా ఋషి పత్నిగా మారి పైకెగిరి పోతే నాగతేమిటి? నేనీనావతోనే నాకుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నాకు వేరే పనేదీ రాదు. అందుకని మహారాజా! మీరీ గంగానదిని నా నావపైనే దాటాలనుకుంటే, ముందు నేను మీ పాదాలను నీటితో కడగటానికి అనుమతించండి. కాళ్ళు కడగటంతో మీ పాదాలకంటిన ధాళి పోతుంది. కనుక నా నావ ఎగిరి పోకుండా ఉంటుంది !
ఈ కథ వలన మనకు తెలిసేదేమంటే – శ్రీరాముని పాదాలలో ఆ శక్తి లేదు. ఆయన పాదాలకంటియున్న ధూళి (మట్టి) కాచమత్కారమున్నది. దీనిపైన రహీంకవి దోహ ఒకటుంది. అది ధూరి ధరత గజ శీశ పర్…….
రహీం కవిని ఒకరిలా అడిగాడు – “రహీం ఈ ఏనుగు తన తలపై దుమ్మునెందుకు పోసుకుంటున్నది? అని. అందుకు రహీం : గౌతమముని పత్ని అహల్యా తరించిన ధూళి కొరకు ఈ ఏనుగు వెదుకుతూ తిరుగుతోంది. ఆ దుమ్ము ఎక్కడైనా దొరికితే తాను కూడా తరించవచ్చని దాని ఆశ! అన్నారు.
అహల్య రాయిగా మారటం. అహల్య శ్రీరాముని పాదధూళి తాకగానే స్త్రీగా మారటం వంటి దేమీ వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. అచ్చటిలా ఉంది –
ఆశ్రమంలో ప్రవేశిస్తుండగా మహాభాగ్యశాలిని యైన అహల్య తన తపోబలంతో దేదీప్యమానంగా ప్రకాశించుచున్నది.
శ్రీరామలక్ష్మణులు ఎంతో ఆనందంతో అహల్యయొక్క పాదములు రెండింటిని స్పర్శించిరి. (శ్రీరాముడు తన పాదాలతో అహల్యను తాకలేదు) అహల్య ఆ ఇరువురు అన్నదమ్ములను ఎంతో ఆదరంతో అర్ఘ్యపాద్యాదులను (కాళ్ళు ముఖం చేతులు కడుగుకొనుటకు నీళ్ళు) త్రాగుటకు (ఆచమనం) నీళ్ళిచ్చి అతిథి సత్కారమును చేసెను. వాల్మీకి రామాయణంలో అహల్య రాయిగా మారటం శ్రీరాము డారాతిని తాకగానే అది స్త్రీగా మారటం వంటివేవీ లేవు. గౌతమ ఋషి శాపంతో అహల్య రాయిగా మారెనను మాట వాల్మీకి రామాయణంలో లేదు. ఇందుకు విరుద్ధంగా ఇచ్చట ప్రకరణం ఇలా ఉంది. చూడండి –
‘తపసా ద్యోతిత ప్రభా’ తపస్సు చేస్తున్న అహల్య అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తోంది. అని మీరు రామాయణంలోని వాక్యాన్ని చదివే ఉంటారు. శ్రీరాముడామెను దర్శించి అన్నదమ్ములిరువురు ఆమె పాదాలను స్పర్శించిరి.
రామాయణంలో అహల్యా ఇంద్రుల జారకర్మ (వ్యభిచారం) ను గురించి వ్రాసి ఉంది. కానీ రామాయణ కథను చెప్పే భాగవతులు దీనిని రామాయణంలో కల్పినట్లుగా భావిస్తున్నాను. కలపటానికి కారణాలివి –
గౌతమ – అహల్య – ఇంద్రులను గూర్చిన ఈ కథ శతపథ బ్రాహ్మణంలో రూపకాలంకారంలో ఉన్నది –
అహల్యపతి గౌతముడు. ఇంద్రుడు – జారుడు. చూడండి. ‘రాత్రిరహల్యా కస్మా దహర్దినం లీయతే స్యాం తస్మా ద్రాత్రి రహల్యోచ్యతే’
రాత్రి ‘అహల్య’. దినమునకు ‘అహః’ అని పేరు. అహల్యా” “అహః” దినము దీనిలో లయమగును (కలిసిపోవును) కనుక రాత్రికి “అహల్యా” అని పేరు. గౌతముడు – చంద్రుడు. చంద్రుడు రాత్రివేగంగా వెళ్ళుతున్నట్లు కనబడతాడు కనుక – గచ్ఛతి ఇతి గౌ”నడచువాడు – చంద్రుడు- “గౌ” అనబడును. వేగంగా వెళ్ళును. కావున “గౌతముడు” అనబడతాడు. చంద్రుని రాత్రికి పతి అందురు. అందువలన చంద్రుని “నిశా – పతి” అంటారు. నిశా అంటే రాత్రి. చంద్రునకు రాకేశ్ అని కూడా పేరు. రాత్రికి రాకా అనిపేరు. పూర్ణిమకు కూడా రాకా అని పేరు. చంద్రుడు లేని రాత్రి ‘విధవ’వలె కనబడుతుంది. చంద్రునితో కలిసిఉన్న రాత్రి శోభాయమానంగా ప్రకాశిస్తూ అంటే సౌభాగ్యవతియైన స్త్రీలా కనబడుతుంది. అందువలన చంద్రుడు అంటే గౌతముడు రాత్రి అంటే అహల్యకు పతి.
సూర్యుడు ఇంద్రుడు. సూర్యుడు రాత్రిని నశింపజేస్తాడు. (లేకుండా చేస్తాడు) అంటే బలహీనపరుస్తాడు. ఇది జారకర్మ. అందువలన ఇంద్రుడనగా సూర్యుడు, అహల్య అనగా రాత్రితో వ్యభిచరించును. సూర్యోదయం కాగానే రాత్రి బలహీనపడుతూ పడుతూ పూర్తిగా నశించిపోతుంది. ఇదొక విజ్ఞానంతో కూడి యున్న సుందర రూపకాలంకారం.
దీనిని అర్థం చేసుకోకుండా గౌతమ ఋషిపత్ని అహల్యతో ఇంద్రుడు జారకర్మ – వ్యభిచరించాడని పురాణాలలో వ్రాశారు. రామాయణంలో గౌతమ ముని పత్ని అహల్యయొక్క చరిత్రకు సంబంధించిన వర్ణన ఉంది. దానితో బ్రాహ్మణగ్రంథంలోని ఈ రూపకాలంకారాన్ని జోడించి చరిత్ర భ్రష్టు పట్టించారు – నాశనం చేశారు. ఇంద్రుడు – అహల్యకు మధ్య అబద్ధపు వ్యభిచారదోషాన్ని కల్పించారు.
ఈ విధంగా శబ్దాలకు (అనర్థాలను) తప్పుడు అర్థాలను కల్పనచేసి చేసి కథలు చెప్పే మన పౌరాణికులు మన చరిత్ర గాధలన్నింటిని నాశనం చేశారు. రామాయణంలో అనేక చోట్ల తమ ఇష్టం వచ్చిన కల్పిత కథలున్నాయి. వీనితో వాస్తవాలు మరుగున పడ్డాయి. నేటి ఆధునిక యుగంలో ప్రతి విషయాన్ని తర్కబుద్ధితో ఆలోచించి తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రాతకాలం నాటి మాటలు- “చేపచెట్టెక్కిందని పండితుల వారంటే. భక్తబృందం సత్యం మహరాజ్’ అన్నారు. ఇటువంటి భ్రమలు కలిగించే అబద్ధపు కథలు చదివి చదివి నేటి యువతీ – యువకులు రామాయణ, మహాభారత ఇతిహాసాలకు తిలాంజలులివ్వటానికి తయారౌ తున్నారు. కనుక విద్వాంసులంతా ప్రతివిషయాన్ని సత్యంతో పరీక్షించి యుక్తి-యుక్తంగా వ్రాయాలి. మన దేశ చరిత్ర, ధర్మగ్రంథాలలో ఎటువంటి దోషాలూ రానివ్వరాదు.
ఒక ధర్మము, ఒక భాష, ఒక లక్ష్యము భారతవాసుల కేర్పడనంతవరకు భారత దేశమునకు పూర్ణహిత మేర్పడజాలదు. ఉన్నతియు జరుగదు.
(మహర్షి దయానంద సరస్వతి).
భక్తి యోగం ఒక హిందూ యోగ పథం, మరియు ఆధ్యాత్మిక అభ్యాసము. ఈ యోగంలో, భక్తి మరియు అనుష్ఠానం ముఖ్యమైనవి. వ్యక్తి తన దైవభక్తిని, పరమాత్మ సంబంధమును అభివృద్ధి చేయడానికి ఈ యోగాన్ని అభ్యసించవచ్చు. భక్తి యోగం మూలమైన ఉద్దీపన అనుభవాలతో, అంతరాళంలో చలింపును చేపట్టేది. ఈ యోగం విశేషంగా దేవుని ప్రేమ మరియు భక్తిని వివరించేది.
Bhakti Yogam | భక్తి యోగం
భక్తి యోగం అనేది మనస్సును శుద్ధి చేసే, ఆత్మ అధ్యాత్మిక ప్రయత్నము. అనుష్ఠానాల్లో ప్రార్థన, భజన, ధ్యాన, పరమాత్మ సేవ మరియు ముక్తి సాధన ముందుగా ఉంటుంది. భక్తి యోగం యోగుడును ఆత్మశుద్ధి, సర్వోత్తమ ప్రమేయాలు మరియు ఆనందంతో ప్రాముఖ్యత ఇస్తుంది. ఈ క్రింది లింకుల ఆధారంగా భక్తి యోగం గురించి తెలుసుకుందాం…
Discover The Ultimate Collection Of Devotional Hymns And Prayers | Bhakti Ved
Welcome to the Bhakti Ved Website. Our platform provides an extensive array of hymns, ashtakas, dandakas, and other sacred chants and devotional verses In Telugu. We are dedicated to facilitating your spiritual journey, ensuring that you can effortlessly follow and engage in devotionaland rituals. With our resources, you can profoundly enrich your devotional path and elevate your spiritual experiences.